అన్నమాచార్యులు
217.
నిద్దిరించీఁ బాలజలనిధి వలెనే
ఉపోద్ఘాతము:
ఈ కీర్తన చూడటానికి చాలా సులభంగా అనిపిస్తుంది. ఇంకొంచం దగ్గరగా చూస్తే విలోమ పద్ధతిలో వ్రాశారన్నది తెలుస్తుంది. ఇంకా కొంచం లోపలికి వెళితే సంజ్ఞార్థముగా కూడా వ్రాశారన్నది స్పష్టమవుతోంది. అన్నమాచార్యులవారు ఈ పాపపంకిలమైన లోకం విడిచి మానవులు చేరలేని ఎత్తులకు ఎదిగారని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఆచార్యులవారు ఏ స్థితిలో ఏ భావములు గోచరేమైనవి చెప్పక పోవడంతో మనసులో కొంత గందరగోళం ఏర్పడుతుంది. అయితే వారు చెప్పిన భక్తి శరణాగతి అనునవి మనము ఇప్పటి చేతనావస్థ స్థితిలో చేరలేనివని తెలుస్తుంది.
ఇక్కడ నిద్దిరించీఁ అనే పదంతో ఇప్పటి చేతనావస్థను విడిచి చేయు కార్యక్రమములను నిర్దేశించారు. ఇది మానవుడు స్వయముగా సాధించలేనిది. ఈ విషయంపైననే ఆచార్యులవారు ఈ కీర్తనను మనకు ప్రసాదించారు. ఇది క్రియకు అతీతం, పేరుప్రఖ్యాతులకు అతీతం - శాంతిలో నుంచే పుట్టిన సమర్పణ. అన్నమాచార్యులు మనల్ని అలాంటి సమర్పణను చేయమని ఆహ్వానిస్తున్నారు.
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: భావము: ఓ తల్లులారా! (శ్రీదేవి, భూదేవి లను
ఉద్దేశించి) ప్రశాంతంగా నిశ్చలంగా వున్న పాలసముద్రములాగనే మీరు కూడా ఈ శ్రీరమణునకు
అణుకువతో పాదములను వొత్తండమ్మా! అంతరార్థము: యోగనిద్రలో ప్రకాశించే ప్రభువుకు
పాలసముద్రం నిశ్చలంగావుండి విశ్రాంతి కల్పించినట్లే, మానవులారా,
మీరు కూడా ఆ శ్రీరమణుని పాదాలకు మిమ్మల్ని మీరు నిశ్శబ్దంగా సమర్పణచేసుకొని
ఆలాంటి స్థితిని మనసారా ఒప్పుకొని నిలబడగలరా?
మొదటి చరణం: తెల్లవారేదాకా ఈయన
నిద్రపోడు. ఒకపక్క జీవుల మొరలను ఆలకిస్తూనే
మాబోటివారి అవిద్యలను సరిజేస్తుంటాడు. అమితదయాళువై కృపారసమును పంచిపంచీ తన అలసటను
గమనించడు. పాపం ఎట్లా పడుకొన్నాడో చూడండమ్మా! ఈ యోగీంద్రవరదుడు ఎట్లు భోగించేనోకాని
ఆయన వుయ్యాల నెమ్మదిగా వూపండమ్మా! అప్పుడుగాని ఆయన నిద్రించడు.
అంతరార్థము: కోరికలతో ఎదురు చూస్తున్న మనసులతో, ఆలోచనల బరువుతో
నిలిచిన మాపై మృదువుగా, సహనంతో, ఆపకుండా తన కృపారసాన్ని వర్షించెను.
అది ఏమిటో అర్థం చేసుకోవడానికే మేము ప్రయత్నించకముందే —మా ఆలోచనలన్నిటిని
ఆయన శాంతింపజేశాడు, మా అవిద్యలన్నింటినీ కరిగించి ఊరట
ఇచ్చాడు. అతడు ఎలా మా హృదయంలోకి ప్రవేశించాడో
ఎవరికి తెలుసు? ఆ అనుభూతిని విడమర్చి చెప్పగలవారెవరు? అమ్మలారా! ఆ యోగీంద్ర వరదునికి ఉయ్యాల నెమ్మదిగా వూపండమ్మా!
రెండవ చరణం అన్నమాచార్యులవారు శ్రీదేవి భూదేవిలతో ఇలా నివేదించుకుంటున్నారు “వాలు కన్నులరెప్పలు అరమోడ్చి లోకాలకు వడ తాకకుండా పరిమళాలు జల్లుతూ ఎడతెగకుండా జీవులకు ఉచ్ఛ్వాసనిశ్వాసములు కలిగించుతూ; నీలవర్ణపుగుణమును అంతటా వ్యాపింప చేయుచూ; కొద్దిపాటి కాలమును ఆ జీవుల కన్నుల ముందు త్రిప్పి ఆపై దోమతెర కప్పే ఆస్వామికి - "కొంచెంసేపు ఆ కళ్ళమీద వెలుతురు పడకుండా దోమతెరకప్పి కళ్ళు తిప్పకుండా జాగ్రత్త పడ్డారంటే నెమ్మదిగా నిద్రపడుతుందమ్మా!" అంతరార్థము: "ఆయన తన అంతరంగపు తాపాన్ని లోకాలమీద పడకుండా నియంత్రిస్తూ, జగత్తుకు సుగంధాలను పంచుతాడు. నిరంతర ప్రవాహంలా ఊపిరి తీసి విడిచే ధాటిలో, ప్రతి జీవిలో ప్రాణశక్తిని నింపుతున్నాడు. అయినా తనని తాను విశాలమైన నీలినీడల వెనుక దాచుకొని — జీవులు కేవలం తృటి కాలాన్ని అనుభవించగలిగేలా వారి కనులు తెరుస్తూ మూస్తూ వుంటాడు. పరమసాధ్వీమణులారా! దయచేసి నెమ్మదిగా ఆయన కన్నులపై దోమతెరను పడనివ్వండి. కాంతి కనపడకుంటే, ఆయన నిశ్చలమైన నిద్రలో విశ్రాంతి పొందగలుగుతాడు."
