Saturday, 8 February 2025

T-211 కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు

For Commentary in English please press here: 

అన్నమాచార్యులు ఈ కీర్తనలను ఒకటొకటిగా మనకు బోధించుట కొరకు వ్రాయలేదు. వారు తమలో తాము అనుభవించిన ప్రత్యక్ష విషయమును లోక హితముకై వెల్లడించారు. అన్నమాచార్యులు తాదాత్మ్య స్థితి చేరుకొని అనుభవించి వ్రాసిన ఈ కీర్తనలు శ్రద్ధతో  పరీక్షగా చదివిన/వినిన వారికి పరమపద సోపానముల నిపించును.

ఆచార్యులవారు అతి లాఘవంగా ఈ కీర్తన ముఖ్య సందేశమును శృంగార వర్ణనలు అనిపించు పదముల వెనుక దాచి మనకు సవాలు విసురుతారు. అత్యంత సులభమైన పదముల  అల్లికతో అనంతమగు గంభీరమైన సందేశమును చెప్పించవచ్చును అనుటకు ఈ కీర్తన ఆద్యంతము ఉదాహరణీయము. ఆసాంతము రమణీయము.


ఆ పదములు తేనెలో ముంచి తీసిన అక్షరములతో కూర్చినవో తెలియదు. ఆమె మేలి ముసుగు జారగా తళుక్కుమన్న మేలిముత్యములో నిర్ణయించ లేము.ఈ కీర్తన  లావణ్యమునకు స్వర్గములో మేటి నృత్యమణుల విన్యాసమూ సరిపోలనిది.   మేఘావృతమైన ఆకాశంలో ఇదమిత్థముగా లేని వ్యక్తం చేయలేని విద్యుల్లత లాంటిదనీ చెప్పలేము. 


ఇంత సున్నితమైన పదాలకు విరుద్ధంగా అన్నమాచార్యులు మన మీద కురిపిస్తున్న  విమర్శలు అనే సమ్మెటపోట్లు హృదయంలోకి చొచ్చుకుపోతే, క్షణిక కాలానికైన అవి కల్పించు స్థితిని అనుభవించ గలిగితే, మనసుకు తగులుకొన్న ముసుగులు తొలగిపోతే, ఒక్కసారిగా ఈ ప్రపంచమును దాని నగ్న నృత్యమును, తనను తన నిజ రూపంలో చూచు కోగలిగితే, జన్మ ధన్యమైనట్లే.


కీర్తన 

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥


ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥



Details and explanation: 

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥


టీకా: కొమ్మ = ఈమె; తన= తన; ముత్యాల కొంగు = ముత్యాల కొంగు; జారఁగఁ = జారిపోగా; బగటు = కనబఱచుచు, త్రవ్వుచు, పైవెట్టుచు, పొడమించుచు, బహిర్గతముచేయుచు; కుమ్మరింపుచుఁ = కుమ్మరించుచు; దెచ్చుకొన్నదీ = కొని తెచ్చుకోన్నదీ; వలపు = ప్రేమ, వలపు, ఆప్యాయత.


భావము: తన ముత్యాల కొంగు జారిపోగా (సిగ్గు తొలగిపోగా) తెచ్చిపెట్టుకున్నఆప్యాయతలన్నీ ఆమెకు అవగతమైనవి.


వివరణము: ఇక్కడ ఈమె అనగా అన్నమాచార్యులు తనను తానే ఒక స్త్రీగా వర్ణించుకున్నారు. 

"ముత్యాల కొంగు జారఁగఁ"తో అప్పటి వరకు తనను కబళించిన తెరలు  (సిగ్గు) తొలగి పోవుటను సూచించారు.

బగటు కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు = వృథా ప్రయాసలకోర్చి తెచ్చిపెట్టుకున్నదీ (మనము) చూపించు మోహము.


అంతరార్థము: మానవులారా మనము కనబరచు ప్రేమ, మోహము, ఆప్యాయత వృథా ప్రయాసలకోర్చి తెచ్చిపెట్టుకున్నది. దీనిని సిగ్గు విడిచి వదిలిన కానీ, భగవానుని అవ్యాజమైన ప్రేమను అనుభవించలేము.


మొదటి చరణం 
ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


టీకా: ఒయ్యారమున = సౌందర్యగర్వముతో; విభుని= తన మగని, దైవము; వొరపు = ఉపాయము, స్థిరము, సుందరమైన, గొప్ప, యోగ్యము; గనుఁగొని = కనుగొని, తెలుసుకుని; రెప్పముయ్యనేరక = కనురెప్ప మూయడం కూడా మరిచి; మహ మురిపెమునను = అతిశయమైన శృంగార గర్వముతో; కయ్యంపుఁ గూటమికిఁ = యుద్ధము లాంటి  సమాగమమునకు; గాలుదువ్వుచును =  కాలుదువ్వుచును; ఇంతె = ఆ స్త్రీ; కొయ్యతనమునఁ = మొండితనమున; దెచ్చుకొన్నదీవలపు = తెచ్చిపెట్టుకున్నదీ కనబఱచు మోహము; 


భావము: సౌందర్యగర్వముతో, ఆ దైవమును కనుగొనగలనను ఊహలతో, కనురెప్ప మూయడం కూడా మరిచి అతిశయించిన శృంగార గర్వముతో యుద్ధము లాంటి (దైవ) సమాగమమునకు ఆ స్త్రీ కాలుదువ్వుచు మొండితనమున తెచ్చిపెట్టుకున్నదీ కనబఱచు వలపు.


