Saturday, 29 March 2025

T-215. మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది

 అన్నమాచార్యులు

215. మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది

 ఉపోద్ఘాతము: 

ఈ కీర్తనలో వేదాంత రహస్యము ముఖ్యంగా ప్రస్తావించ బడినది. వేదాంతము అనే పదానికి '(ఇహ సంబంధమైన) ​జ్ఞానమునకు ముగింపు' అని అర్థం. వేదము ప్రాధాన్యంగా భక్తి, జ్ఞానం, మరియు విముక్తిపై దృష్టి పెడుతుంది. వేదాంతం అనేక సంప్రదాయాలుగా అభివృద్ధి చెందింది, వీటిపై వివరణలను ప్రస్థానత్రయీ అని పిలువబడే ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మరియు భగవద్గీత అను గ్రంథాల నుండి పొందవచ్చును. 

అయితే, ఎన్ని గ్రంధాలు చదవండి, ఎంత మంది చెప్పిన వివరణలను వినండి, వేదాంత రహస్యముపై ఎంతో కొంత అనుమానం మిగిలిపోతూనే ఉంటుంది. ఇదే మానవునికి ప్రాథమికమైన సమస్య వేదాంతమునకు ఇదే చివరిమాట అనినొక్కి చెప్పలేము.   

అందుకనే అన్నమాచార్యులు ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల / కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే అని ప్రశ్నించారు. ఈ శాస్త్రములు / వేదములు) ఇన్నియుఁ జదువనేల? యింతటా (దైవమును) వెదకనేల? కనులు తెరచుటలోను కనులు మూయుటలోను బేధమున్నదా? (లేదు). జననం, మరణం రెండే రెండు పరమ వాస్తవాలు. అనివార్యమైన ఈ  అవధుల మధ్యకాలమును సిద్ధాంతాలతోను, వెదుకుటలోనూ వృథా చేయవద్దు. మానవులారా! మీ ఇప్పటి అవగాహనలను ప్రక్కన బెట్టి, ఎదురుగా వున్న ఈ ప్రపంచమును (అందులోనే వున్న హరిని​) కనుగొనుడీ! అని ఉద్భోదించారు. 

అన్నమాచార్యులవారు కైవల్యపదమును చేరుకొన్నారను విషయమును అనేక కీర్తనలనుండి తెలియవచ్చును. అట్టి ఉత్కృష్ట స్థితికి చేరిన మహానుభావులు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః అన్న భగవద్గీత వాక్యమును తమ నిజ జీవితంలో అనుసరించువారై ఉందురు. అనగావారు ఏ సిద్ధాంతములను, జీవులను ఆలంబనగా చేసుకుని జీవించరు. ఇదే విషయమును జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్రను పరిశీలించి తెలుసుకొనవచ్చును. 

అందుకని ఈ కీర్తనను కొంత తర్కంతోను కొంత అనుభవంతోను, కొన్ని నిజ జీవితపు సంఘటనలను కలుపుతూ చర్చించుకుందాం.

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: మానవులారా మీ మనసు భవిష్యత్తుపై 3 నుంచి 9 (ఆపై 27) లాగా అంచనాలు పెంచుకుంటూ  పరిగెడుతూనే ఉంటుంది. (అది ఆగదు). అయ్యలారా ఆ శ్రీహరిని వేడుకొని ఆ వేదాంత రహస్యము తెలిసి తరించండి. 

మొదటి చరణం: మానవులారా జీవస్వరూపముపై మంథన చేసి మీలో ఉన్న జీవమే అంతటాను వ్యాపించి ఉన్నదని  గ్రహించి, అదియే దేవుని వైభవము అని అంతరంగములో నిలుపండి. పుంఖానుపుంఖంగా సాగుతున్న సృష్టి సర్వవ్యాపియైన భగవంతుని మహిమే - ఈ తరగని ప్రకృతి సంపద.  అదియే వేదాంత రహస్యము. అంతరార్థము: జీవస్వరూపాన్ని నిజంగా తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రపంచాన్ని, మనల్ని విభజిస్తున్న భ్రమలను తొలగించి, జీవమును యథార్థంగా అనుభవించగలిగితే – అప్పుడే జీవితం సమగ్రమవుతుంది. అదే వేదాంత రహస్యము. 

రెండవ చరణం: అప్పుడు మీరు మీలో లోకానుభవమువలనఁగలిగిన తెలివిని తెలుసుకుంటూ, అదే పనిగా అది జీవము కాని విషయమని, జీవమునకు సంబంధించని దని తలపోసి దైవమును నమ్మి అలాగే వుండండి.  వైరాగ్యముగా అంటే అది మనంతటకు మనము ప్రక్కకు త్రోసి వేయగలిగిన విషయం కాదు అన్నదే  వినవలసినటువంటి వేదాంత రహస్యము. 

మూడవ చరణం: ఇదమిత్థముగా నిర్ణయించలేని శరణాగతి యొక్కటే ఉపాయముగా భగవంతునిపై పూర్తి విశ్వాసముతో అనంతమగు సత్యము నందు బేషరతుగా (వేరొక ఉపాయమును అలోచించక) కలసిపోవుటయే బ్రహ్మానంద వేదాంత రహస్యము.  

కీర్తన 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 370-3 సంపుటము: 4-412
 

మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదవరో వేదాంత రహస్యము || పల్లవి|| 

చరణం 1

జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే
వేవేలు విధముల వేదాంత రహస్యము ||మూడే || 

చరణం 2

తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మరవకుండుటే
వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||మూడే || 

చరణం 3

వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||మూడే ||

Details and explanation: 

మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదవరో వేదాంత రహస్యము || పల్లవి|| 

భావము: మానవులారా మీ మనసు భవిష్యత్తుపై 3 నుంచి 9 (ఆపై 27) లాగా అంచనాలు పెంచుకుంటూ  పరిగెడుతూనే ఉంటుంది. (అది ఆగదు). అయ్యలారా ఆ శ్రీహరిని వేడుకొని ఆ వేదాంత రహస్యము తెలిసి తరించండి. 

వివరణ:

మనస్సు అత్యంత సారవంతమైన భూమి. అందులో ఏ బీజాన్ని నాటినా మొలకెత్తుతుంది. మన ఆలోచనలే ఆ బీజాలు. 

