Thursday, 20 August 2026

T-340 కంటి శుక్రవారము గడియ లేడింట

 

తాళ్లపాక అన్నమాచార్యులు
340 కంటి శుక్రవారము గడియ లేడింట 
For English Version Press Here
 
ఉపోద్ఘాతము
ఈ కీర్తనను మొదట చదివినప్పుడు ఇది శుక్రవారపు సేవలో స్వామివారి అలంకరణను వర్ణించే సంప్రదాయ భక్తి కీర్తనగా అనిపిస్తుంది. అయితే అన్నమాచార్యులవారి అంతర్వీక్షణలో ఈ దృశ్యము కేవలం బాహ్య అలంకరణగా నిలవదు.
 
వ్యక్తమైన అలమేలుమంగ రూపము ద్వారా అవ్యక్తమైన స్వామిని చూపించడం ఈ కీర్తనలోని ప్రధాన విశేషము. స్వామికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని చూపిస్తున్నట్లే కనిపిస్తూ, కవి ఒక్కొక్క చరణంలో ఆ రూపాన్ని మనకు అందకుండా చేస్తారు. సొమ్ములు, వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, కర్పూరము, నలుపు—ఇవన్నీ చివరికి స్వామి స్వరూపాన్ని నిర్ధారించలేని సూచనలుగా మారుతాయి.
 
అందువల్ల ఇది కేవలం స్వామివారి అలంకరణ వర్ణన కాదు. రూపమును ఆధారంగా చేసుకొని రూపాతీతాన్ని గమనింపజేసే అంతర్వీక్షణ. సంప్రదాయ భక్తి వర్ణనలా కనిపించే ఈ కీర్తనలో ప్రతి పదమూ ఆ దిశలో ఒక సూచనగా పనిచేస్తుంది.

 

అధ్యాత్మ​ సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 4 సంకీర్తన: 3
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని      ॥పల్లవి॥

సొమ్ములన్నీ కడఁబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబముకప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు ఱొమ్ము తల మొల చుట్టి
తుమ్మెదమైచాయతోన నెమ్మదినుండే స్వామిని ॥కంటి॥

పచ్చకప్పురమె నూఱి పసిఁడిగిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగ నలఁది
అచ్చెరపడిచూడ అందరికన్నుల కింపై
నిచ్చమల్లె పూవువలె నిటు తా నుండే స్వామిని ॥కంటి॥

తట్టుపునుఁగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరఁగించి వెండిపళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టువేడుక మురియుచుండే బిత్తరి స్వామిని   ॥కంటి॥
Details and Explanations:
పల్లవి:
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥పల్లవి॥      


భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
కంటి శుక్రవారము గడియ లేడింట
శుక్రవారము నాడు ఏడు గడియలపాటు స్వామిని కంటిని.
అన్నివేళలా, అన్ని ఘడియలలో రెప్పలా వెన్నంటి ఉండే వానిని చూచితిని.
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని
అలమేలుమంగకు అండగా ఉండే స్వామిని కంటిని.
వ్యక్తమైన అలమేలుమంగ రూపమునకు వెన్నంటి ఉండి, దానికి అండగా ఉన్న అవ్యక్త స్వామిని చూచితిని.
గూఢార్థవివరణము:

అన్నమాచార్యులవారి అంతర్వీక్షణలో కలిగిన అనుభవాన్ని ఈ పల్లవిలో చెబుతున్నారు. భగవానునికి ప్రత్యేకమైన రూపము లేదు. అయినప్పటికీ, ఆయనకు గోచరించినది అలమేలుమంగ రూపము.

ఇక్కడ అంటి” అనే మాట ముఖ్యమైనది. అలమేలుమంగ వ్యక్తమైన దానికి ప్రతీక. ఆ వ్యక్తమైన రూపమునకు వెన్నంటి, నీడవలె, అన్నివేళలా అండగా ఉన్నది అవ్యక్త స్వామి. అందుకే అలమేల్మంగ అండనుండే స్వామిని” అని అంటున్నారు.

