Saturday 21 January 2023

T-157 ఏ తపములు నేల యేదానములు నేల

 అన్నమాచార్యులు

157 ఏ తపములు నేల యేదానములు నేల

 for EnglishVersion press here

 

సారాంశం: జ్ఞాపకములు కలిగించు ప్రతిఘటన క్షణక్షణమూ మారుతున్న క్రియాశీల సత్యమును దర్శించుటకు అవరోధమౌతుంది.​”

Summary of this Poem:

పల్లవి: తపస్సులు దానధర్మాలు ఏలనో? శ్రీతరుణీపతి నిరంతర సేవే కదా జీవనసాఫల్యం. అన్వయార్ధము: మానవుడా! చేయవలసినది తెలియుము. స్వధర్మాచరణమే సఫల జీవితము.

చరణం 1: దేహపుటింద్రియముల ప్రతిక్రియలను అధిగమించి, కనుల ఎదుటగల సత్యమును కనుగొనుట దైవత్వం. అటువంటి వ్యక్తి తనలో దేవతలను (అనంతమును) వీక్షించును.అన్వయార్ధము:  అయ్యాలారా కళ్ళు తెరవండి. నీ యెదుటనే  ఆవృతమై ఆవిష్కరమౌతున్న  అద్భుతమైన అందమును, అలౌకిక కటాక్షమును, జీవశక్తితో వుప్పొంగుతున్న ప్రపంచమును తెలియుడి.

చరణం 2: (సరైన సత్యమార్గ దృక్పథము అవలంభించి) లోని దుఃఖము నిట్టూరుపుగాలి వెంట వెళ్ళకుండా   జాగరూకుడవు కమ్ము.  అదే నిజమైన తపోధనము. మీలో పుట్టుకొస్తున్న ఆలోచనల అస్తిత్వమును లయము చేయుడీ. క్రమముగా పాపబంధములను తగు విధముగా కరిగించుడీ.

చరణం 3: ముందుగా సంసారము నుంచి విషయ వ్యామోహం నుంచి బయటపడాలి. ఆ తర్వాత కదా మోక్షమందుట​. వేంకటేశ్వరుని పాదాల వద్ద ఉండటానికి అతని అనుమతిని వేడి పొందండి. అనువైన దివ్యపదములు తానే యిచ్చునట​.

Detailed Presentation 

ఉపోద్ఘాతము: అత్యంత గహనమైన కీర్తనలో అన్నమాచార్యులు  మన జీవనము నందు చేయు వృథా ప్రయాసలను ప్రస్తావించారు. మానవుడు తన బలహీనతలను మరియు అస్థిర స్థితిని  గ్రహించి  దేవుడను భావనను సృష్టించాడు. దేవుడు మన పాపాలను కడిగివేయాలని మనమందరమూ కోరుకుంటాము. దేవుడు మన పాపాలను కడిగివేసుకునే పెద్ద తొట్టె (సింక్) వంటి వాడా? దుఃఖము / నిరాశావాదము హృదయాన్ని ముంచెత్తనివ్వకపోవడమే నిజమైన ధర్మమని అన్నమాచార్యులు చెబుతున్నారు. మనిషి అసాధ్యుడు. 

కీర్తన:

రాగిరేకు:  312-2  సంపుటము: 4-68

 తపములు నేల యేదానములు నేల
శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము పల్లవి॥
 
దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే
దేహముతోనే తాను దేవుఁడౌట
సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే
ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట           ఏత॥
 
వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే
కులికి తపోధనము గూడపెట్టుట
తలఁపు తనందే తగ లయము సేయుట
లలిఁ బాపబంధముల లయము సేయుట ఏత॥
 
వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే
మునుపనే తా జీవన్ముక్తుఁడౌట
పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే
అనువైన దివ్యపదమప్పుడే తా నందుట   ఏత

Details and Explanations: 

ఏ తపములు నేల యేదానములు నేల
శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము ॥పల్లవి॥ 

భావము: తపస్సులు దానధర్మాలు ఏలనో? శ్రీతరుణీపతి నిరంతర సేవే కదా జీవనసాఫల్యం.

