Tuesday, 10 March 2026

T-311 ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు

 తాళ్లపాక అన్నమాచార్యులు
311 ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు
For English version press here

ఉపోద్ఘాతము

సినిమా విరహగీతాలు చాలా కాలం గుర్తుండిపోతాయి. చాలామంది అవి తిరిగి తిరిగి వింటుంటారు కూడా. అవి మనసులో ఒక విధమైన బాధను, ఏదో కోల్పోయిన భావనను మిగిల్చినప్పటికీ, ఆ గీతాలలోని కొన్ని అంశాలు మనసులో ఎక్కడో ఒకచోట స్పృశిస్తాయి. అందుకే అవి కాలం గడిచినా మరువబడవు.

ఈ విషయాన్ని ఎంతో ముందుగానే గ్రహించిన అన్నమాచార్యులు తమ కీర్తనలలో శృంగారానికి — ముఖ్యంగా నాయిక విరహగీతాలకు — ప్రముఖ స్థానం ఇచ్చారు. ఆయన కీర్తనలలో ఎనభై శాతం వరకు శృంగార కీర్తనలే అన్నది సాధారణంగా చెప్పబడే విషయం. ఇక్కడే అన్నమాచార్యుల ప్రత్యేకత కనబడుతుంది. నాయిక యొక్క శృంగారము, విరహావస్థలను చిత్రిస్తూ, అదే సమయంలో సమాంతరంగా భక్తుని అంతరస్థితిని కూడా చూపిస్తారు. ఆ రెండు భావాలు ఒకదానిపై ఒకటి ఆవరించకుండా, రెండూ సమతుల్యంగా నిలబడే విధంగా కవిత్వాన్ని నిర్మిస్తారు. 

గమనించవలసిన ఇంకో  విషయం ఏమంటే — ఆధ్యాత్మిక కీర్తనలలో కనిపించే తీక్షణమైన పరిశీలనలు ఈ శృంగార కీర్తనలలో కూడా కనిపిస్తాయి.
 
ఉదాహరణకు ఈ కీర్తనలో “పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు” అని అన్నమాచార్యులు అంటారు. శృంగార భావంలో ఇది నాయికకు ప్రియుడి విరహంలో విశ్రాంతి గది కూడా సేదతీరే స్థలంగా అనిపించకపోవడాన్ని సూచిస్తుంది; ప్రియుని కోసం ప్రాణమే నిలువదు అనే భావం వస్తుంది.

అదే పాదం ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మరో అర్థాన్ని సూచిస్తుంది — భక్తుడు దేహముపై కలిగిన మమకారాన్ని సులభంగా విడిచిపెట్టలేడు. జీవితం మీదున్న ఆపేక్ష అతనిని బంధించి ఉంచుతుంది. ఈ విధంగా ఒకే పదబంధంలో శృంగారమూ, ఆధ్యాత్మికమూ అనే రెండు భావాలను అన్నమాచార్యులు సహజంగా మేళవిస్తారు.

శృంగార సంకీర్తన
రేకు: 76-3 సంపుటము: 5-267
ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు
యెచ్చట నెవ్వరులేరు యేఁటికే నాపేరు          ॥పల్లవి॥

మంచముపై నుండరాదు మలఁగుపైఁ బొద్దువోదు
నించిన వుయ్యైలలోనా నిద్దుర రాదు
అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి
యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే    ॥ముచ్చ॥

పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు
దివ్వెచూచి తాలిమైనఁ దిప్పఁగరాదు
దువ్వటపుఁ బయ్యదపైఁ దోఁగిన తట్టు పుణుఁగు
పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమిసేతునే         ॥ముచ్చ॥

చింతతో ధరించరాదు చెల్లఁ బో మేనైనఁ బోదు
ఇంతటఁ జెలులకైన యెఱుక లేదు
ఇంతలోనె వేంకటేశుఁడింతి మరుఁగుననుండి
యెంతసేసెఁ గలికి వీఁడేమని చెప్పుదునే          ॥ముచ్చ॥
Details and Explanations:

కీర్తన నిర్మాణం:
ఈ కీర్తనలో మూడు చరణాలు ఒకే భావాన్ని మూడు దశల్లో చూపుతాయి.
మొదటి చరణం అంతరంగిక అశాంతిని,
రెండవది: కాలగమనంతో పెరిగే అసహాయతను,
మూడవది: భరించలేని వేదన చివరికి దైవసన్నిధిలో కలిగే అంతర్ముఖ జ్ఞానము.


