Saturday, 11 July 2026

T-338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
For English Version Press Here

 

పరిచయం 
"తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా" అనే పల్లవి ఈ కీర్తనకు హృదయము. తల్లి ప్రేమను దాది (పెంపుడుతల్లి) అనుకరించగలదు గాని, ఆ స్థానమును భర్తీ చేయలేదు. ఈ విశ్వమంతటికి తల్లి ప్రకృతి. అది భగవానుని భౌతిక శక్తి. (భగవద్గీత 7-4: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి భగవానుని భౌతిక ప్రాకృతిక శక్తి).

అయితే కొంచెం సావధానముగా పరిశీలించినచో, మానవుడు ప్రకృతి యొక్క సహజ కార్యక్రమములో అనవసరముగా జోక్యం చేసుకొనుచున్న విధానమును పెదతిరుమలాచార్యులు అత్యంత సరళమైన ఉపమానములతో తెలియజేయుచున్నారని తెలుస్తుంది. ఈ జగత్తును అనగా ప్రకృతి నడిపించు సహజ క్రమమును మనిషి తన ప్రయత్నములతో స్వాధీనపరచుకొనలేడు. మనము ఈ సృష్టికి యజమానులమని భావించరాదు (భగవద్గీత​ 3-33).

ఈ కీర్తనలో పెదతిరుమలాచార్యులు మానవుని ప్రయత్నములను ఖండించుటలేదు. ప్రకృతి తన పని తాను చేసుకొనుచుండగా, “మనిషి తన పాత్రను తెలుసుకొని, అనవసరమైన జోక్యమును విడిచిపెట్టగలడా?” అనే ప్రశ్నను మాత్రమే మన ముందుంచుచున్నారు.

అందుచేత ఈ కీర్తన భక్తిని మించిన ఒక జీవ పరిశీలనగా నిలుస్తుంది. మనము కర్తలమని భావించుచున్న చోట, మనము వేయు తప్పుటడుగును ఇది సున్నితముగా సూచించుచున్నది.

పెదతిరుమలాచార్యుల ప్రతిభ అసమాన్యము. సూర్యుని ప్రకాశం వంటి అన్నమాచార్యుల వెలుగులోను దీటుగా నిలిచింది. తండ్రికి తగ్గ తనయుడు అని మనము అనేక మార్లు చెప్పుకున్నాము. ఈ కీర్తన మరొక ఉదాహరణ అంతే.

అధ్యాత్మ సంకీర్తన
రాగి రేకు: 17-6  సంపుటము - సంకీర్తన: 15-98
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ॥పల్లవి॥

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా ॥తల్లికి॥

సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
చర్వితచర్వణాల వేసరించేము గాకా  ॥తల్లికి॥

నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
యీవలఁ గాచుటకు నీ కిదే పని
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా ॥తల్లికి॥
Details and Explanations:
పల్లవి:
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా
తల్లికి బిడ్డపై ఉండే మమత దాదికి (పెంపుడుతల్లికి) ఎక్కడ ఉంటుంది?
దేవా!  నీవు జగత్తుకు తల్లివంటి వాడవు. మేము ఈ శరీరమును, మనస్సును తాత్కాలికముగా పోషించు దాదివంటివారము. కాబట్టి ఈ జగత్తు పట్ల నీకున్న సహజ బాధ్యతను, ప్రేమను, రక్షణను మేము మాకుగా చేసుకొనలేము.
చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా
ఊరకనే "మాకు నీ వంటే ఎంతో ఇష్టం" అని మాటలలో చెప్పుకుంటాము.
"నా శరీరం", "నా పని", "నా బాధ్యత", "నా ప్రపంచం" అని చెప్పుకొను మా ప్రేమ చాలామటుకు మాటలకే పరిమితం. మాకు వీనిపై యజమానిత్వ భావమే ఎక్కువ; ప్రకృతి సహజ ప్రేమ తక్కువ.
గూఢార్థవివరణము:

తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా” ఈ కీర్తనకు హృదయము. తల్లి ప్రేమను దాది (పెంపుడుతల్లి) అనుకరించగలదు గాని, ఆ స్థానమును భర్తీ చేయలేదు. ఈ విశ్వమంతటికి తల్లి ప్రకృతి. పెదతిరుమలాచార్యులవారు ఇక్కడ ఒక నిశ్శబ్దమైన పునరాహ్వానము చేస్తున్నారు.

