Sunday 23 April 2023

T-163 ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో

 అన్నమాచార్యులు

163 ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో

 

for EnglishVersion press here

 

సారాంశం: ఏకీకరణ అనేది జీవితం యొక్క ప్రాథమిక న్యాయము. మనం దానిని ప్రతిఘటించినప్పుడు, విచ్ఛిన్నం అనేది మన లోపల మరియు వెలుపల సహజ ఫలితం. కాబట్టి మనం సమైక్యత  ద్వారా సామరస్యం అనే భావనకు వస్తాము. నార్మన్ కజిన్స్ (Norman Cousins) 

కీర్తన సారాంశం:

పల్లవి: పెక్కు తలుగులు (ముళ్ళు) గల నిడివి తాడు వంటి సంసారములో విధి తట్టుటచేత కఱకుగా మారిన నన్ను (నా మనస్సును) మన్నించి యెన్నఁడు కరుణించేవో? అంత వరకు యేమి ఏమిసేతు దైవమా! అన్వయార్ధము:  కటువుగావించబడిన మనసుతో ఏమిచేయుటయో యెరగని నాకు చేయగల కార్యము సెలవీయవయ్యా స్వామి.

చరణం 1: ఇంద్రియాలు నన్నుఁబట్టి కక్కరిబిక్కరిచేసి పగ సాధించుచున్నవి. శ్వాసకు శ్వాసకు మధ్యనున్న కాలమంత వ్యవధి కూడా ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి జన్మలు పుట్టుకొస్తూ నాకు తగులుకుంటున్నాయి

చరణం 2: ఎన్నాళ్లనాటి పాపమో తెలియదు కానీ తీవ్రమైన కోపమనే ఆవిరిచే యెడతెగకుండా ఉడుకుతూనే వున్నాను. ఎవరో సూటిగా శాపమిచ్చినట్లు నేను కూడబెట్టిన జ్ఞానమంతా చివరి క్షణంలో వీగిపోయి పాలిపోయినట్లైంది.

చరణం 3: ఈ నా స్వభావమేమో తెలియదు కానీ రావిమాని జిగురులా కర్మములలో హెచ్చరిక లేకుండానే అతుక్కుపోవునట్లు చేయుచున్నది. శ్రీవేంకటేశుఁడ నీవే గతి అనవలసె కానీ నీవు నా చిత్తములోపల నుండి కావఁవుగదా!

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు మానవుని వేధించు సమస్యలను బహు కొలది మాటలలో నిక్షిప్తము చేశారు. వారు ముఖ్యముగా వెలుపల​, లోపల అని మనము గిరి గీసుకున్న ప్రమాణములను ప్రశ్నించిరి. (వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా#1) అను మునుపటి  కీర్తనలో బాహ్యము అంతరంగంగా మారడం చూశాం. ఇప్పుడు ఈ కవితలో అంతరంగము జ్ఞాపకంగా, జడ పదార్థంగా రూపాంతరం చెందడాన్ని చూస్తాం. అన్నమాచార్యులు మనము యేర్పరచుకున్న కొలమానములను, మేరలను, యెల్లలను రద్దు చేస్తూ మన ప్రయత్నములను వ్యర్ధమనిరి. 

ఏది బాహ్యమో, యేది అంతరంగమో తెలియని మనము దైవమును అజ్ఞానముకొలది నిలదీయబోతాము. అన్నమయ్య మన అంతరంగమున నిలచి ఈ పాట వ్రాసినారేమో!

 

కీర్తన:
రాగిరేకు:  118-3 సంపుటము: 2-105
ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో
దామెన సంసారములోఁ దట్టువడీ మనసు ॥పల్లవి॥
 
యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి
చక్కుముక్కు సేసి యెంచి సాధించీని
గుక్కక యేమిసేసిన కొలయొకో వెంటవెంట
వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని ॥ఏమి॥
 
యెన్నాళ్లపాపమొకో యెడతెగక నాలోన
వున్నతపుఁ గోపమై వుమ్మగిలీని
తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాఁకినవిధమో
విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని ॥ఏమి॥
 
యే వేళ గుణమో యెడతెగని కర్మాలు
రావిమాని జిగురై వూరక యంటీని
శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తములోపల నుండి
కావఁగఁగదా నీవే గతి యనవలసె ॥ఏమి॥

Details and Explanations: 

ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో
దామెన సంసారములోఁ దట్టువడీ మనసు ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: దామెన = పెక్కు తలుగులు గల నిడివి తాడు; దట్టువడీ = తట్టుటచేత గట్టిపడినది (= కరకుగా మారినది). 

భావము: పెక్కు తలుగులు (ముళ్ళు) గల నిడివి తాడు వంటి సంసారములో విధి తట్టుటచేత కఱకుగా మారిన నన్ను (నా మనస్సును) మన్నించి యెన్నఁడు కరుణించేవో? అంత వరకు యేమి ఏమిసేతు దైవమా! 

వివరణము: దట్టువడీ మనసు = కఱకుగా మారిన మనస్సు అన్నది గమనింపదగ్గది. మార్దవములేని మనస్సుకు సద్గతిలేదు. కఱకుదనము ఎటుపడితే అటువంగని లక్షణమును సూచించుచున్నది. ఇంతకు మునుపు 'ప్రతిఘటన' లేని మనస్సు యొక్క ఆవశ్యకతను పలుమార్లు చర్చించుకొన్నాము. 

దామెన సంసారము: మనిషికి అనుభవముతో వచ్చు స్మృతులు జ్ఞాపకములు అతని ఎఱుకకు మితులు విధించి స్వేచ్ఛగా మనసు పారుటను అడ్దుకుంటుంన్నవని తెలిపిరి అనుకోవచ్చును. 

