Monday, 6 April 2026

T-317 అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా

 తాళ్లపాక అన్నమాచార్యులు
317 అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా

For English version press here

 

ఉపోద్ఘాతము

ఇక్కడ భక్తి అనేది మాటలలో ప్రకటించు భావము కాదు; జీవనమంతటా ప్రసరించు ఒక స్థితి. అట్టి స్థితిలో ఉన్నవారిని గౌరవించుట, వారిని సేవించుట దైవసేవకే సమానమని కవి భావిస్తున్నారు. ఈ కీర్తనలో కవి తన స్థానమును అత్యంత వినయముతో నిర్ధారించుకొంటారు — "నీ బంటుబంటుకు సందడిబంట నవుటే చాలదా నాకు" అని అన్నమాచార్యులు చెబుతారు.

సరళమైన పదములలో చెప్పబడిన ఈ కీర్తనలో అంతర్లీనమైన భావము ఎంతో లోతైనది. మానవ జీవితము ఒదిగి వుండుటలో ప్రతిఫలిస్తుంది

అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 339-3 సంపుటము: 4-228
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా ॥పల్లవి॥

మిమ్ము నెఱిఁగిన యట్టి మీ దాసుల నెఱిఁగే
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు ॥అచ్చు॥

నిరతి నీకు మొ క్కే నీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్నుబూజించే ప్రపన్నులఁ బూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు ॥అచ్చు॥

అంది నీకు భక్తులైన యల మహానుభావుల
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు ॥అచ్చు॥
Details and Explanations:
పల్లవి:
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా ॥పల్లవి॥
పదబంధం
అర్థం
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
ఓ అచ్యుతా! నిన్ను తలచేటంత పని ఏముంది
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా
ఈ భూతలములో నీ దాసులే మాకు నిహపరములను విడమరిచి చెప్పగా

సూటి భావము:
(అన్నమాచార్యులు దైవముతో) ఓ అచ్యుతా! నిన్ను తలచేటంత పని ఏముంది. (నీ అంతటి వానికి నీవేదించ వలసినంత పెద్దపనికాదు). ఈ భూతలములో నీ దాసులే మాకు నిహపరములను విడమరిచి చెప్పగా. (నీ దాసులే చేయగలిగిన దానికి నీ దాకా తీసుకెళ్ళడమెందుకు?)

గూఢార్థవివరణము:
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలె: అచ్యుతా నీవు చేయగల కార్యములు అనుపమానములు. అచింత్యములు. ఈ చిన్న పని ఇహపరాలపై స్పష్టమైన అవగాహనకు నీ అంతటి వానిని తలచ నవసరము లేదు.

యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా” అనే పంక్తిలో “మీవారే” (=నీ దాసులే) అనగా జీవనమరణముల స్వరూపమును సమత్వముతో గ్రహించిన వారు. అట్టి వారు ఇహము–పరము అనే విషయములను తేఁటతెల్లముగా మాటలతో మాత్రమే కాక, తమ జీవనముతోనే స్పష్టపరచువారు.

కానీ వారిని తెలియుటెట్లు? కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా? అనిర్వచనీయమైన సుదీర్ఘమైన నిష్టలో మనసు లగ్నమైనప్పుడు అట్టి దాసుల జీవితం మనకు మార్గసూచకమగును.

భక్తుడు, భక్తిలపై సూచనాత్మక వ్యాఖ్య:

ఎవరైనా తన భక్తిభావనను తాను గుర్తించగలిగితే, అతడు ఇంకా బాహ్యప్రజ్ఞలోనే ఉన్నట్లే. తాదాత్మ్యమును పొందు స్థితికి ఇంకా ఎదగలేదన్న మాట. ఎందుకంటే బాహ్యప్రజ్ఞలో ఉన్నంతకాలం మానవుడు తాను సాధించుచున్నాననే భావమే ప్రధానమై ఉంటుంది.

కాని భక్తుడు తనను పూర్తిగా భగవంతుని చరణాలకు అర్పించిన తరువాత అట్టి బాహ్యప్రజ్ఞ నిలవదు. అక్కడ “నేను చేస్తున్నాను” అనే స్పృహ క్రమంగా లీనమైపోతుంది. ఆ స్థితిలో కార్యము జరుగుతుందే కాని, దానికి తనను సాధనముగా భావించుట ఉండదు.