భగవద్గీత 3-33 ఇలా చెప్పింది  వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?” అనగా ప్రకృతి సహజ ప్రేమను వదలి కృత్రిమముగా జీవిస్తున్నామని అన్నట్లు. 

చిల్లరప్రియము లేలో చెప్పేము గాకా ఈ సందర్భంగా అన్నమాచార్యుల మాట "కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు" స్మరణీయము. మనము చెప్పే ప్రియములు అల్పములు. 

Bottom of Form


మొదటి చరణం:

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా ॥తల్లికి॥ 

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము

అంతరార్థము

బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు
సమస్త జీవులు నీ (విశ్వ) కుటుంబానికి చెందినవారు.
ఈ జగత్తులోని జీవులపై అసలు బాధ్యత ప్రకృతిదే (దైవముదే). మనిషి ఆ వ్యవస్థలో ఒక భాగము మాత్రమే.
యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని
వారికి ఈ లోకములో జీవనమిచ్చి రక్షించుట నీ పని.
జీవనమును సృష్టించుట, పోషించుట, నడిపించుట అనే బృహత్తర క్రమము ప్రకృతిలో  సహజముగా జరుగుచున్నది. దానిని మనిషి స్వాధీనపరచుకొనలేడు. (3వ చరణం వివరణ చూడండి)
నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా
వారంతా నీ సొమ్ము. వారు క్షీణించుతుంటే నీవు ఊరుకుంటావా?
జీవులలో నిహితమైనది (= ఉంచఁబడినది, దాఁచఁబడినది) నీ ఆధీనములోనున్నప్పుడు, వారి సంక్షేమము సహజంగానే ఆ వ్యవస్థలో అంతర్భాగము. మనిషి ఆందోళనకు బదులు ఆ క్రమము తెలియవలెను.
బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా
మేము ఊరకనే ఎన్నో విన్నపాలు చేసుకుంటూ ఉంటాము.
మేము ఈ ప్రాణులను మాతో కలుపుకుని నీకు చేయు విన్నపాలు ఊరకనే పైపైకి చెప్పు మాటలే కానీ వాస్తవముగా తారతమ్యములను వదిలినవారము కాము. అంతే.
గూఢార్థవివరణము: 

నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా” జాగ్రత్తగా గమనించండి ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది స్పురించుచున్నది.

బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా” అనగా వసుధైవ కుటుంబకం మాకు నినాదం మాత్రమే. వాస్తవముకాదు.

రెండవ చరణం:

సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
చర్వితచర్వణాల వేసరించేము గాకా ॥తల్లికి॥

భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి
అందరికీ నీవే బంధువు. సమస్త కార్యములు నీవే నిర్వహించువాడవు.
ఈ విశ్వములోని సమస్త పరస్పర సంబంధములకు మూలమైనది ఒకే సహజ క్రమము. మానవుడు దానిలో ఒక భాగము మాత్రమే.
నిర్వహించ నన్నిటాను నీ కిదే పని
ఆ సమస్తమును నిర్వహించుట నీ విధి.
జీవన ప్రవాహమును నడిపించు బృహత్తర వ్యవస్థ స్వయంగా పనిచేయుచున్నది. దానిని మనిషి తన భుజాలపై మోసుకొనవలసిన అవసరము లేదు. (3వ చరణం వివరణ చూడండి)
వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా
దేవా! ఈ భూమిపై నీ కార్యములను నీవు అసంపూర్తిగా వదిలివేస్తావా? (ఉద్ధరిస్తూనే ఉంటావు.​)
దేవా!  నీ కార్యములు అసంపూర్ణములు కావు. సమస్తమును సహజముగా నీలో చేర్చుకుందువు.
చర్వితచర్వణాల వేసరించేము గాకా
(చర్వితచర్వణము = చెప్పిన దానినే మరల చెప్పుట) నమిలినదానినే మళ్లీ నములుతున్నట్లు శ్రమపడుతుంటాము.  మాది వృత్త చలనము
మేము పాతవాటినే నెమరు వేస్తాము.  వాటిలోనే తిరుగుతుంటాము. కానీ మొదటికే వచ్చుచున్న సంగతి  తెలియము. మా ఇప్పటి భావములు కొత్తవని తలచి వేసారుతాము. జనన మరణ​ వృత్త చలనములలో  జీవించుచున్నాము అంతే.
గూఢార్థవివరణము: 