ముళ్ళబాట వంటి ఈ బ్రతుకు తోవలో గఱుకెక్కిన మనసుతో యేమి చేయుటయో పాలుపోక ఏమిసేతు దైవమా అని నిశ్చయింపలేని స్థితిని తెలుపుతూ యెన్నఁడు గరుణించేవో  అని అన్నమాచార్యులు మొరపెట్టుకొనుచున్నాడు.

అన్వయార్ధము:  కటువుగావించబడిన మనసుతో ఏమిచేయుటయో యెరగని నాకు చేయగల కార్యము సెలవీయవయ్యా స్వామి.

యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి
చక్కుముక్కు సేసి యెంచి సాధించీని
గుక్కక యేమిసేసిన కొలయొకో వెంటవెంట
వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని ॥ఏమి॥

ముఖ్య పదములకు అర్ధములు: చక్కుముక్కు సేసి = చిందరవందరచేయు, గుక్కక = శ్వాసకు శ్వాసకు మధ్యనున్న కాలమంత​ వ్యవధి కూడా ఇవ్వకుండా; వెక్కసపు = అధికము.

భావము: ఇంద్రియాలు నన్నుఁబట్టి కక్కరిబిక్కరిచేసి పగ సాధించుచున్నవి. శ్వాసకు శ్వాసకు మధ్యనున్న కాలమంత వ్యవధి కూడా ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి జన్మలు పుట్టుకొస్తూ నాకు తగులుకుంటున్నాయి. 

వివరణము: యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి / చక్కుముక్కు సేసి యెంచి సాధించీని"లా-ఫోలీ-ఎల్మేయర్" అనే శీర్షికతో ఉన్న రెనే మాగ్రిట్ గారి పెయింటింగ్ను విమర్శనాత్మకంగా చూడండి. ఈ చిత్ర పటము అధారముగా మొత్తము కీర్తనను వివరించ ప్రయత్నిస్తాను. శిధిలమైన బురుజుకు చెట్టుకున్నట్లు వేళ్ళు చూపి క్రొత్త విధముగా ఆలోచించునట్లు చేసిరి మాగ్రిట్ గారు. జీవముతో నున్న వేళ్ళు ఇటుకలుగా మారడం సహజము.



వేళ్ళు, వాటి నుంచి చెట్టు మొదలు అక్కడినుండే బెరడుతో సహా వేళ్ళు ఇటుకలుగానూ రూపాంతరము చెందడం గమనించవచ్చు. వేళ్ళ నుంచి పైకి పోతున్నకొలదీ ఇటుకల మధ్య  బీటులను కూడా చూడవచ్చు. అన్నింటి కంటే పైన వున్న ఇటుకలు పాతవన్నమాట​. వాటిలోనే పగుళ్ళు జాస్తి.

శిధిలమైన బురుజు అనుభవాన్ని జ్ఞాపకంగా మార్చడాన్ని సూచిస్తుంది. టవర్లో పగుళ్లు జ్ఞాపకశక్తిలోని అంతరాలను సూచిస్తాయి. అనేక మూలాలు (వేళ్ళు) మనం సమాచారాన్ని గ్రహించే అనేక వనరులను సూచిస్తాయి. ఒక విషయము ఫలానా దగ్గరనుంచి వచ్చినదని నిరూపించలేక పోతాము. ఒక్కొక్క ఇటుక పాక్షికమైన అనుభవాన్ని నిల్వచేస్తుందని సులభంగా తెలియవచ్చు. అనేక ఇటుకలు కలిపి ఒక అనుభవాన్ని జమచేసి చూపునని కూడా తెలియును.

విడివిడి ఇటుకలు కేవలము గిడ్డంగి లాగా పనిచేయునని కూడా భావించవచ్చును. పగుళ్ళు అనుభవము మరుగునపడి పోవుటకు దారితీయును.  ఇటుకలను కలిపివుంచిన పదార్ధము వాటిలోని సమాచారమును అనుసంధించుటకు ఉపయోగ పడును.  గుండ్రటి గోపురం అనుభవాలలో కొంత భాగం కనిపించని వైపు ఉందని సూచిస్తుంది.

ఇక క్రింది భాగములోని వేళ్ళు అన్ని దిక్కులలోను వ్యాపించి వుంటాయని మనకు తెలుసు. మానవుని లోపలకు చొచ్చుకొని వచ్చు అనేకానేక విషయములు ప్రత్యక్ష సంబంధము లేకనే (స్పృశించకనే) ప్రవేశించునని సూచించుతూ ఆ బురుజును గాలిలోపలికి ఎత్తి చూపించారు. క్రింద చూపిన వేళ్ళు మొత్తము శరీరమంతా వ్యాపించి యున్న అనేకానేక నాడులనుఇంద్రియములనుమనస్సునుమనుజుని ఆవరించుకొనియున్న వాతావరణమును సూచించును. చెట్లు భూగర్భములోని నీటిని చిటారు కొమ్మలవరకు చేర్చునట్లేఅందుకున్న అనుభవములన్నీ వేరులద్వారా ఉపరితలమునకు వచ్చి అటుపై ఇటుకలుగాను మారుతున్నవి.

దామెన సంసారములోఁ దట్టువడీ మనసు' తో అనుభవములు  ఙ్ఞాపకములుగా మారుటను సూచించిరి. అనుభవము అనునది జీవముతో కూడినదైతే, ఙ్ఞాపకములు జడ పదార్థమునకు ప్రతీక. అందుచేత, అన్నమాచార్యులు గట్టి పడిన జడముతో జీవమును తెలుపు అనువమును పోల్చరాదని చెప్పిరనుకో  వచ్చును.

