Sunday, 25 May 2025

T-224. తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె

 తాళ్లపాక అన్నమాచార్యులు

224. తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె

For English version press here 

ఉపోద్ఘాతము 

అన్నమాచార్యులు ప్రత్యక్షముగా చూచినది మాత్రమే వ్రాశారు అని మీకు అనేక సార్లు విన్నవించుకొన్నాను.  ఈ కీర్తన విశ్వసృష్టి,  చైతన్యం యొక్క ఆవిర్భావము గురించి. "ఎప్పుడో జరిగిన సృష్టి గురించి పదిహేనవ శతాబ్దపు అన్నమాచార్యులు ఎలా చెప్పగలరు?" అన్న ప్రశ్న ఉదయించాలి. అనగా ఆచార్యుల వారు కాలాతీత స్థితిని చేరుకొన్నారని భావించ వచ్చును. కాబట్టి ఈ కీర్తన  అలౌకికము అసమాన్యము అద్వితీయము అపూర్వము  అనుట అతిశయోక్తి కాదు. కానేరదు.


భగవద్గీతలో చెప్పినట్లు పంచభౌతికములతో వ్యక్తమైన నిర్మాణం  కనబడు ప్రపంచం.  సూర్యమండలంలోనే కాక నక్షత్ర మండలములలో కూడా ద్రవ్యం ఒకే మాదిరి ఉండుట గమనించిన కొంత ఆశ్చర్యం కొంత నిరాశ కలుగుతుంది (అక్కడికి వెళ్ళినా క్రొత్తదిలేదే అని).  చైతన్యం లేని ద్రవ్యం విశ్వమంతటా వ్యాపించింది.   చైతన్యవంతమైన ఈ సృష్టి మూలమును కనుగొనుట మనిషికి ఒక సవాలుగా మారుతుంది. మానవుడు తన ప్రజ్ఞతో విశ్వాంతరాళాలలో  దేవుని కోసం, అతడి జాడల కోసం గాలిస్తూనే వుంటాడు.   కానీ ఈ దేవులాట అసంపూర్ణముగానే ఉంది. ఉంటుంది.


అన్నమాచార్యులు ఈ కీర్తనలో  దైవం ఎందుకు పనికిరాని ద్రవ్యమునుండి (తొట్టెల నుండి) సృష్టిని కొనసాగిస్తున్న విషయం పలుమార్లు ప్రస్తావించి మానవుల భావనలో కొన్నిటికి ఎక్కువ విలువ కొన్నింటికి తక్కువ విలువ ఆపాదించు గుణమును తూలనాడిరి.


విశ్వచైతన్యంలో సమస్త ప్రక్రియలు అనేక దిశలలో అనేక దశలలో నిత్యము  జరుగుతూనే ఉంటాయి. దానిని గమనించలేని అసహాయ స్థితి మానవునిది.  అన్నమాచార్యులవారు అటువంటి మానవాతీత స్థితిని చేరుకుని వ్రాసిన కీర్తన ఇది. ఉయ్యాలా పాట కాదు. జగమనే ఊయలను ఊగించు మహాత్ముని కీర్తన ఇది. 

 

అధ్యాత్మ కీర్తన

నిడురేకు: 4-1 సంపుటము: 4-532

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన
చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు      ॥పల్లవి॥
 
కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు  ॥తొల్లి॥
 
అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు   ॥తొల్లి॥
 
వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు      ॥తొల్లి॥

 

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన
చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు ॥పల్లవి॥

భావము:

అనాదిగా — మనం తక్కువగా భావించే మఱ్రాకు తొట్టెల వంటి వాటిలోనే
ఆ పరబ్రహ్మము — శ్రీరంగశిశువు —
తాను ఆడుకుంటున్నట్టు, ఊగుతున్నట్టు అనిపిస్తాడు.
అతడు ఊగడంలేదు — మనమే -
మన మాయా విలువలతో, మన ఊహలతో ఊగిపోతూ,

ఆ నిశ్చల పరబ్రహ్మను సాపేక్షంగా ఊగుతున్నట్టుగా చూస్తున్నాం.
ఆయన మాత్రం — శుద్ధమైన చిరునవ్వుతో,
అలంకారాల ప్రత్యయం లేకుండా,
అలౌకికమైన చైతన్యంతో,
మన కళ్లముందే నిశ్చలంగా కదలాడుతూ ఉన్నాడు. 