మొదటి చరణం:
మిమ్ము నెఱిఁగిన యట్టి మీ దాసుల నెఱిఁగే
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు ॥అచ్చు॥
Telugu Phrase
Meaning
మిమ్ము నెఱిఁగిన యట్టి మీ దాసుల నెఱిఁగే
నిన్ను తెలిసిన నీ దాసులను ఎఱుగుట
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వున్నదివున్నట్లు స్వీకరించు విజ్ఞానము నాకు చాలదా? (సరిపోతుంది)
వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల
(వైష్ణవుల=దాసులను) ఉమ్మడిగా నీ సేవ చేయు దాసులను
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు
ప్రత్యక్షంగా సేవించుటే చాలదా నాకు (చాలు)
సూటి భావము:
(అన్నమాచార్యులు దైవముతో) ఓ అచ్యుతా! నిన్ను తెలిసిన నీ దాసులను ఎఱుగుట వారినుండి  వున్నదివున్నట్లు స్వీకరించు విజ్ఞానము నేర్చుట నాకు చాలదా? (సరిపోతుంది). ఉమ్మడిగా నీ సేవ చేయు దాసులను ప్రత్యక్షంగా సేవించుటే చాలదా నాకు (చాలు)

గూఢార్థవివరణము:

సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు: ఏమి జరిగినా — కష్టమైనా, ఇష్టమైనా, సుఖమైనా, దుఃఖమైనా — అది అట్లానే స్వీకరించుట. ఇదేమిటండి? ఇరవైయొకటో శతాబ్దములో పాత చింతకాయ పచ్చడి మాట్లాడుతున్నారని అనవచ్చును. ఎందుకంటే మన ఇప్పటి విజ్ఞత అంతా మనకై మనము ఏర్పరచుకున్న తర్కముపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ తర్కమే సమస్త సమస్యలకు పరిష్కారమైతే, ఇన్ని యుద్ధాలు, మారణహోమాలు, ఆకలిచావులు సంభవించేవా? కాబట్టి మన తర్కము ఎక్కువ పాళ్ళు స్వప్రయోజనసిద్ధికై కనిపెట్టబడిన సాధనమే.

అయితే “అసలు వాస్తవ విషయములు చెప్పండి” అనవచ్చును. కానీ మనము అనుభవించు వాస్తవము కూడా ఒక కేంద్రబిందువునుండి చూచిన దృక్కోణమే. కవి అయితే కేంద్రమేలేని దృక్కోణమును వెదకమంటున్నారు. ఆ దృక్కోణమును మరొక దృక్కోణము ద్వారా గ్రహించుట సాధ్యం కాదు. అందువలన సమ్మతివిజ్ఞానమును స్వీకరించకపోతే మార్గము మరింత కష్టతరమగును.

ఇంకొక గమనించవలసిన విషయం: వృత్తములో ఎక్కడి నుండైనా చూచినపుడు కేంద్రము ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ కేంద్రములోనే నిలిచినప్పుడు ఆ కేంద్రమునకు స్వతంత్ర అస్తిత్వము ఉండదు.

వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల: ఇక్కడ “ఉమ్మడి” అనే పదము విశ్వవ్యాప్త భావమును సూచిస్తుంది. దీనిని ఒక ప్రత్యేక మతమునకు లేదా సంప్రదాయమునకు పరిమితం చేయరాదు. కవి దైవసేవను సర్వసామాన్యముగా జరుగుచున్న కార్యముగా సూచిస్తున్నారు.

సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు” ఇక్కడ “సమ్ముఖాన” అనగా ప్రత్యక్షముగా సేవించుట.ఇందులోని మర్మమును గ్రహించండి. కానీ వారిదాసులని తెలియుటెట్లు? ఒక నిర్ధారించగల విషయమును గ్రహించుటకు తెలిసిన దానివైపు నుండి గమనించి ముందుకు వెళ్ళుట సామాన్య విజ్ఞానము. కానీ తెలియలేని (నిర్ధారించలేని) దానిని  తెలియుటకు మనకున్న ప్రత్యామ్నాయములన్నీ విఫలమగును. అపుడేమి చేయవలె? అట్టి సందర్భములో సమ్మతివిజ్ఞానమే మార్గమగును.​

Top of Form

Bottom of Form


రెండవ​ చరణం:
నిరతి నీకు మొ క్కే నీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్నుబూజించే ప్రపన్నులఁ బూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు ॥అచ్చు॥ 
Telugu Phrase
Meaning
నిరతి నీకు మొ క్కే నీడింగరీలకు
(డింగరీలకు= సేవకుఁలకు) ఎల్లవేళలా నీకు మొక్కే సేవకుఁలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
(సరవి= క్రమము) క్రమముగ మొక్కుటే సరిపోవును కదా!
పరగ నిన్నుబూజించే ప్రపన్నులఁ బూజించే
(పరగ=ఒప్పుగా, సరిగా) ఒప్పుగా నిన్నుబూజించే ప్రపన్నులను పూజించు (అవకాశం)
సరిలేని భాగ్యము చాలదా నాకు
భూప్రపంచములో సాటిలేని భాగ్యము. అది సరిపోదా నాకు?