మునుపటి కీర్తనలో బాహ్యం అంతరంగంగా మారడం చూశాం. ఇప్పుడు ఈ కవితలో అంతరంగం జ్ఞాపకంగా, జడ పదార్థంగా రూపాంతరం చెందడాన్ని గమనించవచ్చు. బాహ్యము అంతరంగము జడ పదార్థం ఒకదానిలోకొకటి రూపాంతరము చెందడము సులభముగా అంగీకరించ లేనిదైనప్పటికీ వాస్తవమును కాదనలేముగా. భగవద్గీతలోని 7-4వ శ్లోకము ఇక్కడ ఉదాహరింపతగ్గది భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ।। = అర్జునా, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమే.’ కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తి యే ఇన్ని వివిధ రకాల ఆకారములు, స్వరూపములు, మరియు పదార్థములుగా రూపాంతరం చెందింది".

ఈ విధంగా మనిషి రెండు విధాలుగానూ ప్రభావితమవుతాడు. అంతరంగాన్ని గానీ, బాహ్యాన్ని గానీ మనం కచ్చితంగా సత్యమని తీసుకోలేం. (= ఇంద్రియాలు నన్ను కక్కరిబిక్కరి సేసేనే.) అందువలన, అన్నమాచార్యులు ఎల్లప్పుడూ లోపలి మరియు బాహ్య రెండింటినీ విసర్జించమని చెప్పారు. (ఆలోచన, జ్ఞాపకశక్తి - బాహ్య ప్రతిస్పందనలే) బాహ్యం అనేది పర్యావరణం అంతర్గతంగా రూపాంతరం చెందుతుంది. వీటిని ఎలాగ వీడనాడ వలెనో కనుక్కోవడమే మనిషి ముందున్న సవాలు. దీనికి స్పష్టమైన సమాధానాలు లేవు.

ఇవి ఎదో ఒకసారి వచ్చి వుండిపోయేవికావు. నిరంతరము, ఇరవైనాలుగ్గంటలూ కొల్లలు కొల్లులుగా వచ్చి చెరుతున్న సమాచారముతో మనిషి తబ్బిబ్బౌతాడు (చక్కుముక్కు సేసి). మానవుడు బురుజును కాదు పెద్ద కోటనే తలపై నిర్మిస్తాడు. ఆ  కోటలో నివసిస్తూ అగపడు ప్రతీ విషయముపై, వ్యక్తులపై, సమాజముపై అభిప్రాయములు యేర్పరచుకుని అదే సత్యమని భావిస్తూ జీవిస్తాడు. 

యెన్నాళ్లపాపమొకో యెడతెగక నాలోన
వున్నతపుఁ గోపమై వుమ్మగిలీని
తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాఁకినవిధమో
విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని ॥ఏమి॥

ముఖ్య పదములకు అర్ధములు: వుమ్మగిలీని = ఉడుకు నట్లు చేసినది; విన్ననై = పాలిపోయిన, తెల్లబోయిన, వివర్ణమైన​; వీటిఁబోయఁ = వీడి పోయినది; 

భావము: ఎన్నాళ్లనాటి పాపమో తెలియదు కానీ తీవ్రమైన కోపమనే ఆవిరిచే యెడతెగకుండా ఉడుకుతూనే వున్నాను. ఎవరో సూటిగా శాపమిచ్చినట్లు నేను కూడబెట్టిన జ్ఞానమంతా చివరి క్షణంలో వీగిపోయి పాలిపోయినట్లైంది. 

వివరణము: విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని: జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి చదువులని, కళలని, ధనమని, బంధువులని యేర్పరచుకుంటాం.  ప్రకృతికి ఒక క్రమమమును కట్టబెట్టి ఆ రకముగా సంసిద్ధత వుండేటట్టు చూసుకుంటాం. కానీ వాస్తవం మన సన్నాహాలకు సంబంధము లేక వుంటుంది. అనూహ్యమైన దానిని వూహించబోవుట విజ్ఞతతో కూడిన పనియేనా? “కోరి నిద్రించ బరచు – కొన నుద్యోగింతు గాని / సారె లేతునో లేవనో – జాడ తెలియ నేను”#2 (=రేపు లేతునో లేవనో తెలియకనే రాగల వుదయముకై సన్నాహాలు ప్రారంభిస్తాను) అన్న కీర్తనను ఇక్కడ మననము చేసుకోవడము ఉచితమని భావిస్తున్నాను. 

యే వేళ గుణమో యెడతెగని కర్మాలు
రావిమాని జిగురై వూరక యంటీని
శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తములోపల నుండి
కావఁగఁగదా నీవే గతి యనవలసె ॥ఏమి॥

భావము: ఈ నా స్వభావమేమో తెలియదు కానీ రావిమాని జిగురులా కర్మములలో హెచ్చరిక లేకుండానే అతుక్కుపోవునట్లు చేయుచున్నది. శ్రీవేంకటేశుఁడ నీవే గతి అనవలసె కానీ నీవు నా చి త్తములోపల నుండి కావఁవుగదా

వివరణము: యే వేళ గుణమో యెడతెగని కర్మాలు / రావిమాని జిగురై వూరక యంటీని”: "లా-ఫోలీ-ఎల్మేయర్" అనే పెయింటింగ్’ను తిరిగి చూద్దాం. అన్నమాచార్యులు చెబుతున్నజ్ఞానమను బాటలో ఆకలిని పట్టించుకోక​, రక్షణలేమిని విస్మరిస్తూ, అనామకునిగా యాత్ర సాగించ వలసివచ్చును. సినిమా పాటలో లాగ "మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా ..నిరుపేదను వలచావెందుకే" అని పాడుకొంటూ నిజముగా జీవనము సాగించలేము. ఆకలి, రక్షణ, గుర్తింపులేనితనము (అనామకత​) అను మూడూ మనిషిని భయపెట్టి గూడులోకి తిరిగేటట్టు చేస్తాయి. ఇవే మనిషికి సవాళ్ళు విసిరేవి. ఇలాంటి చర్యలనే రావిమాని జిగురుగా అన్నమయ్య వర్ణించారు.  

