తాళ్లపాక అన్నమాచార్యులు
323 ఒక్కటి తరువాత వేరొకటై కాచుకుండు
For English version
press here
ఉపోద్ఘాతము
సంసార లక్షణము
మానవుని ముఖ్య సమస్య ఉజ్జాయింపు, అంచనా. మనం దేన్ని చూసినా—
అది ఏమిటి?
అది నన్నేం చేయగలదు?
దాని ప్రవృత్తి ఏమిటి?
దానితో నాకేమి సంబంధం?
దానితో నాకేమి లాభం?
ఇవే మన సహజ ప్రతిక్రియలు. ఈ విధమైన అంచనా ప్రతి విషయములోనూ
కొనసాగుతుంది. అయితే ఈ “సహజం” అనుకునే ధోరణికి ఆధారము, స్పష్టత ఉండదు.
మనందరికీ చిన్నప్పటినుంచి ఈరోజు దాకా—
మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఏమిటి?
దానితో ఎలా వ్యవహరించాలి?
మనకు దానితో సంబంధం ఏమిటి?
అనే ప్రశ్న ఏదో ఒక సమయంలో తప్పక పుడుతుంది.
ఈ ప్రపంచం కొంత అర్థమై, కొంత అర్థం కాక—అది స్పష్టంగా నిలవదు.
చూస్తే సాధారణంగా కనిపించే ఈ జీవనం—జాగ్రత్తగా గమనిస్తే ఒక్కటి
తరువాత ఒకటి జరిగే వరుసగా బయటపడుతుంది; కానీ పూర్తిగా ఒక ప్రణాళికగా, సమగ్ర రూపంగా
కనిపించదు.
ఈ ప్రపంచంలో ఒకే సమయంలో అనేక కార్యక్రమములు— విధ్వంసములు, యుద్ధములు, జన్మలు,
పుట్టుకలు, వ్యాపారములు—జరుగుతూనే ఉంటాయి. వాటన్నింటినీ ఏకకాలంలో ఆకళింపు చేసుకోవడం సాధ్యం
కాదు. దీని వలన మన అవగాహనలో సమగ్రత లోపిస్తుంది. ఈ లోపాన్ని పూరించుకోవడానికి మనము
దినపత్రికలు, ఇతరుల అభిప్రాయాలు, పెద్దల
సలహాలు ఆధారపడతాము. కానీ అవి కూడా సంపూర్ణంగా ఉండవని పరిశీలనలో బయటపడుతుంది.
మనము ఈ ప్రపంచపు జీవులమే— ఇదే మనకు కారణం, ఇదే మనలోని సారం. కణకణములోని నిర్మాణం. అయినా మనలో
ఏదో భావం— “నేను దీనికి చెందినవాడిని కాదు” అనే దూరాన్ని సృష్టిస్తుంది. దీంతో ఈ మనకు
ప్రపంచానికి మధ్య అంతరం ఏర్పడుతుంది. ఈ అంతరమే వాస్తవానికి అంచనాలకు మధ్య అంతర్యుద్ధం.
ఆ యుద్ధం ముగిసేది—మళ్ళీ ఇదే ప్రపంచంతో ఏకీభవించడంతోనే.
“మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి పోతున్నాము?”అనే ప్రశ్నలకు స్పష్టమైన నిర్ణయం చేయలేకపోతాం. అయినా మనకు తెలిసిన
పరిమిత దానితోనే ఆ నిర్ణయాన్ని చేయడానికి ప్రయత్నిస్తాము. ఆ నిర్ణయానికి తగిన
సామర్థ్యం మనకు లేదని గుర్తించము. ఈ స్థితిలో—దైవం ఉన్నాడని నిర్ధారించుకోవడం గానీ, లేడని
ఖండించడం గానీ—రెండింటిలోనూ ఒకే విధమైన అవివేకం కనిపిస్తుంది.
“నేను ఈ సంసారాన్ని కానీ ఆ దైవాన్ని కానీ
నిర్ధారించలేను” అనే స్పష్టత వివేకానికి ప్రారంభంగా కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో— మనిషి పని దేవుని గురించి ఆలోచించడం, స్తుతించడం కాదు; తనను ఏది
నడిపిస్తోందో గమనించడం. అదే సంసార లక్షణము తెలియుట.
