తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
222.
తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ
ఉపోద్ఘాతము
పెద్దతిరుమలాచార్యులు
తండ్రి నీడలో కారు — ఆయన పక్కన నిలిచే తాహతు గలవారు. తండ్రిలాగే
లోతైన స్వరంతో గుండె తలుపులు తట్టుతారు. అన్నమాచార్యులు తరచూ తనను తానుగా
విడిచిపెట్టి భక్తిలో పరవశించిన అనుభూతులవైపు తీసుకెళ్తే, పెద్దతిరుమలాచార్యులు తల్లిలా అర్ద్రత కలిగిన కఠినత్వంతో - అనుభవం, అనుకంపనలను జోడించి — ఋషిలా మాట్లాడతారు.
అలంకారాలూ, అపవాదాలూ లేని స్వరంలో, ఆత్మసాక్షిగా.
ఈ ఒక్క కీర్తనతోనే ఆయన బహుళార్థసంపన్నమైన నైపుణ్యం ఆచంద్రార్కం నిలిచే స్థాయిలో వెలుగుతుంది.
ఉదయం, చీకటి, అమాయకత్వం, ఆకలి వంటి సాధారణ చిహ్నాలకు తాత్త్విక బరువును కలిపి మలచగల నేర్పు ఆయనది.
అజ్ఞానానికి రెండు రూపాల మధ్య — అవివేకములో పుట్టిన నిరాసక్తత, కరడు కట్టిన దుర్మార్గం — తేడాను స్పష్టంగా చూపుతూ మానసిక స్థితులపై అరుదైన స్పష్టతను వెలుగులోకి తీసుకొస్తారు.
చివరికి - భక్తి అనేది సహజంగా వచ్చే లక్షణం కాదు; సిద్ధమైన
హృదయానికి దక్కే వరం అన్న ఆయన ప్రకటన - దివ్యమైన కృపను,
మానవుల తిరస్కారాన్ని రెండింటినీ చూసిన సాక్షాత్కారపు వాక్యం.
ఆయన అన్నమాచార్యుల కొడుకు మాత్రమే కారు — తండ్రి లోపల దాగిన అంతర్జ్వాలకి ఉత్తరాధికారి.
సారాంశం
ఈ పాట అసాధారణము మరియు అద్వితీయము. ఇది ఒక కవి చేతిలో మనోహరంగా రూపు దిద్దుకున్న తత్త్వశిల్పము. కత్తిలాంటి పదునుతో, పోనీలే అను ఉదాసీనతకు అశ్రద్ధకు తావివ్వక, కనికరము, దయ ఉట్టిపడుతూ వున్న ఆత్మీయ ఉపదేశం అనుకోవచ్చును. పెద్దతిరుమలాచార్యులు ఒక ఋషిలా ఆనతిచ్చిన సంస్కరణము. ఆయన హితబోధ చేయరు - గమనించిన సత్యాన్ని కొన్ని పదాల్లోనే - మనిషి అజ్ఞాన వైఖరిని కళ్ల ముందు కనిపింపచేస్తారు.
తాముఁ దెలియరూ — మనల్ని మనమే తెలియని స్థితి,
మనకు మేలు చేసే దానిని తిరస్కరించడం,
రుచుల వెంట పరుగిడి అసలు తత్త్వాన్ని మర్చిపోవడం,
అర్థం లేని ఆర్భాటాలను భక్తిగా భ్రమించుకోవడం,
ఇలా చేయడంతో అసలైన సూక్ష్మ సత్యం మనకు కనిపించకపోవడం.
అధ్యాత్మ కీర్తన |
రేకు: 24-2 సంపుటము: 15-136 |
తాముఁ
దెలియరూ తగఁ జెప్పిన వినరూ
పామరపుఁ
దమ కర్మఫలమో హరిమాయయో ॥పల్లవి॥ చీఁకటిఁ
బెడబాపేటి చేరువ సూర్యోదయము
చీఁకటి
కూబలకైతే చిమ్మి రేఁచును
యాఁకటతో
విజ్ఞానము నందిచ్చే శ్రీ హరిభక్తి
కాఁకల
దుర్మార్గులకుఁ గాన నీదూ ॥తాము॥ అందరు
రుచిగొనేటి అన్నము బహురోగికి
కందువ
నజీర్ణమై కారించును
యెందును
శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు
మందమైన
జడునికి మఱఁగులై తోఁచును ॥తాము॥ ధరఁ గొందరు
మూర్ఖులు తగ నొక్కరాజుఁ గొల్చి
పరిచారకునిఁ
దిట్టి భంగ పడ్డట్టు
యిరవుగ
శ్రీ వేంకటేశుఁ గొల్చి వారివారి
విరసాలాడుచుఁ
దామె విఫలులై పోదురు ॥తాము॥
|
Details and explanations:
తాముఁ
దెలియరూ తగఁ జెప్పిన వినరూ
పామరపుఁ దమ కర్మఫలమో హరిమాయయో ॥పల్లవి॥
ప్రకటిత అర్థం:
(వీరు) తమంతట తామే ఎరుగరు.
