Sunday 5 February 2023

T-159 అప్పులవారే అందరును

 అన్నమాచార్యులు

159 అప్పులవారే అందరును

for English Version press here


అల్లకల్లోల ప్రపంచం.

సారాంశం: "ఈనాడు ప్రపంచం తీవ్రమైన హింసాత్మకంగా, విభజించబడి, ఉదాసీనంగా ఉంది. ఏదేమైనా, మనిషికి అతని అంతర్గత కలహాలు చాలా ముఖ్యమైనవి ".

 

Summary of this Poem:

పల్లవి: అప్పులవారమే అందరమూ. తీర్చుటకు త్రిప్పు ఆ అప్పిచ్చినవాడు ఎక్కడున్నాడో? అన్వయార్ధము:  ఓ మానవా, నీకై నీవు సృష్టించిన బానిసత్వపు గొలుసులను గుర్తించు.

చరణం 1: ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ చిక్కులు, చింతలు, ఉపద్రవములే కదా! జీవనమను యీ రాపిళ్ళలో, ఘర్షణలలో దిక్కు  దేవుఁడెఁకాక వేరెవరు? 

చరణం 2: ఏ రకముగా చూచినా, మానవ మనుగడలో కోరు సుఖాలు నిజమైన సూదులమూఁటలే. నువ్వు ఔనన్నా, కాదన్నా అడుగే లేని నీ మనస్సుచివరలకంటా చూడగలిగే పోదికాఁడు (హీరో) ఒక్కడే ఉన్నాడు. అన్వయార్ధము:  ఓ మానవా, చివరికి ముళ్ల సంచులుగా నిరూపించబడే ఆనందాలకు అతీతంగా, మీ హృదయంలోనే నివసిస్తున్న ఆ గొప్ప నిధిని కనుక్కో.

చరణం 3: నీవే యేర్పరచుకున్న యీ బంధములు యెన్నడూ వీడవు, ఎప్పుడూ వృద్ధినొందును. ఉన్నతి కలిగించి, ఒప్పుకొనదగునవి నేర్పు వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు. 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల కీర్తనలు చాలా వరకు సులభంగా మింగుడుపడనివే.   సత్యాన్ని, అసత్యాన్ని వేరుచేసే మన సామర్ధ్యాలకు సవాలు విసురుతున్నవి వీరి కీర్తనలు. ఆయన ఆచరణాత్మకత ద్యోతకమగు పరిశీలనలు  మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. వారు అంతుచిక్కని రహస్యం.

 

కీర్తన:

రాగిరేకు:  13-5 సంపుటము: 1-81

అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ అప్పుల॥
 
ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక అప్పుల॥
 
యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే అప్పుల॥
 
యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీఁ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు అప్పుల॥

Details and Explanations: 

అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ అప్పుల॥

ముఖ్య పదములకు అర్ధములు: కప్పఁగఁ = అప్పుతీర్చుటకు;  దిప్పఁగఁ= త్రిప్పు;  గర్తలు = ఆ అప్పిచ్చినవాడు

భావము: అప్పులవారమే అందరమూ. తీర్చుటకు త్రిప్పు ఆ అప్పిచ్చినవాడు ఎక్కడున్నాడో?

వివరణము: ఇది చాలా చిన్న కీర్తన అయినప్పటికీ సీమటపాకాయ లాంటిది. మనల్ని అప్పులవారిగా మార్చిన అసలైన వ్యక్తిని కనుక్కోమని అడుగుతున్నాడు. ఇదొక్కటీ చేస్తే మనము ముఖ్యమైన రహస్యం ఛేదించినట్లే.

ప్రసిద్ధ లాటిన్ మేధావి & రచయిత పుబ్లియస్ సైరుస్ "ఋణం అనేది స్వతంత్రుల బానిసత్వం" అన్నాడు. ఇక్కడ అన్నమాచార్యులు మనమందరం ఋణగ్రస్తులమని చెప్పి ఒక రకంగా మనం స్వేచ్ఛగా లేమని అన్నారేమో.

