Saturday 18 March 2023

T-160 ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే

 అన్నమాచార్యులు

160 ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే

 

for EnglishVersion press here

 

బాంధవుడు.

సారాంశం: "మన ఊహలకంటే గొప్పవాడు దగ్గరలోనే ఉన్నాడు. మనం అనుకొన్న దానికంటే సమీపములోనే ఉన్నాడు".   అమీ లేన్ లిట్జెల్మాన్

 

కీర్తన సారాంశం:

పల్లవి: నా భాగ్యము యేమని చెప్పుదునే? (చెప్పలేనంత భాగ్యము మూట గట్టుకున్నానని భావము). ఏమే నువ్వు కూడా (అత్యావశ్యకతను సూచించుతూ) త్వరగా అతనికి మొక్కవే!

చరణం 1: ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. సులభు డైనట్టివాఁడు. ఎరువు అడిగి తెచ్చుకొన్నది (మోక్షానికి పూర్వం అన్నమాచార్యుని స్థానం) నన్ను వెట్టి చాకిరికి పంపి నాటి నుండి  ఈ విషయాలన్నింటిలో ఆయన నాపై ఎంతో కరుణను చూపుతూనే యున్నాడు. అన్వయార్ధము: ఎవరికైనా ఉన్న నిజమైన ఆత్మీయుడు దైవమే. అయితే, అతని కరుణను ఆస్వాదించడానికి మీరు మీలో పేరుకుపోయిన మొండితనాన్ని విడనాడాలి.

చరణం 2: అంతరంగము అనిపింప చేయువాడు, ప్రాణుల ప్రాణముల వంటి విషయములను తెలిసినవాఁడు వంతులు వాసు లెంచక అనూహ్యముగా వాకిటికి వచ్చె నేఁడు. ఇంత కంటే మన్నించగల వారవ్వరే? అన్వయార్ధము: 'లోపల' లేదా 'వెలుప'లను కృత్రిమ భావనలని; ఎటువంటి సంకోచం లేకుండా వాటిని అంగీకరించడమే తెలివియని గ్రహింపవలె.

చరణం 3: మన భారమును వహించుకొనేవాఁడు, అతి చేరువగా నుండువాడు, అన్వేషించ దగినవాడు అతడే.  శ్రీవెంకటవల్లభుఁనిగా ప్రసిద్ధి చెందినవాడు గొప్ప న్యాయాధికారి కాడా?

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: ఇది చాలా మధురాతి మధురమైన కీర్తన​. అన్నమాచార్యుల కాలంనాటి పురుష దురహంకార సమాజంలో,  ఎటువంటి విరోధము లేకుండా భగవంతుణ్ణి ఎలా స్వీకరించాలో మరో స్త్రీకి సలహా ఇచ్చే స్త్రీ పాత్రను ఆయనే స్వయంగా ధరించారు.  భగవంతుడు ఎంత సన్నిహితుడో వివరిస్తున్నారు. బేషరతుగా భగవంతుని అంగీకరిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. వారు తమ ప్రత్యక్ష అనుభవాన్ని వివరిస్తున్నారు.

కానీ, కవిత్వంలోని అమాయకత, సరళత అక్కడితో ఆగిపోతాయి.  అన్నమాచార్యులు మునుపటి తన తెలివిలేని మోహాత్మక స్థితి గురించి కూడా మాట్లాడారు. ఈ ప్రయాణము ఒకదాని తరువాత ఒకటి చేరి సాధించునది కాదని ఆయన పేర్కొన్నారు. ఆయనిచ్చిన సరళమైన సలహా ఏమిటంటే భగవంతునితో ఆచరణ యోగ్యమైన బంధుత్వము ఏర్పరచుకోవలె.  మనం దేవునితో "బాంధవ్యము కలిగి ఉన్నామా?" లేదా "కేవలం లావాదేవీలు జరపాలనుకుంటున్నామా?" అనేది అంతిమ ప్రశ్న. 

 

అత్యంత రమణీయమైన సున్నితమైన కీర్తనను బాధాకరమైన తాత్వికాంశంగా తూట్లుపొడవడం పట్ల చింతిస్తున్నాను. దురదృష్టవశాత్తూ, అన్నమాచార్యులు కల్లాకపటము తెలియని పదాల వెనుక లోతైన అర్థాలు పేర్చి ఉంచారు.  ఇప్పుడు ఇది వ్రాసేశాను కాబట్టి, భవిష్యత్తులో, నేను శృంగార కీర్తనల విషయమై ఇటువంటి కఠినమైన వ్యాఖ్యానాలకు దూరంగా ఉంటాను. ప్రస్తుతానికి, పాఠకులు దీనిని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.  