అన్నమాచార్యులు అవ్యక్త స్వామికి ఒక కొత్త రూపాన్ని కల్పించడం లేదు. తనకు లీలగా గోచరించిన వ్యక్తమైన రూపము ద్వారా, దానికి వెన్నంటి ఉన్న అవ్యక్తాన్ని అనుభవించి చెబుతున్నారు.

Bottom of Form


మొదటి చరణం: 
సొమ్ములన్నీ కడఁబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబముకప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు ఱొమ్ము తల మొల చుట్టి
తుమ్మెదమైచాయతోన నెమ్మదినుండే స్వామిని ॥కంటి॥                   
భావము:
కీర్తన
సాధారణ అర్థము
అంతరార్థము
సొమ్ములన్నీ కడఁబెట్టి సొంపుతో గోణముగట్టి
సొమ్ములన్నీ తొలగించి, అందంగా గోచి లేదా కౌపీనము కట్టుకొని ఉన్నాడు.
సొమ్ములన్నీ అనగా సమస్త జీవుల శరీరములు. వాటిని కడఁబెట్టి, అవసానదశకు చేర్చి, గోణముగట్టి, అక్షర జీవులందరినీ కలుపువాడైన దైవము సర్వసామాన్యుడిలా ఉన్నాడు.
కమ్మని కదంబముకప్పు పన్నీరు
కమ్మని సువాసనలు కలిసిన పన్నీరుతో కప్పబడి ఉన్నాడు.
కాళ్లు, చేతులు, తల, శరీరము అని స్వామి రూపాన్ని ఒక విధంగా నిర్ధారించలేము. ఆయన స్వరూపాన్ని తెలియనీయని అనేక విషయాలు కలగాపులగమై ఉన్నాయి.
చెమ్మతోన వేష్టువలు ఱొమ్ము తల మొల చుట్టి
తడితో ఉన్న వస్త్రాలను రొమ్ము, తల మొదలైన వాటి చుట్టూ కప్పుకొని ఉన్నాడు.
స్వామి రూపము తెలియకుండా ఎన్నో విషయాలు దానిని కప్పి ఉంచాయి.
తుమ్మెదమైచాయతోన నెమ్మదినుండే స్వామిని
తుమ్మెదవలె నల్లని మేని ఛాయతో చక్కగా, నెమ్మదిగా ఉన్న స్వామిని కంటిని.
నలుపు అనే సూచనతో తెలుపుకు వ్యతిరేకమైన దిశను చూపిస్తున్నారు. ఆ నలుపులో వెలుతురు కూడా చొరబడలేని స్థితిని సూక్ష్మంగా సూచిస్తున్నారు.
 గూఢార్థవివరణము:

సొమ్ములన్నీ కడఁబెట్టి సొంపుతో గోణముగట్టి” అన్నప్పుడు అన్నమాచార్యులు దైవాన్ని ఒక ప్రత్యేకమైన రూపంలో చూపడం లేదు. సొమ్ములు సమస్త జీవుల శరీరాలకు ప్రతీకలు. వాటిని కడఁబెట్టి, గోణముగట్టిన తరువాత, అందరినీ కలుపువాడైన దైవము సర్వసామాన్యుడిలా కనిపిస్తున్నాడు. 

తరువాత ఆయన స్వరూపాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది చేతికి అందదు. కదంబము, పన్నీరు, వేష్టువలుఅన్నీ కలసి రూపాన్ని కప్పివేస్తున్నాయి. స్వామికి కాళ్లు, చేతులు, తల, రొమ్ము అని ఒక నిర్దిష్టమైన రూపాన్ని నిర్ణయించలేము. ఆయనను తెలియనీయని విషయాలే మనకు కనిపిస్తున్నాయి.

చివరగా తుమ్మెదమైచాయతోన” అని నలుపును సూచిస్తున్నారు. ఇది సాధారణ మేనిచాయ వర్ణనగా కనిపించినా, దాని ద్వారా వెలుతురుకు అందని దిశను చూపిస్తున్నారు. ఇక్కడ నలుపు ఒక రంగు మాత్రమే కాదు; వ్యక్తమైనదానితో పోల్చి చూడలేని, వెలుతురుతో కూడా లోపలికి ప్రవేశించలేని అవ్యక్తతముకు సూచనగా నిలుస్తుంది.


