తాళ్లపాక అన్నమాచార్యులు
320 ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు
ఉపోద్ఘాతము
మనం జీవితమంతా తిరుణాళ్ళులాగా సాగాలని కోరుకుంటాం. కానీ వాస్తవంగా
జరిగేదేమిటి? మహా అయితే అడపదడప వచ్చేవే తిరుణాళ్ళు.
దీనినే కాస్త వ్యంగ్యం జోడిస్తూ అన్నమాచార్యులు ఇలా అన్నారు "తెప్పిరిల్లె నేఁట
నేఁట తెప్పతిరుణాళ్ళు" మనం నిర్మించుకున్న ప్రపంచం నుండి తెప్పిరిల్లి అప్పుడప్పుడు
జరుపుకునే తిరుణాళ్ళు అన్నారు.
ఈ ప్రపంచంలోని అల్లకల్లోలం మనందరికీ ప్రస్ఫుటం. మనము చేసే శాంతి
ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. ఆకలిమంటలు, మనిషికి మనిషికి మధ్య చెప్పలేని దూరం, దేశాల మధ్య
విద్వేషం — ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. శాంతి మాట దేవుడెరుగు; కనీసం వత్తిడి లేని జీవితం కూడా అసాధ్యంగా కనబడుతోంది.
మనమంతా సహజంగానే మనమూ, ప్రపంచం మారాలని కోరుకుంటాం. కానీ భౌతిక సుఖాలు పెరిగినా పరిస్థితులు
మొత్తానికి దిగజారుతూనే ఉన్నాయి. జీవించడం క్రమంగా దుర్బరమవుతోంది. ఈ
పరిస్థితుల్లో "అన్నమాచార్యుల కీర్తనలు మనకు ఎలా సహాయపడగలవో?" ఆలోచించాలి.
ఒక మూల కూర్చుని దైవస్మరణ చేసుకుంటే సరిపోతుందా? కానీ అలా ఉండనీయకుండా ఎన్నో సమస్యలు మనలను ఏదో
ఒకటి చేయమని ప్రేరేపిస్తాయి. అలా మనమంతా ఏదో ఒకటి తెలిసి గానీ, తెలియక గానీ చేస్తూనే ఉన్నాం. ఆ కార్యాల పర్యవసానమే ఇప్పుడు మన ముందున్న
ప్రపంచం. ప్రతి ఒక్కరి అంతరంగం మారకపోతే ఈ స్థితి అలాగే కొనసాగుతుంది.
మనం ఏది చేపట్టినా చివరకు అనర్ధానికే దారితీస్తోందని మనలో కొందరు
గమనించి ఉంటారు. ఒకవైపు సమయం పరుగెడుతూ మనకు సవాలు విసురుతుంది; మరోవైపు ఏమి చేయాలో నిర్ణయించలేక తడబడుతుంటాం.
అలాంటి సందర్భాల్లో శ్రీశ్రీ గారి మాటలు గుర్తుకు వస్తాయి.
అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్య పెట్టని వారు మాలోకి వస్తారు
అభిప్రాయాలు మార్చుకుని సుఖాలు కామించేవాళ్ళు మీలోకి పోతారు.
ఇలా మనం ఎంతో కొంత రాజీ పడుతూ జీవితం గడుపుతాం. ఇటువంటి రాజీల
పరిణామమే మన ముందున్న ప్రపంచం.
ఇది కొంచెం పక్కన పెట్టుదాం.
భగవద్గీత యుద్ధరంగంలో చెప్పబడింది. విశ్వరూపం చూపమని అర్జునుడు
అడుగగా కృష్ణుడు అతని కోరికను మన్నిస్తాడు. కానీ విశ్వరూపం దర్శించిన తరువాత
మహావీరుడైన అర్జునుడు ఇలా అంటాడు:
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ ।
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో ।।11-24 ।।
“హే విష్ణో! ఆకాశమును తాకుతూ, ఎన్నో వర్ణములతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిన
నోర్లతో, అగ్నిగుండములవంటి కన్నులతో ఉన్న నీ స్వరూపమును
చూస్తున్న నాకు భయంతో గుండె అదిరిపోతోంది. నేను ధైర్యాన్ని మరియు మానసిక
ప్రశాంతతను కోల్పోయాను.” (గీతా 11-24)
దంష్ట్రాకరాళాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని ।
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ।। 11-25 ।।
ప్రళయ కాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా, భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను,
చూసిన పిదప, నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి
పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము;
దయచేసి నామీద కృప చూపుము.
పైన ఉపోద్ఘాతం, అర్జునుని
మాటలు — ఇవి ఒకే దిశలో సూచిస్తున్నాయి. యుగాలు మారినా పరిస్థితులు అంతగా మారవు.
మానవుని సమస్య ఒకటే — భయం - తనలో తానుగా ఉండలేని భయం.
ఇక్కడ అన్నమాచార్యులు “తెప్పతిరుణాళ్ళు” అనే చిత్రంతో
సమత్వంతో తేలియాడే స్థితిని సూచిస్తున్నారు. ఇది పిరికితనానికి లోబడిన భక్తి కాదు.
