Tuesday, 14 July 2026

T-339 ఇందుకొరకె యిందరును నిట్లయిరి

 తాళ్లపాక అన్నమాచార్యులు
339 ఇందుకొరకె యిందరును నిట్లయిరి
For English Version Press Here

 ఉపోద్ఘాతము
మనందరిలోనూ అభయయుడైన పరమేశ్వరుడు ఉన్నాడని చెబుతారు. లోపల ఉన్న వానిని లోపల నుండే కలుపుకొనవలెను. ఆ సంబంధమే పరము అనుకోవచ్చును. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే, మన మనసులో పరము అంటే 'ఇది' అను ఒక చిత్రము ఉంటే, మనకు ఆ చిత్రమే పరముగా కనిపిస్తుంది. అటువంటి మనోచిత్రములను దాటి ఉన్నదే పరము.

కానీ పరమును మన ప్రయత్నంతో సాధించలేము. అది ఈశ్వరుడు ఒసగునది. అయినప్పటికీ, అందులో మానవుని కర్తవ్యం లేదనుకొనరాదు. మనమున్న స్థితిని పూర్తిగా గ్రహించుటే ముఖ్యము. ఆ స్థితిని అట్టడుగు దాకా తెలుసుకుంటే చాలు అని అన్నమాచార్యులు ఈ కీర్తనలో సూచిస్తున్నారు.
 
అధ్యాత్మ​ సంకీర్తన
రాగి రేకు: 2-5  సంపుటము - సంకీర్తన: 1-11
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు ॥ఇందు॥

అటమటపు వేడుకల నలయించి మఱికదా
ఘటియించుఁ బరము తటుకన దైవము
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు                ॥ఇందు॥

బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
కొం డనుచుఁ బర మొసంగును దైవము
బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు
యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు ॥ఇందు॥

మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
తనభ క్తి యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు
తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు               ॥ఇందు॥
Details and Explanations:
పల్లవి:
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు    ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
అందువలననే ఎందరో సాధకులు ఈ రకంగా ఉన్నారు.
అందువలననే ఎందరు ప్రయత్నించినా అది సాధ్యముకానిది.
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు
(కిందుపడి = క్రింద ఎంతవరకు పడగలం? నేల మీద  పడగలం. అన్నమాచార్యులు అట్టడుగు దాకా పడినకాని అన్న అర్థంలో వాడారు) 
అట్టడుగు దాకా వెళ్లకపోతే గెలుపు ఎఱఁగలేము
ఇది కనపడినంత సులభం కాదు. అట్టడుగు దాకా తెలిసినదాకా, తెలిసినట్లే అనిపించిన జ్ఞానానికి విలువలేదు.
గూఢార్థవివరణము:

కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు”: అన్నమాచార్యులువారు ఏమి చెప్పదలుచుకున్నారో విచారింతము. ప్రస్తావనలో చెప్పుకున్నట్లు లోపల నుండి లోపలది తెలియవలెను. మరి దానిలో అట్టడుగుకు వెళ్లడం అంటే ఏమిటి? మానవుడు తెలియగలిగిన దానికి పరిమితి లేదు. అలాంటప్పుడు నిజంగా అట్టడుగుకు వెళ్లడం సాధ్యమేనా? విచారింతము. ముఖ్యంగా గమనించవలసినది తెలుసుకోవాలి అనుకోవడమే ఆ అపరిమితమును విధిస్తుంది. తెలుసుకోవాలి అని లేనప్పుడు దానికి అర్థం ఉండదు. మరి అట్టడుగున వుంటున్నదేమిటి? సులభం! తెలియవలెను తెలుసుకోవలెను తెలుసుకుంటాను అనే తపన లేని స్థితి.