ఇక మొదటి చరణంలో అన్నమాచార్యులవారు చేసే పని ఇంకా ఆసక్తికరం.

  • సొమ్ములు జీవుల శరీరాలు
  • గోణము అందరినీ కలిపే సామాన్య స్థితి
  • కదంబము, పన్నీరు స్వరూపాన్ని నిర్ణయించలేని స్థితి
  • వేష్టువలు తెలియనివి కప్పివేసిన స్థితి
  • నలుపు వెలుతురుకే అందని దిశ
అంటే, మనం చూస్తున్న స్వామి రూపాన్ని వివరించడం కాదు; రూపం ద్వారా రూపాతీతాన్ని చూపించడం.

రెండవ చరణం:
పచ్చకప్పురమె నూఱి పసిఁడిగిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగ నలఁది
అచ్చెరపడిచూడ అందరికన్నుల కింపై
నిచ్చమల్లె పూవువలె నిటు తా నుండే స్వామిని ॥కంటి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
పచ్చకప్పురమె నూఱి పసిఁడిగిన్నెల నించి
పచ్చకర్పూరమును నూరి బంగారు గిన్నెలో నింపి తీసుకువచ్చి
స్వామికి ఇదమిత్థమైన రూపము లేదు. పచ్చకర్పూరము తన స్వరూపాన్ని మిగల్చకుండా కరిగిపోయినట్లు, ఆయనకు ఒక ప్రత్యేకమైన రూపము మిగలదు.
తెచ్చి శిరసాదిగ దిగ నలఁది
దానిని తెచ్చి శిరస్సు మొదలుకొని క్రిందికి శరీరమంతా పులిమి
కర్పూరము అద్దిన దాని వెనుక స్వామికి ఒక నిర్దిష్టమైన స్వరూపము దాగి ఉండదు.
అచ్చెరపడిచూడ అందరికన్నుల కింపై
ఆశ్చర్యముగా చూస్తే అందరి కన్నులకు ఇంపుగా కనిపించి
రూపమనే పరిమితి లేకపోయినా, అందరి అనుభవానికి ఇంపుగా గోచరిస్తాడు.
నిచ్చమల్లె పూవువలె నిటు తా నుండే స్వామిని
నిత్యము మల్లెపువ్వువలె తెల్లగా వెలుగుతూ ఉన్న స్వామిని కంటిని.
అందరికీ ఇంపుగా ఉండునట్లు నిత్యము తెల్లని మల్లెపువ్వువలె వెలుగుచున్న స్వామిని చూచితిని.

గూఢార్థవివరణము:

ఇక్కడ పచ్చకప్పురము ఎందుకు వచ్చిందో స్పష్టమైంది. అది కేవలం శుభ్రత, సువాసన, తెల్లదనం కోసం వచ్చినది కాదు. తన స్వరూపాన్ని మిగల్చకుండా కరిగిపోవడం దాని లక్షణం. అదే లక్షణాన్ని స్వామి రూపంతో పోల్చుతున్నారు.


మూడవ చరణం:
తట్టుపునుఁగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరఁగించి వెండిపళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టువేడుక మురియుచుండే బిత్తరి స్వామిని ॥కంటి॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
తట్టుపునుఁగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు
అతి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యములను కూర్చి, వాటిని పొరలు పొరలుగా అమర్చి నిప్పు పెట్టి
సుగంధ ద్రవ్యములవలె అనేక పొరలను కూర్చి, విప్పుతూ పోయే మాయా కదలిక.
పట్టి కరఁగించి వెండిపళ్యాల నించి
వాటిని పట్టి కరిగించి వెండి పళ్లెములలో ఉంచి
పొరలు కరిగిపోయిన తరువాత కూడా వాటి ఆధారంగా ఒక అనుభవము మిగులుతుంది.
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
ఆ కరిగిన సుగంధ ద్రవ్యమును దట్టముగా స్వామి మేనినిండా పట్టించి అలంకరించి
ఆ పొరల ద్వారా ఏర్పడిన రూపమంతా స్వామి మేనిని కప్పినట్లు కనిపిస్తుంది.
బిట్టువేడుక మురియుచుండే బిత్తరి స్వామిని
త్వరగా ముగిసిపోయే ఈ వేడుకలో స్వామి మురిసిపోతూ ఉన్నాడు.
త్వరగా ముగిసిపోయే ఈ మాయా వేడుకలో మాయా స్వామి మురిసుచున్నాడు.
గూఢార్థవివరణము:

ఈ చరణంలో అన్నమాచార్యులు స్వామివారిని అలంకరించే బాహ్య క్రియలను మాత్రమే వర్ణించడం లేదు. స్వామి స్వరూపాన్ని మనము ఎలా గ్రహిస్తున్నాము, ఆ గ్రహింపులో మాయకు ఉన్న స్థానం ఏమిటి అనే విషయాన్ని సూచిస్తున్నారు.

తట్టుపునుఁగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరఁగించి”పునుగు వంటి సుగంధ ద్రవ్యాలను కూర్చి, పొరలు పొరలుగా అమర్చి, నిప్పుతో కరిగిస్తారు. ఇక్కడచట్టలు” అనే పదం ముఖ్యము. ఒకదాని మీద మరొకటి చేరే పొరల వలె, మన అనుభవములో కూడా అనేక విషయాలు ఒకదాని మీద ఒకటి చేరి ఒక రూపాన్ని నిర్మిస్తాయి.

దట్టముగ మేనునిండ పట్టించి దిద్దిఆ కరిగిన ద్రవ్యాన్ని స్వామి మేనినిండా పూసి అలంకరిస్తారు. అంటే స్వామి స్వరూపాన్ని మనము నేరుగా చూడడం కాదు; దాని మీద ఏర్పడిన పొరల ద్వారానే చూస్తున్నాము.

చివరగా: బిట్టువేడుక మురియుచుండే బిత్తరి స్వామిని” అంటారు.బిత్తరి స్వామి”మాయా స్వామి. ఇక్కడ స్వామి మాయలో చిక్కుకున్నవాడు కాదు; మాయగా వ్యక్తమై కనిపిస్తున్న స్వామి. మనకు కనిపిస్తున్న ఈ అలంకరణ, ఈ రూపం, ఈ వేడుక—వ్యక్తమైన స్థితి.

అయితేబిట్టువేడుకత్వరగా ముగిసిపోయే వేడుక. ఎంత ఘనంగా అలంకరించినా, ఎంత దట్టంగా పూసినా, అది నిలిచిపోయే స్వరూపం కాదు. పొరలు ఏర్పడతాయి, కరిగిపోతాయి, తొలగిపోతాయి. రూపము కూడా అలాగే మారుతూ ఉంటుంది. (మన జీవితమూ అంతే).

అందువల్ల ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక సూక్ష్మమైన విషయాన్ని చూపిస్తున్నారు: మాయ అనేది స్వామికి వేరుగా ఉన్నది కాదు; స్వామి వ్యక్తమైన రూపమే మాయగా కనిపిస్తున్నది. ఆ రూపముపై ఏర్పడే పొరలను తొలగిస్తూ చూస్తే, చివరికి ఆ రూపంతో నిర్ధారించలేని అవ్యక్త స్వరూపమే మిగులుతుంది.

ఈ విధంగా మూడు చరణాలూ ఒకే విచారణను కొనసాగిస్తున్నాయి:
రూపము కనిపిస్తుంది రూపము కప్పబడుతుంది రూపము కరిగిపోతుంది.
కానీ ఈ మార్పులన్నిటి మధ్య స్వామి స్వరూపాన్ని మాత్రం ఒక నిర్దిష్ట రూపంగా పట్టుకోలేము. 

X-X-X THE END X-X-X

Tuesday, 14 July 2026

T-339 ఇందుకొరకె యిందరును నిట్లయిరి

 తాళ్లపాక అన్నమాచార్యులు
339 ఇందుకొరకె యిందరును నిట్లయిరి
For English Version Press Here

 ఉపోద్ఘాతము
మనందరిలోనూ అభయయుడైన పరమేశ్వరుడు ఉన్నాడని చెబుతారు. లోపల ఉన్న వానిని లోపల నుండే కలుపుకొనవలెను. ఆ సంబంధమే పరము అనుకోవచ్చును. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే, మన మనసులో పరము అంటే 'ఇది' అను ఒక చిత్రము ఉంటే, మనకు ఆ చిత్రమే పరముగా కనిపిస్తుంది. అటువంటి మనోచిత్రములను దాటి ఉన్నదే పరము.