మనిషికి నిజమైన ప్రతిబంధకము బాహ్యము నుంచి కాదు. తనను తాను సమగ్రముగా తెలియలేక పోవుటయే. తన గురించి పూర్తిగా, సూదిమోపినంత చోటు కూడా విడవకుండా తెలుసుకొనుటకు తననుండి తాను విడివడి చూడగలగాలి. ఇది సాధ్యమేనా?

ఇప్పటి 360 డిగ్రీల కోణము నుంచి చూపు యుక్తులు, ఉపాయములు కూడా యేదోవొక ప్రతిపాదన లేదా నమ్మకముపై అధారపడి తెలుపునవియే. అవి వూరటనిచ్చును కానీ సత్యమును తెలుపునా? సత్యమును తెలియుటకు మనిషి తననుండి తాను బయటకువచ్చి చూచుట ఒక్కటియే మార్గము.ఏ వుపాయములు యెక్కడి కెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము అని అన్నమాచార్యులన్న మాటలు గమనింపదగ్గవి.

మహానుభావులైన వారు, కారణజన్ములు తమ దేహముపై ఎఱుకను కోలుపోయి తమనుండి తాము విడివడి తమనితాము ఎఱుగుట జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్ర నుండి, ఇతిహాసముల నుండి తెలియవచ్చు. అట్లని, కాషాయ వస్త్రాలు కట్టుకొన్న ప్రతీవారు అట్టి ఎరుకకు అర్హులు కానేరరు. జాగ్రత్తగా గమనించిన కాషాయ వస్త్రాలు కూడా అనుకరణకు ప్రతీకలు కావున వాటిధారణ ఆత్మ తప్తినిచ్చిననూ అగత్యమైనది కాదు. మానవ యత్నమున యిది సాధ్యముకాదని అన్నమాచార్యులు దైవముపై అచంచలమైన భక్తిని ప్రతిపాదించిరి.

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన” (భగవద్గీత 2-41) భావము:  వివేకవంతమైన మార్గమొక్కటియే కలదు. (తక్కినవన్నీ అవివేకములు). ఈ విధంగా, అన్నమాచార్యులు మనం నిర్ణయించుకున్న ఆ ఒక్క యత్నమే మనసున నుండవలెననిరి.

References and Recommendations for further reading:

 

-x-x-x-

Sunday 16 April 2023

T-162 వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా

 

అన్నమాచార్యులు

162 వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా

for EnglishVersion press here

 

సారాంశం: "నీవు విడువక పట్టియుంచిన వాటి నుండి కలుగు స్వేచ్ఛ మాత్రమే స్వేచ్ఛ"  - జిడ్డు కృష్ణమూర్తి ​

కీర్తన సారాంశం:

పల్లవి: మోక్షమునకు అవకాశము పదేపదే దొరకదు.  యాంత్రికముగా వేదాంతశ్రవణము  చేసీ ప్రయోజనం ఉండదు. అన్వయార్ధము: యీ ప్రపంచంలోకి ప్రవేశించుటకు నీకు మరొక అవకాశం లభించదని భావిస్తూ ఆ ముక్తికి మార్గమును వెతుకుము. 

చరణం 1: మానవుల మధ్య నిజమైన తారతమ్యములు లేవని గ్రహించినవానికి  ఒకరిని గురువుగా, ఇతరులను శిష్యులుగా గుర్తించడం సాధ్యముకాదు. సాధకునికి తన ఆత్మ తాను ఒకటే అనే ప్రత్యక్ష  అవగాహన ఉంటే ప్రార్థనలు చేయాల్సిన అవసర మేమి? 

చరణం 2: సహజ జీవన క్రమము మిథ్యయని గ్రహిస్తే బహుయాగాది కర్మలు చేయనవసరం లేదు.  జననాలు మరణాలు జ్ఞాపకాలపొరలలో సూచికలు మాత్రమే అని అర్థం చేసుకుంటే నిర్దేశిత విహితాచారాలు చేయాల్సిన అవసరం లేదు. 

చరణం 3: కనబడని ఘటన బ్రహ్మమును స్తుతిస్తూ కీర్తనలు పాడ నవసరం లేదు. అయితే వేంకటేశ్వరుని సేవలో నిమగ్నం కానివారు, అర్థరహితంగా  రాక్షస బాటలో పయనిస్తున్నారు.

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అత్యంత నారికేళపాకముగా వర్ణించతగిన ఈ కీర్తనలో అన్నమాచార్యుల ఆంతర్యము తెలియుట దాదాపు అసాధ్యమే. సాంప్రదాయికముగా అధిక విలువలను అపాదిస్తున్న అనేక విషయములను తారుమారుజేస్తూ  వ్రాసిన కీర్తన కొంత అసౌకర్యాన్ని రేకెత్తిస్తుంది.  ఆచార్యులు పైనపైన చూపిన తెరలు అను  తిరుగుబాటు ధోరణుల మరుగున  గొప్ప అంతర్దృష్టులను చాకచక్యముగా నిక్షిప్తము చేసిరి. 

సమాజము యేర్పరచుకున్న ప్రమాణములును ప్రశ్నిస్తూ సాగే కీర్తనలో దైవముపై  అచంచలమైన భక్తికి మానవులు తమకు తామే విధించుకున్న హద్దులు,  పద్ధతులు, ప్రార్థనలు, వాటి భాషలు, రూపాలు, ఆకృతులు కొలమానములు కావని అన్నారు. ఎటువంటి అధారములేని  పరంపరాగతముగా వస్తున్న నీయమములను చేదిస్తూ భక్తియను వ్యవసాయము చేయుటయే మానవుని కర్తవ్యమని, మనసునకు తోచునట్లు చేయుట రాక్షసమనీ ప్రకటించిరి. 