కీర్తనలోని
భావపురోగతి
పల్లవి
— ఈ సంసారము ఆగని చక్క తెరనాటకము.
మొదటి
చరణం — పనుల దొంతరలతో ఒత్తిడిపెట్టి పనిగొను సంసారము.
రెండవ
చరణం — చాపకింది నీరువలె వ్యాపించు సంసారము.
మూడవ
చరణం — ఈ కార్యముల వరుసలో మునిగి విరామము లేక సమయం
గడచిపోతుంది.
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 220-4
సంపుటము: 3-111
|
|
ఒక్కటి తరువాత వేరొకటై కాచుకుండు చక్క దెరనాటకము సంగతి సంసారము ॥పల్లవి॥
వొండె నాపద దీరితే నొండె సంపదైనా వచ్చు అండ నెన్నఁడుఁ దీరదు హరిఁ దలఁచ తండోపతండములై తలమోపులు పనులు చండిపెట్టి పనిగొను సంసారము ॥ఒక్క॥
పాప మొల్లనంటేను బలుపుణ్యమై తగులు యేపొద్దుఁ దీరదు హరి నిటు దలఁచ వోపనన్నాఁ బోనీదు వూరకైనఁ బనిగొను చాపకింది నీరువలె సంసారము ॥ఒక్క॥
పగలెల్లా నలసితే పైకొను రాతిరి నిద్ర అగపడ దెప్పుడును హరిఁ దలఁచ తగిలి శ్రీవేంకటాద్రి దైవమే పొడచూపఁగా జగడము సంతమాయ సంసారము ॥ఒక్క॥
|
Details
and Explanations:
పల్లవి:
ఒక్కటి తరువాత
వేరొకటై కాచుకుండు
చక్క దెరనాటకము
సంగతి సంసారము ॥పల్లవి॥
భావము:
ఒకదాని
తర్వాత ఒకటి నిరంతరముగా ఈ పనులు వస్తూనే ఉంటాయి. చక్క తెర నాటకములో
వెనుక తెరలు మారుతూ నాటకము ముగియనట్లు ఈ సంసారము కొనసాగుతూనే ఉండును.
గూఢార్థవివరణము:
ఒకదాని
తర్వాత ఒకటి పనులు విరామమివ్వక పైనపడుతూనే ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే మన జీవితం
ఈ విధంగానే కొనసాగుతున్నదని స్పష్టమవుతుంది.
ఒక పని
ముగిసిందనుకునేలోపే మరొకటి మొదలవుతుంది. మారుతున్నది పనులు మాత్రమే. మారుతున్నది పాత్రలు—నిలిచేది అంతులేని వరుస.
పల్లవిలోని
సూచన: అడుగులేని మడుగులా—ముగింపు కనిపించని చలనము ఈ సంసారము.
మొదటి చరణం:
వొండె నాపద
దీరితే నొండె సంపదైనా వచ్చు
అండ నెన్నఁడుఁ
దీరదు హరిఁ దలఁచ
తండోపతండములై
తలమోపులు పనులు
చండిపెట్టి
పనిగొను సంసారము ॥ఒక్క॥
భావము:
(చండిపెట్టి = లోభపెట్టి, ప్రలోభములోకి
లాగి, బలవంతముగా లాగుకొని)
ఒక ఆపద
తీరితే వెనువెంటనే ఇంకో ఆపదో, సంపదో పైనబడును. ఎన్నడు అండనే ఉన్న
హరిఁ దలఁచుట (మాత్రం) తీరదు. ఈ పనులు అన్నీ తండోపతండములై తలమోపులై నిలుచును. ఆ రకముగా
చండిపెట్టి ఈ సంసారము పనిగొనును.
గూఢార్థవివరణము:
“చండిపెట్టి పనిగొను సంసారము” అనే వాక్యం ఈ చరణానికి
కేంద్రమే కాదు, కీర్తనకు కీలకము. ఇక్కడ “చండిపెట్టి” అనగా—ఒక
పని మరొక పనిని లాగుకొనివచ్చునట్లు.
