Saturday, 17 May 2025

T-222. తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు

222. తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ 

For English version press here

ఉపోద్ఘాతము

పెద్దతిరుమలాచార్యులు తండ్రి నీడలో కారు — ఆయన పక్కన నిలిచే తాహతు గలవారు. తండ్రిలాగే లోతైన స్వరంతో గుండె తలుపులు తట్టుతారు. అన్నమాచార్యులు తరచూ తనను తానుగా విడిచిపెట్టి భక్తిలో పరవశించిన అనుభూతులవైపు తీసుకెళ్తే, పెద్దతిరుమలాచార్యులు తల్లిలా అర్ద్రత కలిగిన కఠినత్వంతో - అనుభవం, అనుకంపనలను జోడించి — ఋషిలా మాట్లాడతారు. అలంకారాలూ, అపవాదాలూ లేని స్వరంలో, ఆత్మసాక్షిగా. 

ఈ ఒక్క కీర్తనతోనే ఆయన బహుళార్థసంపన్నమైన నైపుణ్యం ఆచంద్రార్కం నిలిచే స్థాయిలో వెలుగుతుంది. 

ఉదయం, చీకటి, అమాయకత్వం, ఆకలి వంటి సాధారణ చిహ్నాలకు తాత్త్విక బరువును కలిపి మలచగల నేర్పు ఆయనది. 

అజ్ఞానానికి రెండు రూపాల మధ్య — అవివేకములో పుట్టిన నిరాసక్తత, కరడు కట్టిన దుర్మార్గం — తేడాను స్పష్టంగా చూపుతూ మానసిక స్థితులపై అరుదైన స్పష్టతను వెలుగులోకి తీసుకొస్తారు. 

చివరికి - భక్తి అనేది సహజంగా వచ్చే లక్షణం కాదు; సిద్ధమైన హృదయానికి దక్కే వరం అన్న ఆయన ప్రకటన - దివ్యమైన కృపను, మానవుల తిరస్కారాన్ని రెండింటినీ చూసిన సాక్షాత్కారపు వాక్యం. 

ఆయన అన్నమాచార్యుల కొడుకు మాత్రమే కారు — తండ్రి లోపల దాగిన అంతర్జ్వాలకి ఉత్తరాధికారి. 

సారాంశం

ఈ పాట అసాధారణము మరియు అద్వితీయము. ఇది ఒక కవి చేతిలో మనోహరంగా రూపు దిద్దుకున్న తత్త్వశిల్పము. కత్తిలాంటి పదునుతో,  పోనీలే అను ఉదాసీనతకు అశ్రద్ధకు తావివ్వక​, కనికరము, దయ ఉట్టిపడుతూ వున్న  ఆత్మీయ ఉపదేశం అనుకోవచ్చును. పెద్దతిరుమలాచార్యులు ఒక ఋషిలా ఆనతిచ్చిన సంస్కరణము.  ఆయన హితబోధ చేయరు - గమనించిన సత్యాన్ని కొన్ని పదాల్లోనే - మనిషి అజ్ఞాన వైఖరిని కళ్ల ముందు కనిపింపచేస్తారు. 

తాముఁ దెలియరూ —  మనల్ని మనమే తెలియని స్థితి, 

మనకు మేలు చేసే దానిని తిరస్కరించడం, 

రుచుల వెంట పరుగిడి అసలు తత్త్వాన్ని మర్చిపోవడం, 

అర్థం లేని ఆర్భాటాలను భక్తిగా భ్రమించుకోవడం, 

ఇలా చేయడంతో అసలైన సూక్ష్మ సత్యం మనకు కనిపించకపోవడం.

 


అధ్యాత్మ కీర్తన

రేకు: 24-2 సంపుటము: 15-136

తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ
పామరపుఁ దమ కర్మఫలమో హరిమాయయో       ॥పల్లవి॥
 
చీఁకటిఁ బెడబాపేటి చేరువ సూర్యోదయము
చీఁకటి కూబలకైతే చిమ్మి రేఁచును
యాఁకటతో విజ్ఞానము నందిచ్చే శ్రీ హరిభక్తి
కాఁకల దుర్మార్గులకుఁ గాన నీదూ   ॥తాము॥
 
అందరు రుచిగొనేటి అన్నము బహురోగికి
కందువ నజీర్ణమై కారించును
యెందును శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు
మందమైన జడునికి మఱఁగులై తోఁచును ॥తాము॥
 
ధరఁ గొందరు మూర్ఖులు తగ నొక్కరాజుఁ గొల్చి
పరిచారకునిఁ దిట్టి భంగ పడ్డట్టు
యిరవుగ శ్రీ వేంకటేశుఁ గొల్చి వారివారి
విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు  ॥తాము॥

 

Details and explanations: 

తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ
పామరపుఁ దమ కర్మఫలమో హరిమాయయో
॥పల్లవి॥

ప్రకటిత ర్థం:

(వీరు) తమంతట తామే ఎరుగరు. తగినట్లు (పెద్దలు) చెప్పినా వినరు. ఈ అధమత్వము, నీచత్వము అజ్ఞానమున తిరుగు కర్మఫలమా? లేక హరి మాయయా?


భావాత్మక​ వివరణ: 

ఈ కీర్తనలో పెద్దతిరుమలాచార్యులు నిందించరు. పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో దయ ఉంటుంది. ఒక ఋషి స్వరంలా ఉంటుంది - సత్యాన్ని చూసినవాడి నిశ్శబ్ద ఆవేదన. 

తాముఁ దెలియరూ  - (వీరు) తమంతట తాము ఎరుగుటకు ప్రయత్నించరు. ఒక వేళ యత్నించినా తమ యధార్థ స్వరూపాన్ని, పరమార్థాన్ని గ్రహించలేరు. ఇది ఉపనిషత్తులలో చెప్పబడిన అవిద్యకి సమానమైనది.


తగఁ జెప్పిన వినరూ  ఇక్కడ ‘వినరు’ అంటే పెద్దల మాటలకు తల ఊపడం కాదు - హృదయంతో అంగీకరించకపోవడం. తమ ఇప్పటి సౌకర్యములను, సుఖములను, సాంత్వనను విడిచేందుకు సామాన్యులు సిద్ధపడరు. దైవమును  చేరుటకు ధర్మబద్ధమైన జీవితమే ముఖ్యమని ఎంత చెప్పినా వినని తత్వమును  గమనించి పెద్దతిరుమలాచార్యులు ఆవేదనకు గురియగుతున్నారు.


పామరపుఁ దమ కర్మఫలమో హరిమాయయో —

ఈ ప్రశ్నే ఈ కీర్తనకు మూలము.

ఈ అజ్ఞానం, ఈ మూర్ఖత్వం...

పూర్వ జన్మల కర్మఫలమా?

లేదా హరి  మాయా? 