మానవుల మనసు ఎప్పుడు భవిష్యత్తుపై ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు 3, 9, 27 లాంటి గుణశ్రేఢిలో విస్తరిస్తూ ముందుకు దూసుకెళ్తాయి,

కానీ మన చేతలు 1, 2, 3 లాంటి అంకశ్రేఢిలో నెమ్మదిగా సాగుతాయి. 

దీని ఫలితంగా, మన ఊహలు వాస్తవం కంటే ముందుకు పరుగెడుతూనే ఉంటాయి. ఈ వ్యత్యాసమే అసంతృప్తికి మూలం. 

అలా అసంతృప్తి చెందిన వ్యక్తుల సమూహమే నేటి సమాజం.ఈ సమాజంలో నెలకొన్న అస్తవ్యస్తతకు ప్రతి ఒక్కరి అంతర్గత అశాంతే మూలకారణం. 

ఆచార్యులు ఇక్కడ "వేడుకొని చదవమని" ఎందుకు అన్నారుఎందుకంటే, మనం ఎంత ప్రయత్నించినా మనస్సు వేరే దిశలో లాక్కుంటూ పోతుంది. అట్టి మనస్సును సంభాళించి, శ్రీహరిని వేడుకొని, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. 

ఇక్కడ వేదాంతరహస్యముతో ఎంత చదివినా ఎంత వినినా అంతుబట్టకపోవడమును సూచించారు 

వేదాంత రహస్యాలు ఎంత చదివినా, ఎంత వినినా పూర్తిగా అంతుబట్టకపోవడం సహజం. కావున, గ్రహించేందుకు భక్తి, సాధన, ఆత్మసాక్షాత్కారం అవసరం. 

మొదటి చరణం 

జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే
వేవేలు విధముల వేదాంత రహస్యము ||మూడే || 

భావము: మానవులారా జీవస్వరూపముపై మంథన చేసి మీలో ఉన్న జీవమే అంతటాను వ్యాపించి ఉన్నదని  గ్రహించి, అదియే దేవుని వైభవము అని అంతరంగములో నిలుపండి. పుంఖానుపుంఖంగా సాగుతున్న సృష్టి సర్వవ్యాపియైన భగవంతుని మహిమే - ఈ తరగని ప్రకృతి సంపద.  అదియే వేదాంత రహస్యము. 

వివరణము: 

జీవస్వరూపము – మానవుని మౌలిక ప్రశ్న 

జీవస్వరూపము అంటే ఏమిటి? మనము నిజంగా జీవిస్తున్నామా? లేక కేవలం శారీరకంగా ఉనికిలో ఉన్నామా? బతికే ఉన్నాం అనడానికి సాక్ష్యం ఏమిటి? జీవస్వరూపమునకు ఇదమిత్థమైన రూపం ఉండదని మీరు గ్రహించే ఉంటారు. భగవానుని అవతారాలు అనేక రూపములలో చూపుటకు ఇదే కారణం. 

అన్నమాచార్యులు ఈ పల్లవిలో మన ముందు ఒక ప్రశ్న పెడుతున్నారు: "చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి?" (ఎంతో శ్రమించి చేసే ప్రస్తుత జీవితానికి, మరణానికి వ్యత్యాసమేమి?). మనం చేసే ప్రయత్నాలన్నీ అసలు నిజమైన జీవనానికి దారితీస్తున్నాయా? లేక అవి ఒక భ్రమలో మిగిలిపోతున్నాయా? 

మహాభారతంలో భీష్ముల వారి ఉద్బోధ అంతా "ఏకాగ్రత" పైనే. అంటే "దైవముతప్ప వేరువిషయములు లేవు అని మనిషి ఉండవలెను" అన్న విషయం గుర్తుకు తెచ్చుకుందాం. 

మనుషులు జీవించలేరా? లేదా జీవించనివారైపోయారా? జిడ్డు కృష్ణమూర్తిగారు ఒక గొప్ప మాట చెప్పారు: "IF YOU ARE NOT IN COMMUNION with anything, you are a dead human being." (నీవు చేస్తున్న దేనితోనైనా నిజమైన అనుబంధం లేకుంటే, నీవు మృతప్రాయుడవు.) మన అనుబంధాలలో ఏకత్వం లేదు. అవి కొంత స్వప్రయోజనాలు కొంత ప్రేమ ఒలకబోస్తూ కలగూరగంపలా ఉంటాయి. 

మన భావాలు మన హృదయంలోనే పరిమితమై ఉంటాయి; అవి నేరుగా ఇతరులకు తాకవు. మన అనుభవాలు కూడా మనమే నిర్మించుకున్న ప్రొజెక్షన్లే. అందుకే, మనం నిజంగా జీవిస్తున్నామా? లేకపోతే మన ఉనికే ఒక భ్రమయా? 

ప్రపంచం మనకు – మనం ప్రపంచానికి ఎంత దూరం? మనకు ప్రపంచానికి మధ్య ఒక మానసిక దూరం ఉంది. ఈ దూరాన్ని తొలగించేందుకు చేసే ప్రయత్నాలన్నీ కృత్రిమమైనవే. మనస్సును బలవంతంగా మార్చడానికి చేసే అన్ని సాధనలూ విఫలమవుతాయి. 

అన్నమాచార్యులు చేరిన స్థితికి చేరుకున్న మహానుభావులందరూ ఈ మానసిక విభజనను తొలగించడానికి ప్రయత్నించారు. వారు తాము మరియు ప్రపంచం మధ్య గల దూరాన్ని చెరిపివేసి, ప్రపంచంతో తాదాత్మ్యాన్ని అనుభవించారు. ప్రపంచంతో అచంచలమైన ఆత్మీయ భావనకు పెద్దపీట వేశారు. 

అన్నమాచార్యుల ఆంతర్యం: అన్నమాచార్యుల స్థితి ఏదైనా సిద్ధాంతంతో ముడిపడలేదు. జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. వారిద్దరు కూడా కేవలం ప్రపంచాన్ని మనకు అద్దంలో చూపించినట్టు చూపించారు. 

అన్నమాచార్యులు తనను తాను ప్రకృతి సంపదగాను అనుభవించి, భావించి వ్రాశారు. ఇదే భావాన్ని జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా వ్యక్తపరచినట్లు స్పష్టమవుతోంది. 