“పనిగొను” అనగా—ఆగక వరుసలో పని కొనసాగునట్లు నియోగించుట. “చండిపెట్టి పనిగొను సంసారము” అనగా— సంసారము (తన యందలి
జీవులను) నిరంతరముగా, అవిరామముగా కార్యములలో
నియోగించుట. వానిలో మునిగిన వానికి తరువాతి పని చేయక "శాంతి"
కానరాదు. ఇది ముఖ్యంగా క్రియాశీల సంసారమును వుటంకించుచున్నది. సాంప్రదాయక రచనలలో ఇటువంటి పరిశీలనలు విప్లవాత్మకమని భావించవచ్చును.
ఒకటి
పూర్తికాకముందే ఇంకోటి పైనపడతాయి. ఇలా పనులు తండోపతండములై తలమోపులై నిలుస్తాయి. ఆ ఎడతెగని
కదలికలలో “అండ నెన్నఁడుఁ దీరదు హరిఁ దలఁచ” అనేది చోటు పొందదు.
“చండిపెట్టి పనిగొను సంసారము” అనే వాక్యం పరోక్షమే కానీ ప్రపంచపు క్రియాశీల
పాత్రను, దానిని నిరోధించలేని మానవుని అశక్తతను ఎత్తి చూపుతున్నది.
సమానాంతర
పరిశీలనలు
“చండిపెట్టి పనిగొను సంసారము” అనుదాని ఛాయలు కొంత భగవద్గీతలోని మూడవ అధ్యాయములోని
ఈ సంభాషణ (36, 37) నుంచి కూడా తెలియవచ్చు.
అర్జునుడు
ఓ కృష్ణా! అయితే మనుజుడు పాపము చేయరాదని కోరుతూనే, ఏదో ఒక శక్తి
బలవంతంగా నడిపించినట్టు పాపము చేయుచున్నాడు? దానికి సమాధానముగా భగవంతుడు ఇట్లనెను.
రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే ఏదో చేయ వలెనను కోరికలు, వాంఛలు
(తదుపరి క్రోధముగా పరిణామం చెందుతున్నవి). ఆ కార్యక్రమములు ఎంత చేసినా తృప్తిపొందనివి,
మహాపాపములకు కారణభూతములు అగుచున్నవి.
అలాగే బుద్ధుల
వారు కార్యకారణ సిద్ధాంతములో పేర్కొన్న "ఫస పచ్చయా వేదనా" (= 'ప్రపంచంతో' స్పర్శ వలన అనుభవములు) మరియు "వేదనా
పచ్చయా తన్హా" (= అనుభవములు వలన తృష్ణ పుట్టును) లను కలిపి సమాంతరముగా అనుకోవచ్చును.
రెండవ చరణం:
పాప మొల్లనంటేను
బలుపుణ్యమై తగులు
యేపొద్దుఁ
దీరదు హరి నిటు దలఁచ
వోపనన్నాఁ
బోనీదు వూరకైనఁ బనిగొను
చాపకింది
నీరువలె సంసారము ॥ఒక్క॥
భావము:
పాపం చేయకూడదనుకున్నా
పుణ్యమనే పని అంటుకుంటుంది. ఇలా నిరంతరంగా కార్యనిమగ్నుడైనప్పుడు "హరిని తలచుట
నిలవదు". కార్యములను నిలపాలనుకున్నా నిలుపలేడు. వూరికే ఉన్నా ఈ సంసారము తన పనిలో
నియోగించుకొనును. ఈ సంసారపు పని చాపకింది నీరువలె అప్రత్యక్షము. నిర్ణయించుట కష్టాసాధ్యము.
గూఢార్థవివరణము:
పాప మొల్లనంటేను బలుపుణ్యమై
తగులు: పాపమో పుణ్యమో; ఏ దిశలో కదిలినా, కదలిక మాత్రం సంసారగతమై ఉండునని
చూపుతుంది.
యేపొద్దుఁ
దీరదు హరి నిటు దలఁచ మానవుడు అవిరామముగా కార్యములలో నిమగ్నమై ఉండటం వలన
హరీని ఏక మనసుతో తలచ లేకపోతాడు.
వోపనన్నాఁ బోనీదు వూరకైనఁ బనిగొను: చేయనన్నా ఆగదు ఎందుకంటే చేయుట
మరియు చేయకుండుట - రెండూ సంసార కార్యములొని భాగములే; కావున వూరికే
ఉన్నా కొనసాగుతవి.
