Sunday, 20 April 2025

T-219. ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి

 అన్నమాచార్యులు

219. ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి

For English version Press Here 

ఉపోద్ఘాతము:

ఇది అన్నమాచార్యుల స్వగతం. ఆయన్నుంచి వచ్చిన కవిత్వం వ్యక్తిగత ఆకాంక్షలకు కానీ, సహజమగు సాంస్కృతిక పరంపరలకు (cultural conditioning) కానీ లోనవ్వదు. ఆయన భాషను కవిత్వం, భక్తి,, తత్త్వాలు కూడా తాకని ప్రదేశాలకు తీసుకెళ్ళారు - ఆయా అర్థాలూ, భాషలూ కరిగి సమ్మిళితమై పోయే ఆ మృదువైన, పట్టరాని అంచున నిలిపారు. ఆ అసమాన్య అనుభవాన్ని పట్టివుంచాలని కాదు; ఆ అనుభవంలోనిలబడి, అది మాట్లాడేదాకా తానే ఓ శ్రోతగా నిలిచి మనకు వినిపిస్తారు. 

దైవ కృప మన ఈ జీవితపు అభిప్రాయాలకు అతీతం. అందుకే అన్నమాచార్యులు మన స్థితిని, ప్రవర్తనను బేరీజు వేసుకోకుండా – ఈ యాత్రలోకి రావాలని మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ కవితలో వినేవారికి, చదవేవారికి ఒక అద్భుతమైన రూపాంతరము తమ కన్నుల ముందు ఆవిష్కరింపచేస్తారు. 

పల్లవి: కోరిక, అంతఃకలహాలకు సూచిక​. 

మొదటి చరణం: సమస్య - మాయలో చిక్కుకోవడం, ఇంద్రియసుఖాలలో స్థిరపడిపోవడం. 

రెండవ చరణం: పరివర్తనకు నాంది – పరమాత్ముని కృపతో ఆత్మ ప్రశాంతతకు, కోర్కెలు దాటి వెళ్ళడానికి సిద్ధమవటం. 

మూడవ చరణం: భావనలో  సత్యము, స్పష్టత కానవచ్చుట​. పరమానందము పొందుట​. 

ఈ కీర్తన​ చూస్తూనే అర్థం కాకపోవచ్చు. కానీ అంత అస్పష్టమూ కాదు. చాలా నిజమైనది. విలువైనది. మనం మనస్సుతో చూడలేని దృక్పథాన్ని అందుకోగలిగితే ఇంకా సులభమౌతుంది. ఇదే అన్నమాచార్యుల గొప్పతనము. భాషలో నిప్పును రగిలిస్తారు. మన హృదయములో నిలిచి కనిపింపచేస్తారు.

కీర్తన సంగ్రహ భావము:


పల్లవి: "ఈ జనన మరణాల ఊయలలో మనల్ని ఊచుతూనే ఉంటారు.
కనులు మూసుకుని విశ్రాంతి పొందదామన్నా, అవే మరెక్కడో తెరుచుకుంటాయి." 

మొదటి చరణం: ఇక్కడ చందముఖి అని సంభోధించి -సున్నిత​త్వానికి, కాంతికి ప్రతీకగా చూపారు. ఆమె అంతులేని నిరీక్షణలో ఉంది. ఎదురు చూపులలో - నిద్ర వుండదు. విశ్రాంతి కలుగదు. ఏమిచేసినా ఆత్మకు శాంతి లభించదు. నిశ్శబ్దంగా ఎదురు చూస్తూనే ఉంది — చీకటి తొలగి వెలుగు రావాలని. "ఏమి సేతమే?" చుట్టూ సుగంధ వాతావరణం, చందనపుటిల్లు, పరిమళభరిత గదులు ఉన్నా — ఆమెకు నిద్ర లేదు. మెలకువ లేదు. ఎందుకంటే ఆ బాహ్యంగా ఎన్ని సౌకర్యాలు వున్నా మనసులో తృప్తిలేకుంటే శాంతి లేదు. ఆ  మెలకువ అయోమయం. అది స్పష్టత లేని కలకలం. అది అంతర్గత శాంతి కోసం జరిగిన యమ యాతన. 

రెండవ చరణం: ఆమె మన్మథుని పుష్పబాణమే — సున్నితమైనది, ఆకర్షణీయమైనది, కానీ అచిరమైనది. అయితే ఇక్కడ ఈ "పుష్పబాణం" అనేది ప్రేమకు చిహ్నం కాదు; అది ఇంద్రియల మాయలో బందీ. అన్నమయ్య ఈ చిహ్నాన్ని తిప్పి చూపిస్తున్నారు - ఇది కేవలం కోరిక కాదు, ప్రకృతి వేసిన వలలో పడ్డామనటానికి సంకేతం. ఆమె మంచంపై నిశ్చలంగా పడుకొని, మాటలాడదు. ఆ బాణం ప్రయాణించ గలిగి కూడా ఇప్పుడు అచేతనము. అందంతోనూ నిండినప్పటికీ, అది సంకెళ్లలో చిక్కుకొని, మాటలే లేని స్థితిలో ఉండిపోతుంది. మదిలో వెలుగు లేక తికమక పడే మౌనం. ఆత్మలోని కలవరమును చెప్పజాలని భావము. భావముల కందని భాష​. రెప్పలు నిద్రకు ఒరుగుతున్నాయి - నిద్ర రాకున్నా, నిద్రించాలనే తపన. ఈ రెప్పల కదలికలు లోపలి తపనకు సంకేతం. మౌనములోనే అంతర్యుద్ధం. ప్రశాంతత లేని నిర్లిప్తత. - నిద్రపోవాలనుకుంటోంది. శాంతి కావానుకుంటోంది. కానీ తత్తఱపాటు నుండి తప్పించుకోలేకపోతోంది. ఈ పాదం ఒక్కసారిగా ఒక విస్ఫోటంలా విచ్చుకొంటుంది. రెప్పలు కాస్త తెరచిన వేళ - పూర్తిగా కన్ను తెరిచీతెరవక మునుపే -సత్యం లోపలికి ఇంకిపోతుంది. జీవితం పట్ల మనం తమో గుణములో ఉన్నామన్న నిజం, ఆనందానికి బదులు పట్ల మౌఢ్యంలో మునిగిపోయామన్న బాధ స్పష్టమవుతుంది. ఆ మెలకువకే ఆ కన్నీళ్లు. అది కేవలం దుఃఖం కాదు. అది పోగొట్టుకున్న సమయానికి చెల్లించాల్సిన మూల్యం. అది మెలకువ తీసుకొచ్చే రోదన. 

