Friday, 1 August 2025

T-246 ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా

 తాళ్లపాక చిన తిరుమలాచార్యులు

246 ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా 

For English version press here 

సమత్వం ఒక మూసిన గది.
దాని నిశ్శబ్దంలో ఉంటావు —
లేకపోతే, అలజడిలో అల్లాడుతావు.

 ఉపోద్ఘాతము

తాళ్ళపాక కవులు —
అన్నమయ్యగారు గానీ,
పెద తిరుమలాచార్యులు,
చిన్నతిరుమలాచార్యులు గానీ —
వారి భావాలలో అసాధారణమైన లోతు కనిపిస్తుంది.
వారి కీర్తనల గొప్పదనం ఏమిటంటే —
 
ప్రాపంచిక విషయాల నుంచే ప్రారంభమవుతాయి
సామాన్యుల దైనందిన జీవితమే ఆధారంగా నిలుస్తుంది.

ఒక్కో ప్రశ్నతో మనసును కుదిపేస్తారు
ఇప్పుటికే బంధించబడినవాళ్లను నమ్మి,
నీ మెడ తాకట్టు పెట్టడం ఏందిట?” అంటూ విమర్శిస్తారు.

బయటి నుంచీ లోపలికి దారి చూపిస్తారు
ఏది తాత్కాలికమో, ఏది శాశ్వతమో గుర్తుచేస్తూ చూపుతారు.

అర్థాల అంతస్తులు ఉంటాయి
పైకి సులభమైన బోధనలా అనిపించినా
లోతుగా ఆధ్యాత్మిక ఉద్రేకాన్ని కలిగిస్తాయి. 

వారి ప్రత్యేకత ఏమిటంటే —
సాంప్రదాయానికి లొంగకుండా,

మసిబారిన​ సమాజపు గోడల్ని ఛేదించి,
బంధనాన్ని నిర్దాక్షిణ్యంగా ఎత్తిచూపిస్తారు —
అది కూడా కవిత్వ రూపంలో — గుండెని తాకే శైలిలో.


కృతిరస విశ్లేషణ​: ఈ కీర్తనని ప్రధానముగా ధ్వని కావ్యంగా భావించవచ్చును. ఎందుకంటే ఇందులో ఏ విషయము కూడా సూటిగా చెప్పకుండా ఉపపాదించ బడినది. కృతి విషయమంతా దైవికము​ తాత్వికము​ లక్ష్యము అనిపిస్తుంది. దీనిలోని స్థాయీ భావమును వైరాగ్యంగా భావిస్తే కృతిలోని ముఖ్య రసము శాంత రసము అని మనకు తెలుస్తుంది. "హాస్యము" మోదమును పుట్టించక పోయినా అంగిరసమైగంభీరతను సమతుల్యం చేస్తూ  కొంత ఓదార్పు కలిగిస్తుంది. 

సాహిత్యమును అర్ధము చేసుకొనుట కొంత​ కష్టము కనుక ఈ కీర్తనను కదళీ పాకముగా భావించ వలెను. 

అధ్యాత్మ సంకీర్తన

రేకు: 10-2 సంపుటము: 10-56

ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా
బందెపసులకు మెడ పన్నించ నేలా        ॥పల్లవి॥
 
యినుమునఁ జేసిరా యెవ్వరిదేహమైనా
పొనిఁగి పోతేఁబోవు పోకుంటే మాను
పనివడి యిందుకుఁగా బాటువడ నేమిటికి
మొనసి దొసపంటికి యినుప కట్టేలా         ॥ఇంద॥
 
మంచి రాతఁ జేసిరా మనుజునిమే నేమి
నించి చెడితేఁ జెడు నిల్చితే నిల్చు
పొంచి పొంచి యిందుకుఁగా పొడిఁబడ నేఁటికి
పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా     ॥ఇంద॥
 
చేఁగమానఁ జేసిరా చెల్లఁబో నరుల నెల్లా
యీఁగి కుంగితేఁగుంగు హెచ్చితే హెచ్చు
నాఁగువార శ్రీవెంకటనాథుఁడు మన్నించఁగాను
దాఁగి జీలుగుబెండుకు తరమువెట్ట నేలా   ॥ఇంద॥

Details and Explanations:

పల్లవి:

ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా
బందెపసులకు మెడ పన్నించ నేలా    ॥పల్లవి॥ 

Telugu Phrase

Meaning

ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా

ప్రపంచములోని జనులను చూసి తెలుసుకోలేరా?