సూటి భావము:
ఓ అచ్యుతా! ఎల్లవేళలా నీకు మొక్కే సేవకుఁలకు క్రమముగ  మొక్కుటే సరిపోవును కదా! ఒప్పుగా  నిన్నుబూజించే ప్రపన్నులను పూజించు అవకాశం భూప్రపంచములో సాటిలేని భాగ్యము. అది సరిపోదా నాకు?

గూఢార్థవివరణము:
 
నిన్ను బూజించే ప్రపన్నులను” — అనగా దైవమును మాటలతో కాదు, తమ జీవనమే అచ్యుతునికి అర్పించినట్లు వుండువారు. వారు ఎవరినుంచీ ఏమీ కోరరు. వారిని పూజించుటకు ఒకే మార్గము — వారి లాగానే హరిని మనస్ఫూర్తిగా కొలుచుట.

అలాగే “నీడింగరీలకు మొక్కుట”ను కూడా హరిని ఆత్మలో మొక్కుట క్రింద జమకట్టవలెను. ఇది కొంత వింతగా, మరీ ఎక్కువగా చెప్పినట్లుగా అనిపించవచ్చును.

ఉదాహరణకు భోజనమును తీసుకోండి. మనము ముప్పొద్దులా తింటాము. కానీ కొంత విరామము తరువాతనే మళ్ళీ ఆకలి మొదలౌతుంది. “రోజంతా తిన్నాము కదా — ఇంకా ఎందుకు?” అని కోపము రావలెను. కానీ రాదు. అది సహజమని తీసుకుంటాం — రోజువారీ ప్రకటనలలో గణనీయమైన భాగము భోజనానికే సంబంధించినది. ఏ నగరములోనైనా వీధులలో తిరిగినా అనేక దుకాణాలు ఆహారమునకే సంబంధించినవే కనిపిస్తాయి.

మామూలు మనుషులకు తిండి రంధి సహజము. అలాగే హరియే లోకముగా బతుకువారికి భక్తి సహజము.

మూడవ​​ చరణం:
అంది నీకు భక్తులైన యల మహానుభావుల
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు ॥అచ్చు॥
Telugu Phrase
Meaning
అంది నీకు భక్తులైన యల మహానుభావుల
(అల = తరంగం, కెరటం) నీకు భక్తులై కెరటములవలె ఉప్పొంగిన మహానుభావులు
చందపువారిపై భక్తి చాలదా నాకు
అటువంటివారిపై భక్తి ఉంటే సరిపోదా?
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటుబంటుకు
సంకేతము లాంటి శ్రీవేంకటేశ అటువంటి బంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు
ఉన్న బంటులగుంపులో ఒక బంటునైతే చాలదా?
సూటి భావము:
సంకేతములాంటి శ్రీవేంకటేశా! నీకు భక్తులై కెరటములవలె ఉప్పొంగిన మహానుభావులపై భక్తి కలిగి ఉండుటే నాకు సరిపోదా? నీ బంటులలో ఉన్న బంటుల గుంపులో ఒక బంటునై ఉండుటే నాకు చాలదా?

గూఢార్థవివరణము:
 
అంది నీకు భక్తులైన యల మహానుభావుల = అందిపుచ్చుకుని నీకు భక్తులైన అసంఖ్యాక మహానుభావులు. అల మహానుభావులు పరిశీలించదగ్గది. “అల మహానుభావులు” అనగా కెరటములవలె దైవభక్తితో ఉప్పొంగిన మహానుభావులు. సముద్రములో కెరటములు ఉప్పొంగినట్లే, దైవభక్తి తరంగములుగా ఇటువంటి మహానుభావులు లోకములో కొన్నిసార్లు ప్రత్యక్షమవుతారు.

అయితే ఏ మహానుభావుడూ శ్రీవేంకటేశునికి సమానుడు కాదు. అయినప్పటికీ ఈ లోకములోని ప్రజలకు దైవము మార్గదర్శనము చేయుట చాలా సందర్భాలలో అట్టి మహానుభావుల ద్వారానే జరుగుతుంది. వారు దైవసంకల్పానికి సమీపముగా జీవించువారు. అందుచేత వారిని సేవించుట దైవసేవకే సమానమని భావించవచ్చు. ఎందుకంటే వారు చేయు కార్యములు తమకోసము కావు; అవన్నీ దైవకైంకర్యములుగానే జరుగుతాయి

భగవద్గీతలోని క్రింది శ్లోకము ఈ భావానికి ఉదాహరణగా చెప్పవచ్చు:
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః   
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ॥ (4.21) 

అనగా ఆశలు లేకుండా, ఏదీ నాది అన్న భావన లేకుండా, మనస్సు మరియు ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకున్నవాడు శరీరముతో కర్మలు చేసినా పాపమునకు లోనుకాడు.