జీవము అనునది నిరంతరమూ సాగు (భగవంతుని) వ్యవసాయం. జీవితము అనునది దేహ సంబంధమైనది. జీవమును పదార్థముతో గూడిన జీవితంతో ముడి పెట్టరాదు అన్నదే వేదాంత రహస్యము. 

ఇక్కడ వేదాంతరహస్యముతో సామాన్యజీవులకు జీవస్వరూపము అంతు బట్టక పోవుటను సూచించారు. 

అంతరార్థము: జీవస్వరూపాన్ని నిజంగా తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రపంచాన్ని, మనల్ని విభజిస్తున్న భ్రమలను తొలగించి, జీవమును యథార్థంగా అనుభవించగలిగితే – అప్పుడే జీవితం సమగ్రమవుతుంది. అదే వేదాంత రహస్యము. 

వివరణము: జీవము అనునది నిరంతరమూ సాగు (భగవంతుని) వ్యవసాయం. జీవితము అనునది దేహ సంబంధమైనది. అది స్వల్పకాలికము. జీవమును పదార్థముతో గూడిన జీవితంతో ముడి పెట్టరాదు అన్నదే వేదాంత రహస్యము. 

రెండవ చరణం 

తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మరవకుండుటే
వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||మూడే || 

ముఖ్యపదములకు అర్ధములు: విజ్ఞానము = లోకానుభవమువలన తెలిసినవి;  పనితోడ = అదే పనిగా; మనికిగా =జీవనముగా; 

భావము: అప్పుడు మీరు మీలో లోకానుభవమువలనఁగలిగిన తెలివిని తెలుసుకుంటూ, అదే పనిగా అది జీవము కాని విషయమని, జీవమునకు సంబంధించని దని తలపోసి దైవమును నమ్మి అలాగే వుండండి.  వైరాగ్యముగా అంటే అది మనంతటకు మనము ప్రక్కకు త్రోసి వేయగలిగిన విషయం కాదు అన్నదే  వినవలసినటువంటి వేదాంత రహస్యము. 

వివరణము: 

భక్తినిలిపి: బంధములు అని చెప్పినటువంటి విషయము ఇదే. మనిషి తనలో లోకానుభవం వలన కలిగిన విషయములను తెలుసుకొనగలిగినప్పటికీ, ఆ సమయములో తాను ఏదో ఒకటి చేయవలను అను ఉత్కంఠ, ఉద్రేకం అతనిని పక్కదోవ పట్టించును. 

భగవద్గీతలో చెప్పిన, కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః । మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ 3-37మహాశనో = మహా అశనో అనగా ఎంతకు తీరని దాహము. మనిషి జీవము కాని విషయములను  తెలుసుకున్నప్పటికీ, రజోగుణం యొక్క ప్రభావముతోను, ఏదో సాధించాలి అన్న కోరికతోనో (కామ ఏష) ఆ క్షణంలో, ఆ సమయంలో భగవంతుని మీద భారం వేసి ఉంచకపోవడంతో తప్పు దారి పడతాడు. భక్తిని నిలపడంలో అసమర్థుడు అవుతాడు. 

మనికిగా వైరాగ్యము మరవకుండుట: ఇప్పుడు అన్నమాచార్యులు ఎంత ప్రాక్టికల్‌గా, ఆచరించదగిన రీతిలో చెబుతున్నారో తెలియండి.  వైరాగ్యము మరవకుండుట అంటే మానవుడు (ఏదైనా) కార్యము చేయుటకు ఉద్యుక్తుడైనప్పుడు తాను చెయ్యరాదు (అనగా తాను నిమిత్తమాత్రుడు) అన్న విషయమును ప్రక్కన పెట్టి జీవమును తెలియుటలో ప్రతిక్షణము విఫలమవుతున్నాడు. అంటే జీవము వైరాగ్యము వేరు వేరు విషయములు కావని, జీవమును గుర్తించు శక్తిని పదార్థ సంబంధ శరీరముతో  తెలియుట అసాధ్యము. ఆ సమయములో దైవముపై భారము వేసి  వుండలేకపోవు మన అశక్తతను ఎత్తి చూపుతున్నారు. 

వినవలసిన యట్టి వేదాంత రహస్యము: విని తెలుసుకోదగిన వేదాంత రహస్యము తనను తాను నిమిత్తమాత్రుడుగా గుర్తించి ఆప్రకారముగా నడచుట​. "విదిత్వా యోగీ పరం స్థా నముపైతి చాద్యమ్ (8-28)" అన్న భగవద్గీత వాక్యము కూడా దీనినే సూచించుచున్నది. 

 

మూడవ చరణం:

వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||మూడే ||

 

ముఖ్యపదములకు అర్ధములు: ఆచార్య విశ్వాసము: భగవంతునిపై విశ్వాసము; జాడల శరణాగతి = ఇదమిత్థముగా నిర్ణయించలేని శరణాగతి; సాధనము = ఒకే ఉపాయముగా; కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే = విశ్వాసముతో కూడి ఆ చెప్పలేని అనంతములో కలిసి శ్రీవేంకటేశు దాసుడగుట​. 

భావము: ఇదమిత్థముగా నిర్ణయించలేని శరణాగతి యొక్కటే ఉపాయముగా భగవంతునిపై పూర్తి విశ్వాసముతో అనంతమగు సత్యము నందు బేషరతుగా (వేరొక ఉపాయమును అలోచించక) కలసిపోవుటయే బ్రహ్మానంద వేదాంత రహస్యము. 

వివరణము: 

అన్నమాచార్యులవారు అత్యంత ఆచరణయుక్తముగా వేదాంత రహస్యములను వెల్లడించనున్నారు. 

జాడల శరణాగతి అని చెప్పి అది మానవుడు సులభముగా తన ఇంటిలో విద్యుద్దీపముల మీటలు నొక్కినట్టు (=స్విచ్ వేసినట్టుగా) తెలియలేడు. ఉదాహరణకు క్రింది ఒక కీర్తనలోని చరణమును చూడండి. 

భవబంధునకు విధిపాపపుణ్యపులంకె 
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక |
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే 
నివిరి నిన్నటివునికి నేటికి గలదా 

ముఖ్యపదములకు అర్ధములు: తివిరి = ఆలోచించి, ప్రయత్నపూర్వకముగా, త్వరపడి; అల్లునేరే ళ్లింతే  = నమస్కారములు కూడా అంతే. 