 

మూడవ చరణం: వెన్నెల పరచుకున్న వేంకటాద్రి మీద నేను నిలిచినప్పటికీ —
అతడి దృష్టిలో నేను పరాయిదాన్ని.
నన్ను చూసినా, ఆ శ్రీముఖంలో ఒక్క చిరునవ్వు లేదు.
(అదే నిశ్శబ్దత, అది నిరసనయో — ఓ మౌన బంధమో ఎవరికి తెలుసు?) 
నిజం చెప్పాలంటే, ఎప్పటి నుంచి
నా హృదయం మారిపోయిందో నాకు తెలియదు —
అతడి మన్ననలతో ఇంతలోనే అనిర్వచనానందం. 

 

శృంగార కీర్తన

రేకు: 30-6 సంపుటము: 5-172

ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును  ॥పల్లవి॥
 
చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును    ॥ఉయ్యాల॥
 
పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు       ॥ఉయ్యాల॥ 

వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ ॥ఉయ్యాల॥ 

 

Details and explanations:

ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును     ॥పల్లవి॥ 

భావము:

"ఈ జనన మరణాల ఊయలలో మనల్ని ఊచుతూనే ఉంటారు.
కనులు మూసుకుని విశ్రాంతి పొందదామన్నా, అవే మరెక్కడో తెరుచుకుంటాయి." 

వ్యాఖ్యానము మరియు పోలికలు: 

మొదటి భాగం: అంతరిక్షపు ఊయల 

ఆత్మ ఒక శాశ్వతమైన ఊయలలో చిక్కుకొని ఉంది - ఇది సుఖానుభవం కాదు, శాంతి లేని అనియంత్రిత కదలిక. 

విశ్రాంతి దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది — కానీ దరి చేరదు. 

నిద్ర (మరణం) వస్తుంది - కానీ అది ప్రశాంతత కాదు, ఒక తాత్కాలిక విరామం మాత్రమే. కళ్ళు మూసుకున్నా- ఆ నిశ్చలత లేదు. అవి మరొక జన్మలో, మరొక లోకంలో తెరుచుకుంటాయి. 

భగవద్గీత 4-18లో చెప్పినట్టు — మనం 'నిష్క్రియ'గా భావించే క్షణాలూ - ఈ యాత్రలో భాగమే. కార్యముకాదు అనిపించే స్థితీ, మరో క్రియాపథానికి ద్వారమే. అందుకే - ఊయల ఆగదు. శాశ్వతంగా ఆటమటించుతూనే వుంటాం. 


రెండవ భాగం:

ఇప్పుడు ఈ పల్లవిని సాల్వడోర్ డాలీ వేసిన నిద్ర (స్లీప్) (1937)తో పోల్చి చూద్దాం.



డాలీ చిత్రించిన ఈ భయముగొల్పు సర్రియలిస్ట్ (అధివాస్తవిక) చిత్రంలో, గాలిలో తేలియాడుతున్నట్టుగా ఉన్న, ముడతలు పడిన, ఒదిగిపోతున్న తలను కర్రల వూతములు పెట్టి నిలబెట్టినట్లు మనం చూస్తాం - అది విశ్రాంతికి సంకేతం కాదు - అస్థిరతకి, బలహీనతకి సంకేతం.

ఊయ్యాల​, డాలీ వేసిన ప్రాపులు — రెండూ మన అస్థిర స్థితిని తెలుపుతున్నాయిగానీ, నిశ్చలతని చూపుటలేదు.

ఒదిగిన ముఖం - మన ఆత్మ నిద్రలో ఉందని భావించినా, అది వాస్తవానికి శాంతి కాదు.

పల్లవిలో రెప్పలు మూసుకుంటే మళ్ళీ తెరుచుకుపోతాయి అన్నారు; అలాగే డాలీ బొమ్మలో అక్కడ చూపిన ఆ ఆకారం కర్రలు గాలికి వూగినా, పడిపోయినా నిద్ర చెడి లేచి తిరిగి ఆ స్థితిలోనే పడుకునే ప్రయత్నాన్ని సూచిస్తుంది- ప్రశాంతత కానరాదు.

రెంటిలోనూ చూపిన నిద్ర అనేది విశ్రాంతి కాదు. నిశ్చలత వెనుక చలనమే దాగి ఉంది.

అన్నమాచార్యులు వేదనతో వర్ణించిన ప్రపంచ మనే ఊయ్యాలో ఊగుతూ ఉన్న మన స్థితికి డాలీ వేసిన నిద్ర అద్భుత దృశ్య రూపకం.

(ప్రపంచమనే ఊయ్యాల: ప్రముఖ ఆంగ్ల రచయిత, తత్వవేత్త అలాన్ విల్సన్ వాట్స్ ఇలా అన్నారు. "మనము ఎక్కడినుంచో ఈ ప్రపంచంలోకి "వచ్చి పడలేదు"; మనము ఒక చెట్టు నుండి ఆకులు వలె బయటకు వస్తాము. సముద్రం నుంచి "అలలు" వచ్చినట్లుగా, విశ్వము నుండి "మనుషులు" వస్తున్నారు.)


మొదటి చరణం:

చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును       ॥ఉయ్యాల॥ 

భావము:

చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా / యెందును నిద్రలేదేమి సేతమే: ఇక్కడ చందముఖి అని సంభోధించి -సున్నిత​త్వానికి, కాంతికి ప్రతీకగా చూపారు. ఆమె అంతులేని నిరీక్షణలో ఉంది. ఎదురు చూపులలో - నిద్ర వుండదు. విశ్రాంతి కలుగదు. ఏమిచేసినా ఆత్మకు శాంతి లభించదు. నిశ్శబ్దంగా ఎదురు చూస్తూనే ఉంది — చీకటి తొలగి వెలుగు రావాలని. "ఏమి సేతమే?" - చెరసాల అధికారి తలుపు తీసిన కదా బందీ బయటకు వచ్చేది. ఇక్కడ "ఏమి సేతమే" ఒక విలక్షణమైన ప్రయోగము. విశ్వమంత భావాన్ని చూపారు. బందీ ఏమీ చేయకూడదని భావము. ఏమీ చేయకుండా వుండడమే మానవుని సమస్య​. 

గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన / యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును: చుట్టూ సుగంధ వాతావరణం, చందనపుటిల్లు, పరిమళభరిత గదులు ఉన్నా — ఆమెకు నిద్ర లేదు. మెలకువ లేదు. ఎందుకంటే ఆ బాహ్యంగా ఎన్ని సౌకర్యాలు వున్నా మనసులో తృప్తిలేకుంటే శాంతి లేదు. ఆ  మెలకువ అయోమయం. అది స్పష్టత లేని కలకలం. అది అంతర్గత శాంతి కోసం జరిగిన యమ యాతన. 