వివరణము: "కయ్యంపుఁ గూటమికిఁ" అను పద బంధమును"సమత్వం యోగ ఉచ్యతే (2-48)" అన్న గీతా వాక్యాన్ని కలిపి పరిశీలిద్దాము. ఇక్కడ సమత్వం అన్నది తాను అన్నమాచార్యులు అను ఊహగల ఈ దేహము, ఆవల దాని పరిపూరకమగు (కాంప్లిమెంటరీ గా) ఇంకొకటి. పరస్పరము ఇమడని రెండు వ్యతిరేక శక్తుల గురించి తెలుపుచున్నారు.ఆ శక్తులను ఒకచోట చేర్చి ఉంచడమే యోగము. ఇది ఆచార్యులవారు మానవులెవరూ దర్శించని ఆ సమస్థితిని చేరుకొని చెప్పిన విషయం.  దీనిని భగవద్గీతలోని క్రింది శ్లోకము నుండి గ్రహించవచ్చు.


ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ । ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 15-1 ।। భావము: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న అవ్యయమైన అశ్వత్థ వృక్షము యొక్క రూపమును కనుగొనుము. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు (సమస్త) వేదములను గ్రహించినట్లే. ఈ రకముగా ఈ శ్లోకము విలోమ ప్రతిబింబమును సూచిస్తొంది. 



ఈ విలోమ ప్రతిబింబమే (inverse mirror)  ప్రధాన ఇతివృత్తంగా హిల్మా క్లింటన్ వేసిన హంసల (the swan) శృంఖలలో గమనించ వచ్చును. ఉదాహరణకు Swan No 24లో (పై బొమ్మ చూడండి) ఆ హంసలు ఒక దానిలోకి ఒకటి చొచ్చుకొని పోయి, భౌతికంగా అసాధ్యమనిపించినా కాని, ఆ కష్టమును విస్మరించి అలౌకిక (యోగ) స్థితిలో సాధారణ మానవుల కనులు కాంచలేని ఈ లోకములోని అంతర్లీన అత్యద్భుతమైన క్రమమును కనుగొనునని చూపుతున్నవి. దీనిపై మరింత వివరణ కొరకు ఈ లింక్  Swan No. 24 ద్వారా   తెలియవచ్చును.

అతి జాగ్రత్తగా పరిశీలించిన, పైన ఉదాహరించిన భగవద్గీత శ్లోకము కూడా అన్నమాచార్యులు చెప్పిన "కయ్యంపుఁ గూటమికిఁ" ఊతమిస్తున్నది. ఎలాగంటే  బురద  నీరు కదిలించ కుండా  వదలేస్తే  బురద అడుక్కి వెళ్లి, తేట నీరు నిలిచి స్పష్టంగా చూచుటకు అవకాశం కలుగుతుంది. అయితే, ఏమాత్రం అలజడి కలిగినా (= ప్రయత్నం చేసినా) బురద పైకి లేచి చూడనివ్వదు. కావున ఆ నిశ్చలమైన స్థితిలో అలజడి కలుగజేయట మంటే సమత్వం నుంచి వెడలటమే. కావున దానిని "కయ్యంపుఁ గూటమికిఁ" అని అన్నమాచార్యులు వ్యవహరించారు. 


"కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు" = 'నాకు తప్పొప్పులు నిర్ణయించే శక్తి కలదని' మానవుడు విశ్వసించి దాని నుండి వచ్చు మొండితనమున తెచ్పిపెట్టుకున్నదీ కనబఱచు మోహము. (అయితే, మానవుల జ్ఞానము ఇప్పటి స్థితిలో అజ్ఞానముతో కప్పబడినదని భగవద్గీత  శ్లోకము "ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ । యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 3-38 ।।" నుండి తెలియవచ్చును.

అంతరార్థము: మానవులు అనేక సౌందర్య సాధనములు ధరించి, తాము తలచిన భగవానునికి రూపు కల్పించి, అలంకరించి తమ తమ కళలతో విభుని మెప్పించుటతోను, సంగీతముతో పారవశ్యము చెందిన స్థితిలో ఆ విభుని చేరుటకు మార్గము కనుగొనెదమని మురిసిపోతూ ఆ అందమైన దేవదేవుని చూచుటకై కనురెప్పలు మూయకుండా వేచి  సమస్థితిలో తాను చేయగల కార్యములు లేకపోయిననూ ఉబలాటము కొలది మొండితనము కొలది ఏదో ఒకటి చేయవలెను ఆతృతతో జీవనము  అను అద్భుతమైన అవకాశం పోగొట్టుకుంటాము అన్న విషయం చెబుతున్నారు. 

రెండవ చరణం
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


టీకా: పైపైనె = మీదిమీదనే; ఆరగింపకుము = తినవద్దు , (=విహరించవద్దు); పన్నీరు = పరిమళపు నీరు; గడు-తాపమవునని = ఎక్కువ విరహ తాపము కలుగునని; చెలులు దలఁకగానే =చెలులు కంపించినా (వద్దని వారించినా); తోపు సేయుచుఁ= కోపగించుచు; గెంపు దొలఁకుఁ గన్నుల కొనల= ఎర్రని కన్నుల కొనలు కంపించగా; కోపగింపుచుఁ =కోపగింపుచుఁ; దెచ్చుకొన్నదీవలపు = స్వయంకృతముగా బయటపడిన కోరిక.


భావము: ఆమె ప్రస్తుతం గడుపుతున్న జీవితం పన్నీరు లాంటిది. పైకి సువాసన వెదజల్లుతూ వున్నా దానిని లోపలికి తీసుకొనవడం ఆరోగ్యానికి హానికరం. అది గమనించి చెలులు కంపించి (వద్దని వారించినా) వినక ఎర్రని కన్నుల కొనలు కంపించగా కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు.


వివరణము: విషయములలో తిరుగు మనసు కోపమునకు గురి అవునని ఈ భగవద్గీత శ్లోకము ద్వారా తెలియును. శ్లో|| ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే । సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ||(2-62)|| భావము: ఇంద్రియ విషయములను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా వాటి మీద ఆసక్తి మమకారమూ పెరుగుతుంది. ఆసక్తి వలన కోరికలు; దాని నుండి క్రోధము సంభవిస్తాయి.