ఇది నింద కాదు. ఆచింత్యమైన విధి, మానవ వైఫల్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. ప్రతీ క్షణం అనేక అనుభూతులను మిగులుస్తూ, ముందు దారిని, వెనుక దారిని మూసివేస్తూ ఏమాత్రమూ అటునిటు కదులు స్వాతంత్రం ఇవ్వని ఈ బ్రతుకును ప్రజలు ఎందుకు తెలుసుకోలేకున్నారో ఆశ్చర్యము జాలి ఒకే సారి అనుభవిస్తారు. 

పెద్దతిరుమలాచార్యులు ఈ కీర్తనను మానవుల అహంకారముపై సంవేదనా భరితమైన పదములతో ప్రారంభిస్తారు - మనలో లోతుగా వేళ్ళూనుకొన్న వైఖరులను ఎండగొట్టారు.


 మొదటి చరణము: 

చీఁకటిఁ బెడబాపేటి చేరువ సూర్యోదయము
చీఁకటి కూబలకైతే చిమ్మి రేఁచును
యాఁకటతో విజ్ఞానము నందిచ్చే శ్రీ హరిభక్తి
కాఁకల దుర్మార్గులకుఁ గాన నీదూ॥ తాము॥ 

పదముల వివరణ:

కూబి = ఏమీ తెలియని వ్యక్తి, = పసిపాపలలాంటి హృదయం కలవారు = నిష్కళంకులు.

కూబలకైతే = నిష్కళంకులైనవారికైతే.

చిమ్మి రేఁచును = రెచ్చిపోవు, విజృంభించు (ఐతే ఇక్కడ ఆసక్తి చూపు అని తీసుకోవలెను).

యాఁకటతో = ఆకలితో అలమటించే వారికే (ఇక్కడ భగవత్ప్రాప్తికై తపన = ఈ దేహమంతా అపవిత్రమని గ్రహించి, ఆత్మస్వరూపమును మరచి దైవస్మరణతో దేవుని అనుజ్ఞకై వేచి ఉండే తత్త్వజ్ఞుల స్థితి).

విజ్ఞానము = దైవరహస్యము;

కాఁకల దుర్మార్గులకుఁ గాన నీదూ = అనుభవాల వల్ల హృదయం కఠినమైన దుర్మార్గులకు అది కనబడదు. 

భావము:

చీకటిని తొలగించే సూర్యోదయం దగ్గరలోనే ఉంది. కానీ నిష్కళంకులు - బాహ్య అనుభవాలకు దూరమైన నిర్దోష హృదయులు  చీకటిలో వున్నా కూడా దానిని నిమిత్త మాత్రముగా, సంతోషముగా స్వీకరించుదురు. అటువంటి సమబుద్ధి గలవారికే శ్రీహరి భక్తి అనే దైవరహస్యాన్ని విజ్ఞానరూపంగా అనుగ్రహిస్తారు. దేహ సంబంధ అనుభవాలతో హృదయాన్ని కఠినంగా మార్చుకున్న దుర్మార్గులకు అది కలగదు, కనబడదు. 


భావార్థ వ్యాఖ్యానం: 

ఈ చరణంలో పెద్దతిరుమలాచార్యులు మానవులు సత్యాన్ని గుర్తించలేని స్థితిని లోతుగా, తులనాత్మకంగా చిత్రించారు. 

చీఁకటిఁ బెడబాపేటి చేరువ సూర్యోదయము: ఇది ఒక బలమైన ప్రతీక. భక్తితో వచ్చే జ్ఞానం చీకటిని తొలగించే సూర్యుడిలాంటిది. అది ఎక్కడో దూరంలో లేదు; మనం తల తిప్పి చూడగలిగే దగ్గరలోనే ఉంది. (దాదాపు వెన్న చేతఁబట్టి నేయి వెదకనేల అనే అర్ధములో) 

చీఁకటి కూబలకైతే చిమ్మి రేఁచును: ఇక్కడ భగవద్గీత 2-69 శ్లోకాన్ని గుర్తుచేసుకుంటే (“యా నిశా సర్వభూతానాం...”) అన్వయం తెలుస్తుంది: సమస్త ప్రాణులకు (అనగా సామాన్య జనులకు) ఏది రాత్రియై దృష్టికి గోచరము కాక ఉన్నదోదానియందు (ఆ పరమార్ధ తత్వమునందు) ఇంద్రియనిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. (ఆత్మావలోకనం చేయు చుండును). నిష్కళంకులు చీకటిని తులనాడరు. ఎందుకంటే వారి లోపలి తపన ఒకటే. సత్యము కనుగొనుట. వారు తామున్న​ స్థితిపై విచారించరు. అభిప్రాయములు కలిగి వుండరు. (లోకరంజకము తమలోనిసమ్మతము) 

యాఁకటతో విజ్ఞానము నందిచ్చే శ్రీ హరిభక్తి : భక్తి అన్న దైవరహస్యాన్ని అందించేది తపనతో తనను తాను మరచి వున్న వారికే. ఈ మలమూత్రములతో కూడిన అపవిత్రమైన దేహాన్ని మరచి, (= "తాను"ఎవరనేది స్పష్టంగా మరచి) దేవుని అనుజ్ఞకై శాంతముగా, తొట్రుపాటు లేక వుండువారే దీనికి అర్హులు. 

ఈ సందర్భంగా అతనివెంబడి మౌనంగా నిలబడి వేచి ఉన్నవారు కూడా సేవ చేస్తున్నట్లే.  -జాన్ మిల్టన్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. 

కాఁకల దుర్మార్గులకుఁ గాన నీదూ: అనుభవాలద్వారా హృదయం కఠినమైపోయినవారు, దేహ సంబంధ విషయాలచే మలినమవ్వడం వల్ల, ఈ దైవరహస్యాన్ని గ్రహించలేరు. వారి దృష్టిలో ఇది అస్పష్టంగా ఉండిపోతుంది. అనుభవాలే వారికి చీకటి అయిపోయాయి.


ఈ చరణాన్ని ముగింపుగా ఇలా చెప్పవచ్చు:

దేవుడు కళ్లముందే ఉన్నాడు. వారు చూడాలన్న తొందర పడరు. అతడెలా ఉంటాడో తెలుసుకోవాలన్న కుతూహలమూ, తమకేమవుతుందో అన్న భయమూ లేకుండా — వారు నిశ్శబ్దంగా వేచి ఉంటారు. దైవం ఏం చేసినా, వారికి సమ్మతమే. బహుశా అందుకే... వెలుగు వారివైపు ప్రసరిస్తుందేమో. 


రెండవ  చరణము:

అందరు రుచిగొనేటి అన్నము బహురోగికి
కందువ నజీర్ణమై కారించును
యెందును శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు
మందమైన జడునికి మఱఁగులై తోఁచును
॥తాము


సాధారణ భావము:

అందరికి నచ్చే రుచికరమైన అన్నం కూడా — శరీరరోగాలున్న వాడికి అజీర్ణమై క్షోభ కలిగించుతుంది. అలానే, శ్రీహరిని గురించి చెప్పే ఉత్తమమైన జీవనపాఠాలు — మందమైన జ్ఞానం లేని జడులకు వ్యర్థమైనవిగా, అర్థం కానివిగా అనిపిస్తాయి.