వ్యాఖ్యానము మరియు పోలికలు: 

భగవద్గీత 2-28లో శ్రీకృష్ణుడు అర్జునునితో "జీవులు మధ్యలో కలిగిన వ్యక్త సంసారము పుట్టుకకు పూర్వము, మరణమునకు పిమ్మట అవ్యక్తము అని గ్రహించ లేక పోవుట వలన దుఃఖమునకు లోనౌతున్నా" రంటాడు. అన్నమాచార్యుల చందముఖి — తాత్కాలిక ప్రపంచపు ఆకర్షణలలో చిక్కుకుని, వాటిని శాశ్వతంగా భావిస్తూ మానసిక కలవరపడుతుంది. మనిషి నిజ జీవితంలో ఇవే​ - తాత్కాలికమైన భావాలే శాశ్వతమైనవి అనుకొని ఆశలలో చిక్కుకుంటాడు. ఆమె మెలకువ కూడా, మన మనస్సుల వలెనే - స్పష్టత లేని కలతతో నిండి ఉంటుంది.


ఇప్పుడు ఈ స్థితిని రినే మాగ్రిట్ చిత్రించిన " కోరుకున్న బందిఖానా (ఎలెక్టివ్ అఫినిటీస్)" అనే చిత్రంతో పోల్చి చూద్దాం:  చిత్రంలో - ఒక గుడ్డును పంజరంలో పెట్టినట్లు చూపారు. అది బహుళార్థాల గర్భం. గుడ్డు అనేది పక్షిగా మారే సంభావ్యతకు చిహ్నం - విముక్తికి సూచన. కానీ అది పరిణామము చెందు అవకాశము లేని స్థితిలో చిక్కివుంది. మన మనసులకు మాయని మసి - కసి.  తోందర​. ఇప్పుడే అన్నీ అయిపోవాలి.

 


భద్రతా పంజరం 

ఇది కోరికల పంజరం కాదు.
ఇది మనమే కల్పించుకున్న భద్రత.
అర్థం లేని భయాలనుంచి — తెలియని శక్తులనుంచి —
ప్రస్తుత స్థితి ఇక కొనసాగాలి అన్న ఆకాంక్షనుంచి.
 
ఈ పంజరం చీకటిలో కాదు;
ఇది వెలుగులోనే ఉంది.
ఇది సుగంధాల గదిలో — పరిమళాల పంజరంలో —
ఒంటరితనాన్ని అందంగా అలంకరించిన స్థలంలో.
 
ఇది భద్రత అనే మాయ —
అర్థం లేని భద్రత.
పరిపక్వత లేకుండా ఏర్పడిన రక్షణ భావం.
భయంతో ఏర్పడిన నిర్మాణం.
సత్యాన్ని అర్థం చేసుకోకుండా
బతికిపోవాలన్న గట్టి పట్టుదల.
 
అది కోరిక కాదు —
అది అస్పష్టతలోంచి పుట్టిన భద్రత.
అది విముక్తి కాదు —
ఇలాగే ఉండిపోవాలన్న భయం. 

 రెండవ చరణం:

పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు    ॥ఉయ్యాల॥ 

పంచసాయకుని పుష్పబాణమాన = మనధుని పుష్పబాణము వంటి


 భావము:

చరణంలో అన్నమాచార్యులు — ఆత్మ యొక్క అశాంత స్థితిని మరింత లోతుగా, శక్తివంతంగా, హృదయాన్ని తాకే ఉపమానాల ద్వారా చిత్రిస్తున్నారు. 

పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక: ఆమె మన్మథుని పుష్పబాణమే — సున్నితమైనది, ఆకర్షణీయమైనది, కానీ అచిరమైనది. అయితే ఇక్కడ ఈ "పుష్పబాణం" అనేది ప్రేమకు చిహ్నం కాదు; అది ఇంద్రియల మాయలో బందీ. అన్నమయ్య ఈ చిహ్నాన్ని తిప్పి చూపిస్తున్నారు - ఇది కేవలం కోరిక కాదు, ప్రకృతి వేసిన వలలో పడ్డామనటానికి సంకేతం. 

మంచముపై బవ్వళించి మాటలాడదు: ఆమె మంచంపై నిశ్చలంగా పడుకొని, మాటలాడదు. ఆ బాణం ప్రయాణించ గలిగి కూడా ఇప్పుడు అచేతనము. అందంతోనూ నిండినప్పటికీ, అది సంకెళ్లలో చిక్కుకొని, మాటలే లేని స్థితిలో ఉండిపోతుంది. మదిలో వెలుగు లేక తికమక పడే మౌనం. ఆత్మలోని కలవరమును చెప్పజాలని భావము. భావముల కందని భాష​. 

నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి: రెప్పలు నిద్రకు ఒరుగుతున్నాయి - నిద్ర రాకున్నా, నిద్రించాలనే తపన. ఈ రెప్పల కదలికలు లోపలి తపనకు సంకేతం. మౌనములోనే అంతర్యుద్ధం. ప్రశాంతత లేని నిర్లిప్తత. నిద్రపోవాలనుకుంటోంది. శాంతి కావానుకుంటోంది. కానీ తత్తఱపాటు నుండి తప్పించుకోలేకపోతోంది. 

వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు: ఈ పాదం ఒక్కసారిగా ఒక విస్ఫోటంలా విచ్చుకొంటుంది. రెప్పలు కాస్త తెరచిన వేళ - పూర్తిగా కన్ను తెరిచీతెరవక మునుపే -సత్యం లోపలికి ఇంకిపోతుంది. జీవితం పట్ల మనం తమో గుణములో ఉన్నామన్న నిజం, ఆనందానికి బదులు పట్ల మౌఢ్యంలో మునిగిపోయామన్న బాధ స్పష్టమవుతుంది. ఆ మెలకువకే ఆ కన్నీళ్లు. అది కేవలం దుఃఖం కాదు. అది పోగొట్టుకున్న సమయానికి చెల్లించాల్సిన మూల్యం. అది మెలకువ తీసుకొచ్చే రోదన. ​


వ్యాఖ్యానము మరియు పోలికలు: 

ఈ పద్యం గీతా శ్లోకం 11.33 ("నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్")తో సారూప్యాన్ని కలిగి ఉంది. ప్రకృతి-ధర్మం ముందే నడుస్తోంది - కానీ ఆ తత్వానికి సేవచేసేందుకు ఆత్మ సిద్ధమవ్వాలి. 

