Tuesday, 3 March 2026

T-309 ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు

 తాళ్లపాక అన్నమాచార్యులు
309 ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
For English version press here

ఉపోద్ఘాతము

ఏమి సేయఁగవచ్చు: ఇది నిరాశావాదం కాదు. అసలు జీవితం సమస్యా కాదు, పరిష్కరించ వలసిన పజిల్‌ కానీ కాదు. మనమున్న స్థితి అలాంటి భావన వచ్చేలా చేస్తుంది. మనము కార్య కారణ సంబంధముల ఆవేశిత క్షేత్రములో నిలబడి చూచు స్థితి.  అనగా మన ఇప్పటి భావనలేవీ ఈశ్వరాధీనమైన చర్యలు కావు. ఏమి సేయఁగవచ్చు?” అని అన్నమాచార్యులు  అడిగినది కచ్చితముగా అలోచించ వలసినదే.

ఈ కీర్తనలో అన్నమాచార్యులు మానవ జీవితాన్ని ఒక పరిష్కరించవలసిన సమస్యగా చూడరు. సాధారణంగా మనము జీవితం ఒక పజిల్‌లా భావించి దానిని పరిష్కరించగలిగితే ఏదో ఒక ఫలితం లేదా ప్రతిఫలం దొరుకుతుందని ఆశిస్తాము. కాని కవి చూపుతున్న దృక్కోణం వేరే. జీవితం పరిష్కరించవలసిన సమస్య కాదు; పరిశీలించవలసిన ప్రవాహం.

మనము సాధారణంగా “చేయుట” మీదే దృష్టి పెడతాము. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో మార్పు తేవాలి అని మనస్సు నిరంతరం చర్యలో పడుతుంది. కాని కవి సూచన వేరే దిశలో ఉంది. మన చర్యల స్వభావం ఏమిటి? అవి ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి? వాటి వెనుక ఉన్న ఆకర్షణలు, భయాలు, ప్రతిస్పందనలు ఏమిటి? — ఇవి గమనించడమే అసలు పరిశీలన.

ఈ పరిశీలనకు సహనం అవసరం. ఎందుకంటే చర్య తక్షణ ఫలితాన్ని కోరుతుంది; కాని అవగాహనకు కాలం కావాలి. మనస్సు ఈ నిరీక్షణను తట్టుకోలేక మళ్లీ మళ్లీ చర్యల వైపే పరుగెడుతుంది. ఈ ఆతురత వల్లే మనము మన చర్యల మూలాన్ని గమనించలేము.

అందువల్ల ఈ కీర్తనలో కవి ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నారు: చర్యలతో ప్రపంచాన్ని (అందులోని 'నేను' కూడా కలిపి) సరిచేయడం మన చేతిలో ఉండకపోవచ్చు. కానీ చర్యల స్వభావాన్ని గమనించడం మాత్రం మనకు సాధ్యమే. ఆ గమనికలోనే మన స్థితి స్పష్టమవుతుంది.

ఈ కీర్తన ఒక నైతిక బోధ కాదు; ఒక పరిశీలన. మానవుడు ఎలా చర్యలలో చిక్కుకొని తిరుగుతున్నాడో చూపిస్తూ — ఆ చర్యల మూలాన్ని నిశ్శబ్దంగా గమనించమని కవి సూచిస్తున్నారు. ఈ అవగాహన కలిగినప్పుడు మాత్రమే మన చర్యల స్వరూపం మారవచ్చును.

"మన దుఃఖానికి కారణం ఈశ్వర సంకల్పం కాదు, మన మనస్సు సృష్టించుకునే వ్యర్థమైన తాపత్రయమేనని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ప్రవహించే నదికి చెయ్యి అడ్డంపెట్టి దారికి తీసుకురావాలని చూసే అవివేకం మన ఆరాటం. జీవితం కఠినమైనదని కాదు, అవశమైన దానితో (ప్రకృతి ప్రవాహంతో) నిరంతరం మల్లయుద్ధం చేస్తున్నందువల్లే మనం డీలా పడిపోతున్నాము."


అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 36-2 సంపుటము: 1-221
ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
తామసపు బుద్ధి కంతలు దూరవలసె ॥ఏమి॥

తెగి దురాపేక్షఁ బడ తివియ గతిలేదుగన
పగగొన్న వగల కూపములఁ బడవలసె
తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
మగుడఁబడి భవముతో మల్లాడవలసె              ॥ఏమి॥

పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన
కోపబుద్ధులచేత కొరమాలవలసె
రూపములఁ బొడగాంచి రోయఁ దరిలేదుగన
తాపములచేఁ బొరల తగులుగావలసె ॥ఏమి॥

తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగన
గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె
పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె          ॥ఏమి॥
Details and Explanations:
పల్లవి:
ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
తామసపు బుద్ధి కంతలు దూరవలసె          ॥ఏమి॥ 
              Telugu Phrase
Meaning
ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
సర్వము ఈశ్వరాధీనము అయినప్పుడు మానవులకు చేయుటకు ఏమీ లేదు. 
తామసపు బుద్ధి కంతలు దూరవలసె
కానీ తామసమునకు లోనై బుద్ధి రహస్య స్థలముల అన్వేషణలో కూరుకుపోయినది ​

సూటి భావము:
వాస్తవముగా మానవులు చేపట్టుటకు కార్యములు ఏమీ ఆదేశీంపబడలేదు.  సర్వము ఈశ్వరాధీనము. కానీ తామసమునకు లోనైన బుద్ధి రహస్య స్థలముల అన్వేషణలో కూరుకుపోయినది.

సూచిత భావము
సర్వము ఈశ్వరాధీనమని గ్రహించక ఏమీ చేయుటకు లేని స్థితిని తట్టుకోలేని బుద్ధి, ఏదో చేయ బోయి కాని పనులలో చిక్కుకొనును.