భావార్థవిశ్లేషణ​: 

విలోమాలంకారాల​ పరంపర: ఈ కీర్తన ‘విలోమ అలంకార’ తత్వాన్ని అనుసరిస్తుంది — అర్థాన్ని ప్రత్యర్థంగా నిలిపే ప్రక్రియ. అందుకే పద ప్రయోగం కొద్దిగా తిప్పి చూపినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇందులోని భావప్రపంచం అపారమైనది.


 అన్నము’ అనే ప్రతీక: ఇక్కడ "అన్నము" అనేది ఆధ్యాత్మికం, సత్యం, జీవన శుద్ధి వంటి విశ్వవిలువల సంకేతం. ఇది పండితులు, భక్తులు, యోగులు — అందరూ “రుచిగొనేటి” అన్నం.


కానీ అది బహురోగికి అంటే శారీరక రోగం మాత్రమే కాదు —
అభిప్రాయ భ్రమలు, ద్వేషాలు, అసూయ, వ్యంగ్యం, అసహనం, అహంకారం వంటి మానసిక కాలుష్యం కలవారికి జీర్ణించదు.


జీర్ణశక్తి అంటే ఇక్కడ సత్యాన్ని స్వీకరించగల చిత్తశుద్ధి. అది లేనప్పుడు ఎంత మంచి విషయమైనా "కారించును" — వికారం కలిగిస్తుంది.


మందమైన జడునికి = "తన అనుభవానికి వచ్చినదే, తాను నమ్మినదే సత్యము" అను పొరలతో కప్పబడిన జ్ఞానులు.


 చదువులు” అన్న పదంలో దాగిన తత్వంజీవితసూత్రాలు”:

  • లోపలి నుంచి వచ్చిన సమ్మతము
  • ఉన్నదానితో తృప్తి
  • హింసను దాటిన అంతర్గత​ శాంతి
  • నిరాహంకారంగా జీవించగల దైవశరణాగతి 

ఈ విలువలు — ఆధునిక సమాజానికి అనర్థకంగా, ప్రతికూలంగా, తిరోగమనముగాను కూడా అనిపించవచ్చు.


 “విజయం” అంటే పోటీగా ఎదగడం అనే అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటాయి కనుక.

అందుకే మందమైన జడునికి ఇవి “మఱఁగులై తోఁచును” - పనికిమాలిన అభిప్రాయాల్లా అనిపిస్తాయి.


శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు: పెదతిరుమలాచార్యుల దృక్కోణం. 

పెద్దలు, జ్ఞానులు చెప్పిన మాటలు మనకు అర్థం కావడం లేదు అంటే

ఆ మాటల్లో లోపం లేదు, మన చిత్తంలో లోపముంది.

ఈ చరణం మనకు ఒక అసాధారణమైన ప్రతిబింబాన్ని చూపుతుంది: 

నిజమైన విద్య మనకి అసహ్యంగా అనిపిస్తే, మనం రోగులమన్నమాట​ 

దీనిని పల్లవితో కలిపి చూడకపోతే సగమే విన్నట్లు:

తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ - మనమే తెలుసుకోలేకపోతున్నాం, చెప్పినా వినలేకపోతున్నాం. 

అందుకే వేలాది మతగ్రంథాలు ఉన్నా, సగటు మానవుడి జీవితం మారటంలేదు - ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. - అందుకే మనము గమనిస్తున్న ప్రపంచములోని అలజడి. అశాంతి. మనమే సృష్టిస్తున్న అల్లకల్లోలం.


మనం చదువుకుంటున్నది జీవనోపాధి కోసమేనా?
జీవితం కోసం మనం ఏమైనా చదువుతున్నామా?
చదువుతో మన ప్రవర్తన మెరుగు అవుతోందా?
లేక మనం అలవాటు పడిన పాత ధోరణినే కొనసాగిస్తున్నామా? గత యాభై సంవత్సరాల చరిత్ర గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. అదేం బ్రహ్మవిద్య కాదు.

అటువంటి చదువులూ చదువులే?​


మూడవ చరణము:

ధరఁ గొందరు మూర్ఖులు తగ నొక్కరాజుఁ గొల్చి
పరిచారకునిఁ దిట్టి భంగ పడ్డట్టు
యిరవుగ శ్రీ వేంకటేశుఁ గొల్చి వారివారి

విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు       ॥తాము॥

విరసము = విరుద్ధరసము గలది; విరసాలాడుచుఁ = విరుద్ధములైన విషయములలో పనికలుగఁజేసుకొని. 

 (పెదతిరుమలాచార్యులు వారు  మానవుని మూర్ఖత్వం గురించి ఇంకా ఇలా అంటున్నారు). సర్వము ఒకటే అని గ్రహించక కొందరిని రాజులుగా వూహించి కీర్తిస్తూ, కొందరిని పరిచారకులుగా భావించి ధిక్కరించుచూ  కాలము గడుపుతారు. దైవము తెలియక భంగపడుదురు. శ్రీ వేంకటేశుఁ గొల్చుతున్నప్పటికీ తమతమ అనుభవాల మేరకు విరుద్ధములైన విషయములలో పనికలుగఁజేసుకొని, జీవించుటలో విఫలులై పోదురు.


భావార్థవిశ్లేషణ​:

 

ధరఁ గొందరు మూర్ఖులు తగ నొక్కరాజుఁ గొల్చి
పరిచారకునిఁ దిట్టి భంగ పడ్డట్టు

పెదతిరుమలాచార్యుల దృష్టిలో భక్తి అభ్యాసం వల్ల వచ్చే అలవాటు కాదు. భక్తి మానవులు ఎంచుకునే అభిమతం కాదు.

దానిని అలవరచుకోవడం సాద్యంకాదు.

ఎందుకంటే — ఎదోవొక దశలో తెచ్చిపెట్టుకున్న ఓర్పూ, సహనమూ ఒక్క క్షణంలో విచ్ఛిన్నమైనట్లు…

భక్తి కూడా అస్తమించిపోవచ్చు. 

చుట్టూజరుగుతున్న ఘటనలను గమనించండి — ఓర్పూ తాలిమీ లేకుండానే

ప్రపంచం నేడు యుద్ధాలతో, దాడులతో, మానవ సంహారాలతో తల్లడిల్లుతోంది.

 

కాబట్టి “నాకు భక్తి ఉంది” అని చెప్పుకునే ముందు

ఒకసారి మనలోకి మనమే తిరిగి చూసుకుందాం.