చరణంలో ఉన్న యువతి - అర్జునుడిలాగే - కోరికలతో, కలవరంతో చిక్కుకుపోయినవారికి ప్రతిరూపం. ఆమె రెప్పల తళతళలు, కన్నీళ్లు — వీటిని బలహీనతగా చూడకూడదు. ఆమె మేళము చేయని, శృతి పరచని సంగీత వాద్యం. ఆమె మన్మథబాణమైనా — ప్రేమకు, దయకు నీడనిచ్చే సాధనాన్నని తెలుసుకోలేని చెరలో బందీగా ఉంది. 

ఇంత మనో వ్యథ, కలవరము లేకుండా ఆమె మాయలోంచి బయట పడలేదు. కోరికలను దాటి, ఓ మహత్తర ప్రయోజనం దిశగా అమెను నడిపిస్తుంది. అర్జునుడు తన దుఃఖాన్ని అధిగమించినట్టు, ఆమె కూడా తన స్థితిని తెలుసుకొని మేలుకొవల్సిందే. 

కాబట్టి, చరణం దుఃఖాన్ని కాదు - మార్పుకు ఆరంభాన్ని వ్యక్తం చేస్తుంది. అది ఒక ఆత్మ పరమ సత్యాన్ని సేవించేందుకు సిద్ధమవుతున్న ఘడియ.


జిడ్డు కృష్ణమూర్తి తన సోదరుడు నిత్య మరణించినప్పుడు అపారమైన దుఃఖంలో మునిగిపోతాడు. దాదాపు పది రోజులపాటు అదుపు తప్పిన కన్నీళ్లలోనే గడుపుతాడు. ఆ బాధనుంచి బయటపడిన తర్వాత ఆయన పలికిన మాటలు విచిత్రంగా, కానీ లోతుగా అనిపిస్తాయి — “నాకు ఏడవడం తెలుసు, అది మానవుల చిహ్నం. ఇప్పుడు నాకు మరింత స్పష్టంగా తెలిసింది — జీవితంలో నిజమైన అందం ఉందని, నిజమైన ఆనందం ఉన్నదని...” ఈ మాటలు అన్నమాచార్యుల రెండవ చరణానికి బాగా నప్పేలా అనిపిస్తాయి.​


మూడవ చరణం:

వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ       ॥ఉయ్యాల॥ 

 భావము: 

వెన్నెలల వేంకటాద్రి విభుని లేనవ్వులాన /
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను:

వెన్నెల పరచుకున్న వేంకటాద్రి మీద నేను నిలిచినప్పటికీ —
అతడి దృష్టిలో నేను పరాయిదాన్ని.
నన్ను చూసినా, ఆ శ్రీముఖంలో ఒక్క చిరునవ్వు లేదు.
(అదే నిశ్శబ్దత, అది నిరసనయో — ఓ మౌన బంధమో ఎవరికి తెలుసు?)
 
ఇన్నిటాను సంతసిల్లి ఈ దేవదేవుని గూడి ।
మన్ననల యింత లోన మలసీని జెలియ: 
నిజం చెప్పాలంటే, ఎప్పటి నుంచి
నా హృదయం మారిపోయిందో నాకు తెలియదు —
అతడి మన్ననలతో ఇంతలోనే అనిర్వచనానందం.
అది మాత్రమే అంతులేని ఆనందం..

వ్యాఖ్యానము: 

ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక అద్భుతమైన ఆత్మీయ పరివర్తనను, అలౌకిక పరవశాన్ని వ్యక్తీకరిస్తారు - అంతర్గత యాత్రకు ఇది సమాప్తి బిందువు. 

మొదటి రెండు పంక్తులు:
ఒక సందిగ్ధమైన ఆత్మస్థితిని ప్రతిబింబిస్తాయి.
ఆత్మకు ప్రతినిధిగా ఉన్న కవి,
పరమాత్మ ముందుండి,
ఆశలేమీ లేక, వినయంగా, మౌనమైన తాపంతో నిలుస్తాడు. 

వెన్నెల - అది స్పష్టతను కాదు, ఒక మసక వెలుగును సూచిస్తుంది.
ఆ వెలుగు మనస్సు గందరగోళాన్ని, ఒంటరితనాన్ని సూచిస్తుంది.
అయినా ఆ మసకలోనూ ఒక తత్వ బోధ, ఓర్పు కనిపిస్తుంది.
దైవం నుంచి స్పందన రాకపోయినా, ఎదురు చూసే ఆత్మలో నిరీక్షణకు ఒక విశ్వాసముంటుంది. 

ఈ నిరీక్షణ సామాన్యమైనది కాదు. ఇది పరమార్పణ స్థితి. ప్రశ్నలు లేవు. ప్రతిఫలాల కోరిక లేదు. ఏమౌతుందో తెలియదు. 

మిల్టన్ చెప్పినట్టు —
అతని వెంబడి మౌనంగా నిలబడి వేచి ఉన్నవారు కూడా సేవ చేస్తున్నట్లే. -జాన్ మిల్టన్  (
“They also serve who only stand and wait.”)

దీని సారాంశం ఏమిటంటే — క్రియలతో కాక, సమర్పణతో నిండిన మౌనతలోనూ భక్తి తళుకుతుంది. 

చివరి పాదాలు:
ఆత్మయాత్రలో తుది స్థితిని సూచిస్తాయి — ఎదురు చూసే సహనంతో ఆత్మ పరమాత్మతో ఏకత్వాన్ని పొందుతుంది. ఇది తెలియజేసేది- భక్తి అనేది వెలుపల కనిపించే కార్యాలు అవసరం లేని ఒక అంతర్లీన స్థితి అని. మనస్సు నిశ్చలమై, సమర్పణతో, విశ్వాసంతో నిండినప్పుడు — అదే నిజమైన ఆరాధన. 

ఆ మౌనమే సాధన. ఆత్మ తన వ్యక్తిత్వాన్ని విడిచిన చోటే, దైవికమైన ఆనుభవంతో నిండిపోతుంది..