బందెపసులకు

ఇప్పటికే బంధించబడిన పశువులకు (మనుషులకు)

మెడ పన్నించ నేలా

పన్నించు = కట్టు, బంధించు
మెడను వంచి  ఇవ్వనేలా?

 

ప్రత్యక్ష భావము:

ఇంత మందిని చూశాకా కూడా అర్థం చేసుకోలేవా?

ఇప్పటికే బందెలదొడ్డి పశువుల్లాంటి మనుషులకు

నీ మెడను  వంచనేలా?


వ్యాఖ్యానం:

ఇక్కడ కవి ఒక స్పష్టంగా మనిషి అనుభవించే దుఃఖానికి నిజమైన ఉపశమనం మానవులివ్వలేరని చెబుతున్నారు. 

చిన్నతిరుమలాచార్యులు
కలల కోసం కలం పట్టలేదు.
కాలం అంటని —
కోటలు, కొండలు కూలినా నిలిచే
అజేయమైన కవిత్వాన్ని సృష్టించారు.
 

రెండు పాదాలే, కాని
బంధించే బంధాలు ప్రస్ఫుటం!
అవగాహనలేనిది మన జీవితం
చూసీ చూడనట్లు ఎలా ఉంటాం?
 
జాతి జాగృతికై పలుకే ఆయుధం,
దిగ్విజ్ఞానానికి దీపము!
చూసే చూపును మూసుకుంటామా?
గుడ్డి పశువులా బంధితుల మాటెందుకురా?
స్వేచ్ఛకు అడుగు ఎటు వైపురా? 

ఓ మానవుడా!
నీ తోడివారు ముందరిగినదీ చూచితివా?
వారెగిన చోటు తెలుసా? చిటికెలో మాయ — కోటి కలలా!
తెలిసి ఉండీ, ఏమి చేయగలవు? చూరును పట్టుకుని వేళ్ళాడగలవా?

అంతా మనలాంటివారే! మనకన్నా “ఎక్కువ తెలుసు” అన్నవారు —
బందెల దొడ్డిలో పశువులవలె గుంపులుగా గుమికూడుతున్నారు!
ఇందరిని చూచి చూచి... బేధించ తలచుతావా?
పట్టు పట్టగలదేముంది? మెడలే గాని, స్వేచ్ఛ కాదే!.


మొదటి చరణం: 

యినుమునఁ జేసిరా యెవ్వరిదేహమైనా
పొనిఁగి పోతేఁబోవు పోకుంటే మాను
పనివడి యిందుకుఁగా బాటువడ నేమిటికి
మొనసి దొసపంటికి యినుప కట్టేలా     ॥ఇంద॥ 

పదబంధం

అర్ధము

యినుమునఁ జేసిరా యెవ్వరిదేహమైనా 

ఎవ్వరి దేహము కూడా ఇనుముతో చేయబడలేదు (ఇక్కడ శాశ్వతంగా వుండిపోలేమని అర్ధము)

పొనిఁగి పోతేఁబోవు పోకుంటే మాను 

ఇది పోతే పోనీయని. వుంటే వుండనీ

పనివడి యిందుకుఁగా బాటువడ నేమిటికి 

పనిగట్టుకొని దీనికోసము పాటుబడటము ఎందుకు? (అవసరం లేదని అర్ధము)

మొనసి దొసపంటికి యినుప కట్టేలా 

మొనసి = శూరత్వమున​సాహసమున​;
సాహసము చేసి దొషమున్న పంటికి  యినుప కట్టు వేసినా ఏమి ప్రయోజనము? (లేదు)

 

ప్రత్యక్ష భావము:

మనుషులారా — ఎవరి దేహము
కాదు ఇనుము. లేదు శాశ్వతము.
ఇది పోతే పోనీ, వుంటే వుండనీ —
దేనికొరకు ఈ ఆరాటము?