చెలులు: ఇక్కడ అన్నమాచార్యులు చెలులు అన్న పదంతో పక్క వారు, స్నేహితులు తల్లిదండ్రులు సఖులు అన్న అర్థాలను చూపించారు.


మూడవ చరణం 
ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


టీకా: ఎప్పుడునుఁ = ఎప్పుడునుఁ; బతితోడ = పతి (దైవము) తోడ; నింతేసి = ఇంత ఎక్కువ; మేలుములు = ముసుగులు; ఒప్పదని చెల్లవని ; చెలి = హితులు(దైవదాస్యులు); గోర నొత్తఁగానే = గోరుతో నొక్కి చెప్పగా; యెప్పుడో = యెప్పుడో; తిరువేంకటేశు = తిరువేంకటేశుని; కౌఁగిఁట గూడి = ఐక్యమై; కొప్పుగులుకుచుఁ= తలతో కులకడం (అంటే ఆనందించడం. కులుకు అంటే తనలో తాను ముచ్చటపడుతూ ఆనందిస్తూ ఉండడం); దెచ్చుకొన్నదీ వలపు= తనపై తాను వేసుకున్నది ఈ అనురాగము.


భావము: శ్రీ వేంకటేసు దాసులు ఆ దైవము దగ్గర (మానవులుగా మనం) తెచ్చి పెట్టుకున్న ముసుగులు చెల్లవని గిల్లి చెప్పగా, తనలో తానే ముచ్చటపడుతూ ఆనందిస్తూ, తనపై తాను కురిపిస్తున్న ఈ అనురాగము, ఆప్యాయత కేవలము బాహ్య ఆచ్ఛాదనలని (క్షణికానందములని) తెలిసి వదలివేయగా ఆ వేంకటేశ్వరుని భావనలో ఐక్యమై ఆమెకు (అన్నమాచార్యులకు) వెనుకటి ఎప్పటి నుండో  తామిరువురు ఒకటను భావము ప్రత్యక్షంగా కలిగెను.


వివరణము: యెప్పుడో అను పదముతో, కాలగమనముతో సంబంధము లేని స్థితిని తెలిపారు.
                            x-x-x-x



Tuesday, 12 November 2024

T-210 విజాతులన్నియు వృథా వృథా

 అన్నమాచార్యులు

T-210. విజాతులన్నియు వృథా వృథా

 

సకల క్రియల సమన్వయమే సుజాతి

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: సత్యమునకు అనుగుణము కాని వన్నియు వృథా. విడువుము. అజామిళాదు లనుసరించిన దియే సుజాతి. అన్వయార్థము: కేవలము శరీర భావనలతో నిర్ధారించి చేయు తీర్మానములను, మానవ యత్నములను వ్యథా ప్రయాసలుగా తెలిసి విడిచి అజామిళాదులు యేజాతిని అనుసరించారో తెలియుము.

 

చరణము 1: ఇప్పుడు మనం అనుభవిస్తున్న జాతిభేదములు (ఇది నేను, అది వేరు అను భావములు) శరీరము అను వస్తుసంబంధమైనది. ఇవి మరణముతో అంతమగును. కానీ, ఆత్మకు ఈ విషయములు అంటవు. అది పరిశుద్ధము, అనాది యైనది. ఈ లోకములో ఈ విషయ భేదములను మరపించు హరివిజ్ఞానపు దాస్యం (=సత్యమే జీవన మార్గము) ఒక్కటే సుజాతి.

 

చరణము 2: ఆ జీవము, ఆ హరి అందరిలో ఉన్న అంతరాత్ముడు. పరమ యోగులు ఈ ధరణి సంబంధమైన జాతిభేదములను అష్ట మదములనిరి. అవియే ధరణి జీవులను సత్యదూరులను గావించు వికారములు, వక్రీకరణలు (distortions). పరతత్త్వ జ్ఞానమునకు మూలము ధర్మమే. ఆ ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని ఈ భూతలమున మనము ప్రదర్శించు జ్ఞానమే అజ్ఞానము.

 

చరణము 3: సార్వత్రికముగా వైదీకము పాటించు వారికి ఇదియే అవశ్య కర్తవ్యం. శ్రీకాంతుండు శ్రీవేంకటపతి కల్పించిన పరిపూర్ణ సిద్ధి ఇదియే.  ఇవి హద్దులని మనసులో ఎంచక​ సర్వసమ్మతము చాటు వారికి, ఓ దేవా! నీ నామమే సుజాతి. 

 

 

ఉపోద్ఘాతము:

 

నేను పరుడను అని సార్వత్రికముగా భావించుట సహజము. నేను ఇక్కడివాడను కాను అని భావించు గుణమునకు ఆధారములు లేవు అని అన్నమాచార్యులు నొక్కి చెబుతున్నారు. 

ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని ప్రజ్ఞయే అవివేకము: “నేను పరుడను” అను ఊహాజనిత భావము నర నరములలో పాకీ మానవుని ఈనాటి స్థితికి కారణమైంది. కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు భగవద్గీత 5-14లో చెప్పినది మనము గుర్తుకు తెచ్చుకోవాలి. (న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః / న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే) ఈ రకముగా చూచినా భూలోకమందలి జీవులను తప్పుదారి పుట్టించుచున్నది తామే సృష్టించుకున్న వికారములు, వక్రీకరణలు (distortions). పరమునకు మూలము ధర్మమే. ఈ భూతలమున మనము ప్రదర్శించు ఆ ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని ప్రజ్ఞయే అవివేకము. 

శ్రీహరి దాస్యం ఒకటే మార్గం: ఏ ఉపమానములకు సాటిరాని ఈ అలౌకిక కీర్తనలో అత్యంత ప్రకాశవంతమైన జీవితమునకు శ్రీహరి దాస్యం ఒకటే మార్గం అని సూచించారు. సకల క్రియల సమన్వయమే సుజాతి అన్నారు.