గూఢార్థవివరణము:
ఏమి సేయఁగవచ్చు: ఏమీ చేయక ఉండుట ఏల కష్టమో తెలుసుకుందాం. ఏమీ చేయని మనసుకు కాలము ఎలా గడుపుట అన్నదే ముఖ్య సమస్య​. అనగా మానవుని మనస్సు కాలముతో  కలిసి పనిచేయును. కాలము అను గడియారము లేక అది విచ్ఛిన్నమగును. కాలముతో క్షీణించుట ప్రకృతి స్వభావము. కానీ, మనము దానిని మరల మరల పునశ్చరణ చేయుటవలన నిలిపి యుంచుదుము.

మనము ఏ పదార్థముతో చేయబడిన వారమో అదియే మనలను  నిర్దేశించు చున్నది. అటులనే నేను, మనము అను ఊహ కూడాను. మనకై మనము పరీక్షించుకొననంత వరకు ఈ వాస్తవమును గ్రహించుట కష్టమే. ​

కల్టివేషన్ ఆఫ్ ఐడియాస్ (విత్తుటకు సిద్ధముగా ఉన్న వ్యవసాయ క్షేత్రము): దీనిపై రెనే మాగ్రిట్టే గారు వేసిన “ద కల్టివేషన్ ఆఫ్ ఐడియాస్” అను పేరు గల 1928వ సంవత్సరపు అధివాస్తవిక చిత్రము ద్వారా మరి కొంత విశదపరచుకుందాం.

ఇది ఒక ప్రకృతి దృశ్యము చూపుతున్నట్లు అనిపిస్తుంది. కనబడుతున్న రెండు కాండములు కాళ్ళు అనుకుంటే వాని శిఖరములు పైభాగములు ఆకులు, కొమ్మలు కలిసిపోయి ఒక మనిషిని తలపింప చేయుచున్నవి. అస్పష్టంగా ఉన్నటువంటి ఆకుల గుంపులు మన మనసులో మెదడు ఆలోచనల వంటివి అనుకోవచ్చు. అతడు ఒక నది లాంటిది దాని ముందు నిలబడి తిలకిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ మనిషి ఒక కృత్రిమమైన చదును నేలపై నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆ నది అతడి కాళ్ళ దగ్గర లోతు లేతక్కువగాను, దూరం పోతున్నకొలది లోతు, వేగము పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ కృత్రిమ గట్టు మీద  నిలబడిన వానికి ఆ నదిలో తాను తప్ప తక్కినవారందరూ కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తుంది”. జాగ్రత్తగా గమనిస్తే ఆ బొమ్మ మొత్తం నిద్ర నుండి మెలుకువలోనికి వచ్చుచూ, అతడు పూర్తిగా స్పృహలో లేనప్పుడు ఒక వ్యక్తి అనుభూతి చెందగల వాతావరణాన్ని చిత్రం చూపిస్తుంది.

తామసపు బుద్ధి కంతలు దూరవలసె:   ఈ రకముగా మానవుల అందరి ఆలోచనా విధానములు ఒక సార్వజనిక ఊహలతో (ఆ నది లాంటి దానితో) కలుపబడి దానికి అనుగుణముగా ప్రవర్తించుటకు ఉద్యమిస్తాడు. అందుకనే ఒక ప్రాంతము వారు ఒకే విధమైన సామాన్య స్వభావమును కలిగి వుండడం వింత కాదు. ఈ విధముగా పైపైకి మనం స్వతంత్రముగాఁ యోచనలు చేయుచున్నట్లు కనపడినాను అంతర్గతముగా మనము స్వతంత్రులము కాము. ఆ చిత్రములోని వ్యక్తి కృత్రిమమైన చదును నేలపై నిలబడినట్లు చూపడం  ముఖ్యంగా గమనించ తగ్గది. మనము ప్రయత్నపూర్వకముగా కట్టుకొన్న పునాదులపై నిలబడి యోచన చేయువారము.

మన శరీరము, జ్ఞాపకములు, నిక్షిప్తమై వున్న అనుభవములపై నిలబడివున్నవి ఆ పునాదులు. ఇవి అన్నియును (నేత్ర​, శ్రవణ​, ఘ్రాణ​, జిహ్వ శరీర) స్పర్శ ప్రధానముగానూ సుఖము, ఆనందము కేంద్రముగాను ఉత్తేజ  పరచబడుచున్నవి. ఆ విధంగా అవేశమను క్షేత్రములో ఉన్న మనసు ఎదో ఒక వైపు లాగ బడును. ఇతరుల మాదిరిగానే తాను కూడా ఆ ప్రవాహములో అవశముగా కొట్టుకొనిపోవుచున్నానని గ్రహించు వానికి సత్యం వైపు నడుచుటకు అవకాశం కలదని చెబుతున్నారు. 

తామసపు బుద్ధి కంతలు దూరవలసె  అనేది అవివేకముగా కట్టుకున్న మన మనో బలము విచ్ఛిన్నమై మనకు అలవాటైన మార్గములోకి ఆ బొమ్మలోని చెట్లవలె నిస్సహాయముగా నెట్టి వేయ బడుటను సూచిస్తోంది. ఈ ఒత్తిళ్ళలో నిజ స్థితిలో నిలబడలేని బుద్ధి కార్యమును ఆలంబనగా చూచి రహస్య మార్గములలోకి దూరుతుంది. ఈ పక్కదారుల అన్వేషణనే అన్నమాచార్యులు సంక్షిప్తంగా తామసపు బుద్ధి కంతలు దూరవలసె” అని చెప్పారు. ఇది నైతిక విమర్శ కాదు; మనస్సు తన స్వభావం వల్ల ఎలా ఆలోచనలను “విత్తి పెంచుకుంటుందో” అనే పరిశీలన.