"చర్వితచర్వణాల వేసరించేము" దీనిని భగవద్గీత లోని మూడవ అధ్యాయము 42వ శ్లోకం తోటి అనుసంధానం చేసి చూద్దాం. దీన్ని ఒక బొమ్మ రూపంలో క్రింద పెట్టాను జాగ్రత్తగా పరిశీలించవలసినది.
 
మొత్తానికి చర్వితచర్వణము అన్నది అంటే ఇక్కడే ఈ భూమిపై మనం వర్తుల మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటాము. దీని నుంచి  బయలుపడు మార్గమును అన్వేషించము. అంతే.

మూడవ చరణం:

నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
వలఁ గాచుటకు నీ కిదే పని
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా ॥తల్లికి॥ 

భావము:

కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము
నీవు లోకాధిపతి. మేమంతా నీ సేవకులము.
ఈ జగత్తులో మనిషి యజమాని కాదు; సమస్త జీవనవ్యవస్థలో ఒక భాగము మాత్రమే.
యీవలఁ గాచుటకు నీ కిదే పని
మమ్ములను కాపాడుట నీ బాధ్యత.
జీవనమును నిలుపుట, పోషించుట, రక్షించుట అనే సహజ క్రమము ప్రకృతిదే. మనిషి తన వంతు పాత్ర నిర్వర్తించవలెను గాని, సమస్త బాధ్యతను తనదిగా భావించరాదు.
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా
ఓ శ్రీవేంకటేశా! నీ శాఖలవంటి మాపై దయ చూపవా?
సమస్త జీవులు ఒకే జీవనవృక్షమునకు చెందిన కొమ్మలవంటివారు. మూలమునకు కొమ్మలను పోషించుట సహజము; దానిని గుర్తించినచో భయం తగ్గును.
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా
నీవే దైవము. మేము ఆకాశం వైపు తలెత్తి ప్రార్థించుట మాత్రమే చేయుచున్నాము.
చివరికి మానవుని వశములో మిగిలేది కర్తృత్వము కాదు; వినయము. జీవితం యొక్క విశాల క్రమమును అంగీకరించి దానియందు విశ్వాసముతో నిలుచుట.

గూఢార్థవివరణము:
 
శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా: దేవా మేము నీ శాఖలం. (భగవద్గీత రెండవ అధ్యాయము 17వ శ్లోకం). మనమంతా కూడా ఆ అవ్యయమైన దానిలో భాగములమే. కావున తిరిగి ఈ చరణం లోని రెండవ పంక్తిని చూడండి.

నీ కిదే పని అని పెదతిరుమలాచార్యులు మూడు సార్లు ఎందుకు అన్నారో విచారింతము. మన అనుభవములోని ఒక చిన్న విషయం చూడండి. మన చెయ్యి మీద చిన్నగా గీరుకుందనుకోండీ. మనము దానిని అలావదలి వేస్తే కొన్నాళ్ళకు దాని మీద పెచ్చు కట్టి, పెచ్చు ఊడిపోయి మామూలుగా  అయిపోతుంది. ఈ రకంగా చూస్తే ప్రకృతి తనపని తాను చేసుకుంటూ పోతుంది. అదే మనము ఆ గీరును గోకుతూ ఉంటే, నయమగుటకు ఎక్కువ కాలం పడుతుంది. అలాగే ప్రకృతితో చేయబడిన మనము సహజముగా ఉంటే చాలు అన్న విషయం తెలుస్తుంది.

