Wednesday 12 June 2024

T-206. అప్పడుండే కొండలోన ఇప్పపూలు ఏరబోతే

 

అన్నమాచార్యులు

206. అప్పడుండే కొండలోన ఇప్పపూలు ఏరబోతే


అధ్యాత్మ కీర్తన:

అన్నమాచార్యులు

రాగిరేకు ???? సంపుటము: 27-???

 

1.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే –
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ
 
2. ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే –
మూక మూడు విధములాయరా - ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
 
3. అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే –
వొల్వలెల్ల మల్ల్యెయాయే - ఓ వేంకటేశ
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
4. అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే –
కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా
 
5. పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే –
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా
 
6. చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే –
కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా!
 
7. గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే –
కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
8. సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ –
 తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
 
9. ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ –
ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా
 
10. ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె –
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
11. ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె –
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
12. ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని –
మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
13. పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి –
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
 
14. అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని –
నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

 

Details and explanations:

అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే –
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ

ముఖ్యపదములకు అర్ధములు:  అప్పడుండే కొండలోన = భగవంతుని చేరుటకు మానవులు చేయు పుణ్యములు, పురుషార్థముల వంటి రచనలు; ఇప్పపూలు = మత్తు కలిగించే ఆకర్షణ; కప్ప = సుదీర్ఘ కాలం అంటే మనస్సు ఊహించలేనంత దీర్ఘ కాలమని చెప్పడానికి బౌద్ధంలోనూ, కొన్ని ఇతర మతాలలోనూ వుపయోగిస్తారు. (లేదా కప్పల్లాగా అటు ఇటు గెంతు మనసు అన్ని కూడా తీసుకో వచ్చు); ​అప్పలుగల వాడు = బంధములలో చిక్కుకున్నవాడు.

భావము: ఇక్కడ అన్నమాచార్యులు వేంకటేశుడు (భగవంతుడు) ఒక గొప్ప ఆకర్షణ శక్తి అని అతనిని చేరుటకు మానవులు చేయి పుణ్యములు పురుషార్థములవంటి వాటి మత్తులో సుదీర్ఘకాలం ఇరుక్కుపోయి బంధంలో చిక్కుకుంటారు అని అంటున్నారు.

 

ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే –

మూక మూడు విధములాయరా - ఓ వేంకటేశ

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ

ముఖ్యపదములకు అర్ధములు: ఆకాశాన పొయ్యే = విశాలమైన ప్రపంచంలో పయనించు; కాకి = ఒకానొకడు; మూకజూచి కేకవేశే = అక్కడున్న జనుల గుంపులను చూసి వారిని అడిగాడు (remember group think problems); మూక మూడు విధములాయరా = ఆ గుంపులన్నీ తాము చెప్పినవే సరియని వేరేవన్నీ తప్పని కాకుల్లాగ పోట్లాడుతూ వుంటే; కేకవేశే =  వారిని అటుల సమయము వ్యర్థము చేయవలదని  కేకవేసెను;

భావము: ఓ వెంకటేశుడా!  ఈ విశాలమైన ప్రపంచంలో పయనించు ఒకానొకడు అక్కడున్న సమూహములు తమలో తామే ఘర్షణ పొందుతూ నిర్వీర్యం అవుతుంటే చూచి ఒకానొకడు (అన్నమాచార్యులు) ఆ రకంగా చేయవలదని కేకలు వేశారు.

 

అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే –

వొల్వలెల్ల మల్ల్యెయాయే - ఓ వేంకటేశ

దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: అహోబిలయ్య గుంటలోన = అహోబిలంలోవున్న  కోనేరులో;  వొల్వలు ఉదక పోతే = తమను తాము శుద్ధపరచుకోబోతే;- వొల్వలెల్ల = ఆ శరీరాలన్నీ; మల్ల్యెయాయే = మాలిన్యములాయె; 

 

భావము:  ఓ వేంకటేశా! అహోబిలంలోవున్న  కోనేరులో ప్రజలు తమను తాము శుద్ధపరచుకోబోతే ఆ శరీరాలన్నీ మరింత మాలిన్యములాయె.

వివరణము: మహాభారతములో భీష్ముణ్ణి ధర్మరాజు ఏ తీర్థములలో మునిగిన శాంతి లభించును అని అడుగుతాడు. దానికి భీష్ముడు "నాయనా మనస్సు శుభ్రము కాకుండా ఏ తీర్థములలో మునిగినా ప్రయోజనము లేదు" అంటాడు.

 

అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే –

కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా

శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: అహోబిలాన చెట్టు బుట్టే = ఒకానొక ఆలోచన, ఒక సిద్ధాంతము, ఒక ప్రతిపాదన, ఒక విధము;  భూమి యెల్ల తీగపారే = భూమియంతా తీగలా పాకినది; కంచిలోన కాయ కాచేరా = దానిని ఆ సిద్ధాంతమునకు, ఆ ప్రతిపాదనకు రూపము కల్పించెను;   శ్రీరంగాన పండు పండేరా = కానీ దాని ఫలములు వేరోకచోట (వేరోకరికి) లభించినవి.