కడు నీ బంటుబంటుకు” అనే పదబంధములో కవి తన స్థానమును అత్యంత వినయముతో సూచిస్తున్నారు. లెక్కించలేనంతమంది నీ సేవకులలో ఉన్న బంటులలో నేనూ ఒక బంటునై ఉండుటే నాకు చాలునని అన్నమాచార్యులు చెబుతున్నారు. అట్టి సేవకుల గుంపులో ఒక స్థానము పొందుటనే గొప్ప భాగ్యమని భావిస్తున్నారు. దీని ద్వారా అన్నమాచార్యులు దైవమును పొందుట సులభమని మనందరిని ప్రోత్సహించుచున్నారు.

 దృశ్యాత్మక సమాంతర పరిశీలన​

1915లో Hilma af Klint వేసిన Swan No. 10 చిత్రాన్ని ఇక్కడ ఒక దృశ్య సూచనగా గుర్తు చేసుకోవచ్చు. ఈ చిత్రంలో విశ్వ చైతన్యమును ఒక సముద్రముగా, వ్యక్తిగత చైతన్యమును చిన్న చుక్కలుగా సూచించినట్లు భావించవచ్చు. సముద్రములో అనేక కెరటములు ఉప్పొంగినట్లే, చైతన్య సముద్రములో వ్యక్తులు కెరటములవలె ప్రత్యక్షమవుతారు.

చిత్రములో కనిపించే చిన్న షడ్భుజాకారం మానవుని ప్రస్తుత అస్తిత్వాన్ని సూచిస్తుంది. దాని ఆరు భుజములు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల వంటి అంతరంగ వికారాలతో ఏర్పడిన పరిమితులను సూచిస్తున్నట్లు భావించవచ్చు. ఈ పరిమితుల వలన మనము విశ్వ చైతన్య సముద్రముతో సహజముగా కలిసిలేము.

ఈ షడ్భుజి "నేను" అను ఇప్పటి జీవితపు ఊహలచేత మన చేతలతోనే నిర్మించబడింది. "సత్యంతో ఏకత్వము మన స్థితి నుంచి కేంద్రానికి ప్రయాణం కాదుకానీ మనమే సృష్టించిన కృత్రిమ సరిహద్దులను చెరిపివేసి అనంతమగు చైతన్యము నందు మిళితమగుటయే" అనేది చిత్రలేఖనం యొక్క గూఢార్థం.

చిత్రములో కనిపించే సన్నని రేఖ జీవనము మరియు మరణముల మధ్యనున్న సరిహద్దును సూచిస్తుంది. ఆ రేఖపై నిలిచిన వారికి రెండు వైపులా ఒకే నిశ్చలత్వము కనిపిస్తుంది. ఆ స్థితిలో జీవనము–మరణము అనే విభేదం ఉండదు; కానీ ఆ రేఖ నుండి దూరంగా ఉన్న వారికి అవి రెండు వేర్వేరు సంఘటనలుగా అనిపిస్తాయి.

ఈ దృశ్య సూచనను కీర్తనకు ప్రత్యక్ష వివరణగా కాక, “అల మహానుభావులు” అనే అన్నమాచార్యుల పదానికి ఒక రూపకస్మరణగా మాత్రమే చూడవచ్చు — సముద్రములో కెరటములు ఉప్పొంగినట్లే, చైతన్య సముద్రములో మహానుభావులు ప్రత్యక్షమవుతారు.

వ్యాఖ్యానంతర సమీక్ష:
ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. అన్నమాచార్యులు అన్న క్రింది మాటలను తీవ్రముగా విచారించవలెను. 
ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక
కమ్మి హరి దాసుఁడు గావచ్చునా 
"హరి దాసుఁడు" అన్నది పోందగలిగిన పదవికాదు. తీవ్రము అసాధారణము అగు భక్తిలో నిలిచిన స్థితి.

X-X-The END-X-X

T-318 హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు

 తాళ్లపాక అన్నమాచార్యులు
318 హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు

ఉపోద్ఘాతము

“అయ్యా, మాటిమాటికి దైవము, సత్యము — వీటిని ఎందుకు వెదుకవలెను? అవి లేక జీవనము నడవదా?” అనే ప్రశ్న సహజముగా ఉద్భవించవచ్చు. ఈ ప్రశ్నకు మనము జవాబు తెలుసుకొనవలసిందే. 