-X-X- సమాప్తం -X-X-

Thursday, 17 April 2025

T-218. పుట్టెడి దింతా బూటకంబులే

 అన్నమాచార్యులు

218. పుట్టెడి దింతా బూటకంబులే 

మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె -శ్రీశ్రీ 

ఉపోద్ఘాతము:

"ఇలాంటి మెట్టవేదాంతపు కీర్తనలను చదివి మీ సమయాన్ని వృథా చేసుకోకండి". నలభయ్యవ దశకంలో జిడ్డు కృష్ణమూర్తి గారికి ఇలాంటి సందర్భమే ఎదురైంది. అప్పుడు కృష్ణమూర్తి గారు సభకి వచ్చిన వారితో బయట జరుగుతున్న ప్రపంచ యుద్ధం కంటే మీలో జరుగుతున్న అంతర్యుద్ధం ఎక్కువ ముఖ్యం అన్నారు. కొంత కాలం పాటు వారి సభలకు ప్రజలు రావడం మానేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. 

నిలకడలేని మనకు నిజం ఎలా తెలుస్తుంది చెప్పండి? కొంతైనా నిజం లేకుండా తాడు పేడు లేని "పుట్టెడి దింతా బూటకంబులే" వంటి మాటలకు వ్యాఖ్యానం చేయగలమా? కాబట్టి నిదానంగా సమయాన్ని వెచ్చిస్తూ ఈ కామెంటరీ చదువుతారని అశిస్తా! 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: ఈ జీవుల పుట్టుకలన్నీ బూటకమే. జనులారా! శ్రీహరి కల్పించిన బలమైన మాయా శక్తి వలన ఈ నాటకాన్ని తెలియలేకున్నాము. అంతరార్థము:  ఈ జీవితం తాత్కాలికం. పుట్టుక, మరణం, శరీరం — ఇవన్నీ ఒక నాటకంలోని పాత్రలు మాత్రమే. ఈ మాయా ప్రపంచం మనస్సును మరిపించి దారి చూపలేని స్థితిలో బంధించి ఉంచుతుంది. అలా చిక్కుకుపోయిన మనిషి ఈ అసత్యపు బంధనాలనుండి బయటపడాలంటే, శ్రీహరిని ఆశ్రయించడమే మార్గం. ఆయన చూపే దిశలోనే సత్యం, స్వేచ్ఛ, ముక్తి ఉన్నాయి. 

మొదటి చరణం: మన ప్రాణం ఊపిరిపై ఆధారపడి ఉన్నది. ఎంత సంకటమైన ఆధారమిది! అటువంటి ప్రాణంతో నిలిచియున్న శరీరాన్ని ఎలా నమ్మగలం? మన జీవితము ఇలాంటి సంకేతములతోనే ఏర్పడింది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న దానినే మనస్సు గ్రహిస్తుంది. అవే లోతుగా వ్యాపిస్తాయి.  మన మనస్సు ఇలాంటి  అనేకానేక సూచనలతో, అనుభవాలతో భ్రమించి నిలకడ తప్పుతోంది. 

రెండవ చరణం: నాలుక అనేక రుచులను కోరుకుంటుంది. మనసు ఆ రుచులను గుర్తుంచుకున్న అంతవరకు సమయమూ సందర్భమూ లేకుండా అవి తిరిగి రావాలని కోరుకుంటాము. ఈ తోలు తిత్తిని పోషించుటలోనే జీవితమంతా గడిపేస్తాం. మానవులారా మీకు ఇవ్వబడిన ఈ సమయాన్ని ఎలా వృథా పరుచుచున్నారో తెలియుడీ. 

మూడవ చరణం: ఐతే జ్ఞానమంతా నాలోనే నిగూఢమై ఉంది. కానీ పరస్పర దూషణలు అరోపణలు, నిందలు  హింసలతో నడిచే ఈ జీవిత నాటకంలో ఆ జ్ఞానాన్ని కనుగొనగలనా? (లేను). కానీ, ఆ శ్రీతరుణీపతిని, శ్రీ వేంకటపతిని మనసారా ధ్యానించినపుడు - ఆ అడ్డంకులన్నీ చిత్తయి తొలగిపోతాయి.

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 323-2 సంపుటము: 4-131

పుట్టెడి దింతా బూటకంబులే
గట్టిమాయ హరిఁ గానఁగ నీదు         ॥పల్లవి॥
 
ముక్కున నున్నది ముందటఁ బ్రాణము
యెక్కడ నమ్మేదిఁకఁ దనువు
చుక్కలు మోఁచీఁ జూపులెదుటనే
నెక్కొను మతికిని నిలుకడ యేది    ॥పుట్టెడి॥
 
నాలుక నున్నవి నానారుచులును
వేళావేళకు వెరవేది
తోలున నున్నది దొరకొని బ్రతుకిది
కాలంబెటువలెఁ గడపేది     ॥పుట్టెడి॥
 
ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది         ॥పుట్టెడి॥ 

Details and explanation:  

పుట్టెడి దింతా బూటకంబులే,
గట్టిమాయ హరిఁ గానఁగ నీదు

భావము: ఈ జీవుల పుట్టుకలన్నీ బూటకమే. జనులారా శ్రీహరి కల్పించిన బలమైన మాయా శక్తి వలన ఈ నాటకాన్ని తెలియలేకున్నాము. 

అంతరార్థము:  ఈ జీవితం తాత్కాలికం. పుట్టుక, మరణం, శరీరం — ఇవన్నీ ఒక నాటకంలోని పాత్రలు మాత్రమే. ఈ మాయా ప్రపంచం మనస్సును మరిపించి దారి చూపలేని స్థితిలో బంధించి ఉంచుతుంది. అలా చిక్కుకుపోయిన మనిషి ఈ అసత్యపు బంధనాలనుండి బయటపడాలంటే, శ్రీహరిని ఆశ్రయించడమే మార్గం. ఆయన చూపే దిశలోనే సత్యం, స్వేచ్ఛ, ముక్తి ఉన్నాయి. 


వివరణ​: 

మొదటి భాగము: 

తాత్త్విక పునాదులు (Philosophical foundations): 

భగవద్గీతలోని ఈ శ్లోకము చూడండి. న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః । న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్2-11 ॥ భావము: నీవుగాని, నేనుకాని, ఈ రాజులు కానీ లేని కాలమే లేదు. ఇక ముందూ కూడా ఉందుము. ఈ శ్లోకము నుంచి శాశ్వతమైనది అలాగే ఉంటూనే పైపై పూతల వంటి శరీరాలు రాలిపోతూంటాయి అని భావించవచ్చును. ఏదైతే దారములా అనేకానేక జీవితములను దండ వలె నిలిపి యుంచుచున్నదో అదియే సత్యము. 

