అన్నమాచార్యులు
216.
అమ్మెడి దొకటి అసిమలో దొకటి.
ఉపోద్ఘాతము:
మాటలను కత్తుల్లాగా వాడొచ్చు అని విని ఉంటాం. అందుకు ఉదాహరణ ఈ కీర్తన. అతి సులభమైన పదములతో మన గుండెను కోసి దాంట్లో కొత్త రక్తం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు అన్నమాచార్యులవారు. అంగుళాల మందాన ఉన్న మన చర్మంలోకి ఇలాంటి పదాలు ఇంక పనిచెయ్యవండి. అన్నమాచార్యుల తాపత్రయం చూస్తే పాపం ఎదో కష్టపడి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని మనము ఒక సెకను సంతాపం వెలిబుచ్చి దాన్ని వదిలి పెట్టేస్తాం, వాట్సాప్’లో ఈమోజీలు పెట్టినట్టుగా.
మందు లోపలికి వెళ్లకపోతే రోగం తగ్గదు. ఈ కీర్తనలను అర్థం చేసుకోకపోతే శాస్త్రములను అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. బద్ధకము, అశక్తత తర్వాత చేద్దాంలే అని నెట్టుకొని వచ్చే తత్వము ఆనాడే మూర్తీభవించినవి. అన్నమాచార్యులు వ్రాసినది ఏదో పాటలు పాడుకొని సంతోషించడానికి కాదు. వాటిని విని అర్ధం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకోమని చెబుతున్నారు. అదృష్టవశాత్తు చాలా మంది సంగీతకారులు కృషిచేసి ఈ కీర్తనలన్నిటినీ చక్కటి పాటల రూపంలో మనకు అందించారు. ఈ కీర్తనలను నేరుగా విని అర్ధం చేసుకోగలిగే అదృష్టం - తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. ఇకనైనా కొంత కృషిచేసి ఈ కీర్తనలను అర్థం చేసుకోండి. కొంత సమయం దీనికై వినియోగించండి. విలువైన సంపద ఇది. వీటిని పనికిరానివానిగా కొట్టి పారవేయకండి.
ఈ కీర్తనలు, ఈ సంగీతం మనసు ప్రశాంతత కోసమని; అంతకంటే వాటికి విలువ లేదని భావించకండి. ప్రశాంతత దొరుకుతుందని ఐదు చుక్కలు మూడు చుక్కల హోటళ్ళలో మన ఉండటం లేదాండి? ప్రశాంతత దొరుకుతుందని హిమాలయాల్లో కొంత సమయం గడిపి కూడా వస్తున్నారు మనుషులు. ఈ కీర్తనలు మనకి సులభంగా అర్థమయ్యే రీతిలో అన్నమాచార్యులు వ్రాసి పెట్టారండి. ఇందులో కొంత సమయం వినియోగించడం మాత్రమే మనం చేయవలసినపని. అంతలోనే మీకు అద్భుతమైన ప్రపంచపు వాకిళ్లు తెరుచుకుంటాయి అని మనవి చేసుకుంటున్నానండి.
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: దేవా! మేము చేస్తామని
చెప్పేదొకటి. నిజంగా మా హృదయంలో మరొకటి తలుస్తాము. సందేహములతో సతమతమవుతూ నియంత్రణ లేని
మేమెక్కడి పెద్దలమయ్యా? (వయస్సు
పెరిగినదే తప్ప బుద్ధి పెరుగలేదు అని అర్ధము).
మొదటి
చరణం: దేహంలో స్థితుడై ఉన్న జీవుడు దేహముతో సంగమము కలిగి ఉన్నంత కాలం శాశ్వత
శాంతి కలుగదు. ఈ సంగమముతో ఏర్పడినదే ఈ లోకము. ఈ
రకముగా ఎంగిలి పడిన దేహం అపవిత్రమైన శరీరము - మన ముందు నిలిచి
ఉన్న ఈ సంసారమునకు మూలము. దినము ఏదో ఒక కోరికతో తహతహలాడు
మేము ఎక్కడి పెద్దలమయ్యా?