భావము: వెన్నెలలో మనం చేసే నమస్కారాలు ఇతరులకు ఎంత అస్పష్టంగా కనిపిస్తాయో, అదేవిధంగా మానవుడు తన పాప–పుణ్య సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా అంతే గూఢమైన విషయం. కానీ, అతడు ఈ గందరగోళపు లోకంలోనే  తచ్చాడుతూ, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొనవలెను. రూడి యగు నిన్నటి అనుభవాలు అను భూతకాలము లోని వానితో పోల్చితే నేడు అను సంగ్దిద్ధము నుండి నేర్చుట కష్టమే, కాని అదియే చేయవలసిన కార్యము. 

వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము  అనగా ఇది ఏకపక్ష మార్గము ఒక్కసారి దానిలోకి వెళితే తిరిగి వచ్చుటకు ఆస్కారం లేదు. ఆ బ్రహ్మానందంలో మునిగినవారు తాము అనుభవించినవి ఈ భూలోకంలో వారికి చెప్పుటకు అవకాశం లేదు. వారు బ్రహ్మానందం నిజంగా అనుభవించినది లేనిది రహస్యముగానే ఉండిపోవును.

 

Epilogue (ఉపసంహారము):

ఇప్పుడు రెనే మాగ్రిట్‌ వేసిన దిగువన ఉన్న key to the fields (La clef des champs క్షేత్రమునకు మార్గము)  పేరుతో ఉన్న పెయింటింగ్‌ను శ్రద్ధగా చూడమని పాఠకులకు అభ్యర్థన.


దీంట్లో ప్రేక్షకునికి కనబడుతున్న దృశ్యమునకు మధ్య ఒక విరిగిపోయిన గాజు కిటికి వుంది.   ఆ గాజు కిటికీ విరిగిపోయిన ముక్కలు ప్రేక్షకునివైపు పడి ఉన్నాయి. అనగా ఆ గాజుని ఆవలి వైపు నుండి (బయటనుండి) ఎవరో పగలకొట్టారన్నమాట. 

ఆ విరిగిన ముక్కలను గమనించిన, గాజు పగలక ముందు, మనం క్షేత్రము యొక్క పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే ప్రేక్షకుడు చూస్తున్నాడు అని తెలియ వచ్చును. నిజమైన ‘క్షేత్రము'ను కాదు అని యిట్టే తెలియును. గాజు పగిలిన తర్వాత​, అతడు నిజమైన ‘క్షేత్రము'ను చుడగలుగుతున్నాడు. 

అంటే, ఆ గాజు తెర మన అంతఃకరణము అన్నమాట.  అందుకే అన్ని మత గ్రంథములలో అంతఃకరణ శుద్ధికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. మనిషి తాను చూచునది సత్యమని భావిస్తాడు. కానీ తన చూపులను ప్రభావితము చేయుచున్న వాటిని గ్రహించుట దుష్కరము. 

ప్రతీ అనుభవము మన మనస్సులో ఏదోవొక జాడను వదులుతుంది. ఇటువంటివి అనేకము కలసి తెలివిలోనికి వచ్చు సమాచారమును ‘వాతావరణములోని ధూళికణములు సూర్యుకాంతిని చెదిరి పోయేటట్లు చేయునట్లు’ సవరించును. కావున మనకు అనుభవములోనికి వచ్చు దర్శనము (picture) సత్యమునకు దూరముగా ఉండును. దీనినే పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే చూచుదుమని మాగ్రిట్టె గారు తెలిపిరి. 

జిడ్డు కృష్ణమూర్తి గారి ఈ ప్రకటనను పరిశీలించండి. "మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే, ఏ విషయాన్ని ఆశించడమో, గ్రహించడమో లేదా ప్రతిఘటించడమో లేనప్పుడే, ఏది నిజమో చూడడం సాధ్యమవుతుంది. విముక్తి కలిగించేది సత్యమేగాని, స్వేచ్ఛగా ఉండటానికి మీ ప్రయత్నం కాదు." 

ఇహము పరము కలిగించు వాడు శ్రీవేంకటేశుఁడు. 

అనగా తనకున్నవన్నీ విడిచి శరణాగతి చేయుటయే మానవునికి గల ఏకైక వుపాయము. 

శరణాగతులకు సత్యముగా వుండు వాడితడొకడే శ్రీవేంకటేశుఁడు. 

గాజును పగలగొట్టినవాడు చేస్తున్న పనిలో లీనమై గాజు ఎలా పగిలిదీ గమనించలేదని తెలుస్తోంది. అతనికి త్వరిత గతిని గాజును ఛేదించుకు పోవాలన్న తపన ప్రస్ఫుటం. ఈవల నిలబడి వున్న మనిషిని రక్షించడమే అతని ఆసక్తి ​. భగవంతునికి మనపై అంతటి అవ్యాజమైన ప్రేమ. 

సత్యానికి క్రమబద్ధమైన మార్గం లేదు. 

అనియమిత మరియు ప్రమాదయుక్తమైన మార్గం చిందరవందర ప్రపంచంయొక్క నైజమును చూపుతోంది. గాయాలకు భయపడి మనం గాజు గోడను దాటకపోతే అంతకంటే పిరికితనముండదు.

x-x-x-x

Sunday, 23 March 2025

T-214 మఱచితిమంటే మరి లేదు

 అన్నమాచార్యులు

214. మఱచితిమంటే మరి లేదు 

ఉపోద్ఘాతము:

ఈ కీర్తన వింటూనే బోధపడింది. చాలా సులభముగా అర్థమయిపోయింది ఇందులో అన్నమాచార్యుల వారు చెప్పినది నాకు బాగా తెలిసిపోయింది. దానికి ఇంత పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చదవడం అనవసరం. ఈ వ్రాసేవాళ్లు పని లేక కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకినట్లు ఏదో ఏదో వ్రాస్తూ మమ్మల్ని చదవమని బలవంతం చేస్తుంటారు. ఎందుకండీ ఇలా చేస్తారు? అలా ఆలోచించడం నిజంగా తప్పు కాదు.