భావము:  ఓ వేంకటేశా  ఆలోచనలు, సిద్ధాంతములు, ప్రతిపాదనలు, పని విధములు భూమియంతా తీగలా పాకినవి. వానికి వేరొక చోట కష్టపడి రూపము కల్పించారు. కానీ ఫలితములు వేరోకరు అందుకుంటున్నారు.

వివరణము: సొమ్మొకడిది. సోకొకడిది అన్నది ముందునుంచీ పరిపాటిగా వస్తున్నదే. అదే విషయము ఇక్కడ సూక్ష్మంగా చెప్పారు. ఈ చరణము అన్నమాచార్యుల పరిశీలనా శక్తికి నిదర్శనము. (ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ఆసియా ఖండంలో మానవులంతా శక్తికి మించి పని చేయుచున్నాను వారికి విశ్రాంతి, మనశాంతి ఆహ్లాదకరమైన వాతావరణం, తగిన వేతనం కూడా కరువయ్యాయి. ఈరోజున వున్న వాణిజ్య ఒప్పందాల ప్రకారము ఒక చోటి సరకు వేరొక చోటుకి వెళుతున్నది విదితమే. సామ్యవాదం అంటూ ఎన్నో నినాదాలు వున్నా మానవులలో ముఖ్యంగా విశ్రాంతిలోను, మనశాంతిలోను ఆహ్లాదకరమైన వాతావరణంలోను  ఎక్కువ తక్కువలు ప్రపంచమంతా కనబడుతూనే వున్నవి).

 

పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే –

పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా

అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా

 

ముఖ్యపదములకు అర్ధములు: పుట్టామీద చెట్టు బుట్టే = మనమూహించని చోట ఔషధము పుట్టెను;   భూమియెల్ల తీగపారే = ఆ విషయము భూమియంతా తీగలా పాకినది;  పర్వతాన పండు పండేరా = చాలా ఎత్తులో ఆ పండు పండినట్లు కనబడుతుంది; అందవచ్చు = భగవంతుని కృపతో మహా ప్రసాదములా దానిని అందుకోవచ్చును; కోయరాదురా = దానిని ఆశించి పొందలేము;

భావము:  ఓ వేంకటేశా మేమూహించని చోట ఔషధము పుట్టిస్తావు. ఆ విషయము భూమియంతా తీగలా పాకిస్తావు. ఆ పండు (మోక్షము) అందరాని ఎత్తులో వుంది. భగవంతుని కృపతో మహా ప్రసాదములా దానిని అందుకోవచ్చును కానీ దానిని ఆశించి పొందలేము.

 

చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే –

కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా

పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా!

ముఖ్యపదములకు అర్ధములు: చేయిలేనివాడు = మనసు;  నెత్తిలేని వాడు= అహంకారము​; కాళ్ళు లేని వాడు= ఆశ; పెదవిలేని వాడు = మౌనములో వున్న వాడు; చిలుక = జ్ఞానమునకు గుర్తు;

భావము:  మనసు అహంకారము ఆశ మానవులను నడుపుతూ వుంటే ప్రపంచము పరుగిడును. సంపూర్ణమైన మౌనములో వున్నవాడు జ్ఞానము పొందుటకు అర్హుడగును.

గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే –

కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు:

భావము:  మనస్సను గుంటయెండి నిష్కామ కర్మమను పండు పండే. దానితో నా కర్మములన్నీ కుప్పవేసితిని. ఆ కుప్పకాలి నా అప్పు అను భారము తీరిపోయెరా ఓ వేంకటేశా.

సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ –

తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ

ముఖ్యపదములకు అర్ధములు: సందెకాడ = దీపాలవేళ, సాయంకాలం; తలవ్రాలు = మన తలవ్రాతలు, లలాట లిఖితము, విధి;  సంధిదీరి = కూడిక తీరి (మమకారములతో, అభిమానములతో కూడిక తీరి); తెల్లవారనాయనీడరా = సత్యము అనుకున్నది వొట్టి నీడ అని తెలిసినది;

భావము:  మేము రాత్రి అని భావించు (మాకు తెలియనిది) మా తలవ్రాతలు, విధి నిర్ణయములు మమకారములతో, అభిమానములతో నా కూడిక తీరిపోగా సత్యము అనుకున్నది వొట్టి నీడ అని తెలిసినది. నాకు తెలిసినది నీ ఒక్కనికే తెలుసు. దీని భావమిదే ఓ వేంకటేశ.

వివరణము: భగవద్గీతలోని 2-69 శ్లోకమును మననము చేసుకోవలెను.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।। 69

భావము: సమస్త ప్రాణులకు (అనగా సామాన్య జనులకు) ఏది రాత్రియై దృష్టికి గోచారము కాక ఉన్నదో, దానియందు (ఆ పరమార్ధ తత్వమునందు) ఇంద్రియనిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. (ఆత్మావలోకనం చేయు చుండును). దేనియందు (అనగా ఏ శబ్దాది విషయములందు, అశాశ్వతమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచూ) ప్రాణులు మేలుకొని ఉందురో (ఆసక్తితో ప్రవర్తించుచుందురో) ఆ విషయ జాలము పరమార్ధ తత్వమును దర్శించు మునీంద్రులకు రాత్రితో సమానమై ఉండును (అనగా ఆసక్తి ప్రదర్శించరు).

