తాళ్లపాక అన్నమాచార్యులు
319 ఇదిగా దదిగా దిన్నియు నింతే
ఉపోద్ఘాతము
ఈ ప్రపంచం అశాశ్వతమని తరచుగా వింటుంటాము. కానీ ఆ అశాశ్వతత్వాన్ని
మనం స్వయంగా గమనించగలమా? చాలా సందర్భాలలో అది మనకు
ప్రత్యక్షంగా కనిపించదు. అందువల్ల అన్నమాచార్యులు “ఇదంతా నశ్వరమే” అని
చెప్పినప్పుడు దాన్ని ఒక తీర్పుగా స్వీకరించకుండా ఒక సవాలుగా తీసుకొని పరిశీలిద్దాం.
అప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతుంది: అటువంటి పరిశీలన చేయడానికి మనకు
సరైన సాధనాలున్నాయా? మనం కృత్రిమ మేధస్సు (Artificial
Intelligence) యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్నాము. అయినప్పటికీ ఈ
అసలు ప్రశ్న మాత్రం మారదు — ఆ నిజ స్వరూపాన్ని మనం ఎలా అన్వేషించాలి?
ఈ విషయాన్ని ఆలోచించడానికి ముందు, బెల్జియన్ చిత్రకారుడు రెనే మాగ్రిట్ గారి “అలెగ్జాండర్
ప్రయాసము (the Labors of Alexander)” అనే
చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
ఆ చిత్రంలో వేర్ల దాకా నరికివేయబడిన ఒక చెట్టు కాండం
కనిపిస్తుంది. ఆ చెట్టును నరకడానికి ఉపయోగించిన గొడ్డలి, ఇప్పుడు చెట్టు వేర్ల క్రింద ఇరుక్కుపోయి
ఉంటుంది. ఆ వేర్లు గొడ్డలిని బలంగా పట్టుకున్నట్లుగా అనిపిస్తుంది.
అడ్డుపడేది మనమే
ఈ చిత్రంలో మాగ్రిట్ గారు ఏమి సూచిస్తున్నారో మనం ఆలోచించాలి.
మనలోని కోరికలను ఒక వృక్షంగా భావిస్తే, దాన్ని నరికే తీక్షణమైన గొడ్డలి దాన్ని నరికే తీక్షణమైన గొడ్డలి మనసును సూచిస్తున్నట్లు భావించవచ్చును. ఇక్కడ గొడ్డలి అంటే మనం తీసుకునే నిర్ణయాలు,
తీర్మానాలు, ఆలోచనలు. ఈ చెట్టూ, దాన్ని నరికే గొడ్డలీ రెండూ కూడా మన దేహం మరియు మనస్సులోని భాగాలే.
కొంతవరకు చెట్టును నరికిన తరువాత, అదే చెట్టు వేర్లు ఆ గొడ్డలిని పట్టుకొని అడ్డుపడుతున్నట్లుగా ఈ చిత్రం
చూపిస్తుంది. అంటే మనం నరికదలిచినదే, దానిని నరికేందుకు
ఉపయోగించిన సాధనానికే అడ్డంకిగా మారుతుంది.
ఇదే విధంగా, సత్యాన్ని
తెలుసుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి — ఆ అన్వేషణకు
ఉపయోగిస్తున్న సాధనం అయిన మన ఆలోచన (thought) తానే
కొన్నిసార్లు అడ్డంకిగా మారవచ్చు.
ఈ పరిమితిని గ్రహించిన తరువాత, ఇప్పుడు అన్నమాచార్యుల ఈ కీర్తనలో వ్యక్తమయ్యే భావాన్ని మనం శ్రద్ధగా
పరిశీలించవచ్చు.
పల్లవి — మనం చూసేది గాని ఊహించేది
గాని అన్నీ నశ్వరమైన క్షేత్రానికి చెందినవే.
మొదటి చరణం — ఎంత శక్తివంతులైనా,
దేవతలైనా రాజులైనా, వారు శాశ్వత ఆశ్రయం ఇవ్వలేరు.