రెండవ
చరణం: కోరికలను మానకుండా, విడిచిపెట్టకుండా కోపం తగ్గదు. కోరికలే ఈ
రహస్యమయమైన మనసుకు ఆధారం. ఈ జీవితాన్ని క్రూరత్వానికి పణంగా పెడుతూ జీవిస్తున్నాం.
ఇక, ఏ విషయంలో మేము పెద్దలమయ్యా?
మూడవ చరణం: "నీవు అనుకున్నవి జరిగితే, ఫలితాలు వచ్చినప్పుడు
ఈ బంధాలు తొలగిపోతాయనుకోడం పొరపాటు. నిజానికి, వాటివల్లే మనం
ఈ ప్రపంచంలో మరింతగా తగులుకుంటాం. ఈ బంధాలను వదిలించుకోవాలంటే, శ్రీవేంకటేశుని దాసులమవడమే (ఒకటే) మార్గం. ఒక్కసారి ఆయన దాసులమైనపుడు, పెద్దలమని చెప్పుకోవాల్సిన అవసరం
ఉండదు."
కీర్తన
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-1 సంపుటము: 1-483
Details
and explanation:
టీక: అమ్మెడి దొకటి = అమ్ముతామని చూపించేదొకటి (దేవా! నీకు హృదయం ఇస్తాను, నా చర్మంతో చెప్పులు కుట్టిస్తాను లాంటివి); అసిమలో దొకటి = సంచీలోని దొకటి (= శరీరము లోపలిది మరి యొకటి); బిమ్మిటి = సంకోచము, నియంత్రణ లేని; నిందేటి పెద్దలమయ్యా = ఇక్కడ ఎటువంటి పెద్దలమయ్యా.
భావము: దేవా! మేము చేస్తామని చెప్పేదొకటి. నిజంగా మా హృదయంలో మరొకటి తలుస్తాము. సందేహములతో సతమతమవుతూ నియంత్రణ లేని మేమెక్కడి పెద్దలమయ్యా? (వయస్సు పెరిగినదే తప్ప బుద్ధి పెరుగలేదు అని అర్ధము)
వివరణ:
ఈ పల్లవిని చూస్తే అలా ఎవరు చెయ్యరు. “అన్నమాచార్యులవారు పొరపాటు పడ్డారేమో?” అనుకుంటాం. కాదండి. పదహారణాల సత్యం అండి. ఎవరైతే చెప్పిందే చేస్తారో వారికి దైవానికి వ్యత్యాసం లేదండి. ఇప్పుడు చెప్పండి ఆచార్యులవారు పొరపాటు పడ్డారో, లేదో. అయితే కొందరూ కొన్ని విషయాల్లో చెప్పిందే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అన్ని విషయాల్లోనూ చెప్పిందే చేయడం దాదాపు అసాధ్యము.
బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా: ఇలా పెదవి మీద ఒకటి మనసులో ఇంకొకటి - రెండు రకాల విషయాలు మనలను వెంటాడుతుంటే సందేహాలు కలుగక మానవు. అవి మనిషిని దహించక మానవు. ఈ రకంగా చూస్తే మనలో ఉన్న విరుద్ధ భావనలే మనల్ని సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్నాయి అన్న విషయం తెలుస్తోంది. పరస్పర విరుద్ధ భావనలతో మనం ఎన్ని యుగాల కాలం ఈ ప్రపంచంలో గడిపినా బుద్ధిపరంగా పెరగము అన్న విషయాన్ని చెబుతున్నారు.
ఈ కీర్తనలో పెద్దలు అంటే స్థితప్రజ్ఞులు అన్న ఉద్దేశంలో వాడారు. “పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము” అన్న కీర్తనలో కూడా వయస్సు పెరిగితే పెద్దతనము రాదు; పెద్దతనము బుద్ధి పెరిగితేవచ్చును అన్న విషయం చెప్పారు.