తగినట్లు (పెద్దలు) చెప్పినా వినరు. ఈ అధమత్వము, నీచత్వము అజ్ఞానమున
తిరుగు కర్మఫలమా? లేక హరి మాయయా?
భావాత్మక వివరణ:
ఈ కీర్తనలో పెద్దతిరుమలాచార్యులు నిందించరు. పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో దయ ఉంటుంది. ఒక ఋషి స్వరంలా ఉంటుంది - సత్యాన్ని చూసినవాడి నిశ్శబ్ద ఆవేదన.
తాముఁ
దెలియరూ - (వీరు) తమంతట తాము ఎరుగుటకు ప్రయత్నించరు. ఒక వేళ యత్నించినా తమ యధార్థ స్వరూపాన్ని, పరమార్థాన్ని గ్రహించలేరు. ఇది ఉపనిషత్తులలో చెప్పబడిన అవిద్యకి సమానమైనది.
తగఁ
జెప్పిన వినరూ ఇక్కడ
‘వినరు’ అంటే పెద్దల మాటలకు తల ఊపడం కాదు - హృదయంతో అంగీకరించకపోవడం. తమ ఇప్పటి సౌకర్యములను, సుఖములను, సాంత్వనను విడిచేందుకు సామాన్యులు సిద్ధపడరు.
దైవమును చేరుటకు ధర్మబద్ధమైన జీవితమే ముఖ్యమని
ఎంత చెప్పినా వినని తత్వమును గమనించి పెద్దతిరుమలాచార్యులు
ఆవేదనకు గురియగుతున్నారు.
పామరపుఁ దమ కర్మఫలమో హరిమాయయో —
ఈ ప్రశ్నే ఈ కీర్తనకు మూలము.
ఈ అజ్ఞానం, ఈ మూర్ఖత్వం...
పూర్వ జన్మల కర్మఫలమా?
లేదా హరి మాయా?
ఇది నింద కాదు. ఆచింత్యమైన విధి, మానవ వైఫల్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. ప్రతీ క్షణం అనేక అనుభూతులను మిగులుస్తూ, ముందు దారిని, వెనుక దారిని మూసివేస్తూ ఏమాత్రమూ అటునిటు కదులు స్వాతంత్రం ఇవ్వని ఈ బ్రతుకును ప్రజలు ఎందుకు తెలుసుకోలేకున్నారో ఆశ్చర్యము జాలి ఒకే సారి అనుభవిస్తారు.
పెద్దతిరుమలాచార్యులు ఈ కీర్తనను
మానవుల అహంకారముపై సంవేదనా భరితమైన పదములతో ప్రారంభిస్తారు - మనలో లోతుగా వేళ్ళూనుకొన్న
వైఖరులను ఎండగొట్టారు.
పదముల వివరణ:
కూబి = ఏమీ తెలియని వ్యక్తి, = పసిపాపలలాంటి హృదయం కలవారు = నిష్కళంకులు.
కూబలకైతే = నిష్కళంకులైనవారికైతే.
చిమ్మి రేఁచును = రెచ్చిపోవు, విజృంభించు (ఐతే ఇక్కడ ఆసక్తి చూపు అని తీసుకోవలెను).
యాఁకటతో = ఆకలితో అలమటించే వారికే (ఇక్కడ భగవత్ప్రాప్తికై తపన =
ఈ దేహమంతా అపవిత్రమని గ్రహించి, ఆత్మస్వరూపమును
మరచి దైవస్మరణతో దేవుని అనుజ్ఞకై వేచి ఉండే తత్త్వజ్ఞుల స్థితి).