అయితే ఇక్కడ ఆచార్యులు వారు మఱచితిమంటే అన్న చిన్న పదము తోటి ఏం చెప్ప దలిచారు? ఆలోచించండి! అంత సులభంగా తట్టదండి. ఇక మరి లేదు అంటే—మానవునికి ఈ జీవితమే ఒకే ఒక అవకాశం. ఈ అవకాశం మరల లభిస్తుందా? ఎవ్వరూ చెప్పలేరు! అది మన ఆధీనంలో లేదు. అలాంటప్పుడు, మనకు దొరికిన ఈ మానవ జన్మ అనే అపూర్వ అవకాశాన్ని వృధా చేసుకోకూడదని ఆచార్యులు హెచ్చరిస్తున్నారు.

దైవము లేదా ప్రకృతి అణువులో అమిత శక్తిని  దాచి ఉంచినట్లు అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలలో సరళంగా కనపడే ఈ మాటల వెనుక ఊహల కందని విషయములనే నిక్షిప్తం చేసి ఉంచారు. అందుకని లంబాచౌడా వివరణలు అవసరం అవుతున్నాయి.

గాలి కంటే నీటి సాంద్రత ఎక్కువ. దానికంటే భూమి, దానికంటే బంగారం ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఈ కీర్తనల సాంద్రత కొలిచే సాధనం మన దగ్గర లేదు. ఒకవేళ అలాంటి సాధనాన్ని తయారు చేస్తే ఒక్కొక్క కీర్తనకు ఈ భూమి కూడా  తూగదు. ఆకాశమును, భూమిని, సమస్త విశ్వమును ఒక పొట్లములో చుట్టి దానిని  కుదించుతూ కుదించుతూ పోతే  లభించే దట్టమైన  ప్రసాదములే ఈ కీర్తనలు.

ఎంత పెద్ద రోగానికైనా మందు చిటికెడే ఉంటుంది. వైద్యులు వైద్యరంగము మనకోసం చేస్తున్న సేవ మనందరకు స్పష్టము. అయితే మనిషికి పట్టుకున్న జాడ్యం వదిలించటానికి విదల్చటానికి సాధారణంగా మందులు దొరకవు. ఆచార్యులవారు చిన్నగా సూక్ష్మముగా మనకు ప్రసాదించిన ఈ కీర్తనలు మందులే. రామదాసు గారు రామ జోగి మందు కొనరే అని ఊరకనే అనలేదు.

పట్టపు జీవుల” అంటే తోలుకలిగిన జీవులు. మహా మందమైన చర్మము కలిగినవారము. అంటే దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలాంటి ప్రభావమూ వుండదో, మనమీద ఎలాంటి మందులు పనిచేయవు అన్న విషయాన్ని సూచిస్తున్నారు. కానీ వారు మనల్ని తిట్టడానికి ఈ కీర్తనలు వ్రాయలేదు మనలను తట్టి లేపడానికి మాత్రమే వ్రాశారు.

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: మఱిచిపోతే మరియొక దారిలేదు. మనసుతో చిలికించి  దైవమును తలచుము. అంటున్నారు అన్నమాచార్యులు.  ​ అంతరార్థము: (భగవద్)  కార్యాచరణములో నేర్పును బ్రదర్శించుచు జీవితమును కొనసాగించుము. 

మొదటి చరణం: తోలుగల జీవుల ఈ ప్రపంచము పుడుతూ, పోతూవున్నదే. అది అలా జరుగుతూనే వుంటుంది. ఈ పరిణామముల మధ్య ధైర్యముగా మర్మముతో నరహరినామము ప్రయత్నం చేసి మరీ మదిలో నిలుపుకొనుము. 

రెండవ చరణం: ఓ మనసా ఈ లోకములలో ఉదయాస్తమయములు ఒక క్రమములో ఏ రీతిగా వచ్చుచు పోవుచునున్నవో, నీలోనే వున్న అద్దములోని ప్రతిబింబము వంటి అంతరాత్ముని క్రమము తప్పక​ వీలుగా, వాటముగా, పొందికగా తలచుము 

మూడవ చరణం: బయలు, లోపల అను వ్యత్యాసములు లేక వశపఱుచుకొని వున్నది శ్రీపతి మహిమలతో గూడిన విచిత్రమైన సృష్టి. అదిగో కనబడుచున్న ఆ ఎత్తైన వేంకటేశ్వరుఁడే సమీపము అని, రక్షణ అని నమ్ముచు మనసున తలచవో.    

కీర్తన: 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 370-3 సంపుటము: 4-412
 

మఱచితిమంటే మరి లేదు
తఱితోఁ దలఁచవో దైవము మనసా
పల్లవి॥ 

పుట్టుచు నున్నది పోవుచు నున్నది
పట్టపు జీవుల ప్రపంచము
నట్టనడుమనే నరహరినామము
గుట్టున దలఁచవో గొనకొని మనసా  
మఱ॥ 

పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె
తిద్దిన జగముల దినదినము
అద్దపు నీడల యంతర్యామిని
వొద్దనె తలఁచెనొనరవొ మనసా
మఱ॥

Details and explanation: 

మఱచితిమంటే మరి లేదు
తఱితోఁ దలఁచవో దైవము మనసా
పల్లవి॥

టీకా: మఱచితిమంటే = మఱిచిపోతేమరి లేదు = మరియొక దారిలేదు; తఱితోఁ = మథనముతో, చిలికించి ; దలఁచవో = తలచుము; దైవము మనసా = దైవమును మనసా. 

భావము: మఱిచిపోతే మరియొక దారిలేదు. మనసుతో చిలికించి  దైవమును తలచుము. అంటున్నారు అన్నమాచార్యులు.   

వివరణము: 

మొదటి భాగం: భగవద్గీత ఏం చెప్పింది 

ముందుగా అన్నమాచార్యులు మరియొక దారి లేదు అని ఎందుకు అంటున్నారో తెలుసుకుందాం. భగవద్గీతలో ఈ రకంగా చెప్పారు వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన! (2-41) భావము: ఓ అర్జునా! నిశ్చయించి అందిపుచ్చుకొనుటకు మనస్సుకు ఒకే ఒక మార్గము కలదు. చంచలమైన మనస్సు మాత్రమే అసంఖ్యాకమైన ఎంపికలను అంచనా వేస్తూ తడబడిపోతుంది.దైవమును చేరుటకు ఒకే ఒక మార్గము కలదు కాబట్టి ఆ మార్గమును మరువరాదు అన్న ఉద్దేశం తోటి అన్నమాచార్యులు ఇలా చెప్పి ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఆ మార్గాన్ని ఎవరూ కూడా చెప్పలేకపోయారు. 

