Sunday 16 April 2023

T-162 వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా

 

అన్నమాచార్యులు

162 వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా

for EnglishVersion press here

 

సారాంశం: "నీవు విడువక పట్టియుంచిన వాటి నుండి కలుగు స్వేచ్ఛ మాత్రమే స్వేచ్ఛ"  - జిడ్డు కృష్ణమూర్తి ​

కీర్తన సారాంశం:

పల్లవి: మోక్షమునకు అవకాశము పదేపదే దొరకదు.  యాంత్రికముగా వేదాంతశ్రవణము  చేసీ ప్రయోజనం ఉండదు. అన్వయార్ధము: యీ ప్రపంచంలోకి ప్రవేశించుటకు నీకు మరొక అవకాశం లభించదని భావిస్తూ ఆ ముక్తికి మార్గమును వెతుకుము. 

చరణం 1: మానవుల మధ్య నిజమైన తారతమ్యములు లేవని గ్రహించినవానికి  ఒకరిని గురువుగా, ఇతరులను శిష్యులుగా గుర్తించడం సాధ్యముకాదు. సాధకునికి తన ఆత్మ తాను ఒకటే అనే ప్రత్యక్ష  అవగాహన ఉంటే ప్రార్థనలు చేయాల్సిన అవసర మేమి? 

చరణం 2: సహజ జీవన క్రమము మిథ్యయని గ్రహిస్తే బహుయాగాది కర్మలు చేయనవసరం లేదు.  జననాలు మరణాలు జ్ఞాపకాలపొరలలో సూచికలు మాత్రమే అని అర్థం చేసుకుంటే నిర్దేశిత విహితాచారాలు చేయాల్సిన అవసరం లేదు. 

చరణం 3: కనబడని ఘటన బ్రహ్మమును స్తుతిస్తూ కీర్తనలు పాడ నవసరం లేదు. అయితే వేంకటేశ్వరుని సేవలో నిమగ్నం కానివారు, అర్థరహితంగా  రాక్షస బాటలో పయనిస్తున్నారు.

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అత్యంత నారికేళపాకముగా వర్ణించతగిన ఈ కీర్తనలో అన్నమాచార్యుల ఆంతర్యము తెలియుట దాదాపు అసాధ్యమే. సాంప్రదాయికముగా అధిక విలువలను అపాదిస్తున్న అనేక విషయములను తారుమారుజేస్తూ  వ్రాసిన కీర్తన కొంత అసౌకర్యాన్ని రేకెత్తిస్తుంది.  ఆచార్యులు పైనపైన చూపిన తెరలు అను  తిరుగుబాటు ధోరణుల మరుగున  గొప్ప అంతర్దృష్టులను చాకచక్యముగా నిక్షిప్తము చేసిరి. 

సమాజము యేర్పరచుకున్న ప్రమాణములును ప్రశ్నిస్తూ సాగే కీర్తనలో దైవముపై  అచంచలమైన భక్తికి మానవులు తమకు తామే విధించుకున్న హద్దులు,  పద్ధతులు, ప్రార్థనలు, వాటి భాషలు, రూపాలు, ఆకృతులు కొలమానములు కావని అన్నారు. ఎటువంటి అధారములేని  పరంపరాగతముగా వస్తున్న నీయమములను చేదిస్తూ భక్తియను వ్యవసాయము చేయుటయే మానవుని కర్తవ్యమని, మనసునకు తోచునట్లు చేయుట రాక్షసమనీ ప్రకటించిరి. 

దైవమును ఇదమిద్ధముగా తెలియలేమని అన్నమాచార్యులు అనేకమార్లు ప్రకటించి యుండిరి. అటువంటి విషయాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం భ్రమలో భాగము కాదా? యిటు పురుషసూక్తాదు లివి మరేల వంటి వాక్యములను ఆ దృష్టికోణం నుండి చూడాలి కాని పొగరుగా దైవనిందకు పాల్పడు నాస్తికుని ప్రేలాపనగా చూడరాదు. 