విజ్ఞానము = దైవరహస్యము;
కాఁకల దుర్మార్గులకుఁ గాన నీదూ = అనుభవాల వల్ల హృదయం కఠినమైన దుర్మార్గులకు అది కనబడదు.
భావము:
చీకటిని తొలగించే సూర్యోదయం దగ్గరలోనే ఉంది. కానీ నిష్కళంకులు - బాహ్య అనుభవాలకు దూరమైన నిర్దోష హృదయులు చీకటిలో వున్నా కూడా దానిని నిమిత్త మాత్రముగా, సంతోషముగా స్వీకరించుదురు. అటువంటి సమబుద్ధి గలవారికే శ్రీహరి భక్తి అనే దైవరహస్యాన్ని విజ్ఞానరూపంగా అనుగ్రహిస్తారు. దేహ సంబంధ అనుభవాలతో హృదయాన్ని కఠినంగా మార్చుకున్న దుర్మార్గులకు అది కలగదు, కనబడదు.
భావార్థ వ్యాఖ్యానం:
ఈ చరణంలో పెద్దతిరుమలాచార్యులు మానవులు సత్యాన్ని గుర్తించలేని స్థితిని లోతుగా, తులనాత్మకంగా చిత్రించారు.
చీఁకటిఁ బెడబాపేటి చేరువ సూర్యోదయము: ఇది ఒక బలమైన ప్రతీక. భక్తితో వచ్చే జ్ఞానం చీకటిని తొలగించే సూర్యుడిలాంటిది. అది ఎక్కడో దూరంలో లేదు; మనం తల తిప్పి చూడగలిగే దగ్గరలోనే ఉంది. (దాదాపు వెన్న చేతఁబట్టి నేయి వెదకనేల అనే అర్ధములో)
చీఁకటి కూబలకైతే చిమ్మి రేఁచును: ఇక్కడ భగవద్గీత 2-69 శ్లోకాన్ని గుర్తుచేసుకుంటే (“యా నిశా సర్వభూతానాం...”) అన్వయం తెలుస్తుంది: సమస్త ప్రాణులకు (అనగా సామాన్య జనులకు) ఏది రాత్రియై దృష్టికి గోచరము కాక ఉన్నదో, దానియందు (ఆ పరమార్ధ తత్వమునందు) ఇంద్రియనిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. (ఆత్మావలోకనం చేయు చుండును). నిష్కళంకులు చీకటిని తులనాడరు. ఎందుకంటే వారి లోపలి తపన ఒకటే. సత్యము కనుగొనుట. వారు తామున్న స్థితిపై విచారించరు. అభిప్రాయములు కలిగి వుండరు. (లోకరంజకము తమలోనిసమ్మతము)
యాఁకటతో విజ్ఞానము నందిచ్చే శ్రీ హరిభక్తి : భక్తి అన్న దైవరహస్యాన్ని అందించేది తపనతో తనను తాను మరచి వున్న వారికే. ఈ మలమూత్రములతో కూడిన అపవిత్రమైన దేహాన్ని మరచి, (= "తాను"ఎవరనేది స్పష్టంగా మరచి) దేవుని అనుజ్ఞకై శాంతముగా, తొట్రుపాటు లేక వుండువారే దీనికి అర్హులు.
ఈ సందర్భంగా అతనివెంబడి మౌనంగా నిలబడి వేచి ఉన్నవారు కూడా సేవ చేస్తున్నట్లే. -జాన్ మిల్టన్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది.
కాఁకల
దుర్మార్గులకుఁ గాన నీదూ: అనుభవాలద్వారా హృదయం కఠినమైపోయినవారు, దేహ సంబంధ విషయాలచే మలినమవ్వడం వల్ల, ఈ దైవరహస్యాన్ని
గ్రహించలేరు. వారి దృష్టిలో ఇది అస్పష్టంగా ఉండిపోతుంది. అనుభవాలే వారికి చీకటి అయిపోయాయి.
ఈ చరణాన్ని
ముగింపుగా ఇలా చెప్పవచ్చు:
దేవుడు కళ్లముందే
ఉన్నాడు. వారు చూడాలన్న తొందర పడరు. అతడెలా ఉంటాడో తెలుసుకోవాలన్న కుతూహలమూ, తమకేమవుతుందో అన్న భయమూ లేకుండా — వారు నిశ్శబ్దంగా వేచి ఉంటారు. దైవం ఏం
చేసినా, వారికి సమ్మతమే. బహుశా అందుకే... వెలుగు
వారివైపు ప్రసరిస్తుందేమో.