అయితే,
అనిశ్చితమైన ఈ శరీరానికై
వెట్టి కూలీలా జీవితాంతం
పాటుపడటం ఎందుకు?

ఇనుప కట్టువేసినా — పుచ్చు పన్ను ఊడదా?
దోషభరితమైన మనస్సు, ఆంక్షలతో ఆగుతుందా?


వ్యాఖ్యానం:

పొనిఁగి పోతేఁబోవు పోకుంటే మాను
– సమత్వభావానికి ఒక నిశ్చలరూపము –

జీవితం నడిస్తే — నడవనీ,
ప్రాణం పోతే— పోనీ!
తూకంలో కొలిచే లాభనష్టాల లెక్క కాదు.
తెలిసినదానిపై నాట్యమాడే మానసిక వ్యాయామమూ కాదు.
ఇది...
మృత్యువు గుండెల్లోకి చొచ్చుకుపోయే ధైర్యం —
నియంత్రణ కాదు. సమర్పణలో లీనమవడం.

అది ఆకలితోను, ఆశయాలతోను అల్లుకున్నది కాదు. —
ఆత్మసమర్పణలోనే మౌనంగా వికసించేది.

విచారణలకు అది అందదు,

పాఠ్యాంశాల సరిహద్దుల్లోనూ ఉండదు.
అది వెలిసేది —
శూన్యంలో పరిపూర్ణతలాగా. 

ఆ అంతర్భాగపు శూన్యాన్ని
అంగీకరించే నిశ్చల విశ్వాసమే —
నమ్మకం.

అంత నమ్మకం ఉంటే —​
మిటమిటలాడని దీపంలా —
లోలోపల వెలుగుతుంది — నిరంతరం, నిశ్శేషంగా.

రెండవ​ చరణం:

మంచి రాతఁ జేసిరా మనుజునిమే నేమి
నించి చెడితేఁ జెడు నిల్చితే నిల్చు
పొంచి పొంచి యిందుకుఁగా పొడిఁబడ నేఁటికి
పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా ॥ఇంద॥ 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

మంచి రాతఁ జేసిరా మనుజునిమే నేమి

ఈ మానవులను మంచి రాయితో చేసారా? (ఎప్పటికీ వుండిపోతామా ఏమిటీ?)

నించి చెడితేఁ జెడు నిల్చితే నిల్చు

ఏదో ఒక కారణంతో చెడిపోవచ్చు లేదా నిలువ వచ్చు. (ఆ కారణమును తెలియలేమని సూచిస్తూ)

పొంచి పొంచి యిందుకుఁగా పొడిఁబడ నేఁటికి

అదేపనిగా, దీనికోసమెందుకు పాటుబడటం?

పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా

పంచ = గృహాదిపార్శ్వ ప్రదేశము, ఇంటి చుట్టూ వున్న ప్రదేశము
పంచనే వున్న నీటిబుగ్గ నీటిని రాతి భరిణలో దాచడమెందుకు?

 


 

ప్రత్యక్ష భావము

ఈ మనుషుల్ని మంచి రాతితో చేశారా?
ఎప్పటికీ ఉండేలా తయారు రాశారా?
ఏదో ఒక కారణంతో
వారు పడిపోవచ్చు, నిలువవచ్చు —
మన చేతిలో ఏముంది?