మనం అలవాటు పడ్డ దృష్టి పరిధిని దాటకపోతే, అదే పాత మూసలోనే తిరుగుతూనే ఉంటాం. ఇదే ఈ కీర్తనలో దాగి ఉన్న సూచన.
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 135-2
సంపుటము: 2-143
|
|
ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు దిందువడె సిరులతో తెప్పతిరుణాళ్ళు ॥పల్లవి॥ పాలజలనిధిలోఁ బవ్వళించ పాముతెప్పఁ దేలుచున్న దది దెప్పదిరుణాళ్ళు వోలి నేకోదకమై వొక్క మఱ్ఱియాకుమీఁద తేలుచున్నదది తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥ అమృతము దచ్చునాఁడు అంబుధిలో మంధరము తెమలఁ దేలించు తెప్పతిరుణాళ్ళు యమునలో కాళింగునంగపుపడిగెమీఁద తిమిరి తొక్కిన తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥ అప్పుడు పదారువేలు అంగనల చెమటల- తెప్పలఁ దేలిన తెప్పతిరుణాళ్ళు వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతిఁ గోనేటిలోన తెప్పిరిల్లె నేఁట నేఁట తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥
|
Details
and Explanations:
పల్లవి:
ఎందు నీకు
బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు
దిందువడె
సిరులతో తెప్పతిరుణాళ్ళు ॥పల్లవి॥
ప్రస్తావన:
అన్నమాచార్యులు
ఒక ప్రక్క ఉత్సవ భావం పలికిస్తూనే అంతర్లీనంగా సమత్వముతో కూడిన జీవితమును వర్ణించుచున్నారు. "దిందువడె" = అనగా క్రింద పడునవి మరియు
"సిరులు" అనగా జీవము ఉట్టి పడునవి, అస్తిత్వము కలిగినవి, భౌతిక రూపములు కలవి చూపుతున్నవి. ఇక్కడ "దిందువడె సిరులతో" అని విరోధోక్తులతో,
పరస్పరము పొసగని వానితో కూడిన జీవనమును సూచించారు.
భావము:
|
ఉత్సవ భావం
|
అంతర్లీన భావం
|
|
స్వామీ! ఈ తెప్పతిరుణాళ్ళు నీకు ఎంత ప్రియమో! కోనేటిలో
అలంకరించిన తెప్పపై విరాజిల్లుచు భక్తుల మధ్య విహరించుచున్న ఈ ఉత్సవం
దర్శించువారందరికీ ఆనందమును పంచుచున్నది.
|
ఈ జగత్తు దిందువడె సిరులతో — క్రింద పడుతూ పైకి లేచే అలల వంటి
రూపాలతో నిండి ఉన్నది. అట్టి అధ్రువమగు మార్పుల
మధ్య సమత్వముతో తేలియాడే స్థితియే నిజమైన తెప్పతిరుణాళ్ళు.
|
మొదటి చరణం:
పాలజలనిధిలోఁ
బవ్వళించ పాముతెప్పఁ
దేలుచున్న
దది దెప్పదిరుణాళ్ళు
వోలి నేకోదకమై
వొక్క మఱ్ఱియాకుమీఁద
తేలుచున్నదది
తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥
ప్రస్తావన:
ఒకటి అంతులేని
సంసార సముద్రము. అంచనా వేయలేని లోతు. దానికి కాలమే అటునిటు ఒడ్డులై నిలిచియున్నవి.
చూచిన కొద్దీ కొనసాగుచుండును. ఇంకొకటి ప్రళయము. సర్వము నొక్కటై చీకటిలో కలిసిపోవుట.
|
ఉత్సవ భావం
|
అంతర్లీన భావం |
|
పాలసముద్రములో ఆదిశేషుడనే పాముతెప్పపై పవళించిన స్వామి దర్శనం
దేవతలకు మహోత్సవమై కనిపించింది.
|
ఎదుట అంతులేని జలరాశి. అగాధము. అనేక ఫణములు విప్పిన విష వూపిరుల
మహాకాల సర్పం. కాలికింద భూమి లేదు. పైన ఆకసము లేదు. అట్టి విషవాయువుల సమక్షములో, అధారములేని చోట సమత్వముగా నిలిచి పవళించిన దొకటి.
|
|
ప్రళయకాలములో మర్రియాకుమీద తేలియాడే బాలమూర్తి దర్శనం
మహోత్సవముగా భావింపబడింది.
|
ప్రళయకాలము. భూమి కుంగిపోయింది. సముద్రాలన్నీ ఏకమై ఒకే జలరాశిగా
మారినవి. ఎగిసిపడే అలలు, ప్రచండ గాలులు. అట్టి అల్లకల్లొలమగు
జలరాశిలో చిన్న మర్రియాకుపై సమత్వమున తేలియాడిన దొకటి.