పల్లవి:         
ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు
యెచ్చట నెవ్వరులేరు యేఁటికే నాపేరు ॥పల్లవి॥
శృంగార భావము
తాత్విక / భక్తి భావము
ప్రియుడి కోసం ఎదురుచూస్తూ, అతని ప్రేమలో మునిగిపోయిన ఒక నాయిక ఇలా విలపిస్తుంది: తన మనసులోని ప్రేమను ముచ్చటగా చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. (ఎందుకంటే తాను ప్రేమిస్తున్నది దైవమును. అది విని చెలులు నవ్వుతారేమోనని బిడియం) ఒక ప్రక్క తన ప్రియుడిని  కలవాలి అన్న ఆకాంక్ష ఎంతో బలంగా, అధికంగా పెరిగిపోయింది.
భగవంతుని కోసం తపించే ఒక భక్తుని అంతరస్థితి: తనలో ఉప్పొంగుతున్న ఈ అంతర్గత దైవాకాంక్షను పంచుకునే వారు ఎవరూ లేరు. (హితులు"ఏమయ్యా దేవుడేమైనా దిగి వస్తాడా?" అని గేలిచేస్తారనే సంకోచం) దైవసన్నిధి కోసం కలిగిన తపన మరింత గాఢంగా మారింది.
తన పరిస్థితిని అర్థం చేసుకునే వారు ఎక్కడా లేరు. (ఎవరని చెప్ప గలదు?) అతని సన్నిధి లేకపోతే తనకు ఉనికే లేదనిపిస్తుంది.   యేఁటికే నాపేరు: ఆమెకు తన విభుని దూరము అనూహ్యము. అతడు లేని జీవితము అనవసరము అను భావనలో 'ఈ భూమి మీద తనపేరు వ్యర్దమని చెబుతోంది.
తనలో జరుగుతున్న ఈ అంతరంగిక పోరాటాన్ని చుట్టూ ఉన్నవారు గుర్తించరు. (గుర్తించినా అపహాస్యం చేస్తారు) నాకు నీవు తప్ప మరెవ్వరూ కనిపించరు. అయినప్పటికీ లోకంలో నాకో  పేరు, ఒక వ్యక్తిత్వంతో కనబడుతోంది. అదే నాకూ నీకూ మధ్య ఒక అడ్డా? 

యేఁటికే నాపేరు” — నువ్వు నేను ఒక్కటే అయినప్పుడు నీ సన్నిధిలో నేను ఇతరుడిగా ఎందుకు నిలవాలి? అదే ఈ విరహానికి కారణమా? దానిని ఎలా తొలగించాలో నాకు తెలియదు.

వివరణము:
శృంగార కవిత్వంలో ఈ పల్లవి ప్రియుడితో విరహంలో ఉన్న నాయిక యొక్క ఒంటరితనాన్ని వ్యక్తం చేస్తుంది. తన మనసులోని భావాలను పంచుకునే స్నేహితురాలు లేక, ఆమె ఎడబాటు మరింత లోతుగా పెరుగుతుంది.
 
భక్తి భావంలో ఇదే స్వరం దైవాన్ని కోసం తీవ్రంగా తపించే  భక్తుని స్థితిని సూచించవచ్చు. ఈ తపన అంతర్గతమైనది; సాధారణ ప్రపంచానికి అది సులభంగా అర్థమయ్యేది కాదు. అన్నమాచార్యులు తరచుగా ఈ రెండు స్థాయిలను — శృంగారమూ, ఆధ్యాత్మికమూ — సహజంగానే కలగలిపి చూపుతారు; ఏ ఒక్క భావాన్నీ బలవంతంగా నిర్దేశించకుండా, రెండింటినీ సహజంగా ప్రకాశిస్తాయి.

