తాళ్లపాక అన్నమాచార్యులు
309 ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
For English version
press here
ఉపోద్ఘాతము
ఏమి సేయఁగవచ్చు: ఇది నిరాశావాదం కాదు. అసలు జీవితం సమస్యా కాదు, పరిష్కరించ వలసిన పజిల్ కానీ కాదు. మనమున్న
స్థితి అలాంటి భావన వచ్చేలా చేస్తుంది. మనము కార్య కారణ సంబంధముల ఆవేశిత క్షేత్రములో
నిలబడి చూచు స్థితి. అనగా మన ఇప్పటి భావనలేవీ
ఈశ్వరాధీనమైన చర్యలు కావు. “ఏమి సేయఁగవచ్చు?” అని అన్నమాచార్యులు అడిగినది కచ్చితముగా
అలోచించ వలసినదే.
ఈ కీర్తనలో అన్నమాచార్యులు మానవ జీవితాన్ని ఒక పరిష్కరించవలసిన
సమస్యగా చూడరు. సాధారణంగా మనము జీవితం ఒక పజిల్లా భావించి దానిని
పరిష్కరించగలిగితే ఏదో ఒక ఫలితం లేదా ప్రతిఫలం దొరుకుతుందని ఆశిస్తాము. కాని కవి
చూపుతున్న దృక్కోణం వేరే. జీవితం పరిష్కరించవలసిన సమస్య కాదు; పరిశీలించవలసిన ప్రవాహం.
మనము సాధారణంగా “చేయుట” మీదే దృష్టి పెడతాము. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో
మార్పు తేవాలి అని మనస్సు నిరంతరం చర్యలో పడుతుంది. కాని కవి సూచన వేరే దిశలో
ఉంది. మన చర్యల స్వభావం ఏమిటి? అవి ఎక్కడి నుండి
పుట్టుకొస్తున్నాయి? వాటి వెనుక ఉన్న ఆకర్షణలు, భయాలు, ప్రతిస్పందనలు ఏమిటి? — ఇవి గమనించడమే అసలు పరిశీలన.
ఈ పరిశీలనకు సహనం అవసరం. ఎందుకంటే చర్య తక్షణ ఫలితాన్ని
కోరుతుంది; కాని అవగాహనకు కాలం కావాలి. మనస్సు
ఈ నిరీక్షణను తట్టుకోలేక మళ్లీ మళ్లీ చర్యల వైపే పరుగెడుతుంది. ఈ ఆతురత వల్లే మనము
మన చర్యల మూలాన్ని గమనించలేము.
అందువల్ల ఈ కీర్తనలో కవి ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నారు: చర్యలతో ప్రపంచాన్ని (అందులోని 'నేను' కూడా కలిపి) సరిచేయడం మన
చేతిలో ఉండకపోవచ్చు. కానీ చర్యల స్వభావాన్ని గమనించడం మాత్రం మనకు సాధ్యమే. ఆ
గమనికలోనే మన స్థితి స్పష్టమవుతుంది.
ఈ కీర్తన ఒక నైతిక బోధ కాదు; ఒక పరిశీలన. మానవుడు ఎలా చర్యలలో చిక్కుకొని తిరుగుతున్నాడో చూపిస్తూ — ఆ
చర్యల మూలాన్ని నిశ్శబ్దంగా గమనించమని కవి సూచిస్తున్నారు. ఈ అవగాహన కలిగినప్పుడు
మాత్రమే మన చర్యల స్వరూపం మారవచ్చును.
"మన దుఃఖానికి కారణం ఈశ్వర సంకల్పం కాదు,
మన మనస్సు సృష్టించుకునే వ్యర్థమైన తాపత్రయమేనని అన్నమయ్య
ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ప్రవహించే నదికి చెయ్యి అడ్డంపెట్టి దారికి
తీసుకురావాలని చూసే అవివేకం మన ఆరాటం. జీవితం కఠినమైనదని కాదు, అవశమైన దానితో (ప్రకృతి ప్రవాహంతో) నిరంతరం మల్లయుద్ధం చేస్తున్నందువల్లే
మనం డీలా పడిపోతున్నాము."