 

అయితే,
ఈ అస్థిరమైన శరీరాన్ని నమ్ముకుని
దీనికోసమే నిరంతరం పాటుపడటం ఎందుకు?
మానవులారా!
ఇంటి ఎదురుగా, చుట్టూతా కూడా నీటి బుగ్గ ఉన్నదే!
(మీరు చూడ లేదా?)
అయినా నీటిని యీ రాతి భరిణలో
నిల్వచేయాలనే తాపత్రయం ఎందుకు?

వ్యాఖ్యానం:

Part 1

పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా
(ఆధ్యాత్మిక కవితా రూపం -1)
 
ఇంటి చుట్టూ పారె బుగ్గనీరు,
పంచనే  దైవానుభూతి కాదంటిరా —
పట్టివుంచలేడు తటస్థము శరీరి,
ప్రయత్నము దానికి వైరి ​
రాతి గిన్నెలో నిలువదే పారు నీరు!
 
నించి చెడితేఁ జెడు, నిల్చితే నిల్చు —
ఏవిధమో తెలిసినదెవ్వరికి?
శరీరము వున్నా లేకపోయినా,
సంపర్కముంటే భగవంతునితో!
 
జనన మరణ రహస్యమిది 
సమత్వములో జ్ఞానికి కానరాదు
వ్యత్యాసం —
తూర్పులేదు, పడమరలేదు,
సత్యమంతయు ఒకటే వారికీ!

Part 2

పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా
(ఆధ్యాత్మిక కవితా రూపం -2) 

ఎక్కడో — సుదూరాన
దైవమూ, స్వర్గమూ.
కానీ ఓ మానవుడా,
నీవొక ఊహల సమాహారం —
భావాల గుళికల మిశ్రమం,
కూడని కూడికల కట్టడం,
భావాల సహవాసాల దోషం.

సమాలోచనల అడ్డదారుల్లో
భ్రాంతినే బలంగా నమ్ము బాటసారి

కలల వ్యవసాయం అడ్డదారి.
కల్పిత స్థితులను దాటి సాగు నిజం.
నీవు నిలిచినది ఒక మెట్టు కాదు —
కనిపించని ఒంటరి గట్టు.
ఆ ప్రవాహానికి ఆవల,
తనను తానే గమనించే గూఢచారి వలె.
 

కానీ ఆ గూఢచారి —
తననే తాను దూరంగా చూస్తూ
తనకు సత్యానికి మధ్య అగాధానికి భయపడి
తడబడి వ్యథకు లోనవుతున్న సంచారి.
అసత్యమును విడచు చేత​.
సాహసపు బాట.
 
తానే తాను మలుచుకున్నవి
మన  ఎంచుకున్న భావాలు —
నీరును పట్టే రాతి భరిణలే.
శిధిలమయే శరీరభవనంలో
నీటిని నిలుపదలచిన తాపత్రయం
అంతు లేని ఆరాటం అంతే
 
అది నీవు కావు
నీ ఇల్లు కాదు
గ్రహించు —
బంధం త్యజించు —

మిగిలేది ప్రవాహమే —
ఆగని జీవకాల ధార.
దానిలో నీవున్నావు,
కానీ నీవు అది కావు.
యత్నం విడిచినవాని సొంతం.
అది — చూపులకు అందని చూపు.

Part 3

పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా” —
చిన తిరుమలాచార్యులు

మానవుల “రేపటికి నిలువ ఉంచుదాం”
అనే ఆరాటము స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. 

జీవంతో ప్రవహించే దైవానుభూతిని
ఒక శాశ్వత రాతిబరణిలో నిలుపుదామనడం మూర్ఖత్వమే.
 

ఈ శరీరం కాని, మనస్సు కాని,
సృష్టించుకున్న అహం కాని —
ఏదీ దైవత్వాన్ని అనుభవించటానికి
పనికిరావు.
అవి ప్రవాహాన్ని ఆపే
నీటిని రాతిబరణిలో నిలిపే నిస్సార ప్రయత్నాలే.
 