ప్రపంచమంతా ఏదో ఒక దైవశక్తి నడిపించుచున్నదని చాలా మంది విశ్వసిస్తారు. ఆ దైవము సర్వత్రా వ్యాపించి మనలను సర్వకాలములలో గమనించుచున్నదని కూడా అనేకమందికి నమ్మకం. ఈ విశ్వాసమును బలపరచుటకు అనేక దృష్టాంతములు, కథనములు తరతరాలుగా ప్రచారములో ఉన్నాయి. బాల్యము నుండే దైవభక్తి మనకు ఉగ్గు పెట్టినట్లుగా నేర్పబడింది. ఈ కారణములన్నీ కలసి మానవుడు దైవమును శరణు వేడవలసినదే అన్న భావనకు దారి తీస్తాయి.
 
అయితే మరో ప్రశ్న కూడా అడగవలసిందే — దైవము లేక సత్యము లేక మానవుడు జీవించలేడా? ఈరోజు మనకు జీవించుటకు అవసరమైన అనేక వసతులు, నైపుణ్యములు, అవకాశములు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి మనిషి తనలో ఏదో లోపము, ఏదో వెలితి ఉన్నదనే భావముతో జీవిస్తున్నాడు. ఈ అంతరంగ అసౌకర్యమే జీవనమును నిరంతర శ్రమగా, ప్రయత్నముగా అనిపింపజేస్తుంది.

అన్నమాచార్యులు సూచించేది ఏమనగా — ఈ నిరంతర శ్రమ, ఈ అంతరంగ అసంతృప్తి మానవుని అసహజ జీవనానికి సంకేతములు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించినపుడు జీవనమునకు దైవమునకు మధ్యనున్న అంతరము క్రమంగా కరిగిపోతుంది. అప్పుడు ఈ రెండూ వేరువేరు కావని గ్రహించగలుగుతాము.ఈ భావాన్ని సూచించే కీర్తనయే ఇది.

 

కీర్తనలోని భావపురోగతి

పల్లవి: తమలోను ప్రపంచములోను సర్వమంతా సమముగా వ్యాపించి వర్తించుచున్న ఈ బ్రహ్మము లేదా సత్యమును గుర్తించుడి.
చరణం 1: దైవము లేని చదువు; విజ్ఞతలేని పాండిత్యం; అడవులలో దారితప్పిన బాటసారివలె మనిషి మనోగతి.
చరణం 2: భక్తిలేని పూజ; అన్నము లేని భోజనం; విత్తులేని వ్యవసాయం; చుక్కాని లేని నావ.
చరణం 3: ధర్మమును బోధించని సభ; సమిధలు లేని యజ్ఞము; ఇన్నిటిలో అంతర్లీనమైన దైవమును గుర్తించలేని బతుకు.

అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 166-4 సంపుటము: 2-320
హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు పల్లవి॥

వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు హరి॥

వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు హరి॥

పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు హరి॥
Details and Explanations:
పల్లవి:
హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు ॥పల్లవి॥ 
పదబంధం

అర్థం

హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
(హరి హరి=అయ్యో) అయ్యో శ్రీహరి నీవు అందరికి తెలిసేటట్లుగా మాలోనే ఉన్నాడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు
దేవతలను రక్షించుట​, రాక్షసులను అణచుట తగునట్లు గావించుటలోనే నీ గురుతులున్నవి.

సూటి భావము:
అయ్యో! శ్రీహరి  నీవు అందరికి తెలిసేటట్లుగా మాలోనే ఉన్నాడవు. దేవతలను రక్షించుట, రాక్షసులను అణచుట తగునట్లు గావించుటలోనే నీ గురుతులున్నవి. (అయ్యో! శ్రీహరి నీవు అందరికి తెలిసేటట్లుగా మాలోనే ఉన్నా నిన్ను గుర్తించుటలో మేము తడబడుతూనే ఉన్నాము.)

గూఢార్థవివరణము:
జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు = దైవము ఎక్కడో దూరముగా దాగి లేడు. మొత్తము జగము ఎరుగునట్లు అందరి ఆత్మలలో ఉన్నాడవు. అయినా నిన్ను, నీ జాడ తెలిసినవారు బహుకొద్దిమంది. ఈ భావమును అన్నమాచార్యులు మరొకచోట “బయలు మొరంగగు పరమమాయ (= తెఱచియున్నాను దాగి వుండే పరమ మాయ ఇదే)” అని చెప్పారు.