వివరణము: అన్నమాచార్యులు సంప్రదాయాన్ని వదలమనుటలేదు. అయితే, సత్యాన్వేషణకు సంప్రదాయ పద్ధతుల ఉపయోగాన్ని ప్రశ్నిస్తున్నారు.  మొదటగా వారిపట్ల కలుగు సంప్రదాయ దృక్పథానికి వ్యతిరేకముగా వుండు వారి ప్రకటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.

అతను  తన కవితల వాస్తవ స్వభావాన్ని కప్పిపుచ్చడానికి సంప్రదాయాన్ని ఉపయోగించాడు. తన విప్లవాత్మక ప్రకటనలనుకేవలం ఆసక్తిగల వ్యక్తులకు మాత్రమే అర్థమయ్యేలా దాచి వుంచారని’, ‘సమాజంలో ఉన్న వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటుగా భావించరాదని’, ‘సంప్రదాయవాదుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి’ అని నేను నమ్ముతున్నాను.  అంతేకాక, తెలియని కారణాల వల్ల, ఆయన కీర్తనలు 400 సంవత్సరాలకు పైగా చెలామణిలో లేకపోవడము కూడా దైవికముగా భావించవచ్చు.

తపస్సు, ఆత్మబలిదానాలు ఫలించవంటే మానవుడేం చేయాలి? అన్నమాచార్యులు తరచూ ప్రస్తావించే 'సేవ' ఏమిటి? లోకంలో మనిషికి ఏమి పని ఉంది?  వీటిలోకి మరింత లోతుగా వెళితేమనిషికి నిర్దిష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనిషి సాధించవలసినదీ లేదు. అందువల్ల, కార్యములు నిర్వర్తించి ఫలములను ఆశించడం కూడా ఆమోదయోగ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, అత్యుత్తమ చర్య ఏమిటి?

సంప్రదాయాన్ని పక్కన పెట్టి విషయాల్లోకి వెళితే ఆసక్తికరమైన కవితను అర్థం చేసుకుని అభినందించవచ్చు. ఆలోచించవలసిన ముఖ్యమైన విషయాలు రెండు.

1) సమాజం కుళ్లిపోయిందని తత్వవేత్తలు అంటున్నారు.

2) అయితే, లోక౦ అసాధారణమైనదనీ,  అపూర్వమైనదనీ కూడా వారు చెబుతారు.

మనమందరమూ మార్పుకు అనంతమైన ప్రతిఘటనను అందిస్తాం అనేది కాదనలేని వాస్తవం. అందువలన, మనకు, చర్య అనేది ప్రతిఘటన లేదా సమ్మతి యొక్క ఒక రూపం. ప్రతిఘటనల గొలుసును విచ్ఛిన్నం చేసినప్పుడు, మనం స్వేచ్ఛగా ఉంటాము. కాబట్టి అన్నమాచార్యులు ఉపయోగించినసేవఅనే పదాన్ని ఖచ్చితంగా ప్రార్థన లేదా పారాయణం అనే​ అర్థంలో ప్రస్తావించలేదని పాఠకులకు మనవిచేస్తున్నాను.

అన్వయార్ధము: మానవుడా! చేయవలసినది తెలియుము. స్వధర్మాచరణమే సఫల జీవితము.

దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే
దేహముతోనే తాను దేవుఁడౌట
సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే
ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట        ॥ఏత॥ 

ముఖ్య పదములకు అర్ధములు:  సోహలను = అతడేనేను, అతడు అనగా ఈశ్వరుడు, పరమాత్మ; నేను అనగా జీవుడు, జీవాత్మ, అతడే నేననగా జీవాత్మ పరమాత్మలకు భేదము లేదనుట.

భావము: దేహపుటింద్రియముల ప్రతిక్రియలను అధిగమించి, కనుల ఎదుటగల సత్యమును కనుగొనుట దైవత్వం. అటువంటి వ్యక్తి తనలో దేవతలను (అనంతమును) వీక్షించును. ​

వివరణము: శరీరంతోనే ఆ స్థితికి చేరుకోవాలి. అందువల్ల, పార్ట్ టైమ్  "పుణ్యము" చేయడం వల్ల సమయం వృధా అవుతుందే కానీ ప్రయోజనం వుండదు. ఈ భూమిపై మనకు పరిమిత సమయం ఉంది. అందువల్ల, ఈ మార్పును మానవుడు రెండు చేతులు చాచి మరియు సర్వశక్తులను నియోగించి అంగీకరించడం తప్పనిసరి.​

మీరు ఇప్పటికే గమనించినట్లుగా, ఈ ఒక్క చరణంలోనే గణనీయమైన లోతు ఉంది.  క్రింద ఇవ్వబడిన "హృదయ మీమాంస" (the human condition) అనే రెనే మాగ్రిట్ పెయింటింగ్ సహాయంతో దీనిని అన్వేషించడానికి ప్రయత్నిద్దాము. చదువుకొనుటలో సౌలభ్యం కోసం నేను దానిని భాగాలుగా విభజించాను.

