తాళ్లపాక అన్నమాచార్యులు
227.
సచరాచరమిదె సర్వేశ్వరుఁడే
For English version
press here
ఉపోద్ఘాతము
మొదటి పంక్తి చూస్తూనే భగవద్గీతలో సంజయుడు చెప్పినట్టు (“తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా”
11-13) = ‘ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ
ఒక్క చోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు’ అన్న మాటలు
గుర్తుకు వస్తాయి.
అయితే దీనిని అన్నమాచార్యులవారి ఇంకొక కీర్తనతో కలిపి చదవాలి “వెలినుండి లోనుండి వెలితిగాకుండి
/ వెలి లోను పలుమారు వెదకేవె గాలి”
(భావము: మానవుడా! బయటలోను లోపలలోను వెలితి
లేకుండా నిండి వున్న ఆ దైవమును తిరిగి తిరిగి బయట
వెదకేవు దేనికని?)
ఈ రెండింటినీ కలిపి చూస్తే అన్నమాచార్యులవారు అర్జుని మాదిరిగా
బయట కనబడుతున్న దృశ్యమును గురించి చెప్పలేదు వారు తమ నిశ్చలమైన మనసుతో అచంచలమైన
భక్తితో, దైవముతప్ప తనకు వేరు మార్గం
లేదని, సర్వస్వము ఒడ్డి, శరణాగతిని పొందారు.
ఆ నిర్వికల్ప స్థితిలో వారు తమకు ప్రత్యక్ష అనుభవమునకు వచ్చినది
మనకు కీర్తనములుగా చెప్పిరి. ఈ కీర్తన పరీక్షగా చూచిన అన్నమాచార్యుల వారి స్థితి అర్జునుని
వంటిది కాదు అని తెలియవచ్చును. అర్జునునికి భగవానుడు దివ్యదృష్టి ఒసగుటచేత విశ్వరూపమును
వీక్షించగలిగినాడు (11-8 న తు మాం శక్యసే
ద్రష్టుమనేనైవ స్వచక్షుషా ). అన్నమాచార్యులు తమ యోగ
దృష్టి చేత అర్జును కనిపించిన దృశ్యమునే కనిరి అనుకోవచ్చును.
సామాన్యులు భగవంతుని భజించి తృప్తి పడుదురు. ఇహసుఖాలకే మనసు ఇచ్చినవారు
దైవాన్ని గుర్తించలేరు. యోగులు ఆ పరమాత్మ తత్త్వమును తెలియుదురు. యేది రాత్రియై కనులు
గానలేకున్నవో దానియందు రమింతురు (2-69 యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ).
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 320-5 సంపుటము:
4-116
|
సచరాచరమిదె
సర్వేశ్వరుఁడే
పచరించి
యీతని భావింపు మనసా ॥పల్లవి॥
కదలెటి
దంతయు కమలారమణుని-
సదరపు
సత్యపు చైతన్యమే
నిదిరించెటి
యీనిశ్చేష్టజగమును
వుదుటున
నాతఁడు వుండేసహజమే ॥సచరా॥
కలిగివుండినదె
కల దింతయు హరి-
నలుగడఁ
బరిపూర్ణపుగుణమే
మలల్సి
లేనిదియు మహిమల నాతని-
నిలుకడగలిగిన
నిర్గుణమే ॥సచరా॥
జీవరాసులగు
సృష్టియింతయును
శ్రీవేంకటపతి
చిత్తంబే
కైవల్యమె
లోకపు టిహముఁ బరము
భావించ
నేర్చిన పరమవిదులకు ॥సచరా॥
|
Details
and Explanations:
సచరాచరమిదె సర్వేశ్వరుఁడే
పచరించి యీతని భావింపు మనసా ॥పల్లవి॥
పచరించి
= ఇక్కడ “పచ” అంటే వంట. పచరించి అంటే
పరిపక్వము చెందిన అని తీసుకొనవలెను; భావింపు = సత్యముగా అనుభవించు;
భావము: ఈ చరాచర జగత్తంతా సర్వేశ్వరుడే. పరిపక్వత పొందిన మనసుతో అతడిని నీలోనే తెలియుము.