Bottom of Form


మొదటి చరణం: 
అటమటపు వేడుకల నలయించి మఱికదా
ఘటియించుఁ బరము తటుకన దైవము
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు  ॥ఇందు॥
భావము:
కీర్తన పాదము
సాధారణ అర్థము
అంతరార్థము
అటమటపు వేడుకల నలయించి మఱికదా
(అటమటపు = దుఃఖం, నిజము కాని; అలయించి = మించి); దుఃఖమును, నిజము కాని వాటిని దాటిన తరువాతే కదా...
అసత్యమైన వాటి స్వభావాన్ని పూర్తిగా గ్రహించిన తరువాతనే సత్యము వెల్లడవుతుంది.
ఘటియించుఁ బరము తటుకన దైవము
(ఘటియించుఁ=కలిగించు) దైవము తటుకన   ప్రసాదించుఁ బరము.
మనసు సిద్ధమైనప్పుడు  ఆ పరము స్వయంగా ప్రత్యక్షమవుతుంది.
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు
(ఈసు = ఈర్ష్య) ఈశ్వరునికి మనపై కోపమేమీ లేదు.
జీవితంలోని అనుభవాలు శిక్షలు కావు; అవి అవగాహనకు అవకాశాలు.
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు
మనలోని కుటిలత్వం తెలియక అసలు మంచి గుణం తెలియదు.
మనసు కుటిలత్వం ఆసాంతము చూసిన తరువాతనే నిజమైన గుణము తెలుస్తుంది.
 గూఢార్థవివరణము:
ఈ చరణములో అన్నమాచార్యులు అసత్యమైనదాని లక్షణమును తెలియ మంటున్నారు. ఇంతకుముందు కీర్తనలో చైతన్య స్థితిలో తెలియగలిగినవన్నీ క్షరములు అని మనం తెలుసుకున్నాం. వీనిని మనసు లేదా బుద్ధి ద్వారా గ్రహిస్తాము. అస్థిరము అని చెప్పుకోవడం ఒకటి, వాస్తవంగా గ్రహించుట ఒకటి. ఆ క్షణములో అది తనకులేని అస్తిత్వమును వదలును. ఈ రకంగా చూస్తే తన యొక్క అస్థిరత్వం గ్రహించినది లోకములో గొప్ప విషయము.
 
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు”: ఒకటవ నాలుగవ పంక్తులు ఒకే విషయాన్ని సూచిస్తున్నవి. మనసు అనంతముగా ప్రతిబింబించు లక్షణముగలది. మన మనసులో పరము గురించి ఏ చిత్రం ఉంటే అదే పరముగా అనిపింపచేయును. కాబట్టి సాధకుడు తన మనసు ఏ రూపై నిల్చుచున్నదో నిరంతరం గమనించవలెను.

రెండవ చరణం:
బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
కొం డనుచుఁ బర మొసంగును దైవము
బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు
యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు    ॥ఇందు॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
(బెండుపడ =  నిస్సత్వమగు, బలహీనమగు); నిస్సత్వము, బలహీనము చేయు చెడు గతులను వదలిన తరువాత కదా
మన యిష్టాయిష్టాలు రెండూ మనలను బలహీనులను చేసే అలవాట్లు. వాటిని దాటిన తరువాతనే కదా
కొం డనుచుఁ బర మొసంగును దైవము
అప్పుడు దైవము పరమును అనుగ్రహిస్తుంది.
పూర్వాధారాలు పూర్తిగా తొలగిన తరువాతనే కదా పరమునకు అవకాశం.
బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు
హరి మనలను బంధించడు.
మన బంధాలకు కారణం దైవము కాదు; మన స్వంత స్థితి. (338వ కీర్తన చూడండి)
యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు
(బండు సేయఁగ = బద్దు చేయు, ఆరడి చేయు) ఎండ తెలియక నీడ సుఖం తెలియదు.
ఎండ చురుక్కుమంటే కదా నీడలో ఉన్న సుఖము తెలిసేది. ఒక అనుభవం పూర్తిగా తొలగిన​​ తరువాతనే దానిని దాటి ఉన్నదాని విలువ తెలుస్తుంది.
గూఢార్థవివరణము:

బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా”: అన్నమాచార్యులు ఇక్కడ లోతైన పరిశీలన చూపుచున్నారు. ముఖ్యంగా మనం ఆలోచించవలసినది మన అలవాట్లు ఇష్టాయిష్టాలు. ఊహలు, ఉద్రేకాలు, కోరికలు ఊవెత్తున లేచిపడ్డప్పుడు అవి నాగటి చాలులా,  వెల్లువ పారుటకు కాలువలా పనిచేసి మనం ప్రతిసారి ఒకే బాటలో (పథము నందు) ప్రయాణించునట్లు చేయును. కావున కావున ఇవి మనలను ఏ దారిలో నడిపిస్తున్నవో గమనించుట అవసరము. వీటిని అధిగమించుట అత్యంత కఠినము.

యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు”: దీనిని అతి జాగ్రత్తగా గమనించండి. సులభమైన విషయములను చెప్పుటలేదు. మండుటెండవలె పరీక్షించే పరిస్థితిలో నిలబడగల ధైర్యమూ, శ్రద్ధా లేకపోతే మనము దేనిని పట్టుకొని ఉన్నామో దానిని విడిచుట ఎట్లు? నీటి ప్రవాహములో ములిగిపోతున్నవాడు గడ్డిని కానీ చివరకు పామును కానీ పట్టుకుని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంతేకానీ "తను వేసుకున్న అంగి ప్యాంటు రంగుకు సరిపోతున్నదా? లేదా"? అని ఆలోచించడు.


మూడవ చరణం:
మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
తనభ క్తి యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు
తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు   ॥ఇందు॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
ముందు అనేక దేవతలకు మొక్కిన తరువాతే కదా
మానవుడు ఏవైతే గొప్పవిగా, ఆశ్రయముగా, తన కోరికలను తీర్చగలదానిగా భావించి దాని ముందు తలవంచునో, అవన్నీ ఈ "వేల్పులు". ధనము, కీర్తి, అధికారం, జ్ఞానము, సిద్ధులు, స్వర్గము మొదలైనవి.
తనభక్తి యొసఁగు నంతట దైవము
అప్పుడు దైవము తన భక్తిని ప్రసాదిస్తుంది.
ఇతర ఆధారాలు తప్పుకున్న​ తరువాతనే నిజమైన భక్తి సహజంగా వికసిస్తుంది.
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు
వేంకటేశ్వరుడు మోసం చేయడు.
దైవము మనలను మభ్యపెట్టదు; మన అవసరాలకు అనుగుణంగానే జీవితం సాగుతుంది.
తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు
తినకపోతే చేదు రుచి తెలియదు.
ప్రత్యక్ష అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు; తెలిసిన అవగాహన అపోహ మాత్రమే.
గూఢార్థవివరణము: 

మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా”: ఇక్కడ "వేల్పులు" అనగా దేవతలు మాత్రమే కాదు. మనసు దేనినైతే గొప్పదిగా, ఆశ్రయముగా, తన కోరికలను తీర్చగలదిగా భావించి దాని ముందు తలవంచునో, అవన్నీ ఈ "వేల్పులు". ధనము, కీర్తి, అధికారం, జ్ఞానము, సిద్ధులు, స్వర్గము, చివరకు మనం మనసులో నిర్మించుకున్న దేవుని రూపము కూడా దీనిలో చేరవచ్చును.

అంటే మన జీవితం ఆయా "వేల్పుల" దారిలోనే సాగుతుంది. ఈ బాటలో అనేక మొక్కులు, అనేక అనుభవాలు. కానీ శాంతి ఎక్కడ? వాటిలో ఏదీ మనిషిని పూర్తిగా తృప్తిపరచలేదని గ్రహించాలి కదా! ఆ తరువాతనే భక్తికి అవకాశం కలుగుతుంది.

తనభక్తి యొసంగు నంతట దైవము” అనే పాదము ఈ కీర్తనలోని అత్యంత ముఖ్యమైన పాదము. భక్తిని మనిషి తయారుచేసుకొను ద్రవ్యం కాదు. మనసు పట్టుకున్న ఆధారాలన్నీ సహజంగా సడలినప్పుడు, దైవమే తన భక్తిని ఒసగుతుంది. అందుకే అన్నమాచార్యులు వెంటనే ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు” అంటారు. దైవము ఎవరినీ మోసగించదు. మన స్థితికి తగినదే మనకు ప్రత్యక్షమవుతుంది.

చివరిగా తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు” అని ఈ చరణాన్ని ముగిస్తున్నారు. చేదును గురించి ఎంత విన్నా, రుచి చూడకపోతే అది తెలియదు. అలాగే జీవితంలో మనం పట్టుకున్న ఆధారాల అసలు స్వభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోకపోతే వాటిని విడిచిపెట్టడం కూడా సాధ్యం కాదు.