మూడవ చరణం: అన్నమాచార్యుల వారు
ఆదుర్దా పడుతున్నారు. తనలో ఇలా అనుకొంటున్నారు “ఇంకాసేపట్లో మళ్లీ సుప్రభాతం అంటూ తగులుకొంటారు.
జనులు వచ్చేలోగా కాస్త నిద్రపట్టితే బాగుండును. ఈ వేంకటగిరిపై వెంటనే యోగనిద్ర చాలించి
లోకాన్నంతా కరుణించాలని ఆయనకెప్పుడూ ఆరాటమే.” అక్కడ సేవ చేస్తున్న శ్రీదేవి, భూదేవిలను
చూస్తూ ”ఓ సతులారా! సకలలోకారాధ్యుడైన ఈ అపూర్వమైన
ఔన్నత్యంకలవాడు శ్రీవేంకటేశ్వరుడమ్మా! ఈ స్వామి సుఖంగా నిద్రించుటకు వింజామరలు కాస్తగట్టిగా
వీయండమ్మా! అని వేడుకొంటూన్నారు. అంతరార్థము: దయ, జాలి, ప్రేమ, కరుణలతో కూడిన స్వామి యోగనిద్రను తృటిలో విడిచి లోకులను రక్షించబోతారు. అందరూ
దర్శించలేని ఆయన, వెంకటగిరి పవిత్ర పర్వతాలపై అవతరించారు. అంతర్యామిగా మారి, అందరికీ ఆరాధ్యుడయ్యారు. ఆ
శ్రేష్ఠమైన స్థితిని కూడా మించిపోయి, సత్యాన్ని ఆస్వాదించిన
మునులు, పురాణపురుషులైన యోగివరులు, ఆయన
ముందు రాజచామరాలను ఊపారు — సేవ అవసరంలేని వాడికి, ఆనందభరితమైన
సేవలో.
అధ్యాత్మ కీర్తన |
రేకు:
88-6 సంపుటము: 5-343 |
నిద్దిరించీఁ బాలజలనిధి వలెనే
ఒద్దిక శ్రీరమణునికి నొత్తరే పాదములు॥పల్లవి॥ వేఁగుదాఁక జిత్తగించి విద్దెలెల్లనాదరించి
బాగుగాఁ గృపారసము పంచి పంచి
యేగతిఁ బవళించెనో యెట్ల భోగించెనో
యోగీంద్రవరదుని నూఁచరే వుయ్యాలను ॥నిద్ది॥ వాలుగన్నుల రెప్పల వడదాఁకి తను తావి
చాలుకొన నూర్పుకలు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరపుచు నొకయింత
కాలము కన్నుల దిప్పీఁ గప్పరే దోమతెర ॥నిద్ది॥ సరగున యోగనిద్ర చాలించి లోకమెల్ల
కరుణించఁ దలఁచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుఁడాయె మించి
విరివి నాలవట్టాలు విసరరే సతులు ॥నిద్ది॥
|
Details and explanation:
భావము: (అన్నమాచార్యులు వారు పాలసముద్రమును
చేరుకొని వ్రాసిన కీర్తన) ఓ తల్లులారా! (శ్రీదేవి, భూదేవి లను
ఉద్దేశించి) ప్రశాంతంగా నిశ్చలంగా వున్న పాలసముద్రములాగనే మీరు కూడా ఈ శ్రీరమణునకు
అణుకువతో పాదములను వొత్తండమ్మా!
అంతరార్థము: (అన్నమాచార్యులు వారు పాలసముద్రమును
చేరుకొని వ్రాసిన కీర్తన) యోగనిద్రలో ప్రకాశించే ప్రభువుకు పాలసముద్రం నిశ్చలంగావుండి విశ్రాంతి కల్పించినట్లే, మానవులారా,
మీరు కూడా ఆ శ్రీరమణుని పాదాలకు మిమ్మల్ని మీరు నిశ్శబ్దంగా సమర్పణచేసుకొని
ఆలాంటి స్థితిని మనసారా ఒప్పుకొని నిలబడగలరా?
వివరణ:
మొదటి భాగము: అన్నమాచార్యులు వారు వాడిన పదములకు వివరణ.