రెనే మాగ్రిట్ (Rene Magritte)



మాగ్రిట్టే  తన 1933 పెయింటింగ్ గురించి ఇలా చెప్పాడు "ఒక కిటికీ  నుండి చూసినప్పుడు కనపడే దృశ్యంలో ఒక భాగాన్ని దాచుతూ, అదే భాగాన్ని సూచించే పెయింటింగ్’ను ఉంచాను. అంటే, కనపడుతున్న చెట్టు వాస్తవంగా పెయింటింగ్ మాత్రమే.  ప్రేక్షకుడికి,   చెట్టు పెయింటింగ్ లోపల (అంటే గది లోపల) మరియు వాస్తవ భూభాగంలో గది వెలుపల వున్నట్లు అనిపిస్తుంది".

బెల్జియం కవి అకిల్లె చావీకి (Achille Chavée) రాసిన లేఖలో మాగ్రిట్ తన వివరణను కొనసాగిస్తున్నాడు. "మనం ప్రపంచాన్ని, అంటే మన వెలుపలి ప్రపంచాన్ని చూసే తీరు పై చిత్రములో మాదిరిగా వుంటుంది.; మనము చూసేది ఒకే ఒక వస్తువునైనా, దాని అంతర్గత ప్రాతినిధ్యం మనోఫలకము పైనను, అసలు వస్తువు బాహ్యముగాను చూచెదము. దీన్ని పొడిగిస్తే, మనం కొన్నిసార్లు గత సంఘటనలను వర్తమానంలో ఉన్నట్లు గుర్తు చేసుకుంటాము. అటువంటి జ్ఞాపకాలలో సమయము, స్పేస్ మరియు దూరము కలగాపులగ మవుతాయి మరియు మన రోజువారీ అనుభవం అంటే, మనస్సులోని చిత్రం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ".

"ఒక చిత్రాన్ని దాని యొక్క అన్నికోణాలలో చూడలేకపోతే ' చిత్రం అంటే ఏమిటి, ఇది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది?' వంటి ప్రశ్నలు వుత్పన్నమవుతాయి".  చాలా పకడ్బందీగా వేసిన యీ చిత్రం ఏదీ ఖచ్చితంగా చూపించదని స్వయంగా అర్థం చేసుకున్నప్పుడు అందులోని చమత్కారము తెలుస్తుంది.

"ఇది పైకి సూటిగా కనబడే అర్థం కంటే గూఢార్ధము ఎక్కువ విలువైనదని నమ్మడం వంటిది. నా చిత్రలేఖనానికి ప్రతీకాత్మక అర్థాన్ని ఆపాదించే గుణము  ఉప్పటికీ, నా పెయింటింగ్ లలో అంతర్లీన అర్థమే లేదు ".

"ఎవరైనా చిహ్నాలను పట్టుకుని మాత్రమే వేలాడ గలరు?   అందమును ఎలా ఆస్వాదిస్తారు? విషయాలను స్వయంగా తెలుసుకోలేని మనసుకు మాత్రమే ఉపయోగపడే 'ప్రత్యామ్నాయాలు' యీ చిహ్నాలు. కొన్ని విషయాలలో పద్ధతి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, వాటినే ప్రమాణముగా తీసుకుని 'ప్రపంచం' గురించి తెలుసుకోవడం విచిత్రమే."

రెనే మాగ్రిట్  చిత్రలేఖనముపై చర్చ

విధంగా మనం "నేను" అనే రంగు గ్లాసు ద్వారా ప్రపంచాన్ని చూస్తాము. ఇది 'నేను', అది 'బయట' అనే సరిహద్దులు భావన ద్వారా సృష్టించబడతాయి.