X-X-X THE END X-X-X

Saturday, 11 July 2026

T-338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
For English Version Press Here

 

పరిచయం 
"తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా" అనే పల్లవి ఈ కీర్తనకు హృదయము. తల్లి ప్రేమను దాది (పెంపుడుతల్లి) అనుకరించగలదు గాని, ఆ స్థానమును భర్తీ చేయలేదు. ఈ విశ్వమంతటికి తల్లి ప్రకృతి. అది భగవానుని భౌతిక శక్తి. (భగవద్గీత 7-4: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి భగవానుని భౌతిక ప్రాకృతిక శక్తి).

అయితే కొంచెం సావధానముగా పరిశీలించినచో, మానవుడు ప్రకృతి యొక్క సహజ కార్యక్రమములో అనవసరముగా జోక్యం చేసుకొనుచున్న విధానమును పెదతిరుమలాచార్యులు అత్యంత సరళమైన ఉపమానములతో తెలియజేయుచున్నారని తెలుస్తుంది. ఈ జగత్తును అనగా ప్రకృతి నడిపించు సహజ క్రమమును మనిషి తన ప్రయత్నములతో స్వాధీనపరచుకొనలేడు. మనము ఈ సృష్టికి యజమానులమని భావించరాదు (భగవద్గీత​ 3-33).

ఈ కీర్తనలో పెదతిరుమలాచార్యులు మానవుని ప్రయత్నములను ఖండించుటలేదు. ప్రకృతి తన పని తాను చేసుకొనుచుండగా, “మనిషి తన పాత్రను తెలుసుకొని, అనవసరమైన జోక్యమును విడిచిపెట్టగలడా?” అనే ప్రశ్నను మాత్రమే మన ముందుంచుచున్నారు.

అందుచేత ఈ కీర్తన భక్తిని మించిన ఒక జీవ పరిశీలనగా నిలుస్తుంది. మనము కర్తలమని భావించుచున్న చోట, మనము వేయు తప్పుటడుగును ఇది సున్నితముగా సూచించుచున్నది.

పెదతిరుమలాచార్యుల ప్రతిభ అసమాన్యము. సూర్యుని ప్రకాశం వంటి అన్నమాచార్యుల వెలుగులోను దీటుగా నిలిచింది. తండ్రికి తగ్గ తనయుడు అని మనము అనేక మార్లు చెప్పుకున్నాము. ఈ కీర్తన మరొక ఉదాహరణ అంతే.

అధ్యాత్మ సంకీర్తన
రాగి రేకు: 17-6  సంపుటము - సంకీర్తన: 15-98
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ॥పల్లవి॥

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా ॥తల్లికి॥

సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
చర్వితచర్వణాల వేసరించేము గాకా  ॥తల్లికి॥

నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
యీవలఁ గాచుటకు నీ కిదే పని
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా ॥తల్లికి॥
Details and Explanations:
పల్లవి:
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
తల్లికి బిడ్డపై ఉండే మమత దాదికి (పెంపుడుతల్లికి) ఎక్కడ ఉంటుంది?
దేవా!  నీవు జగత్తుకు తల్లివంటి వాడవు. మేము ఈ శరీరమును, మనస్సును తాత్కాలికముగా పోషించు దాదివంటివారము. కాబట్టి ఈ జగత్తు పట్ల నీకున్న సహజ బాధ్యతను, ప్రేమను, రక్షణను మేము మాకుగా చేసుకొనలేము.
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా
ఊరకనే "మాకు నీ వంటే ఎంతో ఇష్టం" అని మాటలలో చెప్పుకుంటాము.
"నా శరీరం", "నా పని", "నా బాధ్యత", "నా ప్రపంచం" అని చెప్పుకొను మా ప్రేమ చాలామటుకు మాటలకే పరిమితం. మాకు వీనిపై యజమానిత్వ భావమే ఎక్కువ; ప్రకృతి సహజ ప్రేమ తక్కువ.
గూఢార్థవివరణము:

తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా” ఈ కీర్తనకు హృదయము. తల్లి ప్రేమను దాది (పెంపుడుతల్లి) అనుకరించగలదు గాని, ఆ స్థానమును భర్తీ చేయలేదు. ఈ విశ్వమంతటికి తల్లి ప్రకృతి. పెదతిరుమలాచార్యులవారు ఇక్కడ ఒక నిశ్శబ్దమైన పునరాహ్వానము చేస్తున్నారు.