మొదటి చరణం:

తెగి దురాపేక్షఁ బడ తివియ గతిలేదుగన
పగగొన్న వగల కూపములఁ బడవలసె
తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
మగుడఁబడి భవముతో మల్లాడవలసె ॥ఏమి॥

Telugu Phrase
Meaning
తెగి దురాపేక్షఁ బడ తివియ గతిలేదుగన
(మోక్షము కొరకు) తీవ్రమైన ఆకాంక్షతో సాహసించు సంకల్పము మనకు కనిపించుటలేదు
పగగొన్న వగల కూపములఁ బడవలసె
అందువలన ప్రతీకార, మాయా, వంచనల కూపములలో పడిపోతున్నాము
తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
మోహమనే జలములను దాటి బయటకు రావాలనే సంకల్పము లేదు
మగుడఁబడి భవముతో మల్లాడవలసె
(మగుడఁబడి=వక్రించబడి) వక్రించిపోయి జీవనముతో మల్లయుద్ధం చేయవలసి వచ్చుచున్నది
 

సూటి భావము:
మానవులకు మోక్షముపై తీవ్రమైన ఆకాంక్ష కనబడదు. అందువల్ల మోహమనే జలములను దాటి బయటకు రావాలనే ప్రయత్నము ఉండదు. అటువంటి స్థితిలో మనిషి మాయ, ప్రతీకార భావముల కూపములలో పడిపోతూ జీవనముతో మల్లయుద్ధము చేయవలసి వచ్చును.

గూఢార్థవివరణము:
ఈ చరణంలో అన్నమాచార్యులు మానవుని అంతర్గత స్థితిని అద్దం పెట్టి చూపుతున్నారు. మనము సాధారణంగా “విముక్తి” గురించి మాట్లాడుతాము. కాని ఆ దిశగా సాహసించు తీవ్రమైన ఆకాంక్ష మనలో నిజంగా వుందా? అనే ప్రశ్నను కవి ముందుంచుతున్నారు. “తగు మోహసలిలంబు దాఁట మతి లేదుగన” అనే వాక్యము ఈ విషయాన్ని స్పష్టపరుస్తుంది. అనగా మోహమనే ప్రవాహాన్ని దాటి బయటకు రావాలనే మనసు సిద్ధపడుటలేదు. అయితే ప్రపంచానికి ఆ ప్రయత్నములో వున్నామని చూపుటలో మాత్రం వెనుకాడము. దీనికి దైనందిన జీవితంలో ఎన్నో ఉదాహరణలను గమనించవచ్చు.

ప్రబలమైన సంసిద్ధత లేకపోవుట వలన, జీవితం పట్ల మన ఉదాసీనత పైబడినప్పుడు మనస్సు మరొక దారిని చేపడుతుంది. అది పగ, ప్రతీకారము, వంచన, స్వప్రతిష్ఠ వంటి భావనలతో నిండిన “వగల కూపములలో” పడిపోవడం. ఇవి మనిషిని ముక్తి వైపు లాగవు; మరింత లోతుగా బంధించును.

ఈ స్థితిలో జీవితం క్షణక్షణం మల్లయుద్ధముగా మారుతుంది. జీవనముతో పోరాడుతూ, తాను గాయపడుతూ ముందుకు సాగవలసి వస్తుంది. “మగుడఁబడి” అనే పదం ఈ వక్రీకరణను సూచిస్తుంది — మనస్సు తన సహజ స్థితిని కోల్పోయి వక్రముగా ప్రవర్తించుట.

ఇక్కడ నైతిక విమర్శ లేదు. మన చర్యల పర్యవసానమును మాత్రమే చూపుతున్నారు. విముక్తి వైపు తిరగని మనస్సు సహజంగానే ప్రతిస్పందనలు, సంఘర్షణలు, పోరాటములలో చిక్కుకుంటుందని అన్నమాచార్యులు సూచిస్తున్నారు.

రెండవ​ చరణం:

పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన
కోపబుద్ధులచేత కొరమాలవలసె
రూపములఁ బొడగాంచి రోయఁ దరిలేదుగన
తాపములచేఁ బొరల తగులుగావలసె ॥ఏమి

Telugu Phrase
Meaning
పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన
పాపకర్మలను పూర్తిగా తొలగించగల శక్తి మనకు లేదు
కోపబుద్ధులచేత కొరమాలవలసె

(కొరమాలవలసె = నిరుపయోగముగా వుండ వలసె) కోపం, ప్రతిస్పందనల చేత నిరుపయోగముగా వుండ వలసె

రూపములఁ బొడగాంచి రోయఁ దరిలేదుగన

బాహ్య రూపాల ఆకర్షణను పూర్తిగా వదలలేము

తాపములచేఁ బొరల తగులుగావలసె

అందువల్ల వాటివల్ల కలిగే తాపాలకు గాయపడవలసి వస్తుంది


సూటి భావము:
పాపకర్మలను పూర్తిగా నిర్మూలించగల శక్తి మనకు లేదు. అందుచేత కోపము, ప్రతిస్పందనలు, బాధల చేత నిరుపయోగముగా వుండ వలసె. బాహ్య రూపాల ఆకర్షణను వదలలేక​ వాటివల్ల కలిగే తాపములకు మళ్లీ మళ్లీ చిక్కుకుని జీవనము గడుపుతాము.