వ్యాఖ్యానం:
ఈ
పల్లవి మూసలో పోసిన భక్తిలా అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా దృష్టి పెడితే — ఇది
అద్భుతమైన అద్వైత భావనకి, అనుభూతి మీద ఆధారపడిన తాత్త్విక
దృష్టికి మూలమవుతుంది.
పచరించి
యీతని భావింపు మనసా:
పచరించి
అంటే పక్వము చెందు. ఇక్కడ పరిపక్వం చెందేది మనసు.
“పచరించి యీతని భావింపు మనసా” అంటే పరిపక్వమైన
మనసుతో చూచిన ఆ భగవంతుని భావనను వాస్తవముగా అనుభూతి చెందవచ్చును అని చెప్పారు.
(“జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్” భగవద్గీత
7-18)
"పచరించి యీతని భావింపు మనసా"
ఈ పాదం విప్లవాత్మకం.
ఊహించేదానిని “నమ్ము” అని కాదు —
"పక్వత పొందిన మనసు మాత్రమే దీనిని భావించగలదు" అనే సూచన.
ఇక్కడ పచరించి అన్న పదం ఎంతో గరిమ గలది—
ఆచార్యులవారి ఇంకొక కీర్తన మననం చేసుకుంటే బాగుంటుంది
పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము
(= వయస్సు పెరిగినా పరిపక్వత రాలేదు.
జీవితమంతా పళ్లునూరటంలోనే
వృధా చేసుకున్నాము.
కట్టకడపటిది చూడనేలేదు)
కర్తృత్వం లేని భావన
"పచరించి యీతని భావింపు మనసా"
అది మనసు రూపాంతరాన్ని సూచిస్తుంది —
అజ్ఞానంతో, స్పందనలతో నడిచే ముడితనపు స్థితి
నుంచి
అంతర్ముఖమైన, శాంతమైన, పక్వమైన
స్థితికి.
ఈ విధమైన పరివర్తితమైన మనసే
ఈ విశ్వము యొక్క
ఏకత్వాన్ని అనుభవించగలదు.
ఇక్కడ "భావింపు" అన్నది కర్తృత్వం లేని భావన.
ఇది కర్తృత్వాన్ని పూర్తిగా తొలగించి,
ఇక్కడ “నేను గ్రహించాను” అనే గర్వమును కాక
"మనసు భగవంతునితో ఐక్యమై
ఆ అనిర్వచనీయమైన ఏకత్వపు ఆలింగనమును"
చూపించుచున్నది.
జీవిత
సత్యం. అనుభూతి.
ఇది చేతనావస్థ జోక్యం లేకుండా చూసే దృష్టి—
ఇదే జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన
చూచువాడు లేకయే చూచుట
(seeing
without the seer)
ఈ పల్లవిలో కవిత్వపు కోణం లేదు—
జీవిత సత్యం. అనుభూతి.
అన్నమాచార్యులు పదాలు—
తానుభవించిన దాన్ని చెప్పేందుకు వ్రాశారు.
మొదటి
చరణం:
కదలెటి దంతయు కమలారమణుని-
సదరపు సత్యపు చైతన్యమే
నిదిరించెటి యీనిశ్చేష్టజగమును
వుదుటున నాతఁడు వుండేసహజమే ॥సచరా॥
భావము:
ఈ
సృష్టిలోని ప్రతీ కదలిక, ప్రతీ జీవి, —
కమలారమణుని
సత్యభరితమైన చైతన్యమే.
అలాగే, నిశ్చలంగా, నిస్సత్తువగా అనిపించే
ఈ
స్థూల ద్రవ్య ప్రపంచమూ —
అతడిగా
వెలిసిన పరబ్రహ్మ స్వరూపమే;
అదే
భగవానుడు తానై వున్న సహజ స్థితి.