సమర్పణ భావంతో కూడిన భక్తి, శరణాగతి అనే స్థితి

ఎన్నో అవాంతరాలను దాటి

మానవుడు సాధించగల గంభీరమైన, అలౌకికమైన స్థితి.

 

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు

ఒకే విషయాన్ని చెబుతున్నాయి —

ఈ ప్రపంచంలో కనిపిస్తున్నవన్నీ దైవస్వరూపమే.

ఈ సృష్టిలో తారతమ్యాలకు తావు లేదు.

అయితే మన వక్రమైన బుద్ధి వల్ల

మనం ఎక్కువ తక్కువలను, మంచి చెడులను నిర్ణయించి జీవించడానికి ప్రయత్నిస్తాం. ఒకణ్ణి రాజుగాను, ఇంకొకణ్ణి బంటుగాను చూస్తాం. అంతా సమానమైతే ఈ వ్యత్యాసాలకు తావునిస్తున్నదేమి?

ఆ విధంగా వచ్చిన మన నిర్ణయాలు

లోపభూయిష్టమైనవే అని

పెదతిరుమలాచార్యులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.


వారివారి విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు: దీన్ని వివరించడానికి ‘అజుని వ్యథ’ అను పేరుగల రాజా రవివర్మ చిత్రలేఖనంతో కలిపి చూద్దాం.  అది ఒక మౌన వర్ణ సమ్మేళనం - నిశ్శబ్ద ఆలాపన​.


రాజా రవివర్మ గారి అత్యంత లోతైన భావోద్వేగ చిత్రాల్లో ఒకటి. రాజు అజుని వ్యక్తిగత దుఃఖాన్ని చూపరులకు హృదయాల్లోకి చొచ్చుకొని పోయేటట్లు తెలియజేస్తాడు. తన ప్రియమైన భార్య విదర్భ రాణి ఇందుమతిని అనుకోని మరణం కారణంగా కోల్పోవడాన్ని, ఆ తరువాత శోక సముద్రములో మునిగిన  అజుని  వ్యథను కన్నులకు కట్టినట్లు చూపుతుంది.

ఈ చిత్రం గాఢమైన చిత్రకవిత్వం. ఘటనకు మునుపు, ఆజుడు, ఇందుమతి వనములో విహరించుచున్నట్లు తెలియగలము. ఇందుమతిపై అనుకోకుండా, అకస్మాత్తుగా మాల పడడంతో మరణిస్తుంది. ఆజుడు దుఃఖంలో మునిగి, ఆమె పక్కనే కూర్చొని, చేతులోకి పుష్పమాలను తీసుకొని వుండటం గమనించవచ్చు.  ఆ సంఘటన దురదృష్టాన్ని, ప్రేమకు మరియు విధికి మధ్య సంఘర్షణను చిత్రిస్తుంది. ​ 

చిత్రం లోగడ విధాలుగా అర్థవంతమైన చిహ్నాలతో నిండి ఉంది:

  • పుష్పమాలవిధికి, తాత్కాలికతకు ప్రతీక. కానీ ఆ క్షణంలో, అది ప్రాణాంతక యమదూత. అనంతరం, ఇందుమతి అకాల మరణానికి మాటలురాని సాక్షి.
  • అజుని దుఃఖం — అతని భంగిమ పూడ్చలేని కష్టమును, నిస్సహాయతను, "ఇలా అయినదే?"మనే ప్రశ్నను చేతలలో పలికిస్తుంది.  అతని తీరును శోక సంగతిని ఆ చిత్రపటమును చీల్చుకొని మన గుండెల్నితాకుతూ మనలను ఆ దృశ్యములో భాగము చేయును.
  • ప్రకృతి నేపథ్యం - నిశ్శబ్దంగా, వెనుకకు తప్పుకొని, మౌన సాక్షిగా అజుని ఆవేదనను  ఆర్భాటములేకుండా, ఎల్లలను అధిగమిస్తూ మన మనస్సులలో నిక్షేపిస్తుంది.

 

ఈ చిత్రం కేవలం రాజు దుఃఖం గురించి కాకుండా, ప్రేమను కోల్పోవుటలోని వ్యథను, మానవ బలహీనతల యొక్క సార్వజనీనత్వాన్ని తెలిపేది. రవివర్మ నైపుణ్యం ఇతిహాస, పురాణ కథలను మనసును తాకేవిధంగా అందరికీ చూస్తూనే అర్ధమయ్యే మానవుని అంతరంగ భావాలుగా మార్చడంలో గమనించవచ్చును.


వారివారి / విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు = మనమంతా కూడా పైన చిత్రంలో చూపించిన మాదిరిగానే, మనల్ని పరీక్షించు, విధి  కల్పించు అవస్థలను ఆ  అజుని లాగానే మరుక్షణమే అంగీకరించలేక ప్రశ్నించుతూ  విధికి, కాలమునకు వ్యతిరేక దిశలో పని చేయుచూ విఫలులైపోదుము. 

ఈ కీర్తన పల్లవి యొక్క అంతరార్థం కూడా ఇదే. ఈ రకముగా మానవులు విధివ్రాతను మనస్ఫూర్తిగా అంగీకరించక, సత్యం నుండి దూరం జరిగి కాలక్షేపము చేయుదురు. జీవితమను దానిని నిర్వర్తించుటలో విఫలులైపోదురు. 

అలా, ఒక మహాకావ్యమనతగు కీర్తన ముగింపుకు వచ్చేశాం. ఇది చరిత్రకు, కాలానికి అతీతమైన పుష్పము. బంగారు పలకలపై చెక్కించదగ్గ కవిత్వం. 

ఈ కీర్తనలోని పూర్తి లోతును వివరించడానికి నా మాటలు చాలవన్న భావన నన్ను ఇంకా వెంటాడుతోంది. నా మాటలు దిశను చూపించే బాటలు మాత్రమే. ఇది వర్ణనకు అతీతమైన ఒక సత్యానికి సంకేతం — చదవదగిన, వినదగిన కవిత్వమే కాకుండా, మన హృదయాల్లో ప్రతిష్టించదగిన నైవేద్యం.

Thursday, 15 May 2025

A 222 పెదతిరుమలాచార్యులు

 పెదతిరుమలాచార్యులు — మౌన తపస్వి

 

పెదతిరుమలాచార్యులు (1460–1546) అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది — "అన్నమాచార్యుల కుమారుడు" అన్న పరిమితి. కానీ ఆయన తండ్రి చాటు కవి కాదు. ఆ వారసత్వాన్ని శోభాయమానంగా మలుచుకుని, స్వతంత్రముగా సాగించిన అంతరంగ ప్రయాణంలో వేలాది కీర్తనలు మనకు ప్రసాదించిన మహాకవి. 

ఆయన పేరు ప్రఖ్యాతులను కోరలేదు. గొప్ప కవిగా కనిపించాలన్న ప్రయత్నం చేయలేదు. ప్రశాంతంగా, ప్రశ్నిస్తూ, నిష్కల్మషంగా తనదైన మార్గంలో నడిచారు.