గూఢార్థవివరణము:
పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన” అనే మాట ముఖ్యం. మానవులకు పాపపరిహారములు చేసుకొను శక్తిలేదు. కానీ ఆ వాస్తవాన్ని అంగీకరించుటకు మనస్సు సిద్ధపడదు. సత్యమును ఒప్పుటకు బదులు లోలోపల మగ్గిపోతాడు. లేదా మొదటి చరణంలో చెప్పిన వగల కూపములలో” పడిపోతాడు. అటుల మగ్గిన క్షేత్రములోను, విషయములలో చిక్కుకున్న మనసుకు కోపము సహజముగా జనియించును. కోపము నుండి విచక్షణా రాహిత్యాము, అక్కడ నుండి స్మృతిభ్రంశము అందునుండి అధోగతి పాలౌతాడు. అట్టివాడు నిరుపయోగముగా జీవిత మును గడుపును.
 
రూపము అనునది మదిలో నాటుకొన్న  ప్రాథమిక చిత్రము. అలా నాటుకొన్న "రూపము" అనునది పాపములాగే అంటుకొని వుంటుంది. వదలదు. రూపాలు, కల్పించిన అనుభవాలు, ఆసక్తిని నిలిపి నిరంతరం తమవైపు లాగుతూనే వుంటాయి. ఆరకముగా వాటిలో పొర్లుతూ తగిలి వుంటాము.

ఇక్కడ కూడా కవి నైతిక విమర్శ చేయడం లేదు. జీవితం ఎలా కోపం, ఆకర్షణ, బాధల చక్రంలో తిరుగుతుందో మాత్రమే చూపిస్తున్నారు. పైన పేర్కొన్న చిక్కులన్నీ ఆయా స్థితులనుండి బయటకు వచ్చుటకు చేయు వృధాయత్నములు. అవి ఒక రకముగా బోనులో చిక్కుకున్న పులి బయటకు వచ్చుటకు చువ్వల మధ్య తల దూర్చుట వంటివి. ఆ నిరర్థకత​, నెమ్మదిగా కోపము, బాధ, శోకముగా మారి దిగజార్చునే కానీ బయటపడు మార్గము కానరాదు.  

మూడవ​​ చరణం:
తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగన
గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె
పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె ॥ఏమి॥
Telugu Phrase
Meaning
తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగన
తిరువేంకటాచలాధిపునికి అహమును సమర్పించుకొనలేక
గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె
(గరిమెచెడి = సమత్వము చెడి) సమదృష్టి చెడి విషయములకు బానిసయై గడుపవలసె
పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
విషయములలో వ్యస్తుడై పరతత్వమూర్తిఁని తలచుటకు సమయము లేక
దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె
ముందర ఉన్న దొరతనము ఇంకిపోయి ఆత్రుత ఉసిగొల్పగా నిష్క్రియుడుగా మిగిలిపోయె.
సూటి భావము:
తన అశక్తతను గమనించినప్పటికీ తిరువేంకటాచలాధిపునికి అహమును సమర్పించుకొనలేక, సమత్వం కోల్పోయి విషయములకు బానిసవై జీవించవలసి వస్తుంది. విషయ వ్యాపారంలో మునిగిపోయి పరతత్వమూర్తిని తలచుటకు కూడా సమయము ఉండదు. అలా జీవిస్తూ ముందర ఉన్న స్వతంత్ర భావన క్రమంగా కరిగిపోతుంది; చివరకు ఆత్రుతతో నిండిన నిష్క్రియ స్థితి మిగులుతుంది.

గూఢార్థవివరణము: 
ఈ చరణంలో అన్నమాచార్యులు మానవుని స్థితిని ఒక మూల కారణానికి చేర్చుతున్నారు — అహంకారాన్ని విడువలేని మన స్థితి.

తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగనఅనే వాక్యము కేవలం దేవాలయారాధనను సూచించదు. ఇక్కడ “గొలువుట” అనగా అహమును సమర్పించుట, అనగా మనం నిర్మించుకున్న వ్యక్తిత్వ కేంద్రాన్ని వదలుట. ఆ సమర్పణ జరగనప్పుడు మనస్సు తన సహజ సమత్వాన్ని నిలుపుకోలేడు. అందుకే “గరిమెచెడి విషయకింకరుఁడు గావలసెఅని కవి అంటారు. సమత్వము చెడిన వెంటనే మనస్సు విషయాల వైపు జారిపడి వాటికే బానిసవుతుంది.

ఈ స్థితిని ఒక రూపకంతో చెప్పాలంటే — మనం మధ్య అక్షంపై నిలబడలేకపోవుట. సమతుల్య స్థితి కోల్పోయిన వెంటనే మనస్సు అనుభవాల ప్రవాహంలోకి జారిపోతుంది. అప్పుడు మన దృష్టి మొత్తం విషయాలపై వ్యయమవుతుంది. అందుకే కవి అంటారు —“పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన”.

ఇక్కడ “పరతత్వమూర్తి” అనేది ఎక్కడో వేరే లోకంలో ఉన్న దేవుడు కాదు. అది మన అనుభవ క్షేత్రానికి అతీతమైన మూల సత్యం. అది మనలోనే ఉన్నా మన అనుభవాల నిర్మాణంలో భాగం కాదు. అందుకే మనస్సు విషయాలలో మునిగిపోయినపుడు దానిని గ్రహించుటకు అవకాశమే ఉండదు.

ఈ విక్షేపం వల్ల మనిషి తన సహజ స్వాతంత్రమును కోల్పోతాడు. కవి దీనిని “దొరతనం బుడిగిఅని చెప్పారు. ఇక్కడ “దొరతనం” అనగా బాహ్య అధికారము కాదు; అంతర్గత సమతుల్య స్వాధీన స్థితి. ఆ స్థితి కరిగిపోయినపుడు మనిషి విషయాల చేత నడిపించబడే జీవిగా మారిపోతాడు. ఆ తరువాత అతని జీవితం ఆత్రుత, అసంతృప్తి, నిరుపయోగతలతో నిండిపోతుంది — “యాతురుఁడు గావలసె”.