పైన చెప్పుకున్న భగవద్గీతలోని బొమ్మలో వర్తుల ప్రయాణం చూపబడినది. మనకు ప్రకృతి కంటే బాగుగా తెలుసుననే అహంకారము మనలను ఇక్కడే పట్టి ఉంచుతుంది. ఈ సందర్భంలో అన్నమాచార్యుల క్రింది చరణం స్మరణీయము. 
చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ      హరి
 
దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా”: దైవానివి. నీకు తెలుసు. కానీ ఆశగా ఆకాశం వైపు తలెత్తి చూస్తాం. ఆ దిశగా అడుగులు వేయం అంతే.

X-X-X THE END X-X-X

Wednesday, 24 June 2026

T-337 విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా

 తాళ్లపాక అన్నమాచార్యులు
337 విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా

For English Version Press Here

పరిచయం
వెన్నెలబొమ్మ

మనిషి ఈ ప్రపంచములోనికి ప్రవేశించినపుడు అతని మనస్సు సహజముగా స్వేచ్ఛాయుతముగా ఉంటుంది. కానీ జీవితం అతని ముందుంచునది ఒకటో రెండు ఆకర్షణలు కాదు; అంతులేని రంగుల ప్రపంచం. అది ఒకేసారి దాడి చేయదు. ఒక్కొక్కటిగా, మొక్కలకు కాండము, దాని నుండి కొమ్మలు, వాటి నుండి ఆకులు పుట్టినట్లు నెమ్మదిగా విస్తరిస్తుంది. అందుచేత బంధనములు మనకు కృత్రిమముగా అనిపించవు. మనమే వాటిలో భాగమౌతాము; వాటిని ఆనందిస్తాము; చివరకు వాటితోనే మన అస్తిత్వాన్ని నిర్మించుకుంటాము.

కాలక్రమేణా ఆశలు, భయాలు, విజయాలు, అపజయాలు, సంబంధాలు, గుర్తింపులు, స్మృతులు కలిసి ఒక మానసిక ప్రపంచముగా రూపుదిద్దుకొంటాయి. అయితే గమనించవలసినది ఆకర్షణల కంటే వాటివలన మనలో పుట్టే కదలికలు. ఒక రూపము, ఒక మాట, ఒక చూపు, ఒక స్పర్శ, ఒక స్మృతి — ఇవన్నీ మనలో స్పందనలను కలిగిస్తాయి. ప్రతి స్పందన ఒక కదలిక. ప్రతి కదలిక ఒక కొత్త కొమ్మవలె విస్తరించును. ఈ విధముగా సంసారవృక్షము పెరుగుచుండును.

సావధానానఁ బెరిగీ సంసారవృక్షము” అని అన్నమాచార్యులు మరొక కీర్తనలో చెప్పిన మాట ఇక్కడ స్మరణీయము. ఉత్సాహముతోనూ, ఆసక్తితోనూ, అనురక్తితోనూ, స్మరణతోనూ, గమనికతోనూ మనస్సు విషయములను తాకినచో వాటి నుండి కొత్త కదలికలు పుట్టుకొస్తాయి. మనకు ప్రత్యక్షముగా కనబడునవి ఆ కదలికలే గాని, వాటికి మూలమైన ప్రక్రియ కాదు. ఈ విధముగా మనము కొమ్మలను, ఆకులను, పుష్పములను గమనిస్తాము; కానీ వృక్షమునకు ఆధారమైన మూలము మాత్రం మరుగుననే నిలిచిపోతుంది.

విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా” అను ఈ కీర్తనలో అన్నమాచార్యులు ఈ అత్యంత సూక్ష్మమైన మానవ పరిస్థితిని శృంగార చిత్రాల ద్వారా మన ముందుంచుతున్నారు. ఇక్కడ ప్రపంచము నిందింపబడదు. కోరికలు శపింపబడవు. ఆకర్షణలు అడ్డగోడలుగా చూపబడవు. బదులుగా ప్రకృతి జీవిని ఆకర్షణీయునిగా చేయు అనేక గుణములను, వాటి వలన పుట్టే కదలికలను, ఆ కదలికలలో భాగస్వామ్యమగు సమస్త జీవన వాతావరణాన్ని కవి సజీవముగా చిత్రిస్తారు.