రెండవ చరణము:
అందరు
రుచిగొనేటి అన్నము బహురోగికి
కందువ నజీర్ణమై కారించును
యెందును శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు
మందమైన జడునికి మఱఁగులై తోఁచును ॥తాము॥
సాధారణ
భావము:
అందరికి
నచ్చే రుచికరమైన అన్నం కూడా — శరీరరోగాలున్న వాడికి అజీర్ణమై క్షోభ కలిగించుతుంది.
అలానే, శ్రీహరిని గురించి చెప్పే ఉత్తమమైన జీవనపాఠాలు
— మందమైన జ్ఞానం లేని జడులకు వ్యర్థమైనవిగా, అర్థం కానివిగా
అనిపిస్తాయి.
భావార్థవిశ్లేషణ:
విలోమాలంకారాల పరంపర: ఈ
కీర్తన ‘విలోమ అలంకార’ తత్వాన్ని అనుసరిస్తుంది — అర్థాన్ని ప్రత్యర్థంగా నిలిపే
ప్రక్రియ. అందుకే పద ప్రయోగం కొద్దిగా తిప్పి చూపినట్లుగా అనిపిస్తుంది. కానీ
ఇందులోని భావప్రపంచం అపారమైనది.
‘అన్నము’ అనే ప్రతీక: ఇక్కడ "అన్నము" అనేది ఆధ్యాత్మికం, సత్యం, జీవన శుద్ధి వంటి విశ్వవిలువల సంకేతం. ఇది
పండితులు, భక్తులు, యోగులు — అందరూ
“రుచిగొనేటి” అన్నం.
కానీ
అది బహురోగికి — అంటే శారీరక రోగం మాత్రమే కాదు —
అభిప్రాయ భ్రమలు, ద్వేషాలు, అసూయ, వ్యంగ్యం, అసహనం,
అహంకారం వంటి మానసిక కాలుష్యం కలవారికి జీర్ణించదు.
జీర్ణశక్తి
అంటే ఇక్కడ సత్యాన్ని స్వీకరించగల చిత్తశుద్ధి. అది లేనప్పుడు
ఎంత మంచి విషయమైనా "కారించును" — వికారం కలిగిస్తుంది.
మందమైన
జడునికి = "తన అనుభవానికి వచ్చినదే, తాను నమ్మినదే సత్యము" అను పొరలతో కప్పబడిన జ్ఞానులు.
“చదువులు” అన్న పదంలో దాగిన తత్వం “జీవితసూత్రాలు”:
- లోపలి నుంచి వచ్చిన సమ్మతము
- ఉన్నదానితో తృప్తి
- హింసను దాటిన అంతర్గత శాంతి
- నిరాహంకారంగా జీవించగల దైవశరణాగతి
ఈ విలువలు
— ఆధునిక సమాజానికి అనర్థకంగా, ప్రతికూలంగా, తిరోగమనముగాను కూడా అనిపించవచ్చు.
“విజయం” అంటే పోటీగా ఎదగడం అనే అభిప్రాయానికి వ్యతిరేకంగా
ఉంటాయి కనుక.
అందుకే
మందమైన జడునికి ఇవి “మఱఁగులై తోఁచును” - పనికిమాలిన అభిప్రాయాల్లా అనిపిస్తాయి.
శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు: పెదతిరుమలాచార్యుల దృక్కోణం.
పెద్దలు, జ్ఞానులు చెప్పిన మాటలు మనకు అర్థం కావడం లేదు అంటే —
ఆ మాటల్లో
లోపం లేదు, మన చిత్తంలో లోపముంది.
ఈ చరణం మనకు ఒక అసాధారణమైన ప్రతిబింబాన్ని చూపుతుంది:
నిజమైన విద్య మనకి అసహ్యంగా అనిపిస్తే, మనం రోగులమన్నమాట
దీనిని
పల్లవితో కలిపి చూడకపోతే సగమే విన్నట్లు:
తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ - మనమే తెలుసుకోలేకపోతున్నాం, చెప్పినా వినలేకపోతున్నాం.