మొదటి చరణం
ముఖ్య
పదాలకు అర్థాలు: సంగము = కూడిక, చేరిక, మేళవము, కలియడము
(= దేహముతో సంగమును సూచించారు); యెంగిలిదేహం =
అపవిత్రమైన శరీరము; బెంగలము = విరహవ్యధ,
బెంగల మిందేటి = మయో ఏదో ఒక కోరికతో తహతహలాడు;
భావము: దేహంలో స్థితుడై ఉన్న జీవుడు దేహముతో సంగమము కలిగి ఉన్నంత కాలం శాశ్వత శాంతి కలుగదు. ఈ సంగమముతో ఏర్పడినదే ఈ లోకము. ఈ రకముగా ఎంగిలి పడిన దేహం అపవిత్రమైన శరీరము - మన ముందు నిలిచి ఉన్న ఈ సంసారమునకు మూలము. దినము ఏదో ఒక కోరికతో తహతహలాడు మేము ఎక్కడి పెద్దలమయ్యా?
వివరణము:
ముందుగా అన్నమాచార్యులు వారి క్రింది చరణాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి.
ప్రత్యక్షార్థం: పూట పూట పొట్ట నింపుకోవాలనే కోరికతో, మనిషి అన్ని దిశలలో పరుగులు తీస్తాడు. ఈ పరుగులలో ధూళి, చెమట, దుర్భర పరిస్థితుల నడుమ అతడు కష్టపడతాడు. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు సౌకర్యాల కోసం సుఖాల కోసం తహతహలాడతాడు. తన శరీరానికి ఓ చిన్న అసౌకర్యం వచ్చినా భరించలేడు.
సూచ్యార్థం: అలుపెరుగని కోరికలు మానవుని నడిపిస్తాయి. తన కోరికలు తీరేకొద్దీ మళ్ళీ కొత్త కోరికలను సృష్టించుకుంటూ పోతుంటాడు. ఈ అప్రతిహత కోరికల ప్రక్రియలో తన జీవశక్తిని అంతా ఖర్చు చేస్తాడు.
ఇలా సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతున్న మేము ఎక్కడి పెద్దలమయ్య?
రెండవ చరణం
Word to word meaning: కోరికెలు = desires; ఉడుగక = విడువక, without subsiding; కోపంబు = anger; ఉడుగదు = తగ్గదు, సమసిపోదు does not subside; కోరకుండదు = without desire; ఇక్కువ = రహస్యము, secret, existence; మనసు = mind; క్రూరత్వమునకు = for the cruelty; కుదువ = తాకట్టు, to pawn, to pledge; యీ బ్రదుకు = this life; పేరడి = excessively, ఎక్కువగా; నేమిటి = what kind of; పెద్దలమయ్యా = gentlemen.
భావము: కోరికలను మానకుండా, విడిచిపెట్టకుండా
కోపం తగ్గదు. కోరికలే ఈ రహస్యమయమైన మనసుకు ఆధారం. ఈ జీవితాన్ని క్రూరత్వానికి
పణంగా పెడుతూ జీవిస్తున్నాం. ఇక, ఏ విషయంలో మేము పెద్దలమయ్యా?
వివరణము:
"కోరకుండ
దిక్కువ మనసు" (కోరికలు లేకపోతే మనస్సుకు ఆధారం ఉండదు.) మనస్సు స్వరూపమే రహస్యమైనది. ఇది కోరికల ఆధారంగా ఆవిర్భవిస్తుంది. ఈ
కోరికలే మనల్ని జీవనయానంలో నడిపిస్తాయి. మనస్సుకు రూపం ఇచ్చేది కోరికలు, వాటి ద్వారా మన ఆలోచనా విధానం, ప్రవర్తన, అనుభవాలన్నీ మలచబడతాయి.