 

ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ –

ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా

 

ముఖ్యపదములకు అర్ధములు: ముత్యాల పందిటిలోన = రాత్రివేళ​

భావము:  ఆ రాత్రిలోన నక్షత్రములు ముత్యాల లాగ అగపడుతూవుంటే, ఆ ముగ్గురు – నా దేహము, భావములు, అంతరాత్మ ఒక్కటై పోగా నేను ఆ పరమేశ్వరుని చూచాను. నాకు తెలిసినది నీ ఒక్కనికే తెలుసు. దీని భావమిదే ఓ వేంకటేశ.

వివరణము: ముత్యాల పందిటిలోన అనగా ఆ రాత్రిలోన నక్షత్రములు ముత్యాల లాగ అగపడుతూవుంటే అనునది కేవలము అసలు విషయమునకు సూచికగా చెప్పబడినది. అచార్యుల ఆంతర్యము ఇది  వారు స్పృహలోలేని స్థితిలో జరిగినదని సూచించారు.

 

ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె –
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: ఏటిలోన వలవేశే = ఏదో రకంగా చిక్కకపోతుందా అని ప్రయత్నము చేయడము;  తాటిమాను నీడ = తాటిచెట్టు ఎత్తుగా ఉన్న అది చక్కటి నీడనివ్వ లేదు "తాటిమాను నీడ" అంటే నీడ లేని చోట నీడ వెతుకుతున్నాం అని అర్థం; దూరపోతే చోటులేదురా = ఏదోరకంగా ఇందులో (మోక్షమార్గములో) దూరిపోతాము అంటే మనిషికి ఎక్కడా దూరడానికి సందు దొరకదు అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు.

భావము:  ఆ మోక్షమన్నది ఏదో రకంగా చిక్కకపోతుందా, అందులో దూరడానికి సందు దొరకక పోతుందా అని ప్రయత్నము చేయడము తాటిమాను నీడను (నీడ లేని చోట నీడను) వెతకడం వంటిది. వృథాప్రయత్నము.

 

ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె –

పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

భావము:  కూతురు, ఆలు, పెండ్లాము అను బంధములు మానవులుగా మనం ఏర్పాటు చేసుకున్నవి. మానవకి మానవునికి ఉన్నది ఒకే ఒక్క అనుబంధం అది అదియే  దైవం. తక్కినవన్నీ క్షరములు (అనగా క్షీణించునవి అని అన్నమాచార్యుల ఉద్దేశం

వివరణము: నీవు ఒకరికి కూతురు కింద, ఇంకొకరికి పెండ్లాము కింద అన్నీ  నీవై పుడుతూ ఉంటావు. నీవు ఇదని, నీతో నాకు సంబంధం ఇదని చెప్పగలనా? (భగవంతునికి ఒక నిర్వచనమివ్వలేనని అన్నమాచార్యులు అంటున్నారు).

 

ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని –

మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: ఆకులేని అడవి = మానవుని మనస్సు; మూడుతోకల పెద్దపులి= పెద్దపులి వంటి భయంకరమైన త్రిగుణములను; మేక = సత్వ గుణము;  మేక యొకటి = సత్వ గుణమునే నమ్ముకుని వున్న వాడు​; యెత్తి మింగేరా = అవలీలగా హరించి వేసినది.

భావము:  మానవుని మనస్సు అను అడవిలో త్రిగుణములను పులి వర్తించుచున్నది. సత్వ గుణమునే నమ్ముకుని వున్న మేక వంటి వాడు ఆ పెద్దపులిని అమాంతముగా మ్రింగి వేసెను.

వివరణము: మనమంతా ఈ త్రిగుణములకు లోనై వుందుము. ఈ త్రిగుణములలో ఒక్కొక్క సమయములో ఒక్కో గుణముది పైచేయిగా ఉంటుంది. ఈ గుణములే నాశములేని నిత్యమగు జీవాత్మను అశాశ్వతమగు దేహమునకు బంధించును. సత్వ గుణమునే నమ్ముకుని వున్న మాహానుభావులు కొందరు భగవంతుని కృపవలన త్రిగుణములను హరించి వేసుకొందురు. అదే మోక్షమన్నది.

పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి –

కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

 

భావము:  మనము తప్పఈ ప్రపంచమంతా  పున్నమ వెన్నెలలో విహరించుచున్నారు అనిపించును. మమల్ని ఇలా వదిలేసి వన్నెలాడితోను గూడి కిన్నెర మీటుచు పొయ్యేవా ఓ వేంకటేశా?

 

అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని –

నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా

దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

ముఖ్యపదములకు అర్ధములు: అర్థరాత్రి వేళలో = ఆచార్యులవారు ఈ లోకము యొక్క స్పృహలోలేని సమయములో;  రుద్రవీణ నెత్తుకొని = తనను తాను మరచి ఆ దైవమునకు సమర్పించు కొనగా; నిద్రించిన నిన్ను పాడగ = ఆ సమయములో తానేమి చేయుచున్నది ఆచార్యులవారికి తెలియదని ఏ దైవమును చూచిరో తెలుపలేనని అంటున్నారు.

భావము:  దైవమా! నిన్ను కలిసే సమయంలో నా కన్నులకు అగోచరమైనా, ఆ స్థితిలో నేనే వీణనై రాగములు పలికించి నిన్ను కీర్తించి పాడినట్లు లీలగా గుర్తు.