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 36-2
సంపుటము: 1-221
|
|
ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు తామసపు బుద్ధి కంతలు దూరవలసె ॥ఏమి॥
తెగి దురాపేక్షఁ బడ తివియ గతిలేదుగన పగగొన్న వగల కూపములఁ బడవలసె తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన మగుడఁబడి భవముతో మల్లాడవలసె ॥ఏమి॥
పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన కోపబుద్ధులచేత కొరమాలవలసె రూపములఁ బొడగాంచి రోయఁ దరిలేదుగన తాపములచేఁ బొరల తగులుగావలసె ॥ఏమి॥
తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగన గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె ॥ఏమి॥
|
Details
and Explanations:
పల్లవి:
ఏమి సేయఁగవచ్చు
నీశ్వరాధీనంబు
తామసపు బుద్ధి
కంతలు దూరవలసె ॥ఏమి॥
|
Telugu
Phrase
|
Meaning
|
|
ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
|
సర్వము ఈశ్వరాధీనము అయినప్పుడు మానవులకు చేయుటకు ఏమీ లేదు.
|
|
తామసపు బుద్ధి కంతలు దూరవలసె
|
కానీ తామసమునకు లోనై బుద్ధి రహస్య స్థలముల అన్వేషణలో కూరుకుపోయినది
|
సూటి భావము:
వాస్తవముగా
మానవులు చేపట్టుటకు కార్యములు ఏమీ ఆదేశీంపబడలేదు.
సర్వము ఈశ్వరాధీనము. కానీ తామసమునకు లోనైన బుద్ధి రహస్య స్థలముల అన్వేషణలో కూరుకుపోయినది.
సూచిత భావము
సర్వము
ఈశ్వరాధీనమని గ్రహించక ఏమీ చేయుటకు లేని స్థితిని తట్టుకోలేని బుద్ధి, ఏదో చేయ బోయి కాని పనులలో చిక్కుకొనును.
గూఢార్థవివరణము:
ఏమి
సేయఁగవచ్చు: ఏమీ చేయక
ఉండుట ఏల కష్టమో తెలుసుకుందాం. ఏమీ చేయని మనసుకు కాలము ఎలా గడుపుట అన్నదే ముఖ్య సమస్య.
అనగా మానవుని మనస్సు కాలముతో కలిసి పనిచేయును.
కాలము అను గడియారము లేక అది విచ్ఛిన్నమగును. కాలముతో క్షీణించుట ప్రకృతి స్వభావము.
కానీ, మనము దానిని మరల మరల పునశ్చరణ చేయుటవలన నిలిపి యుంచుదుము.
మనము ఏ
పదార్థముతో చేయబడిన వారమో అదియే మనలను నిర్దేశించు
చున్నది. అటులనే నేను, మనము అను ఊహ కూడాను. మనకై మనము పరీక్షించుకొననంత
వరకు ఈ వాస్తవమును గ్రహించుట కష్టమే.
కల్టివేషన్
ఆఫ్ ఐడియాస్ (విత్తుటకు సిద్ధముగా ఉన్న వ్యవసాయ క్షేత్రము): దీనిపై
రెనే మాగ్రిట్టే గారు వేసిన “ద కల్టివేషన్ ఆఫ్ ఐడియాస్” అను పేరు గల 1928వ సంవత్సరపు అధివాస్తవిక చిత్రము ద్వారా మరి కొంత
విశదపరచుకుందాం.
ఇది ఒక
ప్రకృతి దృశ్యము చూపుతున్నట్లు అనిపిస్తుంది. కనబడుతున్న రెండు కాండములు కాళ్ళు అనుకుంటే
వాని శిఖరములు పైభాగములు ఆకులు, కొమ్మలు కలిసిపోయి ఒక మనిషిని తలపింప
చేయుచున్నవి. అస్పష్టంగా ఉన్నటువంటి ఆకుల గుంపులు మన మనసులో మెదడు ఆలోచనల వంటివి అనుకోవచ్చు.
అతడు ఒక నది లాంటిది దాని ముందు నిలబడి తిలకిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ మనిషి ఒక
కృత్రిమమైన చదును నేలపై నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆ నది అతడి
కాళ్ళ దగ్గర లోతు లేతక్కువగాను, దూరం పోతున్నకొలది లోతు, వేగము పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ కృత్రిమ గట్టు మీద నిలబడిన వానికి ఆ నదిలో తాను తప్ప తక్కినవారందరూ
కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తుంది”. జాగ్రత్తగా గమనిస్తే ఆ బొమ్మ మొత్తం నిద్ర నుండి
మెలుకువలోనికి వచ్చుచూ, అతడు పూర్తిగా స్పృహలో లేనప్పుడు ఒక వ్యక్తి
అనుభూతి చెందగల వాతావరణాన్ని చిత్రం చూపిస్తుంది.