ఈ విధమైన కీర్తనలను ప్రస్తుత సమాజంలో హిందూ వ్యతిరేకము అను ముద్ర వేయవచ్చు. అన్నమాచార్యుల కాలంలో దీన్ని ఇంకెంత  దైవ ద్రోహంగా చూసేవారో మనం చర్చించనవసరం లేదు. ఇలాంటి కీర్తనను ప్రచురించడం ఆయన నిర్భయతకు నిదర్శనం. ​

 

కీర్తన:

రాగిరేకు:  120-6 సంపుటము: 2-120

వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా
వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా ॥పల్లవి॥
 
అరయ జీవులకెల్లా నభేదమైతే
గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము
సొరిది నాతుమలోన సోహంభావనయైతే
సరి మునుల దేవపూజలు చెల్లవు ॥వాద॥
 
సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే
బహుయాగాది కర్మాల పస లేదు
మహిలోని జననాలు మరణాలు మాయమైతే
విహితాచారాలు సేయ విధే లేదు ॥వాద॥
 
ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప
యిటు పురుషసూక్తాదు లివి మరేల
అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే
సటలాడుకొనేడి రాక్షసమత మవును ॥వాద॥

Details and Explanations: 

వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా
వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: సారెసారె = మాటిమాటికీ. 

భావము: మోక్షమునకు అవకాశము పదేపదే దొరకదు.  యాంత్రికముగా వేదాంతశ్రవణము  చేసీ ప్రయోజనం ఉండదు. 

వివరణము: ఈ కీర్తనను అన్నమాచార్యులు నిర్మొహమాటంగా నాస్తికత్వపు టంచులను తాకుతూ రచించిరి. ఏమైనప్పటికీ ఒక యోగి మనసును తెలిసిన విషయ జ్ఞానమునుండి ఎటుల అప్రమత్తముగా వుండవలెనో  తెలియపరచుటకు ఈ  కీర్తనను (బ్లాగులో) చేర్చడం జరిగింది. 

వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటాఅనునవి మానవునికి మళ్లీ మళ్లీ ముక్తిని పొందు అవకాశము రాకపోవచ్చునని సూచిస్తున్నాయి. 

విశ్వవ్యాప్తంగా సంఘటిత సమాజాన్ని నిర్వహించడంలో అనుసరణ కిచ్చిన ప్రాముఖ్యతను, “స్వర్గమును మానవులు అనుగుణంగా వర్తించుటకు ఎరగాను, “వ్యతిరేకించువారికి నరకమును శిక్షగాను చూపుటలో గమనించవచ్చు. మన వ్యక్తిగత నమ్మకాలతో సంబంధం లేకుండా, మత గ్రంథాలను (పురాణ లేదా వేదాంత విషయములు) చెవిని చేరునట్లుగాను, మరియు  మనల్ని సామాజిక ప్రార్థనలలో పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తారు.  ఇలా వాటితో మనకు కొంత పరిజ్ఞానము కలిగి,   మనకు తెలిసినవి అవుతాయి. 

ఈ రకముగా దైనందిన జీవితంలో వద్దనుకున్నా అలా వాటితో మనకు పరిచయము, కొంత ప్రవేశమును కల్పిస్తారు. అలవాటు పడిన విషయములు   మనకు భద్రతను  మరియు ఓదార్పును ఇచ్చినట్లు అనిపింప చేస్తాయి. అప్రయత్నంగా అలవడిన (లేదా స్థిరపడిన) సంప్రదాయాలను ప్రశ్నించకనే అనుసరించడం ద్వారా వచ్చే భద్రత మరియు స్థిరత్వానికి విలువ ఇస్తాము. 

కానీ 'పరము' అను పదము  ఇహ లోకముతో ఎటువంటి సంబంధము లేని దానిని సూచించును. అనగా అది మన మస్తిష్కములో కదలాడు దేనితోను ముడిపడి వుండదు. అటువంటి దానిని అచ్చు వేసిన పుస్తకముల నుండి, కేవలము పెదవులు కదుపుటచేతనూ పొందాలను కోవడం ఉచితమేనా?

'వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా' అని అన్నమాచార్యులు యథాలాపంగా వినుటను విమర్శించిరి. మెట్లు ఎక్కినట్లు యాంత్రికంగా వేదాంతశ్రవణము చేసి పరమును చేరలేమనిరి. ఈ విధంగా మనము చేబట్టు అనేకానేక కార్యములపై పునరాలోచన అవసరమని చెప్పక చెప్పిరి. 

భగవద్గీత 2-41వ శ్లోకంలో యోగి మనస్సు  అనుసరించ వలసిన ఏకాగ్రత వర్ణించబడింది   “వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన భావము:  ఒక్కటే ఫలవంతమైన మార్గము కలదు. (తక్కినవన్నీ అప్రయోజనములు). ఈ విధంగా, అన్నమాచార్యులు మనం నిశ్చయించుకున్న ఆ ఒక్క యత్నముపై మాత్రము మనసు నిలిపి వుంచవలెననిరి.

అన్వయార్ధము: యీ ప్రపంచంలోకి ప్రవేశించుటకు నీకు మరొక అవకాశం లభించదని భావిస్తూ ఆ ముక్తికి మార్గమును వెతుకుము.

అరయ జీవులకెల్లా నభేదమైతే
గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము
సొరిది నాతుమలోన సోహంభావనయైతే
సరి మునుల దేవపూజలు చెల్లవు ॥వాద॥

ముఖ్య పదములకు అర్ధములు: సోహంభావనయైతే = ఆత్మ నేనే అన్న భావన కలిగితే; సొరిది = క్రమము.

భావము: మానవుల మధ్య నిజమైన తారతమ్యములు లేవని గ్రహించినవానికి  ఒకరిని గురువుగా, ఇతరులను శిష్యులుగా గుర్తించడం సాధ్యముకాదు. సాధకునికి తన ఆత్మ తాను ఒకటే అనే ప్రత్యక్ష  అవగాహన ఉంటే ప్రార్థనలు చేయాల్సిన అవసర మేమి?

 

వివరణము: అన్నమాచార్యులు భగవద్గీతలోని 6-5 మరియు 6-6 శ్లోకాలను సూచించుచూ, ఈ ధ్యానమను ప్రయాణము కేవలం ఒకరి స్వంత నిశ్చయాత్మతపై ఆధారపడి ఉంటుంది, పరుల ఆదేశాలపైన కాదు. ఉద్ధరేదాత్మనాత్మానం (= నీ మనస్సు యొక్క శక్తి ద్వారా నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి). "బంధురాత్మా...వర్తేతాత్మైవ శత్రువత్" (=ఆత్మను తెలియు మార్గమున నీవెంత తటస్తముగా నుందువో దానిని బట్టి నీకు నీవే మిత్రుడవు లేదా శత్రువు కావచ్చును) అనిరి. గీత అంత స్పష్టంగా ఉంటే, యోగ మార్గమున ఒకరిని  గురువుగాను మరియు మరొకరిని శిష్యుడిగా స్వీకరించుటకు అవకాశమే లేదు. 

కానీ సంప్రదాయముగా వస్తున్న యీ గురుశిష్య భావనను  మనస్సున విడనాడడం సులభం కాదు. ఇదే కారణంగా జిడ్డు కృష్ణమూర్తి తనకు బలవంతముగా కట్ట బోయిన జగద్గురువు కిరీటమును స్వీకరించడానికి నిరాకరించాడు. అతను ఎవరినీ తన శిష్యులుగానూ అంగీకరించ లేదు.  ప్రోత్సహించలేదు. మానవునికి తెలిసినదానిని ముఖ్యంగా తాను నమ్మిన దానిని, వదలివైచుట పెను సవాలు. కనిపించని నిప్పులా కాలుతూను వుండే ఆరని మంట. మనకు అలవాటైన  దృక్కోణంతో కొత్త పుంతలు త్రొక్కడం అసాధ్యం.