రెండవ చరణం — బ్రహ్మలోకమనే అత్యున్నత
స్థితి కూడా అస్థిరమే.
మూడవ చరణం — నిజమైన ఆశ్రయం శాశ్వతమైన
స్థితి అయిన అచ్యుతపదము మాత్రమే.
|
అధ్యాత్మ సంకీర్తన |
|
రేకు: 254-5
సంపుటము: 3-312 |
|
ఇదిగా దదిగా దిన్నియు నింతే పదిఁ బది హరి నీపదమే నిజము ॥పల్లవి॥ సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనక గతమగువారె సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి కెరలి పరుల రక్షింపఁగఁగలరా ॥ఇది॥ పదునాలుగవది బ్రహ్మలోకమును కదిసి నీరుమునుకల పొలము చెదరక యిఁకఁ దముఁ జేరినవారల వుదుటున నిముడుక వుండఁగఁగలరా ॥ఇది॥ అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది యిచ్చట శ్రీవేంకటేశుఁడవు చొచ్చిరి నీశరణు శుకసనకాదులు మచ్చిక నిదిగని మరిగితిమయ్యా ॥ఇది॥
|
Details
and Explanations:
పల్లవి:
ఇదిగా దదిగా
దిన్నియు నింతే
పదిఁ బది
హరి నీపదమే నిజము ॥పల్లవి॥
|
Phrase
|
Meaning in Telugu
|
|
ఇదిగా దదిగా దిన్నియు
|
ఇది అది ఇవన్నియు / ఇవన్నీ - మనం చూసేవి, చూడగలిగేవి అన్నీ
|
|
నింతే
|
అంతే. దానిలో ఏ విశేషము లేదు. (సామాన్యమైనవే). కొత్త లోకములు, కొత్తగా
వచ్చేదీ ఏమీలేదు
|
|
పదిఁబది
|
పదేపదే (ఒకటికి నూరు సార్లు) పరిశీలించిన తరువాత
|
|
హరి నీపదమే
|
హరి యొక్క పాదము
|
|
నిజము
|
నిజమైనది
|
సూటి భావము:
మనకు కనిపించే
ఈ ప్రపంచముగానీ, మనం ఊహించగలిగే లోకాలుగానీ — ఇవన్నీ
కూడా అంతే. అశాశ్వతత్వములే. పదేపదే పరిశీలించిన తరువాత నిజంగా నిలిచేది హరి పాదము ఒకటే
అని తెలుస్తుంది.
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులు
చెప్పిన ఈ ప్రపంచము అశాశ్వతత్వమని ఏల ఒప్పుకోవలెను? ఆలోచింతము.
ముందుగా మానవుని అస్తిత్వము కాలగమనము లోనిదని, పరిశీలన ద్వారా అది క్షణికమని తెలియవచ్చును.
అలాగే ఇంకొక ప్రవృత్తి, కనబడిన ప్రతి దానిపై అభిప్రాయము ఏర్పరచుకొనుట.
ఈ రెంటిని కలిపి చూచిన ఒకటి క్షణికము. అందులోను అభిప్రాయము ఏర్పరచుకొను అభిలాష సంపూర్ణ శాంతికి
తావివ్వక ముందరి దృశ్యమును నిష్పాక్షికముగా పరిశీలుంచుటకు అవకాశమివ్వదు. ఈ రకముగా మనము
ఏర్పరచుకొను అభిప్రాయములు లోపభూయిష్టమై ఉండును.
“ఇదిగా దదిగా దిన్నియు” అనే పదబంధం ద్వారా మనం ఈ
ప్రపంచంలో మనం గుర్తించగలిగే అన్నిటినీ అవి సంపదలు కావచ్చు, పదవులు కావచ్చు, లోకాలుగానీ, ఉన్నతమైన
స్థితులుగానీ కావచ్చు — ఇవన్నీ కూడా అదే వర్గానికి చెందుతాయి.