జిడ్డు కృష్ణమూర్తి పరిశీలనలు:

‘చూచుట’ అను అవవగాహనలో ఇమిడి ఉన్న సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి, జిడ్డు కృష్ణమూర్తి గారి YOU ARE THE WORLD ప్రసంగములనుండి చిన్న భాగము ఇక్కడ ఇస్తున్నాను.  "పరిశీలకుడు పరిశీలించబడునది యేకమైనప్పుడు సంఘర్షణకు తావుండదు". …..ప్రయత్నం చేస్తున్నదేవరు? ప్రయత్నము, వైరుధ్యమూ వున్నంతవరకూ, ఘర్షణ వుంటుంది. పరిశీలకుడు. పరిశీలింపబడేది' విభజనలో వైరుధ్యం లేదా? ఇది వాదించవలసిన విషయమో, ఒక అభిప్రాయమో గాదు. మీరే చూసి గ్రహించవచ్చు. 'ఇది నాది' అని చెప్పినప్పుడు అది ఆస్తిగావచ్చు, లైంగిక హక్కులు గావచ్చు. నేను చేసేపని గావచ్చు. అక్కడ వున్న ప్రతిఘటన వేరు జేస్తుంది గనుక ఘర్షణ ఉంటుంది.

నేను హిందువును, బ్రాహ్మణుడను, ఇదీ అదీ' అనుకుంటూ నా చుట్టూ ఒక ప్రపంచాన్నేర్పరచుకుని, దానితో మమేకమవడంతో వేర్పాటు పెరిగిపోతుంది. తాను కాథలిక్కునని చెప్పినప్పుడు కాథలిక్కులు కానివారి నుండి తప్పకుండా తనను తాను వేరుచేసుకున్నట్లే గదా! బాహ్యంగా, ఆంతరంగికంగా ఉన్న యీ విభజనంతా వైరాన్నిపెంచుతుంది. ఇక్కడ వుత్పన్నమయ్యే సమస్యేమంటే ఘర్షణను పెంచే శత్రుత్వాన్ని వైరుధ్యాన్ని సృష్టించకుండా నాది అని దేనినైనా సొంతం చేసుకోగలనా?. లేకుంటే స్వంతదారీతనమనే భావనే లేకుండా ఉండే, పూర్తిగా భిన్నమైన మరొక స్థాయి వున్నదా? అప్పుడు స్వేచ్ఛ ఉంటుందా?

జిడ్డు కృష్ణమూర్తిగారి పరిశీలనలపై చర్చ.

మనసులోని ప్రతిబింబానికి, మీరు చూసే వాస్తవ వస్తువుకు సంబంధం ఉంటుంది. మీరు చాలా ఎమోషనల్ మూవీ చూస్తున్నారనుకోండి (ఉదాహరణకు 'దేవదాస్'). సినిమాలో ఇమిడిపోయినప్పుడు మనకు తెలియకుండానే తెరపై ఆ పాత్రలోకి జారిపోతాం. ఆ పాత్ర నొప్పిని అనుభవిస్తే మనకు కూడా బాధ కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో "నేను" అనే కేంద్రం కనుమరుగై, సినిమా తెరపై పాత్రకు ప్రేక్షకుడికి, మధ్య సంబంధం ఏర్పడుతుంది.  అలాంటి సంబంధములో సినిమా పాత్రతో ఐకమత్యాన్ని అనుభవిస్తాం.

ఏదేమైనా, ఇది నిజ జీవితంలో తరచుగా జరగదు, ఎందుకంటే మనకు జరిగే ప్రతీ విషయంపై అంచనా ఉంటుంది. వాస్తవంగా జరిగేది అనుగుణంగా సంతోషిస్తాము;  భిన్నంగా వుంటే ఖేదిస్తాం.  మన 'అంచనా'కు 'వాస్తవాని'కి గల వ్యత్యాసము ఒక్కోసారి ఇది తీవ్ర పరిణామాలకు కూడా దారి తీస్తుంది.  అదే సినిమా చూస్తున్నప్పుడు కూడా పాత్ర 'మనం ఆశించిన ప్రమాణాలకు నటించలేకపోతే', లేదా 'మనము కథలో ఐక్యమవ్వకపోతే'  సినిమా ప్రభావము నుండి బయటకు వచ్చి బాగోలేదని పెదవి విరుస్తాము. మరచిపోతాము. కానీ జీవితం బాగోలేదని వదలిపెట్టలేము కదా?