 

కీర్తన:

రాగిరేకు:  325-5 సంపుటము: 11-149

ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే
ముదముతోఁ దన కిట్టె మొక్కితి నే ననవే ॥పల్లవి॥
 
చుట్టమైన యట్టివాఁడు సులభఁ డైనట్టివాఁడు
దట్టమై నా కిన్నిటాను తానే కదే
పొట్టఁబొరుగున నుండి పొరచి వెట్టంపి నేఁడు
గట్టిగా నింతకరుణ గలదు గా నాకు ॥ఇదివో॥
 
అంతరంగ మైనవాఁడు ఆయ మెరిఁగినవాఁడు
చెంతలఁ దానే అని చెప్పేఁ గదే
వంతులు వాసు లెంచక వాకిటికి వచ్చె నేఁడు
యింత మన్నించఁ దాఁ గాక యిఁక నెవ్వరే ॥ఇదివో॥
 
వహించుకొనేవాఁడు వద్ద నిట్టె వుండేవాఁడు
విహరించ నా కిన్నటా వెలనె తానె
వహి కెక్క శ్రీవెంకటవల్లభుఁ డితఁడే నన్ను
తహతహ దీరఁ గూడె తగవరి అవుఁ గదే ॥ఇదివో॥  

Details and Explanations: 

ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే
ముదముతోఁ దన కిట్టె మొక్కితి నే ననవే ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ముదముతోఁ = సంతోషముతో, అనుమోదముతో; దన కిట్టె = (అగత్యము అత్యావశ్యకతను సూచించుతూ) త్వరగా అతనికి. 

భావము: నా భాగ్యము యేమని చెప్పుదునే? (చెప్పలేనంత భాగ్యము మూట గట్టుకున్నానని భావము). ఏమే నువ్వు కూడా (అత్యావశ్యకతను సూచించుతూ) త్వరగా అతనికి మొక్కవే!

చుట్టమైన యట్టివాఁడు సులభఁ డైనట్టివాఁడు
దట్టమై నా కిన్నిటాను తానే కదే
పొట్టఁబొరుగున నుండి పొరచి వెట్టంపి నేఁడు
గట్టిగా నింతకరుణ గలదు గా నాకు ॥ఇదివో॥ 

ముఖ్య పదములకు అర్ధములు: దట్టమై = గాఢముగా; పొట్టఁబొరుగున = అతిసమీపస్థానము, పొరచి = ఎరువు అడిగి తెచ్చుకొన్నది; వెట్టంపి = వెట్టి చాకిరికి పంపి; నేఁడు = ఇప్పుడు.  

భావము: ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. సులభు డైనట్టివాఁడు. ఎరువు అడిగి తెచ్చుకొన్నది (మోక్షానికి పూర్వం అన్నమాచార్యుని స్థానం) నన్ను వెట్టి చాకిరికి పంపి నాటి నుండి  ఈ విషయాలన్నింటిలో ఆయన నాపై ఎంతో కరుణను చూపుతూనే యున్నాడు.

వివరణము: పొట్టఁబొరుగున నుండిదేవుడు (మనందరికీ) చాలా దగ్గరగా ఉన్నాడని ధృవీకరిస్తోంది. 

చుట్టమైన యట్టివాఁడు: మనము సామాన్యముగా చూసేది ఒకే ఒక వస్తువునైనా, దాని అంతర్గత ప్రాతినిధ్యం మనోఫలకము పైనను, అసలు వస్తువు బాహ్యముగాను చూచెదము. నీకు దగ్గర బంధువైన ఒక వ్యక్తితో బిగువైన, దట్టమైన  సంబంధం ఉన్నప్పుడు, అతడికి వీక్షకుడికి  మధ్య వ్యత్యాసం ఉంటుందా? అది లేక, చుట్టమని చెప్పుకొనుటకు మాత్రమే పనికి వచ్చునా? అటువంటి అనుబంధము లేకుండా మనము నిస్సారమైన జీవితాన్ని గడుపుటలేదా? (157 ‘ తపములు నేల?’ అను కీర్తనకు ఇచ్చిన వివరణను చూడమని సూచన​). 

పొరచి వెట్టంపిఅంటే అరువుకు వచ్చిన స్థానానికి అతుక్కుపోవడం సాధారణము (= మన ఇప్పటి పరిస్థితి). అన్నమాచార్యులు చెప్పేది ఏమిటంటే "ఈ పరిస్థితి మారకపోతే, పైన పేర్కొన్న​ లోతైన సంబంధంలో పాల్గొనలేము. అందుకై భగవంతునికి సమర్పించుకోవాలి.