సురలఁ గాచుటయు నసురల నడఁచుట” అనే వాక్యము సరళము. అయినా, చాలాసార్లు దీనికి విరుద్ధము అనుభవములో కనబడును. సత్పురుషులు బాధపడుచూ, దుష్టులు సుఖపడుచూ కనిపించుట మనము చూస్తూనే ఉన్నాము. మనము క్రిందటి కీర్తనలో చెప్పుకున్న "లోకరంజకము తమలోనిసమ్మతము" అనగా బేషరతుగా జరుగుతున్నదానిని సమ్మతించక మనము ఎంతోకొంత సంతోషమో, బాధయో, కష్టామో పడినను సర్దిచెప్పుకోలేము.
 
ఇంకా గమనిస్తే“సురుడు–అసురుడు” అనే నిర్ణయములు కూడా మన దృష్టికోణమునకు సంబంధించినవి. అసలు ఈ అధారంలేని అభిప్రాయములే పైన చెప్పుకున్న మనస్తాపమునకు కారణము. ఈ అనియంత్రిత సంగముల ప్రభావములతో మన జీవనము లోక రంజకమే కాదు, మనకై మనకు కూడా రంజకము కాకుండా పోవుచున్నది.

పల్లవిని తిరిగి తిరిగి పరిశీలించినపుడు, అన్నమాచార్యులు ఒకవైపు దైవమును కీర్తించినట్లు కనబడినప్పటికీ, మరోవైపు మన గ్రహింపు పరిమితిని గుర్తించమని సూచిస్తున్నారు. ఈ జగత్తులో ఒక గూఢమైన క్రమము పనిచేస్తూనే ఉంది. అదే ధర్మాన్ని నిలుపుతుంది. కానీ మనం మన అభిప్రాయాల ప్రకారం ప్రపంచాన్ని కొలుస్తూ ఉండటంవల్ల, ఆ క్రమంలో పనిచేస్తున్న “నీ గురుతు”లను గుర్తించలేకపోతున్నాము.

ఈ విధముగా చూస్తే, ఈ పల్లవి ఒక సరళమైన భక్తి వాక్యముగా కాక, మన గ్రహింపు పరిమితిని గుర్తు చేసే ఒక లోతైన పరిశీలనగా కూడా అర్థమవుతుంది.

మొదటి చరణం:
వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు హరి॥ 
Telugu Phrase
Meaning
వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
వేదము, వేదార్థములు జగమెరిగిన సత్యములు. అవి"తప్పు" అని చెప్పు విద్వాంసుడు విద్వాంసుడుకాడు.
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మూలము వరకు చదువక తర్కించఁబోవు పాండిత్యము పామరత్వము వంటిది.
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
భూమిలోని అడవులలో దారితప్పి ఎటుపోవుటయో నిర్ణయించలేని బాటసారి వంటిది.
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు
ఆదిమూర్తియైన నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు కొరగానిది. పనికిరానిది.  అస్తవ్యస్తము.
సూటి భావము:
వేదము, వేదార్థములు జగమెరిగిన సత్యములు. అవి"తప్పు" అని చెప్పు విద్వాంసుని విద్వత్తు కొరగానిది. మూలము వరకు చదువక తర్కించఁబోవు పాండిత్యము పామరత్వము వంటిది. పనికిరానిది. భూమిలోని అడవులలో దారితప్పి ఎటుపోవుటయో నిర్ణయించలేని బాటసారి వంటిది. అస్తవ్యస్త హృదయము వంటిది. ఆదిమూర్తియైన నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు కొరగానిది. పనికిరానిది.  అస్తవ్యస్తము.

గూఢార్థవివరణము:

వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది: మానవ జన్మంతా ఫలానాది తప్పు అని నిరూపించడంలో గడిపి ఏమి ప్రయోజనము. అదీ సులభంగా అర్ధంకాని వేదాలు, వేదార్థములలో తప్పులు చూపి ఏమి సాధించుదుము?
 
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది:  సరియైన సంసిద్ధతలేక తర్కించబోవడం అనుచితము. పైగా వాదవివాదములలో అంతిమము అని ఉండదు. అట్టి వానిలో చిక్కుట ఎందుకు?  
 
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది” దారితప్పిన బాటసారి అడవిలో ఎటు వెళ్లాలో తెలియక తర్జనభర్జన పడినట్లే, నిజమైన ఆధారం లేకుండా జీవించు మనస్సు కూడా అటువంటిదే. ఎటు పోవాలో తెలియక గందరగోళములో పడుతుంది.
 