“నిద్దిరించీ బాలజలనిధి వలెనే” — ఇది ఒక చర్య కాదు. ఇది ఒక సహజ స్వభావ స్థితి. ప్రయత్నం చేయడం కాదు, ప్రకటించడం కాదు. మన దగ్గర వున్న సమస్తమును నిశ్శబ్దంగా సమర్పించడమే. సత్యము సముద్రం వలే ఎంత శోధించినాను అంతుబట్టనిదే. సత్యము తనంతటతాను మనకు బయటపడవలెను గాని, ప్రయత్నముచేత సాధించలేనిదే.
సముద్రము ఏమీ చేయదు — అది తానై ఉంటుంది. అదే దాని శక్తి. దాని నిశ్శబ్దతలోనే దైవ స్వరూపం అలల్లా ఓడాడును. ఇది సిద్ధాంతము కాదు, — జీవితమే ఓ నిశ్శబ్ద నివేదనగా మారిన దశ.
ఇక్కడ 'బాలజలనిధి' అంటే పురాణములలో పేర్కొన్న పాలసముద్రమే కాదు — అది మనలో నిద్రాణమై వున్న ప్రాచీనమైన జ్ఞానాన్ని సూచిస్తోంది. పరమశాంత స్థితి. శ్రీమహావిష్ణువుకు విశ్రాంతినిచ్చు ప్రదేశమే కానీ ఆ స్థితి నుండే సర్వ కార్యములు ఉబికి వస్తున్నాయి. అది నిస్సహాయ స్థితి కాదు — ఇది అనేక సాధ్యాసాధ్యాలకు రూపమిచ్చు సీమలు లేని శక్తికి మూలము.
ఆ సముద్రంలా ఉండటం అంటే — స్వచ్ఛమైన మనసుతో పసిపిల్లవానివలె వుండడమే. ఏదీ నిరాకరించకుండా, దేనికోసమూ వెంపర్లాడకుండా — సమర్పించుకుంటూనే ఉండడం. ఇలాంటి స్థితిలో “శరణాగతి చేయాలి” అనే ఆలోచన ఉండదు. మనమే శరణాగతి అవుతాం.
ఇక్కడ ఎటువంటి గుర్తింపుకు ప్రాముఖ్యత లేదు, 'నేను అన్నమాచార్యుడిని' అన్న భావన కూడా లేదు. పరబ్రహ్మ ప్రవాహంలో తానుగా కలిసిపోవడమే పరమ నివేదన. అదే పరిపూర్ణ సమర్పణ.
"ఒద్దిక శ్రీరమణునికి" — ఇక్కడ "ఒద్దిక" అన్న మాటలో ఒక శాంతమైన, సరళమైన సమర్పణభావం దాగి ఉంది. చప్పుడూ లేదు, ప్రేమ ఎలాగైతే చెప్పకుండా హృదయంలో నిండిపోయి ఉంటుందో, ఎటువంటి ఆత్మఘోష లేకుండా, తానై భగవంతుని కరుణలో లయమవడం.
"నొత్తరే పాదములు" — ఇక్కడ దేవుడి హృదయానికి కాదు — కాళ్లకు, భూమిని తాకే భాగానికి, అత్యంత నమ్రతకు చిహ్నంగా ఉన్న పాదాలకు సేవ చేయమని పిలుపు. ఇది స్వీకారానికి ఆకాంక్ష కాదు — పరమాత్మలో లయమయ్యే సంకేతం.
పాదసేవ అంటే సంకల్పమును విడిచిపెట్టడం, గుర్తింపును వదలడం, అహంకారాన్ని పక్కనపెట్టడం. ప్రేమకు చెలిమికి స్వేచ్ఛ ఇవ్వడం.
రెండవ భాగము:
అన్నమాచార్యుల
కీర్తనకి మాగ్రిట్ వేసిన "Meditation" (లేదా "ధ్యాన సమాధి")
చిత్రంతో అనుబంధమును పరిశీలిద్దాము.
ఇది లాలిపాటలా అనిపించినా, నిజానికి కాదు. కొంచెం లోతుగా చూస్తే, ఇది దేవుణ్ణి నిద్రపుచ్చడం గురించీ కాదు — ఈ సత్యం ఎలా నిశ్శబ్దంగా కదులుతుందో, జీవులకు ఊపిరిలా, పాటకు తాళంలా — అన్నమాచార్యులు ఎంతో సున్నితంగా చెబుతున్నారు.
చిత్రంలోని ఆ గంభీరమైన నీలి సముద్రం — మృదువుగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అదే అన్నమాచార్యుల కీర్తనలో చెప్పిన పాల సముద్రంలా. బయటకు పెద్దగా ఏమీ అనిపించదు, కానీ లోపల ఎంత శక్తివంతమో!
ఆ జీవులు తాము ఎవరో అన్న భావనను సున్నితంగా వదిలేసినట్టు కనిపిస్తాయి. అది హింస వల్ల కాదు —‘నేను’ని విడిచిపెట్టి, బాహ్య ప్రపంచపు గుర్తింపులనూ పక్కన పెట్టినవారు. ఇప్పుడు అక్కడ వాటి తలల స్థానంలో వెలుగు ప్రజ్వరిల్లుతోంది. అదే అన్నమాచార్యుల భావన: "ఒద్దిక శ్రీరమణునికి నొత్తరే పాదములు" — పేరు నిలుపుకోవడం కాదు, తాను ఎవరినీ అన్న భావనను వదిలేసి, దేవుని కాళ్ల దగ్గర శాంతంగా నిలబడటం.