 

అధ్యాత్మ కీర్తన:
 
రాగిరేకు 177-3 సంపుటము: 2-383

విజాతులన్నియు వృథా వృథా
అజామిళా  దుల కది యేజాతిపల్లవి
 
జాతిభేదములు శరీరగుణములు
జాతి శరీరము సరిఁ దోడనె చెడు
ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషం బనాది
యీతల హరివిజ్ఞానపు దాస్యంబిది యొక్కటెపో సుజాతి   విజా
 
హరి యిందరిలో నంతరాత్ముఁడిదె
ధరణి జాతిభేదము లెంచిన
పరమయోగులీ భావ మష్టమదము భవవికారమని మానిరి
ధరణిలోనఁ బరతత్త్వజ్ఞానము ధర్మమూలమే సుజాతివిజా
 
లౌకిక వైదిక లంపటులకు నివి
కైకొను నవశ్యకర్తవ్యంబులు
శ్రీకాంతుండు శ్రీవేంకటపతి సేసిన సంపాదమిందరికి
మేకొని యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి      విజా 

 

 Details and explanations:

విజాతులన్నియు వృథవృథా
అజామిళాదుల కది యేజాతి   పల్లవి 

భావము: "సత్యమునకు అనుగుణము కాని వన్నియు వృథా. విడువుము. అజామిళాదు లనుసరించిన దియే సుజాతి." 

వివరణ:

విజాతి: ఇక్కడ విజాతి అనగా తనకు సంబంధించనిది, తనలో సహజముగా ఇమడనిది అను భావనతో చెప్పారు. అజామిళుడు వేశ్యాలోలుడై, చివరి క్షణాలలో నారాయణ నామము జపించి యమదూతల బారి నుండి బయటపడతాడు. శ్రీహరి మార్గమును ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో  చేపట్టినా అది వృథా కాదు అని ఇక్కడ ​ఆచార్యులవారు చెప్పారు. 

నిశ్చల నిశ్చతాలు మనవి: మానవులుగా మనమెన్నో ఉద్రిక్తతలకు ఉద్వేగాలకు లోనౌతుంటాం. జాగ్రత్తగా గమనిస్తే వీటికి కారణాలు ఆయా పరిస్థితుల్లో మనము సహజముగా ఇమడలేక పోవడమే. దీనికి మూలం మనమే ఏర్పాటు చేసుకున్న భావనలు.ఈ భావనలు అంతకు మునుపటి అనుభవములు మిగిల్చిన ఆనవాళ్లు. అలాంటి అనేక ఆనవాళ్లు కలిపి "నేను" అనునది ఏర్పడుతుంది. మనమంతా, అసంకల్పితంగా ఈ ప్రక్రియలో భాగమౌతాము. కొన్ని అనుభవాలు సుఖము, ఆహ్లాదము, ఆనందము ఇస్తాయి. వీటిని సహజమని అంగీకరిస్తాం. వీటికి భిన్నంగా  వున్న వాటిని వ్యతిరేకిస్తాం. ఆ వ్యతిరేకతయే ఉద్రిక్తతలకు ఉద్వేగాలకు కారణాలు. ఇదే విషయాన్ని ప్రఖ్యాత అధివాస్తవిక చిత్రకారుడు రెనె మాగ్రిట్ గారి క్రింది కళాఖండం నుండి కూడా గమనించవచ్చును.


 

లెస్ మజిల్స్ సెలెస్టెస్ (అపరిమిత శక్తి ఆకాశం): ఇక్కడ ఆకాశం పాయలుగా విడిపోయి ఎక్కడో దిగువన పైకి వున్న బల్లచెక్కను తాకుతున్నట్లు కనబడుతోంది. అక్కడ ఆకాశానికి బల్లచెక్కకు మధ్య గల దూరమును నలుపు రంగులో చూపి, అది పరిమితం నుండి అపరిమితం వరకు ఏదైనా కావచ్చునని సూచించారు. అది మనము ఊహించ లేనిది. ఆ నల్లని చీకటి ప్రదేశమును ఆకాశం వింతలుగా ఛేదించు కుంటూ ఆ బల్ల మీదకు వచ్చినట్లు కనబడుతోంది. నిర్దిష్ట ఆకృతి లేని ఆ వికృత ఆకారములు కొంత భీతిని కల్పించడానికి చేర్చినవేమో! 

విరుద్ధముల కలయిక​:  చెక్క యొక్క లక్షణాలు: అవి స్పష్టమైన, దృఢమైన, వర్ణనకు ఆస్కార మిచ్చు , రూపురేఖలను కలిగి ఉంటాయి. అవి నీడలను కల్పిస్తాయి. వేస్తాయి. మరియు అన్ని విధాలుగా,  తలమును (ప్లేన్'ని), మరీ పరిమితమైన స్పేస్'ను సూచిస్తుంది. కానీ, ఆకాశం అలాగా కాక స్పష్టమైన, దృఢమైన, రూపురేఖలను కలిగి ఉండదు. అవి కొంత మేర వరకు నీడలను కల్పించును. అయితే. ఇదే ఆకాశం అని చెప్పుటకు వీలులేక అపరిమితమైన స్పేస్ 'కు ఆలవాలమై వుంటుంది. ఎంత వర్ణించినా అస్పష్టమే. 