వ్యాఖ్యానం:
విప్లవాత్మకమైన
అనుభూతి
ఈ చరణంలో అన్నమాచార్యులు
సూక్ష్మమైన, లోతైన, విప్లవాత్మకమైన
అనుభూతిని అందిస్తున్నారు:
కదలిక ఉన్నదంతా — చైతన్యానికి రూపం.
అది కమలారమణుని ప్రణాళిక —
సదరపు సత్యపు చైతన్యం —
అనగా నిస్సందేహమైన సత్యంగా కనబడే చైతన్యమే.
కానీ, ఆయన అక్కడ ఆగడం లేదు.
మనకు నిర్జీవంగా కనిపించే, కదలికలేని ఈ జగమూ —
అన్నమయ్య దృష్టిలో అదే పరమాత్మ సహజ స్థితి.
సర్వం
జగన్నాధం
మనం "చలనాన్ని" ప్రాణంగా అనుకుంటాం;
"నిశ్చలత"ని శూన్యం లేదా తక్కువగా అంచనావేస్తాం.
కానీ ఇక్కడ అన్నమయ్య చెప్పే నిజం:
కదలికలో ఉన్నది శ్రీహరి.
నిశ్చలతలోను ఉన్నది కూడా శ్రీహరియే.
సత్యము అనిశ్చయము
ఇది భగవద్గీత 13-13వ శ్లోకాన్ని గుర్తుచేస్తుంది:
"అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే " —
ఆ పరబ్రహ్మము సత్ (ఉన్నది) అనిగాని, అసత్ (లేదని) అనిగాని చెప్పబడదు.
సత్యము యొక్క విలోమ తత్వం ప్రకాశింపజేశారు
అదే గీత 4-18లో ధ్వనిస్తుంది:
“కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః..”
కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడగలవాడే మేధావి.
అన్నమయ్య ఇక్కడ శ్రీహరిని తత్వాన్ని వర్ణించడమే కాదు —
మన చూపులను పూర్తిగా మార్చే విధంగా మార్గనిర్దేశం చేస్తున్నారు:
సహజ స్థితి
నిశ్చలంగా, మౌనంగా, శూన్యంలా
అనిపించే ప్రతి వస్తువులో
దైవిక చైతన్యం నిండి ఉంది.
సాధనల పేరుతో, జ్ఞానార్జన పేరుతో
మనము శక్తిని వృధాచేస్తున్నాం.
కాని సర్వవ్యాపియైన పరమాత్మ —
శ్రమించడు, అలసిపోడు, విశ్రమించాల్సిన
అవసరం లేదు.
అన్నీ తానై వుంటాడు — కదలికలోను, నిశ్చలతలోను.
అది ఆయన సహజ స్థితి.
ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే —
కలతల ప్రపంచం విడిచి,
శూన్యంలోకి మెల్లగా ప్రవేశించాలి.
అక్కడే జీవనం;
అప్పుడే జ్ఞానం
రెండవ
చరణం:
కలిగివుండినదె కల దింతయు హరి-
నలుగడఁ బరిపూర్ణపుగుణమే
మలల్సి లేనిదియు మహిమల నాతని-
నిలుకడగలిగిన నిర్గుణమే ॥సచరా॥
మలల్సి లేనిదియు = వెనుకకు
మరలవలసి లేనిదియు, no need to turn back;
భావము:
ఈ
కనిపించే జగత్తు — హరిచైతన్యమే.
మనకు
క్రొత్తగా కనిపించునది ఏదీ లేదు.
విశ్వం
నలుగడల అతడి వ్యాప్తి పరిపూర్ణము.
శ్రీహరి
మహిమల వలన
దీని
నుండి వెనుకకు మరలవలసిన అవసరమేలేదు.
గమనించగలవారికి.
అపూర్వమైన
ఆ నిర్గుణతత్వం —
ఈ
మాయా-లోకంలోనూ నిలిచి ఉంటుంది,
వ్యాఖ్యానం:
పరమసత్యం అనేది ఈ ప్రపంచాన్ని విడిచివున్నది కాదు.