రెండవ చరణంలో
అన్నమాచార్యులు చెప్పినట్టు, ఈ సృష్టి ఎలా కదులుతుందో చూడండి
— కనులు తెరచి మూయటలో ఉన్న అంతరమే కాలానికి పరిమాణంగా కనిపించేట్టు. సృష్టి
నిడివితో పోలిస్తే మానవుని జీవితం లెక్కలకైనా లెక్కకాని స్థితిలో ఉంటుంది.
మరికొందరైతే అటువంటి అసంబద్ధాల్ని గమనించకుండానే జీవిస్తారు.
మాగ్రిట్ చిత్రంలోని
సముద్రం కూడా అట్లానే — మసక చీకటిలో దాగి ఉంది. కనిపించే దానికన్నా దాచుకున్నదే
ఎక్కువ. ఆ జీవులు మృదువుగా ముందుకి, ఆ జలనిధిలోకి వెళ్తున్నాయి.
ఒక్కో ఇసుక రేణువును తాకుతూ, దాటి, తమ
చుట్టూ ఉన్న చీకటిలో కాస్త వెలుగుని పరచుతూ. పంచుతూ. అన్నమాచార్యుల వంటి జ్ఞానులు అంతే.
వారు ఒక్కసారిగా ఏదీ చెప్పరు. వారి జీవితం మౌనముగా, మృదువుగా,
వెలుగుగా మారిపోతుంది మన వంటి సామాన్యులకు.
ఈ ఇద్దరూ — అన్నమాచార్యులు, మాగ్రిట్ — మనకు చెబుతున్న సందేశం ఇదే: సత్యం గొంతెత్తి అరవదు. అది మౌనంగా చెబుతుంది. నెమ్మదిగా, ఊపిరిలా, గుండె చప్పుడులా ప్రయాణిస్తుంది. అది జ్ఞానంతో కాదు, గర్వంతో అయితే అసలే కాదు. అది తలవంచిన మనసులో వెలుగుతుంది. మనలో ‘నేను’ అనే భావన నెమ్మదిగా కరిగిపోయినప్పుడు — లోపల వెలిగే దీపంలా కనిపిస్తుంది.
అందుకే, ఒకవైపు అన్నమాచార్యుల కీర్తనను చదివి, మరోవైపు మాగ్రిట్ చిత్రాన్ని చూస్తే — మనం రెండు విడివిడి ప్రపంచాల్లో లేము అనిపిస్తుంది. ఇద్దరూ ఒకే మాట చెబుతున్నారు — ఒకే సముద్రం గురించి, ఒకే నిశ్శబ్దం గురించి, మన లోపల దీపం ఎలా వెలిగించాలో చెబుతున్నారు. "నీకు నీవే దారివి కమ్మని."
మొదటి చరణం
టీకా: వేఁగుదాఁక = తెల్లవారేదాకా; జిత్తగించి = జీవుల మొరలు ఆలకించి; విద్దెలెల్లనాదరించి = ఈ భూలోక విద్యలను వదలి; బాగుగాఁ = చక్కగా; గృపారసము = కృపారసము; పంచి పంచి= పంచుతూ (అలసిపోయిన స్వామి); యేగతిఁ = ఏ రకముగా; బవళించెనో = పరుండెనో; యెట్ల భోగించెనో = ఏమైనా తిన్నాడో లేదో; యోగీంద్రవరదుని = ఆ యోగీంద్రవరదునికి; నూఁచరే వుయ్యాలను = ఊచరే వుయ్యాలను.
అర్థము: తెల్లవారేదాకా ఈయన నిద్రపోడు. ఒకపక్క జీవుల మొరలను ఆలకిస్తూనే మాబోటివారి అవిద్యలను సరిజేస్తుంటాడు. అమితదయాళువై కృపారసమును పంచిపంచీ తన అలసటను గమనించడు. పాపం ఎట్లా పడుకొన్నాడో చూడండమ్మా! ఈ యోగీంద్రవరదుడు ఎట్లు భోగించేనోకాని ఆయన వుయ్యాల నెమ్మదిగా వూపండమ్మా! అప్పుడుగాని ఆయన నిద్రించడు.
అంతరార్థము: కోరికలతో ఎదురు చూస్తున్న మనసులతో, ఆలోచనల బరువుతో నిలిచిన మాపై మృదువుగా, సహనంతో, ఆపకుండా తన కృపారసాన్ని వర్షించెను.
అది ఏమిటో అర్థం చేసుకోవడానికే మేము ప్రయత్నించకముందే —మా ఆలోచనలన్నిటిని
ఆయన శాంతింపజేశాడు, మా అవిద్యలన్నింటినీ కరిగించి ఊరట
ఇచ్చాడు. అతడు ఎలా మా హృదయంలోకి ప్రవేశించాడో
ఎవరికి తెలుసు? ఆ అనుభూతిని విడమర్చి చెప్పగలవారెవరు? అమ్మలారా! ఆ యోగీంద్ర వరదునికి ఉయ్యాల నెమ్మదిగా వూపండమ్మా!