భగవద్గీత 3-33 ఇలా చెప్పింది  వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?” అనగా ప్రకృతి సహజ ప్రేమను వదలి కృత్రిమముగా జీవిస్తున్నామని అన్నట్లు. 

చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ఈ సందర్భంగా అన్నమాచార్యుల మాట "కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు" స్మరణీయము. మనము చెప్పే ప్రియములు అల్పములు. 

Bottom of Form


మొదటి చరణం:

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా ॥తల్లికి॥ 

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము

అంతరార్థము

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
సమస్త జీవులు నీ (విశ్వ) కుటుంబానికి చెందినవారు.
ఈ జగత్తులోని జీవులపై అసలు బాధ్యత ప్రకృతిదే (దైవముదే). మనిషి ఆ వ్యవస్థలో ఒక భాగము మాత్రమే.
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
వారికి ఈ లోకములో జీవనమిచ్చి రక్షించుట నీ పని.
జీవనమును సృష్టించుట, పోషించుట, నడిపించుట అనే బృహత్తర క్రమము ప్రకృతిలో  సహజముగా జరుగుచున్నది. దానిని మనిషి స్వాధీనపరచుకొనలేడు. (3వ చరణం వివరణ చూడండి)
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
వారంతా నీ సొమ్ము. వారు క్షీణించుతుంటే నీవు ఊరుకుంటావా?
జీవులలో నిహితమైనది (= ఉంచఁబడినది, దాఁచఁబడినది) నీ ఆధీనములోనున్నప్పుడు, వారి సంక్షేమము సహజంగానే ఆ వ్యవస్థలో అంతర్భాగము. మనిషి ఆందోళనకు బదులు ఆ క్రమము తెలియవలెను.
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా
మేము ఊరకనే ఎన్నో విన్నపాలు చేసుకుంటూ ఉంటాము.
మేము ఈ ప్రాణులను మాతో కలుపుకుని నీకు చేయు విన్నపాలు ఊరకనే పైపైకి చెప్పు మాటలే కానీ వాస్తవముగా తారతమ్యములను వదిలినవారము కాము. అంతే.
గూఢార్థవివరణము: 

నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా” జాగ్రత్తగా గమనించండి ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది స్పురించుచున్నది.

బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా” అనగా వసుధైవ కుటుంబకం మాకు నినాదం మాత్రమే. వాస్తవముకాదు.

రెండవ చరణం:

సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
చర్వితచర్వణాల వేసరించేము గాకా ॥తల్లికి॥

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
అందరికీ నీవే బంధువు. సమస్త కార్యములు నీవే నిర్వహించువాడవు.
ఈ విశ్వములోని సమస్త పరస్పర సంబంధములకు మూలమైనది ఒకే సహజ క్రమము. మానవుడు దానిలో ఒక భాగము మాత్రమే.
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
ఆ సమస్తమును నిర్వహించుట నీ విధి.
జీవన ప్రవాహమును నడిపించు బృహత్తర వ్యవస్థ స్వయంగా పనిచేయుచున్నది. దానిని మనిషి తన భుజాలపై మోసుకొనవలసిన అవసరము లేదు. (3వ చరణం వివరణ చూడండి)
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
దేవా! ఈ భూమిపై నీ కార్యములను నీవు అసంపూర్తిగా వదిలివేస్తావా? (ఉద్ధరిస్తూనే ఉంటావు.​)
దేవా!  నీ కార్యములు అసంపూర్ణములు కావు. సమస్తమును సహజముగా నీలో చేర్చుకుందువు.
చర్వితచర్వణాల వేసరించేము గాకా
(చర్వితచర్వణము = చెప్పిన దానినే మరల చెప్పుట) నమిలినదానినే మళ్లీ నములుతున్నట్లు శ్రమపడుతుంటాము.  మాది వృత్త చలనము
మేము పాతవాటినే నెమరు వేస్తాము.  వాటిలోనే తిరుగుతుంటాము. కానీ మొదటికే వచ్చుచున్న సంగతి  తెలియము. మా ఇప్పటి భావములు కొత్తవని తలచి వేసారుతాము. జనన మరణ​ వృత్త చలనములలో  జీవించుచున్నాము అంతే.
గూఢార్థవివరణము: 

"చర్వితచర్వణాల వేసరించేము" దీనిని భగవద్గీత లోని మూడవ అధ్యాయము 42వ శ్లోకం తోటి అనుసంధానం చేసి చూద్దాం. దీన్ని ఒక బొమ్మ రూపంలో క్రింద పెట్టాను జాగ్రత్తగా పరిశీలించవలసినది.
 