భగవంతుని చైతన్యం, పరమ నిశ్చలత,
పరిపూర్ణమైన సహజత్వంతో జగత్తంతా వ్యాపించివుంది.
నిలుకడగా ఆ నిర్గుణమును పరిశీలించిన కానీ
వెంకటపతి మహిమలను తెలియలేము.
మూడవ చరణం:
జీవరాసులగు సృష్టియింతయును
శ్రీవేంకటపతి చిత్తంబే
కైవల్యమె లోకపు టిహముఁ బరము
భావించ నేర్చిన పరమవిదులకు ॥సచరా॥
భావము:
ఈ
సృష్టిలోని జీవరాశులన్నీ
శ్రీ వేంకటపతి యొక్క చిత్తప్రకంపనలే.
‘కైవల్యం’ అనేది —
ఈ లోకమునూ, పరలోకమునూ
ఒకే అంతరదృష్టిలో దృఢంగా పట్టే స్థితి.
అలాంటి
స్థితిని
చదువులతో కాదు —
జ్ఞానంతో, పరిశీలనతో, స్థితప్రజ్ఞతతో
గ్రహించి, సాధించగలవారే
పరమవిదులు.
వ్యాఖ్యానం:
నిశ్శబ్ద
ప్రసరణ:
ఈ చరణంలో అన్నమయ్య
ఆధ్యాత్మికత పట్ల మన ధారణను పూర్తిగా మార్చేస్తారు.
మనలో చాలా మంది
“ఈ లోకం నిజం”
మరియు
“మోక్షం” అనేది ఈ జన్మ తరువాతి దశ అని కానీ
ఎక్కడో శ్రీమహావిష్ణువు వుండు ప్రదేశమనో భావిస్తారు.
కానీ అన్నమయ్య అలా అనటంలేదు —
ఈ రెండూ వేర్వేరు కావు.
ఒకే జగత్సంబంధమైనవి, సక్రమమైనవి
ఒకే సముద్రము నుండి ఉద్భవిస్తున్న అలల వలె
జీవరాశులన్నీ
ఒకే చిత్తాంతరంలో కలుగుతున్న అనుభవాలే
కైవల్యమంటే
ఏమిటి?
పరిమితులు లేవు. విధించుకున్నవి.
సర్వమును గ్రహించి, సత్యంగా చూచుట.
కనులు తెరిచి
ఈ లోకమునూ, మరణానంతర స్థితినీ
ఒకే సమయంలో జ్ఞానదృష్టితో చూడగలగడమే కైవల్యం.
"యః
పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి"
అందుకే అన్నమయ్య అంటారు:
“కైవల్యమే లోకపు టిహము బరము”
లోకానికి సర్వసమ్మతిని తెలుపకుండా
మరణమును అనుభూతి చెందని మోక్షం లేదు.
ఈ రెంటినీ ఒకే బౌద్ధిక శక్తిలో చూడగలగడం —
వాని గరిమను, ప్రకాశాన్నీ అంగీకరించడమే —
మోక్షం.
“పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే”
ఈ లోకము పరము వేరు వేరు లోకాలు కావు.
విశ్వమంతా వ్యాపించి వున్నదొకటే.
"ఎదుట
నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే"
నిజమైన
విద్య ఏమి?
పరమాత్ముని పొగడటం, లేదా నామస్మరణ చేయడం —
మంచివే. కానీ అవి పరిష్కారాలు కావు.
అన్నమయ్య దృష్టిలో ‘విద్య’ అనేది గ్రంథాలతో వచ్చిన మేధస్సు కాదు.
పరమవిదులు అంటే —
అచంచలమైన స్పష్టత గలవారు
శూన్యములో నిలిచే ధైర్యం.
అవధులులేని నిశ్శబ్దంలో మేల్కొని ఉండే సామర్థ్యం.
భ్రమలో తడబడకుండా,
వ్యక్తంచేయలేని తేటదనముతో చూచువారు.