తామసపు
బుద్ధి కంతలు దూరవలసె: ఈ రకముగా
మానవుల అందరి ఆలోచనా విధానములు ఒక సార్వజనిక ఊహలతో (ఆ నది లాంటి దానితో) కలుపబడి దానికి
అనుగుణముగా ప్రవర్తించుటకు ఉద్యమిస్తాడు. అందుకనే ఒక ప్రాంతము వారు ఒకే విధమైన సామాన్య
స్వభావమును కలిగి వుండడం వింత కాదు. ఈ విధముగా పైపైకి మనం స్వతంత్రముగాఁ యోచనలు చేయుచున్నట్లు
కనపడినాను అంతర్గతముగా మనము స్వతంత్రులము కాము. ఆ చిత్రములోని వ్యక్తి కృత్రిమమైన చదును
నేలపై నిలబడినట్లు చూపడం ముఖ్యంగా గమనించ తగ్గది.
మనము ప్రయత్నపూర్వకముగా కట్టుకొన్న పునాదులపై నిలబడి యోచన చేయువారము.
మన శరీరము, జ్ఞాపకములు, నిక్షిప్తమై వున్న అనుభవములపై నిలబడివున్నవి
ఆ పునాదులు. ఇవి అన్నియును (నేత్ర, శ్రవణ, ఘ్రాణ, జిహ్వ శరీర) స్పర్శ ప్రధానముగానూ సుఖము,
ఆనందము కేంద్రముగాను ఉత్తేజ
పరచబడుచున్నవి. ఆ విధంగా అవేశమను క్షేత్రములో ఉన్న మనసు ఎదో ఒక వైపు లాగ బడును.
ఇతరుల మాదిరిగానే తాను కూడా ఆ ప్రవాహములో అవశముగా కొట్టుకొనిపోవుచున్నానని గ్రహించు
వానికి సత్యం వైపు నడుచుటకు అవకాశం కలదని చెబుతున్నారు.
తామసపు
బుద్ధి కంతలు దూరవలసె అనేది అవివేకముగా కట్టుకున్న
మన మనో బలము విచ్ఛిన్నమై మనకు అలవాటైన మార్గములోకి ఆ బొమ్మలోని చెట్లవలె
నిస్సహాయముగా నెట్టి వేయ బడుటను సూచిస్తోంది. ఈ ఒత్తిళ్ళలో నిజ స్థితిలో నిలబడలేని
బుద్ధి కార్యమును ఆలంబనగా చూచి రహస్య మార్గములలోకి దూరుతుంది. ఈ పక్కదారుల
అన్వేషణనే అన్నమాచార్యులు సంక్షిప్తంగా “తామసపు బుద్ధి కంతలు దూరవలసె”
అని చెప్పారు. ఇది నైతిక విమర్శ కాదు; మనస్సు తన స్వభావం వల్ల ఎలా
ఆలోచనలను “విత్తి పెంచుకుంటుందో” అనే పరిశీలన.
మొదటి చరణం:
తెగి
దురాపేక్షఁ బడ తివియ గతిలేదుగన
పగగొన్న వగల కూపములఁ బడవలసె
తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
మగుడఁబడి భవముతో మల్లాడవలసె ॥ఏమి॥
|
Telugu Phrase
|
Meaning
|
|
తెగి దురాపేక్షఁ బడ తివియ గతిలేదుగన
|
(మోక్షము కొరకు) తీవ్రమైన ఆకాంక్షతో సాహసించు
సంకల్పము మనకు కనిపించుటలేదు
|
|
పగగొన్న వగల కూపములఁ బడవలసె
|
అందువలన ప్రతీకార, మాయా, వంచనల కూపములలో పడిపోతున్నాము
|
|
తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
|
మోహమనే జలములను దాటి బయటకు రావాలనే సంకల్పము లేదు
|
|
మగుడఁబడి భవముతో మల్లాడవలసె
|
(మగుడఁబడి=వక్రించబడి)
వక్రించిపోయి జీవనముతో మల్లయుద్ధం చేయవలసి వచ్చుచున్నది
|
సూటి భావము:
మానవులకు
మోక్షముపై తీవ్రమైన ఆకాంక్ష కనబడదు. అందువల్ల మోహమనే జలములను దాటి బయటకు రావాలనే
ప్రయత్నము ఉండదు. అటువంటి స్థితిలో మనిషి మాయ, ప్రతీకార
భావముల కూపములలో పడిపోతూ జీవనముతో మల్లయుద్ధము చేయవలసి వచ్చును.