భగవద్గీత కూడా "వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః 6-36" (=”కానీ, స్వాధీనమైన మనస్సు కలిగినవాడు ఏదో ఒక ఉపాయముచేత ఆ మార్గమును కనుగొనగల్గుచున్నాడు.” అని చెప్పి వదిలేసినదే కానీ నిశ్చయముగా చెప్పలేదు. 

రెండవ భాగం: అన్నమాచార్యుల అంతరంగము 

తఱితోఁ దలఁచవో దైవము మనసా ఈ వాక్యమును జాగ్రత్తగా పరిశీలించవలెను. మనసును ఏ రకంగా చిలికించవచ్చును? ఒక విద్యార్థి పరీక్షకుఁ వెళ్లినప్పుడు సంవత్సరమంతా చదివిన పాఠములు ఏ రకముగా గుర్తుపెట్టు గుర్తు పెట్టుకోనునో అదే రకముగా నీవు చేయవలసిన పనిని అతి భద్రముగా సునిశ్చితముగా పాటించవలెను అన్న విషయాన్ని తెలుపుతున్నారు. 

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటి? నిజంగా ఏమి లేవు. కానీ చేయకూడని పనులు తనను బద్ధునిచేయు పనుల నుండి ఎవరినీ నొప్పింపక​, తానొవ్వక తప్పించుకొను మథనము చేయుము. అది యజ్ఞముఅని అనుజ్ఞ ఇస్తున్నారు ఆచార్యులవారు. మనమంతా ఇక్కడి రోజువారీ పనులలో చిక్కుకొని దైవమును ఒక పార్ట్ టైమ్ కార్యము కింద భావించి కాలం గడిపేస్తున్నాము. 

మొత్తానికి మరచిపోకుండా నీవు చేయవలసిన పనులలో చిక్కుకుపోకుండా అతి లాఘవముగా మార్గము కనుగొనువాడు యోగిఅని ఈ పల్లవి తాత్పర్యం వెల్లడి అవుతుంది. ఈ సందర్భంగా భగవద్గీతలోని క్రింది శ్లోకమును కూడా మనం చేసుకోవడం ఉచితంగా ఉంటుంది. 

శ్లో|| బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే । తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||(2-50)||  భావముకర్మము చేయుటయందు నేర్పరితనమే యోగము అనబడునుజ్ఞానముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును నైపుణ్యంతో ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించ గలుగును.  

అంతరార్థము: (భగవద్)  కార్యాచరణములో నేర్పును బ్రదర్శించుచు జీవితమును కొనసాగించుము. 

మొదటి చరణం:

పుట్టుచు నున్నది పోవుచు నున్నది
పట్టపు జీవుల ప్రపంచము
నట్టనడుమనే నరహరినామము
గుట్టున దలఁచవో గొనకొని మనసా
 మఱ॥ 

టీకా: పుట్టుచు నున్నది = పుట్టుచున్నది; పోవుచు నున్నది = పోవుచున్నది; పట్టపు జీవుల = తోలుగల ఈ జీవుల​;  ప్రపంచము = ప్రపంచము; నట్టనడుమనే = నట్టనడుముననే; నరహరినామము = నరహరినామము; గుట్టున = ధైర్యముగా, మర్మముగా; దలఁచవో = తలఁచవో; గొనకొని= యత్నించి; మనసా = ఓ మనసా . 

భావము: తోలుగల జీవుల ఈ ప్రపంచము పుడుతూ, పోతూవున్నదే. అది అలా జరుగుతూనే వుంటుంది. ఈ పరిణామముల మధ్య ధైర్యముగా మర్మముతో నరహరినామము ప్రయత్నం చేసి మరీ మదిలో నిలుపుకొనుము. 

వివరణము:

మొదటి భాగం: భగవద్గీతతో సంబంధం 

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత (2-28) భావము: అర్జునా! ప్రాణులన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు (అవ్యక్తములు). మరణానంతరం కూడా అవ్యక్తములే. ఈ జనన మరణాల మధ్య మాత్రమే అవి ప్రకటితములు (ఇంద్రియ గోచరములు) అగుచున్నవి. నట్టనడుమనే నరహరినామము: ఇట్టి అస్థిరమైన నట్టనడుమ జనియించిన ఈ స్మృతి, చైతన్యములు ఉన్నంత వరకు హరినామముతో సద్వినియోగము చేసుకొనుము.  

ఇక్కడ అన్నమాచార్యులు వారు ధైర్యము అన్న పదం ఎందుకు వాడారో ఆలోచింతము. భగవద్గీత (2-13) ఈ విషయాన్ని తెలుపుతుంది తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతిభావము: జీవునకు ఈ దేహమునందు కౌమారముయవ్వనమువార్థక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తియు కలుగును. ధీరులైన వారు ఈ విషయమును గ్రహించివ్యధ చెందరు.  

రెండవ భాగం: అన్నమాచార్యుల భావన 

మీకు అనేకసార్లు విన్నవించుకున్నట్లు అన్నమాచార్యులు, శ్రీకృష్ణులవారు చెప్పిన భక్తిని జీవుడు దేహసుఖమును చివరకు ప్రాణమును కూడా వదిలి సాధించతగిన విషయం. మన పురాణాలలో చెప్పబడిన వైతరణిని దాటడం కూడా ఇదే అని మననం చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుంది. ఆ ధైర్యం చేయలేనివారు ఈ మార్గమున విజయం సాధించుటకు అనేక కష్టాలు పడవలసివచ్చును. అన్నమాచార్యులు చెప్పిన వేదాంతంతో మేళవించిన పాటలు బాగున్నాయి కదా అని సినిమా పాటలలగా పాడుకొని కొన్నాళ్ల తర్వాత వదిలేసే వినియోగదారుని మనస్తత్వంతో (consumer attitude) చూడరాదు. అనేక విషయములను చిన్న పదములలో చొప్పించి ఉంచారు. 