వివరణము:
ఒకటో భాగం: పుణ్యాత్ముల లోకం
బాగుగాఁ గృపారసము పంచి పంచి: ఇక్కడ అన్నమాచార్యులు తన మనస్సును శాంతింపజేసి, భూలోక విద్యలన్నిటిని అధిగమించి, మమకారములు కలగని కృపకు పాత్రులయ్యారు. ఇక్కడ వ్యక్తిగత కృషికి స్థానం లేదు — కృషి కరిగిపోయినపుడు వచ్చిన పరిణామమే ఇది. ఇది సాధన ఫలితంలా అనిపించదు; అన్వేషకుడు ఇంకా తడబడుతుండగానే సంభవించిన స్థితి.
ఒద్దిక యోగీంద్రవరదుని నొత్తరే పాదములు ఇక్కడ మనకు తారసపడేది ఒక అపూర్వమైన నమ్రత. తాను ఏం అనుభవించాడో చెప్పరు, ఎలా ఆ స్థితికి చేరుకున్నాడో వివరించరు. ఎందుకంటే ఆ స్థితిలో భాషకీ, అర్థాన్వేషణకీ క్రమం ఉండదు. ఆయన చేసిందల్లా — “యోగీంద్రవరదుని” పాదాల వైపు చూడడం మాత్రమే. ఎవరినైనా కరుణించే ఆ పరమాత్ముని శరణమే ఆయన్ని ఉన్నత స్థితికి చేర్చింది. ఆది ఒక్కటే ఆశ్రయం. అదే శరణాగతి. అదిగాక మానవుడు చేయగల కార్యములు ఇలలో లేవు.
మనం ఇంతకు ముందు అనేకసార్లు చెప్పుకున్నట్టే, “సత్యం భావాలకీ, భాషలకీ అందని పరిమళం.” అన్నమాచార్యులు దాన్ని పట్టి చెప్పరు. దానిలో కరిగిపోతారు. మనకో దిశ చూపిస్తారు — తామే ఆ దిశలో అంతర్లీనమవుతారు.
రెండవ భాగం: అంతర్లీన అర్థానికి ఆధారములు
"వేఁగుదాఁక జిత్తగించి" — ఈ వాక్యం ఆత్మకధనంలా, కానీ మనుష్యుడి పుట్టుకకు ముందో, లేక అతడు మనస్సును అధిగమించిన అనంతరమో సూచించే పదబంధం. “వేఁగుదాఁక” అనే పదానికి తాత్కాలికంగా "వెలుగునకు ముందే" అనే అర్థం ఇచ్చినా, ఇది అంతకంటే లోతుగా, ఒక నిరాకార స్థితిని, కోరికలు లేని మౌన స్థితిని సూచించేలా ఉంది. ఇది బైబిల్లోని పాల్ చెప్పిన "ఈ తాత్కాలిక గుడారములోనున్న మేము భారము మోసికొని మూల్గు చున్నాము" అన్న భావనకు దగ్గరగా ఉంటుంది. శరీరం అనే గుడారంలో ఉన్న ఆత్మ — శాశ్వత నివాసాన్ని కోరుకుంటూ ఉన్న తాత్విక దృక్పథం ఇది.
పైన చెప్పిన దాన్నిబట్టి అన్నమాచార్యులూ ఇలా అన్నారేమో! — "వారు ఆ గుడారాన్ని మరణంతో కాదు, శరణాగతితో వదిలిపెట్టారు. శరీరం, మనస్సు, అహం అన్నీ విడిచి వారు మరో లోకమున ప్రవేశించారు. అది సాధన వల్ల వచ్చినది కాదు — శరణాగతితో లభించినది.
వేఁగుదాఁక =వెల్లడింపు ముందే" అన్నది అనేది కేవలం కాలచట్రములోనిది కాదు. ఇది మనస్సు, గర్వం, ప్రయత్నం అనునవి అడుగంటిపోతే — ఒక నిశ్శబ్ద ఆహ్వానం వస్తుంది. అదే సత్యం. పాల్ చెప్పినట్టు “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము” అన్న భావనను ఇక్కడ కూడా మనం గ్రహించవచ్చు. అన్నమాచార్యుల చూపు — మనస్సుకు అందని దానిపై ఉంది. "మనస్సుతో పట్టుకోలేని సత్యం" అని తెలియవలెను.
"విద్ధెలెల్లనాదరించి" — అంటే, సంపాదించిన విద్య, చదువుకున్న జ్ఞానం అన్నింటినీ పక్కన పెట్టి ముందుకెళ్లడం. ఇది మహాభారతంలో ధర్మరాజు స్వర్గంలోకి ప్రవేశించినప్పుడు అతనిలో ఇంకా మిగిలి ఉన్న స్మృతులు అతడిని స్వర్గంలో వున్నా నరకలోకంలో వున్న తమ్ముళ్ళ దగ్గరకు లాక్కొని వెళ్లిన అనుభూతిని గుర్తుకు తెచ్చుకోండి. ఈ భూప్రపంచం, అక్కడి గుర్తులు, ఆవేశాలు — ఇవన్నీ కూడా ఆత్మశుద్ధికి అడ్డురావచ్చు. అన్నమాచార్యులు మాత్రం వాటిని పూర్తిగా పక్కన పెట్టారు. — ఎందుకంటే వారికి దక్కినది అనుభవసిద్ధమైన మౌనం.
