Sunday, 21 September 2025

T-265 పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము

 తాళ్ళపాక అన్నమాచార్యులు

265  పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము 

For English version press here 

ఉపోద్ఘాతము 

మీకు అనేక సార్లు విన్నవించుకున్నట్లుగా, అన్నమాచార్యులవారు ఆచరణాత్మకముగా  తన స్వానుభవమునకు వచ్చిన విషయములను మనకు కీర్తనలుగా అందించారు. ఈ కీర్తనలో ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో మానవ నైజమును మన దృష్టికి కానవచ్చునట్లు చేశారు. ఆచార్యులవారు తాము ఎంత ఎత్తుకు ఎదిగినా అతిచిన్న విషయములను అత్యంత నిశితముగా పరిశీలించారన్నది వాస్తవము. ఆనాడు సమాజంలో ఉన్న విషయముల పరిశీలనలు 500 సంవత్సరములు గడిచినా ఈనాటికీ, ఇంకొంచం ధైర్యం చేసిచెప్తే ఎప్పటికీ నిలిచి వుండు సత్యములు. 

ఈ కీర్తన గిలిగింతలు పెడుతూ చక్కని హాస్యంతో కూడి అదే సమయంలో కాదనలేని వాస్తవమును మన కనులముందు ఆవిష్కరింపజేస్తోంది. ఇన్ని వేల కీర్తనలలో ఒక్కొక్క కీర్తన మనకు అత్యద్భుతము, అసామాన్యము, అపూర్వము అనిపింప చేయుట అన్నమాచార్యుల ప్రత్యేకత. 

ఈ కీర్తనలో కవిత్వపు విశిష్టతలు: 

అన్నమాచార్యుల ఈ కీర్తనలో భావం (సామాజిక విమర్శ + భక్తి సమర్పణ) మరియు ధ్వని (ప్రాస, యమకాలు) ఒకదానికొకటి దృఢంగా అండగా నిలుస్తాయి. 

మొత్తం కీర్తనలో ప్రత్యేకత

అన్నమాచార్యులు కేవలం కీర్తనలు వ్రాయలేదు
ధ్వని–లయ–ప్రాస ద్వారానే అర్థాన్ని సూటిగా హృదయంలోకి చొప్పిస్తారు.
ముఖ్యంగా డు / డ / డు” శబ్దాలు గీతానికి గంభీరతను తెస్తే,
రేరు / నేరు / బుడిబుడి” లాంటి పదాలు గీతానికి లయస్పందనను ఇస్తాయి. 

అన్నమాచార్యులవారు ఇక్కడ ప్రజల జిజ్ఞాసను హాస్యమిశ్రిత వ్యంగ్యంగా చూపించారు. 

కవిత్వపు లక్షణాలు, ఆచారాల కంటే తన అంతరంగపు దృష్టిని సరిగ్గా గుండెల్లో చొచ్చుకొనిపొయేలా చెప్పగలిగారు. 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 238-5 సంపుటము: 3-220
పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము
విరసపు జాలిఁ జిక్కి వెతఁబడ నోపము      ॥పల్లవి॥
 
మగఁడు విడిచినా మామ విడువనియట్లు
నగి నామనసు రోసినా లోకులు మానరు
తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు
మొగమోటలను నేను మోసపోవనోపను    ॥పర॥
 
పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు
విసిగి నే విడిచినా విడువరు లోకులు
కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు
పసలేని పనులకు బడల నేనోపను          ॥పర॥
 
నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు
కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు
తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ
బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను    ॥పర॥

Details and Explanations:

పల్లవి
పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము
విరసపు జాలిఁ జిక్కి వెతఁబడ నోపము ॥పల్లవి॥  
Telugu Phrase
Meaning
పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము
పరమాత్మా నిన్ను కొలిచి బ్రతుకుతున్నాము
విరసపు జాలిఁ జిక్కి వెతఁబడ నోపము 
విరసపు జాలిఁ = self-Pity. (also refer to Poem No. 259).
ప్రజలంతా స్వీయ జాలితో చేపట్టు పనులలో పడి శ్రమను అలసటను కొని తెచ్చుకోము.