-X-X-The End-X-X-

 

 

T-205. రాతిఁ బతిమ సేసిన రామచంద్ర

 అన్నమాచార్యులు

205. రాతిఁ బతిమ సేసిన రామచంద్ర

రామభక్తి.

 

కీర్తన సంగ్రహ భావము: 

పల్లవి: "రాతిని నాతిగా చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రా నన్ను నీ చేతిలో సమర్పించు కుంటున్నాను. నువ్వేం చేద్దామనుకుంటే అది చేయి" అని అన్నమాచార్యులవారు తన స్వతంత్రమంతటినీ రామచంద్రునికి అప్పచెప్పారు. 

చరణము 1: రామచంద్ర మీకు అపకీర్తి కలిగేటట్టుగా నింద వచ్చేటట్టుగా యథార్థముగా నన్ను దూరంగా పెట్టి మసలుకోకు. నీపై ఎంతో ప్రేమతో ఉన్నాను. నన్ను ఈ ప్రపంచపు దుఃఖంలో ముంచివేయకు రామచంద్ర. 

చరణము 2: విన్నపాలు వేలకొద్ది ఎలా రామచంద్ర? నా కన్నులకు నీవేకదా గురి! (నిన్ను కాక వేరెవరినీ ఆశ్రయించడం లేదు అని అర్ధం.) నన్ను వదిలిపెట్టకుండా ఉండు రామచంద్ర. నన్నే ఎంచుకొని ఉండరాదా రామచంద్ర. 

చరణము 3: రామచంద్రా నా మర్మాలు అన్నింటినీ దాచుకోకుండా నీకు చెప్పేసాను. అపరిమిత బలముగల రామచంద్రా ఇక్కడ (ఈ లోకములో) మనిద్దరినీ కలిపేది ఒక్క సమయమే కదా! ఆ వైపు అనగా నేను మరణించిన తర్వాత మీ ఇంటి ముందటి సుగంధం ముక్కలాగా నేను నిల్చుంటాను. నీవు స్వయముగా వెంకటాద్రికి చెందినవాడివి రామచంద్రా.                  

ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు తనను తాను ఒక స్త్రీగా ఊహించుకుని రామచంద్రునికి చేసుకున్న విన్నపం. 

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 262-5  సంపుటము: 3-359

 

రాతిఁ బతిమ సేసిన రామచంద్ర నీ-
చేతిలోనిదాన నింతే శ్రీరామచంద్ర  ॥పల్లవి॥
 
వట్టిరట్టు సేయ కిఁక వద్దు రామచంద్ర
నెట్టన నే దూరనోప నిను రామచంద్ర
వొట్టితిఁ బ్రేమము నీపై వో రామచంద్ర మమ్ము
వట్టిజాలిఁ బెట్ట కిఁక వద్దు రామచంద్ర         ॥రాతిఁ॥

విన్నపాలు వేయునేల విను రామచంద్ర మా-
కన్నులకు నీవె గురి ఘనరామచంద్ర
యెన్నిక నన్నుఁ బాయకు మిఁక రామచంద్ర
నిన్ను నన్ను నెంచుకొమ్మీ నీవు రామచంద్ర         ॥రాతిఁ॥
 
ఆయము లంటితివి నెయ్యపురామచంద్ర వొక్క-
పాయమే ఇద్దరికిని బలురామచంద్ర
ఆయెడ వావిలిపాటి హరిరామచంద్ర
చేయార శ్రీ వేంకటాద్రిఁ జెందితి రామచంద్ర          ॥రాతిఁ॥ 

 

Details and explanations:

రాతిఁ బతిమ సేసిన రామచంద్ర నీ-
చేతిలోనిదాన నింతే శ్రీరామచంద్ర        ॥పల్లవి॥ 

భావము: "రాతిని నాతిగా చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రా నన్ను నీ చేతిలో సమర్పించు కుంటున్నాను. నువ్వేం చేద్దామనుకుంటే అది చేయి" అని అన్నమాచార్యులవారు తన స్వతంత్రమంతటినీ రామచంద్రునికి అప్పచెప్పారు. 

వట్టిరట్టు సేయ కిఁక వద్దు రామచంద్ర
నెట్టన నే దూరనోప నిను రామచంద్ర
వొట్టితిఁ బ్రేమము నీపై వో రామచంద్ర మమ్ము
వట్టిజాలిఁ బెట్ట కిఁక వద్దు రామచంద్ర    ॥రాతిఁ॥ 

ముఖ్యపదములకు అర్ధములు: రట్టు = అపకీర్తి, నింద​; నెట్టన = అనివార్యముగా, నిజముగా, యథార్థముగా; వొట్టితిఁ = పట్టితిఁ; వట్టిజాలిఁ బెట్ట =  వట్టి దుఃఖపడునట్లు. 

భావము: రామచంద్ర మీకు అపకీర్తి కలిగేటట్టుగా నింద వచ్చేటట్టుగా యథార్థముగా నన్ను దూరంగా పెట్టి మసలుకోకు. నీపై ఎంతో ప్రేమతో ఉన్నాను. నన్ను ఈ ప్రపంచపు దుఃఖంలో ముంచివేయకు రామచంద్ర. 