"కోరికె లుడుగక కోపం బుడుగదు" (కోరికలను విడిచిపెట్టకుంటే, కోపం తగ్గదు.) ఇది క్రూరత్వం ఎలా ఉత్పన్నమవుతుందో చూపిస్తుంది. కోరికలు మరియు కోపం పరస్పరం అనుసంధానమైనవి. కోరికలు నెరవేరనప్పుడు, మనస్సులో అసంతృప్తి పెరిగి, అది కోపంగా మారుతుంది. అసంతృప్తితో ఉన్న మనిషి ఇతరుల పట్ల అశ్రద్ధగా, దురుసుగా ప్రవర్తించటానికి మరింతగా ప్రేరేపించబడతాడు.
"క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు" (మన జీవితం క్రూరత్వానికి తాకట్టు పెట్టబడుతోంది.) ఈ భావన మనం అనేక మార్లు చర్చించిన conditioning (అలవాటైన పద్ధతి లేదా స్థితి వ్యాజము) తత్వాన్ని గుర్తుకు తెస్తుంది. పైన చెప్పినట్లుగా దురుసు ప్రవర్తనతో క్రూరత్వం ప్రదర్శించి బదులుగా శాంతి వస్తుందనే భ్రమలో ఉంటాం.
ప్రత్యేకించి, మన అభిప్రాయాలు పక్కవారి అభిప్రాయాలకంటే మెరుగైనవన్న భావన మానవ సహజ స్వభావంగా మారిపోతుంది. ఇది ఇతరుల మాటలను విలువ లేకుండా చేసేందుకు దోహదపడుతుంది. మన జీవితంలో జరిగే ఘటనలను నిష్పాక్షికంగా పరిశీలించినప్పుడు, మన ఈ తీరును సులభంగా గుర్తించగలం.
అన్నమాచార్యులు ఇక్కడ మనిషి అజ్ఞానం వలన క్రూరత్వానికి అనుకోకుండా సహకరిస్తున్న వాస్తవాన్ని చెబుతున్నారు. స్వార్థం, అసూయ, అధికారం కోసం తహతహలు, క్షుద్రత—ఇవి సమాజంలో నిత్య సత్యాలుగా మారిపోయాయి. మనిషి హింసను సహజమైనదిగా భావిస్తూ, దాన్ని గమనించకపోవడం పాదుకున్న రుగ్మతకు చిహ్నములు.
"పేరడి
నేమిటి పెద్దలమయ్యా" (ఈ పరిస్థితిలో, మేము నిజంగా
పెద్దలమా?) అన్నమాచార్యులు మానవుని వయస్సు పెరుగుతున్నా, నిజమైన
జ్ఞానం పెరుగుతోందా అని ప్రశ్నిస్తున్నారు. ఇది conditioningను (అలవాటుపడి అప్రయత్నముగా చేయు విధానమును) బహిరంగంగా ప్రశ్నించే వాక్యంగా
నిలుస్తుంది. ఎప్పటికీ కోరికలతో, కోపంతో, క్రూరత్వంతో మెలిగే మనుషుల సమాజాన్ని చూసి, నిజమైన
పురోగతి ఉందా? అని ప్రశ్నించినట్లు కనబడుతుంది
ఇక పోతే, కోరికలకు లోబడకుండానే మనస్సును సమతుల్యంగా ఉంచగలిగితే, అసలు క్రూరత్వం పుట్టే అవకాశమే ఉండదని అన్నమాచార్యులు సూచిస్తున్నారు. ఈ చరణం మన conditioningను (స్థితి కల్పించు మానసిక భ్రమ = స్థితిచేత పేరుకొన్న అభిప్రాయముల సమాహారమును) ప్రశ్నించి, మనము నిజమైన జ్ఞానాన్ని పొందే దిశలో అడుగులు వేయాలన్న సందేశాన్ని ఇస్తుంది.