దైవమును ఇదమిద్ధముగా తెలియలేమని అన్నమాచార్యులు అనేకమార్లు ప్రకటించి యుండిరి. అటువంటి విషయాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం భ్రమలో భాగము కాదా? యిటు పురుషసూక్తాదు లివి మరేల వంటి వాక్యములను ఆ దృష్టికోణం నుండి చూడాలి కాని పొగరుగా దైవనిందకు పాల్పడు నాస్తికుని ప్రేలాపనగా చూడరాదు. 

ఈ విధమైన కీర్తనలను ప్రస్తుత సమాజంలో హిందూ వ్యతిరేకము అను ముద్ర వేయవచ్చు. అన్నమాచార్యుల కాలంలో దీన్ని ఇంకెంత  దైవ ద్రోహంగా చూసేవారో మనం చర్చించనవసరం లేదు. ఇలాంటి కీర్తనను ప్రచురించడం ఆయన నిర్భయతకు నిదర్శనం. ​

 

కీర్తన:

రాగిరేకు:  120-6 సంపుటము: 2-120

వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా
వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా ॥పల్లవి॥
 
అరయ జీవులకెల్లా నభేదమైతే
గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము
సొరిది నాతుమలోన సోహంభావనయైతే
సరి మునుల దేవపూజలు చెల్లవు ॥వాద॥
 
సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే
బహుయాగాది కర్మాల పస లేదు
మహిలోని జననాలు మరణాలు మాయమైతే
విహితాచారాలు సేయ విధే లేదు ॥వాద॥
 
ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప
యిటు పురుషసూక్తాదు లివి మరేల
అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే
సటలాడుకొనేడి రాక్షసమత మవును ॥వాద॥

Details and Explanations: 

వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా
వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: సారెసారె = మాటిమాటికీ. 

భావము: మోక్షమునకు అవకాశము పదేపదే దొరకదు.  యాంత్రికముగా వేదాంతశ్రవణము  చేసీ ప్రయోజనం ఉండదు. 

వివరణము: ఈ కీర్తనను అన్నమాచార్యులు నిర్మొహమాటంగా నాస్తికత్వపు టంచులను తాకుతూ రచించిరి. ఏమైనప్పటికీ ఒక యోగి మనసును తెలిసిన విషయ జ్ఞానమునుండి ఎటుల అప్రమత్తముగా వుండవలెనో  తెలియపరచుటకు ఈ  కీర్తనను (బ్లాగులో) చేర్చడం జరిగింది. 

వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటాఅనునవి మానవునికి మళ్లీ మళ్లీ ముక్తిని పొందు అవకాశము రాకపోవచ్చునని సూచిస్తున్నాయి. 

విశ్వవ్యాప్తంగా సంఘటిత సమాజాన్ని నిర్వహించడంలో అనుసరణ కిచ్చిన ప్రాముఖ్యతను, “స్వర్గమును మానవులు అనుగుణంగా వర్తించుటకు ఎరగాను, “వ్యతిరేకించువారికి నరకమును శిక్షగాను చూపుటలో గమనించవచ్చు. మన వ్యక్తిగత నమ్మకాలతో సంబంధం లేకుండా, మత గ్రంథాలను (పురాణ లేదా వేదాంత విషయములు) చెవిని చేరునట్లుగాను, మరియు  మనల్ని సామాజిక ప్రార్థనలలో పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తారు.  ఇలా వాటితో మనకు కొంత పరిజ్ఞానము కలిగి,   మనకు తెలిసినవి అవుతాయి. 

ఈ రకముగా దైనందిన జీవితంలో వద్దనుకున్నా అలా వాటితో మనకు పరిచయము, కొంత ప్రవేశమును కల్పిస్తారు. అలవాటు పడిన విషయములు   మనకు భద్రతను  మరియు ఓదార్పును ఇచ్చినట్లు అనిపింప చేస్తాయి. అప్రయత్నంగా అలవడిన (లేదా స్థిరపడిన) సంప్రదాయాలను ప్రశ్నించకనే అనుసరించడం ద్వారా వచ్చే భద్రత మరియు స్థిరత్వానికి విలువ ఇస్తాము. 

కానీ 'పరము' అను పదము  ఇహ లోకముతో ఎటువంటి సంబంధము లేని దానిని సూచించును. అనగా అది మన మస్తిష్కములో కదలాడు దేనితోను ముడిపడి వుండదు. అటువంటి దానిని అచ్చు వేసిన పుస్తకముల నుండి, కేవలము పెదవులు కదుపుటచేతనూ పొందాలను కోవడం ఉచితమేనా?

'వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా' అని అన్నమాచార్యులు యథాలాపంగా వినుటను విమర్శించిరి. మెట్లు ఎక్కినట్లు యాంత్రికంగా వేదాంతశ్రవణము చేసి పరమును చేరలేమనిరి. ఈ విధంగా మనము చేబట్టు అనేకానేక కార్యములపై పునరాలోచన అవసరమని చెప్పక చెప్పిరి. 

భగవద్గీత 2-41వ శ్లోకంలో యోగి మనస్సు  అనుసరించ వలసిన ఏకాగ్రత వర్ణించబడింది   “వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన భావము:  ఒక్కటే ఫలవంతమైన మార్గము కలదు. (తక్కినవన్నీ అప్రయోజనములు). ఈ విధంగా, అన్నమాచార్యులు మనం నిశ్చయించుకున్న ఆ ఒక్క యత్నముపై మాత్రము మనసు నిలిపి వుంచవలెననిరి.

అన్వయార్ధము: యీ ప్రపంచంలోకి ప్రవేశించుటకు నీకు మరొక అవకాశం లభించదని భావిస్తూ ఆ ముక్తికి మార్గమును వెతుకుము.

అరయ జీవులకెల్లా నభేదమైతే
గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము
సొరిది నాతుమలోన సోహంభావనయైతే
సరి మునుల దేవపూజలు చెల్లవు ॥వాద॥

ముఖ్య పదములకు అర్ధములు: సోహంభావనయైతే = ఆత్మ నేనే అన్న భావన కలిగితే; సొరిది = క్రమము.