మొదటి చరణం:
మంచముపై నుండరాదు మలఁగుపైఁ బొద్దువోదు
నించిన వుయ్యైలలోనా నిద్దుర రాదు
అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి
యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే        ॥ముచ్చ॥
చరణ భావము: ఈ చరణంలో విరహం వల్ల కలిగే అంతరంగిక అశాంతిని అన్నమాచార్యులు చిత్రిస్తున్నారు. శరీరానికి లభించే సౌకర్యాలు — మంచం, పరుపు, ఊయల — ఇవేవీ మనసుకు విశ్రాంతిని ఇవ్వలేవు. ప్రియుని జ్ఞాపకం లేదా దైవస్మరణ మనస్సును పూర్తిగా ఆక్రమించినప్పుడు మనిషి శాంతి ఉండదు.

శృంగార భావము

తాత్విక / భక్తి భావము

ప్రియుడి విరహంతో ఉన్న నాయికకు ఎక్కడా శాంతి లేదు. మంచంపై పడుకున్నా విశ్రాంతి లేదు; మృదువైన పరుపుపైన ఉన్నా సుఖం కలగదు.

భక్తుని మనస్సులో దైవముపై ఉన్న తపన, ప్రేమ పొంగుకొస్తున్నాయి. సహజంగానే విశ్రాంతి లేదా నిద్ర లాంటివి దూరమవుతాయి..

మనము అనుభవించు నిద్రలో వెనుక మనస్సు పనిచేస్తూనే వుంటుంది. వాస్తవం చెప్పాలంటే అలసట, విసుగుదల, పరిశ్రమముల​ నుంచి ఉపశమనం పొందుతాము. మనము అనుభవించునది ఆట విడుపు మాత్రమే. కానీ ఆట కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సంపూర్ణ శాంతిని పొందము. ఇక్కడ, నాయిక, భక్తుల పరిస్థితి కూడా అదే.  సాల్వడోర్ డాలీ వేసిన నిద్ర (స్లీప్) (1937) ఇదే విషయము చెబుతుంది.


ఊయలలో కూర్చున్నా నిద్ర రావడం లేదు. ప్రియుడి జ్ఞాపకమే మనసును అలుముకుంది.
మనస్సు దైవస్మరణలో నిమగ్నమైతే విశ్రాంతి లేదా నిద్ర లాంటివి సహజంగా దూరమవుతాయి. అంతరంగం ఒకే తపనలో నిలుస్తుంది.

ఇక్కడ పేర్కొన్న ఊయల నాపై ప్రేమ ఉంది, నాపై ప్రేమ లేదేమోల మధ్య నిరంతరం ఊగిసలాడే సందిగ్ధ​ ప్రేమ.

అంతరిక్షపు ఊయలకు సంకేతం. ఒక వైపు వ్యక్తము  . ఇంకోవైపు అవ్యక్తముల మధ్య నిరంతరం ఊగిసలాడే జీవన స్థితి
అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి

ప్రియుడిని తలచుకుంటూ కన్నీళ్లు ఆగవు. రెప్పల వెంట నీళ్లు జారుతూనే ఉంటాయి.

 

అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి

తనకు దైవానికి మధ్యగల అంతరము పూడ్చలేనిది. దైవముతో కలవలేనన్న భావన భరించరానిది. ఇక కన్నీళ్లు ఆగవు కదా!

(ఇప్పుడు మాగ్రిట్ గారి "కోరుకున్న బందిఖానా" (ఎలెక్టివ్ అఫినిటీస్)ని చూడండి.