 

సూటి భావము:

“ఓ పరమాత్మా! నీ సేవలోనే మా జీవనోపాయం ఉంది. దీనిని స్వీయ దయలో మునిగి వ్యర్థ ప్రయాసలవైపు జారిపోనివ్వము. (shall not get trapped in Self-pity).” 

గూఢార్థవివరణము: 

జీవనము – జీవితం మధ్య తేడా: ఇక్కడ ముఖ్యంగా చూడవలసినది జీవనము జీవితముల మధ్య వ్యత్యాసం. జీవనమన్నది నడచుచున్న, బ్రతికి వున్న​ దానికి ప్రతీక. శరీరం, శ్వాస, చైతన్యం మేళవించియున్న తక్షణాను అనుభవం.​ జీవితమన్నది మనం వేసుకున్న ఒక ప్రణాళిక. “ఎలా బ్రతకాలి” అనే భావన, జీవనానికి నీడలాంటిది. 

బ్రదికేము” = జీవనము (Living): ఇక్కడ బ్రదికేము అంటే క్షణక్షణమునకు తననుతాను మార్చుకొనుచున్న అవ్యక్త స్థితిని సూచిస్తున్నారు అన్నమాచార్యులు. నిత్యనూతనము అంటే ఇదే. ఆ స్థితిలో అంతకుముందు జరిగిన వాని స్పృహ కానీ ఆ తరువాత జరగబోయేవానిపై విచారణ కానీ ఉండదు. 

లాజికల్గా ఆలోచిస్తే అది మరణము జీవనముల సరిహద్దులో నిలిచి ఉండు స్థితి. ఇంకొంచం లోతుగా ఆలోచిస్తే తరచి చూస్తే అది వూహలకు అందని అతి సన్నని పొర అనిపిస్తుంది. త్యాగరాజులవారు అన్నమాచార్యులవారు రామదాసులవారు పేర్కొన్న తెర ఇదే. అది భౌతికముగా కన్పట్టు తెర కాదు. 

బైబిల్‌: దీనిని బైబిల్‌లో చెప్పిన క్రింది మాటలతో పోల్చవచ్చును. అప్పుడు యేసు తన శిష్యులను చూచి “ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడలతన్నుతాను ఉపేక్షించుకొనితన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనునునా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును.” (ముత్తయి 16:24-26).

ఇక్కడ యేసు “జీవితం” (Life)ను పట్టుకోని వేళ్ళాడడం వ్యర్థమని, దానిని వదులుకోవడంలోనే నిజమైన “జీవనము” (Living) లభిస్తుందని చెబుతున్నారు. 

అన్నమాచార్యుల “బ్రదికేము”తో అన్వయము:

  • ఇరువురి వాక్యాలలోనూ ఒకే సత్యం ప్రతిధ్వనిస్తుంది.
  • నిజమైన జీవనము అనేది సమర్పణలో, నూతనత్వంలో, స్వీయ భారముల నుండి విముక్తిలో దొరుకుతుంది.

విరసపు జాలిఁ జిక్కి వెతఁబడ నోపము

అన్నమాచార్యులవారు మానవునికి తనపట్ల తనకున్న జాలిని (self-pity) అనేక కీర్తనలలో ప్రస్తావించారు. ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యాంశం ఏమిటంటే — ఈ జాలి అనేది మనకు నేరుగా కనిపించదు. అది ఎప్పుడూ పక్కదారి పట్టిస్తూ, లోపల నుంచి నెమ్మదిగా ప్రేరేపిస్తుంది. అందువల్ల దాని ఉనికిని మనం గుర్తించలేకపోతాం. దీనికి రక్షణ, భద్రత వంటి భావాలతో అంతర్గత సంబంధం ఉంది. 