నాతుమలోన సోహంభావనయైతే’: ఒక మనిషి తాను నేర్చిన దానిలో పవిత్రమైనది ఏమీ లేదని మరియు నేర్చుట కంటే అవిద్యను వీడుట ఆవశ్యకమని గ్రహించినప్పుడు, ప్రార్థనలు చేయడం వల్ల ప్రయోజనం లేదని యోగికి అంతరంగమున అవగతమగును. పై ప్రకటనను రెనే మాగ్రిట్‌చే "రెడ్ మోడల్" (= రక్తమాంస పరివర్తనము) అనే పెయింటింగ్ సహాయం తీసుకొని వివరిస్తాను. దిగువ ఇచ్చిన చిత్రాన్ని లోతుగా పరిశీలించండి. 



పాదాలు మరియు బూట్ల మధ్య ఉన్న మామూలు  అనుబంధం నుండి అసాధారణ సంభావ్యతకు తెర ఎత్తుతాడు మాగ్రిట్.    పాదాలు/బూటు, మానవుడు/మానవేతర, లోపల/బయట. మానవ పాదాలను తోలుతో కలిపి ఒక కొత్త వస్తువును రూపొందించడం అనేది హైబ్రిడైజేషన్ (సంకీర్ణము= సహజము కానిదాని) యొక్క వ్యక్తీకరణ పై చిత్రపటము సూచించును. 

బాహ్యమున ఉన్న చర్మముతో చేసిన బూట్లు పాదములలోకి చొచ్చుకువచ్చి అంతర్భాగమైపోవడం - విశేషముగా బొమ్మచుట్టూ చూపిన వొళ్ళు విరుచుకుంటున్న యువతి (విశృంఖలత్వము), సిగరెట్ పీకలు (చెడు అలవాట్లు), చిల్లర నాణాలు (ధనాశ) మనలను - అనుజ్ఞ లేకయే వచ్చు చేరు సంగతులకు ప్రతీకలనుకోవచ్చును.  

బాహ్యముగా నున్నది అనూహ్యంగా  అంతరంగముగా మారుటను సూచిస్తుంది. వెలి నుండి అప్రయత్నంగానో, ప్రభావితులమై తెలియకయే అనుకరించియో, కొంతవరకు అలవాటు/కంఫర్ట్ జోన్ కారణంగానో, అనేక భావాలు, ఊహలు మరియు ఆలోచనలను మనస్సు సూదంటు రాయిలా గ్రహించును. ఏది ఏమైనప్పటికీ, వాస్తవంగా "బయట" అనేది "లోపల"గా మారుతుందనేది నిర్ద్వందము. 

మనస్సు దేనిని పట్టి వుంచునో దాని కింద రూపాంతరము చెందుటను సూచించిరి. (ఎరుపు రంగు నీటితో నింపిన గాజు పాత్ర ఎరుపుగాను, పాలతో నింపిన తెల్లగాను కానవచ్చినట్లు) నింపిన దాని గుణములనే పారదర్శకమైన​ పాత్రకు ఆపాదించ బడును. ఇప్పుడు చిత్రానికి మరియు అన్నమాచార్యుల "వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు"#1 అను కీర్తనతో గల సంబంధాన్ని పరిశీలించండి 

పెయింటింగ్ మరియు ఉదహరించబడిన కీర్తన కలిపి, మనము బాహ్య భాగాన్ని లోపలికి విస్తరిస్తున్నామని అర్థం చేసుకుంటాము. వీటిని పూర్తిగా మరచిపోతే (లేదా వదిలేస్తే) తప్ప, మనము సందేహాలతో విసిగిపోతూనే ఉంటాము. దీనిని బట్టి నాతుమలోన సోహంభావనయైతే సరి మునుల దేవపూజలు చెల్లవుఅనునది నమ్మలేని నిజము. జిడ్డు కృష్ణమూర్తి గారు,  తన జీవితములో పూజలు చేసిన దాఖలాలు లేవు. బుద్ధుడు, విజ్ఞులైన అనేక మంది పాశ్చాత్యులు ఈ కోవకు చెందినవారే.