ఈ చరణాన్ని రెనీ మాగ్రిట్ 1967లో రూపొందించిన "The Blank Page" అనే కళాఖండంతో అన్వయించుకోవచ్చు. ఇది ఒక ప్రశాంతమైన రాత్రి దృశ్యాన్ని అందిస్తుంది. ముదురు నీలి ఆకాశం నిశ్శబ్దంగా విస్తరించి, ఒక అంతులేని ప్రశాంతతను సృష్టిస్తోంది.
పైభాగంలో, ఆధారం లేకుండా చెట్టుల కొమ్మలు, ఆకులు కనిపిస్తున్నాయి. ఇవి చల్లటి రంగులతో చిత్రించబడి, ఆకాశాన్ని కొంతవరకు కప్పివేస్తున్నాయి. ఈ దృశ్యం కలలా, కల్పితమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఆ ఆకుల పైనుండి, సంపూర్ణ చంద్రుడు మృదువైన వెన్నెలను విరజిమ్ముతూ కనిపిస్తున్నాడు. ఇది ఒక తాత్వికమైన, లోతైన మౌనభావనను కలిగిస్తుంది.
దూరంగా, చీకటిలో
మసకబారిన నగరం కనిపిస్తుంది. నగరంలోని కట్టడాలు స్పష్టంగా కనబడకపోయినా, వాటి కిటికీల నుండి వెలువడే కాంతి లోపల జీవనం కొనసాగుతున్నట్టు
సూచిస్తుంది.
నగరాన్ని కప్పిన ఆ చీకటి, వాస్తవానికి, మనల్నీ చుట్టుముట్టింది. మనకు తెలిసో తెలియకో, మనం వెలుగులో ఉన్నామని భావిస్తాము. కానీ, మిగతా ప్రపంచమంతా అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నట్టు అనిపిస్తుంది.
మనిషి తనను తనే వేరుచేసుకుని, తన దృష్టితోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆకాశంలో వేలాడుతున్న ఆకులు మనలో ప్రచ్ఛన్నమైన, నిద్రాణమైన ఆలోచనలకు ప్రతిరూపం. వాస్తవానికి ఆకుల వెనక ఉండవలసిన చంద్రుణ్ణి ఆకుల పైకి తీసుకువచ్చినట్టు చూపి మనం ఆ క్షణంలో చేయు ఆలోచనలను పైకెత్తి చూపినట్లు (ఎలివేట్ చేసినట్లు) తెలుస్తోంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది—మన ఆలోచనలు నిజంగా సత్యమా? లేక అవి మన conditioning (స్థితివ్యాజం) ఫలితమా?
ఒకసారి మన ఆలోచనలపై ప్రగాఢమైన విశ్వాసం
ఏర్పడినపుడు,
👉 ఇతరుల అభిప్రాయాలను నిరాకరిస్తాం.
ఈ చిత్రం ఒక లోతైన నిజాన్ని సూచిస్తుంది—మనిషి తన ఆలోచనల ఊహాజాలంలో చిక్కుకుని, విశాల ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడు.
తన స్వంత అభిప్రాయాల్లోనే మునిగిపోతూ, ఏకాకిగా జీవిస్తున్నాడు.
ఈ సందర్భంగా అన్నమాచార్యులు వారి క్రింది చరణాన్ని కూడా గుర్తు చేసుకుందాం.
ఈ దేహము లేదా క్షేత్రము మనిషి ఆశపడి ఎంచుకున్నదే. అయితే, ఈ రణక్షేత్రంలో అనేకానేక వాగ్దానాల నేపథ్యంలో రక్తపాతానికి దార్లు తెరుస్తాడు. అన్నమాచార్యులవారు మానవుని యొక్క ఉనికిని ఆద్యంతములు పరికించి కీర్తనలు వ్రాశారు అన్నది నిర్వివాదాంశము.