అక్కడ “నింతే” అనే పదం ఎంతో ముఖ్యమైనది. దాని అర్థం — “అంతే, దానిలో అంత ప్రత్యేకత ఏమీ లేదు” అనే భావం. అంటే మనం ఎంతో గొప్పగా భావించే
ఈ సమస్తం కూడా కాలక్రమంలో మారిపోయే, నిలకడలేని వాటికే
చెందుతాయి.
అన్నమాచార్యులు
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వారు అలా అనుకోకుండా
చెప్పలేదు. అందుకే “పదిఁబది”
అనే పదాన్ని ఉపయోగించారు. అంటే పదేపదే, ఒకటికి నూరు సార్లు పరిశీలించిన
తరువాత వచ్చిన అనుభవజ్ఞానమే ఇది. అన్ని విషయాలను పరిశీలించిన తరువాత చివరకు
నిలిచేది ఏమిటంటే — హరి పాదమే నిజమైన ఆశ్రయం అని వారు సూచిస్తున్నారు.
మొదటి చరణం:
సురలును
నసురలు చూపట్టు రాజులు
అరసి కనక
గతమగువారె
సిరుల వీరిఁ
గొలిచెదమంటే మఱి
కెరలి పరుల
రక్షింపఁగఁగలరా ॥ఇది॥
|
పదబంధం
|
తెలుగులో అర్థం
|
|
సురలును నసురలు చూపట్టు రాజులు
|
దేవతలు, అసురులు, గొప్ప
రాజులు, చక్రవర్తులు
|
|
అరసి కనక గతమగువారె
|
(అరసి = వివరము తెలిసికొని) సమగ్రంగా పరిశీలించినప్పుడు వీరందరూ కాల గర్భములో కలిసిపోయే వారని తెలియవచ్చు
|
|
సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి
|
(సిరులు = దేహముతో కూడిన వారు); అటువంటి దేహధారులను కొలిచితే
|
|
కెరలి పరుల రక్షింపఁగఁగలరా
|
(కెరలి = పైకి లేపుట); వారు
మనలను పైకి లేపి రక్షించగలరా? (లేరు)
|
సూటి భావము:
దేవతలుగానీ, అసురులుగానీ, గొప్ప రాజులు, చక్రవర్తులు
గానీ — వీరందరినీ సమగ్రంగా పరిశీలించినప్పుడు వారు కాలగమనంలో కలిసిపోయేవారేనని తెలుస్తుంది. అటువంటి దేహధారులను
ఆశ్రయించితే, వారు మనలను నిజంగా రక్షించగలరా? (అంతర్లీన సమాధానం — లేరు).
గూఢార్థవివరణము:
మనకు ఈ
ప్రపంచంలో శక్తివంతులుగా కనిపించేవారు చాలామంది ఉంటారు. దేవతలు, అసురులు, గొప్ప రాజులు — వీరందరూ గొప్ప అధికారమును
కలిగినవారిగా కనిపిస్తారు.
కానీ “సమగ్రంగా
పరిశీలించినప్పుడు, వారు కూడా కాలగమనమునకు లోబడినవారేనని
గ్రహించవచ్చు. అటువంటివారు మనలను శాశ్వతంగా రక్షించగలరా? లేరు.
ఈ భావాన్ని
మరింత స్పష్టంగా చూపించడానికి బలి చక్రవర్తి మరియు రాక్షసుల గురువు శుక్రాచార్యుల మధ్య
సంభాషణ ఒక మంచి ఉదాహరణ. వచ్చిన వాడు శ్రీహరియని గ్రహించిన శుక్రాచార్యులు బలిని
దానం చేయవద్దని వారిస్తారు. కానీ బలి చక్రవర్తి దానం చేయాడనికే నిర్ణయిస్తూ ఇలా అంటాడు.
శా. కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు?
వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా! (8-590)
గురువర్యా!