ప్రముఖ ఆంగ్ల రచయిత, తత్వవేత్త అలాన్ విల్సన్ వాట్స్ ఇలా అన్నారు. "మనము ఎక్కడినుంచో ప్రపంచంలోకి "వచ్చి పడలేదు"; మనము ఒక చెట్టు నుండి ఆకులు వలె బయటకు వస్తాము. సముద్రం నుంచి "అలలుగా" వచ్చినట్లుగా, విశ్వము నుండి "మనుషులు" వస్తున్నారు.

ఈ విశ్వంలోని అంతర్భాగమే మనము. విశ్వంలోని అంతరిక్షము (స్పేస్), కాలము,  శక్తి ప్రసరణ తరంగముల విన్యాసములతో మనము చెప్పలేనంతగా ముడిపడి ఉన్నాము. మనం సముద్రంలో అలల వంటి వారము. ఎల్లప్పుడూ మారుతూ, పరివర్తన చెందుతూ మారునది, మార్పుతెచ్చునది నిర్దిష్టంగా గుర్తించలేనంతగా కలసి వున్నాము. అందువలన మనం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రజలతో నిండిన లోకం నుండి వచ్చిన వారమని అంగీకరిస్తే  సహజంగానే మనం కూడా అప్పులవారమే.

ఋణగ్రస్తులు ఋణమెవ్వరికి తీర్చుకోవలె? దీనికి సమాధానము సరళముగా వుండి వుంటే, ఇన్ని మతములు, ఇంత మంది తత్వవేత్తల అవసరమముండేది కాదు. కావున ఋణమిచ్చినవానిని గుర్తించుట ముఖ్యమని అన్నమాచార్యుల భావము. ప్రఖ్యాత బెల్జియం కళాకారుడు రెనె మాగ్రిట్టే వేసిన 'ది కీ టు డ్రీమ్స్' (కలలకు సంకేతము) అనే అధివాస్తవిక పెయింటింగ్ సహాయంతో నేను దీన్ని వివరిస్తాను.  చిన్నప్పుడుఅ’ఆ’ఇ’ ‘ఈ’లను బొమ్మలను చూపి దాని క్రింద అక్షరము వ్రాసి  నేర్పించినట్లుగా వుండె చిత్రపటములో కొన్ని బొమ్మలు వాటి క్రింద పేరు ఇవ్వబడ్డాయి. ఐతే ఇక్కడ బొమ్మలకు క్రింద వ్రాసిన పేరుకు సంబంధము లేకుండా చేసి రెనే మాగ్రిట్ మనలను అయోమయంలోకి నెట్టి వెస్తాడు.


కలలకు సంకేతములు (కీ టు డ్రీమ్స్) అను చిత్రకవిత్వంలో ఏదైనా (పాత లేదా క్రొత్తల) ప్రతీకాత్మతకు ప్రాముఖ్యమే లేదన్నారు." కాబట్టిమనం విషయములను భావములను సంబంధము లేకుండా ముడిపెట్టి ప్రపంచంతో బంధించబడతాము” అని మాగ్రిట్ చెబుతున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిన్నపిల్లలు నేర్చు బొమ్మను చూపి, ఈ రుగ్మత చాలా చిన్న వయస్సు నుండి ప్రారంభమవుతుంది అని సూచించారు, ఆలోచనలకు ఇదమిత్థమగు రూపమూహించక, దుస్సహవాసమునకు తావు లేకుండా ఉంటేనే సహజమగు వీక్షణకు (ముక్తికి) అవకాశం ఉంటుందని అతడి ప్రతిపాదన​.

అందువలన అన్నమాచార్యులు "నువ్వు  ఋణపడిలేవు" అని సూచిస్తున్నాడని మనం నిర్ధారణకు రావచ్చు. "కానీ పరిస్థితులు కల్పించు కపటపు భావనలతో (స్థితివ్యాజముతో) నిన్ను అలా అనుకునేలా చేస్తుంది" అంటున్నారని భావించవచ్చు. ఇది 3వ చరణంలో మరింత స్పష్టమవుతుంది.

అన్వయార్ధము:  ఓ మానవా, నీకై నీవు సృష్టించిన బానిసత్వపు గొలుసులను గుర్తించు.

ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక అప్పుల॥ 

ముఖ్య పదములకు అర్ధములు: సిలుగులుఁ = ఉపద్రవములు;  యీ తీదీపులలో = యీ రాపిళ్ళలో, ఘర్షణలలో.

భావము: ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ చిక్కులు, చింతలు, ఉపద్రవములే కదా! జీవనమను యీ రాపిళ్ళలో, ఘర్షణలలో దిక్కు  దేవుఁడెఁకాక వేరెవరు? 

వివరణము: ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ / జిక్కులు సిలుగులుఁ జింతలునే: బాబులారా, ఏరోజుదైనా ఒక వార్తాపత్రికలో శీర్షికలు చదవండి. తర్వాతిరోజేమి జరుగునోయని ప్రపంచం ఉద్విగ్నతతో వుందని మీరు కనుగొంటారు. అత్యున్నత వేదికలపై ప్రస్ఫుటంగా ఘర్షణ వైఖరి కొట్టొచ్చేలా చర్చలు, న్యాయమును కాల రాచుట కానవస్తున్నవి. అల్ల​కల్లోలం అనేది ఈనాటి నియమం.  అన్నమాచార్యులు తన వర్ణనలను చాలా సహజముగా చిత్రించెను అనడానికి ఇంకా సందేహం ఉందా?

ఈ సందర్భంగా​ గుయెర్నికా అన్న చిత్రమును పరీక్షగా వీక్షించమని విన్నపము. సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో జూన్ 1937లో పూర్తి చేసిన మ్యూరల్-సైజు తైలవర్ణ చిత్రం. బూడిద రంగు, నలుపు, తెలుపుల్లో చిత్రీకరించిన తైలచిత్రం పలువురు కళా విమర్శకుల నుంచి చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన యుద్ధ వ్యతిరేక కళాఖండంగా పేరొందింది. 11 అడుగుల 5 అంగుళల పొడవు, 25 అడుగుల 6 అంగుళాల వెడల్పుతో, విస్తారమైన పరిమాణంలోని మ్యూరల్ చిత్రం హింస, గందరగోళాల్లో ప్రజల బాధలను ప్రతిబింబిస్తుంది. 



చిత్రాన్ని ఉత్తర స్పెయిన్ లోని బాస్క్యూ ప్రాంతపు పల్లెటూరు అయిన గుయెర్నికాపై స్పానిష్ జాతీయవాదుల కోరికపై నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ యుద్ధ విమానాలు జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా సృజించారు. పూర్తయ్యాకా గుయెర్నికాను 1937లో ప్యారిస్’లో జరిగిన అంతర్జాతీయ ఫెయిర్’లో స్పానిష్ ప్రదర్శనలో ప్రదర్శించారు. 

బాధలు భరించలేక వికృతంగా అరుస్తున్న గుర్రం, ముఖము కకావికలమై జాలిగొలుపు ఎద్దు, చనిపోయిన శిశువును చేతుల్లోపెట్టుకుని దీనంగా అరుస్తున్న స్త్రీలు, శరీరము ఛిన్నాభిన్నమైన సైనికుడు, ఆకాశము వైపు నిస్సహాయంగా చేతులెత్తిన జీవులు అగ్నిజ్వాలలు కూర్పులో ముఖ్యమైనవి. మనలో రేగుతున్న అంతర్యుద్ధం కూడా గుయెర్నికా వంటిదే. 

చాలా ప్రసిద్ధి చెందినది కావడం వల్ల మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. దీనిపై మంచి వివరణ క్రింద చూపిన లింకులో చూడవచ్చు#1.  ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ / జిక్కులు సిలుగులుఁ జింతలునే అనునది గుయెర్నికాలో చూపినంత సముచితంగా మరెక్కడా చిత్రించబడలేదని గమనించ ప్రార్ధన​. అన్నమాచార్యులు సిద్ధాంతాన్ని ప్రతిపాదించు తత్వవేత్త కాడు. స్వయంగా భగవంతునితో ఏకత్వంచెంది, అనుభవపూర్వకముగాని స్థితిలో తన కళ్ళతో చూడగలిగినదాన్ని వ్రాశాడు. ఆయన ఒక రాజునో, ఒక వర్గాన్నో ప్రసన్నం చేసుకోవడానికి కవిత్వము వ్రాయలేదు. 

యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే         అప్పుల॥

 

ముఖ్య పదములకు అర్ధములు: పోదికాఁడు = పోటుకాఁడు = meaning a capable person for combat; here and in some other verses also Annamacharya had used this word. This is a special word used by Annamacharya} = వీరుడు. 

భావము: ఏ రకముగా చూచినా, మానవ మనుగడలో కోరు సుఖాలు నిజమైన సూదులమూఁటలే. నువ్వు ఔనన్నా, కాదన్నా అడుగే లేని నీ మనస్సుచివరలకంటా చూడగలిగే పోదికాఁడు (హీరో) ఒక్కడే ఉన్నాడు. 

వివరణముగడ గనిపించఁగ: అంటే ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని దాని మూలాల నుండి ఇప్పటి వరకు కనుగొనవచ్చు. సామాన్యులమైన మనకు వాటిపై అవగాహనే వుండదు. హృదయమంతా భక్తితో నిండిన అన్నమాచార్యుల వంటి వారు జీవితం యొక్క సంపూర్ణతను అనుభవించగలరని చెబుతారు. 

‘పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే’ భగవద్గీతలోని శ్లోకాన్ని సూచించుచున్నది. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః । శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ।। 13-32 ।। భావము: ఓ కుంతీ తనయుడా,  నాశములేని పరమాత్మ దేహములోనే ఉన్నా భౌతిక లక్షణములతో ప్రభావము చెందక, నిర్వికారుడై ఏమాత్రం కళంకితుడు కాడు.

అందువలన ఈ చరణంలో అన్నమాచార్యులు మనిషిని సుఖాలపై కన్నెయకుండా తన హృదయంలో ఉన్న భగవంతుడిని కనుగొనమని  కోరుతున్నాడు.

అన్వయార్ధము:  ఓ మానవా, చివరికి ముళ్ల సంచులుగా నిరూపించబడే ఆనందాలకు అతీతంగా, మీ హృదయంలోనే నివసిస్తున్న ఆ గొప్ప నిధిని కనుక్కో.

యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీఁ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు అప్పుల॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యెన్నఁడు వీడీ = యెన్నడూ వీడని; నెప్పుడు వాసీఁ = ఎప్పుడూ వృద్ధినొందు.

భావము: నీవే యేర్పరచుకున్న యీ బంధములు యెన్నడూ వీడవు, ఎప్పుడూ వృద్ధినొందును. ఉన్నతి కలిగించి, ఒప్పుకొనదగునవి నేర్పు  వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు

వివరణము: ‘బన్నిన తమతమ బంధముల’ ద్వారా  బంధాలు పుట్టుకతో వచ్చేవి కావని, వయస్సుతో పాటు వ్యక్తి ద్వారా తెలియకుండానే సృష్టించబడతాయని సూచించారు. అందువలన మానవుడు బంధాలను యేర్పరచునది విచ్ఛిన్నం చేయగలిగినది కూడా  మనిషేనని అన్నమాచార్యులు స్పష్టం చేశారు. అయితే మానవుడు సత్వర ఫలితాలను కోరుకుంటాడు. గంటగంటకూ తన ఆధ్యాత్మిక ప్రయాణ పురోగతిని సమీక్షి౦చాలని ఆయన కోరుకు౦టున్నాడు. బంతి బంతికీ పురోగతిని అందించడానికి మానవ జీవితం క్రికెట్ మ్యాచ్ కాదా? కానీ దురదృష్టవశాత్తూ, దే మన నిజమైన వైఖరి.