సమ్మతము అనగా సంపూర్ణ విలినీకరణము:  ఆకాశంలో కొంత భాగం  విడిపోయి,  మధ్యనున్న నలుపు దూరాన్ని దాటుకుంటూ బల్లచెక్కను రెండు  వేర్వేరు ప్రాంతాల్లో తాకుతోంది . ఆకారం లేని ఆకాశం, గట్టి  బల్లచెక్కను తాకిన చోట విధిలేక ఆకారం తీసుకోవాలి. ఆ రెంటి మధ్య ఘర్షణయే మబ్బు తాకిన చోట కరిగినట్లు చూపారు. ఆ చోట కరిగినదేదో (చెక్క లేక ఆకాశం) అన్నది అస్పష్టం. అయినప్పటికీ, అవి రెండు అతుక్కుపోయాయి అని చెప్పవచ్చును. లెస్ మజిల్స్ సెలెస్టెస్ (అపరిమిత శక్తి ఆకాశం) విరుద్ధమైన బల్లపరుపు భాగాన్ని అపరిమితముతో జతచేయబడిన ఏకీకృత 'అవయవం'గా ప్రదర్శిస్తుంది. 

దైవము, మానవుడు: ఇప్పుడు ఈ చిత్రమును ఈ విధంగా అన్వయించుకోవచ్చును. ఆకాశమును దైవము, సత్యము, అనంతములు గాను, బల్లపరుపు  చెక్కను  మానవునిగాను తీసుకొంటే ఆ రెంటి మధ్య సంబంధం చూపుతోంది. ఆకాశం (దైవము) మానవునికి మధ్య దూరాన్ని ఛేదించి రాగలదు కానీ బల్ల  ఆకాశానికి ఎగురలేదు అన్నది స్పష్టం. ఇది వన్ వే ట్రాఫిక్ లాంటిది. అక్కడి వికృత ఆకారములు చూసి భయపడిన, ఆ అవకాశం వుండదు. విజాతియైన మానవుడు సుజాతి (పవిత్రుడు) అగుటకు తన ఇప్పటి లక్షణములను వదిలి మన చుట్టూ ఆవరించుకొని వున్న ఆ ఆకాశ  (ఆ పరమాత్మ) తత్త్వంలో కలసిపోవుట ధ్యానము. లేదా తపస్సు. ఈ కీర్తనలో ఆ పరమాత్మ తత్త్వంలో కలవలేని అశక్తతను 'వృథా'తో తెలియపరిచిరి. 

అన్వయార్థము: కేవలము శరీర భావనలతో నిర్ధారించి చేయు తీర్మానములను, మానవ యత్నములను  వ్యథా ప్రయాసలుగా తెలిసి విడిచి అజామిళాదులు యేజాతిని అనుసరించారో తెలియుము. 

జాతిభేదములు శరీరగుణములు
జాతి శరీరము సరిఁ దోడనె చెడు
ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషం బనాది
యీతల హరివిజ్ఞానపు దాస్యంబిది యొక్కటెపో సుజాతి   విజా 

భావము: ఇప్పుడు మనం అనుభవిస్తున్న జాతిభేదములు (ఇది నేను, అది వేరు అను భావములు) శరీరము అను వస్తుసంబంధమైనది. ఇవి మరణముతో అంతమగును. కానీ, ఆత్మకు ఈ విషయములు అంటవు. అది పరిశుద్ధము, అనాది యైనది. ఈ లోకములో ఈ విషయ భేదములను మరపించు హరివిజ్ఞానపు దాస్యం (=సత్యమే జీవన మార్గము) ఒక్కటే సుజాతి. 

వివరణ: పై బొమ్మలో ఆకాశం చెక్కను తాకిన చోట సంయోగం చెంది ఒకే వస్తువుగా ఏర్పడడం గమనించవలెను. అనగా సత్యం తప్పించి వేరు లేదను భావము నరనరములలో వ్యాపించి అందులో ఐక్యం కావడమే సుజాతి. అది కానివన్నియు విజాతులే. 

హరి యిందరిలో నంతరాత్ముఁడిదె
ధరణి జాతిభేదము లెంచిన
పరమయోగులీ భావ మష్టమదము భవవికారమని మానిరి
ధరణిలోనఁ బరతత్త్వజ్ఞానము ధర్మమూలమే సుజాతివిజా 

భావము: ఆ జీవము, ఆ హరి అందరిలో ఉన్న అంతరాత్ముడు. పరమ యోగులు ఈ ధరణి సంబంధమైన జాతిభేదములను అష్ట మదములనిరి. అవియే ధరణి జీవులను సత్యదూరులను గావించు వికారములు, వక్రీకరణలు (distortions). పరతత్త్వ జ్ఞానమునకు మూలము ధర్మమే. ఆ ధర్మమూలము వరకు చొచ్చుకొనిపోని ఈ భూతలమున మనము ప్రదర్శించు జ్ఞానమే అజ్ఞానము. 

లౌకిక వైదిక లంపటులకు నివి
కైకొను నవశ్యకర్తవ్యంబులు
శ్రీకాంతుండు శ్రీవేంకటపతి సేసిన సంపాదమిందరికి
మేకొని యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి      విజా 

ముఖ్య పదములకు అర్థములు: మేకొని = సమ్మతించి; సంపాద = పూర్తి, సిద్ధి 

భావము: సార్వత్రికముగా వైదీకము పాటించు వారికి ఇదియే అవశ్య కర్తవ్యం. శ్రీకాంతుండు శ్రీవేంకటపతి కల్పించిన పరిపూర్ణ సిద్ధి ఇదియే.  ఇవి హద్దులని మనసులో ఎంచక​ సర్వసమ్మతము చాటు వారికి ఓ దేవా నీ నామమే సుజాతి. 