ఇదే భావనను రెనే మాగ్రిట్ గారు
అస్పష్ట వ్యవసాయం” (The Cultivation of Ideas, 1928) అనే చిత్రంలో
మౌనంగానైనా మౌలికంగా చెప్పారు.

ఆ చిత్రంలో కనిపించే చెట్లు —
పైకి పచ్చదనంతో, జీవంతో కనిపించినా —
వాటికి ములాలు లేవు.
రాతితో చేసిన కృత్రిమ వేదిక మీద
అవి కేవలం నిలబెట్టబడ్డ వృక్షాల వలె.
 

చిన తిరుమలాచార్యుల రాతిబరణి”
మాగ్రిట్ చూపిన తప్పుడు వేదికతో సమంగా భావించవచ్చు.
ఇవే మన అసత్యపు ఆధారాలు.
మనిషి తన అనుభవాలను, తత్వాలను,
తాను అనుకునే నేను” అనే భావాన్ని
ఇలాంటి వేదికల మీదే నిర్మించుకుంటాడు.
 

మనిషి మాగ్రిట్ చిత్రంలోలా —
తానే సృష్టించుకున్న వేదిక మీద నిలబడి,
జీవన ప్రవాహాన్ని చూస్తూ —
తానూ ఆ ప్రవాహంలో భాగమే 
అన్న సత్యాన్ని మరిచి బతుకుతాడు. 

శరీరం ఒక పాత్ర కాదు.
ఆ ప్రవాహానికి ఇది అడ్డుకాదు.
దైవత్వం అనేది
భౌతికంగా, మనసులో నిలుపగలిగే వస్తువు కాదు.


మూడవ​ ​ చరణం:

చేఁగమానఁ జేసిరా చెల్లఁబో నరుల నెల్లా
యీఁగి కుంగితేఁగుంగు హెచ్చితే హెచ్చు
నాఁగువార శ్రీవెంకటనాథుఁడు మన్నించఁగాను
దాఁగి జీలుగుబెండుకు తరమువెట్ట నేలా        ॥ఇంద॥ 

Telugu Phrase

Meaning

చేఁగమానఁ జేసిరా చెల్లఁబో నరుల నెల్లా

చేఁగమానఁ జేసిరా= బలమైన చెక్కతో చేసారా? చెల్లఁబో =ఆక్షేపార్థము;
భలే చెప్పారే! మనుషులందరిని బలమైన చెక్కతో చేసారా? ఏమిటి?

యీఁగి కుంగితేఁగుంగు హెచ్చితే హెచ్చు

దానముగా వచ్చిన ఈ దేహము కుంగితేఁకుంగనీ, పెరిగితే పెరగనీ

నాఁగువార శ్రీవెంకటనాథుఁడు మన్నించఁగాను

వడ్డీకాసులవాడు శ్రీవెంకటనాథుఁడు మన్నించఁగాను

దాఁగి జీలుగుబెండుకు తరమువెట్ట నేలా

లోపలదాక్కొని వున్న జిల్లేడు పిప్పికి రాళ్లు అడ్డుకట్టుట దేనికంటా

 

 

ప్రత్యక్ష భావము:

ఓహో! ఇదెంత మాట!
మనుషులను బలమైన చెక్కతో తయారు చేశారా ఏంటి?
దానంగా లభించిన ఈ శరీరం
కుంగితే కుంగనీ, పెరిగితే పెరగనీ —
మన చేతిలో ఏమీ లేదు కదా!

వడ్డీకాసులు వసూలు చేసే
శ్రీవెంకటేశ్వరుడు మనలను క్షమిస్తుంటే —
లోపల దాచిన జిల్లేడు పిప్పికి
రాళ్లతో పైపైగా అడ్డుకట్ట వేసినంత మాత్రాన ప్రయోజనమేముంది?



వివరణాత్మక వ్యాఖ్యానం:

చేఁగమాను” —
ఇది స్థిరత్వానికి ప్రతీక.
మనుషుల శరీరం బలమైన చెక్కలా శాశ్వతం కాదు.
దీనిని దృఢంగా కట్టిపెట్టుకోవాలన్న ఆశయే మూర్ఖత్వం.
 