 

భక్తికి లోతు తాకాలి అన్నదే ఆయన తత్వం

ఆయన భక్తుడు. కానీ భక్తి ఆయనకు పూజలు, పాటలు, లేదా అలంకార భవనాల విషయమేమీ కాదు. భక్తి ఒక లోతైన విచారణకు మార్గం కావాలి అని ఆయన భావించారు. "నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? నా ఊహలో సృష్టించుకున్నదేనా? లేక నిజంగా ఆ దేవుని అనుభవిస్తున్నానా?"ఇలాంటి ప్రశ్నలు ఆయన గానం చేసేటప్పుడు మనం వినగలుగుతాం. 

ఆయన భక్తిని త్రివేణి సంగమంలా చూస్తాం — ప్రేమ, ఆర్ద్రతతో కూడిన విచారణ, నిజాయితీ కలిసి ప్రవహిస్తాయి.


సంసారంలో ఉండి, సంసారానికి అతీతంగా

ఆయన సన్యాసి కారు. కుటుంబ జీవితాన్ని పూర్తిగా జీవించారు. బాధ్యతలతో జీవించారు. కానీ ఆ సంసారం​ ఆయనను బంధించలేదు. లోపల మాత్రం ఒక అంతర్లీన స్వేచ్ఛ ఆయనలో అలలాడుతూ కనిపిస్తుంది. 

పెదతిరుమలాచార్యులు కుటుంబాన్ని ఒక భారం గా కాకుండా, ఒక దర్పణంగా చూశారు — అందులోనే మనల్ని మనం గ్రహించవచ్చు. మన బలహీనతలు, ఆశలు, భ్రమలు బయటపడతాయి.


సాదా పదాల్లో సత్యాన్ని పలికిన కవి

ఆయన పదాల్లో ఉన్నది కవిత్వం మాత్రమే కాదు - అన్వేషణ. కళా తపస్సు. అవి కనుల ముందు కనిపించే వాటిలో దాగిన గంభీరతను వెలికితెస్తాయి. అవి ఇతరులను మెప్పించేందుకు కాదు. తనలోని ప్రశ్నలకు స్పందనగా తలచిన కీర్తనలు. 

ఈ పాటలు మొదట్లో కాస్త క్లిష్టంగా అనిపించవచ్చు. కానీ మనం నిశ్శబ్దంగా కూర్చొని వినినప్పుడు —మన హృదయాంతరాళాలో ఆ దృశ్యాలు తారాడతాయి.


సాంప్రదాయం అనుసరించలేదు — జీవించారు

ఆయనకు వారసత్వంగా వచ్చిన భక్తి, ఆచారాలు అన్నింటినీ పెదతిరుమలాచార్యులు గౌరవించారు. కానీ గుడ్డిగా అనుసరించలేదు. ఆయనకు పద్ధతులు ముఖ్యం కాదు. వాటి వెనుక ఉన్న తత్వం ముఖ్యం. అందుకే, ఆయన రచనల్లో మౌనం ఉంది. శబ్దం లేదు. వేదాంతం లేదు. ఒక అంతర్లీన జీవన సత్యమే నాట్యమాడుతుంది.


కనిపించని ఓ వెలుగు 

ఆయన రచనల్లో సముద్రపు లోతుల్లాంటి ప్రశాంతత అలముకుంటుంది. అపారమైన నిజాయితీ, ప్రశ్నించగల ధైర్యం, మానవత్వపు గుండె గర్భం నుంచి ఊట్టిపడుతున్న ఆర్ద్రత, హృదయ ప్రకంపనలతో ఏర్పడిన పదములు — ఇవే ఆయన కవిత్వానికి మూలాధారాలు. 

మానవ జాతికి పెదతిరుమలాచార్యులు ఓ గొప్ప దిక్సూచి. కీర్తనల ముసుగులో ప్రశ్నించే తపస్వి. సంప్రదాయకుడు కాదు. సత్యాన్వేషి. తనలోకి తానే జారుకుని— మనలో వెలుగు నింపినవాడు. మన తెలుగుజాతికి పెద్ద దిక్కు పెదతిరుమలాచార్యులు.

X-X సమాప్తంX-X


Pedatirumalacharyulu — The Silent Seeker

For most people, Pedatirumalacharyulu (1460–1546) is remembered simply as the son of the great Annamacharya. But he was no mere shadow of his father. He inherited that luminous legacy and carried it forward with quiet strength. In the course of his inward journey, he offered us thousands of kirtanas — not as a display of brilliance, but as a reflection of an inner quest.

He never sought fame. He made no effort to appear as a great poet. Calmly, questioningly, with untainted sincerity, he walked his own path.


For him, devotion meant depth — not display

He was a devotee, yes. But to him, devotion was not about rituals, songs, or temple decorations. It was a path of inquiry — a means to touch the depth of being. “Who is the God I worship? Is it just a projection of my imagination? Or am I truly experiencing the divine?”— Questions like these echo gently in his compositions. 

His devotion feels like a confluence of three sacred streams: love, inquiry steeped in tenderness, and uncompromising honesty.


In the world, yet untouched by it

He was not a renunciate. He lived a full family life, bearing responsibilities with quiet dignity. But worldly life never imprisoned him. There is a current of inward freedom always shimmering beneath the surface. 

He saw family life not as a burden, but as a mirror. In it, we see ourselves more clearly — our weaknesses, longings, illusions rise to the surface.


A poet who gave voice to truth in plain words

His verses carry profound depth. But it's not showy. His art is a kind of spiritual austerity — unpolished, unpretentious, quietly intense. His kirtanas do not aim to please others. They are songs born of his own inner search, his longing for clarity.

To a casual listener, the songs may seem difficult at first. But if one sits in silence and listens, the imagery begins to resonate within — painting quiet pictures on the heart’s canvas.


He didn’t follow tradition. He lived it.

Pedatirumalacharyulu respected the traditions and practices he inherited — but never followed them blindly. For him, rituals were not important unless they pointed toward truth. It was never the outer method that mattered, but the inner meaning. That’s why his works are marked not by noise, but by silence. Not by doctrine, but by direct experience. Not by rhetoric, but by a living truth that moves through stillness.


A quiet flame, not a blazing fire

His writings hold a calm, oceanic depth. They are rooted in integrity, in the courage to question, in a tenderness that springs from a deeply human heart. His words arise from the tremors of the soul — not as philosophy, but as lived insight. 

Pedatirumalacharyulu may not be widely celebrated today. But that does not mean he did not light a lamp. His flame was not a loud spectacle — it was a quiet, unwavering glow. To see it, we too must become a little silent, a little inward. 

To the Telugu people — and to any seeker — Pedatirumalacharyulu stands not merely as a poet, but as a guiding presence. A sage in disguise, questioning through song, living through silence.