భావము: మానవుల మధ్య నిజమైన తారతమ్యములు లేవని గ్రహించినవానికి  ఒకరిని గురువుగా, ఇతరులను శిష్యులుగా గుర్తించడం సాధ్యముకాదు. సాధకునికి తన ఆత్మ తాను ఒకటే అనే ప్రత్యక్ష  అవగాహన ఉంటే ప్రార్థనలు చేయాల్సిన అవసర మేమి?

 

వివరణము: అన్నమాచార్యులు భగవద్గీతలోని 6-5 మరియు 6-6 శ్లోకాలను సూచించుచూ, ఈ ధ్యానమను ప్రయాణము కేవలం ఒకరి స్వంత నిశ్చయాత్మతపై ఆధారపడి ఉంటుంది, పరుల ఆదేశాలపైన కాదు. ఉద్ధరేదాత్మనాత్మానం (= నీ మనస్సు యొక్క శక్తి ద్వారా నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి). "బంధురాత్మా...వర్తేతాత్మైవ శత్రువత్" (=ఆత్మను తెలియు మార్గమున నీవెంత తటస్తముగా నుందువో దానిని బట్టి నీకు నీవే మిత్రుడవు లేదా శత్రువు కావచ్చును) అనిరి. గీత అంత స్పష్టంగా ఉంటే, యోగ మార్గమున ఒకరిని  గురువుగాను మరియు మరొకరిని శిష్యుడిగా స్వీకరించుటకు అవకాశమే లేదు. 

కానీ సంప్రదాయముగా వస్తున్న యీ గురుశిష్య భావనను  మనస్సున విడనాడడం సులభం కాదు. ఇదే కారణంగా జిడ్డు కృష్ణమూర్తి తనకు బలవంతముగా కట్ట బోయిన జగద్గురువు కిరీటమును స్వీకరించడానికి నిరాకరించాడు. అతను ఎవరినీ తన శిష్యులుగానూ అంగీకరించ లేదు.  ప్రోత్సహించలేదు. మానవునికి తెలిసినదానిని ముఖ్యంగా తాను నమ్మిన దానిని, వదలివైచుట పెను సవాలు. కనిపించని నిప్పులా కాలుతూను వుండే ఆరని మంట. మనకు అలవాటైన  దృక్కోణంతో కొత్త పుంతలు త్రొక్కడం అసాధ్యం.

నాతుమలోన సోహంభావనయైతే’: ఒక మనిషి తాను నేర్చిన దానిలో పవిత్రమైనది ఏమీ లేదని మరియు నేర్చుట కంటే అవిద్యను వీడుట ఆవశ్యకమని గ్రహించినప్పుడు, ప్రార్థనలు చేయడం వల్ల ప్రయోజనం లేదని యోగికి అంతరంగమున అవగతమగును. పై ప్రకటనను రెనే మాగ్రిట్‌చే "రెడ్ మోడల్" (= రక్తమాంస పరివర్తనము) అనే పెయింటింగ్ సహాయం తీసుకొని వివరిస్తాను. దిగువ ఇచ్చిన చిత్రాన్ని లోతుగా పరిశీలించండి. 



పాదాలు మరియు బూట్ల మధ్య ఉన్న మామూలు  అనుబంధం నుండి అసాధారణ సంభావ్యతకు తెర ఎత్తుతాడు మాగ్రిట్.    పాదాలు/బూటు, మానవుడు/మానవేతర, లోపల/బయట. మానవ పాదాలను తోలుతో కలిపి ఒక కొత్త వస్తువును రూపొందించడం అనేది హైబ్రిడైజేషన్ (సంకీర్ణము= సహజము కానిదాని) యొక్క వ్యక్తీకరణ పై చిత్రపటము సూచించును. 

బాహ్యమున ఉన్న చర్మముతో చేసిన బూట్లు పాదములలోకి చొచ్చుకువచ్చి అంతర్భాగమైపోవడం - విశేషముగా బొమ్మచుట్టూ చూపిన వొళ్ళు విరుచుకుంటున్న యువతి (విశృంఖలత్వము), సిగరెట్ పీకలు (చెడు అలవాట్లు), చిల్లర నాణాలు (ధనాశ) మనలను - అనుజ్ఞ లేకయే వచ్చు చేరు సంగతులకు ప్రతీకలనుకోవచ్చును.  

బాహ్యముగా నున్నది అనూహ్యంగా  అంతరంగముగా మారుటను సూచిస్తుంది. వెలి నుండి అప్రయత్నంగానో, ప్రభావితులమై తెలియకయే అనుకరించియో, కొంతవరకు అలవాటు/కంఫర్ట్ జోన్ కారణంగానో, అనేక భావాలు, ఊహలు మరియు ఆలోచనలను మనస్సు సూదంటు రాయిలా గ్రహించును. ఏది ఏమైనప్పటికీ, వాస్తవంగా "బయట" అనేది "లోపల"గా మారుతుందనేది నిర్ద్వందము. 

మనస్సు దేనిని పట్టి వుంచునో దాని కింద రూపాంతరము చెందుటను సూచించిరి. (ఎరుపు రంగు నీటితో నింపిన గాజు పాత్ర ఎరుపుగాను, పాలతో నింపిన తెల్లగాను కానవచ్చినట్లు) నింపిన దాని గుణములనే పారదర్శకమైన​ పాత్రకు ఆపాదించ బడును. ఇప్పుడు చిత్రానికి మరియు అన్నమాచార్యుల "వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు"#1 అను కీర్తనతో గల సంబంధాన్ని పరిశీలించండి 

పెయింటింగ్ మరియు ఉదహరించబడిన కీర్తన కలిపి, మనము బాహ్య భాగాన్ని లోపలికి విస్తరిస్తున్నామని అర్థం చేసుకుంటాము. వీటిని పూర్తిగా మరచిపోతే (లేదా వదిలేస్తే) తప్ప, మనము సందేహాలతో విసిగిపోతూనే ఉంటాము. దీనిని బట్టి నాతుమలోన సోహంభావనయైతే సరి మునుల దేవపూజలు చెల్లవుఅనునది నమ్మలేని నిజము. జిడ్డు కృష్ణమూర్తి గారు,  తన జీవితములో పూజలు చేసిన దాఖలాలు లేవు. బుద్ధుడు, విజ్ఞులైన అనేక మంది పాశ్చాత్యులు ఈ కోవకు చెందినవారే.