ఇక్కడ అన్నమాచార్యసోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటేజిడ్డు కృష్ణమూర్తి చెప్పినదానితో పోలివుంటుంది. నేపథ్యంలో రికార్డింగు చేసే 'నేను' అనే కేంద్రం వుండదు అని గమనించండి.  రెనే మాగ్రిట్ చిత్రలేఖనంలో చూపించిన సరిహద్దులు లేకుండా మానవుడు ప్రకృతితో ఒద్దికగా కలిసిపోతాడు. 

జిడ్డు కృష్ణమూర్తి, అన్నమాచార్యులు  చెబుతున్న పరివర్తన అదే. పరివర్తన డబ్బును గానీ, కీర్తినిగానీ, సౌఖ్యాన్ని గానీ తీసుకురాదు. పైగా ప్రపంచంతో ఇప్పటి సంబంధాన్ని కోల్పోతాడు కాబట్టి, "నేను" అనే కేంద్రం దీన్ని ముప్పుగా భావిస్తుంది. అందువల్ల క్రింది భగవద్గీత శ్లోకంలో వివరించిన విధంగా ఇది అసంఖ్యాకమైన అడ్డంకులను సృష్టిస్తుంది. అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః । ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ || 16-16|| భావము: ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు. 

వేమన

ఆసక్తికరమైన విషయమేమిటంటే, వేమన కూడా క్రింది పద్యములో, శివుని కనుగొనుటకు కదలని చెదరని మనస్సుతో అంతరంగములో చూడమని సెలవిచ్చారు. 

. తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల
నొనర శివునిఁజూడ నుపమగలదు
మనసుఁజెదరనీక మదిలోనఁజూడరో
విశ్వదాభిరామ వినర వేమ. 
మానవుని కర్తవ్యం

దీంతో మనిషికి నిర్వర్తించ వలసిన పని నిర్ణయించబడింది. ఇంతకు ముందు చెప్పినట్లు, అనుకున్న ఆ మానసిక స్థితిని సాధన ద్వారా పొందలేము. ఇది కఠిన క్రమశిక్షణతో కూడిన పని. 'దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే' ఈ క్లిష్టమైన పనిలో భాగమే. 

దేహముతోనే తాను దేవుఁడౌట’ ఇది అర్థం చేసుకోవడానికి సాల్వడార్ డాలీ#1 యొక్క చిత్రాల నుండి, అనంతంతో మిళితమగుటకు అవకాశం వున్నదని అర్థం చేసుకున్నాము. అటువంటి అంతరంగ సామరస్యాన్ని సాధించిన వ్యక్తికి పైన చెప్పినట్లుగా సంఘటన జ్ఞాపకములలో నమోదు చేయబడదు కాబట్టి అతను నిజంగా సత్యాన్ని కనుగొన్నాడా లేదా అని నిర్ధారించలేడు. అలాంటి స్థితి గురించి వ్యాఖ్యానించుట సామాన్యులమైన మనకు ఊహాగానమే ఔతుంది.

అందువలన, ‘లోను చూచుటే’ అనేది జ్ఞాపకాలతో రూపొందించబడినది కాదు.  కానీ  అనుభవాలను తెరలతో నిర్మించబడిన "నేను"కు  వెలుపల బాహ్య ప్రపంచంతో  సరిహద్దులే లేని సమాగమము. రెనే మాగ్రిట్ గీసిన చిత్రాన్ని మరోసారి చూడండి. మనం ప్రతిబింబాన్ని చూస్తున్నామా, లేదా సత్యాన్ని చూస్తున్నామా?  మిత్రులారా, ధ్యానం, తపస్సు ప్రపంచం నుండి తప్పించుకోనే పలాయన మార్గములు కావు. ప్రపంచాన్ని సరిగ్గా వున్నది వున్నట్లుగా అర్థం చేసుకోవడమే ధ్యానము. అదే తపస్సు.  కానీ ఇక్కడ పేర్కొన్న 'ధ్యానము లేదా తపస్సు' సంప్రదాయకముగా వాడుతున్న అర్ధములో కానే కావు.

"ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే#2 మానవుడా నీ ఎదుట సత్యం తప్ప మరేమీ లేదు అన్నారు అన్నమచార్యులు. అయినా కళ్ళ ముందున్న సత్యాన్ని గుర్తించడంలో మనమంతా  విఫలం అవుతాం. 