 X-X The End X-X

Saturday, 10 May 2025

T-221. ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా

 అన్నమాచార్యులు

221. ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా 

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బేరైనం గలదే

For English version press here 

ఉపోద్ఘాతము:

అన్నమాచార్యుల వారి పరిశీలనలు మానవుల చరిత్రంతా వడపోసి కూర్చి పేర్చిన అనుశీలనలు - అని చెప్పేందుకుఈ ఒక్క కీర్తన సరిపోతుంది. వారు ప్రసాదించిన ఈ దివ్యము అలౌకికము ఆగు ఈ సంపద మరుగున పడకముందే తెలియచెప్పు ప్రయత్నమిది. కాలప్రవాహంలో సామ్రాజ్యాధిపతులు కానీ చక్రవర్తులు కానీ ఎంత శక్తిమంతులు కానీ మహాత్ములు కానీ సామాన్యులు కానీ నామరూపములు లేక మరుగున పడిపోవుదురు. 

కీర్తన సారాంశం

ఈ కీర్తన కేవలం భగవంతుని మాయగురించి కాదు - ఇది మన జీవితాన్ని అద్దంలో చూపే దర్పణం. అహంకారంతో జీవిస్తే జీవితం ఓ వ్యర్థమైన పరుగు; శరణాగతితో జీవిస్తే అది తెలియరానిదైన పరమమునకు అర్పణగా మారుతుంది. 

ఈ కీర్తన  నిశ్శబ్దంగా బోధించేది ఇదే - జ్ఞానం కాదు, వినయము అణకువ, మౌనము ద్వారములౌతాయి దైవానికి.



అధ్యాత్మ కీర్తన

రేకు: 158-2 సంపుటము: 2-276

ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా
వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా         ॥పల్లవి॥
 
లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట
ఆకాశ మింతంతని యనరాదట
మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట
శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా  ॥ఎంత॥
 
అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట
వెలయఁ గాలము గంటు వేయరాదట
కలయ నలుదిక్కులకడ గానఁగరాదట
జలజాక్ష నీరూపు తలపోయఁగలనా ॥ఎంత॥
 
కేవలమైన నీమాయ గెలువనేరాదట
భావించి మనఁసు జక్కఁ బట్టరాదట
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా          ॥ఎంత॥

Details and explanations: 

ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా
వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా     ॥పల్లవి॥ 

వెసఁ దెలిసేమా = వెంటనే తెలియగలమా? (లేం) 

భావము: ఇది దైవస్వరూపాన్ని తెలుసుకోవడంలో మానవ ప్రయత్నాల విఫలత్వాన్ని వెల్లడిస్తుంది. సోదించుట (విష్లేషణాత్మక విచారణ) గానీ, చదవటం (గ్రంథపఠనం) గానీ ఆ విఖ్యాతమైన, విరూపమైన, వింతదైన దేవమూర్తిని పూర్తిగా గ్రహించలేవు. 


"ఎంత సోదించి చూచినా"

ప్రతి శోధనకూ ఒక లక్ష్యం ఉంటుంది — అంటే మనకు తెలిసిన దానిని అనుకున్న దానిని చేరుకోవాలన్న ఆకాంక్ష. కానీ దేవుడు నిజంగా ఎక్కడున్నాడో తెలుసుంటే, శోధన ఎందుకు?

ఒకవేళ​ తెలియకపోతే, తెలియనిదాన్ని చూస్తూ 'తెలుసుకున్నాం' అనటమెలా సాధ్యం?

ఈ పాదంలో అన్నమాచార్యులు మన శోధనల వెనుక దాగి ఉన్న ఊహల్ని, భ్రమల్ని ప్రశ్నిస్తున్నారు.


ఎన్నెన్ని చదివినా 

అన్నమాచార్యుల దృష్టిలో చదువు అనేది ఇప్పటికే తెలిసిన విషయాలను కూడగట్టే ప్రక్రియ మాత్రమే అది విముక్తికి లేదా స్వేచ్ఛకు మార్గం కాదు. అందుకే, ఆయన తరచూ విద్యాపరమైన వ్యవస్థలను వాటి పరిమితులను, విమర్శించారు.

ప్రపంచమంతటా చదువు అనేది ఒక వ్యవస్థాపిత అభ్యాస పద్ధతిగా ఉంది. ఈ నేపథ్యంలో "ఎన్నెన్ని చదివినా" అనేది “దేవుని వంటి తెలియనిది (వ్యక్తపరచలేనిది)” అర్థం చేసుకునే విషయంలో ఆయా వ్యవస్థలు చేతగానివని సూచిస్తుంది.


వెసఁ దెలిసేమా 

ఈ పదం మన ఇప్పటి తెలివితేటల ద్వారా దైవస్వరూపాన్ని గ్రహించాలన్న ఆశ నిష్ఫలమని చెబుతోంది. మన విషయ గ్రహణ పద్ధతులన్నీ: మొట్టమొదట చూసి, తాకి, విని, వాసనతోను  అందుకొని, ఆపై గతానుభవాలతో పోల్చి, అంచనాలు వేసే తత్వమే — మన పరిమితమైన తెలివి. 

"వెసఁ దెలిసేమా" అనేది — ఆ అంతరంగికమైన సత్యం, ఈ మధ్యవర్తిత్వంలేకుండా, వడపోతలనుంచి (ఫిల్టర్ల ద్వారా) తేర్చబడ్డ ఆలోచనలకు అతీతంగా, వెనువెంటనే — ఒక్కసారిగా తెలియగలమా? అని ప్రశ్నిస్తుంది.


వెసఁ దెలిసేమా

తలపుతో కాదు

తలవక నేమో

ఊహతో కాదు

ఊరకుంటే నేమో

చేతలతో కాదు

చేష్టలుడిగితేనేమో

పనిగా కాదు

మానితేనేమో

వేదనతో కాదు

వదిలితేనేమో

వాదములతో కాదు

వాయిద్యమైతేనేమో

 


అన్వయార్థము: 

ఓ అన్వేషకుడా!
పుస్తకాలు తిప్పడం, విచారణలలో మునిగిపోవడం ద్వారా పరమాత్మను తెలుసుకోలేం.
అనంతాన్ని మన చిన్న మనసుతో పట్టుకోవడం అసాధ్యం.
అతనిని చేరాలంటే, మన అశక్తిని హృదయపూర్వకంగా అంగీకరించి —
ఆ అంగీకారమే తిరుగులేని జ్ఞానంగా గ్రహించి, నిశ్చలంగా ఉండాలి.


మొదటి చరణం

లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట
ఆకాశ మింతంతని యనరాదట
మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట
శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా      ॥ఎంత॥ 

మేకొని = పూనుకొని,  by taking up a task, to indulge. మితి = పరిమితి, పరిమాణము, limit, quantum. 