వివరణ:

మేకొని యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి: “లోకరంజకము తమలోనిసమ్మతము” అని అన్నమాచార్యులు ముందే పేర్కొని ఉన్నారు. మానవుడు అనుభవించు సర్వావస్థలను శ్రీహరి  ప్రసాదము అని స్వీకరించలేని అశక్తతను విజాతి అన్నారు. సర్వ సమ్మతిని తెలుపు ఆ స్థితిలో మానవుడు తానెవరో మరిచి పరలోక ద్వారము తట్టుటకు సమర్థుడగును. అయినా శ్రీహరిదాస్యము తప్ప మిగిలినవేమీ కోరని ఆ మహానుభావులకు జీవము నిర్జీవము ఒకటై కనిపించగా, అట్టిస్థితిలో వారు చేపట్టునది శ్రీహరినామమే.

x-x సమాప్తంx-x

Friday, 1 November 2024

T-209. సకల భూతదయ చాఁలఁగ గలుగుట

 అన్నమాచార్యులు

T-209. సకల భూతదయ చాఁలఁగ గలుగుట

 

మంచికీ చెడ్డకీ నుడుమ కంచుగోడలున్నాయి మీకు. : శ్రీశ్రీ

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: అవ్వారిలో దైవము ప్రకటమైనప్పుడు సమస్తప్రాణుల పట్ల మిక్కిలి భూతదయ గలుగుట సముచితమైన ఫలము”

చరణము 1: ఎప్పుడూ మదిలో కదలాడే ఫలవాంఛఁలకు తగులకుండా మనసును సిద్ధపఱచుటయే కర్మియైన ఫలము. అన్నికర్మములలో బ్రహ్మార్పణము చేయు బుద్ధి కలుగుట హరికృప గలిగినదనుటకు  నిదర్శనము.

చరణము 2: ఎప్పుడు తిరువేంకటేశు సేవకుఁడౌట జరుగునో అపుడే మానవ జన్మము నెత్తినందుకు సాఫల్య మగును. ఎప్పుడు ముంచుకొస్తున్న సుఖదుఃఖములను సమముగా చూడ నేర్చునో అపుడే విజ్ఞాన మొందె ననుటకు నిరూపణ మగును.

 

 

 

ఉపోద్ఘాతము:

 

అన్నమాచార్యుల కీర్తనలు పరమపద సోపానములు: అన్నమాచార్యుల కీర్తనలను అర్ధం చేసుకోవడనికి కేవలము భాషా జ్ఞానం సరిపోదు.  మనము వారి అడుగు జాడలలో నిలబడి వారి మనస్సులోని మర్మము తెలియుటకు ప్రయత్నము చేయ వలెను.  ఆచార్యుల వారు మానవాతీత తలమున నిల్చి కీర్తనలను వ్రాసినారన్నది విదితమే. వారు ఆ అవ్యక్త స్థితిలో చెప్పిన ఈ కవిత్వములు పరమపద సోపానములు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొలది వారి రచనలలోని తీయదనమే కాదు, అసంభవమగు విజ్ఞానమునకు తలుపులు తెరుచుకొంటాయి. ఈ కీర్తనలో "కప్పిన సౌఖ్యదుఃకర్మములు సమముగా నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము"తో అటువంటి విషయమునే చెప్పిరి.

 

విజ్ఞాన ఖని: "దేహసంభవమైన ఫలము అని మానవులందరికీ ఈ ఫలము లభించునని అన్నమాచార్యులు తెలుపుచున్నారు. అటువంటి సంభవమును నిశ్చయము చేయగల అత్యున్నత స్థాయి గల  కీర్తన ఇది. కాబట్టి స్నేహితులారా, ముఖ్యముగా అన్నమాచార్యుల కీర్తనలను కేవలము హైందవ సంప్రదాయ కీర్తనలుగా కాకుండా, అత్యద్భుత  విజ్ఞాన ఖనులుగా చూచి అధ్యయనము చేయవలెను.

 

అధ్యాత్మ కీర్తన: 

రాగిరేకు 36-4 సంపుటము: 1-223
సకల భూతదయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహసంభవమైన ఫలము    ॥సకల॥

తలకొన్న ఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైన ఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృప గలిగిన ఫలము      ॥సకల॥

యెప్పుడుఁ దిరువేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైన ఫలము
కప్పిన సౌఖ్యదుఃకర్మములు సమముగా
నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము        ॥సకల॥

 

Details and explanations:

సకల భూతదయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహసంభవమైన ఫలము      ॥సకల॥

భావము:  అవ్వారిలో దైవము ప్రకటమైనప్పుడు సమస్తప్రాణుల పట్ల మిక్కిలి భూతదయ గలుగుట సముచితమైన ఫలము

వివరణ​:

దేహసంభవమైన ఫలము: "దేహసంభవమైన ఫలము అని మానవులందరికీ ఈ ఫలము లభించునని అన్నమాచార్యులు తెలుపుచున్నారు. అటువంటి సంభవమును నిశ్చయము చేయగల అత్యున్నత స్థాయి గల  కీర్తన ఇది. ఈ పల్లవిలో చెప్పిన  “సకల భూతదయ చాఁలఁగ గలుగుట”ను క్రింది భగవద్గిత శ్లోకము ద్వారా వివరించుకుందాము.

సన్నియమ్యేన్డ్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః

తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః (12-4)

భావము:- ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ స్వాధీనపఱచుకొని ఎల్లెడల సమభావము గలవారై నన్నే పొంది సమస్తప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తిగలవారై యుందురు.

ఇక్కడ ఆచార్యుల వారు “సకల భూతదయ చాఁలఁగ గలుగుట” సంభవము అని వక్కాణించుచున్నారు. ఇది అత్యంత కీలకము. అట్టివారు మానవజాతికే కాక సమస్త జంతు ప్రపంచమునకు కూడా హితులే. అట్టి అరుదైన జన్మము ఆచార్యుల వారిది.