విన్నపాలు వేయునేల విను రామచంద్ర మా-
కన్నులకు నీవె గురి ఘనరామచంద్ర
యెన్నిక నన్నుఁ బాయకు మిఁక రామచంద్ర
నిన్ను నన్ను నెంచుకొమ్మీ నీవు రామచంద్ర   ॥రాతిఁ॥ 

ముఖ్యపదములకు అర్ధములు: బాయకు మిఁక = వదలిపెట్టవద్దు; నన్ను నెంచుకొమ్మీ  = నన్నే ఎంచుకో. 

భావము: విన్నపాలు వేలకొద్ది ఎలా రామచంద్ర? నా కన్నులకు నీవేకదా గురి! (నిన్ను కాక వేరెవరినీ ఆశ్రయించడం లేదు అని అర్ధం.) నన్ను వదిలిపెట్టకుండా ఉండు రామచంద్ర. నన్నే ఎంచుకొని ఉండరాదా రామచంద్ర. 

వివరణము: నువ్వు ఎంచుకోకపోతే నా అంతటికి నేను  కనుగొనలేను. కాబట్టి నువ్వే నన్ను రక్షించు. 

ఆయము లంటితివి నెయ్యపురామచంద్ర వొక్క-
పాయమే ఇద్దరికిని బలురామచంద్ర
ఆయెడ వావిలిపాటి హరిరామచంద్ర
చేయార శ్రీ వేంకటాద్రిఁ జెందితి రామచంద్ర   ॥రాతిఁ॥ 

ముఖ్యపదములకు అర్ధములు: ఆయము లంటితివి = నా మర్మములన్నీ నీకు చెప్పేసితిని; నెయ్యపు = స్నేహశీలి; పాయమే = వయస్సే, సమయమే; బలు = సమాసమందు బలువు శబ్దమున కేర్పడు రూపము; వావిలిపాటి = ఒక సుగంధపు మొక్కలాగ​; చేయార = చేతులార. 

భావము: రామచంద్రా నా మర్మాలు అన్నింటినీ దాచుకోకుండా నీకు చెప్పేసాను. అపరిమిత బలముగల రామచంద్రా ఇక్కడ (ఈ లోకములో) మనిద్దరినీ కలిపేది ఒక్క సమయమే కదా! ఆ వైపు అనగా నేను మరణించిన తర్వాత మీ ఇంటి ముందటి సుగంధం ముక్కలాగా నేను నిల్చుంటాను. నీవు స్వయముగా వెంకటాద్రికి చెందినవాడివి రామచంద్రా. 

వివరణము: మొదటి పల్లిలో పంక్తిలో తన దగ్గర రహస్యాలేమీ లేవు అని తాను స్వచ్ఛమైన వాడిని అని ప్రకటించుకున్నారు అన్నమాచార్యులు. అనంతమగు ఈ జీవన ప్రయాణంలో మానవులకు స్పృహ కలుగుతున్నది కొద్దిపాటి కాలము మాత్రమే (భగవద్గీత 2-28​).  రెండవ పంక్తిలో తనకు కలిగిన ఈ కొద్దిపాటి సమయంలో కూడా తనను దూరము చేసి వుండవద్దు అని వేడుకొనుచున్నారు.  అంతే కాదు తాను మరణించిన తర్వాత కూడా ఇదే రకంగా ఒక సుగంధ మొక్కలాగ హరి కీర్తనలను సువాసనలను వెదజల్లుతూ వ్యాపింపజేస్తూ ఉంటాను అంటున్నారు.

-x-x-x-

 

Saturday 1 June 2024

T-204. పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు

 అన్నమాచార్యులు

204. పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు

చేయదగు వ్యవసాయమే హరిభక్తి.

కీర్తన సంగ్రహ భావము: 

పల్లవి: ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు బహువిధములైన కార్యములు చేపట్టు మన వంటి వారిని విమర్శిస్తున్నారు ఘనులైనటువంటి వారు తామరాకు మీద నీటి బొట్టులాగా కార్యములందు అంటీ అంటనట్లుగా ఉందురు. 

చరణము 1: రైతులు మొదటగా చిట్టడివితో నిండిన నేలను నరికివేసి, చదునుచేసి, ఆపై  పొలము దున్ని  క్రింది మట్టిని పైకి తెచ్చి పొలమును వ్యవసాయము చేయుటకు సిద్ధము చేసికొన్నట్లు, సాధకులు చిత్తము లేదా మనసు అను  క్షేత్రమును కర్షకుని వలె మూలమూలలా కదిలించి, శుద్ధి చేసి తపస్సు అను సేద్యము చేయుటకు ఏర్పాట్లు చేసుకోవలెను. రైతులు మంచి వాన పడిన అదను చూసి విత్తునట్లు,  వివేకులు అదను చూసి హరిభక్తిని నాటి శాంతము అను మహా సాగరములో తమను తాము మరచునట్లు అంకితమై వ్యవసాయము చేయుదురు. 