గూఢార్థవివరణము:
ఈ
చరణంలో అన్నమాచార్యులు మానవుని అంతర్గత స్థితిని అద్దం పెట్టి చూపుతున్నారు. మనము
సాధారణంగా “విముక్తి” గురించి మాట్లాడుతాము. కాని ఆ దిశగా సాహసించు తీవ్రమైన
ఆకాంక్ష మనలో నిజంగా వుందా? అనే ప్రశ్నను కవి
ముందుంచుతున్నారు. “తగు మోహసలిలంబు దాఁట మతి లేదుగన” అనే వాక్యము ఈ విషయాన్ని
స్పష్టపరుస్తుంది. అనగా మోహమనే ప్రవాహాన్ని దాటి బయటకు రావాలనే మనసు
సిద్ధపడుటలేదు. అయితే ప్రపంచానికి ఆ ప్రయత్నములో వున్నామని చూపుటలో మాత్రం
వెనుకాడము. దీనికి దైనందిన జీవితంలో ఎన్నో ఉదాహరణలను గమనించవచ్చు.
ప్రబలమైన
సంసిద్ధత లేకపోవుట వలన, జీవితం పట్ల మన ఉదాసీనత
పైబడినప్పుడు మనస్సు మరొక దారిని చేపడుతుంది. అది పగ, ప్రతీకారము,
వంచన, స్వప్రతిష్ఠ వంటి భావనలతో నిండిన “వగల
కూపములలో” పడిపోవడం. ఇవి మనిషిని ముక్తి వైపు లాగవు; మరింత
లోతుగా బంధించును.
ఈ
స్థితిలో జీవితం క్షణక్షణం మల్లయుద్ధముగా మారుతుంది. జీవనముతో పోరాడుతూ, తాను గాయపడుతూ ముందుకు సాగవలసి వస్తుంది. “మగుడఁబడి” అనే పదం ఈ
వక్రీకరణను సూచిస్తుంది — మనస్సు తన సహజ స్థితిని కోల్పోయి వక్రముగా ప్రవర్తించుట.
ఇక్కడ
నైతిక విమర్శ లేదు. మన చర్యల పర్యవసానమును మాత్రమే చూపుతున్నారు. విముక్తి వైపు
తిరగని మనస్సు సహజంగానే ప్రతిస్పందనలు, సంఘర్షణలు, పోరాటములలో
చిక్కుకుంటుందని అన్నమాచార్యులు సూచిస్తున్నారు.
రెండవ చరణం:
పాపకర్మములఁ
జంపఁగ శక్తిలేదుగన
కోపబుద్ధులచేత కొరమాలవలసె
రూపములఁ బొడగాంచి రోయఁ దరిలేదుగన
తాపములచేఁ బొరల తగులుగావలసె ॥ఏమి॥
|
Telugu Phrase
|
Meaning
|
|
పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన
|
పాపకర్మలను పూర్తిగా తొలగించగల శక్తి మనకు లేదు
|
|
కోపబుద్ధులచేత కొరమాలవలసె
|
(కొరమాలవలసె = నిరుపయోగముగా
వుండ వలసె) కోపం, ప్రతిస్పందనల చేత నిరుపయోగముగా
వుండ వలసె
|
|
రూపములఁ బొడగాంచి రోయఁ దరిలేదుగన
|
బాహ్య రూపాల ఆకర్షణను పూర్తిగా వదలలేము
|
|
తాపములచేఁ బొరల తగులుగావలసె
|
అందువల్ల వాటివల్ల కలిగే తాపాలకు గాయపడవలసి వస్తుంది
|
సూటి భావము:
పాపకర్మలను
పూర్తిగా నిర్మూలించగల శక్తి మనకు లేదు. అందుచేత కోపము, ప్రతిస్పందనలు, బాధల చేత నిరుపయోగముగా వుండ వలసె. బాహ్య
రూపాల ఆకర్షణను వదలలేక వాటివల్ల కలిగే తాపములకు మళ్లీ మళ్లీ చిక్కుకుని జీవనము గడుపుతాము.