పూర్వము కూడ ఎందరో రాజులు పరిపాలించారు. వారంతా తమ బలముతో, శక్తియుక్తులతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించినవారే కదా. కాని వారెవ్వరూ ఆ
సంపదలను మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా
మిగిలి లేదు కదా! కానీ శిబి చక్రవర్తివంటి వారు ధర్మము కోసం చిన్ని పక్షికై తమ శరీరాన్నే
సమర్పించి కీర్తి గడించారు. వారిని ఈ నాటికీ
లోకం మరువలేదు కదా.
రెండవ చరణం:
పదునాలుగవది
బ్రహ్మలోకమును
కదిసి నీరుమునుకల
పొలము
చెదరక యిఁకఁ
దముఁ జేరినవారల
వుదుటున
నిముడుక వుండఁగఁగలరా ॥ఇది॥
|
పదబంధం
|
తెలుగులో అర్థం
|
|
పదునాలుగవది బ్రహ్మలోకమును
|
పదునాలుగు లోకాలలో ఉన్నతమైనదిగా భావించబడే బ్రహ్మలోకము
|
|
కదిసి నీరుమునుకల పొలము
|
(కాలము) సమీపించు నపుడు
నీటిలో మునిగిపోయే పొలము వంటిది
|
|
చెదరక యిఁకఁ దముఁ జేరినవారల
|
అటువంటి లోకాన్ని చేరిన వారికి కూడా
|
|
వుదుటున నిముడుక వుండఁగఁగలరా
|
(వుదుటున = ఉద్ధతిని) అక్కడ ఆ ఉన్నతమైన చోట శాశ్వతంగా స్థిరంగా
ఉండగలరా? (లేరు)
|
సూటి భావము:
పదునాలుగు
లోకాలలో అత్యున్నతమైనదిగా భావించబడే బ్రహ్మలోకము కూడా సమయం ఆసన్నమైనపుడు నీటిలో మునిగిపోయే
పొలమువలెనే అస్థిరమైనదే. అటువంటి బ్రహ్మలోకమును చేరిన వారికి అక్కడ శాశ్వతంగా నిలిచిపోవడం
సాధ్యమా? (అంతర్లీన సమాధానం — కాదు)
గూఢార్థవివరణము:
మొదటి చరణంలో
అన్నమాచార్యులు దేవతలు, అసురులు, రాజులు
వంటి శక్తివంతమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. ఈ రెండవ చరణంలో ఆయన ఆ భావాన్ని మరింత
విస్తరించి లోకాల స్థాయికి తీసుకువెళ్తారు.
పురాణాలలో
అత్యున్నతమైనదిగా బ్రహ్మలోకము చెప్పబడుతుంది. అయితే అన్నమాచార్యులు ఇక్కడ ఒక ఆసక్తికరమైన
ఉపమానాన్ని ఉపయోగిస్తున్నారు — “నీరుమునుకల పొలము”. ఇక్కడ “పొలము” అనే పదాన్ని
భగవద్గీత పదమూడవ అధ్యాయములో పేర్కొన్న ‘క్షేత్రము’ అనే భావానికి దగ్గరగా అర్థం
చేసుకోవచ్చు. అప్పుడు "నీరుమునుకల పొలము" అన్నది ప్రళయ కాలములో ఉపసంహరించబడే
దానిగా భావించవచ్చును.
ఇక్కడ ముఖ్యంగా
గమనించవలసినది ఆ క్షేత్రము (లేదా పొలము) బాహ్యలోకములు గావు. అవి మానవులు మనో సంకల్పముద్వారా
చేర గలుగు అత్యున్నత స్థితులు. ఇవి అన్నియు యత్నము ద్వారా సాధించ గలిగినవి. కావున కాల
పరిమితులు వర్తిస్తాయి.