చరణము 2: వ్యవసాయదారులు తమ పొలంలో పైరుతోపాటు మొలకెత్తే కలుపు గడ్డిని తవ్వి తీసివేస్తారు. పంటని నాశనంచేసే పశువులనుంచి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ ముండ్లచెట్లు పెడతారు. చేను బాగా పెరగటానికి ఎరువులు వేస్తారు. ఈ రకంగా వ్యవసాయదారులు పంటలను రక్షించుకొంటారు. ఇదే రకముగా ప్రయత్న శీలులు తమ మనస్సను పొలంలోని కామము, క్రోధము అను కలుపును తీసివేస్తారు. లౌకిక వాంఛలనుంచి తమ జ్ఞానానికి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వైరాగ్యమను ఆవరణ (వెలుగు) పెడతారు. ఆచారము విధులను మాయలు కపటముల నుండి విముక్తి చెందుటకు భౌతికముగాను, మానసికముగాను పనులను వదలి సన్యాసమను శరణాగతిని ఎరువులుగా వేసి జ్ఞానమను చేనును ఆధ్యాత్మిక వ్యవసాయదారులు రక్షించుకొందురు.   

చరణము 3: ఎక్కడ చూసిన శ్రీ వెంకటేశ్వరుడున్నాడు అని గ్రహించిన వివేకులు యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు మాత్రం అనుభవించి దానితోనే సంతృప్తిని చెందుదురు.  తమను తాము ఆ సన్నని ఇరుకు మార్గములో ఇడుకొని వుందురు దైవకృప కలిగిన ఆ పుణ్యాత్ములు.                  

ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు మనిషి జీవనమును వ్యవసాయంతో పోల్చి ఏ రకంగా అయితే కృషీవలుడు తన పంటను కాపాడుకుంటాడో అదే రకముగా హరిభక్తి సాధకులు చిత్తమను క్షేత్రములో పాపమును కలుపు మొక్కలు, బంధములు అను పాతుకుపోయిన వ్రేళ్ళను పెలికివేసి అజ్ఞానమను మట్టిని పైకి క్రిందికి కలిపి మనసు అను క్షేత్రమును సిద్ధం చేయుదురు అన్నారు. సత్యసాధనకు వివేకులు అవలంభించు మార్గమును అతి నేర్పుగా వివరించారు. 

అధ్యాత్మ కీర్తన:
అన్నమాచార్యులు
రాగిరేకు 262-5  సంపుటము: 3-359 
పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు ॥పల్లవి॥
 
పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన వదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు  ॥పంట॥ 
 
కామక్రోధాదులనే కలువు దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు ॥పంట॥
 
యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ దాము
గొంది నిముడుకొందురు గురుకృప జనులు ॥పంట॥

 

Details and explanations:

పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు ॥పల్లవి॥ 

ముఖ్యపదములకు అర్ధములు: పంటలభాగ్యులు = కర్మఫలములను కోరువారు; వీరా = వీరు కాదు; బహువ్యవసాయులు = అనేకానేక బహువిధములైన కార్యములు చేపట్టువారు. 

భావము: ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు బహువిధములైన కార్యములు చేపట్టు మన వంటి వారిని విమర్శిస్తున్నారు ఘనులైనటువంటి వారు తామరాకు మీద నీటి బొట్టులాగా కార్యములందు అంటీ అంటనట్లుగా ఉందురు. 

వివరణము: ఇది చూస్తే భగవద్గీతలోని క్రింది రెండు వాక్యములపై లోతుగా అన్నమాచార్యులు ఆలోచించమంటున్నారు. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన!।  బహుశాఖా హ్యనంతా బుద్ధయోవ్యవసాయినామ్ (2-41) భావము:  ఓ అర్జునా! నిశ్చయించి అందిపుచ్చుకొనుటకు మనస్సుకు ఒకే ఒక మార్గము కలదు. చంచలమైన మనస్సు మాత్రమే అసంఖ్యాకమైన ఎంపికలను అంచనా వేస్తూ తడబడిపోతుంది. 

ఒక్క క్షణం కింద ఇచ్చిన బ్రూస్ లీగారి మాటలు పరీక్షించండి పరికించండి. 10,000 క్లిక్కులు నేర్చుకున్నవాడికి నేను భయపడను కానీ ఒకే క్లిక్కు పదివేల సార్లు సాధన చేసిన వాడికి జంకుతాను. దైవము విషయంలో కూడా ఇదే నిజము. 


పంటలభాగ్యులు: బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||(2-49)||   కర్మ ఫలమును గోరువారు అల్పులు. పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు = సామాన్యులందరూ ఈ రకంగా కాని కార్యములలో నిమగ్నులై తమసమయమును వృథా చేసుకుంటున్నారు అని అన్నమాచార్యుల భావము. 

పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన వదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు     ॥పంట॥

ముఖ్యపదములకు అర్ధములు: పొత్తుల = ఉమ్మడిగా; పోడు= తుప్పలు మున్నగునవి పెరిఁగియున్న యడవినేల, పొదలు నిండిన చిట్టడవి; మత్తిలి = మత్తుగొను ( అనగా చేయుచున్న​ దానిలో మత్తుగొన్నట్లు అంకితమైపోవు); మంచివాన = పుణ్యము; వదనున = నేలయందు తడి చొచ్చునంతటి వర్షము పడినపుడు, అదను చూచి; 

భావము: రైతులు మొదటగా చిట్టడివితో నిండిన నేలను నరికివేసి, చదునుచేసి, ఆపై  పొలము దున్ని  క్రింది మట్టిని పైకి తెచ్చి పొలమును వ్యవసాయము చేయుటకు సిద్ధము చేసికొన్నట్లు, సాధకులు చిత్తము లేదా మనసు అను  క్షేత్రమును కర్షకుని వలె మూలమూలలా కదిలించి, శుద్ధి చేసి తపస్సు అను సేద్యము చేయుటకు ఏర్పాట్లు చేసుకోవలెను. రైతులు మంచి వాన పడిన అదను చూసి విత్తునట్లు,  వివేకులు అదను చూసి హరిభక్తిని నాటి శాంతము అను మహా సాగరములో తమను తాము మరచునట్లు అంకితమై వ్యవసాయము చేయుదురు. 

