Friday, 2 February 2024

T-193 వెలినుండి లోనుండి వెలితిగాకుండి

                                                           అన్నమాచార్యులు 

వెలినుండి లోనుండి వెలితిగాకుండి

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్

 

ఉపోద్ఘాతము: ఈ  కీర్తనలో అన్నమాచార్యులు బయటనుండి లోపల నుండి విషయములను గ్రహించు మనసును గురించి చెప్పారు. అదే సమయంలో గాలి అంటూ కానరాని దైవమును కూడా సూచించారు.

 

ఈ  కీర్తన క్రింది భగవద్గీత శ్లోకమును వివరముగా తెలుపుచున్నది​ సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్ సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ।। 13-14 ।। (భావము: సర్వత్రా దైవము చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.)

 

అలాగే​ మానవునికి సత్యమునకు మధ్య ఏర్పడిన అంతరమును గాలి అని కూడా సూచించారు. ఇక్కడ గాలి అనునది అగోచరత్వమునకు చిహ్నము.

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  70-4 సంపుటము: 5-232

వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి ॥పల్లవి॥
 
పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
నిండుఁగొలఁకులలోన నెలకొన్న గాలి
బొండుమల్లె లతావిఁ బొడవైన గాలి
యెండమావులఁ బోలితేలయ్య గాలి ॥వెలి॥
 
కొమ్మావిచవికెలోఁ గొలువుండు గాలి
తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి ॥వెలి॥
 
తిరువేంకటాదిపైఁ దిరమైన గాలి
సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
విరహాతురులనింత వేఁచకువె గాలి ॥వెలి॥



Details and explanations:

                                            వెలినుండి లోనుండి వెలితిగాకుండి
                                            వెలి లోను పలుమారు వెదకేవె గాలి       ॥పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: వెలినుండి = బయటనుండి; వెలితిగాకుండి = ఏ మాత్రము తక్కువ గాక వుండి (= నిండుగా వుండి)  

భావముమానవుడా! బయటలోను లోపలలోను వెలితి లేకుండా నిండి వున్న  ఆ దైవమును తిరిగి తిరిగి బయట వెదకేవు దేనికని

వివరణము: భగవద్గీతలో చెప్పినట్టు బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ  దైవం విశ్వమంతా నిండి ఉన్నదని అన్నమాచార్యులు కూడా తెలుపుతున్నారు.

దైవమును మూలమూలలా వాడవాడలా కొండలలో కోనలలో వెతుకుతూ ఉంటాం కానీ ఎవరికీ దైవము కనపడిన దాఖలాలు లేవు. దీని మూలమున సమయం వృధా అవుతున్నదే కాని మానవుడు దైవమును తెలియలేడు. సత్యమును స్పృశించలేడుఅన్నదానిని తెలుపుతున్నారు అన్నమాచార్యులు. కాబట్టి మన ఇప్పటి పద్ధతులకు భిన్నంగా సరికొత్త పంథాను ఎంచుకొన వలెను.

సర్వవ్యాపి అయిన భగవంతుని వెదుక నవసరం లేదు అన్న విషయాన్ని నొక్కి చెబుతున్నారు అన్నమాచార్యులు. “భగవంతుడు లేనిదెక్కడ?” అంటే మనం చూచు చూపులలో భేదమున్నది. అనగా మన దృక్కోణం మార్చుకోవలెను; అంతే గానీ భగవంతుని చూచుటకు ఆసక్తి చూపిన కనబడడు.

అన్నమాచార్యులు ప్రజల లో తాను చూచిన సత్యమును తెలుపుటకు సర్వవిధముల ప్రయత్నించిరిఅని  ఘంటాపథంగా చెప్పవచ్చు. కానీ తెరలు కప్పి ఉన్న మన హృదయములకు వానిని గ్రహించు శక్తి లేదు. భగవంతునికై మనం వెచ్చించే సమయం అతి స్వల్పం. ఇటువంటి అరా కోరా ప్రయత్నములను, పూర్తి  విశ్వాసం లేని మన అవివేకమును అన్నమాచార్యులు విమర్శించిరి.