 తనకు విభునికి మధ్య కల పంజరపు ఊచలు, వానిని తెంచలేని తన అసమర్ధత ఆమెకు దుఃఖము పొంగివచ్చేలా చేస్తున్నాయి. అసలు సమస్య అసమర్ధత కాదు. తాను తెంచుకోలేననే భయం. ఆ పంజరం కల్పించు భద్రతా కావాలి. విభుడూ కావాలి. ఇదే మానవుని అసలు సమస్య​. విభుని మీద ఎదో ఒక మూల దాక్కొన్న అపనమ్మకం. అదే మానవుల దుఃఖమునకు మూల కారణం.

భక్తుని హృదయం దైవం పైనే వుంది. కానీ తనకు దైవానికి మధ్య చెప్పలేనంత దూరాన్ని అనుభవిస్తాడు. దైవమును చేరేదెలా అనే ఆరాటమే కానీ, సర్వసమర్ధుడగు దైవమునకు భక్తుని హృదయం తెలియదా! ఇక్కడే వుంది మర్మము. తానున్న స్థితిలో దైవంపై నమ్మకముంచి ఏమీ చేయక  వుండుట​. ఏమి చేసినా సంకల్పము లోనివే. అవి పని చేయుచున్నంత వరకు ముక్తి అసాధ్యము (BG6-2)

యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే ఇలాంటి స్థితిలో ఒక్క క్షణం కూడా నిలబడలేను. ఈ విరహాన్ని ఎలా భరించాలో తెలియదు.

యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే దైవసన్నిధి కోసం కలిగిన పై తపనలో చిక్కుకున్న మనస్సు నిలవదు. ఈ అంతర వేదనను భరించలేదు.


రెండవ​ చరణం:
పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు
దివ్వెచూచి తాలిమైనఁ దిప్పఁగరాదు
దువ్వటపుఁ బయ్యదపైఁ దోఁగిన తట్టు పుణుఁగు
పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమిసేతునే   ॥ముచ్చ॥
చరణ భావము: ఈ చరణంలో అన్నమాచార్యులు మరింత లోతైన మానసిక స్థితిని చూపుతారు. కాలం గడుస్తోంది, సంధ్య సమయం చేరుతోంది. అయినప్పటికీ మనిషి తనలోని మమకారాన్ని విడువలేడు. చివరికి దైవస్మరణ తగ్గిపోతే, మనస్సు మళ్లీ కోరికల బాణాలకు బలవుతుంది.
శృంగార భావము
తాత్విక / భక్తి భావము
"పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు"
పవ్వళించేటిల్లు = పడక గది;  (తాత్వికముగా) దేహము
ఇది నాయికకు ప్రియుడి విరహంలో విశ్రాంతి గది కూడా సేదతీరే స్థలంగా అనిపించకపోవడాన్ని సూచిస్తుంది; ప్రియుని కోసం ప్రాణమే నిలువదు అనే భావం వస్తుంది..
భక్తుడు దేహముపై కలిగిన మమకారాన్ని సులభంగా విడిచిపెట్టలేడు. జీవితం మీదున్న ఆపేక్ష అతనిని బంధించి ఉంచుతుంది.
"దివ్వెచూచి తాలిమైనఁ దిప్పఁగరాదు"
(దివ్వెచూచి= సూర్యుడు అస్తమించాడు. దీపాలు వెలిగించారు)
రాత్రి ఐపోయింది. అతడు  వస్తాడన్న ఆశా లేదు. ఇక ధైర్యం కూడా తెచ్చుకోలేదు .
సంధ్యా సమయం ఆసన్నమైంది. చరమ దశ కానవస్తోంది.
మనస్తత్వ పరిశీలన:మనిషి తన జీవితంలో ఒక దశలో కాలం గడుస్తున్నదని స్పష్టంగా గ్రహిస్తాడు. అయినప్పటికీ అతడు తన మమకారాలను విడిచిపెట్టలేడు. అన్నమాచార్యులు ఈ మానసిక విరోధాన్ని అత్యంత సూక్ష్మంగా సూచిస్తారు.
"దువ్వటపుఁ బయ్యదపైఁ దోఁగిన తట్టు పుణుఁగు"
దువ్వటపుఁ = శాలువా వంటి
అలంకారంగా మిగిలిన  ప్రియుడి జ్ఞాపకాల పుణుగు పరిమళం కూడా తొలగిపోతోంది.
హృదయంలో దైవస్మరణకు సంబంధించిన చిన్న గుర్తులన్నీ తొలగిపోతున్నాయ
"పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమిసేతునే"
పువ్వుటమ్ము - పుష్పబాణము
(ప్రియుడి జ్ఞాపకాలు పోగా) ఆమె ఇప్పుడు మన్మధుని ప్రేరేపణకు బాసటగా నిలిచింది.
(దైవస్మరణ పోగా) మన్మధుని పుష్ప బాణాలకు తనువు అనుకూలమై లోలోనికి చొచ్చుకొని పోతున్నాయి. 