పైన చెప్పిన “బ్రదికేము” అన్న పదబంధం అనేక సందిగ్ధతల మధ్య రక్షణ-భద్రతల లోపంతో కూడిన జీవనస్థితిని సూచిస్తుంది. ఇలాంటి జీవనం ఎవరికీ ఇష్టం ఉండదు; ప్రతి ఒక్కరూ తమ జీవితం సజావుగా, సుఖంగా సాగిపోవాలని కోరుకుంటారు.

 

ఇప్పుడు రీనీ మాగ్రెట్ గారి "The Territory (=రాజ్యము)" అనే చిత్రాన్ని ఒకసారి గమనించండి. ఆ చిత్రంలో గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే ఒక భూఖండాన్ని చూస్తాం. దాని కింది భాగం నుండి పక్కల వరకూ మేఘాల పొరలు దాన్ని కప్పి ఉంచాయి. అట్లాగే మన మనసును కూడా రక్షణ, భద్రత అనే భావాలు ఒక దీవి (island)లా పరిమితం చేసి కప్పివేస్తాయి.


అందువలననే అన్నమాచార్యులవారు మొదటి పంక్తిలో “బ్రదికేము అని చెప్పి రెండో పంక్తిలో తాము ఏమి చేయరో చెప్పినారు.

 


మొదటి చరణం:
మగఁడు విడిచినా మామ విడువనియట్లు
నగి నామనసు రోసినా లోకులు మానరు
తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు
మొగమోటలను నేను మోసపోవనోపను          ॥పర॥              
Telugu Phrase
Meaning
మగఁడు విడిచినా మామ విడువనియట్లు
మొగుడు విడిచినా మామ పంతము వదలనట్లు
నగి నామనసు రోసినా లోకులు మానరు
నవ్వుకొని నా మనసు చెడు విషయములను వదలివేసినా, పూర్వపు లోకులు అదే పంథాలో నన్ను చూతురు.
తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు
నా  బలహీనతను, దీనావస్థను బయటపెట్టి తగులుకునేరు, దుఃఖపెట్టుదురు
మొగమోటలను నేను మోసపోవనోపను
కానీ నేను మోమోటములలో పడి మోసపోను. (వారి మాటలను నేను విశ్వసించి ఆయా పనులలో పడదలచుకోలేదు)

తాత్విక​ భావము: (ఈ కీర్తనను అన్నమాచార్యులవారు తనను స్త్రీగా ఊహించుకుంటూనే వ్రాశారు.) “మొగుడు తన పంతం వదిలిపెట్టిన మామ ఇంకా వదలనట్లుగా నేను ఏదైనా విషయాన్ని త్యజించదలచిన కూడా ఈ లోకం మాత్రం నన్ను ముందటి లాగానే చూచుచు నా బలహీనతలను ఎత్తి చూపుచు పని లేకున్నా కూడా నన్ను పొడుస్తూ ఉంటారు. కానీ దైవమా! ఆ మాటలకు ఆ మొహమాటములలో పడి నేను మోసపోలేను (అని వేడుకుంటున్నారు).

లోకుల మాటలు విని ఎవరూ తత్వవేత్తలు కాలేరు. ఆ ఆటుపోట్లకు తట్టుకుని నిలబడినప్పుడే కదా సత్య దర్శనము? 

గూఢార్థవివరణము: 

తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు: అన్నమాచార్యుల నిరుపమాన పరిశీలన శక్తికి ఈ చరణము ఉదాహరణము. మనుషులు మారదామనుకున్నా వారిని మారకుండా లోకము పొడుచుకుని తినే విధానాన్ని చూపిస్తున్నారు. 

అన్నమాచార్యుల కీర్తనలకు రీనీ మాగ్రెట్ గారి చిత్రాలకు సంబంధం తరచుగా ఎందుకు చూపిస్తున్నానంటే వారిద్దరు కూడా మౌలికంగా మానవుల మనసు ఏ రకంగా పనిచేస్తుంది; ఈ ప్రపంచం మనిషిని ఏ రకంగా చూస్తుంది అన్న విషయాలపై వాళ్లు అతి లోతైన పరిశోధన చేసి కీర్తనలతోనూ అధివాస్తవిక చిత్రాలతోనూ జనులను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేశారు.