ఈ పల్లవిలో అన్నమాచార్యులు ఓ తీవ్రమైన వాస్తవాన్ని మనముందుంచుతున్నారు —మరణము మృత్యువు కాదు. అది విరామము మాత్రమే. అసత్యాన్ని సత్యంగా భావించడమే అసలైన మృత్యువు. అది అజ్ఞానమును కొనసాగించును. ఎట్టిపరిస్థితులలోను అది జ్ఞానమునకు దారి తెరవదు. దీనిని ఇంకొంచెం విశద పరచుకునేందుకు హిల్మా క్లింట్ గారి ఎనిమిదవ హంస బొమ్మను పరిశీలనాత్మకముగా చూచెదము.


రెండవ భాగము:   

Hilma af Klint యొక్క Swan No. 8 — ఒకే జీవన రూపానికి చెందిన రెండు దశలు: ఒకటి ప్రత్యక్షం, మరొకటి దాని ప్రతిబింబం.



ఈ చిత్రంలో మనం రెండు సమూహాల స్పటికములను చూస్తాము — ఒకటి నలుపు  స్పటికములు తెల్ల నేపథ్యంతో
, మరొకటి తెలుపు స్పటికములు నలుపు నేపథ్యంతో. ఈ రెండు రూపాలూ ఒకే జీవన సత్యానికి చెందిన పరస్పర ప్రతిబింబాలుగా నిలుస్తాయి. 

ఆ స్పటికాలలో ఒకటి ఇప్పటి జీవితాన్ని, దాని ప్రతిబింబం మరణము తర్వాత జీవితాన్ని సూచిస్తున్నాయి. స్పటికముల రంగు దాని నేపథ్యం విరుద్ధముగా వుండి ఏది జీవితమో ఏది మరణమో తెలియలేము. ( దీన్ని శ్లో॥ యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ । యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥(2-69)॥ "ప్రపంచం పగలు అని భావించునది పండితునికి అజ్ఞానపు అంధకారం; ప్రాణులు రాత్రి అని  భావించునది జ్ఞానుల కోసం జ్ఞానదీప్తితో నిండిన వెలుగు."తో పోల్చవచ్చును.  ఈ రకముగా జీవితము మరణములను  ఇదమిత్థంగా మానవుడు నిర్ణయింపలేడు. 

ఈ క్రిస్టల్స్‌లో ఒకటి మన సామాన్య మానవుడిని సూచిస్తుంది. అతని అంతరంగ సత్యం — అంటే అతడి లోపలి నిజమైన భావన — అతని పరిసర ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే, ఈ స్పటికముల సముదాయం విశ్వాన్ని సూచిస్తే, అది కూడా తన ప్రతిబింబంతో వ్యతిరేక సంబంధంలో ఉంటుంది. ఈ విరుద్ధతను మానవుడు తనకై తానే తొలగించలేడు. 

ఈ విరుద్ధతను అంగీకరించడం, దానితో విలీనం కావడం తప్ప దాని గురించి బాధపడడం పరిష్కారం కాదు — అనేదే అసలు పాఠం. మనం ప్రస్తుతం సత్యాన్ని షరతులతో అంగీకరిస్తాము. అది మనకు అనుగుణంగా ఉంటే గానీ దాన్ని ఒప్పుకోం. అయితే అసలైన మార్గం, సత్యాన్ని నిఖార్సైన స్వరూపంలో, నిబద్ధతలులేని అంగీకారంతో స్వీకరించడం మనకు కష్టామే. అదే మనిషికి దేవుడు పెట్టిన పరీక్ష​. 

కిరణముల వంటి గీతలు మధ్యలో వున్న పెద్ద స్పటికము గుండా పోవుచూ సమస్త​ స్పటికములను సూచించు తలములో ఉన్నట్లు కనబడుతవి. మానవుడు తన స్పటిక ఆకృతిని (crystalised ideas) వదలి ఆ స్పటిక సమూహాల ప్లేన్లో (తలములో) ప్రవేశించ గలిగితే,  ఆ రెండు సమూహాల తలములు  ఒక దానితో మరొకటి అనుసంధానిచ బడినట్లు తెలియును. అనగా మానవుడు తన జన్మ రహస్యమును తెలియుట​. అట్టి వారికి జీవితము మరణము రెండును ఒకేలా కాన్పట్టును. అందుచేతనే జిడ్డు కృష్ణమూర్తిగారు అనేక పర్యాయములు మరణము గురించి ప్రస్తావించిరి.


మూడవ భాగం:  

ఈ పల్లవి అనేక స్థాయిలలో మనల్ని పరీక్షించేట్టు ఉంటుంది. ఇది సాధారణ భక్తికీర్తన కాదు. ఇది మానవుడి జీవనముపై లోతైన ప్రశ్న.ఈ ప్రశ్నకు సమాధానం అనుభవంలోనే దొరుకుతుంది. దానివల్ల మనిషి జీవితం సత్యంతో విలీనమవుతుంది.


మానవుడు అందుబాటులో వున్న​ఈ భౌతిక ప్రాపంచిక చలనాలను నిజమైన జీవితంగా భ్రమించి, తన చుట్టూ ఉన్నవాని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. Hilma af Klint స్వాన్ నెం.8 చూపినట్టే, మన జీవితము అందలి అనుభవములు తాత్కాలిక డేటా వంటివి. అది ఒక పరిమిత అధ్యాయము. ఒక్క మరణముతో ఇవి తుడిచిపెట్టుకుపోతాయి. అందుకే కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే:  అన్నారు అన్నమాచార్యులు.


మొదటి చరణం:

ముక్కున నున్నది ముందటఁ బ్రాణము
యెక్కడ నమ్మేదిఁకఁ దనువు
చుక్కలు మోఁచీఁ జూపులెదుటనే
నెక్కొను మతికిని నిలుకడ యేది ॥పుట్టెడి॥ 

నెక్కొను = వ్యాపించు, అతిశయించు. 

భావము: మన ప్రాణం ఊపిరిపై ఆధారపడి ఉన్నది. ఎంత సంకటమైన ఆధారమిది! అటువంటి ప్రాణంతో నిలిచియున్న శరీరాన్ని ఎలా నమ్మగలం? మన జీవితము ఇలాంటి సంకేతములతోనే ఏర్పడింది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న దానినే మనస్సు గ్రహిస్తుంది. అవే లోతుగా వ్యాపిస్తాయి.  మన మనస్సు ఇలాంటి  అనేకానేక సూచనలతో, అనుభవాలతో భ్రమించి నిలకడ తప్పుతోంది. 


వివరణ​: 

ఈ చరణం మనకు జీవిత స్థిరత్వం మీద కొత్త దృష్టికోణం ఇస్తుంది. 