భావము: సులభగ్రాహ్యం


Interpretive Commentary: 

మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట

భూమ్మీద రేణువులన్నీ లెక్కించాలంటే మన ఇప్పటి జ్ఞానం తడబడుతుంది.

బహుశా ఏ గణక యంత్రము (కంప్యూటర్) కూడా కచ్చితంగా చెప్పలేదు.

శ్రీకంఠా నీ మహిమల తీరు అదే  - అవి లెక్కలకు దూరం, మాటలకు అందవు.

ఇలా అన్నమాచార్యుల వారు పరిమితుల్లేని పరమాత్మతత్వం చూపుతారు.


యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహ” (తైత్తిరీయ ఉపనిషత్) అంటే -"దేనినైతే మాటలు తాకలేవో, దేనినైతే మనస్సు గ్రహించలేదో - అదే పరమతత్వం." 

చెప్ప చూపవశమా” — అన్నది ఆ ఉపనిషద్ వాక్యానికి తెలుగు ప్రతిధ్వని. 

వాక్యాలూ, ఆలోచనలూ ఎక్కడే నిలిచిపోతాయో. అచ్చట నుండి నిజమైన  తత్వం మొదలవుతుంది.


రెండవ చరణం:

అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట
వెలయఁ గాలము గంటు వేయరాదట
కలయ నలుదిక్కులకడ గానఁగరాదట
జలజాక్ష నీరూపు తలపోయఁగలనా       ॥ఎంత॥ 

భావము: గాలిని తెచ్చి మూట గట్టగా రాదట. చక్కగా అందరికి తెలియునట్లు కాలమునకు ముళ్ళు లేదా గుర్తులు వేయలేము. నలుదిక్కులా కాళ్ళరిగేలా తిరిగినా అంతం తెలియరాదుట. ఓ జలజాక్ష!  నాకు నీ రూపు తల పోయగల సామర్థ్యం కలదా? 

ఈ చరణంలో అన్నమాచార్యులు మనకు అనుభూతి చెందే భావనలకు, బుద్ధికీ అందని తత్వాల గురించి చెబుతున్నారు.


గూఢార్థవివరణము 

ఈ చరణంలో అన్నమాచార్యులు మనం అనుభవించగలిగె కానీ అర్థం చేసుకోలేని తత్వాల గురించి చెబుతున్నారు. అంతేకాదు - ఈ ప్రపంచంలోనే, ఈ అస్తవ్యస్త, మురికి కూపములోనే  భగవంతుని దర్శించవచ్చని సూచిస్తున్నారు ఆచార్యులు. 

గాలి -అనుభూతి చెందగలము, కానీ పట్టి మూటగట్టలేము.

కాలం -నిత్యం కదులుతుంది, కానీ దాన్ని నిలిపివేయలేము. నియంత్రించలేము.

నలుదిక్కులు - ఏ దిశలోనైనా మన జ్ఞానం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.


అన్నమయ్య తరవాత అడిగేది: "నీ రూపు తలపోయగలనా?" 

ఇది కేవలం వినయాన్ని చూపడం కాదు - ఆలోచన అనే మనస్సు చర్యలకు కూడా హద్దు ఉందని ఒప్పుకోవడం. 

ఈ చరణాంతంలో, సాధకునికి చివరిదిగా మిగిలేది ధ్యానం - దానినీ అన్నమయ్య తొలగిస్తారు. ఆ తర్వాత మిగిలేది: శరణాగతి -  సంపూర్ణ విశ్వాసముతో కూడిన భక్తి. అది ఒక నిశ్శబ్ద నిమజ్జనం. ఆలోచనలను అధిగమించి, నిశ్శబ్దంగా తానంతట తానుగా దీవింపబడే అనుభూతి. 

మొదటి చరణం పరిమాణాన్ని తిరస్కరించింది.

రెండవ చరణం గ్రహణాన్ని తిరస్కరిస్తుంది.

ఈ రెండు కలిసి మనల్ని ఒక పెద్ద వీడుకోలుకు సిద్ధం కమ్మంటున్నాయి - ఆలోచనలను  దాటివున్న నిజమైన తత్వాన్ని తాకేందుకు.


 వెలయఁ గాలము గంటు వేయరాదట
= "కాలమనే నిత్య ప్రవాహంపై మానవుల ముద్ర నిలవదు 

దీనిని "విలియం హిగ్గిన్సన్ వేసిన "రూపాంతరణం (మెటామొర్ఫొసిస్)" అనే అధివాస్తవిక శైలి కళాఖండాన్ని వివరించు కుంటూ తెలుసుకుందాం.



"విలియం హిగ్గిన్సన్ యొక్క "రూపాంతరణం (metamorphosis)" అనే కళాఖండం ఒక పెద్ద తివాచీ వంటిది. ఇది అంతం లేని కాలక్రమంలో నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండే మూలకాలు మరియు జీవులను చూపుతూ పరిణామం నిత్యసత్యమని, జీవ రూపాల అశాశ్వతత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. అతను తెలిసిన వస్తువులను అపరిచిత సందర్భాలలో ఉంచడం ద్వారా, మన అవగాహనను మరియు చరిత్రను సవాలు చేస్తూ దిగ్భ్రాంతిని కలిగిస్తాడు. హిగ్గిన్సన్ యొక్క కలల వంటి భావన కలిగించే చిహ్నాలు కాలం గడిచేకొద్దీ ఉనికి యొక్క అశాశ్వత స్వభావాన్ని మరియు జీవిత చక్రీయ నమూనాలను అన్వేషిస్తాయి. 

పరిణామము - మిళిత అనుభవం: ఎండిన బేరిపండు (pear fruit) నుండి పొడుచుకొస్తున్న వేళ్ళు, చిన్న ఆకులు కొత్త ఆశలు చిగురించడాన్ని చూపుతుంది. అయితే, ఏ మార్పు కూడా కొంత ఘర్షణ/కష్టం లేకుండా సంభవించదని ఎండి, పగిలివున్న బేరిపండు తెలుపుతోంది. పిల్లల్ని కనడం అంటే పునర్జన్మతో సమానమని పెద్దలన్నారు కదా. ఆ చిత్రంలో భూమి నేపథ్యం మాత్రమే కాదు. భూమి స్వయంగా క్రియాశీల పాత్ర వహిస్తుంది. కొండ గుట్టల వెనుక నుంచి పుట్టుకొస్తున్న శరభములు (mammoths) నిరంతర మార్పును, పుట్టుక యొక్క అస్పష్ట స్వభావాన్ని నొక్కి చెబుతాయి. జీవులు, భూమి మరియు మానవులు ఒక గొప్ప పరిణామ క్రమంలో భాగమని సూచిస్తుంది. ఇక్కడ పునర్జన్మ అన్నది సన్నివేశాల వరుస కాదు; అది విస్తరించి ఉండే పొరల మేళవింపు - శరభములు, మానవుడు, పండు, భూమి — ఇవన్నీ ఒకే క్షణంలో పుట్టుక, మరణం, ఆశ, శూన్యత — అన్నింటినీ మిళితంగా అనుభవిస్తాయి. 