అందుకే
వేలాది మతగ్రంథాలు ఉన్నా, సగటు మానవుడి జీవితం మారటంలేదు -
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. - అందుకే మనము గమనిస్తున్న ప్రపంచములోని అలజడి. అశాంతి.
మనమే సృష్టిస్తున్న అల్లకల్లోలం.
మనం చదువుకుంటున్నది
జీవనోపాధి కోసమేనా?
జీవితం కోసం మనం ఏమైనా చదువుతున్నామా?
చదువుతో మన ప్రవర్తన మెరుగు అవుతోందా?
లేక మనం అలవాటు పడిన పాత ధోరణినే కొనసాగిస్తున్నామా? గత యాభై సంవత్సరాల చరిత్ర గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. అదేం బ్రహ్మవిద్య
కాదు.
అటువంటి చదువులూ చదువులే?
మూడవ చరణము:
విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు ॥తాము॥
విరసము = విరుద్ధరసము గలది; విరసాలాడుచుఁ = విరుద్ధములైన విషయములలో పనికలుగఁజేసుకొని.
(పెదతిరుమలాచార్యులు వారు మానవుని మూర్ఖత్వం గురించి ఇంకా ఇలా అంటున్నారు).
సర్వము ఒకటే అని గ్రహించక కొందరిని రాజులుగా వూహించి కీర్తిస్తూ, కొందరిని పరిచారకులుగా భావించి ధిక్కరించుచూ కాలము గడుపుతారు. దైవము తెలియక భంగపడుదురు. శ్రీ
వేంకటేశుఁ గొల్చుతున్నప్పటికీ తమతమ అనుభవాల మేరకు విరుద్ధములైన విషయములలో పనికలుగఁజేసుకొని,
జీవించుటలో విఫలులై పోదురు.
భావార్థవిశ్లేషణ:
ధరఁ
గొందరు మూర్ఖులు తగ నొక్కరాజుఁ గొల్చి
పరిచారకునిఁ దిట్టి భంగ పడ్డట్టు
పెదతిరుమలాచార్యుల
దృష్టిలో భక్తి అభ్యాసం వల్ల వచ్చే అలవాటు కాదు. భక్తి మానవులు ఎంచుకునే అభిమతం
కాదు.
దానిని
అలవరచుకోవడం సాద్యంకాదు.
ఎందుకంటే
— ఎదోవొక దశలో తెచ్చిపెట్టుకున్న ఓర్పూ, సహనమూ ఒక్క క్షణంలో విచ్ఛిన్నమైనట్లు…
భక్తి కూడా అస్తమించిపోవచ్చు.
చుట్టూజరుగుతున్న
ఘటనలను గమనించండి — ఓర్పూ తాలిమీ లేకుండానే
ప్రపంచం నేడు యుద్ధాలతో, దాడులతో, మానవ సంహారాలతో తల్లడిల్లుతోంది.
కాబట్టి
“నాకు భక్తి ఉంది” అని చెప్పుకునే ముందు
ఒకసారి
మనలోకి మనమే తిరిగి చూసుకుందాం.
సమర్పణ
భావంతో కూడిన భక్తి, శరణాగతి అనే స్థితి —
ఎన్నో
అవాంతరాలను దాటి
మానవుడు
సాధించగల గంభీరమైన, అలౌకికమైన స్థితి.
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు
ఒకే విషయాన్ని
చెబుతున్నాయి —
ఈ ప్రపంచంలో
కనిపిస్తున్నవన్నీ దైవస్వరూపమే.
ఈ సృష్టిలో
తారతమ్యాలకు తావు లేదు.
అయితే
మన వక్రమైన బుద్ధి వల్ల
మనం ఎక్కువ తక్కువలను, మంచి చెడులను నిర్ణయించి జీవించడానికి
ప్రయత్నిస్తాం. ఒకణ్ణి రాజుగాను, ఇంకొకణ్ణి బంటుగాను చూస్తాం.
అంతా సమానమైతే ఈ వ్యత్యాసాలకు తావునిస్తున్నదేమి?