ఈ కీర్తనలో యోగి ప్రపంచానికి వెలుపల నిలబడి పరిశీలించువాడు కాదు. అదే కదలికల మధ్య జీవించుచూ, వాటిచే తాకబడుచూ, వాటిలో పూర్తిగా మునిగిపోక, అట్లని వాటి నుండి పారిపోక, జీవన స్రవంతిలో భాగమై గమనించువాడు. అందుచేత ఈ కీర్తనలోని “వెన్నెలబొమ్మ” ఒక సిద్ధాంతము కాదు; ఇంకా పూర్తిగా మాటలలో బంధింపబడని ఒక మృదువైన అవగాహనకు ప్రతీక.

ఈ కీర్తన చివరికి ఒక అపూర్వమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. జీవితమంతా ఈ కదలికలతో నిండి ఉన్నపుడు, వాటి ప్రతి ఒక్కటి కొత్త కొమ్మలను విస్తరింపజేయుచున్నపుడు, వాటిని నిరాకరించక, వాటిలో చిక్కుకోక, వాటి మూలాన్ని గమనించుట సాధ్యమేనా? కవి సమాధానము చెప్పరు. కానీ ఆ ప్రశ్నను మన హృదయంలో మేల్కొలిపి వెళతారు. 
శృంగార సంకీర్తన
రాగి రేకు: 59-2  సంపుటము - సంకీర్తన: 6-104
విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక    ॥పల్లవి॥

పంచల పసిండి నిగ్గు వచ్చిదేరే సిగ్గు
వంచన వలపు తీపు వాలుక చూపు
కంచపుంబాలకూడు కాఁకలనీవాడు
మంచపు నీ తలఁబ్రాలు మట్టెల పాదాలు         ॥విచ్చే॥

కోవిల కొసరుఁబాట కొమ్మరో నీ మాట
తావులచెంగావి నీ తళుకు మోవి
గోవ జవ్వాదికరంగు గుబ్బల నీ మెఱుంగు
భావజు దాడి రొదలు పాదపు నీ కదలు ॥విచ్చే॥

ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు
అద్దలింపుఁ గసరు మోహంపుఁ గొసరు
గద్దరి నీ యలపు వెంకటపతి తలఁపు
అద్దపునీమోము మోహనరతిసాము     ॥విచ్చే॥
Details and Explanations:
పల్లవి:
విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక ॥పల్లవి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
ఓ వెన్నెలబొమ్మా! స్వాగతం.
ఓ సుకుమారమైన, పట్టుబడని చైతన్యమా! జీవనం యొక్క సమస్త సంబంధములు ఒక్కసారిగా ప్రకాశించిన మౌన సౌందర్యమా! ఆదరముతో ఆహ్వానము.
మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక
మన్మథునికి ఢంకా మ్రోగించు సుందరీ! నీ రాకకై ఎదురుచూపులు.
మా అంతరంగములలో దాగి ఉన్న జీవిత సౌరభం, అందము, విలాసము, ఉప్పొంగే ఉత్సాహం, సమున్నతి, సమస్తమునకు ఒకే సూత్రమైన పురోగామి — ఇవన్నీ నీ సన్నిధిలో పొంగి పొరలుచున్నవి.
గూఢార్థవివరణము:

అన్నమాచార్యులువారు అతి సున్నితమైన స్థితిలో, ప్రకృతితో మమేకమై, తనలోను, కనబడుచున్న ప్రపంచంలోను విస్తరించి, వ్యక్తిగతంకాని, అట్లని సామూహికం కాని, సమస్తమును నడుపు చైతన్యమును స్పృశించినపుడు అప్రయత్నంగా చేసిన వాక్కులివి. వీటిని కేవలం శృంగార వర్ణనలుగా కొట్టివేయరాదు. మానవ జన్మ యొక్క ఉత్తిష్ఠతను, జీవితం తనను తాను ఒక్క క్షణం వెలుగులోనికి తెచ్చుకొనిన అరుదైన దర్శనాన్ని సూచించు పంక్తులు ఇవి.