గూఢార్థవివరణము:
“పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన” అనే
మాట ముఖ్యం. మానవులకు పాపపరిహారములు చేసుకొను శక్తిలేదు. కానీ ఆ వాస్తవాన్ని అంగీకరించుటకు
మనస్సు సిద్ధపడదు. సత్యమును ఒప్పుటకు బదులు లోలోపల మగ్గిపోతాడు. లేదా మొదటి చరణంలో
చెప్పిన వగల కూపములలో” పడిపోతాడు. అటుల మగ్గిన క్షేత్రములోను, విషయములలో చిక్కుకున్న మనసుకు కోపము సహజముగా జనియించును. కోపము నుండి విచక్షణా
రాహిత్యాము, అక్కడ నుండి స్మృతిభ్రంశము అందునుండి అధోగతి పాలౌతాడు.
అట్టివాడు నిరుపయోగముగా జీవిత మును గడుపును.
రూపము అనునది మదిలో నాటుకొన్న ప్రాథమిక చిత్రము. అలా నాటుకొన్న "రూపము"
అనునది పాపములాగే అంటుకొని వుంటుంది. వదలదు. రూపాలు, కల్పించిన
అనుభవాలు, ఆసక్తిని నిలిపి నిరంతరం తమవైపు లాగుతూనే వుంటాయి.
ఆరకముగా వాటిలో పొర్లుతూ తగిలి వుంటాము.
ఇక్కడ కూడా కవి నైతిక విమర్శ
చేయడం లేదు. జీవితం ఎలా కోపం, ఆకర్షణ, బాధల
చక్రంలో తిరుగుతుందో మాత్రమే చూపిస్తున్నారు. పైన పేర్కొన్న చిక్కులన్నీ ఆయా స్థితులనుండి
బయటకు వచ్చుటకు చేయు వృధాయత్నములు. అవి ఒక రకముగా బోనులో చిక్కుకున్న పులి బయటకు వచ్చుటకు
చువ్వల మధ్య తల దూర్చుట వంటివి. ఆ నిరర్థకత, నెమ్మదిగా కోపము,
బాధ, శోకముగా మారి దిగజార్చునే కానీ బయటపడు మార్గము
కానరాదు.
మూడవ చరణం:
తిరువేంకటాచలాధిపుఁ
గొలువలేదుగన
గరిమెచెడి
విషయకింకరుఁడు గావలసె
పరతత్వమూర్తిఁ
దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
దొరతనం బుడిగి
యాతురుఁడు గావలసె ॥ఏమి॥
|
Telugu Phrase
|
Meaning
|
|
తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగన
|
తిరువేంకటాచలాధిపునికి అహమును సమర్పించుకొనలేక
|
|
గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె
|
(గరిమెచెడి = సమత్వము చెడి) సమదృష్టి చెడి విషయములకు
బానిసయై గడుపవలసె
|
|
పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
|
విషయములలో వ్యస్తుడై పరతత్వమూర్తిఁని తలచుటకు సమయము లేక
|
|
దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె
|
ముందర ఉన్న దొరతనము ఇంకిపోయి ఆత్రుత ఉసిగొల్పగా నిష్క్రియుడుగా
మిగిలిపోయె.
|
సూటి భావము:
తన
అశక్తతను గమనించినప్పటికీ తిరువేంకటాచలాధిపునికి అహమును సమర్పించుకొనలేక, సమత్వం కోల్పోయి విషయములకు బానిసవై జీవించవలసి వస్తుంది. విషయ వ్యాపారంలో
మునిగిపోయి పరతత్వమూర్తిని తలచుటకు కూడా సమయము ఉండదు. అలా జీవిస్తూ ముందర ఉన్న
స్వతంత్ర భావన క్రమంగా కరిగిపోతుంది; చివరకు ఆత్రుతతో నిండిన
నిష్క్రియ స్థితి మిగులుతుంది.
గూఢార్థవివరణము:
ఈ చరణంలో అన్నమాచార్యులు
మానవుని స్థితిని ఒక మూల కారణానికి చేర్చుతున్నారు — అహంకారాన్ని విడువలేని మన
స్థితి.
“తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగన”
అనే వాక్యము కేవలం దేవాలయారాధనను సూచించదు. ఇక్కడ “గొలువుట” అనగా అహమును
సమర్పించుట, అనగా మనం నిర్మించుకున్న వ్యక్తిత్వ
కేంద్రాన్ని వదలుట. ఆ సమర్పణ జరగనప్పుడు మనస్సు తన సహజ సమత్వాన్ని నిలుపుకోలేడు.
అందుకే “గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె” అని కవి
అంటారు. సమత్వము చెడిన వెంటనే మనస్సు విషయాల వైపు జారిపడి వాటికే బానిసవుతుంది.
ఈ స్థితిని ఒక రూపకంతో
చెప్పాలంటే — మనం మధ్య అక్షంపై నిలబడలేకపోవుట. సమతుల్య స్థితి కోల్పోయిన వెంటనే మనస్సు అనుభవాల ప్రవాహంలోకి జారిపోతుంది.
అప్పుడు మన దృష్టి మొత్తం విషయాలపై వ్యయమవుతుంది. అందుకే కవి అంటారు —“పరతత్వమూర్తిఁ
దలఁపఁగఁ బ్రొద్దులేదుగన”.
ఇక్కడ “పరతత్వమూర్తి”
అనేది ఎక్కడో వేరే లోకంలో ఉన్న దేవుడు కాదు. అది మన అనుభవ క్షేత్రానికి అతీతమైన
మూల సత్యం. అది మనలోనే ఉన్నా మన అనుభవాల
నిర్మాణంలో భాగం కాదు. అందుకే మనస్సు విషయాలలో మునిగిపోయినపుడు దానిని గ్రహించుటకు
అవకాశమే ఉండదు.
ఈ విక్షేపం వల్ల మనిషి తన
సహజ స్వాతంత్రమును కోల్పోతాడు. కవి దీనిని “దొరతనం బుడిగి” అని చెప్పారు. ఇక్కడ “దొరతనం” అనగా బాహ్య అధికారము కాదు; అంతర్గత సమతుల్య స్వాధీన స్థితి. ఆ స్థితి
కరిగిపోయినపుడు మనిషి విషయాల చేత నడిపించబడే జీవిగా మారిపోతాడు. ఆ తరువాత అతని
జీవితం ఆత్రుత, అసంతృప్తి, నిరుపయోగతలతో
నిండిపోతుంది — “యాతురుఁడు గావలసె”.
అందువల్ల ఈ చరణం చెప్పేది
స్పష్టము:మనిషి అనుభవిస్తున్న సంఘర్షణల మూలం బయట ప్రపంచంలో లేదు. తన సహజ సమతుల్యతను కోల్పోయి, అహంకారాన్ని
వదలలేక విషయాల ప్రవాహంలో జారిపోవడమే అసలు కారణం.
కీర్తన సారం
పల్లవిలో కవి ఒక ప్రాథమిక
విషయాన్ని సూచిస్తారు: మనసుకు చేయుటకు ఏమీ లేకపోయినప్పుడు అది నిశ్చలంగా నిలబడలేక
అనవసరపు మార్గములను వెతుకుతుంది.
మొదటి చరణంలో ఆ స్థితి
మరింత స్పష్టమవుతుంది. మోహమనే ప్రవాహాన్ని దాటుటకు సాహసం లేక మనిషి జీవితముతో
మల్లయుద్ధము చేయవలసి వస్తుంది.
రెండవ చరణంలో ఆ పోరాటం
మరొక రూపం దాల్చుతుంది. కోపము, ఆకర్షణలు, ప్రతిస్పందనలు
మనసును ఆవరించగా జీవితం నిరర్థక చక్రములో తిరుగుతుంది.
మూడవ చరణంలో కవి మూల
కారణాన్ని చూపుతారు. అహంకారాన్ని సమర్పించలేక సమత్వము చెడిపోవుటవలన మనిషి
విషయములకు బానిసవుతాడు; తనలో సహజంగా ఉన్న స్వాధీన స్థితి
(దొరతనం) క్రమంగా కరిగిపోతుంది.
ఈ విధంగా ఈ కీర్తన మనిషి
అనుభవించే జీవిత గమనాన్ని చూపిస్తుంది —నిశ్చలంగా నిలబడలేని మనస్సు, మోహములో పోరాటం,
కోపము–ఆకర్షణల చక్రం, చివరకు సమత్వాన్ని
కోల్పోయిన స్థితి.
X-X-The
END-X-X