 

భగవద్గీత శ్లోకము 3-18 దాదాపు ఇదే తలపును తేటతెల్లము చేయుచున్నది. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః (= భావము: నిజమైన యోగి దైనందిక​ విధివిధానములలో జోక్యం చేసుకొనక, పూర్తిగా స్వతంత్రంగాను, ఇహము నందలి దేనిని ఆశ్రయించుకొని వుండడు).  కావున ఆ తలమున సంచరించని వాడు అస్సలు యోగియే కాడు. 

సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే
బహుయాగాది కర్మాల పస లేదు
మహిలోని జననాలు మరణాలు మాయమైతే
విహితాచారాలు సేయ విధే లేదు ॥వాద॥

 

ముఖ్య పదములకు అర్ధములు: సహజలీలావిభూతి = సహజ జీవన క్రమము

భావము: సహజ జీవన క్రమము మిథ్యయని గ్రహిస్తే బహుయాగాది కర్మలు చేయనవసరం లేదు.  జననాలు మరణాలు జ్ఞాపకాలపొరలలో సూచికలు మాత్రమే అని అర్థం చేసుకుంటే నిర్దేశిత విహితాచారాలు చేయాల్సిన అవసరం లేదు.   

వివరణము: మహిలోని జననాలు మరణాలు మాయమైతే’ = అన్నమాచార్యులు జనన మరణాలను   చాలాసార్లు ప్రస్తావించినా వాటిలో చెప్పుకోదగినది. పొలసి మతిమరఁగుననె పుట్టుటలు ఏఁ బోవుటలు#2(= పుట్టుక, మరణం అనేవి ఆలోచనల పొరలలో జ్ఞాపకాలుగా మిగిలి ఉంటాయి). ఈ కవితలో కూడా దానినే పొడిగిస్తున్నారు. జ్ఞాని తన యోగత్వపు మానసిక స్థితికి చేరుకున్నప్పుడు, తనకు మరియు ప్రపంచానికి మధ్య అంతరము లేదని గ్రహిస్తాడు; అట్టివారు ప్రపంచ నందు సంచరించు జీవవాహినిలో అంతర్భాగమౌతారు. అలాంటి వ్యక్తికి జననం మరియు మరణం రెండూ సమానమే. అప్పుడు జీవనం కొనసాగుతుంది; 'నేను' అనునది విడనాడడం జరుగుతుంది.


సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే’ = "సహజ జీవన క్రమము మిథ్య యైతే": భగవద్గీత శ్లోకము 4-23 గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతస: | యజ్ఞయాచరత: కర్మ సమగ్రం ప్రవిలీయతే భావము: “బంధాల నుండి విముక్తి పొందిన వ్యక్తులు స్వచ్ఛమైన జ్ఞానంతో తమ పనులన్నింటినీ భక్తితో నిర్వహిస్తారు. ఇది వారి కర్మల యొక్క అన్ని పరిణామాల నుండి వారికి విముక్తిని కలిగిస్తుందిఅని చెబుతున్నది. భౌతికంగా సహజమైనది ఏమిటో మనకు తెలియనప్పుడు, వరుసలేక తబ్బిబ్బు చేయు విషయములతో వ్యస్తుడగు మానవునికి  "సహజ జీవన క్రమాన్ని" అర్థం చేసుకునే ప్రశ్నే ఉండదు. "రెడ్ మోడల్" అనే పెయింటింగ్‌ని తిరిగి చూద్దాం. 

ఈ చిత్రము మనకు తెలియకుండానే బాహ్య సమాచారాన్ని మనలో అంతర్లీనంగా సమీకరించడము - సహజమో కాదో గుర్తించే సామర్థ్యం లేకపోవటానికి సూచన​. కాబట్టి  ఏమి జరుగుతోందో తెలియక కొట్టుమిట్టాడుతున్నామనుట వాస్తవము. అందుకే ఈ నమ్మకాల, జ్ఞాపకాల యొక్క నిరాధారమైన స్వభావాన్ని మనం గుర్తించి, వాటిని తీవ్రంగా తిరస్కరించినప్పుడు, విష సర్పాన్ని వదలివైచినట్లు వదల గలిగితే జీవితంలో బహుయాగాది కర్మలు, విహితాచారాలు చేయనవసరం వుండదు. 

ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప
యిటు పురుషసూక్తాదు లివి మరేల
అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే
సటలాడుకొనేడి రాక్షసమత మవును ॥వాద॥

ముఖ్య పదములకు అర్ధములు: సటలాడు = మాయమాటలు మాట్లాడు, వ్యర్థము గావించు.

భావము: కనబడని ఘటన బ్రహ్మమును స్తుతిస్తూ కీర్తనలు పాడ నవసరం లేదు. అయితే వేంకటేశ్వరుని సేవలో నిమగ్నం కానివారు, అర్థరహితంగా  రాక్షస బాటలో పయనిస్తున్నారు.

వివరణము: పరమాత్మను స్తుతించే స్తోత్రాలు మరియు అలాంటి అనేక విషయాలు మన మనస్సు యొక్క భావనలు మాత్రమే. 1928-29 సంవత్సరాలలో రెనే మాగ్రిట్ గీసిన​ "ది ప్యాలెస్ ఆఫ్ కర్టెన్స్ III (తెరల మందిరము-3)" అనే పెయింటింగ్ ద్వారా దానిని వివరిస్తాను. మీరు చూస్తున్నట్లుగా, మాగ్రిట్ రెండు దాదాపు ఒకేలాంటి ఫ్రేమ్‌లను పక్కపక్కనే చూపించారు.​ ఒకదానిలో నీలి ఆకాశం చిత్రం ఉంది. మరొకటి ఫ్రెంచ్ పదం "సీల్" అంటే "ఆకాశం" అని అర్ధం. 



పదం మరియు చిత్రం వాటి అర్థంలో పరస్పరం మార్చుకోగలవని, కానీ వాటి అమలులో భిన్నంగా ఉన్నాయని మాగ్రిట్ ఇక్కడ మనకు చూపుతున్నారు. అయినప్పటికీ, వాటి అమలులో మనం పరస్పరం మార్చుకోగలిగిన ప్రాముఖ్యత కలిగిన సోపానక్రమాన్ని కనుగొంటాము. వాస్తవానికి, ఆకాశపు పటమును చూచి  లేదా ముద్రిత అక్షరములు "సీల్"  చదివి  ఆకాశమని భావించవచ్చు. కుడి వైపున ఉన్న ఫ్రేమ్ మనకు విషయానికి ఏకపక్ష అనుబంధాన్ని ఇస్తుంది: ఒక పదం - "ఆకాశం" అనే పదం గురించి ఆలోచించినప్పుడు మీ మనస్సు తక్షణమే అది ఎలా ఉంటుందో దాని చిత్రాన్ని రూపొందిస్తుంది. చతురత అంతా కలిపి ఈ చిత్రాన్ని తయారు చేసారు మాగ్రిట్. 

ఆ ప్రక్రియ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. జీవులు ఆకాశాన్ని గ్రహించాల్సిన ఏకైక ప్రక్రియ ద్వారా గ్రహించబడిన ఏకపక్ష కమ్యూనికేషన్ (ఇక్కడ ఫ్రెంచ్ భాష) వ్యవస్థలోని ఒక విభాగం మీ మెదడు లోపల మీరు మాత్రమే చూడగలిగే ఒక చిత్రాన్ని మాయాజాలం చేయగల అపారమైన శక్తిని కలిగి ఉంటుంది - మీ ఆకాశం. దీనితో పోలిస్తే ఎడమవైపు చిత్రము వాస్తవానికి ఆకాశమునకు ప్రతి రూపమైననూ ప్రతీరోజు చూచు దానికంటే ఏమాత్రము భిన్నముగా లేకపోవుటచే వెలవెల పోవుచున్నది. 