భగవంతుడు ఎందుకు కనపడడు: ఈ విషయం మనం ఇంతకు ముందు చర్చించుకున్నప్పటికీ ముఖ్యంగా గమనించాల్సింది భగవద్గీతలో చెప్పిన అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే” (13-13) విధముగా భగవంతుడు ఉన్నాడని కానీ లేదని కానీ నిర్ధారించలేం. ఉదాహరణకు దీనిని రీని మాగ్రిట్ గారు వేసిన “The Seducer” (మరులుకొలుపు వాఁడు) అధివాస్తవిక చిత్రము ద్వారా విశద పరచుకుందాం.


ఈచిత్రంలో సముద్రం మీద పోతున్న ఓడ దాని వెనుక మబ్బులతో కూడి ఉన్న నీలి ఆకాశం కనపడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ ఓడ కూడా సముద్రపు నీటితోనే చేసినట్లు తెలుస్తోంది తెలుస్తుంది. అనగా మనము చూచు ప్రపంచము ఏ పదార్థంతో తయారు చేయబడినదు అదే పదార్థంతో మనం కూడా చేయబడ్డాం.  

కాబట్టి. ఆ పదార్థమునకు తాను నీరు అన్న స్పృహ ఉండదు అనగా ఆ పదార్థం తనను తాను తెలియలేదు.  ఇక్కడ మనము గమనించవలసినది ఓడ యొక్క ఆకారం మాత్రమే విడిగా ఉన్నది. దాని ఆస్తిత్వం ఆ నీటికి సంబంధించినది.  కావున ఆ ఓడకు తనకుతానుగా ఆస్తిత్వం ఉండదు ఈ రకంగా చూచిన మానవుడు తననుతాను ఎప్పటికీ తెలియలేడు. కాబట్టి మానవునికి చేయవలసిన పని దైవము వెతుకుట కాదు తనను ఆవరించి ఉన్న అజ్ఞానపు తెరలు గమనించి ఊరకుండుట. అదియే భగవద్గీతలో చెప్పిన సమత్వము.

                                పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
                                నిండుఁగొలఁకులలోన నెలకొన్న గాలి
                                బొండుమల్లె లతావిఁ బొడవైన గాలి
                                యెండమావులఁ బోలితేలయ్య గాలి     ॥వెలి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కొలఁకువు = కొలను, తటాకము; బోలితేలయ్య = పోలితేలయ్య = పోలి తేలయ్య = పోలి తేలిపోయె (=అన్వయము: కనబడనట్టి) 

భావముపండువెన్నెలలకు ప్రాణమిచ్చునది ఈ గాలి. నిండు కొలనులకు ప్రాణమీ గాలి. బొండు మల్లెల పరిమళము ఎంతో దూరం వ్యాపింప చేయునదీ గాలి. ఐనా, దాని వెంటపడుట ఎండమావులలో నీరు వెతుకునట్టే.

వివరణము:  అన్నమాచార్యులు చెబుతున్నది మనం ఉన్నటువంటి ఈ ప్రపంచం ఒక అలౌకిక సమ్మేళనము. ఇందు జీవ జడ పదార్థము లకు భేదము లేదు#1.  పండువెన్నెలలకు, నిండు కొలనులకు, బొండుమల్లెలకు, ఎండమావులకు ఆధారం ఒకటే. చివరి చరణము కూడా చూడండి.

                            కొమ్మావిచవికెలోఁ గొలువుండు గాలి
                            తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
                            యిమ్మయిన చలువలకిరవైన గాలి
                            కుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి      ॥వెలి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: చవికె = కూటము, మండపము; తమ్మి = మోహము, తమకము; తమ్మికుడుకులఁ దేనె = మోహము, తమకముల ఉడుకులలో సంభవించు తేనె; 

భావముమామిడి చెట్ల కొమ్మలనే మేడల్లో కొలువు ఉంటుందిట ఈ గాలి మోహము, తమకముల ఉడుకులలో సంభవించు తేనెల వెనక దాగి ఉంటుందిట ఈ గాలి. చల్లని చలువను కలిగిస్తుందిట ఈ గాలి. అలాగే అప్పుడప్పుడు వేడిగాలి కూడా కుమ్మరిస్తుందట ఈ గాలి.

వివరణము: చివరి చరణము చూడండి.