ఆధారములేని యోగ్యత: మనము "భూతదయ"గలవారమని చెప్పుకొనుటకు ఆధారములే లేవు. మానవుల కార్యకలాపములు వాతావరణమును, భూమిని హీన స్థాయిలకు త్వరితగతిని లాక్కేళ్ళుటకే దోహదములౌతున్నాయి. అంతేకాక మనకు వారసత్వముగా దక్కిన సరీసృపములను  కాపాడుటలో మానవుల నిర్లక్ష్యధోరణి తేటతెల్లమగును. అన్నమాచార్యులు పేర్కొన్న“సకల భూతదయ చాఁలఁగ గలుగుట” సంకల్పముతో సాధించలేని ఒక అసాధారణమైన మానసిక స్థితిని తెలుపుచున్నది.  ఏసుప్రభువు కూడా ఇటువంటి దయాగుణముతోనే జీవనమును సాగించెను. రామానుజులు కూడా అప్పటివరకు బ్రాహ్మాణులకే పరిమితమైన వేదాధ్యయనము, దేవాలయ దర్శనములు సార్వత్రికములు గావించెను.

అధివాస్తవిక చిత్రము: ఇకపోతే ఈ పల్లవి భావమును రెనె మాగ్రిట్‌ గారు వేసిన  ప్రజలు ఆశ్రయించు విహంగదృశ్యం (Popular Panorama)  ద్వారా మరింత విశద పరచుకుందాం. మాగ్రిట్‌ని చిత్రకారునిగా మలుపుతిప్పిన పెయింటింగ్లలో ఇది కూడా ఒకటని చరిత్రకారులు చెబుతారు. ఇది చూస్తే 'క్యూబిజం'కు చెందినదేమో అనే అనుమానం కూడా రావచ్చును. 



విహంగదృశ్యం: మొత్తం మీద ఇక్కడ మూడు భాగాలను (పొరలను) చూడవచ్చును. అన్నింటి కంటే పైభాగములో మేఘావృతమైన సముద్రము, తీరము కనబడుతుంటాయి. మధ్యలో దట్టమైన​ అడవి కనబడుతోంది. అది చూస్తే చెట్లకి వేళ్ళు వేయడం మరిచిపోయారనిపిస్తుంది. సముద్రతీరము అడవికి  మధ్య ఱంపముతో కోసారా అన్నట్లుగా వెడల్పాటి రేఖ విదదీస్తూ కనబడుతుంది. ఆ పట్టణం లోని  మిద్దెల మీద ఆ అరణ్యము కప్పివుందని అనిపిస్తుంది. పట్టణాన్ని అరణ్యాన్ని వేరు పరుస్తూ ఱంపముతో కోసారనిపించు మందమైన​ రేఖ కనబడుతోంది. దీనికి ప్రజలు ఆశ్రయించు​​ విహంగదృశ్యం (Popular Panorama)  అని పేరెందుకు పెట్టారో అనిపిస్తుంది.

గంభీరమగు సమతుల్య స్థితి: ఇది అధివాస్తవిక చిత్రమని మరచిపోకండి. ఆక్కడ కనబడుతున్న పట్టణం లోని  మిద్దెలు మనలో దాగివున్న జ్ఞాపకములకు ప్రతీక అనుకోండి. ఆ దట్టమైన అడవి మనలో రూపు దిద్దుకొను ఆలోచనలు అనుకోండి. గజిబిజిగా క్రమ్ముకున్న అడవులు మనలోని అస్తవ్యస్త ఆలోచనలను సూచిస్తాయి. పైని సముద్రము  దూరముగా ప్రశాంతముగా వున్న స్థితిని చూపుతుంది. ఒక్కోక్క జ్ఞాపకము ఒక్కో రకముగా అడవిలోని చెట్లకు (ఆలోచనలకు) వూతమిస్తుంది. మూడు తలములను విడదీస్తూ వున్నరేఖలు మానవుడు నిర్ణయింపలేని విషయమును చూపుతున్నవి. అనగా ఏ జ్ఞాపకము ఏ రకమైన ఆలోచనలకు తావిచ్చునో తెలియలేము. ఆలోచనా తరంగములతో సతమతమగు మనకు ఆ  పైన చూపిన సముద్రము  (గంభీరమగు సమతుల్య స్థితి) చేరలేని తీరమే.

అనంతమునకు దారి: ఇంకోరకముగా చూస్తే సముద్రము విశాలమైనది. లోతైనది. దాదాపు అనంతమైనది. అడవి సముద్రము కంటే చిన్నది, చిన్న పట్టణం కంటే పెద్దది. ఈ రకముగా అలోచిస్తే అనంతమునకు దారి ఆ అడవి ద్వారా కాదు. అనంతమును మనలోకి ఆహ్వానించడమే. ఆ సముద్రము ఆడవిని ఆ పట్టణమును ముంచివేసి తనలో కలుపుకోగలదు. కానీ మనము మన ఇప్పటి ఆలోచనలను భద్రముగా వుంచుకోవాలని చూస్తాము. అటువంటి స్థితిలో జ్ఞాపకములు ఆలోచనలు అంతంకావు. అవి పుంఖానుపుంఖముగా పుడుతూనే వుంటాయి. శ్రీశ్రీగారి వ్యత్యాసం అనే కవితలోని చిన్న భాగమును చూడండి. 

మంచికీ చెడ్డకీ నుడుమ
కంచుగోడలున్నాయి మీకు.
మంచి గదిలోనే
సంచరిస్తాయి మీ ఊహలు.
ఇదివరకే ఏర్పడిందా గది.
అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం.
నిశ్చల నిశ్చితాలు మీవి. 

క్రమక్రమముగా చేరగలిగిన స్థితి కాదు:  ఇప్పుడు అర్ధమౌతుంది ఈ బొమ్మ పేరు  ప్రజలు ఆశ్రయించు విహంగదృశ్యం (Popular Panorama)  అన్నదెందుకో. ఇంకొంచెం అలోచిస్తే  ఆత్మసర్పణ అనునది కొద్దికొద్దిగా చేయుచూ క్రమక్రమముగా చేరగలిగిన స్థితి కాదని,   సముద్రము అమాంతముగా  ఆలోచనలను, జ్ఞాపకములను తుడిచిపెట్టెయ్యాలే తప్ప చూస్తూచూస్తూ మనము అందులో, ఆ ప్రవాహములో చేరలేము. ఇప్పుడు  కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు / కడలేని మనసునకుఁ గడమ యెక్కడిదిఅను కీర్తన అర్ధము కూడా అవగాహన అవుతుంది.