మొత్తానికి చర్వితచర్వణము అన్నది అంటే ఇక్కడే ఈ భూమిపై మనం వర్తుల మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటాము. దీని నుంచి  బయలుపడు మార్గమును అన్వేషించము. అంతే.

మూడవ చరణం:

నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
వలఁ గాచుటకు నీ కిదే పని
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా ॥తల్లికి॥ 

భావము:

కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
నీవు లోకాధిపతి. మేమంతా నీ సేవకులము.
ఈ జగత్తులో మనిషి యజమాని కాదు; సమస్త జీవనవ్యవస్థలో ఒక భాగము మాత్రమే.
యీవలఁ గాచుటకు నీ కిదే పని
మమ్ములను కాపాడుట నీ బాధ్యత.
జీవనమును నిలుపుట, పోషించుట, రక్షించుట అనే సహజ క్రమము ప్రకృతిదే. మనిషి తన వంతు పాత్ర నిర్వర్తించవలెను గాని, సమస్త బాధ్యతను తనదిగా భావించరాదు.
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
ఓ శ్రీవేంకటేశా! నీ శాఖలవంటి మాపై దయ చూపవా?
సమస్త జీవులు ఒకే జీవనవృక్షమునకు చెందిన కొమ్మలవంటివారు. మూలమునకు కొమ్మలను పోషించుట సహజము; దానిని గుర్తించినచో భయం తగ్గును.
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా
నీవే దైవము. మేము ఆకాశం వైపు తలెత్తి ప్రార్థించుట మాత్రమే చేయుచున్నాము.
చివరికి మానవుని వశములో మిగిలేది కర్తృత్వము కాదు; వినయము. జీవితం యొక్క విశాల క్రమమును అంగీకరించి దానియందు విశ్వాసముతో నిలుచుట.

గూఢార్థవివరణము:
 
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా: దేవా మేము నీ శాఖలం. (భగవద్గీత రెండవ అధ్యాయము 17వ శ్లోకం). మనమంతా కూడా ఆ అవ్యయమైన దానిలో భాగములమే. కావున తిరిగి ఈ చరణం లోని రెండవ పంక్తిని చూడండి.

నీ కిదే పని అని పెదతిరుమలాచార్యులు మూడు సార్లు ఎందుకు అన్నారో విచారింతము. మన అనుభవములోని ఒక చిన్న విషయం చూడండి. మన చెయ్యి మీద చిన్నగా గీరుకుందనుకోండీ. మనము దానిని అలావదలి వేస్తే కొన్నాళ్ళకు దాని మీద పెచ్చు కట్టి, పెచ్చు ఊడిపోయి మామూలుగా  అయిపోతుంది. ఈ రకంగా చూస్తే ప్రకృతి తనపని తాను చేసుకుంటూ పోతుంది. అదే మనము ఆ గీరును గోకుతూ ఉంటే, నయమగుటకు ఎక్కువ కాలం పడుతుంది. అలాగే ప్రకృతితో చేయబడిన మనము సహజముగా ఉంటే చాలు అన్న విషయం తెలుస్తుంది.

పైన చెప్పుకున్న భగవద్గీతలోని బొమ్మలో వర్తుల ప్రయాణం చూపబడినది. మనకు ప్రకృతి కంటే బాగుగా తెలుసుననే అహంకారము మనలను ఇక్కడే పట్టి ఉంచుతుంది. ఈ సందర్భంలో అన్నమాచార్యుల క్రింది చరణం స్మరణీయము. 
చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ      హరి
 
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా”: దైవానివి. నీకు తెలుసు. కానీ ఆశగా ఆకాశం వైపు తలెత్తి చూస్తాం. ఆ దిశగా అడుగులు వేయం అంతే.

X-X-X THE END X-X-X

T-339 ఇందుకొరకె యిందరును నిట్లయిరి

  తాళ్లపాక అన్నమాచార్యులు 339 ఇందుకొరకె యిందరును నిట్లయిరి For English Version Press Here   ఉపోద్ఘాతము మనందరిలోనూ అభయయుడైన పరమేశ్వరుడు ఉ...