విద్యుత్తు ప్రవహించినపుడు తంతి ఒక్కసారిగా వెలిగినట్లు, జీవితం యొక్క అంతఃసంబంధములు కూడా ఒకే క్షణంలో స్పష్టమగును. ఆ స్పష్టత మాటలలో, భావములలో పూర్తిగా బంధింపబడదు. దానిని సిద్ధాంతముగా చూపబోతే, వెంటనే విద్యుత్తు ఆగిపోయినట్లు తన సౌందర్యమును కోల్పోతుంది. "వెన్నెలబొమ్మ" అటువంటి సజీవ స్పష్టతకు కవితాత్మక రూపము.

మొదటి చరణం: 
పంచల పసిండి నిగ్గు వచ్చిదేరే సిగ్గు
వంచన వలపు తీపు వాలుక చూపు
కంచపుంబాలకూడు కాఁకలనీవాడు
మంచపు నీ తలఁబ్రాలు మట్టెల పాదాలు          ॥విచ్చే॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
పంచల పసిండి నిగ్గు వచ్చిదేరే సిగ్గు
బంగారపు మెరుపువంటి సిగ్గు వచ్చి చేరింది.
జీవనములో సున్నితత్వము, మర్యాద, స్పందన మొదలైన సూక్ష్మ చలనములు సహజముగా వ్యక్తమగుచున్నవి.
వంచన వలపు తీపు వాలుక చూపు
వలపు, తీపి, వాలుచూపులు మోహపరచుచున్నవి.
పరస్పర ఆకర్షణలు, అనుబంధములు, సమీపింపులు తమ సహజ క్రమములో వికసించుచున్నవి.
కంచపుంబాలకూడు కాఁకల నీవాడు
పాలవలె మృదువైన యౌవన సౌందర్యము కలుగుతున్నది
జీవనశక్తి, ఉత్సాహము, వికాసము, సృజనాత్మక ప్రవాహము రూపుదిద్దుకొనుచున్నది.
మంచపు నీ తలఁబ్రాలు మట్టెల పాదాలు
శయ్యపై అలరారుచున్న సౌందర్యరూపము.
జీవనములోని సమస్త చలనములు ఒక సమన్వయ స్థితిలో పరస్పర సంబంధములను ఏర్పరచుకొనుచున్నవి.
గూఢార్థవివరణము:

ఈ చరణములో అన్నమాచార్యులు ఒక వ్యక్తి యొక్క సౌందర్యమును వర్ణిస్తున్నట్లు కనిపించినప్పటికీ, మరింత లోతుగా గమనించినచో జీవనములో సహజముగా వ్యక్తమగు సున్నితమైన ప్రేరణలను చిత్రించుచున్నట్లు అనిపించును.

పల్లవిలో "వెన్నెలబొమ్మ"గా సూచించిన ఆ సుకుమారమైన చైతన్య స్పర్శ, ఇక్కడ సిగ్గు, వలపు, వాలుచూపు, యౌవనము మొదలైన రూపాలలో వ్యక్తమగుచున్నది. ఇవి వ్యక్తిగత గుణములు కావు; జీవితం తనను తాను వికసించుకొనుచున్న విధానములు.

ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయుటలేదు.

సిగ్గు తన పని తాను చేసుకొనుచున్నది. వలపు తన పని తాను చేసుకొనుచున్నది. ఆకర్షణ, స్పందన, సమీపత, మాధుర్యము తమ తమ దిశలలో ప్రవహించుచున్నవి. ఈ ప్రపంచమంతయు ఒక బృహత్తర ప్రేరణావస్థ వలె ఒకదానిని మరొకటి మేల్కొల్పుచున్నది. ఆ మేల్కొలుపుల సమిష్టి కదలికయే జీవనము.

అందుచేత ఈ చరణములో ప్రశంసించవలసిన వ్యక్తి లేడు; నిందించవలసిన వ్యక్తి లేడు. జీవితం తన సహజ స్వభావములో వికసించుచున్న ఒక అరుదైన దృశ్యము మాత్రమే ఉన్నది.