భగవంతునికి వొసగు ఈ సమర్పణ పరిపూర్ణమైనది మరియు ఏక (ఒకేవొక అనే అర్ధములో, one-wayలో) మార్గమున సాగును. ఇది బదిలీ చేయలేము. ఈ రూపాంతరము గురించి అన్నమాచార్యుని మాటలను బట్టి ఆయనకు తన పూర్వ స్థితి చాలా తక్కువే గుర్తుందని మనం ఊహించవచ్చు. అందువలన, అతను తన మునుపటి స్థితిని కేవలము వెట్టిచాకిరి స్థితిగా పేర్కొన్నాడు.  జిడ్డు కృష్ణమూర్తి విషయంలోనూ అదే జరిగింది.

ఇక్కడ వివరించిన విధంగా రూపాంతరీకరణ గురించి  అన్నమాచార్యులు ప్రస్తావించిన  గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక / దొడ్డతెరువువంక తొలఁగుమీ#1 అను మాటలను గుర్తుచేసుకుంటే సముచితంగా ఉంటుంది. {=అదిగో అక్కడ కనబడుతున్న చిన్న ద్వారం గుండా వెళ్ళు. అక్కడ నీకు దొడ్డ మార్గం కనబడుతుంది   స్వేచ్ఛతో ఎగరడానికి హృదయములోని మలినములను ప్రక్షాళించుకొనుటకు రూపాంతరమొక్కటియే గతి}.

చర్చను ఆసక్తికరంగా మరియు సులభముగా బోధపడునట్లు చేయడానికి, రెనే మాగ్రిట్ యొక్క "మెమొరీ ఆఫ్ ఎ జర్నీ (యాత్ర జ్ఞాపికలు)" అనే పెయింటింగ్ ను నేను క్రింద పరిచయం చేస్తాను. ఈ చిత్రంలో  ఒరిగియున్న పీసా టవర్ (గోపురం) పడిపోకుండా ఒక పెద్ద ఈక మద్దతు ఇస్తుందని చూపించబడింది.


 

పై చిత్రంలో జ్ఞాపకశక్తిని ఈకగా తీసుకోండి. జర్నీ ఫేమస్ పీసా టవర్ అనుకోండి. జ్ఞాపకాలు మసకబారుతూనే ఉంటాయి. కానీ జ్ఞాపికలు, ఛాయాచిత్రాలను తిరిగి చూడటం ద్వారా ఈ ప్రయాణం తాలూకు ముద్ర  మనస్సులో బలంగా వేళ్ళూనుకుంటుంది.   'కాలక్రమేణా పీసా టవర్ కూలిపోవచ్చు, కానీ దాని జ్ఞాపకం కాదు' అనేది ఈ పెయింటింగ్ యొక్క సామాన్యార్థం. అందువలన, మానవుడు తన ఆలోచనలలో ఈకను పీసా యొక్క ఇటుక మోర్టార్ టవర్ కంటే బలమైనదిగా చూస్తాడు. అందువల్ల, "టవర్ ఈకకు మద్దతు ఇస్తుందా లేదా ఈక టవర్'కు సపోర్ట్ ఇస్తుందా" అని అంతర్గతంగా గుర్తించడం సవాళ్ళతో కూడుకున్నది". 

పీసా టవర్ వలె, మన మెదడును మరియు దృష్టిని ఆక్రమించే అసంఖ్యాక జ్ఞాపకాలను మనం కలిగి ఉంటాము.  ఈ జ్ఞాపకాలు ఒక్కొక్కటి విడదీయడానికి బాధాకరంగా పరిణమిస్తాయి.   అన్నమాచార్యుని “పొరచి వెట్టంపి” అను పదములు ఆ  బాధలను సూచించే అయోమయ స్థితికి తార్కాణములు. ​

అందుకే అన్నమాచార్యులు .. ఆ గందరగోళానికి ముగింపు పలకాలంటే మనిషి తన కృత్రిమ కార్యక్రమాలన్నీ వదిలేయాలి అనిచెబుతూ "కలది గలట్టే కర్మఫలంబులు / నిలిపితిమా నేము నిమ్మకుఁ బులుసు"#2 అన్నారు {=నిమ్మకుఁ బులుసుపట్టడము ఎంత సహజమో, అలాగే మన కర్మఫలములను ఉన్నవి ఉన్నట్లుగా సహజముగా నిలిపివైచితిమా?}

అందువలన, ఈ పల్లవి యొక్క అన్వయార్థం "నేను నా మూర్ఖపు మొండితనాన్ని విడిచిపెట్టినప్పుడు నిజమైన కరుణ సులభంగా మరియు సూటిగా కనిపించింది".  