1st Stanza: 

కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు       ॥తొల్లి॥ 

కలికి = Charming, lovely, pretty; తలగ కిటుTagalakau= not touched; రంగ = place of action; చిలుపాల = little milk ;సెలవితో =at corner of the mouth;


భావము:

ఆది నుంచీ —
మఱ్రాకు తొట్టెలలో —
ఆ శ్రీరంగశిశువు
దివారాత్రుల నిశ్శబ్ద ఊయలలో
మృదువుగా ఊగిపోతూ అలరిస్తున్నాడు.
 
ఆ దైవకృప
కావేరి వలె ప్రవహించే చేతులై విస్తరించి,
ప్రపంచాన్ని హత్తుకుంటోంది.
కానీ ఆయనే —
క్రియలతో స్పృశింపబడకుండా,
హృదయంలోని శ్రీరంగంగా  నిశ్చలంగా తిలకిస్తున్నాడు.
 
యుగయుగాలుగా —
మన ఊహల ఊగిసలాటలో మనమే ఊగుతూ —
ఆ నిశ్చల సత్యాన్ని
కదులుతున్నట్టు మనమే ఊహించుకుంటున్నాం.
 
అతడు మాత్రం —
పాలసుగంధంతో నిండిన చిన్న చిరునవ్వుతో,
ప్రపంచాన్ని ప్రశాంతంగా పరికిస్తున్నాడు.
సృష్టి స్వరలయమే ఊయల పాటగా మారి —
ప్రేమభాషలో ఆయనకు లాలించే పాట పాడుతోంది.

2nd Stanza

అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు       ॥తొల్లి॥

 

అదన = అవకాశం కమలజ= brahma; గమలభవాండమను= great celestial bodies, milkyways; గమలభవాండమనుతొట్టెల = in the matters of the vast creation;  ఉదధులు = oceans; తరంగములనూఁచఁగా = rocked by the great waves; మాఁగీని = పరిపక్వస్థితికి తీసుకొని వెళ్లు;


భావము:

అదిగో బ్రహ్మ — తిరువారాధనమని పిలవబడే ఆ ఋతుసంధికి, గమల భవాండములను తొట్టెలవలె మలచుకొని, సృష్టి పాటకు తొలి స్వరం ముద్రింపజేశాడు. ఆ విస్తారమైన గగనతలాలు, బ్రహ్మాండ గోళాలు, అవధులులేని సముద్రాలు — ఆ శిశువు కోసం మృదువైన ఊయలగా మారిపోయాయి. సముద్రతరంగాల స్నిగ్ధ ఊడకలో, కాలపు నిశ్శబ్ద ఛాయలో పరిపక్వతను పొందుతూ — శ్రీరంగ శిశువు తగ్గని తేజంతో, చెదరని శాంతితో, అనంత సృష్టి ఒడిలో లాలనగా విశ్రాంతి చెంది ఉన్నాడు.


3rd Stanza

వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు ॥తొల్లి॥ 

వేదములు తలగడలాగా మెత్తని అనువు కలిగించగా,
అదిశేషుడు ఒప్పిన తొట్టెల పడకగా విరాజించగా,
ఆ అపార బ్రహ్మాండ దృశ్యంలో —
ఒక మౌనమైన యోగసంధానం జరిగినది —
శ్రీదేవితో పరమాత్ముని ఐక్యం.
శాంతితో, స్థిరతతో నిండిన
శ్రీరంగశిశువు —
ఈ సృష్టినాటక హృదయంలో విశ్రమించియున్నాడు.

 

వివరణము: “శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై” అన్నది అన్నమాచార్యుల వారు దైవంతో ఐక్యమైన సంగతి తెలుపుచున్నది.


 

1 comment:

  1. మాయచే ఆవరించబడిన కారణంగా మనకు పరబ్రహ్మము జగమనే ఊయలలో ఊగుతున్నట్లు అనిపిస్తాడు కాని జగమును తానే నడిపించుచు, తాను ఆకర్తగా, చైతన్యమూర్తిగా మన కనుల ముందరే కదలాడుచున్నాడని, అనంతసృష్టి ఒడిలో పవళించుచున్నాడని, జగన్నాటాక సూత్రధారియై ప్రకాశించుచున్నాడని గ్రహించలేకున్నామని అన్నమయ్య స్వానుభవముతో చెప్తున్నారు ఈ ఆధ్యాత్మకీర్తనలో.
    🙏🏻
    కృష్ణమోహన్

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...