 

మూడవ చరణం
చింతతో ధరించరాదు చెల్లఁ బో మేనైనఁ బోదు
ఇంతటఁ జెలులకైన యెఱుక లేదు
ఇంతలోనె వేంకటేశుఁడింతి మరుఁగుననుండి
యెంతసేసెఁ గలికి వీఁడేమని చెప్పుదునే              ॥ముచ్చ॥
చరణ భావము: ఈ చివరి చరణంలో విరహవేదన పరాకాష్టకు చేరుతుంది. నాయికకు ఇక ఈ స్థితిని భరించలేనట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో భక్తి దృష్టిలో, భక్తుని అంతరంగంలో జరిగే పరమానుభవం మాటల్లో చెప్పలేనిదిగా నిలుస్తుంది.
శృంగార భావము
తాత్విక / భక్తి భావము
చింతతో ధరించరాదు చెల్లఁ బో మేనైనఁ బోదు
విభుని ప్రేమతో లేడు లేడని చింతతో వున్నా కాలము తానెట్లు బోవునో అట్లే నడచును. జీవితము భారమై ఈ శరీరమైనా పోదేమీ అనిపిస్తుంది
భక్తునికి భగవంతుడు లేని చింత భారమై, భరించరానిదై దేహమైనా పోకూడదా అనిపించును.
శరీరము, దేహము లేక మానవునికి అస్తిత్వము ఉండదు. అన్నమాచార్యులు "కర్మము దేహికిఁ గాణాచి" = సహజమైన కర్మము దేహికిఁ చిరకాలవాసస్థానము = కర్మముతోనే దేహికిఁ మోక్షము కలుగు సంభవం అని అననే అన్నారు. కావున పైన కలిగిన భావము అసహజమని కవి సూచన​
ఇంతటఁ జెలులకైన యెఱుక లేదు
ఆమె చెలికత్తెలకైనా ఆ ఇంగితము లేకపోయె.
ఆ "కర్మము దేహికిఁ గాణాచి" అను జ్ఞానము అతడికి, అతడి పక్కవారికి తెలియదాయె.
ఇంతలోనె వేంకటేశుఁడింతి మరుఁగుననుండి
(ఇప్పటి దాకా విరహ వేదనను అనుభవించిన ఆమె ఎవరో కాదు. కవి అన్నమాచార్యులే. ఆయన ఇప్పుడు ఇలా అంటున్నారు.) ఎక్కడో రహస్య స్థానము నుండి వేంకటేశుఁడు ఆమెను అవరించుకొనె.
యెంతసేసెఁ గలికి వీఁడేమని చెప్పుదునే
తనలో ఏర్పడిన అచింత్యానందమును మాటలలో తెలుపలేక "వీఁడేమని చెప్పుదునే" అని అన్నారు.

 


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-311 ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు

  తాళ్లపాక అన్నమాచార్యులు 311 ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు For English version press here ఉపోద్ఘాతము సినిమా విరహగీతాలు చాలా కాలం గు...