అందుకే అన్నమాచార్యులు ఎప్పుడూ సహనము, ఓపికలు పాటించాలని ఉద్భోదించారు.  {ఉదాహరణకు: వోపి నీ దాస్యము చేరి వొప్పెఁగాక: సహనంతో మరియు ఓర్పుతో నీ సేవలో పాల్గొనడం ద్వారా, నా ఆత్మకు ఎక్కువ తక్కువ తారతమ్యాల బాధ తొలగి ఒప్పింది.}

 

References and Recommendations for further reading:

#1 Picasso's Guernica: Great Art Explained - YouTube

-X-The End-X-

1 comment:

  1. మనమంతా పురాకృత సంచితకర్మల లోనుంచి ప్రారబ్ద కర్మలను తీసుకొని ఈ విశ్వంలో శరీరమును ధరించి జన్మించి కర్మఫలాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాము.తిరిగి ప్రారబ్దకర్మ శేషంతోబాటు భూమిమీద చేసిన ఆగామి కర్మలననుసరించి మరల జన్మిస్తూ ఉంటాము.
    "పునరపి జననం పునరపి మరణం
    పునరపి జననీ జఠరే శయనం|
    ఇహ సంసారే బహుదుస్తారే
    కృపయా పారే పాహి మురారే||"
    ఇలా కర్మవాసనలు జన్మజన్మలకూ వెంటాడుతూనే ఉంటాయి. దుస్తరమైనదీ జననమరణ సంసారచక్రం.

    అందుకే మనమంతా ఋణగ్రస్తులమే ఈ విశ్వంలో. కర్మశేషం లేకుండా చేసుకున్నప్పుడే ఋణవిముక్తు లవుతాము.అప్పుడే కర్త అయిన దైవాన్ని చేరుకుంటాము.అంతవరకూ ఋణగ్రస్తులమేనని, జననమరణ చక్రము లో తిరుగాడుతూ ఉండాలని గ్రహించాలి.

    రెనె మాగ్రిట్టే చిత్రంలో గీచిన బొమ్మలకు,వాటి క్రింద కనిపిస్తున్న పేరుకు యేమాత్రం సంబంధం లేదు.ఇలా విషయములను, భావనతో సంబంధం లేకుండా ముడిపెట్టి, అవియే నిత్యమూ, సత్యమూ అనే భ్రమలో ఉండి,సంసారబంధంలో చిక్కుకొంటున్నాము.అంటే అల్లకల్లోలంగా నున్న ఈ ప్రపంచంలో దుఃఖములను, బాధలను, చిక్కులను,చింతలను, ఘర్షణలతో దిక్కు తోచక, బయటపడే మార్గం కానరాక మనం నిరంతరం సతమతమవుతున్నాము.

    Pablo Pucasso గుయెర్నికా చిత్రం ఈ చరణభావాన్ని ధృవీకరిస్తోంది. చిత్రంలో కనిపిస్తున్న బొమ్మలు మనలో నిరంతరం చెలరేగుతున్న ఘర్షణ,ఆశాంతి, చింతలకు అద్దం పడుతున్నాయి.

    జీవనప్రయాణంలో మనం కోరుకొనే సుఖసౌఖ్యాలు ముందు ఆనందాన్నిచ్చేవి అయినా తుదకవి దుఃఖభాజనములే.అందుకే అన్నమయ్య వాటిని సూదులమూటలు అని అన్నాడు.
    ఇట్లా పొందే ఆనందమంతా అశాశ్వతమైనది.అనిత్యమైనది.
    ఈ అశాశ్వతమైన ఆనందమే నిజమైన ఆనందమని భ్రమించి, మనము మన హృదయగుహలలో స్థిరంగా వశించే పరమానంద స్వరూపుడు, మన పెన్నిధి అయిన పరమాత్మను విస్మరిస్తున్నాము.ఆ నిధిని అన్వేషించు కొమ్మని, ముక్తిని బడయమని అన్నమయ్య ఈ కీర్తనలో మానవాళికి సూచిస్తున్నాడు.

    శ్రీ చామర్తి శ్రీనివాస్ గారి నిరంతర కృషి ఫలితంగా మాగ్రిట్టె, పాబ్లో పికాసో వంటి సుప్రసిద్ధులైన వారి చిత్రముల ద్వారా అన్నమయ్య కీర్తనలను సులువుగా అర్థం చేసుకోవటంలో మనకెంతో సహాయపడి, మేలు చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనచందనములు. 💐💐💐
    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...