గౌతము బుద్ధుల
వారు కూడా అటువంటి చైతన్యావస్థల గురించి పేర్కొన్నారు. ఆ ఉన్నత చైతన్యావస్థలలో కాల
పరిమితి మానవ లోకాని కంటే ఎక్కువ ఉండవచ్చును. కానీ, అవి ఎంత ఉన్నతమైనవైనా
కానీయండి, చివరికి కాల గమనములోనివే. బుద్ధుల వారు
చెప్పినట్లుగా ఆ ఉన్నత చైతన్యావస్థలకు ఎగబ్రాకడంలో దుఃఖనివారణ లేదు. అది సంపూర్ణ స్వేచ్ఛను పొందడంలోనే ఉంది. దానికి తగినది మానవ జీవితమే.
ఇదే విషయం
భగవద్గీత 3-10లో కూడా సూచించ బడినది. కావున మానవులుగా జన్మము
పొందుట మన అదృష్టము. ఇక చేయవలసినది దానిని పరిపూర్ణము చేసుకొనుటయే.
ఈ
భావాన్ని మరో కోణంలో తెలుపుతూ మహాకవి బమ్మెర పోతన గారు గజేంద్ర మోక్షము
సందర్భంలో ఇలా చెప్పారు:
క. లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
(8-75)
భావము:
లోకములు, లోకాలను పాలించేవారు, లోకాలలో
ఉండేవారు అందరు నశించిన అనంతరం క్రమ్ముకొనే కారు చీకట్లకు ఆవల కారు చీకట్లకు ఆవతల అఖండమైనది,
ప్రకాశించేది ఏదైతే ఉందో ఆ దేవుణ్ణి
నేను సేవిస్తాను.
మూడవ చరణం:
అచ్చుతుఁడవు
నీయచ్యుతపద మది
యిచ్చట శ్రీవేంకటేశుఁడవు
చొచ్చిరి
నీశరణు శుకసనకాదులు
మచ్చిక నిదిగని
మరిగితిమయ్యా ॥ఇది॥
|
పదబంధం
|
తెలుగులో అర్థం
|
|
అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది
|
అచ్యుతుడు — ఎప్పటికీ పడిపోని వాడు; అచ్యుతపదము — పడిపోని స్థితి
|
|
యిచ్చట శ్రీవేంకటేశుఁడవు
|
ఇక్కడ ఆ అచ్యుత స్వరూపమే శ్రీ వేంకటేశ్వరుడిగా ప్రత్యక్షమై
ఉన్నాడు
|
|
చొచ్చిరి నీశరణు శుకసనకాదులు
|
శుకుడు, సనకాదులు వంటి మహాపురుషులు నీ
శరణు చేరారు
|
|
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా
|
ఆ ఆశ్రయం నిజమని గ్రహించి స్వామి అనుగ్రహంతో మేము కూడా వారితో
కలిసిపోయాము
|
సూటి భావము:
అచ్యుతుడవు
నీవు — నీ అచ్యుతపదమే వాస్తవముగా నిలిచి ఉండే శాశ్వత స్థితి. అదే ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడిగా
వ్యక్తమై ఉంది. శుకుడు, సనకాదులు వంటి మహర్షులు ఆ స్థితిలోకి
చొచ్చుకుని పోయారు. అది నిజమని గ్రహించి స్వామి అనుగ్రహంతో మేము కూడా వారితో కలిసిపోయాము.
గూఢార్థవివరణము:
మొదటి రెండు చరణాలలో
అన్నమాచార్యులు ఈ ప్రపంచంలోని భౌతిక శక్తులు, అలాగే అనేక చైతన్యావస్థలు (మానసిక
స్థితులు) అన్నీ కూడా కాలగమనానికి లోబడినవేనని చూపించారు. ఒకటి పైకి కనబడే ప్రపంచం;
ఇంకొకటి మానసిక ప్రపంచం. అనగా మానవుడు తన ప్రజ్ఞ ద్వారా సాధించగల
లోకములన్నీ అశాశ్వతమని అర్థం.
ఇవి కాక మానవులు తమలోనే
ఉన్న చైతన్యమునకు అతీతమైన దానిని వేంకటేశ్వరుని దాసులై చేరగలరని అన్నమాచార్యులు
సూచిస్తున్నారు. అది భౌతికముగా కానరాదు; మానసికముగా చేరలేనిది. మార్గము
లేనిది. అయినప్పటికీ శాశ్వతమైనది అదే.