ఈఁగి” —
ఈ శరీరం మన సొంతం కాదు.
ఇది భగవంతుని ప్రసాదం — అనుభవానికి ఒక తాత్కాలిక సాధనం.
దీని నుంచి అధికంగా ఆశించడమే  భ్రమ.
 
నాఁగువార శ్రీవెంకటనాథుఁడు” —
ఇది భగవంతుని సమగ్రతను సూచిస్తుంది.
మన లోపాలు, తప్పులు, పుణ్యపాపాలు
అన్నిటినీ సంపూర్ణంగా గ్రహించి
 క్షమించే స్వభావమే ఆయన ధర్మం
 
జీలుగుబెండు” —
ఇది మనిషిలో దాగి ఉన్న
కలుషిత భావనలు, వికారాలు, స్వార్థబుద్ధి, అసత్యాల సూచన.
ఇవి పెట్టుడు నీయమాలవల్ల​,
తెచ్చిపెట్టుకున్న సంస్కారమువల్ల మాయము కావు.
 
తరమువెట్ట నేలా” —
బాహ్యంగా ఎంత రక్షణ కల్పించినా,
లోపంలో ఉన్న అశుద్ధి
తానుగా బయలుపడుతుంది.
అందుకే — దానిని అడ్డుకోవాలన్న ప్రయత్నమే అనవసరం.

సారాంశం:

ఈ కీర్తన శరీరవైఖరికి వ్యతిరేకంగా,
అంతఃజాగరణకే ప్రాధాన్యంనివ్వడం స్పష్టం చేస్తోంది.

శరీరాన్ని శాశ్వతమని భ్రమించి
దానికోసం పాటుపడటం
అనర్థకమైన అనుసరణ.

ముక్తి అనేది
శరీరములో కాక —
సాక్షిగా ఉండే ఆంతరిక జీవజ్ఞానంలోనె ఉంది.


ఉపసంహారము:
పల్లవి చరణములు చక్కగా అమరి ఒక విరిసిన పువ్వువలె ఈ కీర్తన భాసిస్తున్నది.
చిన్నతిరుమలాచార్యుల వారి అత్యద్భుతమైన అధ్యాత్మ సంకీర్తనగా చెప్పవచ్చును.

కీర్తన సారాంశం

ప్రపంచపు దారులలో 
మాయలో మునగవద్దు — 
కాలాన్ని వృథా చేసుకోవద్దు. 
 
ఈ శరీరం — గట్టిముక్క కాదు, 
గాలికి వంగే పలుచని కట్టె. 
ఇది నీ సొత్తు కాదు — దైవదత్తం, 
దానిని నిలిపేందుకు నీ కృషి మూర్ఖతమే. 
నీ చుట్టూ ప్రవహించే  ప్రాణధారను ​
ఈ రాతి బరణిలో నిలిపే ప్రయత్నం చేయకు — వృథాగా. 
 
లెక్కలు వేసే వెంకటేశుడు 
క్షమించువాడే — 
అతని దయకు అవధులే లేవు; 
అందుకే ఆత్మవంచనల అవసరమే లేదు. 

"జీలుగుబెండు" — 
లోపపు విత్తనం దాచినా, 
తానుగా బయటపడుతుంది — అడ్డుకోలేవు.  

సమత్వం అనేది తూకం కాదు — 
కట్టుబాట్ల మధ్య నిలిచే స్థిరత్వం కాదు, 
అపరిమితాన్ని ఆపళంగా అంగీకరించే శరణాగతి. 
 
పురాణ స్వరమవుతుంది కవి గొంతు — 
దయతో, దృఢతతో హెచ్చరిస్తుంది: 
అశాశ్వతంపై ఆశలు కట్టకూ, 
ఆపలేని ప్రవాహాన్ని అడ్డుకోకూ.

X-X-The END-X-X

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...