                            తిరువేంకటాదిపైఁ దిరమైన గాలి
                            సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
                            తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
                            విరహాతురులనింత వేఁచకువె గాలి      ॥వెలి॥


ముఖ్య పదములకు అర్ధములు: సురతాంతముల = స్త్రీపురుషుల కలిసి విడిపోవుటలు; చొక్కించు = పరవశతను పొందించు, మత్తుకమ్మేటట్టు చేయు; తొరలి = ఆర్చు, ౘల్లార్చు, allay, quench;  పయ్యదలలోఁ = పైటలలో;

భావముస్థిరముగా తిరువేంకటాద్రి మీద తిరుగునట ఈ గాలి. స్త్రీపురుషుల కలిసి విడిపోవుటలను మత్తును కమ్మేటట్టు చేయునట ఈ గాలి. స్త్రీల పైటలలో దూరి విరహాతురులను వేధిస్తుందట ఈ గాలి.

వివరణము: ఈ రకముగా అన్నమాచార్యులు  మానవునికి ప్రకృతి సవాలు విసురుతుందని; తమకములోను విరహములోను, స్త్రీల పైటలలోను దూరి విరహాతురులను వేధిస్తుందని సెలవిచ్చారు.

దీనికి ప్రతిగా మానవుడు స్పందించి ఈ భూమండలమున తన జాతి సంఖ్యను పెంచుకునేను కానీ సత్యం వైపు అడుగులు వేయలేడు. దీనినే మనము ఈరోజు చూడగలుగుతున్నాం.

అనగా సత్యం వైపు ప్రయాణం మానవుడు చేయగలడు అతడు చేయగలిగినదంతా తననుతాను అర్పించుకొనుట. తక్కిన కార్యక్రమములు, చేష్టలు సత్యం వైపు ప్రయాణం కావు; కావున పనికిరానివే.

T-192 హరి నీవే సర్వాత్మకుఁడవు

                                                                     అన్నమాచార్యులు

192. హరి నీవే సర్వాత్మకుఁడవు

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్ 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలను సత్యమునకు దారి చూపు దివిటీలుగా మార్చి  వ్రాసిరి. వారు ఆ వ్యక్తం చేయలేని భావనా స్థితి నుండి ప్రపంచమునకు సెలవిచ్చిన ఈ కీర్తనలను, ముఖ్యంగా అన్నమాచార్యుల అంతరంగమును పరిశీలించక; కేవలము పదముల అర్థములను విశదీకరించుట వలన ప్రయోజనం చేకూరదు. 

వారు తమ కాల పరిస్థితులకు దృష్టిలో ఉంచుకొని తమ విప్లవాత్మక ఉద్దేశములను సంప్రదాయము అను తెరల వెనుక దాచి ఉంచిరి. అతి జాగ్రత్తగా గమనించిన వారు చేరుకున్న  స్థితి నుండి తనకు దైవముతోను లేదా సత్యముతోను ప్రత్యక్ష అనుభవంగా కలిగిన (లేదా తెలుసుకున్న దానిని వివరించుటకు) వేలాది విధములుగా ప్రయత్నం చేసారు. 

అన్నమాచార్యులవారు అత్యంత గహనమైన విషయములను మనకు సూటిగా సులభముగా చెప్పుటకు తేట తెలుగులో వ్రాసినారు. కానీ కాలగమనముతో భాషలోని మార్పులతో అవి అర్థం చేసుకొనుట కొంత కష్టమగుచున్నది. కావున ఈ కీర్తనలను మనము ఊహించుకొని మన అనుభవమునకు వచ్చిన పాక్షిక సత్యములతో రంగులు  అద్ది  భాష్యమును చెప్పుట పరిపాటి అయినది.

 

అధ్యాత్మ కీర్తన: 

రాగిరేకు:  375-5 సంపుటము: 4-441 

హరి నీవే సర్వాత్మకుఁడవు
యిరవగు భావన యియ్యఁగదే          ॥పల్లవి॥
 
చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యఁగదే          ॥హరి॥
 
పారక మానదు పాపపు మన సిది
యీరసములతో నెందైనా
నీరజాక్ష యిది నీమయమేయని
యీరీతుల తలఁ పియ్యఁ గదే          ॥హరి॥
 
కలుగక మానవు కాయపు సుఖములు
యిల లోపలఁ గల వెన్నైనా
అలరిన శ్రీ వేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహ మియ్యఁగదే          ॥హరి॥

Details and explanations:

హరి నీవే సర్వాత్మకుఁడవు
యిరవగు భావన యియ్యఁగదే పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఇరవు = అనుకూలము, తగిన 

భావము:  హరి నీవే క్షేత్రజ్ఞుడవు. మాలో సానుకూల భావములను కలిగించ రాదా! 