 

భగవద్గీత శ్లోకము 3-18 దాదాపు ఇదే తలపును తేటతెల్లము చేయుచున్నది. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః (= భావము: నిజమైన యోగి దైనందిక​ విధివిధానములలో జోక్యం చేసుకొనక, పూర్తిగా స్వతంత్రంగాను, ఇహము నందలి దేనిని ఆశ్రయించుకొని వుండడు).  కావున ఆ తలమున సంచరించని వాడు అస్సలు యోగియే కాడు. 

సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే
బహుయాగాది కర్మాల పస లేదు
మహిలోని జననాలు మరణాలు మాయమైతే
విహితాచారాలు సేయ విధే లేదు ॥వాద॥

 

ముఖ్య పదములకు అర్ధములు: సహజలీలావిభూతి = సహజ జీవన క్రమము

భావము: సహజ జీవన క్రమము మిథ్యయని గ్రహిస్తే బహుయాగాది కర్మలు చేయనవసరం లేదు.  జననాలు మరణాలు జ్ఞాపకాలపొరలలో సూచికలు మాత్రమే అని అర్థం చేసుకుంటే నిర్దేశిత విహితాచారాలు చేయాల్సిన అవసరం లేదు.   

వివరణము: మహిలోని జననాలు మరణాలు మాయమైతే’ = అన్నమాచార్యులు జనన మరణాలను   చాలాసార్లు ప్రస్తావించినా వాటిలో చెప్పుకోదగినది. పొలసి మతిమరఁగుననె పుట్టుటలు ఏఁ బోవుటలు#2(= పుట్టుక, మరణం అనేవి ఆలోచనల పొరలలో జ్ఞాపకాలుగా మిగిలి ఉంటాయి). ఈ కవితలో కూడా దానినే పొడిగిస్తున్నారు. జ్ఞాని తన యోగత్వపు మానసిక స్థితికి చేరుకున్నప్పుడు, తనకు మరియు ప్రపంచానికి మధ్య అంతరము లేదని గ్రహిస్తాడు; అట్టివారు ప్రపంచ నందు సంచరించు జీవవాహినిలో అంతర్భాగమౌతారు. అలాంటి వ్యక్తికి జననం మరియు మరణం రెండూ సమానమే. అప్పుడు జీవనం కొనసాగుతుంది; 'నేను' అనునది విడనాడడం జరుగుతుంది.


సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే’ = "సహజ జీవన క్రమము మిథ్య యైతే": భగవద్గీత శ్లోకము 4-23 గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతస: | యజ్ఞయాచరత: కర్మ సమగ్రం ప్రవిలీయతే భావము: “బంధాల నుండి విముక్తి పొందిన వ్యక్తులు స్వచ్ఛమైన జ్ఞానంతో తమ పనులన్నింటినీ భక్తితో నిర్వహిస్తారు. ఇది వారి కర్మల యొక్క అన్ని పరిణామాల నుండి వారికి విముక్తిని కలిగిస్తుందిఅని చెబుతున్నది. భౌతికంగా సహజమైనది ఏమిటో మనకు తెలియనప్పుడు, వరుసలేక తబ్బిబ్బు చేయు విషయములతో వ్యస్తుడగు మానవునికి  "సహజ జీవన క్రమాన్ని" అర్థం చేసుకునే ప్రశ్నే ఉండదు. "రెడ్ మోడల్" అనే పెయింటింగ్‌ని తిరిగి చూద్దాం. 

ఈ చిత్రము మనకు తెలియకుండానే బాహ్య సమాచారాన్ని మనలో అంతర్లీనంగా సమీకరించడము - సహజమో కాదో గుర్తించే సామర్థ్యం లేకపోవటానికి సూచన​. కాబట్టి  ఏమి జరుగుతోందో తెలియక కొట్టుమిట్టాడుతున్నామనుట వాస్తవము. అందుకే ఈ నమ్మకాల, జ్ఞాపకాల యొక్క నిరాధారమైన స్వభావాన్ని మనం గుర్తించి, వాటిని తీవ్రంగా తిరస్కరించినప్పుడు, విష సర్పాన్ని వదలివైచినట్లు వదల గలిగితే జీవితంలో బహుయాగాది కర్మలు, విహితాచారాలు చేయనవసరం వుండదు. 

ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప
యిటు పురుషసూక్తాదు లివి మరేల
అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే
సటలాడుకొనేడి రాక్షసమత మవును ॥వాద॥

ముఖ్య పదములకు అర్ధములు: సటలాడు = మాయమాటలు మాట్లాడు, వ్యర్థము గావించు.

భావము: కనబడని ఘటన బ్రహ్మమును స్తుతిస్తూ కీర్తనలు పాడ నవసరం లేదు. అయితే వేంకటేశ్వరుని సేవలో నిమగ్నం కానివారు, అర్థరహితంగా  రాక్షస బాటలో పయనిస్తున్నారు.