ఈ రకముగా మానవుడు తన అస్తిత్వము వదలలేక ఆత్మసమర్పణకు ఉద్యుక్తుడు కాలేక అట్లని దానిని వీడలేక సతమమౌతాడు.

తలకొన్న ఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైన ఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృప గలిగిన ఫలము        ॥సకల॥

భావము:  ఎప్పుడూ మదిలో కదలాడే ఫలవాంఛఁలకు తగులకుండా మనసును సిద్ధపఱచుటయే కర్మియైన ఫలము. అన్నికర్మములలో బ్రహ్మార్పణము చేయు బుద్ధి కలుగుట హరికృప గలిగినదనుటకు  నిదర్శనము.

వివరణ​: ఈ చరణము పూర్తిగా భగవద్గీతలోని క్రింది శ్లోకాల నుండి గ్రహించ బడినది. ఈ చరణములోని మొదటి రెండు పంక్తులు  భగవద్గీతలోని "అత్యేతి తత్సర్వమిదం విదిత్వా / యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ 8-28"  (= యోగియైనవాడు యజ్ఞము, దానము, తపస్సు మొదలగు వాని ఫలములు గ్రహింపక అనాదియగు బ్రహ్మస్థానమును పొందును)  శ్లోకము నుండి గ్రహించ బడినవి.

మిగిలిన రెండు పంక్తులు బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ .....బ్రహ్మకర్మసమాధినా ( = సంపూర్ణ  ధ్యానములోనే  నిమగ్నమై హోమ సాధనములు,  హోమద్రవ్యములు, యజ్ఞ కర్మ, యజ్ఞాగ్ని అన్నీ కూడా  బ్రహ్మమే అను ఏకాగ్ర భావముతో యజ్ఞమును చేయువారు ఆ బ్రహ్మమును సునాయాసంగా పొందుతారు) భగవద్గీతలోని 4-24ను సూచిస్తున్నవి.

యజ్ఞము అనగా త్యజించుట​. వదలివేయుట​. పైన చెప్పిన విషయములు సులభ మనిపించు చున్నను మానవుని వద్ద  మదిలో నాటుకున్న విషయములను వెలికితీయు లేదా త్యజించు విధానమే లేదు. జాగ్రత్తగా గమనించిన ఇవన్నియూ ప్రవాహములో కొట్టుకు పోవడం లాంటి వాటిని సూచిస్తున్నాయి. మానవుడు సాహసము చేయుటకు కూడా  అస్కారములేని, పైన పేర్కొన్న విధముగా అకస్మాత్తుగా తుడిచిపెట్టు చర్యలని తెలియవలెను. వీనిని చేపట్టుటకు ప్రపంచములోని ఏ హీరో కూడా చేయలేని సాహసము, ధైర్యము కావలెను. ఆ స్థితి మరణమును సైతం లక్ష్య పెట్టకుండా పరమ సత్యమును వెంబడించునది. 

 

యెప్పుడుఁ దిరువేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైన ఫలము
కప్పిన సౌఖ్యదుఃకర్మములు సమముగా
నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము          ॥సకల॥

భావము:  ఎప్పుడు తిరువేంకటేశు సేవకుఁడౌట జరుగునో అపుడే మానవ జన్మము నెత్తినందుకు సాఫల్య మగును. ఎప్పుడు ముంచుకొస్తున్న సుఖదుఃఖములను సమముగా చూడ నేర్చునో అపుడే విజ్ఞాన మొందె ననుటకు నిరూపణ మగును.”

 

వివరణ:

తిరువేంకటేశు సేవకుఁడౌట:  అన్నమాచార్యులు మానవ జన్మము యొక్క ఉత్కృష్టస్థానము తిరువేంకటేశు సేవకుఁడౌట అని పలుమార్లు పేర్కొనిరి. "ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా" (పెద్ద పెద్ద పుణ్యకార్యములు చేసి చక్రవర్తియై భూమిని పరిపాలించుటైన సులభమే కాని  యే విధముగా భక్తిని పెంచుకొని  హరిదాసుడు కాగలడు? (హరికి దాసుడౌట  సులభసాధ్యమేనా? ఎవరూ కోరి భక్తులుకాలేరని, భక్తి తప్ప వేరు మార్గము లేదని గ్రహించినవారు తప్పించి అని అర్ధము).

సుఖదుఃఖములు సమముగా నొప్పుటయే విజ్ఞానము:  భగవద్గీతలోని 2-48వ శ్లోకము సమత్వమును నిర్వచించినది. సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే (=జయాపజయములు ద్వంద్వములు. వాని పట్ల ఆసక్తి విడిచిపెట్టి, ఓ అర్జునా, నీ కర్తవ్య నిర్వహణలో నిమగ్నుడవై ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును).

పైన పేర్కొన్న రెండు విషయములు కూడా మనవులకు దాదాపు అసంభవమైనవే. ఐననూ అన్నమాచార్యుల వారు వాటిని "ప్రకటించి దేహసంభవమైన ఫలము" అని చెప్పిరి. అనగా మానవులుగా మన ఇప్పటి ధోరణిని నూటికి నూరు శాతము వదలి వుండవలెనని అర్ధము. ఈ సవాలుకు సవాలు విసరగల ధైర్యము లేదు. మనముత్త కాగితపు పులులము మాత్రమే.

 

x-x సమాప్తంx-x

T-218. పుట్టెడి దింతా బూటకంబులే

  అన్నమాచార్యులు 218. పుట్టెడి దింతా బూటకంబులే   మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె -శ్రీశ్రీ   ఉపోద్ఘాతము: "ఇలాంటి మెట్టవేదాంతపు...