మాయను నిష్కపటంగా (నిర్వ్యాజంగా ) చూసే వారు.
భ్రమల లోలకానికి చిక్కుకోనివారు.
వారే అసలైన జ్ఞానులు.
విశృంఖల జీవితం:
ఈ పంథాలో అన్నమయ్య
ఒక గూఢమైన హెచ్చరికనిచ్చారు:
గతించిన
రాజులు, చక్రవర్తులు, కవులు, తత్త్వవేత్తలు,
ధనికులు, పేదలు, కళాకారులు,
తపస్వులు —
ఎవ్వరూ ఈ అసలుసిసలైన విద్యా బోధనను
వారసత్వంగా ఇవ్వలేకపోయారు.
వారంతా వచ్చారు. పోయారు.
మనమేమి నేర్వలేదు.
తరువాతి తరంవారిని అజ్ఞానంలోకి మనమే తోసేస్తున్నాం.
వారి జీవితాలను
అలసటతోను, ఆరాటముతోను కూడిన శ్రమగా మార్చేస్తున్నాం.
ఆ శ్రమైక జీవితం కేవలం బ్రతుకుదెరువు మాత్రమే.
వీటికి అతీతముగా వున్నదే అసలు విద్య.
దానిని అందిపుచ్చుకోకుంటే నిజమైన దురదృష్టం.
భగవద్గీత
అనుసంధానం:
భగవద్గీత 2.69 లో ఇది స్పష్టంగా
చెప్పబడింది:
“యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ...”
నిద్రపుచ్చే తామసపు అంధకారంలో
ఈ జనమంతా మునిగివుంటే
జ్ఞాని మేల్కొని ఉంటాడు.
ఆ సత్యాన్ని వాస్తవముగా చూడగలవాడే మేధావి.
అన్నమయ్య పిలుపు ఇదే:
భక్తిలో వుండు. కానీ వివేకంతో.
నమ్మకం ఉంచు. కానీ అన్వేషణతో.
భయపడకు. కానీ ఆగి, పరీక్షగా చూడు.
అదే విద్య.
అదే మోక్షము.
మీరు ఎంతో విపులముగా , లోతైన భావనలనన్నీ శోధించి శోధించి వివరణాత్మకముగా పాఠకుల అరచేతి వెన్న ముద్దగా అందించారు .
ReplyDeleteదానిని అంది పుచ్చుకుని ఆస్వాదించగలగటము మా భాగ్యము .
🙏🙏
అద్భుతముగా వ్రాసారు మాన్యా 🙏
నమస్సులు
✍️ వేణుగోపాల్ యెల్లేపెద్ది
చాలా బావుంది. జీవ కర్తృత్వం అనేది లేదు అని మీరు నిర్మొహమాటంగా చెప్పారు.
ReplyDeleteగుణభృన్ నిర్గుణో మహాన్ - అన్న విష్ణుసహస్రంలోని నామాలకు పరాశర భట్టర్ వ్యాఖ్యానంతో ఈ కీర్తన సరిపోతుంది.
ReplyDeleteస్థావరజంగములందు నిండియున్న సర్వేశ్వరుడు నీలోనూ ఉన్నాడని సాధన ద్వారా తెలిసికొనుము.
ReplyDeleteఓం పూర్ణ మదః పూర్ణ మిదం
పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ।
పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణ మేవావ శిష్య తే ॥
అన్న ఈశావాస్యోపనిషత్తులోని మంత్రం ఇదే చెప్పుచున్నది.
స్థావరముల యందు, జంగమముల యందును ఉండే చైతన్యము ఆ పరబ్రహ్మమే.జగమంతా చైతన్యస్వరూపమే.
శ్రీవెంకటేశ్వరుని చిత్తమే ఈ జీవరాశులు.అట్టి
పరంధామమును జ్ఞానసాధన ద్వారా చేరవచ్చునని అన్నమయ్య ఈ కీర్తనలో అనుభవపూర్వకముగా తెలియజెప్పుచున్నారు.
🙏🏻
కృష్ణమోహన్