వివరణము: ఇక్కడ అన్నమాచార్యులవారు  రైతులకు సాధకులకు కృషి ఒక్కటే అన్నారు.  రైతులు నిజమగు పోలములోను దుక్కి దున్ని వ్యవసాయం చేయదురు. హరిభక్తి సాధకులు చిత్తమను క్షేత్రములో పాపమును కలుపు మొక్కలు, బంధములు అను పాతుకుపోయిన వ్రేళ్ళను పెలికివేసి అజ్ఞానమను మట్టిని పైకి క్రిందికి కలిపి మనసు అను క్షేత్రమును సిద్ధం చేయుదురు. పైన పేర్కొన్న వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన అన్న దానికి వివరణాత్మకముగా ఈ కీర్తనను వ్రాసారు అనిపిస్తుంది. 

శాంతమనే మంచివాన వదనున విత్తుదురు హరిభక్తి వివేకులు’ = ఇక్కడ శాంతము అనగా ఆలోచనలు అను తరంగములు అను కుదుపులు లేని స్థితి హరిభక్తి అనే మంచి విత్తనాలు నాటుటకు అనుకూలమైన సమయం. మనం ప్రస్తుతము వున్న స్థితిలో క్షణక్షణం ఆలోచనలు అను కెరటములు మన మనసులను నిలకడ లేకుండా చేయుచున్నవి ఆచార్యుల వుద్దేశం. 

మత్తిలి = మత్తుగొను అనగా చేయుచున్న​ దానిలో మత్తుగొన్నట్లు అంకితమైపోవు అన్నది ఆచార్యులవారు మానవుడు తానున్న ఇప్పటి స్థితిలో హరిభక్తిని చేకొనలేడు అన్న ఉద్దేశ్యంతో చెప్పారు. అనగా తాను చేయుచున్న సత్ప్రవర్తన అను యాగములో పూర్తిగా నిమగ్నుడై ఈ భౌతిక లోకంతో సంబంధం తెంచుకుని మనసను క్షేత్రంలో హరిభక్తిని నాటగలడు. ఇక్కడ ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా అన్న మాటలు గుర్తు తెచ్చుకొనుట సందర్భోచితముగా ఉండును. 

కామక్రోధాదులనే కలువు దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు    ॥పంట॥ 

ముఖ్యపదములకు అర్ధములు : వేమరు = పలుమాఱు; వెలుగు= పశువులు లోనగునవి రాకుండా చేను చుట్టూ ముండ్లచెట్లు పెట్టి పెంచు ఆవరణము; దోమటి = అన్నము, ఆహారము, కపటము, మాయ​; ఓము = కాపాడు, పోషించు; బైరుద్యోగజనులు = (భౌతికముగా/మానసికముగా) పనిలేనివారు =శరణాగతి చేయువారు. 

భావము: వ్యవసాయదారులు తమ పొలంలో పైరుతోపాటు మొలకెత్తే కలుపు గడ్డిని తవ్వి తీసివేస్తారు. పంటని నాశనంచేసే పశువులనుంచి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ ముండ్లచెట్లు పెడతారు. చేను బాగా పెరగటానికి ఎరువులు వేస్తారు. ఈ రకంగా వ్యవసాయదారులు పంటలను రక్షించుకొంటారు. ఇదే రకముగా ప్రయత్న శీలులు తమ మనస్సను పొలంలోని కామము, క్రోధము అను కలుపును తీసివేస్తారు. లౌకిక వాంఛలనుంచి తమ జ్ఞానానికి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వైరాగ్యమను ఆవరణ (వెలుగు) పెడతారు. ఆచారము విధులను మాయలు కపటముల నుండి విముక్తి చెందుటకు భౌతికముగాను, మానసికముగాను పనులను వదలి సన్యాసమను శరణాగతిని ఎరువులుగా వేసి జ్ఞానమను చేనును ఆధ్యాత్మిక వ్యవసాయదారులు రక్షించుకొందురు. 

 

యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ దాము
గొంది నిముడుకొందురు గురుకృప జనులు ॥పంట॥ 

ముఖ్యపదములకు అర్ధములు: అందిన చేని పంటలు= తాము కోరకుండా అందినవి, తమకు ప్రకృతి అందించిన పంటలు = యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు (యజ్ఞశిష్టాశినః సంతో, భగవద్గీత 3-13); అనుభవించి = తీసుకొని;  సందడించి = అతిశయించి (= దానికే ఎక్కువ సంతోషించి); గొంది = మూల, చిన్న సందు, సన్నటి ఇరుకైన వీధి; గొంది నిముడుకొందురు  = ఆ సన్నని (ఇరుకు) మార్గములో ప్రవేశించుదురు. 