ఇక్కడ 'చొచ్చుకుని పోయారు', 'వారితో కలిసిపోయాము' అన్నవి యథాలాపముగా వాడిన పదములు కావు. ఆ స్థితిలో వారు తమ తమ ప్రత్యేక
అస్తిత్వము కోల్పోయి ఆ భగవంతుని కల్పనలో మమేకమైనట్లుగా భావించ వలెను.
ఇక్కడ ముఖ్యమైన పదం “అచ్యుత”.అచ్యుత అంటే ఎప్పటికీ పడిపోని,
మార్పులకు లోబడని, నాశములేని అనే భావం. అందువల్ల అచ్యుతపదము అనేది ఒక లోకము గాని, ఒక స్థానము గాని కాదు. అది శాశ్వతంగా నిలిచిపోయే స్థితి.
ఆ అచ్యుత స్వరూపమే ఇక్కడ శ్రీ
వేంకటేశ్వరుడిగా అనుభవమవుతుందని అన్నమాచార్యులు చెబుతున్నారు. ఈ విధంగా ఒక
తాత్విక సత్యాన్ని ఆయన భక్తి రూపంలో వ్యక్తపరుస్తున్నారు.
అన్నమాచార్యులు చేరిన ఆ స్థితి
భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకమునకు దగ్గరగా అనిపించును.
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 13-31 ।।
ఎప్పుడు వేర్వేఱుగనున్న ఈ భూతప్రపంచమంతను
ఒక్కదానియందు (పరమాత్మయందు) ఉన్నదానిగను, మరియు దానినుండియే విస్తరించుచున్న
దానినిగను వీక్షించునో, అప్పుడు (మనుజుడు) బ్రహ్మమును పొందుచున్నాడు.
ఈ మార్గాన్ని ముందుగా
అనుసరించిన మహర్షులు ఉన్నారని సూచించడానికి శుకుడు, సనకాదులు
అనే పేర్లను ప్రస్తావిస్తున్నారు. వారు ఆ ఆశ్రయాన్ని చేరినవారిగా సంప్రదాయంలో
చెప్పబడుతారు. అయితే కాలము తాకని ఆ స్థితిలో శుకుడు, సనకాదులు
అనే పేర్లు కేవలము సూచనప్రాయమే. వాస్తవానికి ఆ స్థితిలో వారంతా అనామకులే.
చివరి పాదంలో
అన్నమాచార్యులు ఒక వ్యక్తిగత భావాన్ని వ్యక్తపరుస్తారు: “మచ్చిక నిదిగని మరిగితిమయ్యా” అంటే
— ఈ ఆశ్రయం నిజమని గ్రహించి మేము కూడా ఆ మార్గాన్ని అనుసరించాము. ఇక్కడ “మేము”
అన్నది అన్నమాచార్యులు తాము ఆ సత్యముతో మమేకమై విడదీయలేని ఏకత్వాన్ని
సూచించుచున్నది.
వ్యాఖ్యానంతర సమీక్ష:
అన్నమాచార్యులు ఈ కీర్తన ద్వారా
శాశ్వతమైన దానిని చేరుకున్నారని తెలుస్తుంది. మానవులుగా గమనించ వలసినదేమంటే:
మనములోని
విభుఁడు మఱవఁడే కాలంబు
నినుఁ
గలయనున్నాఁడు నీకేలె వెఱవ ॥పల్లవి
భావము: ఒక
తెలియని స్వరం: “చెలీ! మనసులోని విభుడు ఏ
కాలంలోను మఱవఁడు. నిన్ను కలియుటకు ఉన్నాడు. నీకేమే సందేహము? తటపాయింపు?”
కాబట్టి జాప్యము మన వైపునుంచే.
X-X-The
END-X-X

No comments:
Post a Comment