ఆశ్చర్యం, అంగీకారం: హిగ్గిన్సన్ చిత్రాలలో అనేక చిహ్నాలు ముఖ్యమైన అర్ధాన్ని కలిగి ఉంటాయి. సూట్‌కేస్‌తో ఉన్న వ్యక్తి ఆ అనంతమైన శరభముల పంక్తి ప్రయాణాన్ని చూస్తూ; ఒక రైలు బండి వెళుతుంటే చిన్నపిల్లవాడు ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా కనబడుతుంది. ఆ సూట్‌కేస్ మిథ్యా జ్ఞాపకాలను; అతని దుస్తులు నాగరికతతో తెచ్చిపెట్టుకొన్న సభ్యతను చూచిస్తాయి. మానవులు తమ పరిమిత సామర్థ్యాన్ని అంగీకరించక, ఆ కనబడుతున్న జీవులలో తానొకనిగా కాక తానే వానికి యజమానిని అను స్వభావమును తెలుపుతుంది. నిర్మానుష్యమైన ఎడారి లాంటి భూమి మనిషి ఒంటరిగా వాస్తవికతను ఎదుర్కోవలసి ఉంటుందని చూపిస్తుంది. మీరు చిత్రంలోని ఎడారిని మనిషి ఒంటరిగా చూస్తారు — అదేమాత్రం ఖాళీ స్థలం కాదు. మనం మన ప్రస్తుత స్థితిలో గ్రహించలేనిది. అదొక ప్రతిధ్వని చేసే నిశ్శబ్దం. 

పరిణామ కర్మాగారము: శరభాలన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. పరిణామ ప్రక్రియ ఒక మాస్ ప్రొడక్షన్ కర్మాగారము కాదని తెలియవచ్చును. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ప్రత్యేకంగాను ఊహించలేకుండాను వుంటాయని కూడ అనుకోవచ్చును. హిగ్గిన్సన్ చిత్రంలో సమయం యెడతెగకుండా ప్రవహించదు. భగవద్గీతలో (13-16) చెప్పినట్లు అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ (విభజించనిదైనప్పటికీ విభజించినట్లు కనబడును). 

అనిత్యం: చివరగా, హిగ్గిన్సన్ యొక్క చిత్రం మానవ జీవితం యొక్క అనిత్యత్వాన్ని నొక్కి చెప్పుతూనే, కాలం యొక్క విస్తారతను అవిచ్ఛిన్నముగాను అనంతముగాను తెలుపుతుంది. అతని చిత్రాలు కల వంటి భావనను చెప్పకనే చెబుతాయి. వీక్షించువారి మదిలో అనూహ్యము, మేరలులేని కాలము యొక్క గతిని నిక్షేపిస్తాయి. 

కాలమునకు గంట్లు: ఇంత అని చెప్పలేని కాలమునకు గంట్లు పెట్టి, ఈ సమయాన్నుంచి ఫలానా వారు పుట్టారు, ఫలాన తేదీకి మరణించారు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కాక అసత్యము కూడా. శాలివాహన శకము విక్రమ శకము ఇప్పుడు కనుమరుగై పోయాయి. కొంత కాలానికి అవి పుస్తకాలలో కూడా మిగలవు. అదే పరిస్థితి ప్రస్తుతము వాడుకలో వున్న సమస్త కాల గణనలకు వర్తిస్తుంది."


మూడవ చరణం:

కేవలమైన నీమాయ గెలువనేరాదట
భావించి మనఁసు జక్కఁ బట్టరాదట
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా    ॥ఎంత॥ 

భావము: దైవము  అల్లిన మాయ గెలువలేము. యత్నముతో మనఁసు శాంతించదు. అలమేల్మంగపతివి శ్రీవేంకటేశ, నీశరణే గతి. మాకై మేము నిన్ను జేరి కొల్వగలమా? (లేము)


భావ ప్రవాహం: 

ఈ చరణం అంతరంగ మార్గానికి మలుపు. 

మునుపటి చరణాలలో బాహ్యప్రతీకలతో అనుభూతిని ఉటంకించిన అన్నమయ్య - ఇక్కడ జీవనమునకు దారితీయు సంగతిని బయట పెట్టారు. 

మాయ - అజేయం. 

ప్రయత్నంతో మనస్సు శాంతించదు. 

కాబట్టి, మనశ్శక్తితో విముక్తి సాధ్యం కాదు. ​ 

ఒక్కటే మార్గం - శరణాగతి. అది జ్ఞానానికి కాదు - అంతరంగంలో నిజముగా విచ్చేసి వున్న శ్రీ వేంకటేశునికి.


 కేవలమైన నీ మాయ గెలువనేరాదట” 

ఈ మాయ అనేది కేవలం ఒక ఆవరణ కాదు. ఒక పెరటి గోడ లాంటిది కాదు. దాన్ని దాటడం అసాధ్యం. 

ఇదే మాట భగవద్గీత 7.14లోనూ ఉంది:

"దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా"

అర్థం: త్రిగుణాత్మకము, దైవ సంబంధము అగు నా మాయ దాటడం దాదాపు అసాధ్యం. 

ఇదే భావన జిడ్డు కృష్ణమూర్తి: :ఆలోచనలతో స్పష్టత రాదు. కేవలం ఎంపికలులేని నిశ్శబ్దంలో నిలిచి గమనించడంలోనే విముక్తి లభించవచ్చు.


 భావించి మనఁసు జక్కఁ బట్టరాదట”

ఆలోచించటం వల్ల, కృషిచేయటం వల్ల మనస్సు శాంతించదు.

శాంతి  మంత్రాలు వల్లెవేయడం వల్ల శాంతి కలుగదు.

నీటిలో అలల లాంటి  ఆలోచనలే తటస్థతకు అడ్డుపడతాయి.

శ్రమను వదిలినపుడే మనస్సు తడబడదు. తేలికపడుతుంది. చర్య కాదు లయమే శాంతి.


శ్రీ వేం‍కటేశ! నిన్నుఁ జేరి కొల్వవశమా?” 

ఓ వేం‍కటేశా! మేము కోరి నిన్ను చేరి భజించగలమా? (లేము)

నీ కృప లేకుండా, నీ సంకల్పము లేకుండా నిన్నుచేరు యోగ్యత మాకెక్కడ? (లేదు)

మేము చేయగలిగినదేమీ లేదు. నీవే రక్షించాలి


X-X-సమాప్తం-X-X

238 alamElumaMga nIvanniTA noraparivi (అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి)

  ANNAMACHARYULU 238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి alamElumaMga nIvanniTA noraparivi తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. Introduction ...