అందువల్ల ఈ చరణం చెప్పేది స్పష్టము:మనిషి అనుభవిస్తున్న సంఘర్షణల మూలం బయట ప్రపంచంలో లేదు. తన సహజ సమతుల్యతను కోల్పోయి, అహంకారాన్ని వదలలేక విషయాల ప్రవాహంలో జారిపోవడమే అసలు కారణం. 

కీర్తన​ సారం
ఇప్పుడు ఈ కీర్తన పల్లవి నుండి చివరి చరణం వరకు గల గమనమును హిల్మా ఆఫ్ క్లింట్ వేసిన విచారణా వృక్షము – నం. 5” చిత్రముతో పోల్చి చూడవచ్చు. (ఈ చిత్రంపై సమగ్ర వ్యాసము కొరకు ఇక్కడనొక్కండి.) 

పల్లవిలో కవి ఒక ప్రాథమిక విషయాన్ని సూచిస్తారు: మనసుకు చేయుటకు ఏమీ లేకపోయినప్పుడు అది నిశ్చలంగా నిలబడలేక అనవసరపు మార్గములను వెతుకుతుంది.

మొదటి చరణంలో ఆ స్థితి మరింత స్పష్టమవుతుంది. మోహమనే ప్రవాహాన్ని దాటుటకు సాహసం లేక మనిషి జీవితముతో మల్లయుద్ధము చేయవలసి వస్తుంది.

రెండవ చరణంలో ఆ పోరాటం మరొక రూపం దాల్చుతుంది. కోపము, ఆకర్షణలు, ప్రతిస్పందనలు మనసును ఆవరించగా జీవితం నిరర్థక చక్రములో తిరుగుతుంది.

మూడవ చరణంలో కవి మూల కారణాన్ని చూపుతారు. అహంకారాన్ని సమర్పించలేక సమత్వము చెడిపోవుటవలన మనిషి విషయములకు బానిసవుతాడు; తనలో సహజంగా ఉన్న స్వాధీన స్థితి (దొరతనం) క్రమంగా కరిగిపోతుంది.

ఈ విధంగా ఈ కీర్తన మనిషి అనుభవించే జీవిత గమనాన్ని చూపిస్తుంది —నిశ్చలంగా నిలబడలేని మనస్సు, మోహములో పోరాటం, కోపము–ఆకర్షణల చక్రం, చివరకు సమత్వాన్ని కోల్పోయిన స్థితి.


X-X-The END-X-X

Monday, 2 March 2026

A 309 Tree of Knowledge No.5 (విచారణా వృక్షము – నం. 5)

HILMA af KLINT
 విచారణా వృక్షము – నం. 5” (Tree of Knowledge No.5) – 
వివరణము

హిల్మా ఆఫ్ క్లింట్ వేసిన విచారణా వృక్షము – నం. 5” అనే చిత్రం సాధారణ ప్రకృతిలో పుట్టిన చెట్టు కాదు. ఇది ప్రపంచాన్ని మనం విచారణ చేసి అనుభవించే విధానాన్ని సూచించే ఒక సంకేతాత్మక చిత్రము. ఈ చిత్రంలో ఉన్న ఆకృతులు, రంగులు,  మరౘుట్టువలె తిరుగుతు పైకి ప్రాకు శంఖాకారపు గీతలు (స్పైరల్) — ఇవన్నీ కలిపి ఒక అంతర్గత నిర్మాణాన్ని సూచిస్తాయి. వీనికి విడివిడిగా అర్ధములున్నను ఇవన్నీ కలిపి ఏకకాల వీక్షణములో గమనించమని సూచన. టూకీగా చెప్పాలంటే, క్రింది భాగము ప్రత్యక్ష అనుభవానికి అందని స్థితిని సూచించగా, పైభాగము మనకు గ్రాహ్యమయ్యే ప్రపంచాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ అక్షానికి కుడి వైపు కనిపించేది మన అనుభవ ప్రపంచమని, మరొక వైపు మనలోనే ఉన్నా మనకు తెలియని వాస్తవాన్ని సూచించునని భావించవచ్చును.

ఈ చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి మొదట దిగువ భాగంలో కనిపించే గుడ్డు ఆకారాన్ని గమనించాలి. ఆ గుడ్డు ఆకారంలో రెండు పక్షుల వలె కనిపించే ఆకృతులు ఒక కష్టతరమైన కానీ సున్నితమైన సమతుల్యతలో నిలబడి ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ సమతుల్యతే మొత్తం చిత్రానికి ఆధారం. ఈ సమతుల్యత నుండే పైకి ఒక తెల్లని నిలువుటక్షరేఖ (vertical axis) లాగా నిలిచిన సన్నని కాంతి రేఖ​ పైకి విస్తరించినట్లు కనిపిస్తుంది. ఈ అక్షరేఖను కేంద్రంగా తీసుకున్నపుడే చిత్రమంతా స్పష్టంగా గమనించగలము.

ఈ అక్షాన్ని చుట్టి రెండు (శంఖాకారపు వక్రములు) స్పైరల్ ఆకృతులు కనిపిస్తాయి. అవి ఒకదానిని మరొకటి దాటి తిరుగుతున్నట్లు ఉంటాయి. మనము ఈ విభిన్న దిశలలో ఎగబ్రాకు స్పైరల్'ని  “నేను” మరియు “ప్రపంచం” అని విడదీసి అనుభవించే మానసిక విభజనకు ప్రతీకగా చూడవచ్చు. ఈ విభజన వల్లే 'మనం వేరు ప్రపంచం వేరు' అన్నట్లుగా అనిపిస్తుంది. 