ఆ విధంగా
వచ్చిన మన నిర్ణయాలు
లోపభూయిష్టమైనవే
అని
పెదతిరుమలాచార్యులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
వారివారి విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు:
దీన్ని వివరించడానికి ‘అజుని వ్యథ’ అను పేరుగల రాజా రవివర్మ చిత్రలేఖనంతో
కలిపి చూద్దాం. అది ఒక మౌన వర్ణ సమ్మేళనం
- నిశ్శబ్ద ఆలాపన.
ఈ చిత్రం గాఢమైన చిత్రకవిత్వం. ఘటనకు మునుపు, ఆజుడు, ఇందుమతి వనములో విహరించుచున్నట్లు తెలియగలము. ఇందుమతిపై అనుకోకుండా, అకస్మాత్తుగా మాల పడడంతో మరణిస్తుంది. ఆజుడు దుఃఖంలో మునిగి, ఆమె పక్కనే కూర్చొని, చేతులోకి పుష్పమాలను తీసుకొని వుండటం గమనించవచ్చు. ఆ సంఘటన దురదృష్టాన్ని, ప్రేమకు మరియు విధికి మధ్య సంఘర్షణను చిత్రిస్తుంది.
చిత్రం లోగడ విధాలుగా అర్థవంతమైన చిహ్నాలతో నిండి ఉంది:
- పుష్పమాల — విధికి, తాత్కాలికతకు ప్రతీక. కానీ ఆ
క్షణంలో, అది ప్రాణాంతక యమదూత. అనంతరం, ఇందుమతి అకాల మరణానికి మాటలురాని సాక్షి.
- అజుని దుఃఖం — అతని భంగిమ పూడ్చలేని కష్టమును, నిస్సహాయతను, "ఇలా అయినదే?"మనే ప్రశ్నను చేతలలో పలికిస్తుంది.
అతని తీరును శోక సంగతిని ఆ చిత్రపటమును చీల్చుకొని మన గుండెల్నితాకుతూ
మనలను ఆ దృశ్యములో భాగము చేయును.
- ప్రకృతి నేపథ్యం - నిశ్శబ్దంగా, వెనుకకు తప్పుకొని, మౌన సాక్షిగా అజుని ఆవేదనను ఆర్భాటములేకుండా, ఎల్లలను
అధిగమిస్తూ మన మనస్సులలో నిక్షేపిస్తుంది.
ఈ చిత్రం
కేవలం రాజు దుఃఖం గురించి కాకుండా, ప్రేమను కోల్పోవుటలోని వ్యథను,
మానవ బలహీనతల యొక్క సార్వజనీనత్వాన్ని తెలిపేది. రవివర్మ నైపుణ్యం ఇతిహాస,
పురాణ కథలను మనసును తాకేవిధంగా అందరికీ చూస్తూనే అర్ధమయ్యే మానవుని అంతరంగ
భావాలుగా మార్చడంలో గమనించవచ్చును.
వారివారి / విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు = మనమంతా కూడా పైన చిత్రంలో చూపించిన మాదిరిగానే, మనల్ని పరీక్షించు, విధి కల్పించు అవస్థలను ఆ అజుని లాగానే మరుక్షణమే అంగీకరించలేక ప్రశ్నించుతూ విధికి, కాలమునకు వ్యతిరేక దిశలో పని చేయుచూ విఫలులైపోదుము.
ఈ కీర్తన పల్లవి యొక్క అంతరార్థం కూడా ఇదే. ఈ రకముగా మానవులు విధివ్రాతను మనస్ఫూర్తిగా అంగీకరించక, సత్యం నుండి దూరం జరిగి కాలక్షేపము చేయుదురు. జీవితమను దానిని నిర్వర్తించుటలో విఫలులైపోదురు.
అలా, ఒక మహాకావ్యమనతగు కీర్తన ముగింపుకు వచ్చేశాం. ఇది చరిత్రకు, కాలానికి అతీతమైన పుష్పము. బంగారు పలకలపై చెక్కించదగ్గ కవిత్వం.
ఈ కీర్తనలోని
పూర్తి లోతును వివరించడానికి నా మాటలు చాలవన్న భావన నన్ను ఇంకా వెంటాడుతోంది. నా మాటలు దిశను చూపించే బాటలు మాత్రమే. ఇది వర్ణనకు అతీతమైన ఒక సత్యానికి సంకేతం — చదవదగిన, వినదగిన కవిత్వమే కాకుండా, మన హృదయాల్లో ప్రతిష్టించదగిన
నైవేద్యం.