ఈ సందర్భంగా జలాలుద్దీన్ రూమి మాటలు గుర్తు తెచ్చుకుందాం.నీ పని ప్రేమకై వెంపర్లాడటం కాదు. ప్రేమపథము నందు నీకై నీవు సృష్టించుకున్న అవరోధాలను తొలగించడమే. అందువల్ల, జ్ఞాపకశక్తి కలిగించు ప్రతిఘటన క్షణక్షణమూ మారుతున్న క్రియాశీల సత్యమును దర్శించుటకు అవరోధమౌతుంది. 

అన్వయార్ధము:  అయ్యాలారా కళ్ళు తెరవండి. నీ యెదుటనే  ఆవృతమై ఆవిష్కరమౌతున్న  అద్భుతమైన అందమును, అలౌకిక కటాక్షమును, జీవశక్తితో వుప్పొంగుతున్న ప్రపంచమును తెలియుడి.

వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే
కులికి తపోధనము గూడపెట్టుట
తలఁపు తనందే తగ లయము సేయుట
లలిఁ బాపబంధముల లయము సేయుట        ॥ఏత॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కులికి = హస్తములతో; లలిఁ = క్రమము.

భావము: (సరైన సత్యమార్గ దృక్పథము అవలంభించి) లోని దుఃఖము నిట్టూరుపుగాలి వెంట వెళ్ళకుండా   జాగరూకుడవు కమ్ము.  అదే నిజమైన తపోధనము. మీలో పుట్టుకొస్తున్న ఆలోచనల అస్తిత్వమును లయము చేయుడీ. క్రమముగా పాపబంధములను తగు విధముగా కరిగించుడీ.

వివరణము: అన్నమాచార్యులు సత్యపరవశుడై దానిని లోకానికి చెప్ప ప్రయత్నించిరి. మానవుని గురించి వారి అవగాహన  అత్యంత ఆధునిక దృక్పథాన్నీ అధిగమించవచ్చు. తాపసి వారి స్వస్థలాల నుంచి బయటకు వెళ్లనేలేదు కానీ మనిషి లోపలి మనిషిని కూలంకషంగా ఎక్సరే తీసినట్లు ఆభివర్ణించారు.

ఇటీవల​ 'ఆలోచన అనేది జ్ఞాపకశక్తికి ప్రతిస్పందన' అని శాస్త్రీయంగా రుజువైంది. 'ఆలోచనలు' మనిషిని విముక్తం చేయవని జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడూ నొక్కి చెప్పేవారు. 500 సంవత్సరాల క్రితం అన్నమాచార్యులు దుర్లభమైన సత్యదర్శనము కాకుండా విషయాలు ఎటుల వ్రాసివుండగలరు?

అయ్యా, అన్నమాచార్యుల రచనలను గొప్ప దార్శనికునిగా, గొప్ప తత్వవేత్తగా, గొప్ప మనిషిగా అభినందిద్దాం. చారిత్రాత్మక ప్రకటనలను "ముసలి అన్నమయ్య ఏదో గొణుగుతున్నాడు. పనిలేనివాళ్ళు అతని భజనచేస్తున్నారని" కొట్టిపారేయకండి.

వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే
మునుపనే తా జీవన్ముక్తుఁడౌట
పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే
అనువైన దివ్యపదమప్పుడే తా నందుట         ॥ఏత॥

ముఖ్య పదములకు అర్ధములు: పనివి = అనుమతితీసుకొనుట.

భావము: ముందుగా సంసారము నుంచి విషయ వ్యామోహం నుంచి బయటపడాలి. తర్వాత కదా మోక్షమందుట. వేంకటేశ్వరుని పాదాల వద్ద ఉండటానికి అతని అనుమతిని వేడి పొందండి. అనువైన దివ్యపదములు తానే యిచ్చునట.

 

References and Recommendations for further reading:

#1 139 వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు (vaTTiyAsalaku lOnai vadalaka tirigADEvu)

#2 96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTa nevvaru lEru yiMtA vishNumayamE)

 

 

-X-The End-X-

2 comments:

  1. ఓంశ్రీసాయినాధాయనమః నేనుఅనే అహమును మనము మరచిపోయినా మనచుట్టూఉండే పరిస్థితులు ప్రతివిషయములోను మనఅహమును గురుతు చేస్తూఉంటుంది. అందుకే సద్గురువులందరూ ఉన్నప్రదేశములన్నిపవిత్రహృదయములతోనిండి మన అహమును మరిపించే క్షేత్రమును ( climate or weather)కల్పించెదరని నేర్పిన సద్గురువునకు ప్రణామములు.