ఈ విధంగా, పైన ఇవ్వబడిన తార్కికంతో మనకు, భగవంతుడు (ఆకాశం చిత్రం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు), గ్రంధాలు, శ్లోకాలు ('సీల్' = 'ఆకాశం' అనే పదం ద్వారా సూచించ బడ్డాయి).  సర్వవ్యాపి అయిన దేవుని కంటే ఆయనపై మనమేర్పరచుకున్న భావనలు, ప్రార్ధనలు కేవలము (symbolic) సూచిత మాత్రములైననూ మనలను ఎక్కువ ప్రభావితులను చేయును. (with inputs from website https://slang-king.tumblr.com/post/736401642/the-palace-of-curtains-iii) 

ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప యిటు పురుషసూక్తాదు లివి మరేల = అంటే ఈ లోకాన్ని ఘటియింపచేయు బ్రహ్మము ఆకారములేనిదైతే, అగపడనిదైతే, ఆ విరాట్పురుషుని వేదసూక్తములతో స్తుతించి,  పఠించీ ప్రయోజనమేమి? 

విశ్వాసంతో సంబంధం లేకుండా ఒక కవిత్వమునో, ఒక శ్లోకమునో ఆరాధనా సాధనంగా మనము  అర్థం చేసుకున్నప్పటి, అవి మనకు పూర్తి అవగాహనలేని విషయములను ఎట్లు సూచించును? దానికి ఆధారమేమి? అన్నమాచార్యుల ప్రకటనలను ఆ కోణం నుంచి చూడాలి తప్ప, దైవభక్తి లేని నాస్తికుని వ్యర్థ ప్రేలాపనలుగా పరిగణించరాదు. 

భగవద్గీత శ్లోకం 8-9లో సర్వస్య ధాతారమచిన్త్యరూపం (=సృష్టికి అధారభూతమగు ఆ బ్రహ్మము రూపు  అనూహ్యము) ని చెప్పబడింది. మనకు తెలియని విషయాన్ని వివరించడానికి, వర్ణించడానికి సాహసించనేలా? 

ఈ చరణములోని చివరి రెండు పంక్తులు మనిషి లభించిన అపరిమితమైన స్వేచ్ఛ అస్తవ్యస్త పరిస్థితులకు దారితీయునని సూచిస్తున్నాయి - దీనికి మనమందరమూ ప్రత్యక్ష సాక్షులము. ఈ గందరగోళంపై మన ఆలోచనలను ఆధారం చేసుకుంటే, మనం ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేస్తాం? మనం తదుపరి తరానికి ఎటువంటి వారసత్వాన్ని అందించగలం 

అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే సటలాడుకొనెడి రాక్షసమత మవును’ = భక్తి, శ్రద్ధా క్రమశిక్షణా లేని మనుషులు నివసించే ప్రపంచమనే అగాథము నుండి ఏమి నేర్చుకోగలము? ​ అన్నమాచార్యుల 500 సంవత్సరాల నాటి కూర్పు విలక్షణమైనది. విచారించతగినదీను.

References and Recommendations for further reading:

#1 81. వెలుపల మఱవక లోపల లేదు (velupala ma~ravaka lOpala lEdu)

#2 3. తొల్లి కలవే ఇవియు Tolli kalavE iviyu)

1 comment:

  1. పల్లవిలో అన్నమయ్య వేదాంతశ్రవణమును మొక్కుబడిగా,అశ్రద్ధతో,అయిష్టతతో చేసినచో యెట్టి ప్రయోజనం ఉండదని,అట్లు జేసిన మోక్షం లభించదని చెబుతున్నాడు.

    మానవజన్మ లభించటం దుర్లభం. అట్టి మానవజన్మతో మాత్రమే మోక్షము సాధ్యమని, యితర జన్మలలో మోక్షసాధన అసాధ్యమని తెలుసుకోవాలి. అట్టి ఉత్కృష్టమైన మానవజన్మను పొంది,సాధన చతుష్టయమును కలిగిన యోగ్యుడు శ్రవణ,మనన, నిధిధ్యాసలను చిత్తశుద్ధితో చేసినచో ఆత్మసాక్షాత్కారం సాధ్యమని బృహదారణ్యకోపనిషత్తు, ముండకోపనిషత్తులు వక్కాణిస్తున్నవి. అందులో వేదాంతశాస్త్ర జ్ఞానమును స్వయంగా చదివి గాని,
    సద్గురుముఖతః గాని విని వేదాంతశ్రవణం చేయవలెనని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.