ముక్కున నున్నది ముందటఁ బ్రాణము: కనులకు కనబడని ఊపిరిపై మన ప్రాణం ఆధారపడి ఉంది. ఒక్క నిమిషం ఆ ఊపిరి నిలిచిపోతే జీవితం అర్థం కోల్పోతుంది. ఇంత అనిశ్చితమైన ఆధారముతో ‘నేను’ అనే భావన నిలబడడం ఆశ్చర్యమే.


యెక్కడ నమ్మేదిఁకఁ దనువు: 

ఈ శరీరాన్నిపెంచి పోషిస్తాం. జాగ్రత్తగా కాపాడుకుంటాం. అలసిపోకుండా చూసుకుంటాం.  గౌరవం సంపాదించుకునేందుకు మంచి దుస్తులు ధరిస్తాం.  ఐతే, ఈ ప్రాణం గాలిలో మాయమై పోతే, ఈ శరీరమూ రాలిపోతుంది.  జీవితం శూన్యమవుతుంది.   అలాంటి దాన్ని ఎలా నమ్మగలము? ఇది అవగాహనను పెంపొందిస్తున్న తాత్త్విక దృష్టి


చుక్కలు మోఁచీఁ జూపులెదుటనే

ఇక్కడ “చుక్కలు” అన్న పదం చాలా రమ్యంగా ఉంది. అనేక సంకేతాలు, ఆకృతులు, చూపులకు, వైవిధ్యాలకు అది ఊతమిస్తుంది. కనిపించే ప్రతి వస్తువూ — ఒక సంకేతం మాత్రమే అనగా  మనస్సులో వున్న సంకేతంతో సరిపోల్చుకున్నప్పుడే రూపు దిద్దుకుంటుంది. ఇంద్రియ గ్రహణతో చూపుల ముందు అనేకా అర్ధాలు నాటకీయంగా ప్రత్యక్షమవుతాయి, కానీ వాటి వెనుక వాస్తవం మనకు గోచరము కాదు. ఇక్కడ "చుక్కలు" నాటకం లాంటి అపరిమిత వ్యాప్తిని సృష్టిస్తాయి. మనం వాటిలో అర్ధం కోసం చూస్తాం కానీ, అవి ఎండమావులని గ్రహించం. అంటే “చుక్కలు” అనేది ఇక్కడ స్వీయ-భావాలకు, ఎదుటి సత్యానికి మధ్య పొరాట స్థలంగా నిలుస్తోంది. 


నెక్కొను మతికిని నిలుకడ యేది 

ఇది ఆఖరి గుణపాఠం. మనస్సు అనేక సూచనల వర్షంలో తడుస్తూ, ఏ ఒక్క స్థిరతను పొందలేదు. చూచిన ప్రతీ దృశ్యం మనస్సులోకి ఎక్కిపోతుంది. తనదైన​ మత్తును కలిగిస్తుంది. ఆ మత్తులో మనస్సు నిలకడ కోల్పోతుంది. ఈ వ్యాప్తి ఓ స్వేచ్ఛ కాదు — అది వ్యభిచారము. 

వీటిని చూస్తే మనసు అంటే మన శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి నాడిని, ప్రతి రక్తబిందువును, ప్రతి రోమమును కలుపుతున్న వ్యక్తపరచలేని భావన అని తెలుస్తోంది.

సారాంశం:

ఈ చరణం ద్వారా అన్నమాచార్యులు మనం అనుభూతి  మీద​ ఆధారపడుతున్న ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నారు. మన శరీరం కానివ్వండి. చుట్టూతా ఉన్న సంకేతాలైనా కానివ్వండి. ఎంత ప్రయత్నించినా అవి మనలను మరిపించి సత్యాన్నుంచి దూరం చేయగలవు అన్న హెచ్చరిక. ఈ అనిశ్చితి మధ్య, మనస్సు నిలకడ కోల్పోతుంది. దీనినే అనేక తత్వవేత్తలు “అవిద్యా” అనే పదంతో నిర్వచించారు.


రెండవ చరణం:

నాలుక నున్నవి నానారుచులును
వేళావేళకు వెరవేది
తోలున నున్నది దొరకొని బ్రతుకిది
కాలంబెటువలెఁ గడపేది  ॥పుట్టెడి॥ 

భావం: నాలుక అనేక రుచులను కోరుకుంటుంది. మనసు ఆ రుచులను గుర్తుంచుకున్న అంతవరకు సమయమూ సందర్భమూ లేకుండా అవి తిరిగి రావాలని కోరుకుంటాము. ఈ తోలు తిత్తిని పోషించుటలోనే జీవితమంతా గడిపేస్తాం. మానవులారా మీకు ఇవ్వబడిన ఈ సమయాన్ని ఎలా వృథా పరుచుచున్నారో తెలియుడీ. 


వివరణ​: 

నాలుక నున్నవి నానారుచులును.

మనస్సు నాలుక ద్వారా కనుగొన్న​ రుచుల అనుభూతిని మళ్లీ మళ్లీ కోరుతుంది. ఇది కేవలం ఆహార విషయమే కాదు -ఇంద్రియాలకు వశమైన ప్రతి అనుభూతికి వర్తిస్తుంది. అదే ఆరాటం. అవి -కొత్తబిచ్చగాడు పొద్దెరగనట్లు - సమయం, సందర్భం చూడకుండా తలెత్తుతుంటాయి అని చెబుతున్నారు. ఇది మనస్సు అస్థిరతపై అన్నమయ్య వేసిన మరో వాత​. 


తోలున నున్నది దొరకొని బ్రతుకిది 

మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె -శ్రీశ్రీ 

ఇది బ్రతుకా? ఒక తోలులో కూర్చున్నదే! అనగా శరీరం అనేది చర్మంతో కప్పబడిన నిస్సార నిర్మాణం. కానీ అదే శరీరాన్ని దొరికించుకుని మనం బ్రతుకుతున్నాం. అన్నమయ్య తాత్పర్యం ఇదే: మన జీవితం అంతా ఈ దేహాశ్రయంగా తయారైపోయింది. ఇది పరిమితి; బాహ్య స్వరూపాన్ని అండగా తీసుకుని మానవుడు బ్రతుకు సాగిస్తున్నాడు.