మూడవ చరణం:
భావము: "నీవు అనుకున్నవి
జరిగితే, ఫలితాలు వచ్చినప్పుడు ఈ బంధాలు తొలగిపోతాయనుకోడం పొరపాటు.
నిజానికి, వాటివల్లే మనం ఈ ప్రపంచంలో మరింతగా తగులుకుంటాం. ఈ
బంధాలను వదిలించుకోవాలంటే, శ్రీవేంకటేశుని దాసులమవడమే (ఒకటే) మార్గం. ఒక్కసారి ఆయన దాసులమైనపుడు, పెద్దలమని చెప్పుకోవాల్సిన అవసరం
ఉండదు."
వివరణము:
ఫలము లందితే బంధము వీడదు: క్రింది అన్నమాచార్యులవారి ఇంకొక కీర్తన లోని చరణము చూడండి.
భావము: అన్ని కోరికలు అణిగిపోయిన తర్వాత తత్వం తెలుసుకుంటాను అంటే కుదరదు. ఈ దాహం, ఈ కోరికలు అణుగుతాయా? లేదే! అలాంటి వాడు ఏం తత్వం తెలుసుకుంటాడు? లేడు. శరీరమున్నంతకాలం దాని సహజ స్వభావం వల్ల ఈ అభిలాషలు, కోరికలు తప్పవని స్పష్టమే. అలాంటప్పుడు, నిజమైన ఆనందాన్ని ఎవరు పొందగలరు? పొందలేరు!
ఫలముతో తగులు ప్రపంచము: మనను ప్రపంచమును కలుపుతున్నవి కోరికలు. ఇది మాటలలో చెప్పడమే సులభం. కానీ ఈ మాటలో దాగిన సత్యాన్ని మేం ఎప్పుడూ గమనించం. ఇక్కడ మాగ్రిట్ వేసిన బొమ్మను (The Blank Page) మరోసారి గుర్తు చేసుకుందాం.
ఆ చిత్రంలో, ఒక ప్రశాంతమైన నిశీధి దృశ్యం ఉంది. ముదురు నీలి ఆకాశం నిశ్శబ్దంగా విస్తరించి, అంతులేని ప్రశాంతతను సూచిస్తుంది. దూరంగా కనిపించే నగరం — అదే ఈ ప్రపంచం. మనకు ఆ నగరానికి మధ్య ఉన్న ఖాళీ — అదే మనలోని అసంతృప్తి, మనం గమనించని అశాంతి.
మానవుడు చేయవలసినదల్లా అక్కడ ఆకాశంలో వేలాడుతున్న ఊహాజనిత కోరికలను చూచి, అవి తన మనస్సును ఎలా ఆక్రమిస్తున్నాయో అవగాహనలోకి తీసుకురావాలి. ఈ ప్రక్రియలో, తనను ప్రపంచం నుండి వేరు చేస్తున్న అన్ని ‘తెరలు’ తొలగించాలి.
అయితే నిజానికి మనం అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం "తాను నిమిత్తమాత్రుడే" అన్న సత్యాన్ని గ్రహించి, భగవంతుడి పట్ల నమ్మకం ఉంచి, తాను ఉన్న చోట సాక్షిగా నిలబడగలిగితే చాలును. ఇదే మన పని. అదే మనిషి మరియు దైవం మధ్య నిలిచే అడ్డుగోడలను తొలగించే మార్గం.
ఈ పని కూడా చెయ్యలేని మన అశక్తతను పక్కన
పెట్టి, “నేను గొప్పవాడిని” “నేను అది కనిపెట్టాను” “నేను
ప్రపంచానికి ఇంత చేశాను” అని గర్వంతో విర్రవీగు మనము ఎలా
పెద్దలమవుతాం? పెద్దవాడిననే చెప్పుకునే అర్హత కూడా మనకు లేకపోవచ్చు.
x-x-x-x