అందుకే
“వేఁగుదాఁక జిత్తగించి, విద్దెలెల్లనాదరించి” అనే రెండు వాక్యాలు — మానవుడు సాధించవలసిన మార్గాన్ని కాదు, అత్యవసరంగా వదలవలసిన బుద్ధి భేధములను సూచిస్తాయి.
మూడవ భాగం: వ్యాఖ్యానం
ఈ చరణంలో అన్నమాచార్యులు సత్యంతో సమ్మిళితమై విస్మయాన్ని ప్రకటిస్తున్నారు. అది కళ్ళారా చూసిన ఒక అజ్ఞేయమైన, అవర్ణనీయం అయిన దైవసంపర్కం. మనుషుల చేతులలోని బుద్ధి, విద్య, కృషి — ఇవన్నీ అందుకోలేని స్థితిని ఆయన సూచిస్తున్నారు.
కోరికల కదలికలకు ముందు, మనస్సు వాటిని "నాది"అని కర్తృత్వము ప్రకటించే ముందు — ఏదో స్వచ్ఛమైన, నిశ్శబ్దమైన, కొలవలేని దైవత్వం అక్కడ అన్నమాచార్యుల వారి అంరతంగములో ఏమూలనో దాక్కొని ఉన్నది. అది నిరాకారమైన కరుణగా పరవశించి, ఎలాంటి ప్రతిబంధన లేకుండా వారి హృదయములోకి ప్రవహించింది. అది రూపంలోకి మారినప్పటికీ అన్వేషణకు అందని రహస్యంగానే మిగిలిపోయింది.
“అర్థానికి అతీతమైన ఆ అనుభూతి నాలో ఎలా అలవించుకుంది?" అని అన్నమాచార్యులు ఆశ్చర్యపోతారు. “వారు ఆ దివ్యసంబంధాన్ని నియంత్రించాలనుకోరు. అది ఎలా ప్రవేశించిందో చెప్పలేరు. కానీ వుయ్యాల వూపుతూ నిలబడతారు”. అప్పుడు ఆ “ఉయ్యాల” అన్నమాచార్యుల అంతరంగపు స్థితికీ, మనందరికీ చూపే దిశకూ మధ్యొక పారుతున్న సంగీతంలా మారుతుంది.
రెండవ చరణం
Meaning of the lines: వాలుగన్నుల రెప్పల వడదాఁకి తను తావి = ఈ ప్రపంచము భరించ గలిగినంత మాత్రమే వేడిని ప్రసరింప చేస్తూ; చాలుకొన నూర్పుకలు చల్లి చల్లి = ఒక శ్రేణిలో వరుసగా ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను కలుగ జేస్తూ; నీలవర్ణపుగుణము నెరపుచు = ఆ నల్లని చీకటి గుణమును చల్లుతూ; కాలము నొకయింత కన్నుల దిప్పీఁ = కాలమును మానవుల కనులు తెరచి మూసి యుండు మధ్య కాలమున కలిగింప జేసి; గప్పరే దోమతెర = మా కనుల ముందే తెరలు కప్పుతావు.
భావము: అన్నమాచార్యులవారు శ్రీదేవి భూదేవిలతో ఇలా నివేదించుకుంటున్నారు
“వాలు కన్నులరెప్పలు అరమోడ్చి లోకాలకు వడ తాకకుండా పరిమళాలు జల్లుతూ ఎడతెగకుండా జీవులకు
ఉచ్ఛ్వాసనిశ్వాసములు కలిగించుతూ; నీలవర్ణపుగుణమును అంతటా వ్యాపింప చేయుచూ; కొద్దిపాటి కాలమును ఆ జీవుల కన్నుల ముందు త్రిప్పి ఆపై దోమతెర కప్పే ఆస్వామికి - "కొంచెంసేపు ఆ కళ్ళమీద వెలుతురు పడకుండా
దోమతెరకప్పి కళ్ళు తిప్పకుండా జాగ్రత్త పడ్డారంటే నెమ్మదిగా నిద్రపడుతుందమ్మా!"
అంతరార్థము: "ఆయన తన
అంతరంగపు తాపాన్ని లోకాలమీద పడకుండా నియంత్రిస్తూ, జగత్తుకు సుగంధాలను
పంచుతాడు. నిరంతర ప్రవాహంలా ఊపిరి తీసి విడిచే ధాటిలో, ప్రతి
జీవిలో ప్రాణశక్తిని నింపుతున్నాడు. అయినా తనని తాను విశాలమైన నీలినీడల వెనుక దాచుకొని
— జీవులు కేవలం తృటి కాలాన్ని అనుభవించగలిగేలా వారి కనులు తెరుస్తూ మూస్తూ వుంటాడు.
పరమసాధ్వీమణులారా! దయచేసి నెమ్మదిగా ఆయన కన్నులపై దోమతెరను పడనివ్వండి. కాంతి కనపడకుంటే,
ఆయన నిశ్చలమైన నిద్రలో విశ్రాంతి పొందగలుగుతాడు."
వివరణము:
ఇది అన్నమాచార్యుల కవిత్వానికి అంతర్లీనంగా కలిపే భక్తి, తాత్వికత, కవిత్వం, విజ్ఞానం అన్నీ కలబోసిన వ్యాఖ్యానం.