|
రెండవ చరణం:
అమృతము దచ్చునాఁడు
అంబుధిలో మంధరము
తెమలఁ దేలించు
తెప్పతిరుణాళ్ళు
యమునలో కాళింగునంగపుపడిగెమీఁద
తిమిరి తొక్కిన
తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥
ప్రస్తావన:
ఒకటి మహా
ప్రయత్నము. లేని దానికై ఆరాటం. అమృతముకై వెదుకులాట. ఇంకొకటి మనుగడకు పెను సవాలు. కాళింగుని
యమునా ప్రవేశం.
|
ఉత్సవ భావం
|
అంతర్లీన భావం
|
|
దేవదానవులు మంధరమును వాసుకిని త్రాడుగా చేసి సముద్రమును
చిలికిరి. ఆ పని సఫలమగునట్లు, ధర్మం
నిలుచునట్లు అనిపింపచేసిన ఆ దేవదేవునికి తిరుణాళ్ళు.
|
అంబుధిలో మంధరపర్వతము తాబేలు అధారముగ తేలియున్నది. దేవాసురులు వాసుకిని త్రాడుగా చేసి
లాగుచున్నారు. నాగు నోటి నుండి విషవాయువు ఎగసిపడుచున్నది. సముద్ర అలలు
ఉద్ధృతముగా లేచుచున్నవి. కాలికింద భూమి లేదు. పాము చర్మం చిట్లి రక్తపు వాసన,
దేవదానవుల చెమట వాసనలు, పోటాపోటీ వాదులాటలు,
సముద్రపుఘోష, పాము బుసబుసలు — అట్టి
గందరగోళములోను సమత్వముతో నిలిచిన దొకటి.
|
|
కృష్ణుని పాము నీళ్ళలోకి లాగివేసినది. రేపల్లె అంతా ఉత్కంఠతో
చూస్తోంది. మరుక్షణం పాము పడగపై నాట్యమాడుచున్న స్వామి ప్రత్యక్షం. రేపల్లె
వాడలో ఆనందం. జగమంత ఉల్లాసం.
|
అసలే నది. దానిలో బుసలు కొడుచు విషము కక్కుచున్న మహాపాము. ఇటు
చిన్ని బాలుడు. పడగపై విషము ఎగిసిపడుచుండగా, పాము అతనిని పడద్రోయ ప్రయత్నములోను, ఆ అనిశ్చితముగా
జారిపడిపోవు స్థితిలోను, సమముగా నిలబడలేని పరిస్థితిలోను సమత్వములో
నిలిచి నాట్యమాడిన దొకటి. జగదానందము పొంగిపొర్లెను.
|
మూడవ చరణం:
అప్పుడు
పదారువేలు అంగనల చెమటల-
తెప్పలఁ
దేలిన తెప్పతిరుణాళ్ళు
వొప్పుగ
శ్రీవేంకటాద్రి నున్నతిఁ గోనేటిలోన
తెప్పిరిల్లె
నేఁట నేఁట తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥
ప్రస్తావన:
ఇక్కడ అన్నమాచార్యులు
శ్రీవేంకటాద్రిపై నున్న కోనేటిలోనే బ్రహ్మమును చూడవచ్చని సెలవిచ్చారు. ఈ సామాన్య
జీవులు, జీవితం ఆధారముగా నడుచుచున్న విశ్వచక్రమును దర్శింప
మానవులకు అవకాశమున్నదని చెబుతున్నారు.
|
ఉత్సవ భావం
|
అంతర్లీన భావం
|
|
పదారువేల
అంగనలతో స్వామి విహరించిన దివ్యక్రీడలు భక్తులకు మహోత్సవాలుగా కనిపించాయి.
|
అనేకానేక
జీవుల శ్రమతో, ఆ జీవుల చెమట ధారలతో నడుచుచున్నదీ విశ్వము. అనేక భావాలు, ఆకాంక్షలు, సందోహాలు, ఉద్విగ్నతల
నడుమ ఆ విశ్వము తెప్పగా (వేదికగా) సమత్వముగా నిలిచి అన్నిటినీ ఆవరించిన దొకటి.
|
|
అందముగా
శ్రీవేంకటాద్రిపై నున్న కోనేటిలోన విస్మయము కలిగించు రీతిగా ఏటేటా తెప్పతిరుణాళ్ళు
రేయింబవళ్ళు.
|
తెప్పిరిల్లిన
మహాజ్ఞానులకు ఆ మహోత్సమొక ఏడాదికి గురుతు. (అనగా వారికి కాలస్పృహ మసకబారుతుంది).
ఈ లోకములోని అకటవికటముల మధ్య సమత్వముగా తేలియాడే స్థితిని గుర్తించినవారికి ప్రతి
రోజూ తిరుణాళ్ళే. తెప్పిరిల్లని వారికి విస్మయము కలిగించు రీతిగా ఏటేటా తెప్పతిరుణాళ్ళు
రేయింబవళ్ళు.
|
వ్యాఖ్యానంతర సమీక్ష:
కల్లోలంలో
ఉండి ఉత్సవం దర్శించుటయో,
ఉత్సవంలో
ఉండి కల్లోలం దర్శించుటయో
—
మానవుని వివేకానికే వదిలివేయబడినది.
X-X-The
END-X-X