చిత్రములో కింద భాగంలో ఉన్న పెద్ద వృత్తం మనం నివసించే కార్య–కారణ ప్రపంచాన్ని సూచిస్తుంది. ఈ వృత్తం నుండే స్పైరల్ కదలికలు ప్రారంభమై పైకి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నిర్మాణం భారతీయ తత్వశాస్త్రంలో చెప్పబడిన “సంసార వృక్షము”ను గుర్తు చేస్తుంది. భగవద్గీతలో చెప్పబడినట్టు, ఈ ప్రపంచ వృక్షం యొక్క అసలు రూపాన్ని సాధారణంగా గ్రహించలేమని చెప్పబడింది — “న రూపమస్యేహ తథోపలభ్యతే”(15-3). 

చిత్రములో మధ్యభాగములో కుడివైపు ఒక మండలంలాంటి ఆకృతి కనిపిస్తుంది. అది నాలుగు చేపలు తలలు ఒక కేంద్రానికి ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆకృతి మనం ప్రపంచాన్ని గ్రహించే స్థితిని సూచిస్తుంది.   

ఈ చిత్రంలోని ఆకుపచ్చ ఆకులు ఒక ముఖ్యమైన సంకేతం. అవి సంసార వృక్షపు పత్రాలను సూచిస్తాయి. ఆ పత్రము ఆ కార్య–కారణ ప్రపంచమునుంచి పుట్టినదని చెప్పటానికి ఆకు పైభాగము ఆ పెద్ద వృత్తం వైపు మళ్ళి వుంది. ​ఆ ఆకు ఈనెల వెంబడి మన చూపు వుంటుందని ఆ మండలంలాంటి ఆకృతిని చూపిన స్థానముతో తెలియవచ్చును.  మనము ఒక కేంద్రాన్ని ఊహించి దాని చుట్టూ అనుభవాలను కూర్చి అర్థం చేసుకుంటాము. కాని ఆ కేంద్రం నిజంగా ఉన్నదా? లేక మన అనుభవాల వల్ల ఏర్పడిన ఒక ఊహా నిర్మాణమా? అనేది స్పష్టం కాదు. 

మనం గ్రహించగలిగింది ఈ పత్రమంతటిని కాక ఆ యీనె చూపు  చిన్న కోణం మాత్రమే. కావున మనకు ఏ స్థితిలోను ఆ వృక్షము యొక్క సంపూర్ణ రూపం మనకు ప్రత్యక్షమవ్వదు. ​ గీతలోని లో “ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్” అని చెప్పినట్లు మనము ఆ ఆకు నంతా గ్రహించుట​. కానీ అది మనమున్న స్థితిలో సాధ్యముకాదు అని ఈ చిత్రము ద్వారా తెలియుచున్నది. 

ఈ విధంగా చూస్తే విచారణా వృక్షము – నం. 5” అనే చిత్రం ఒక ఆధ్యాత్మిక చిత్రరూప దర్శనం. ఇది ప్రపంచాన్ని ఒక స్థిరమైన వస్తువుగా కాకుండా, విభజనలతో నడిచే అనుభవ ప్రవాహంగా చూపిస్తుంది. ఈ ప్రవాహాన్ని సరిగా గమనించాలంటే మధ్యలోని అక్షరేఖపై నిలబడిన సమతుల్యత అవసరం. ఆ సమతుల్యతలో నుండే ప్రపంచ కదలికను స్పష్టంగా గమనించగలము. అందువలన ఈ చిత్రం కేవలం ఒక కళాఖండం కాదు. ఇది మనం ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తున్నామో, ఆ అనుభవానికి ఆధారం ఏమిటో అనే ప్రశ్నలను ముందుకు తెచ్చే సంకేతాత్మక రూపకము.


Interpretative Note

Hilma af Klint’s Tree of Knowledge – No. 5 is not a representation of a natural tree. It is a symbolic diagram suggesting the way human beings perceive and interpret the world. The shapes, colours, and upward spiralling forms combine to reveal an inner structure of experience. While each element may carry its own meaning, the painting invites us to observe the entire structure simultaneously. In nutshell the lower portion may be taken as imperceptible world, while the upper part is the experienced world. The region to the right of this axis may be understood as the world of lived experience, while the other side may be seen as pointing to a reality that exists within us but remains largely unknown.

To understand the painting, one must first notice the egg-shaped form at the bottom. Within this form appear two bird-like figures standing in a delicate and precarious balance. This equilibrium seems to be the foundation of the entire diagram. From this balance a thin white vertical axis rises upward through the centre of the painting. Only by standing on this axis can the movement of the entire structure be clearly observed.

Around this axis appear two spiral forms twisting upward and crossing one another. These spirals may be seen as representing the fundamental division through which human beings experience the world — the separation between observer and observed, self and world. Once this division begins, perception unfolds in multiple directions.

The large circular field at the lower portion of the painting may represent the world of cause and effect in which human life unfolds. From this field the spiral movements seem to emerge and extend upward. This structure recalls the symbolic “tree of the world” described in philosophical traditions, where the true form of the world-tree cannot easily be perceived. What we normally encounter are only its outward manifestations.

In the middle portion of the painting appears a mandala-like form, resembling four fish meeting head-to-head at a centre. This form may represent the position from which human beings attempt to understand the world. From this position we construct interpretations and centres of meaning. Yet the existence of such a centre may itself be uncertain — it may arise from the accumulation of many partial views rather than from an actual fixed origin.

The green leaves in the painting also function as an important symbol. They may be understood as representing the leaves of the cosmic tree — the visible expressions of the world. Yet what we perceive is never the whole leaf. Our attention follows only a narrow radial line along its vein. From this limited viewpoint we construct an understanding of the whole.

Thus what appears to us as knowledge may in fact be only a partial perception shaped by our position of observation. The painting quietly suggests that the full structure of the tree can never be grasped completely from any single viewpoint.

