తాళ్లపాక అన్నమాచార్యులు
339 ఇందుకొరకె యిందరును నిట్లయిరి
For
English Version Press Here
మనందరిలోనూ
అభయయుడైన పరమేశ్వరుడు ఉన్నాడని చెబుతారు. లోపల ఉన్న వానిని లోపల నుండే
కలుపుకొనవలెను. ఆ సంబంధమే పరము అనుకోవచ్చును. ఇక్కడ ముఖ్యంగా
గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే, మన మనసులో
పరము అంటే 'ఇది' అను ఒక చిత్రము ఉంటే,
మనకు ఆ చిత్రమే పరముగా కనిపిస్తుంది. అటువంటి మనోచిత్రములను దాటి
ఉన్నదే పరము.
కానీ
పరమును మన ప్రయత్నంతో సాధించలేము. అది ఈశ్వరుడు ఒసగునది. అయినప్పటికీ, అందులో మానవుని కర్తవ్యం లేదనుకొనరాదు. మనమున్న
స్థితిని పూర్తిగా గ్రహించుటే ముఖ్యము. ఆ స్థితిని అట్టడుగు దాకా తెలుసుకుంటే చాలు
అని అన్నమాచార్యులు ఈ కీర్తనలో సూచిస్తున్నారు.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 2-5 సంపుటము - సంకీర్తన: 1-11
|
|
ఇందుకొరకె యిందరును నిట్లయిరి కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు ॥ఇందు॥ అటమటపు వేడుకల నలయించి మఱికదా ఘటియించుఁ బరము తటుకన దైవము ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు ॥ఇందు॥ బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా కొం డనుచుఁ బర మొసంగును దైవము బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు ॥ఇందు॥ మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా తనభ క్తి యొసఁగు నంతట దైవము ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు ॥ఇందు॥
|
Details
and Explanations:
పల్లవి:
ఇందుకొరకె
యిందరును నిట్లయిరి
కిందుపడి
మఱికాని గెలుపెఱఁగరాదు ॥పల్లవి॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
|
అందువలననే ఎందరో సాధకులు ఈ రకంగా ఉన్నారు.
|
అందువలననే ఎందరు ప్రయత్నించినా అది సాధ్యముకానిది.
|
|
కిందుపడి మఱికాని
గెలుపెఱఁగరాదు
|
(కిందుపడి = క్రింద ఎంతవరకు పడగలం?
నేల మీద పడగలం. అన్నమాచార్యులు
అట్టడుగు దాకా పడినకాని అన్న అర్థంలో వాడారు)
అట్టడుగు దాకా వెళ్లకపోతే గెలుపు ఎఱఁగలేము
|
ఇది కనపడినంత సులభం కాదు. అట్టడుగు దాకా తెలిసినదాకా, తెలిసినట్లే అనిపించిన
జ్ఞానానికి విలువలేదు.
|
గూఢార్థవివరణము:
“కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు”:
అన్నమాచార్యులువారు ఏమి చెప్పదలుచుకున్నారో విచారింతము. ప్రస్తావనలో చెప్పుకున్నట్లు లోపల నుండి లోపలది తెలియవలెను. మరి దానిలో అట్టడుగుకు వెళ్లడం అంటే ఏమిటి? మానవుడు
తెలియగలిగిన దానికి పరిమితి లేదు. అలాంటప్పుడు నిజంగా
అట్టడుగుకు వెళ్లడం సాధ్యమేనా? విచారింతము. ముఖ్యంగా గమనించవలసినది తెలుసుకోవాలి అనుకోవడమే ఆ అపరిమితమును విధిస్తుంది.
తెలుసుకోవాలి అని లేనప్పుడు దానికి అర్థం ఉండదు. మరి అట్టడుగున వుంటున్నదేమిటి? సులభం! “తెలియవలెను తెలుసుకోవలెను తెలుసుకుంటాను” అనే తపన లేని స్థితి.
మొదటి చరణం:
అటమటపు వేడుకల
నలయించి మఱికదా
ఘటియించుఁ
బరము తటుకన దైవము
ఇటు సేయ
నీశ్వరున కీసు గలదా? లేదు
కుటిలమతిఁ
గని కాని గుణిఁ గానరాదు ॥ఇందు॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ అర్థము
|
అంతరార్థము
|
|
అటమటపు వేడుకల నలయించి మఱికదా
|
(అటమటపు = దుఃఖం, నిజము కాని; అలయించి = మించి); దుఃఖమును, నిజము కాని వాటిని దాటిన తరువాతే కదా...
|
అసత్యమైన వాటి స్వభావాన్ని పూర్తిగా గ్రహించిన తరువాతనే సత్యము
వెల్లడవుతుంది.