కానీ పరమును మన ప్రయత్నంతో సాధించలేము. అది ఈశ్వరుడు ఒసగునది. అయినప్పటికీ, అందులో మానవుని కర్తవ్యం లేదనుకొనరాదు. మనమున్న స్థితిని పూర్తిగా గ్రహించుటే ముఖ్యము. ఆ స్థితిని అట్టడుగు దాకా తెలుసుకుంటే చాలు అని అన్నమాచార్యులు ఈ కీర్తనలో సూచిస్తున్నారు.
 
అధ్యాత్మ​ సంకీర్తన
రాగి రేకు: 2-5  సంపుటము - సంకీర్తన: 1-11
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు ॥ఇందు॥

అటమటపు వేడుకల నలయించి మఱికదా
ఘటియించుఁ బరము తటుకన దైవము
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు                ॥ఇందు॥

బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
కొం డనుచుఁ బర మొసంగును దైవము
బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు
యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు ॥ఇందు॥

మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
తనభ క్తి యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు
తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు               ॥ఇందు॥
Details and Explanations:
పల్లవి:
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు    ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
అందువలననే ఎందరో సాధకులు ఈ రకంగా ఉన్నారు.
అందువలననే ఎందరు ప్రయత్నించినా అది సాధ్యముకానిది.
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు
(కిందుపడి = క్రింద ఎంతవరకు పడగలం? నేల మీద  పడగలం. అన్నమాచార్యులు అట్టడుగు దాకా పడినకాని అన్న అర్థంలో వాడారు) 
అట్టడుగు దాకా వెళ్లకపోతే గెలుపు ఎఱఁగలేము
ఇది కనపడినంత సులభం కాదు. అట్టడుగు దాకా తెలిసినదాకా, తెలిసినట్లే అనిపించిన జ్ఞానానికి విలువలేదు.
గూఢార్థవివరణము:

కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు”: అన్నమాచార్యులువారు ఏమి చెప్పదలుచుకున్నారో విచారింతము. ప్రస్తావనలో చెప్పుకున్నట్లు లోపల నుండి లోపలది తెలియవలెను. మరి దానిలో అట్టడుగుకు వెళ్లడం అంటే ఏమిటి? మానవుడు తెలియగలిగిన దానికి పరిమితి లేదు. అలాంటప్పుడు నిజంగా అట్టడుగుకు వెళ్లడం సాధ్యమేనా? విచారింతము. ముఖ్యంగా గమనించవలసినది తెలుసుకోవాలి అనుకోవడమే ఆ అపరిమితమును విధిస్తుంది. తెలుసుకోవాలి అని లేనప్పుడు దానికి అర్థం ఉండదు. మరి అట్టడుగున వుంటున్నదేమిటి? సులభం! తెలియవలెను తెలుసుకోవలెను తెలుసుకుంటాను అనే తపన లేని స్థితి.