Seen in this way, Tree of Knowledge – No. 5 becomes a profound visual meditation. It does not present the world as a fixed object but as a dynamic structure shaped by division, perception, and interpretation. The delicate balance at the base of the painting — symbolised by the egg and the poised forms within it — provides the only stable reference point.

From that equilibrium emerges the axis of observation. From that axis the spiralling movements of the world become visible.

Thus the painting invites the viewer not merely to interpret its symbols, but to question from where and how the world itself is being observed.

Saturday, 28 February 2026

T-308 సులభమా మనుజులకు హరిభక్తి

 తాళ్లపాక అన్నమాచార్యులు
308 సులభమా మనుజులకు హరిభక్తి
For English version press here

ఉపోద్ఘాతము

చారిత్రాత్మకంగా చూస్తే అన్ని కాలములలోనూ మనుష్యులు తమను ఇతరులకంటే పవిత్రులమని ప్రకటించుకోవడం కనిపిస్తుంది. మన దేశంలోనూ ఈ ప్రవృత్తి కనిపిస్తుంది. ఈ ధోరణిని గమనించిన అన్నమాచార్యులు — సులభమా మనుజులకు హరిభక్తి” అని ప్రశ్నించారు. 

తపస్సులు, యాగయజ్ఞాలు, తీర్థయాత్రలు — ఇవన్నీ మనిషి చేసే ఆధ్యాత్మిక ప్రయత్నాలే. అయితే అవి కాలపరిమితిలో జరిగే క్రియలు. వాటివల్ల కొంత శుద్ధి కలిగినా, అంతర్గత బంధము పూర్తిగా తొలగిపోతుందా అనే ప్రశ్నను కవి మెల్లగా ముందుంచుతున్నారు. అన్నమాచార్యుల పరిశీలనలో భక్తి అనేది బాహ్య ఆచారాల ఫలితం కాదు; అది అంతరంగ సమ్మతి. వలనొంది” అనే పదంలో అదే భావం దాగి ఉంది — ఎలాంటి అడ్డంకి లేకుండా, అంతరంగమంతా ఏక భావముతో ఒప్పుకొని నిలబడే స్థితి. 

అది అంతర్గత పరివర్తన.
అటువంటి సంపూర్ణ తాదాత్మ్య స్థితి — సులభమా?


అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 24-2 సంపుటము: 1-144

సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

కొదలేని తపములు కోటానఁగోటులు
సదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
అనఘుఁడై చేసిన యటమీఁద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు
నరలేక సేవించి నటమీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట ॥సులభమా 

Details and Explanations:
పల్లవి:

సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట పల్లవి  

              Telugu Phrase
Meaning
సులభమా మనుజులకు హరిభక్తి
మానవులకు హరిభక్తి అంత సులభమా?
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా
(వలనొంది = అడ్డంకి లేకుండా సంసిద్ధమగుట) — సంపూర్ణ సమ్మతితోనే కదా వైష్ణవుడగుట?

సూటి భావము:
సంపూర్ణ సమ్మతితో  వైష్ణవుడగు వానికి హరిభక్తి  సులభముకాదా?

గూఢార్థవివరణము:
వైష్ణవుడగుట”
వైష్ణవుడగుట అనేది పేరు కాదు; ఆచారం కాదు; బయటి గుర్తింపు కాదు. పునీతుడగుట​.
“వలనొంది”
“వలనొంది”అనగా ఏ అడ్డంకి లేకుండా, ఏ షరతు లేకుండా, అంతరంగమంతా ఒప్పుకొని నిలబడుట. కాని ఏ అడ్డంకులులేని సమర్పణ సులభమా? అటువంటి సమర్పణకు సిద్ధంగాలేని మనము హరి భక్తి అనే మాటను సులభంగా పలుకుతున్నామా? ప్రతిబంధాలను (అభిలాషలు, భయాలు, ప్రతిష్ఠ, అభిమానాలు)

పూర్తిగా విడిచి పెట్టకుండానే తనను భక్తుడిగా భావించుకోవాలని చూస్తాడు. ఇక్కడ​ మానవుని నైజము స్పష్టము.

మొదటి చరణం:

కొదలేని తపములు కోటానఁగోటులు
సదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట ॥సులభమా 


Telugu Phrase
Meaning
కొదలేని తపములు కోటానఁగోటులు
అంతులేని తపస్సులు — కోట్లకొలది సాధనలు
సదన నాచరించి యటమీఁద
అవన్నీ క్రమంగా ఆచరించిన తరువాత కూడా
పదిలమైన కర్మబంధము లన్నియు
గట్టిగా పట్టుకున్న కర్మబంధములన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట
వాటినన్నిటిని విడిపించుకొని గానే కదా వైష్ణవుడగుట
 

సూటి భావము:
కోటానుకోట్లు తపస్సులు ఆచరించినా — గట్టిగా పట్టుకున్న కర్మబంధములు పూర్తిగా విడిపోవాలి. అప్పుడు గానీ నిజమైన వైష్ణవుడగుట సాధ్యం కాదు.

గూఢార్థవివరణము:
“కొదలేని తపములు కోటానఁగోటులు” ఇక్కడ అన్నమాచార్యులు తపస్సును తక్కువ చేయడం లేదు. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంత సాధన చేసినా అంతం లేదు. ముఖ్యంగా తీరవలసినది కర్మబంధము. అందుకే “పదిలమైన కర్మబంధము” అని కష్టసాధ్యమైన విషయమును సూచించారు.
 