చాపకింది
నీరువలె సంసారము: చాప
పైకి పొడిగా కనిపించినా దాని కింద ఉన్న నీరు అనుభవంతోనే తెలిసినట్లు, ఈ సంసారము యొక్క కార్యము పరీక్షలకు, పరిశీలనలకు అందదు.
కనిపించినది నిలవదు; ఆధారం స్పష్టంగా కనిపించదు.
మూడవ చరణం:
పగలెల్లా
నలసితే పైకొను రాతిరి నిద్ర
అగపడ దెప్పుడును
హరిఁ దలఁచ
తగిలి శ్రీవేంకటాద్రి
దైవమే పొడచూపఁగా
జగడము సంతమాయ
సంసారము ॥ఒక్క॥
భావము:
అలసట శ్రమల
బ్రతుకు నిద్రకే అంకితం. ఆ జీవితంలో హరిని తలచుటకు అవకాశం ఉండదు. (ఆ ప్రయాసముల జీవితాన్ని వదలి శ్రీవేంకటాద్రి దేవునికి శరణంటే) ఆయనయే స్వయంగా
నీచూపుల రేఖ అవుతాడు. అప్పుడు (మనసు అను) సంసారంలో
కలహములు శాంతమవుతాయి. (లేదా తనకు సంసారానికి మధ్య బేధము అగపడదు.)
గూఢార్థవివరణము:
పగలెల్లా
నలసితే పైకొను రాతిరి నిద్ర: పగలు = జీవితం; రాత్రి= మరణం
అనుకొంటే ఈ జీవితం అనే అవకాశాన్ని “పనులలో” నియోగించి అలుపుతో గడుపు జీవితాన్ని చూపుతుంది.
అగపడ
దెప్పుడును హరిఁ దలఁచ: అల్లాటము, పరిశ్రమము ఆయాసముల బ్రతుకు నిద్రకే సమర్పణము. ఆ జీవితంలో హరిని
తలచుటకు అవకాశం ఉండదు.
సంసార
చలనము— నిరంతర వ్యవహారం
జగమే జగడము → అనేక అస్థిర చలనములు. ఈ ప్రపంచంతో సంబంధం → చర్యలకు మూలం. ఒక చర్య → మరిన్ని చర్యలకు దారితీయును. అటువంటి జీవన క్రమము → చిక్కుల పరంపర
మొదటి 12 పంక్తులు ఆ మానవునినే తన కార్యములలో నియోగించి సంసారము ఏరకముగా జీవితమును కబళించి వేయుచున్నదో చెప్పబడినది. కనబడు సంసారము యొక్క నైజమిది. సంసారమును కడు నిష్పక్షంగా గమనిస్తే అది స్థిరమైనది కాదని తెలియవచ్చు . అదే ఇక్కడ చెప్పిన సూచన.
తగిలి శ్రీవేంకటాద్రి దైవమే పొడచూపఁగా
తగిలి” — పై విధంగా చూచి తెలిసి ఈ సంసారంలో కేవలం చలనము తప్ప వేరేది కనబడక వున్న (స్థితిలో)
(పొడ = కాంతి, రేఖ; పొడచూపఁగా = కాంతి రేఖ కనపడగా)
“తగిలి శ్రీవేంకటాద్రి దైవమే పొడచూపఁగా” (దైవం అనే విషయం ఎప్పుడూ పరోక్షమే). కానీ ఈ సంసార లక్షణము తెలిసి ఏమీచేయక ఊరక వున్న దశలో సత్యము గోచరించును.
“జగడము సంతమాయ” — పరిణామం
చివరి
పంక్తి:
జగడము
సంతమాయ సంసారము
ఇది
రెండు విధములుగా అర్థమవుతుంది:
1. శాంతమాయెను
- విరోధం తగ్గిపోవడం
- కదలికతో పోరాటం ఆగిపోవడం
2. స్వంతమాయెను
- వేరు భావం తగ్గిపోవడం
- అదే సంసారం తనదిగా అనిపించడం
ఇవి
రెండూ ఒకే దిశను సూచిస్తాయి:
విభజన
తగ్గినచోట—జగడం నిలవదు
సంక్షిప్త
నిర్ధారణ
చర్యలలో
చిక్కదు జీవిత సారం—
ఆ గమనికలో విరోధం కోల్పోయి శాంతమవుతుంది.