అన్వయార్ధము: ఎవరికైనా ఉన్న నిజమైన ఆత్మీయుడు దైవమే. అయితే, అతని కరుణను ఆస్వాదించడానికి మీరు మీలో పేరుకుపోయిన మొండితనాన్ని విడనాడాలి. 

అంతరంగ మైనవాఁడు ఆయ మెరిఁగినవాఁడు
చెంతలఁ దానే అని చెప్పేఁ గదే
వంతులు వాసు లెంచక వాకిటికి వచ్చె నేఁడు
యింత మన్నించఁ దాఁ గాక యిఁక నెవ్వరే ॥ఇదివో॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఆయ మెరిఁగినవాఁడు = ప్రాణుల ముఖ్యమైన భాగాలు తెలిసినవాఁడు; వంతులు వాసు లెంచక = ఇప్పుడు నీ వంతు, అప్పుడు నా వంతు అని లేదా నేనక్కడ ఉంటను, నీ విక్కడ వుంటావు అని లెక్కలు వేసుకోకుండా.

భావము: అంతరంగము అనిపింప చేయువాడు, ప్రాణుల ప్రాణముల వంటి విషయములను తెలిసినవాఁడు వంతులు వాసు లెంచక అనూహ్యముగా వాకిటికి వచ్చె నేఁడు. ఇంత కంటే మన్నించగల వారవ్వరే?

వివరణము:  ఇది మరోక అసాధారణ చరణము. 'ఆయ మెరిగినవాడు'తో దేవునికి మన హృదయం తెలుసునని సూచిస్తున్నాడు. అజ్ఞానపుటూహలతో మనం భగవంతునితో ఏకత్వాన్ని వ్యక్తిగతంగా ఏకాంతముగా కోరుకుంటాం. 

ఆయన ప్రతి ప్రాణికి దగ్గరగా ఉంటాడు కాబట్టి, భగవంతుడికి లోపలా బయటా ఏదీ లేదు అనుకోవచ్చు. కాబట్టి, భగవంతుడితో ఏకత్వాన్ని ప్రపంచంతో  ఏకత్వంగా తీసుకోవచ్చు. ప్రపంచంలో మనం అంగీకరించే వాటితో సామరస్యపూర్వక సమీకరణాన్ని నిర్మించుకోవచ్చు. అయితే, మనకు అసౌకర్యంగా ఉన్న ఆలోచనలకు ఏంచేస్తాం? కొన్నిటికి మాత్రమే అంగీకారం అనేది మనం ఆరాధించే 'అజ్ఞానం'లోని భాగం. అందువలన, ఈ ప్రపంచం నుండి మనల్ని వేరుగా చూసేలా చేసేది మూర్ఖత్వం. 

రెనె మాగ్రిట్ యొక్క పెయింటింగ్ లోని ఈకను తొలగించినప్పుడు, మన జ్ఞాపకాలలో టవర్ యొక్క నిర్మాణం క్రమేణా కూలిపోతుంది. అలా జరగకూడదని మనం కోరుకుంటాం. నిజానికి మనస్సులోని ఆ టవర్ నిజమైన టవర్ కంటే భద్ర పరచ చూస్తాము. జ్ఞాపకాలు కూలిపోతే ఆ  పర్యవసానాలు ఎదుర్కోవడానికి భయపడుతాం. {‘యితరులచే ముందర నిఁక నెట్టౌదునో#3= ఇతరులు తనతో ఎలా ప్రవర్తిస్తారన్నది మనిషికి అత్యంత భయాందోళనలు కలిగించు విషయము. కానీ, పరిశీలనకు పునాదులున్నవా? లేదా భయం యొక్క ఒక రూపం మాత్రమేనా? ఇది కేవలం ఊహాత్మకమా?} ఇప్పుడు పెయింటింగ్ మరింత కనెక్ట్ అవడం చూడవచ్చు. ఆలోచనల యొక్క మరింత మోసపూరిత స్వభావం సుస్పష్టం. కాబట్టి, ఆలోచనలను విరమించుకోవడం అంత సులభం కాదు. అవే నొప్పికి / బాధకు కారణం. 