వివరణము: పరమాత్మను స్తుతించే స్తోత్రాలు మరియు అలాంటి అనేక విషయాలు మన మనస్సు యొక్క భావనలు మాత్రమే. 1928-29 సంవత్సరాలలో రెనే మాగ్రిట్ గీసిన​ "ది ప్యాలెస్ ఆఫ్ కర్టెన్స్ III (తెరల మందిరము-3)" అనే పెయింటింగ్ ద్వారా దానిని వివరిస్తాను. మీరు చూస్తున్నట్లుగా, మాగ్రిట్ రెండు దాదాపు ఒకేలాంటి ఫ్రేమ్‌లను పక్కపక్కనే చూపించారు.​ ఒకదానిలో నీలి ఆకాశం చిత్రం ఉంది. మరొకటి ఫ్రెంచ్ పదం "సీల్" అంటే "ఆకాశం" అని అర్ధం. 



పదం మరియు చిత్రం వాటి అర్థంలో పరస్పరం మార్చుకోగలవని, కానీ వాటి అమలులో భిన్నంగా ఉన్నాయని మాగ్రిట్ ఇక్కడ మనకు చూపుతున్నారు. అయినప్పటికీ, వాటి అమలులో మనం పరస్పరం మార్చుకోగలిగిన ప్రాముఖ్యత కలిగిన సోపానక్రమాన్ని కనుగొంటాము. వాస్తవానికి, ఆకాశపు పటమును చూచి  లేదా ముద్రిత అక్షరములు "సీల్"  చదివి  ఆకాశమని భావించవచ్చు. కుడి వైపున ఉన్న ఫ్రేమ్ మనకు విషయానికి ఏకపక్ష అనుబంధాన్ని ఇస్తుంది: ఒక పదం - "ఆకాశం" అనే పదం గురించి ఆలోచించినప్పుడు మీ మనస్సు తక్షణమే అది ఎలా ఉంటుందో దాని చిత్రాన్ని రూపొందిస్తుంది. చతురత అంతా కలిపి ఈ చిత్రాన్ని తయారు చేసారు మాగ్రిట్. 

ఆ ప్రక్రియ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. జీవులు ఆకాశాన్ని గ్రహించాల్సిన ఏకైక ప్రక్రియ ద్వారా గ్రహించబడిన ఏకపక్ష కమ్యూనికేషన్ (ఇక్కడ ఫ్రెంచ్ భాష) వ్యవస్థలోని ఒక విభాగం మీ మెదడు లోపల మీరు మాత్రమే చూడగలిగే ఒక చిత్రాన్ని మాయాజాలం చేయగల అపారమైన శక్తిని కలిగి ఉంటుంది - మీ ఆకాశం. దీనితో పోలిస్తే ఎడమవైపు చిత్రము వాస్తవానికి ఆకాశమునకు ప్రతి రూపమైననూ ప్రతీరోజు చూచు దానికంటే ఏమాత్రము భిన్నముగా లేకపోవుటచే వెలవెల పోవుచున్నది. 

ఈ విధంగా, పైన ఇవ్వబడిన తార్కికంతో మనకు, భగవంతుడు (ఆకాశం చిత్రం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు), గ్రంధాలు, శ్లోకాలు ('సీల్' = 'ఆకాశం' అనే పదం ద్వారా సూచించ బడ్డాయి).  సర్వవ్యాపి అయిన దేవుని కంటే ఆయనపై మనమేర్పరచుకున్న భావనలు, ప్రార్ధనలు కేవలము (symbolic) సూచిత మాత్రములైననూ మనలను ఎక్కువ ప్రభావితులను చేయును. (with inputs from website https://slang-king.tumblr.com/post/736401642/the-palace-of-curtains-iii) 

ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప యిటు పురుషసూక్తాదు లివి మరేల = అంటే ఈ లోకాన్ని ఘటియింపచేయు బ్రహ్మము ఆకారములేనిదైతే, అగపడనిదైతే, ఆ విరాట్పురుషుని వేదసూక్తములతో స్తుతించి,  పఠించీ ప్రయోజనమేమి? 

విశ్వాసంతో సంబంధం లేకుండా ఒక కవిత్వమునో, ఒక శ్లోకమునో ఆరాధనా సాధనంగా మనము  అర్థం చేసుకున్నప్పటి, అవి మనకు పూర్తి అవగాహనలేని విషయములను ఎట్లు సూచించును? దానికి ఆధారమేమి? అన్నమాచార్యుల ప్రకటనలను ఆ కోణం నుంచి చూడాలి తప్ప, దైవభక్తి లేని నాస్తికుని వ్యర్థ ప్రేలాపనలుగా పరిగణించరాదు. 

భగవద్గీత శ్లోకం 8-9లో సర్వస్య ధాతారమచిన్త్యరూపం (=సృష్టికి అధారభూతమగు ఆ బ్రహ్మము రూపు  అనూహ్యము) ని చెప్పబడింది. మనకు తెలియని విషయాన్ని వివరించడానికి, వర్ణించడానికి సాహసించనేలా? 

ఈ చరణములోని చివరి రెండు పంక్తులు మనిషి లభించిన అపరిమితమైన స్వేచ్ఛ అస్తవ్యస్త పరిస్థితులకు దారితీయునని సూచిస్తున్నాయి - దీనికి మనమందరమూ ప్రత్యక్ష సాక్షులము. ఈ గందరగోళంపై మన ఆలోచనలను ఆధారం చేసుకుంటే, మనం ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేస్తాం? మనం తదుపరి తరానికి ఎటువంటి వారసత్వాన్ని అందించగలం 

అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే సటలాడుకొనెడి రాక్షసమత మవును’ = భక్తి, శ్రద్ధా క్రమశిక్షణా లేని మనుషులు నివసించే ప్రపంచమనే అగాథము నుండి ఏమి నేర్చుకోగలము? ​ అన్నమాచార్యుల 500 సంవత్సరాల నాటి కూర్పు విలక్షణమైనది. విచారించతగినదీను.

References and Recommendations for further reading:

#1 81. వెలుపల మఱవక లోపల లేదు (velupala ma~ravaka lOpala lEdu)

#2 3. తొల్లి కలవే ఇవియు Tolli kalavE iviyu)

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...