ఆదిమూర్తి నీ శరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు” అనగా జీవనమునకు ఒక మూలాధారము అవసరము. ఆ మూలాన్ని గ్రహించకపోతే జ్ఞానం, తర్కము, పాండిత్యము అన్నీ వ్యర్థమే. ఆత్మపరీక్షలేని - ఎందుకు జీవిస్తున్నామో తెలియని జీవనము దారితప్పిన ప్రయాణము.

ఇక్కడ కవి పాండిత్యమును, జ్ఞానమును తప్పుబట్టుట లేదు. జీవనమునకు ఆధారమైన సత్యమును గుర్తించనిదే మనిషి జీవితం బాహ్యముగా ఎంత గొప్పగా ఉంచుటకు ప్రయత్నించినప్పటికి లోలోపలి అస్తవ్యస్తము అలాగానే ఉంటుంది.

Top of Form

Bottom of Form

రెండవ​ చరణం:
వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు హరి॥
Telugu Phrase
Meaning
వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
(వట్టిజోలితో: జోలి= సంచి; వట్టిజోలి = ఏమీ లేని సంచి; వట్టిజోలితో = లోపలి అత్మన్యూనతతో = వట్టి స్వీయ జాలితో, ఊరక​=అవసరములేకయే) పనికిరాని స్వీయ జాలితో దైవమును స్మరింపకయే చేయు పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
(ఒడిగట్టు= కూడని పనులకు పాల్పడు) పట్టుపట్టి ఫలములులేని పంటలకు ఒడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
(గర్ణదారుండులేని= నావికుడులేని) సముద్రమునడుమలో నావికుడులేని ఓడ వంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు

సూటి భావము:
పనికిరాని స్వీయ జాలితో దైవమును స్మరింపకయే వట్టి చేతులుచాచి చేయు పూజవంటిది. ఆ పూజ అనర్హము. పట్టుపట్టి ఫలములులేని పంటలకు ఒడిగట్టేయటువంటిది. అది వృథా ప్రయాస మాత్రమే. సముద్రమునడుమలో నావికుడులేని ఓడ వంటిది. అది అగమ్యము. బట్టబయటనే  (అనగా ఆ భగవంతునికి చెందనిది అని) పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు.

గూఢార్థవివరణము:
 
వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది” మనిషి అంతరంగములోని వెలితిని నింపుకొనుటకై కొన్నిసార్లు పూజలు, దానములు, సామాజిక సేవలు చేపడతాడు. కానీ దైవస్మరణ లేకుండా, అంతరంగములోని లోటును గ్రహించ కుండా కేవలం చేతులుచాచి చేయు కార్యము వట్టి ఆచారముగా మిగులుతుంది. ఇక్కడ కవి భక్తిని కానీ అయా కార్యములను కానీ విమర్శించుట లేదు; అయా కార్యములను చేపట్టుటకు ప్రోద్బలములను పరిశీలించమని సూచిస్తున్నారు.

వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది” మనుష్య జీవితం స్వల్పమని అందరికి తెలిసినా మనము దీర్ఘకాలపు ప్రణాళికలు చేస్తూనే ఉంటాము. ఫలములను పూర్తిగా అనుభవించలేమని తెలిసినా మరొక పంటకు ఒడిగడతాము. ఇలా తెలిసి పాల్పడడము నేమనవచ్చు? దుఃఖమా? దురాశా?
 
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది” “సంసార సముద్రము తెలియనంత విస్తారమైనది. ఎంత ప్రయాణించినా ఆ సముద్రము మధ్యలోనే తిరుగుతూనే ఉంటాడు. చుక్కానితో దారిని నియంత్రించు నావికుడు లేని నడిసంద్రపు ఓడ దారికై తర్జనభర్జనపడినట్లు, స్పష్టమైన దిశలేని జీవనపు చిరునామా గందరగోళము.
 
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు” ఈ ఉపమానముల ద్వారా స్థిర దిశలేని జీవనము లోని అస్తవ్యస్తమునకు సంకేతము అని కవి అన్నారు. బహు కార్యములలో తగులుకొనుట​, సూక్ష్మ బుద్ధిలేక ఒడంబడికగా కార్యములు చేపట్టుట​, అంతరంగములోని ​ గజిబిజి యొక్క బాహ్యరూపములు.