రెండవ చరణం:
కోవిల కొసరుఁబాట కొమ్మరో నీ మాట
తావులచెంగావి నీ తళుకు మోవి
గోవ జవ్వాదికరంగు గుబ్బల నీ మెఱుంగు
భావజు దాడి రొదలు పాదపు నీ కదలు          ॥విచ్చే॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
కోవిల కొసరుఁబాట కొమ్మరో నీ మాట
కోయిల కూతలవలె మధురమైన నీ మాటలు.
ఒక జీవి నుండి మరొక జీవికి చేరే స్పందనలు, సంకేతాలు, ఆహ్వానాలు సహజముగా ప్రవహించుచున్నవి.
తావుల చెంగావి నీ తళుకు మోవి
ఎర్రటి చెంగావి పుష్పమువలె ప్రకాశించు నీ పెదవులు.
రూపము, రంగు, ప్రకాశము వంటి బాహ్య ప్రేరణలు జీవులలో స్పందనలను మేల్కొల్పుచున్నవి.
గోవ జవ్వాది కరంగు గుబ్బల నీ మెఱుంగు
జవ్వాది సుగంధమువలె పరిమళించు నీ సౌందర్యము.
పరిమళము, స్పర్శ, రూపము, ధ్వని మొదలైన అనుభూతులు పరస్పర సంబంధములను నిర్మించుచున్నవి.
భావజు దాడి రొదలు పాదపు నీ కదలు
మన్మథుని దాడివలె చలించు నీ నడక.
జీవనములోని వివిధ ప్రేరణలు కలసి భావములు, కోరికలు, అనుబంధములు, కదలికలు సృష్టించుచున్నవి.
గూఢార్థవివరణము:

మొదటి చరణములో సౌందర్యము, వలపు, సిగ్గు మొదలైనవి రూపుదిద్దుకొనినట్లు చూచితిమి. ఈ ప్రపంచమంతయు ఒక బృహత్తర సహకారమందించు ఉత్తేజిత వ్యవస్థ వలె కనబడినచో, ఒకదానిని మరొకటి మేల్కొల్పుచున్నది. ఆ మేల్కొలుపుల ఉమ్మడి కదలికయే జీవనము. ఈ చరణములో అవి ఒంటరిగా లేవు.

ఇక్కడ మాట, రంగు, పరిమళము, కదలిక — ఇవన్నీ కలిసి పనిచేయుచున్నవి. మాటకు తన స్వంత భావన లేదు. రంగుకు తన స్వంత ఉద్దేశము లేదు. పరిమళమునకు తన స్వంత అభిప్రాయము లేదు. అయినప్పటికీ జీవి వాటిని అనుభవించి, వాటికి అనుకూలము–ప్రతికూలము అనే అర్థములను కల్పించును.

ఈ విధముగా వ్యక్తిగత స్పందనలు ఒకదానిపై మరొకటి పేరుకొని భావములుగా, భావములు వ్యక్తిత్వములుగా, వ్యక్తిత్వములు సమాజముగా, నిబంధనలుగా, హక్కులుగా రూపుదిద్దుకొనును. ఆ తరువాత జీవి తానే నిర్మించుకున్న ఆ రక్షణ వలయములో చిక్కుకొనును.

అన్నమాచార్యులు ఇక్కడ ప్రేమకథను చెప్పుటలేదు. జీవనములోని వివిధ ప్రేరణలు ఎలా పరస్పరముగా కలిసి మానవ అనుభవమును నిర్మించుచున్నవో సున్నితముగా చూపుచున్నారు. అందుచేత ఈ చరణము పైకి శృంగార వర్ణనగా కనిపించినా, లోతులో జీవనము తనను తాను ఎలా అల్లుకొనుచున్నదో తెలియజేయు పరిశీలనగా నిలుస్తుంది.