సాధనల పరిణామము కాల పరిమితిలోనిది. కావున అది  విముక్తి కాజాలదు. బంధముల నుండి నిజమైన విముక్తి ఆత్మసాక్షి గుర్తించ లేనిదని ముందటి కీర్తనలో తెలుసుకున్నాం. అనగా “వైష్ణవుడగుట” అంటే —బయటి గుర్తింపు కాదు; తానుకూడా గుర్తించలేని స్థితి. బంధముల నుండి విముక్తి పొందిన అంతర్గత స్థితి.

రెండవ​ చరణం:

తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
అనఘుఁడై చేసిన యటమీఁద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

Telugu Phrase
Meaning
తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
లక్షల సంఖ్యలో యాగయజ్ఞాది కర్మలు చేయుట
అనఘుఁడై చేసిన యటమీఁద
అపరాధము లేకుండా, శుద్ధితో చేసినా
జననములన్నిట జనియించి పరమపా-
అనేక జన్మములు అనుభవించి
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట
పరమపవిత్ర స్థితిని పొంది గాని వైష్ణవుడగుట కాదా?

సూటి భావము:
లక్షలాది యాగయజ్ఞములు చేసినా, అవి ఎంత నిష్ఠతో చేసినా — అనేక జన్మములు గడిచిన తరువాత కదా పరమపవిత్ర స్థితి చేరునది. అపుడు గదా వైష్ణవుడగుట.

గూఢార్థవివరణము:
యజ్ఞాది కర్మలు ఎంత నిష్ఠతో చేసినను అవి కార్య–కారణ సంబంధంలో నిలుస్తాయి. అవి కాలపరిమితిలో జరిగే క్రియలు. అందుచేత అవి మనుష్యుని జీవితాన్ని కొంత శుద్ధి చేయగలిగినా, అంతర్గత బంధాన్ని పూర్తిగా తొలగించగలవా అనే ప్రశ్నను కవి మెల్లగా ముందుంచుతున్నారు.
 
అన్నమాచార్యులు తీవ్రముగా పరిశీలించ వలసిన  విషయాన్ని చెబుతున్నారు. అయ్యలారా లక్షలాది యాగయజ్ఞాది కర్మలు చేసినను అనే జన్మలు ఎత్తవలసి వుండును. తర్వాతి క్షణంపైననే అదుపులేని మనము ఈ జన్మ తరువాత మరు జన్మలో ఏమి జరుగునో ఊహించలేము.  కావున “వైష్ణవుడగుట”కు ఇవి మార్గములు కావని పరోక్షముగా సెలవిచ్చుచున్నారు.

మూడవ​​ చరణం:

తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు
నరలేక సేవించి నటమీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట ॥సులభమా

Telugu Phrase
Meaning
తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు
అనేక తీర్థస్థలములను మళ్లీ మళ్లీ సందర్శించుట
నరలేక సేవించి నటమీఁద
కష్టపడుతూ, నియమంతో వాటిని సేవించుట
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ

గజరాజును రక్షించిన తిరువేంకటాచలాధిపతి కృపవలన కాదా 
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట
అప్పుడు గదా వైష్ణవుడగుట

సూటి భావము:

మానవులు ఎన్నో తీర్థస్థలములను సందర్శించి, వాటిని భక్తితో సేవించినా — చివరకు తిరువేంకటాచలాధిపతి కృపవలన గాని వైష్ణవుడగుట సాధ్యమా?


గూఢార్థవివరణము: 

ఈ చరణంలో అన్నమాచార్యులు తీర్థయాత్రలు, పవిత్ర స్నానాలు వంటి ఆచారాలపై దృష్టి సారిస్తారు. పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం, అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించడం మనుష్యునికి పవిత్రత​ ఇస్తాయని సాధారణంగా నమ్ముతారు. కవి ఈ ఆచారాలను తిరస్కరించరు. కానీ అవి అంతర్గత పరివర్తనకు సరిపోతాయా? అనే ప్రశ్నను మెల్లగా ముందుకు తెస్తారు. నిజమైన శుద్ధి బాహ్య జలస్నానం వల్ల కాక, అంతరంగ శుద్ధి వల్లనే కలుగుతుంది అని సూచన.
 
ఈ భావం మహాభారతంలోని అనుశాసనికపర్వంలో కూడా కనిపిస్తుంది. ధర్మరాజు పవిత్రతను ఇచ్చే తీర్థాలు ఏవి అని అడగగా భీష్ముడు ఇలా చెప్పాడు: దమము (ఇంద్రియ నియమం), శమము (మనశ్శాంతి), అహింస, తపస్సు ఇవే నిజమైన తీర్థములు. ఇవి లేకుండా కేవలం నీటిలో మునిగితే పవిత్రత​ కలుగదు. 

అందువలన అన్నమాచార్యుల సూచన స్పష్టమవుతుంది: బాహ్య తీర్థయాత్రలు మనస్సును కొంత శుద్ధి చేయవచ్చు. కానీ వైష్ణవత్వము — అంతర్గత పునీత స్థితి — దైవకృపతోనే పూర్ణమగును.

కీర్తన​ సారం
ఈ కీర్తనలో మూడు రకాల ఆధ్యాత్మిక సాధనలను అన్నమాచార్యులు పరిశీలిస్తారు:
తపస్సు
యాగయజ్ఞాదులు
తీర్థయాత్రలు
ఈ మూడు ఆచారాలు గౌరవనీయమైనవే అయినా,
అవి మాత్రమే మనిషిని సంపూర్ణంగా విముక్తుని చేయలేవని సూచన.
అందుకే పల్లవిలో అడిగిన  ప్రశ్నను పరిశీలించవలెను:
సులభమా మనుజులకు హరిభక్తి?”

Bottom of Form


X-X-The END-X-X

T-309 ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు

  తాళ్లపాక అన్నమాచార్యులు 309 ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు For English version press here ఉపోద్ఘాతము ఏమి సేయఁగవచ్చు : ఇది నిరాశావాదం కాదు....