మూడవ​​ చరణం: 
పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు హరి॥
Telugu Phrase
Meaning
పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చక్కగా ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథలవంటిది నీకు చెందని బతుకు
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
ఆర్భాటముగా అన్నీ చేసి చివరకు యజ్ఞము చేయించు బ్రహ్మలకు, వేంచేసిన ఆహుతులకు దక్షిణలు తగినంతగా సమర్పించుకోని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు హరి॥
అన్నిటిలోనూ ప్రకాశించు యిందిరారమణా నీవు సర్వాంతర్యామివని దెలియనివాని బదుకు
సూటి భావము:
చక్కగా ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది - శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథలవంటిది నీకు చెందని బతుకు. ఆర్భాటముగా అన్నీ చేసి చివరకు యజ్ఞము చేయించు బ్రహ్మలకు, వేంచేసిన ఆహుతులకు దక్షిణలు తగినంతగా సమర్పించుకోని యజ్ఞము వంటిది - అన్నిటిలోనూ ప్రకాశించు యిందిరారమణా నీవు సర్వాంతర్యామివని దెలియనివాని బదుకు

గూఢార్థవివరణము:
 
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది: ఇది జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఉపోద్ఘాతములో చెప్పినట్లు జీవనమునకు దైవమునకు మధ్య అసలు అంతరము లేదు. అదే సత్యమును గ్రహించిన వాని జీవితం. కానీ శ్రీవేంకటేశ్వరునికి చెందని బతుకు ఆ జీవనమునకు దైవమునకు మధ్య అంతరమును మరింత పెంచుతుంది.

“యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు” ఈ పంక్తికి అర్థం చాలా గహనమైనది. ఇది కేవలం బయట కనబడుతున్న దానిని, అద్దానిని పరికించు దానిని తెలియవలెను. కనబడుతున్నది పరికించునది, రెండు బాహ్య  విషయములే. విద్యుత్త ఏ రకముగా తీగల పైతలముననే ప్రవహించునో, ఇవి కూడా అంతే.

సత్యము అతి నాజూకైన, పారదర్శకమైన​ ద్రవమువంటి అస్తిత్వము. ద్రవము ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ఆపాదించుకున్నట్లు, మనము ఏ విధముగా ఊహించుకుంటామో ఆ విధమైన రూపాలలోనే సత్యము మనకు కనిపించును. అది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా, అణువణువులో దాగి ఉన్నా, మనకు గోచరమగునది బాహ్య  విషయము మాత్రమే.
 
మనసు ఏ విషయముపై లగ్నమైతే, ఆ దాని రూపంలోనే సత్యము మనకు ప్రతిబింబించినట్లుగా అనిపిస్తుంది. కానీ అది తన అసలు స్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టదు. తాడు పాములాగా కనబడుట, చీకటిలో కొన్ని వస్తువులు భయంకరంగా అనిపించుట వంటి ఉదాహరణలు దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఇవి అన్నీ దృశ్య ప్రపంచంలోనివి.

ఈ విధంగా చూసే దృశ్యము గాని, మనోదృశ్యము గాని సత్యమును గుర్తించుట మనకు అసంభవమే. కానీ కవి నీవెక్కుడు (దైవము లేదా తెలియనిది ముఖ్యము) అంటున్నారు. కాబట్టి సమస్య మన దృక్కోణమే. జాగ్రత్తగా గమనిస్తే “నీవెక్కుడనుచు నిన్నిటఁ” అన్నది తెలిసిన దానిలోను తెలియనిదానిలోను రెంటిలోనూ సమముగా ఉన్నది సత్యమని సూచిస్తుంది. దీని నుండి గ్రహించవలసినది ఏమనగా — మానవుడు తెలిసిన పరిధిలో ఉన్నదానినే గ్రహించగలడు; తెలియని పరిధిలో ఉన్నదానిని తెలుసుకొనుట అతని శక్తికి అందదు. ఈ కారణంగానే “నీవెక్కుడనుచు నిన్నిటఁ” అన్న వాక్యము మరింత గహనమైన సూచనగా నిలుస్తుంది.

అందుచేత సత్యమును పూర్తిగా నిర్ధారించుటకు మానవుని వద్ద సరిపడిన సాధనములు లేవు. “సత్యము ఉందని” గాని “లేదని” గాని నిరూపించుటకు మనము చేసే యత్నములు చాలాసార్లు మనల్ని మరొక గందరగోళములోకి నెట్టివేయగలవు. ఈ స్థితిని గుర్తించుటలోనే కవి సూచించిన వినయం దాగి ఉన్నది.

T-327 చాలుఁ జాలు నీ జాజర నన్ను

  తాళ్లపాక అన్నమాచార్యులు 327 చాలుఁ జాలు నీ జాజర నన్ను For English version press here పరిచయం ఈ చిత్రమెవరిది ? అన్నమాచార్యులు అద్భుతమైన చిత...