మూడవ చరణం:
ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు
అద్దలింపుఁ గసరు మోహంపుఁ గొసరు
గద్దరి నీ యలపు వెంకటపతి తలఁపు
అద్దపునీమోము మోహనరతిసాము ॥విచ్చే॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు
ముద్దులు చిందించు నీ నవ్వు, అనురాగ బంధములను మరింత బిగించుచున్నది.
జీవుల మధ్య ఏర్పడిన అనుబంధములు, సాన్నిహిత్యములు, పరస్పర స్పందనలు మరింత లోతుగా స్థిరపడుచున్నవి.
అద్దలింపుఁ గసరు మోహంపుఁ గొసరు
మోహము రెచ్చగొట్టుచున్నది, ఆకర్షణను పెంపొందించుచున్నది.
అనుభవములు, జ్ఞాపకములు, ఆశలు పరస్పరమును పోషించుకొని వ్యక్తిత్వ నిర్మాణమును బలపరచుచున్నవి.
గద్దరి నీ యలపు వెంకటపతి తలఁపు
ఓ వెంకటపతీ! మోసగాడివలె మమ్ములను నీ చుట్టూ అలుపు వచ్చునట్లు తిప్పించుచున్నావు.
వెంకటపతీ! ఈ మాయ యొక్క స్వభావమును గ్రహించక, దానిలోనే తిరుగుచూ జీవి అలసిపోవుచున్నాడు.
అద్దపు నీ మోము మోహనరతిసాము
మోహనమగు అనురాగక్రీడలలో నీ ముఖము తేటతెల్లముగా ప్రకాశించుచున్నది.
అద్దమువలె స్పష్టమైన ఆ ముఖమును ఒక్కసారి దర్శించినచో, మోహనమగు ఆ సమగ్ర సౌందర్యమునకు ఎదురుగా రతిసాములు, ఆకర్షణలు, అనురాగ క్రీడలు ఎంత చిన్నవో తేటతెల్లమగును.
గూఢార్థవివరణము:

మొదటి రెండు చరణములలో జీవనములోని సిగ్గు, వలపు, ఆకర్షణ, స్పందన, పరస్పర మేల్కొలుపులు ఎలా రూపుదిద్దుకొనుచున్నవో చూచితిమి. ఈ మూడవ చరణములో ఆ కదలికలన్నియు పరాకాష్ఠకు చేరినట్లు కనిపించును.

కాని అన్నమాచార్యులు వాటిని ఖండించుటలేదు. ప్రశంసించుటలేదు.

ఆకర్షణలు, మోహములు, అనుబంధములు, అనుభవములు తమ పని తాము చేసుకొనుచున్నవి. జీవి వాటిలో చిక్కుకొని వాటినే జీవనమని భావించుచున్నాడు. ఈ స్థితినే "గద్దరి నీ యలపు" అనే పదముతో కవి సున్నితముగా సూచించుచున్నాడు. ఇక్కడ గద్దరి అనగా నింద కాదు; మాయ యొక్క విచిత్ర స్వభావమును సూచించు కవితాత్మక ప్రయోగము. అయితే చరణము చివరలో ఒక్కసారిగా దృష్టి మారును.

"అద్దపు నీ మోము" అనే పాదము కీర్తనకు కీలకము. ఇంతవరకు కనిపించిన సిగ్గు, వలపు, మోహము, యౌవనము, అనురాగము అన్నిటికీ మూలమగు ఆ సౌందర్యము, ఆ స్పష్టత, ఆ చైతన్యము అద్దమువలె తేటతెల్లముగా ప్రత్యక్షమగుచున్నది. ఇదే పల్లవిలోని "వెన్నెలబొమ్మ".

విద్యుత్తు ప్రవహించినపుడు తంతి ఒక్కసారిగా వెలిగినట్లు, జీవితం యొక్క అంతఃసంబంధములు ఒక క్షణములో స్పష్టమగు స్థితి. ఆ స్పష్టత ముందు మోహములు గాని, ఆకర్షణలు గాని, రతిసాములు గాని ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవిగా నిలువవు. వాటిని ఖండించవలసిన అవసరమూ లేదు. ఆ స్పష్టత కలిగినచోట అవి తమ తగిన స్థానములలో తామే నిలుచును.

అందువలన ఈ చరణము శృంగార వర్ణనతో ముగియదు; అద్దపు నీ మోము అనే దర్శనముతో ముగుస్తుంది. అదే ఈ కీర్తనకు శిఖర స్థానం.

T-338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా

  తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 338 తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా For English Version Press Here   పరిచయం   " తల్లికిఁ గలుగు మ...