ఒకటవ భాగం: విశ్వాన్ని నియంత్రించేవాడు
“వాలుగన్నుల రెప్పల వడదాఁకి తను తావి” ఇది పఠించేంత వరకూ కవిత్వం; వినిపించేంత వరకూ సంగీతం; కానీ మౌనంతో గ్రహించామంటే — ఆ పదాలు ఊపిరి పీల్చుతున్నట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రెండవ చరణంలో అన్నమాచార్యుల అనుభవంలో అంతరంగ శాంతి వెల్లివిరుస్తుంది. కళ్ళకుకొట్టొచ్చినట్లు తెలుస్తుంది.
భగవద్గీత 11.19లో అర్జునుడు ఇలా అంటాడు: స్వతేజసా విశ్వమిదం తపంతమ్ భావము: సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజ పరుచుతున్నటువంటి నిన్ను, నేను దర్శిస్తున్నాను.
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ యొక్క ఈ ప్రకటననూ పరిగణించండి. “నాస్తికత్వం అర్ధమేలేనిది. నేను సౌర కుటుంబాన్ని చూసినప్పుడు, సూర్యుడి నుండి సరైన దూరంలో భూమిని కూర్చిన వ్యవస్థను, తగిన మొత్తంలో వేడిని మరియు కాంతిని పొందడానికి ఏర్పాటును చూస్తాను. ఇది అనుకోకుండానో ప్రమాదవశత్తునో జరగలేదు.”
అన్నమాచార్యులు కూడా ఇదే సత్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆయన దైవాన్ని పొగడటం లేదు — లోకం ఎలా సాగుతోంది, ఎలా స్థిరంగా ఉంది అనే అద్భుతాన్ని తెలుపుతున్నారు — మౌనంలో, పరిపాటిగా, తెలియలేని నియమాలలో.
రెండవ భాగం: కాలమను భ్రమ యొక్క మూలాలు
“కాలము కన్నుల దిప్పీ” కవిత్వమా? అవును. కాని అది తాత్త్వికత, మానసిక విజ్ఞానం, గంభీరమైన మిస్టిసిజం కూడా. కాలం అనేది మనిషి అనుభవించే దృష్టి. కాని దేవునికి అది రెప్పపాటు. మన కళ్ల ముందే అంతటి బ్రహ్మాండమైన దృశ్యం కలగలిపినట్లుగా అన్నమాచార్యులు చెప్పారు.
భగవద్గీత 2.28లో కృష్ణుడు ఇలా అంటాడు: “అవ్యక్తాదీని భూతాని, వ్యక్తమధ్యాని భారత | అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా” భావం: అర్జునా! ప్రాణులన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు (అవ్యక్తములు). మరణానంతరం కూడా అవ్యక్తములే. ఈ జనన మరణాల మధ్య మాత్రమే అవి ప్రకటితములు (ఇంద్రియ గోచరములు) అగుచున్నవి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.
మన మానసిక కాలానుభవం కూడా ఈ జనన–మరణముల మధ్యే ఉంటుంది. అయినప్పటికీ మనిషి — అదే రకంగా ప్రకృతి నుంచి పుట్టిన మనిషి తను ఎక్కడ నుండి వచ్చాడో, దేహము జీర్ణించిన తర్వాత ఎక్కడికి పోవునో తెలియలేడు. లక్షలాది సంవత్సరాల జీవ పరిణామ క్రియలలో పుట్టిన మనిషి తన పూర్తి అస్తిత్వమును ఒక ఆపిల్ పండు చేతిలో ఉంచుకొని చూసినట్టుగా, తన పిడికిలిలో పెట్టుకోవాలని చూస్తాడు. ఆ పిడికిలి, ఆ ఆపిల్ పండు, ఆ ఇసుక, ఆ వ్యక్తికూడా అస్తిత్వం లేనివారే. తాత్కాలిక మైనవే. లేనిదాని కోసం వెతకడమే అజ్ఞానం.
మూడవ భాగం:
"గప్పరే దోమతెర" ఇది ఏంటి? సాధారణమైన ఇంటి వస్తువు, కానీ అన్నమాచార్యుడి చేతిలో ఇది బ్రహ్మాండపు సంకేతంగా మారుతుంది. ఆయన కనిపించడు, గర్జించడు. కావల్సింది మొత్తం చూపించడు.సత్యం యొక్క బ్రహ్మాండమైన వేడిలో తేజస్సులో మనిషి కాలిపోకుండా, రహస్యాన్ని చల్లగా దాచుతాడు. ఇది కవిత్వం కాదు, ఇది సంరక్షణ.
అన్నమాచార్యుల వారిది స్వతంత్రముగా
నడిచిన దారి — ఋషులు, తత్వవేత్తలు, కవులు, మిస్టిక్స్ అందరి భావాలు పలుకుతుంటాయ్. కానీ ఆయన పదాలు ఎక్కడ నుంచీ అప్పు తీసుకోలేదు.
ఆభరణాలు పెట్టక పొయినా బంగారమే. ఇది మీరు గమనించినట్లు బైబిల్లోని పాల్కి ఉన్న దృష్టితో
అనునాదం. సత్యం ఒక్కటే. దాన్ని తాకినవాళ్లందరూ సప్త సముద్రాల దూరంలో ఉన్నా,
ఒకే స్వరం పలుకుతారు.