Bottom of Form


మొదటి చరణం: 
అటమటపు వేడుకల నలయించి మఱికదా
ఘటియించుఁ బరము తటుకన దైవము
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు  ॥ఇందు॥
భావము:
కీర్తన పాదము
సాధారణ అర్థము
అంతరార్థము
అటమటపు వేడుకల నలయించి మఱికదా
(అటమటపు = దుఃఖం, నిజము కాని; అలయించి = మించి); దుఃఖమును, నిజము కాని వాటిని దాటిన తరువాతే కదా...
అసత్యమైన వాటి స్వభావాన్ని పూర్తిగా గ్రహించిన తరువాతనే సత్యము వెల్లడవుతుంది.
ఘటియించుఁ బరము తటుకన దైవము
(ఘటియించుఁ=కలిగించు) దైవము తటుకన   ప్రసాదించుఁ బరము.
మనసు సిద్ధమైనప్పుడు  ఆ పరము స్వయంగా ప్రత్యక్షమవుతుంది.
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు
(ఈసు = ఈర్ష్య) ఈశ్వరునికి మనపై కోపమేమీ లేదు.
జీవితంలోని అనుభవాలు శిక్షలు కావు; అవి అవగాహనకు అవకాశాలు.
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు
మనలోని కుటిలత్వం తెలియక అసలు మంచి గుణం తెలియదు.
మనసు కుటిలత్వం ఆసాంతము చూసిన తరువాతనే నిజమైన గుణము తెలుస్తుంది.
 గూఢార్థవివరణము:
ఈ చరణములో అన్నమాచార్యులు అసత్యమైనదాని లక్షణమును తెలియ మంటున్నారు. ఇంతకుముందు కీర్తనలో చైతన్య స్థితిలో తెలియగలిగినవన్నీ క్షరములు అని మనం తెలుసుకున్నాం. వీనిని మనసు లేదా బుద్ధి ద్వారా గ్రహిస్తాము. అస్థిరము అని చెప్పుకోవడం ఒకటి, వాస్తవంగా గ్రహించుట ఒకటి. ఆ క్షణములో అది తనకులేని అస్తిత్వమును వదలును. ఈ రకంగా చూస్తే తన యొక్క అస్థిరత్వం గ్రహించినది లోకములో గొప్ప విషయము.
 
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు”: ఒకటవ నాలుగవ పంక్తులు ఒకే విషయాన్ని సూచిస్తున్నవి. మనసు అనంతముగా ప్రతిబింబించు లక్షణముగలది. మన మనసులో పరము గురించి ఏ చిత్రం ఉంటే అదే పరముగా అనిపింపచేయును. కాబట్టి సాధకుడు తన మనసు ఏ రూపై నిల్చుచున్నదో నిరంతరం గమనించవలెను.

రెండవ చరణం:
బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
కొం డనుచుఁ బర మొసంగును దైవము
బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు
యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు    ॥ఇందు॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
(బెండుపడ =  నిస్సత్వమగు, బలహీనమగు); నిస్సత్వము, బలహీనము చేయు చెడు గతులను వదలిన తరువాత కదా
మన యిష్టాయిష్టాలు రెండూ మనలను బలహీనులను చేసే అలవాట్లు. వాటిని దాటిన తరువాతనే కదా
కొం డనుచుఁ బర మొసంగును దైవము
అప్పుడు దైవము పరమును అనుగ్రహిస్తుంది.
పూర్వాధారాలు పూర్తిగా తొలగిన తరువాతనే కదా పరమునకు అవకాశం.
బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు
హరి మనలను బంధించడు.
మన బంధాలకు కారణం దైవము కాదు; మన స్వంత స్థితి. (338వ కీర్తన చూడండి)
యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు
(బండు సేయఁగ = బద్దు చేయు, ఆరడి చేయు) ఎండ తెలియక నీడ సుఖం తెలియదు.
ఎండ చురుక్కుమంటే కదా నీడలో ఉన్న సుఖము తెలిసేది. ఒక అనుభవం పూర్తిగా తొలగిన​​ తరువాతనే దానిని దాటి ఉన్నదాని విలువ తెలుస్తుంది.
గూఢార్థవివరణము:

బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా”: అన్నమాచార్యులు ఇక్కడ లోతైన పరిశీలన చూపుచున్నారు. ముఖ్యంగా మనం ఆలోచించవలసినది మన అలవాట్లు ఇష్టాయిష్టాలు. ఊహలు, ఉద్రేకాలు, కోరికలు ఊవెత్తున లేచిపడ్డప్పుడు అవి నాగటి చాలులా,  వెల్లువ పారుటకు కాలువలా పనిచేసి మనం ప్రతిసారి ఒకే బాటలో (పథము నందు) ప్రయాణించునట్లు చేయును. కావున కావున ఇవి మనలను ఏ దారిలో నడిపిస్తున్నవో గమనించుట అవసరము. వీటిని అధిగమించుట అత్యంత కఠినము.

యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు”: దీనిని అతి జాగ్రత్తగా గమనించండి. సులభమైన విషయములను చెప్పుటలేదు. మండుటెండవలె పరీక్షించే పరిస్థితిలో నిలబడగల ధైర్యమూ, శ్రద్ధా లేకపోతే మనము దేనిని పట్టుకొని ఉన్నామో దానిని విడిచుట ఎట్లు? నీటి ప్రవాహములో ములిగిపోతున్నవాడు గడ్డిని కానీ చివరకు పామును కానీ పట్టుకుని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంతేకానీ "తను వేసుకున్న అంగి ప్యాంటు రంగుకు సరిపోతున్నదా? లేదా"? అని ఆలోచించడు.


మూడవ చరణం:
మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
తనభ క్తి యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు
తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు   ॥ఇందు॥
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
ముందు అనేక దేవతలకు మొక్కిన తరువాతే కదా
మానవుడు ఏవైతే గొప్పవిగా, ఆశ్రయముగా, తన కోరికలను తీర్చగలదానిగా భావించి దాని ముందు తలవంచునో, అవన్నీ ఈ "వేల్పులు". ధనము, కీర్తి, అధికారం, జ్ఞానము, సిద్ధులు, స్వర్గము మొదలైనవి.
తనభక్తి యొసఁగు నంతట దైవము
అప్పుడు దైవము తన భక్తిని ప్రసాదిస్తుంది.
ఇతర ఆధారాలు తప్పుకున్న​ తరువాతనే నిజమైన భక్తి సహజంగా వికసిస్తుంది.
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు
వేంకటేశ్వరుడు మోసం చేయడు.
దైవము మనలను మభ్యపెట్టదు; మన అవసరాలకు అనుగుణంగానే జీవితం సాగుతుంది.
తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు
తినకపోతే చేదు రుచి తెలియదు.
ప్రత్యక్ష అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు; తెలిసిన అవగాహన అపోహ మాత్రమే.
గూఢార్థవివరణము: 

మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా”: ఇక్కడ "వేల్పులు" అనగా దేవతలు మాత్రమే కాదు. మనసు దేనినైతే గొప్పదిగా, ఆశ్రయముగా, తన కోరికలను తీర్చగలదిగా భావించి దాని ముందు తలవంచునో, అవన్నీ ఈ "వేల్పులు". ధనము, కీర్తి, అధికారం, జ్ఞానము, సిద్ధులు, స్వర్గము, చివరకు మనం మనసులో నిర్మించుకున్న దేవుని రూపము కూడా దీనిలో చేరవచ్చును.

అంటే మన జీవితం ఆయా "వేల్పుల" దారిలోనే సాగుతుంది. ఈ బాటలో అనేక మొక్కులు, అనేక అనుభవాలు. కానీ శాంతి ఎక్కడ? వాటిలో ఏదీ మనిషిని పూర్తిగా తృప్తిపరచలేదని గ్రహించాలి కదా! ఆ తరువాతనే భక్తికి అవకాశం కలుగుతుంది.

తనభక్తి యొసంగు నంతట దైవము” అనే పాదము ఈ కీర్తనలోని అత్యంత ముఖ్యమైన పాదము. భక్తిని మనిషి తయారుచేసుకొను ద్రవ్యం కాదు. మనసు పట్టుకున్న ఆధారాలన్నీ సహజంగా సడలినప్పుడు, దైవమే తన భక్తిని ఒసగుతుంది. అందుకే అన్నమాచార్యులు వెంటనే ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు” అంటారు. దైవము ఎవరినీ మోసగించదు. మన స్థితికి తగినదే మనకు ప్రత్యక్షమవుతుంది.

చివరిగా తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు” అని ఈ చరణాన్ని ముగిస్తున్నారు. చేదును గురించి ఎంత విన్నా, రుచి చూడకపోతే అది తెలియదు. అలాగే జీవితంలో మనం పట్టుకున్న ఆధారాల అసలు స్వభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోకపోతే వాటిని విడిచిపెట్టడం కూడా సాధ్యం కాదు.

X-X-X THE END X-X-X

T-340 కంటి శుక్రవారము గడియ లేడింట

  తాళ్లపాక అన్నమాచార్యులు 340 కంటి శుక్రవారము గడియ లేడింట   For English Version Press Here   ఉపోద్ఘాతము ఈ కీర్తనను మొదట చదివినప్పుడు...