|
|
ఘటియించుఁ బరము తటుకన దైవము
|
(ఘటియించుఁ=కలిగించు) దైవము తటుకన ప్రసాదించుఁ బరము.
|
మనసు సిద్ధమైనప్పుడు ఆ పరము స్వయంగా ప్రత్యక్షమవుతుంది.
|
|
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు
|
(ఈసు = ఈర్ష్య) ఈశ్వరునికి మనపై కోపమేమీ లేదు.
|
జీవితంలోని అనుభవాలు శిక్షలు కావు; అవి అవగాహనకు అవకాశాలు.
|
|
కుటిలమతిఁ గని కాని గుణిఁ
గానరాదు
|
మనలోని కుటిలత్వం తెలియక అసలు మంచి గుణం తెలియదు.
|
మనసు కుటిలత్వం ఆసాంతము చూసిన తరువాతనే నిజమైన గుణము తెలుస్తుంది.
|
ఈ
చరణములో అన్నమాచార్యులు అసత్యమైనదాని లక్షణమును తెలియ మంటున్నారు. ఇంతకుముందు కీర్తనలో చైతన్య స్థితిలో తెలియగలిగినవన్నీ క్షరములు అని మనం
తెలుసుకున్నాం. వీనిని మనసు లేదా బుద్ధి ద్వారా గ్రహిస్తాము. అస్థిరము అని చెప్పుకోవడం ఒకటి, వాస్తవంగా
గ్రహించుట ఒకటి. ఆ క్షణములో అది తనకులేని అస్తిత్వమును వదలును.
ఈ రకంగా చూస్తే తన యొక్క అస్థిరత్వం గ్రహించినది లోకములో గొప్ప
విషయము.
“కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు”: ఒకటవ నాలుగవ పంక్తులు
ఒకే విషయాన్ని సూచిస్తున్నవి. మనసు అనంతముగా ప్రతిబింబించు లక్షణముగలది. మన మనసులో పరము గురించి ఏ చిత్రం ఉంటే అదే పరముగా అనిపింపచేయును. కాబట్టి
సాధకుడు తన మనసు ఏ రూపై నిల్చుచున్నదో నిరంతరం గమనించవలెను.
రెండవ చరణం:
బెండుపడ
నవగతులఁ బెనఁగించి మఱికదా
కొం డనుచుఁ
బర మొసంగును దైవము
బండు సేయఁగ
హరికి బంతమా? యటుగాదు
యెండ దాఁకక
నీడ హిత వెఱఁగరాదు ॥ఇందు॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
బెండుపడ నవగతులఁ బెనఁగించి
మఱికదా
|
(బెండుపడ = నిస్సత్వమగు,
బలహీనమగు); నిస్సత్వము, బలహీనము చేయు చెడు గతులను వదలిన తరువాత కదా
|
మన యిష్టాయిష్టాలు రెండూ మనలను బలహీనులను చేసే అలవాట్లు.
వాటిని దాటిన తరువాతనే కదా
|
|
కొం డనుచుఁ బర మొసంగును దైవము
|
అప్పుడు దైవము పరమును అనుగ్రహిస్తుంది.
|
పూర్వాధారాలు పూర్తిగా తొలగిన తరువాతనే కదా పరమునకు అవకాశం.
|
|
బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు
|
హరి మనలను బంధించడు.
|
మన బంధాలకు కారణం దైవము కాదు; మన స్వంత స్థితి. (338వ కీర్తన చూడండి)
|
|
యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు
|
(బండు సేయఁగ = బద్దు చేయు,
ఆరడి చేయు) ఎండ తెలియక నీడ సుఖం తెలియదు.
|
ఎండ చురుక్కుమంటే కదా నీడలో ఉన్న సుఖము తెలిసేది. ఒక అనుభవం పూర్తిగా తొలగిన తరువాతనే దానిని
దాటి ఉన్నదాని విలువ తెలుస్తుంది.
|
గూఢార్థవివరణము:
“బెండుపడ నవగతులఁ
బెనఁగించి మఱికదా”: అన్నమాచార్యులు ఇక్కడ లోతైన పరిశీలన చూపుచున్నారు. ముఖ్యంగా
మనం ఆలోచించవలసినది మన అలవాట్లు ఇష్టాయిష్టాలు. ఊహలు,
ఉద్రేకాలు, కోరికలు ఊవెత్తున లేచిపడ్డప్పుడు అవి
నాగటి చాలులా, వెల్లువ
పారుటకు కాలువలా పనిచేసి మనం ప్రతిసారి ఒకే బాటలో (పథము నందు) ప్రయాణించునట్లు చేయును. కావున కావున ఇవి మనలను ఏ
దారిలో నడిపిస్తున్నవో గమనించుట అవసరము. వీటిని అధిగమించుట అత్యంత కఠినము.
“యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు”: దీనిని అతి జాగ్రత్తగా గమనించండి. సులభమైన విషయములను చెప్పుటలేదు. మండుటెండవలె పరీక్షించే పరిస్థితిలో నిలబడగల ధైర్యమూ, శ్రద్ధా లేకపోతే మనము దేనిని పట్టుకొని ఉన్నామో దానిని విడిచుట ఎట్లు? నీటి ప్రవాహములో ములిగిపోతున్నవాడు గడ్డిని కానీ చివరకు పామును కానీ పట్టుకుని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంతేకానీ "తను వేసుకున్న అంగి ప్యాంటు రంగుకు సరిపోతున్నదా? లేదా"? అని ఆలోచించడు.
మూడవ చరణం:
మునుప వేల్పులకెల్ల
మ్రొక్కించి మఱికదా
తనభ క్తి
యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు
గపటమా? అటుగాదు
తినక చేఁదునుఁ
దీపు తెలియనే రాదు ॥ఇందు॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
మునుప వేల్పులకెల్ల
మ్రొక్కించి మఱికదా
|
ముందు అనేక దేవతలకు మొక్కిన తరువాతే కదా
|
మానవుడు ఏవైతే గొప్పవిగా, ఆశ్రయముగా, తన కోరికలను తీర్చగలదానిగా భావించి దాని
ముందు తలవంచునో, అవన్నీ ఈ "వేల్పులు". ధనము,
కీర్తి, అధికారం, జ్ఞానము,
సిద్ధులు, స్వర్గము మొదలైనవి.
|
|
తనభక్తి యొసఁగు నంతట దైవము
|
అప్పుడు దైవము తన భక్తిని ప్రసాదిస్తుంది.
|
ఇతర ఆధారాలు తప్పుకున్న తరువాతనే నిజమైన భక్తి సహజంగా
వికసిస్తుంది.
|
|
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు
|
వేంకటేశ్వరుడు మోసం చేయడు.
|
దైవము మనలను మభ్యపెట్టదు; మన అవసరాలకు అనుగుణంగానే జీవితం సాగుతుంది.
|
|
తినక చేఁదునుఁ దీపు తెలియనే
రాదు
|
తినకపోతే చేదు రుచి తెలియదు.
|
ప్రత్యక్ష అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు; తెలిసిన అవగాహన అపోహ మాత్రమే.
|
గూఢార్థవివరణము:
“మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా”: ఇక్కడ "వేల్పులు" అనగా దేవతలు మాత్రమే కాదు. మనసు దేనినైతే
గొప్పదిగా, ఆశ్రయముగా, తన కోరికలను
తీర్చగలదిగా భావించి దాని ముందు తలవంచునో, అవన్నీ ఈ
"వేల్పులు". ధనము, కీర్తి, అధికారం,
జ్ఞానము, సిద్ధులు, స్వర్గము,
చివరకు మనం మనసులో నిర్మించుకున్న దేవుని రూపము కూడా దీనిలో
చేరవచ్చును.
అంటే
మన జీవితం ఆయా "వేల్పుల" దారిలోనే సాగుతుంది. ఈ బాటలో అనేక మొక్కులు, అనేక అనుభవాలు. కానీ శాంతి ఎక్కడ? వాటిలో ఏదీ
మనిషిని పూర్తిగా తృప్తిపరచలేదని గ్రహించాలి కదా! ఆ తరువాతనే భక్తికి అవకాశం
కలుగుతుంది.
“తనభక్తి యొసంగు నంతట దైవము” అనే
పాదము ఈ కీర్తనలోని అత్యంత ముఖ్యమైన పాదము. భక్తిని మనిషి తయారుచేసుకొను ద్రవ్యం
కాదు. మనసు పట్టుకున్న ఆధారాలన్నీ సహజంగా సడలినప్పుడు, దైవమే తన భక్తిని ఒసగుతుంది. అందుకే అన్నమాచార్యులు వెంటనే “ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు” అంటారు. దైవము ఎవరినీ మోసగించదు. మన స్థితికి తగినదే మనకు
ప్రత్యక్షమవుతుంది.
చివరిగా
“తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు”
అని ఈ చరణాన్ని ముగిస్తున్నారు. చేదును గురించి ఎంత విన్నా, రుచి చూడకపోతే అది తెలియదు. అలాగే జీవితంలో మనం పట్టుకున్న ఆధారాల అసలు
స్వభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోకపోతే వాటిని విడిచిపెట్టడం కూడా సాధ్యం కాదు.
X-X-X THE
END X-X-X