గుట్టున దలఁచవో గొనకొని మనసా : సాహసోపేతమైన మానవ ప్రయత్నం లేకుండా అన్నమాచార్యులు చేరిన ఉత్కృష్టమైన స్థితికి మానవుడు ఇప్పుడు తాను ఉన్నట్లుగా ఉంటూ ఉంటే చేరలేడు. ఈ కీర్తనలో ఆస్థితికి చేరుటకు మానవుడు చేయవలసిన యత్నం మన కళ్లముందుంచారు ఆచార్యులవారు. 

అన్నమాచార్యులు చెప్పిన పుడుతూ, పోతూవున్న ప్రపంచమును వాస్తవముగా కన్నుల ఎదుటగా చూడగలుగుతున్నామా? చూస్తే మనం తగులుకున్న విషయంలో విషయములలో ఇంకా చిక్కుకునే ఉంటామా? వెలికి వచ్చు ప్రయత్నము చేయమా? మానవుడా ఇహము పరము అను రెంటిలోనూ చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నావు. గొనకొని= యత్నించి అనగా వీనిలో ఏదో ఒక దానిని ఎంచుకొని అందుకై చేయగలిగినదంతా నీ శక్తి కొలది ప్రయత్నించవా? ఇందులో వేదాంతం లేదండి. కనుల ముందర ఉన్న కార్యమును కనుక్కోమని చెబుతున్నారు. ఆపై మీ ఇష్టం.  

రెండవ చరణం 

పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె
తిద్దిన జగముల దినదినము
అద్దపు నీడల యంతర్యామిని
వొద్దనె తలఁచెనొనరవొ మనసా
మఱ॥

 

టీకా: పొద్దు వొడుచునదె =దానంతట అదే ఉదయమగును;  పొద్దు గుంకునదె = అలాగే సాయంత్రముకూడా వచ్చును. తిద్దిన = క్రమశిక్షణలో పెట్టబడిన;  జగముల = లోకములలో; దినదినము = ప్రతిదినము; అద్దపు నీడల = అద్దంలో కనబడు నటువంటి ప్రతిబింబము లాంటి; యంతర్యామిని = అంతర్యామిని; వొద్దనె = నీలోనే వున్న; తలఁచె = తలచి; నొనరవొ = వీలుగా, వాటముగా, పొందికగా; మనసా = ఓ మనసా. 

భావము: ఓ మనసా ఈ లోకములలో ఉదయాస్తమయములు ఒక క్రమములో ఏ రీతిగా వచ్చుచు పోవుచునున్నవో, నీలోనే వున్న అద్దములోని ప్రతిబింబము వంటి అంతరాత్ముని క్రమము తప్పక​ వీలుగా, వాటముగా, పొందికగా తలచుము. 

వివరణము:

వాళ్ళకి ఎలా కనబడుతోందండి? ఈ అన్నమాచార్యులు ఎవరండి? నీలో ఉన్న అద్దము అందులోని ప్రతిబింబం ఉన్నాయంటారు? ఉంటే ఎక్కడ ఉన్నాయండి? పైగా ఈ తత్వవేత్తల అందరూ ప్రపంచం ఒక ప్రతిబింబము అని అంటూనే ఉంటారు! నాకైతే ఒక్క ముక్క అర్థం కావట్లేదు. శ్రీశ్రీ గారైతే ప్రపంచమొక పద్మవ్యూహమన్నారు. అలా అయితే మనకు కనపడట్లేదేం? మరి వీళ్ళకి ఎలా కనబడుతోందండి? ఇదేనండి మనం తెలుసుకోవాల్సింది. 

జీవాత్మ పరమాత్మతో కలిసిపోతే అదే మోక్షము అన్నారు. అయితే ఇది చెప్పినంత సులభమా? కాదే! ఆ విషయం తెలుసుకోవడానికే ఈ వివరణ అండి. ముందుగా René Magritte వేసిన Love Disarmed (1935) అను పేరుగల క్రింది తైలవర్ణచిత్రమును  చూడండి. 



అక్కడ ఒక అద్దము దానికి బాగా దిగువన ఒక చక్కగా పాలిష్ చేయబడిన షూస్ (బూట్లు) కనబడుతుంటాయి. విచిత్రంగా ఆ బూట్లకీ ఒత్తుగా ఉన్న పొడవైన వెంట్రుకలు మనలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. వంకరటింకరగా కాకుండా నేరుగా చూస్తే ఆ అద్దములో అ బూట్లు కనపడవు. ఇంకా విచిత్రంగా ఆ అద్దపు క్రింది భాగంలో ఆ జుట్టు కొంచం కనబడుతూ ఉంటుంది. 

విశ్లేషణ:  ఆ కనబడుతున్న అద్దము అన్నమాచార్యులు పేర్కొన్న ప్రపంచము అను అద్దము.  ప్రస్తుతానికి దానిలో ఆ జుట్టు కూడా కనబడకూడదు.  ఆ కనబడుతున్న జుట్టు మనము ప్రయత్నముతో సాధించినది. అది అసహజము. ఆ జుట్టు మన గాలి అలలకు అంటే ఏ అన్నమాచార్యులో జిడ్డు కృష్ణమూర్తి గారో చెప్పినది విని ఆవేశములో రేగిన ఆలోచనలకు ప్రమాణము.  

చక్కటి పాలిష్ చేసిన బూట్లు  మనలను మనము పరిశుభ్రముగా వుంచుకొను నైజమును తెలుపుతున్నాయి. కానీ ఆ బూట్లు మనలను ఈ భూమికి ఆనించి వుంచుతున్నాయి. మనము జాగ్రత్తగా, అతి లాఘవంగా ఈ ప్రపంచమను కార్యాలయంలో కార్యములకు తగులకుండా విడిపోయినప్పుడు మన కన్నులు ఆ అద్దమును సమాంతరముగా చూచి వీక్షించుటకు సాధ్యపడును. ఎక్కడో పుట్టిన René Magritte గారు మన భారతీయ తత్వశాస్త్రముతో సంబంధం కానీ, దాని ఆచూకీ కూడా తెలియని వారు. ఐనప్పటికీ అన్నమాచార్యులు చెప్పినదే ఈ చిత్రము ద్వారా తెలపడం విచిత్రమా? కాదా? మీరే నిర్ణయించండి! 