అన్నమయ్య ఈ చరణంలో సృష్టి-స్థితి-లయ అనే త్రికాల భేదాన్ని ఒక్క ఊపిరితో చూపించి, దాని వెనుక కనిపించని తత్త్వాన్ని మనకు చూపిస్తారు. ఈ పదాలను మామూలుగా చదివితే ఎంత సాదాగా, ఆహ్లాదంగా ఉంటాయో — కానీ లోపల గంభీరమైన యోగదృష్టిని నిక్షిప్తం చెసుకున్న నివురు గప్పిన నిప్పు కణికల్లాంటివే.
మూడవ చరణం:
Meaning of the lines: సరగున యోగనిద్ర చాలించి = క్షణంలో యోగనిద్ర చాలించి; లోకమెల్ల కరుణించఁ దలఁచి = లోకముపై అవ్యాజమైన ప్రేమతో వేంకటగిరిపై = వేంకటగిరిపై; అరుదుగ = అరుదుగ; సకలలోకారాధ్యుఁడాయె = సకలలోకారాధ్యుఁడాయె; మించి = అధిగమించి; విరివి = విరివిగా; నాలవట్టాలు = వింజామరలు; విసరరే = విసరరే; సతులు (సతులు) = శ్రీదేవి భూదేవిలు; (ఇక్కడ ఆ అపూర్వ స్థితికి చేరిన ధన్యులు)
భావము: అన్నమాచార్యుల వారు ఆదుర్దా
పడుతున్నారు. తనలో ఇలా అనుకొంటున్నారు “ఇంకాసేపట్లో మళ్లీ సుప్రభాతం అంటూ తగులుకొంటారు.
జనులు వచ్చేలోగా కాస్త నిద్రపట్టితే బాగుండును. ఈ వేంకటగిరిపై వెంటనే యోగనిద్ర చాలించి
లోకాన్నంతా కరుణించాలని ఆయనకెప్పుడూ ఆరాటమే.” అక్కడ సేవ చేస్తున్న శ్రీదేవి,
భూదేవిలను చూస్తూ ”ఓ సతులారా!
సకలలోకారాధ్యుడైన ఈ అపూర్వమైన ఔన్నత్యంకలవాడు శ్రీవేంకటేశ్వరుడమ్మా! ఈ స్వామి సుఖంగా
నిద్రించుటకు వింజామరలు కాస్తగట్టిగా వీయండమ్మా! అని వేడుకొంటూన్నారు.
అంతరార్థము: దయ, జాలి, ప్రేమ, కరుణలతో కూడిన స్వామి యోగనిద్రను తృటిలో విడిచి లోకులను రక్షించబోతారు. అందరూ దర్శించలేని ఆయన, వెంకటగిరి పవిత్ర పర్వతాలపై అవతరించారు. అంతర్యామిగా మారి, అందరికీ ఆరాధ్యుడయ్యారు. ఆ శ్రేష్ఠమైన స్థితిని కూడా మించిపోయి, సత్యాన్ని ఆస్వాదించిన మునులు, పురాణపురుషులైన యోగివరులు, ఆయన ముందు రాజచామరాలను ఊపారు — సేవ అవసరంలేని వాడికి, ఆనందభరితమైన సేవలో.
స్పూర్తి మరియు అన్వయ భావన:
సరగున యోగనిద్ర
చాలించి -ఇది క్రమంగా కలల నుంచి లేచే మేల్కొలుపు కాదు. ఇది అనుగ్రహపు ఆకస్మిక
స్పందన -నిశ్శబ్ద సముద్రం ఒక్కసారిగా కదలడం లాంటిది ఆశాంతితో కాదు, ఆలోచనతో
కాదు, దైవ సంకల్పంతో. (జీవుల ఆక్రందన ఒక్కసారి ఆయన చెవిన పడినప్పుడు
గజేంద్రుని రక్షించినట్లు రక్షించడా?)
లోకమెల్ల కరుణించఁ దలఁచి -ఇది కారణంతో కూడిన దయ కాదు. ఇది ప్రతిస్పందన కాదు. ఇది సత్యము స్వయంగా దయగా మారిన శ్వాస. పిలిచినందుకు వచ్చినది కాదు, ఇచ్చే తపనతో అవతరించినది.
వేంకటగిరిపై - ఇక్కడ సత్యం
భూమిని ఎంచుకుంది. శైలమాలికలలోనికి దిగి, స్వయంగా ఆ పర్వతాలను పుణ్యక్షేత్రంగా మలిచింది.
అరుదుగ సకలలోకారాధ్యుఁడాయె
మించి -సాధారణంగా కనిపించనిది, ఇప్పుడు మానవ నేత్రాలకు సులభముగా
దొరుకునది. ఇది వెంకటేశ్వరుని అవతార రహస్యము.
విరివి నాలవట్టాలు
విసరరే సతులు -ఆత్మాతీత స్థితికి చేరిన వారు, సేవ అవసరమే లేని ఆ దేవదేవునికి
సేవ అందించుటలో తృప్తిని పొందుతున్నారు. ఇక్కడ
సేవ వ్యక్తిత్వానికి కాదు —శుద్ధ సత్త్వానికి.
-X-X- సమాప్తం -X-X-