    జీవులలో అభేదభావమున్నట్లు అయితే, అందరిలోనూ పరమాత్మ అంశ ఉన్నట్లు అయితే మరి ఒకరు గురువని, మరొకరు శిష్యుడని భేదభావముతో గుర్తించటం కూడదు.
    *సోహం*- పరమాత్మయే నేను అనే అభేద చింతన ఉంటే, దేవతలకు పూజలు,ప్రార్థనలు చేయటమెందుకు?
    అవిద్య(అజ్ఞానం)ను వీడితే గురువని, శిష్యుడనే భేదభావం తొలగిపోయి,,మునుల దేవపూజలు అనవసరమని అన్నమయ్య మొదటి చరణంలో అంటున్నాడు.

    ఈ సందర్బంగా భగవద్గీతలోని "ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్"(6-5) శ్లోకంలో పరమాత్మ "నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నువ్వు అంటే నీ ఆత్మను ఉద్ధరించుకొనుము, పతనం కావద్దు" అని ఆధ్యాత్మిక పురోగతికి పథనిర్దేశం చేస్తూ, మనస్సే నీకు శత్రువు మిత్రుడు కూడా యని అర్జునునికి ఉపదేశించటం
    సందర్భోచితము.

    శ్రీ శంకరభగవత్పాదులవారు ఆత్మకు అందుబాటులో ఉన్న ఉపకరణములను విశదీకరిస్తూ మనస్సుని మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము (మనోబుద్ధ్య హంకారచిత్తములు) అని నాలుగు రకములుగా విభజించారు. బుద్ధిని ఉపయోగించి మనస్సుని ఉద్ధరించుకోవాలి.ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల వ్యామోహం లేకుండా, వాటిచే చిత్తభ్రాంతికి లోను గాకుండా బుద్ధిని నియంత్రించి ఆత్మను ఉద్దరించుకోవాలి.ఆత్మజ్ఞానసాధన చేసి *సోహం* అనే స్థితిని చేరుకోవాలి.

    రినే మాగ్రిట్టే పెయింటింగ్ ను పరిశీలిస్తే బాహ్యభాగాన్ని మనం లోపలికి విస్తరింపజేసి, వాటిని మరచిపోలేకపోతున్నాము. వాటిని పూర్తిగా వదలిపెడితే తప్ప,మనం సందేహాలతో విసిగిపోయి,వాటితో పీడింపబడుతూ ఉంటాము.

    సహజజీవితక్రమము మిథ్య అని అనుకుంటే యజ్ఞయాగాది క్రతువులు చేయపనిలేదు.పుట్టుట, గిట్టుట అనేవి జ్ఞాపకాలపొరలలో మిగిలిపోతే అంటే సాధకుడికి జ్ఞానసిద్ధి జరిగినపుడు అన్నింటా సమదృష్టి యేర్పడి, అంతటా ఉన్నది పరమాత్మయే నన్న స్థితికి చేరినపుడు అంటే "అహం బ్రహ్మాస్మి', 'సోహం'అనే స్థితిని సాధించినపుడు శాస్త్రవిహిత కర్మల నాచరింప నవసరం లేదని అన్నమయ్య అంటున్నాడు రెండవ చరణంలో.

    నిరాకార బ్రహ్మను స్తుతిస్తూ పురుషసూక్తాదులు పఠించవలసిన పనిలేదు.శ్రీనివాసుని సేవలో తరించనివారికి వ్యర్థమైన రాక్షసమార్గంలో పయనిస్తారు.అనగా శ్రీనివాసుని సేవలో నిమగ్నమైన వారు ఉత్తరమార్గములు అనగా దేవయానమార్గంలో పయనించి ముక్తిని పొందుతారని అన్నమయ్య చివరి చరణంలో వివరించాడు

    శ్రీ చామర్తి శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం అసాధారణం. అద్భుతం.
    వారి కృషికి, నిబద్ధతకు మనఃపూర్వక అభినందనలు.
    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...