ఇక్కడ "దొరకొని" అనే పదం వ్యంగ్యంగా ఉంది — ఓ తక్కువ స్థాయిలో దొరికిన ఆధారాన్ని బ్రతుకు గమ్యంగా తీసుకుంటున్నామన్న చింతన దీని వెనుక ఉంది. (ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు అను పల్లవిని కూడా గుర్తు తెచ్చుకుందాం. = ఓ మానవుడా స్థిరముగా నిలుచు ఓడను విడిచి (సులభముగా దొరుకుతోందని) సొరకాయ బుర్రను పట్టుకొని సముద్రము లాంటి సంసారమును దాట ప్రయత్నించు వెర్రివి)


కాలంబెటువలెఁ గడపేది 

ఒక లోతైన అసహనాన్ని, మనం మన జీవితాన్ని ఎలా గడుపుతున్నామన్న ప్రశ్నను ఇది వ్యక్తం చేస్తోంది.

"కాలంబెటువలెఁ గడపేది" అన్నది ఒక్కరూపంలో నిరాశ, ఇంకొక రూపంలో ఆలోచన — “ఇది బ్రతుకా? ఏమి చేస్తున్నాను నేను? ఈ సమయాన్ని ఎలా వృథా చేస్తున్నాను!” ఈ వాక్యం ఆత్మ పరిశీలనకు దారి తీస్తుంది. చేతివేళ్ళమధ్య సందుల లోంచి నీరు జారుకున్నట్లు కాలం అనే విలువైన అవకాశం ఎలా తప్పించుకు పోతుందో. అన్నమయ్య ప్రశ్నించకుండానే మనల్ని ప్రశ్నలలోకి లాక్కెళ్తారు.


సారాంశం:

ఈ చరణం మనం ఎలా అనుభూతులకు బానిసలమై బ్రతుకుతున్నామో చూపిస్తుంది. నాలుకగా మొదలైన ఈ అనుభూతి + ఆసక్తి చక్రము శరీరంలో తిష్ట వేసుకొని, చివరికి జీవితాన్ని గడపడం అనే విషయాన్ని కూడా అర్థరహితంగా మార్చేస్తుంది. మనస్సు సమయాన్ని సృజనాత్మకంగా గడపలేదు. బాహ్య ప్రపంచపు ప్రలోభాల్లో పడిపోతూ, కాలాన్ని గడిపేస్తాం. అన్నమయ్య ఈ చరణం ద్వారా మనమేమిటో అద్దంలో చూపిస్తున్నారు. 

మూడవ​ చరణం:

ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది      ॥పుట్టెడి॥ 

భావం:  ఐతే జ్ఞానమంతా నాలోనే నిగూఢమై ఉంది. కానీ పరస్పర దూషణలు అరోపణలు, నిందలు  హింసలతో నడిచే ఈ జీవిత నాటకంలో ఆ జ్ఞానాన్ని కనుగొనగలనా? (లేను). కానీ, ఆ శ్రీతరుణీపతిని, శ్రీ వేంకటపతిని మనసారా ధ్యానించినపుడు - ఆ అడ్డంకులన్నీ చిత్తయి తొలగిపోతాయి. 


వివరణ​: 

ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది 

అన్నమయ్య ఇక్కడ మానవునిలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నారు — అది మనసుకు, శరీరానికి, భావాలకు అతీతంగా మనలో తలదాచుకున్నది. కానీ అదే జ్ఞానం, మన అనుభవ జీవితంలో కనిపించదు. ఎందుకంటే మనం “ఘూతలు” అనే విమర్శల, అపవాదాల, అపార్థాల మేఘాలలో జీవిస్తున్నాం. ఇతరుల అపహాస్యం, మనల్ని పీడించే అర్థాల గందరగోళం — ఇవన్నీ జ్ఞానాన్ని నిగూఢంగా మారుస్తాయి. అక్కడే అన్నమయ్య ప్రశ్న: ఈ ప్రకృతిని బలపరిచే మాయలోవుంటూనే నేను అంతర్లీనంగా వున్న జ్ఞానాన్ని ఎలా కనుగొనగలను? (లేను).

 

ఘూతలు” అనే పదం గాఢంగా ఉంది — అది బాహ్య ప్రపంచపు చీకటి మబ్బులా, మనలోని జ్ఞానాన్ని అడ్డుకుంటుంది. ఒక అస్తిత్వ సంక్షోభం ఇది — మనల్ని మనముగా కనుగొనలేని స్థితి. తిరిగి Hilma af Klint యొక్క Swan No. 8ని చూడండి.


శ్రీతరుణీపతి  శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది 

శ్రీతరుణీపతినిత్య​ యౌవనము శోభించు స్వరూపుడు,
శ్రీవేంకటపతివేంకటగిరి పై వెలుగుతున్న పరమాత్మ. 

ఈ రెండు పేర్లు ఒకే దివ్య సత్యానికి ప్రతీకలు. ఇవి రూపాలైనప్పటికీ, రూపములు సూచించలేని, వానిని దాటి వున్న శక్తికి సూచన. ఇక్కడ అన్నమయ్య రెండు రూపాల నెందుకు ఎంచుకున్నదీ Swan No. 8లో తెలియబరచ పడింది. అదే అన్నమయ్య అంటున్నాడు — నేను ఈ నిరాశమయ, ఈ ఘూతల పంచకం నుంచి బయటపడగలిగాను, ఎందుకంటే నేను అతనిని స్మరించాను. ఆ స్మరణలోనే అసత్యం కరిగిపోయింది. ఆ స్మరణలోనే అంతర్లీనమైన జ్ఞానాన్ని నేను తిరిగి పొందాను. 

"డ్డంబేది"ఇది ఒక్క మాటలో ఓ గంభీర మార్పును సూచిస్తుంది. "తెర తొలగిపోవడమే" అన్న అర్థమే కాదు ఇది. అది ఆలోచనల మబ్బులో నుంచి వెలుగులోకి రావడం. సత్యముతో మేలుకోడం.


 సారాంశం:

ఈ చరణం అన్నమయ్య కవిత్వపు ముగింపు ఘట్టం కాదు — అది నిజానికి ఒక ఆంతరంగిక ప్రయాణానికి ఆరంభం. నాలుక, శరీరం, మనస్సు — ఈ మూడు దశల్ని దాటి, చివరకు జ్ఞానమయమైన ఆత్మతత్వానికి వస్తాడు. కానీ దానిని గ్రహించడానికి మనం చేయాల్సింది ఒక్కటే: “ఘూతాల” ప్రపంచం నుండి మన మనసును వెనక్కి మరల్చాలి. శ్రీవేంకటపతి అనే రూపములో సత్యాన్ని చూడగలిగినప్పుడు, everything false melts. అన్నమయ్య నిశ్శబ్దంగా చెబుతున్నాడు: జ్ఞానం మనలోనే ఉంది. దాన్ని వెలికి తీసేది మన ఆంతరంగిక స్థితి, మన దృష్టి.

 

-X-X- సమాప్తం -X-X-

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...