(the fanatics) 'ఉన్మత్తులు' అను పేరుగల ఈ చిత్రంలో కింద మంటలు రేగుతూ ఉంటాయి. పై నుంచి ఒక వంటరి పక్షి ఆ మంటల్ని ఆర్పడానికి కోసం రాళ్ల లాంటి ఏదో వేస్తున్నట్టుగా కనపడుతోంది. బొమ్మంతా కూడా చీకటి నేపథ్యంలో చూపి ఆ పక్షియొక్క ప్రయత్నం అతి దుష్కరమైనది అని చెప్పారు. 

ఆ మంటల్ని జనులు పలికే సూటిపోటి మాటలు అనుకుంటే, ఒంటరి పక్షి  ఒకానొక మానవుడు. అతడు ఒంటరిగా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోలేడు. అందుకనే అన్నమాచార్యులవారు "దైవమా! ఆ మొహమాటంలో పడి నీ ధ్యాసను వదలి వేరొక పనిలో పడలేను" అన్నారు.


రెండవ​ చరణం:

పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు
విసిగి నే విడిచినా విడువరు లోకులు
కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు
పసలేని పనులకు బడల నేనోపను      ॥పర॥ 
Telugu Phrase
Meaning
పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు
దైవము వరమిచ్చినా, పూజారి అడ్డుకున్నట్లు
విసిగి నే విడిచినా విడువరు లోకులు
విసిగి నే విడిచినా విడువరు లోకులు
కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు
కొసరుతారు, నన్ను ముసురుతారు. తమ తమ కోర్కెలకు సమాధానము చెప్పమంటారు.
పసలేని పనులకు బడల నేనోపను
సారము, సత్తువలేని పనులలో పడి నిన్ను మరువలేను.

సూటి భావము:

(అన్నమాచార్యులు దైవమును వేడుకుంటున్నారు) దైవము వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లు, విసిగిపోయి నేను వేడుకున్నా కూడా ఈ లోకం నన్ను విడిచిపెట్టట్లేదు ఇది ఒకటి ఇది ఒకటి చెప్పు అని కోరుతారు నన్ను ముసురుతారు తమతమ సమస్యలకు సమాధానం చెప్పమంటారు దైవమా సారము సత్తువ లేని పనులలో పడి నిన్ను మరువలేను”.


గూఢార్థవివరణము: 

కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు: ఇక్కడ అన్నమాచార్యులవారు అనేక మార్లు ప్రజలు దైవము ప్రత్యక్షముగా వేడుకోమని తనలాంటి వారు ఎన్ని మాటలు చెప్పినా అవి వ్యర్థమేనని విన్నవించుకున్నారు. వారూ దైవమునకు సామాన్య ప్రజలకు సంధి కూర్చు మధ్యవర్తి కింద పని చేయుటకు నిరాకరించారు.


మూడవ​ ​ చరణం:
నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు
కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు
తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ
బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను         ॥పర॥  
Telugu Phrase
Meaning
నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు
కొంత మాట తప్పినా నోములు ఫలమివ్వచ్చేమోకాని
కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు
ఎంత వేడుకొన్నాగానీ ఈ లోకులు నమ్మరు
తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ
శ్రీవేంకటేశ! వీరు నీవెలా వుంటావో చూద్దామని తడుముతారు, నీవెవరో తెలియకనే తగులుకోబోతారు

బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను

ఈ అపరిపక్వమైన మాటలలోను, స్నేహాలలోను తగులుకోలేనయ్య​

సూటి భావము:

(అన్నమాచార్యులు దైవమును వేడుకుంటున్నారు) ఒక్క మాట తప్పినా కూడా నోము ఫలం ఇవ్వచ్చు కానీ ఈ లోకులు ఎంత వేడుకున్నా నమ్మరు; నీ గురించి ఇంకా చెప్పమంటారు. కానీ శ్రీ వేంకటేశ నేనెంత చెప్ప ప్రయత్నించినా కూడా నీవు ఎలా ఉంటావో చూద్దాం అని తడుముతారు. నీవెవరో తెలియక నిన్ను తగులుకోబోతారు. ఈ అపరిపక్వమైన మాటల్లోనూ స్నేహాలలోను నేను ఇమడ లేనయ్య ఇదే నా విన్నపం నీకు”


గూఢార్థవివరణము: 

తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ: పరిపక్వ స్థితికి చేరుకున్న మహాత్ములందరూ దైవము ఎలా ఉంటాడో చెప్పడానికి నిరాకరించారు. కానీ ప్రజలకు దైవం గురించి తెలుసుకునే కుతూహలమే కానీ వాస్తవంగా ఆయన దర్శనానికి తగినట్లుగా తమను తాము సిద్ధపరుచుకోరు. అనవసరపు ప్రయత్నములలో అటు ఇటు తిరుగుచు కాలమును వ్యర్థపరచుకొందురు. దైవమును ఏ మహాత్ముడు కూడా మూడో వ్యక్తికి చూప లేరు. 

చివరికి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉద్ధరేదాత్మనాత్మానం (=నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము భగవద్గీత​ 6-5)  అన్నాడు.


ఈ కీర్తన ముఖ్య సందేశం


అన్నమాచార్యులు ఆచార్యులవారు దేవుడు ఒక్కడే అన్న భావము మనసా వాచా కర్మేణ నమ్మి తక్కినవి వదిలి పెట్టమని ప్రజలకు హితబోధ చేస్తున్నారు. ప్రజలు తమకుతాము పైన వేసుకున్న జాలిని (self-pity) తొలగించి చూడమని పదే పదే చెప్పారు.

 


X-X-The END-X-X

1 comment:

  1. మానవనైజమును చక్కగా ప్రతిబింబిస్తున్న కీర్తన యిది. పల్లవిలో ఆచార్యులవారు చెప్పినట్లుగా బ్రదికేము అన్న పదం జీవనముతో సామ్యమున్నది. జీవితం, జీవనం మధ్యగల అంతరాన్ని చక్కగా విశ్లేషించారు.రినే మాగ్రిట్టి గారి చిత్రం పల్లవిలోని భావానికి అద్దం పట్టింది.

    తాను మారదామనుకొన్నా లోకం మారనివ్వదు. అధివాస్తవిక చిత్రం ఈ చరణంలోని భావాన్ని చక్కగా విశదీకరించింది. దీనికి అనుబంధంగా ఉన్న చిత్రంలో ఈ భావం సుస్పష్టం. లోకులనే మాటలను, ఆటుపోట్లను తట్టుకొని స్థిరచిత్తంతో నిలబడితేనె సత్యదర్శనం అవుతుంది.

    లోకులనే మాటలను, ఆటుపోట్లను తట్టుకొని స్థిరచిత్తంతో నిలబడితేనె సత్యదర్శనం అవుతుంది.షట్ సంపత్తిలో ఒక భాగం తితిక్ష యిదే.

    చాలా బాగుంది మీ వ్యాఖ్యానం.
    👏👏👍💐
    ఓమ్ తత్ సత్ 🙏🏿
    కృష్ణ మోహన్

    ReplyDelete

270 ainadayyī gānidellā naṭu gākuṃḍitē mānī (ఐనదయ్యీఁ గానిదెల్లా నటు గాకుండితే మానీ)

  TALLAPAKA ANNAMACHARYULU 270 ఐనదయ్యీఁ గానిదెల్లా నటు గాకుండితే మానీ (ainadayy ī g ā nidell ā na ṭ u g ā ku ṃḍ it ē m ā n ī)   తె...