వివరణము: భగవానుడు సర్వాంతర్యామియై వుండగా, మనము దైవమును తెలియుటకు ఏల యత్నము చేపట్ట వలెను అని సందేహము కలుగక మానదు.  మానవుడు ఏ రకమైన కార్యములను చేపట్టిన జన్మ సాఫల్యము పొందును అను ప్రశ్న ఉదయించును. 

వీనికి నేరుగా సమాధానము సులభం కాదు. ఎన్నో మతములున్నను, ఎందరో మహానుభావులు అనేక విధములైన వివరణలు యిచ్చినప్పటికి, ఇది తిరిగి తిరిగి మనలను వేధించుచునే యున్నది. 

అన్నమాచార్యుల ప్రతిభ వారు  మూల విషయములతో సహా మానవులను పరీక్షించు వానిని నేరుగా ప్రస్తావించుటలో వున్నది. మన ఇప్పటి భావనలు సరి అయినవి కావని సూటిగా చెప్పారు. 

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యఁగదే హరి ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యీడువడని = కాలముతో పాటు క్షయమునొందని;

భావముమా కళ్ళు వద్దన్నా కూడా నిన్ను (సత్యము) తప్పించి ఇతరములనే చూచును.  వాటిని దాటి (వానికి నీడలుగా లేదా పరిపూరకములుగా) వున్నది నీవే నని గ్రహించు కాలముతో మార్పు చెందని జ్ఞానమ ఒసగ రాదా! 

వివరణము: మనచుట్టూ వున్న ప్రపంచము అనూహ్యమైనది. దీనిని మనము తరగతులుగాను ఇది లోపలిది. అది బయటది అని విభజించి చూచుటను అన్నమాచార్యులు ఎత్తి చూపు చున్నారు. 

భగవద్గీత పదమూడవ అధ్యాయంలో బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ (13-16) అనగా జీవులన్నింటికి  బయట లోపలా ఉన్నది, కదులువానియందు  కదలనివానియందునూ ఉన్నది దైవమేఅని చెప్పిరి.  ఎవరైతే అంతరంగములోని వాడు, గుణముల తెరయు, దానికి ఆవల వున్నది ఒకటేనని యథార్థముగా తెలియునో వానినే దృష్ట అనిరి. 

ఇదే విషయమును తెలుపుతూ విశ్వవిఖ్యాత సర్రియలిస్ట్,(అధివాస్తవిక కళాకారులు) రీనె మాగ్రిట్ గారు La Savoir (జ్ఞానం) అను పేరు గల చిత్రమును గీసారు. ఈ చిత్రం వారి ప్రతిభకు అద్దము పట్టును. మనకు పట్టపగలు అనిపించు దృశ్యం అగుపిస్తుంది. అక్కడ ఒక ద్వారము వుంది. ఆ ద్వారము తలుపు తెరచి చూస్తే రాత్రి వేళ, అందులో చంద్రుడు కనబడుతుంటాడు. (ద్వారము తలుపు తెరచి చూచుటను పరీక్షగా చూచుటతో సమముగా చేసికొనవలెను.)


ఈ బొమ్మ ద్వారా వెలుగు చీకట్లు పరికించి చూచిన ఒకే నాణెమునకు ఇరువైపులని చూపారు. సుఖదుఃఖములు అట్లే. పగటిని చైతన్యము గాను, రాత్రిని అనుభవ మునకు అందని దానిని తీసికొన్న చైతన్యాచైతన్యములు అటులనే. ఒక దానిని చూచుట నేర్చిన మరొక దానిని గ్రహించినట్లే. 

కావున, ఈ చరణములో మనము చూచు చూపులను సరి దిద్దు కొనవలెనని ఆచార్యులు చెప్పినారు. దానికి మార్గములు లేవు. "నేను సరిచేసుకోగలను"  అను కొనుట అహంభావము. "చేయలేననుకొనుట" నైరాశ్యము. విష్ణుని ఆశ్రయించిన సంభవము. ఆ మార్గము తెలియుటకై చేయు ప్రయత్నము తపస్సు. అదియే అన్నమాచార్యులు పేర్కొన్న కాలముతో  చెడిపోని యీడువడని తెలివి.