భావము ఎక్కడ చూసిన శ్రీ వెంకటేశ్వరుడున్నాడు అని గ్రహించిన వివేకులు యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు మాత్రం అనుభవించి దానితోనే సంతృప్తిని చెందుదురు.  తమను తాము ఆ సన్నని ఇరుకు మార్గములో ఇడుకొని వుందురు దైవకృప కలిగిన ఆ పుణ్యాత్ములు. 

వివరణము: ధర్మము అతి సూక్ష్మమైనది. అతి సున్నితమైనది. ఇది అని చెప్పుటకు అలవికానిది. ధర్మమును వెంబడించు వారు ఆ ధర్మము ఏ ఏ సన్నని ఇరుకు మార్గముల ద్వారా ఏ విషయములలో ప్రవేశించునో సామాన్యులమైన మనకు అవగాహన ఉండదు. ధర్మమునే సత్యమునే నమ్ముకుని జీవించువారు దానిలోనే తదేకముగా ఐక్యమై వేరు దాని ప్రస్తావన లేక వుందురు. 

దీనిని రీనె మాగ్రిట్ గారు (Rene Magritte) వేసిన 1926 నాటి పెయింటింగు La Chambre du Devin (the Seer's chamber, జ్ఞానులుండు గది) అను పేరు గల​ సంబోధనాత్మక చిత్రం ద్వారా విశద పరచుకుందాము. ఈచిత్రంలో ఒక తెల్లని తెర లేదా పలుచని ఒక గోడ కనబడుతుంది.  దాని వెనుక చీకటితో కూడిన నేపథ్యము మనకు తెలియని దానిని (పరము) సూచిస్తున్నది.

 


రెండు చెక్క మేనిక్విన్లు  ఒకదానితో ఒకటి కలుపబడి ఉన్నాయి.  ఆ మేనిక్విన్లు ఆ గోడ లోంచి బయటకు దూసుకు వచ్చినట్లు చిత్రం చూపుతుంది.  ఆ తెల్లనితెర లేదా గోడ ఈ మేనిక్విన్ ఆకారానికి అనుగుణముగా కాకుండా వేరే విధంగా విరిగిపోయి వుంది. ఆ మేనిక్విన్లు తెల్లని తెరను ఛేదించుకుంటూ సూటిగా బయటికి రావడానికి అనేక అడ్డంకులు కనపడుతుంటాయి. ఈ అడ్డంకులన్నీ మానవ నిర్మితములు అని స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. 

ఒకదానితో ఒకటి కలిసి ఉన్న మేనిక్విన్లు మనిషి చేయి పనులకు ఉదాహరణలు.   ఏదైనా కార్యము చేయుటకు ముందు ఒక అవగాహనతో ఒక ప్లాన్‌ వేసుకుంటాము. తదుపరి అది  చేయబోతాము. ఈ మేనిక్విన్లలో ఒకటి ఆలోచనకు ఇంకొకటి దాన్ని అనుసరించు యత్నమునకు సంకేతములు.  పైన చూపిన బొమ్మలో మాదిరి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కావలసిన దానికంటే ఎక్కువ మొత్తం గోడను పగులగొట్టుకుంటూ బయటపడతాము. 

ఆ తెరను లేదా గోడను చేధించడం అంటే సత్యమునకు భంగము కలిగించుట (లేదా పాటించకుండుట) అని అర్థం. కాబట్టి మనం ముందు ప్రణాళిక ఆ తర్వాత కార్యాచరణ అని సిద్ధమై చేయు పనులన్నీ ధర్మవిరుద్ధములు అని  ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చును.  ఆ తెరను ఏమాత్రము వికారమొందించకుండా దాటుటకు అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపము అవసరము. అది మనమున్న స్థితిలో సాధ్యము కాదు. 

సత్యము వికారము కాకుండా, ధర్మమును భగ్నం చేయకుండా  నడుచుకొనుటకు గల  ఒకే ఒక ఉపాయము ఆ ఆలోచనలు అను తెరువులు  ప్రణాళికలు లేకుండా కేవలం కార్యాచరణము చేయుట మాత్రమే. ఆ స్థితిలో కార్యాచరణ, ధర్మము సత్యము ఎటువంటి అవరోధం లేకుండా  అన్నీ సమ్మిళితమైపోవును. ఆ స్థితిని  చేరుటకు శరణాగతులుఁ దాము / గొంది నిముడుకొందురు గురుకృప జనులు అన్నారు అన్నమాచార్యులు.   అనగా వారు తాము అను దానిని పూర్తిగా భగ్నము చేసి దానికి అస్తిత్వము లేకుండా చేయుదురని భావము.  

బైబిల్ లో పేర్కొన్న క్రింది వాక్యము, అన్నమయ్య చెప్పినది ఒకటే అవ్వడం కాకతాళీయము కాదు.  (బైబిలు, మత్తయి సువార్త 7: 13) 13ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. 

-X-X-The End-X-X-

 

207. inniyu mugisenu iTu nIlOnane (ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె)

  అన్నమాచార్యులు 207. ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె (inniyu mugisenu iTu nIlOnane)   Introduction: "This poem is a masterpiece amo...