మనిషికి సవాళ్ళు విసిరేవి మనం సృష్టించి అమలు చేసే విలువలు. పాజిటివ్ లేదా నెగెటివ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నాక.. జ్ఞాపకం యొక్క ఇమేజ్'తో ఆయా విలువలు అతుక్కుపోతాయి; దానితో కలిసే ఉంటాయి.  ఎందుకంటే మనకు ఏది మంచిదో అనే ఊహాశక్తి ఉంటుంది. తప్పు ఏమిటో మాకు ఖచ్చితంగా తెలుసు. 'మంచి', 'చెడు' అనే భావనలతో ఏర్పడిన ఆలోచనల మధ్య ఊగిసలాటతో జీవితాన్ని గడుపుతాం. ఈక మద్దతును తొలగించడం - పెను సవాలు. మనము తొలగించడానికి ఇష్టపడటం లేదు. అందువలన, 'ఇష్టంలేని చర్య' నొప్పిని సృష్టించే ఆనవాళ్లను వదిలివేస్తుంది. 

ఇక్కడ పేర్కొన్న సామరస్యపూర్వక జీవనం ఊహా ప్రపంచంలో కాదు. అంతర్గతంగా దేన్నైనా తిరస్కరిస్తూ కేవలము పెదవులతో అంగీకరించడం కాదు. అటువంటి ఉపరితల అంగీకారం అంగీకారమే కాదు. సామరస్యపూర్వకమైన సమర్పణ అతిపెద్ద సవాలు.

అందువలన మునుపటి చరణం వివరణలో పేర్కొన్న రూపాంతరం బాధాకరంగా ఉంటుంది. ఈ విషయమై అన్నమాచార్యులు హృదయసుఖ మదిగాక పరము#4(=పరము అనునది హృదయానికి ఓదార్పునిచ్చేది కాదన్నారు). అన్నమాచార్యులు ఈ కీర్తనలో బాధాకరమైన విషయాలను కప్పిపుచ్చడానికి సున్నితమైన పదాలను ఎందుకు ఉపయోగించారో మనం ఇప్పుడు అర్థం చేసుకోగలం.   

వంతులు వాసు లెంచక వాకిటికి వచ్చె నేఁడుతో భగవంతుని కరుణకు క్రమముగాని, ఒక పద్ధతిగానీ లేక​, ఊహకు అందని పరిణామమని అని తెలుస్తుంది. 

బలి చక్రవర్తి నివసించు పాతాళమునకు విష్ణుమూర్తియే స్వయముగా కాపలాకాసి సంరక్షించిన విషయముతో "యింత మన్నించఁ దాఁ గాక యిఁక నెవ్వరే " అనునది స్పష్టమగుచున్నది. 

అన్వయార్ధము: 'లోపల' లేదా 'వెలుప'లను కృత్రిమ భావనలని; ఎటువంటి సంకోచం లేకుండా వాటిని అంగీకరించడమే తెలివియని గ్రహింపవలె.

వహించుకొనేవాఁడు వద్ద నిట్టె వుండేవాఁడు
విహరించ నా కిన్నటా వెలనె తానె
వహి కెక్క శ్రీవెంకటవల్లభుఁ డితఁడే నన్ను
తహతహ దీరఁ గూడె తగవరి అవుఁ గదే ॥ఇదివో॥ 

ముఖ్య పదములకు అర్ధములు: వెలనె = బయటనే అనే అర్ధములో వాడారు; వహి కెక్క = ప్రసిద్ధి చెందె; తహతహ దీరఁ = ఉత్కంఠ తీరునట్లు; తగవరి అవుఁ గదే = తీర్పునివ్వడా? 

భావము: మన భారమును వహించుకొనేవాఁడు, అతి చేరువగా నుండువాడు, అన్వేషించ దగినవాడు అతడే.  శ్రీవెంకటవల్లభుఁనిగా ప్రసిద్ధి చెందినవాడు గొప్ప న్యాయాధికారి కాడా? 

వివరణము: అన్నమాచార్యులు ఇక్కడ తగవరి (తీర్పు) అనే ప్రస్తావన ఎందుకు తెచ్చారు? మానవులు ఏదోయొక కపటోపాయముతో దైవము నందు ప్రవేశించవచ్చని మనము భావించరాదు. ఇప్పుడు బైబిలు లోని హెబ్రీయులకు ను౦డి ఈ క్రింది వాక్యములను పరిశీలి౦చ౦డి. 

12ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. 13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

References and Recommendations for further reading:

#1 93. ఊరికిఁ బోయెడి వోతఁడ (Uriki bOyeDi vOtaDa)

#129 కలది గలట్టే కర్మఫలంబులు (kaladi galaTTE karmaphalaMbulu)

#3 158 నిన్ను నమ్మి విశ్వా సము నీపై నిలుపుకొని (ninnu nammi viSvAsamu nIpai nilupukoni)

#39 అదిగాక నిజమతంబది గాక యాజకం (adigAka nijamataM badigAka yAjakaM)

-X-The End-X-

No comments:

Post a Comment

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...