                                పారక మానదు పాపపు మన సిది
                                యీరసములతో నెందైనా
                                నీరజాక్ష యిది నీమయమేయని
                                యీరీతుల తలఁ పియ్యఁ గదే హరి ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యీరసములు = ఈ స్థాయీభావములు (= 1. శృంగారము, 2. హాస్యము, 3. కరుణము, 4. రౌద్రము, 5. వీరము, 6. భయానకము, 7. భీబత్సము, 8. అద్భుతము 9. శాంతము అను రసములు )

భావమునా యీ పాపపు మనస్సు యీరసములలో పారుతూ అక్కడే వుండి పోవ చూచును. నీరజాక్ష కనబడునదంతా నీ మయమే యని  నాకు బోధ పరచవే.

వివరణము: మన ప్రపంచమంతా అనేక అనేక రసములతో స్థాయీభావములతో  ప్రజ్వరీల్లుచున్నది  వీనిలో ఏదో ఒకదానికి మనం తగులుకుంటాం. దానితో ఆ నీరజాక్షుని చూడలేకపోతున్నాం.

అనగా మనము ఏ విధమైన మార్గము ఎంచుకున్నను దానికి ఒడబడు ఏదో ఒక సిద్ధాంతము, భావనము, దర్శనము కలుగ వచ్చును. కావున ఎటువంటి రసములకు ఉద్వేగములకు ఆర్భాటములకు తగలనీ మనసును ప్రసాదించమని అన్నమాచార్యులు కోరుకుంటున్నారు. 

సత్యము ఆశల గాలములకు, జిజ్ఞాసుల కనుల కళ్లెములకు, మరియు భక్తిహీనుల హారతి పళ్ళెములకు లోను కాదు, ఒడబడదు.

                                కలుగక మానవు కాయపు సుఖములు
                                యిల లోపలఁ గల వెన్నైనా
                                అలరిన శ్రీ వేంకటాధిప నీకే
                                యిలనర్పితమను యిహ మియ్యఁగదే హరి ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: అలరు = ఒప్పు, ప్రకాశించు

భావముకాయపు సుఖములు ఈ లోకములో ఎన్నో కలవు. శ్రీ వేంకటాధిప నీకే అర్పితమైన లోకము నా కీయ గదే.

వివరణము: “అలరిన శ్రీ వేంకటాధిప నీకే / యిలనర్పితమను యిహ మియ్యఁగదేఎంత శోధించినా మనవాళికి అటువంటి లోకము కాన రాలేదు. కాబట్టి అటువంటి లోకము యత్నమున​ సాధించదగినది కాదని, వేరేమి యుక్తులతోనూ సాధించలేనిది అన్న భావంతో ఓ వెంకటేశ్వర అది నీవు ఇచ్చిన కానీ నేను చేర​ గలిగినది కాదు అని చెప్పారు   

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ లోకమున మానవునికి ఈ లోకమున అనుభవించు సుఖదుఃఖములకు అతీతముగా ఉండును ఆ భావనలు ఉండవు అని కూడా స్పష్టం చేశారు.

ఈనాటి మానవులు అనేక మత గ్రంథములలో పేర్కొన్న పవిత్రత, నిర్మలత్వము అను వానిని మెచ్చుకొందురు గాని ఆ దిశలో అడుగులు వేయరు. అది తెచ్చి పెట్టుకుంటే వచ్చినది కాదు; కఠోర పరిశ్రమ ద్వారా సాధించ వలసినది.

 

కీర్తన సారాంశం:

పల్లవి: హరి నీవే క్షేత్రజ్ఞుడవు. మాలో సానుకూల భావములను కలిగించ రాదా! 

చరణం 1: మా కళ్ళు వద్దన్నా కూడా నిన్ను (సత్యము) తప్పించి ఇతరములనే చూచును.  వాటిని దాటి (వానికి నీడలుగా లేదా పరిపూరకములుగా) వున్నది నీవే నని గ్రహించు కాలముతో మార్పు చెందని జ్ఞానమ ఒసగ రాదా! 

చరణం 2: నా యీ పాపపు మనస్సు యీరసములలో పారుతూ అక్కడే వుండి పోవ చూచును. నీరజాక్ష కనబడునదంతా నీ మయమే యని  నాకు బోధ పరచవే.

చరణం 3: కాయపు సుఖములు ఈ లోకములో ఎన్నో కలవు. శ్రీ వేంకటాధిప నీకే అర్పితమైన లోకము నా కీయ గదే.

-x-సమాప్తము-x-

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...