    అందుకే సద్గురువు వ్రాయించిన నామం క్షేత్ర పునః క్షేత్రఙ్ఞాయా శ్రీసాయినాధాయనమః

    ReplyDelete
  2. చాలా గహనమైన కీర్తన యిది.
    జీవితం యొక్క పరమావధి, పరమ లక్ష్యం ముక్తిని పొందటం. యజ్ఞం, దానం, తపస్సు అనేవి ఆధ్యాత్మిక సాధనలో ఆవశ్యకములు. వీటిని ఆచరించటం వలన జీవిత పరమలక్ష్యమైన మోక్షం లేదా కైవల్యం ప్రాప్తించదు.అలౌకికమైన పరమాత్మను పైన ఉదహరించిన లౌకికమైన కర్మల నాచరించటం ద్వారా పొందలేమని అన్నమయ్య పల్లవిలో తెలియ
    జేస్తున్నాడు.

    శ్రీతరుణీపతిని పొందుటకు ఇవేమీ అవసరం లేదు.శక్తివంతమైన జ్ఞానకర్మేంద్రియములు విషయవస్తువులతో అనుసంధానము చెంది వాటికంటె శక్తివంతము, విమలము అయిన మనస్సుపై ప్రభావం చూపి, నిర్మలమైన మనస్సును కలుషితం చేసి ప్రతిక్రియల రూపంలో దేహంచే పాపపుణ్యకర్మలను చేయించి జీవిని ముక్తికి దూరం చేస్తున్నాయి.ఈ కర్మలు అజ్ఞాన జనితములు.కళ్ల యెదుడటే యున్న నిత్యము,సత్యము అయిన దైవాన్ని అనిత్యము,అసత్యము అయిన ఈ లౌకిక విషయవస్తువులు మన నుండి దూరం చేస్తున్నాయి.
    అందుచేత,ఇంద్రియముల ప్రతిక్రియలను నియంత్రించి అంటే అధిగమించి మనస్సును అధీనంలో ఉంచుకొని, సాధనచతుష్టయము అనగా వివేకవైరాగ్యములు;శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము లనబడే షట్ సంపత్తులు,ముముక్షత్వం అనే ఆరు సాధనముల ద్వారానే మోక్షం సంప్రాప్తిస్తుంది అంటే సత్యదర్శమై దైవత్వం సిద్ధిస్తుంది.
    సః+ అహం=సోహం అంటే పరమాత్మే నేను, నేనే పరమాత్మ అనే జీవపరమాత్మైక్యత అనే స్థితిని చేరుకుంటుంది జీవాత్మ.జీవత్మ, పరమాత్మల అభేదస్థితి కలుగుతుంది. అట్టి దివ్యస్థితి యందు సాధకుడు తనయందే పరమాత్మను దర్శించి, నిరంతరం పరమాత్మతో రమిస్తాడు.

    ద్వంద్వములకు అతీతంగా ఉంటూ,
    సత్యాన్వేషణంలో సాధన చేస్తూ ఉండుటయే నిజమైన తపస్సని అన్నమయ్య, తద్వారా పాపక్షయమై ముక్తిని పొందుమని అన్నమయ్య ఈ అద్భుతమైన, గహనమైన కీర్తనలో బోధించుచున్నాడు.అంటే సంసారబంధనముల నుంచి, విషయవ్యామోహముల నుంచి సంపూర్ణ విముక్తిని సాధించి మోక్షమును బడయుట సాధ్యమని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో సుస్పష్టం చేస్తున్నాడు.

    రెనే మాగ్రిట్ చిత్రం ద్వారా సత్యాసత్యములను వివరించటం,శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పరిశీలనలు,వేమన పద్యం, రూమి మాటలను సందర్భానుసారం ఉటంకించి కీర్తన యొక్క మూలభావాన్ని సులభగ్రాహ్యం చేసే ప్రయత్నం చేశారు శ్రీ చామర్తి శ్రీనివాస్ గారు. వారి వ్యాఖ్యానం యెప్పటివలెనే చదువరుల నాకట్టుకుంటుంది.

    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...