మనం ఈ ప్రపంచమను ఊబిలో నుండి బయటపడినప్పుడు మనకు ప్రపంచమునకు మధ్య గల తెరలు అన్నీ తొలగిపోతాయి. అప్పుడు ప్రపంచమునకు మనకు మధ్య దూరం సమసిపోయి  ఒకదానికి మరొకటి ప్రతిబింబములుగా మారతాయి. ఇదే భగవద్గీతలో చెప్పిన "తనను సర్వ భూతములలో, తనలో సర్వ భూతములను  మానవుడు కనుగొనగలుగుతాడు" (6-29). ప్రపంచమున ఇది ఒక్కటే భక్తి.. చేయగలిగిన కార్యం. తక్కినవన్నీ ఈ ప్రపంచమున మనను సంకెళ్లతో ఉంచుతున్నవే. 

తిద్దిన జగముల దినదినము: ఈ లోకములోని క్రమము సాధారణమైన కంటికి అగుపడదు. మనకంతా అస్తవ్యస్తముగా, చిందవందరగా అనిపించును. ఇక్కడ అన్నమాచార్యులు ఆ అద్భుతమైన​, కానరాని క్రమమును ప్రస్తావిస్తున్నారు. దివారాత్రముల గురించి కాదు. 

అన్నమాచార్యులు ఎన్నడూ తన స్వస్థలాలను విడిచి బయటకు వెళ్లలేదు. ఐనా వారు ప్రపంచములో అంతర్లీనముగా దాగియున్న స్వాభావికమైన క్రమమును  (న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్, Natural Order of the universe) ప్రస్తావించిరి. ఇదియే ఆలోచించవలసిన విషయం. ప్రపంచమునంతా ఏకత్రాటిపై సమన్వయముచేయు వ్యూహము యొక్క ప్రసక్తి విస్మయము కలిగించునదే కాక అసాధారణమనీ భావించవచ్చు.  

మూడవ చరణం:

లోపల వెలుపల లోఁగొనివున్నది
శ్రీపతి మహిమల సృష్టియిదే
యేపున శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడే
దాపని నమ్ముచుఁ దలఁచవో మనసా
మఱ॥ 

టీకా: లోపల వెలుపల = బయలు, లోపల అను వ్యత్యాసములు లేని; లోఁగొనివున్నది = వశపఱుచుకొని వున్నది; శ్రీపతి మహిమల = శ్రీపతి మహిమల; సృష్టియిదే = విచిత్రమైన సృష్టియిదే; యేపున = ఎత్తైన; శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడే = ఇతడే శ్రీ వేంకటేశ్వరుఁడు; దాపని = సమీపము అని, దాపు అని;  నమ్ముచుఁ =  నమ్ముచు; దలఁచవో మనసా = తలచవో మనసా! 

భావము: బయలు, లోపల అను వ్యత్యాసములు లేక వశపఱుచుకొని వున్నది శ్రీపతి మహిమలతో గూడిన విచిత్రమైన సృష్టి. అదిగో కనబడుచున్న ఆ ఎత్తైన వేంకటేశ్వరుఁడే సమీపము అని, రక్షణ అని నమ్ముచు మనసున తలచవో.  

వివరణము:

ఇంతకుముందు  చరణములో ప్రపంచమునకు మానవునికి మధ్య దూరం సమసిపోవడం గురించి మాట్లాడుకున్నాం. ఆ స్థితిలో మానవుని మనసు దైవం యొక్క మనస్సుతో లేదా ఆలోచనలతో సరిసమానము అగును. ఇది జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్రలో పేర్కొన్నారు. 

లోపల వెలుపల లోఁగొనివున్నది /  శ్రీపతి మహిమల సృష్టియిదే: విచిత్రం అనేది పరము అను లోకం ఇహ లోకం రెండు కూడా మన కన్నులముందరనే ఉన్నవి అంటారు.  అన్నమాచార్యులు “పరమమనేదొక్కటే  ప్రపంచమొక్కటే  / సిరుల నీ రెంటికిని జీవుఁడే గురి” = రెండు ప్రపంచాలు లేవని, వున్నది ఒకటే అని నొక్కి చెబుతారు. అంతేకాక మరొక ప్రపంచం అనేది మానవుల భావనాత్మక భ్రమల అయోమయమే నని అంటారు. అందుకనే అన్నమాచార్యులు కూడా బయట లోపల అని మాత్రమే వ్యవహరించారు. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. 

ఆకాశ పాకాశ మరుదైన కూటంబు: ఈ అసహ్యమైన, అస్తవ్యస్త ప్రపంచమొక అసాధారణమైన సమూహము. ఈ లోకంలో ఎన్నో సమస్యలు కనబడుతవి. దోపిడీలు, అసమానతలు, దౌర్జన్యములు, అల్లకల్లోలములు, బాధలు. ఈ అకటవికటముల వెనుక దాగి ఒక అరుదైన క్రమం ఉంది. అది ఎంత తీక్షణమైన ఆలోచనలతోనూ చేరగలిగినది కాదు, ఊహింపదగినది కాదు. అదే శ్రీపతి మహిమల సృష్టి. 

లోకరంజకము తమలోనిసమ్మతము: అనగా  నిర్మలమైన అంతరంగముతో, స్థిరుడై (అటునిటు చూడక), సమస్త కార్య కలాపములు నిగ్రహించువాడై, మౌనియై నిర్వర్తించువానికి మాత్రమే సాధ్యము. భగవద్గీతలో “అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ।। 12-16 ।।“ అని పేర్కొన్నది యిదియే. అటు వంటి సూక్ష్మబుద్ధిగల ద్రష్టలు లోకరంజకము కాక మరేమి 

ఈ చరణమునకు పల్లవికి గల సంబంధం: ఈ ప్రపంచమును వీడి చేయునది ఒంటరి ప్రయాణము. అద్దానికి ఈ వైపు ప్రపంచముతో ఎటువంటి సంబంధము లేదు. ఈ రెంటిని కలుపుచున్నది వేంకటేశ్వరుఁడే. ఆ ప్రయాణమునకు చుక్కాని వంటిది వేంకటేశ్వరుని నామము.

x-x-x-x


 

T-215. మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది

  అన్నమాచార్యులు 215. మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది   ఉపోద్ఘాతము:   ఈ కీర్తనలో వేదాంత రహస్యము ముఖ్యంగా ప్రస్తావించ బడినది. వేదాంతము అ...