Sunday, 20 July 2025

T-243 నీకే సెలవని నెపమువేయుట యింతే

 తాళ్లపాక పెదతిరుమలాచార్యులు

243 నీకే సెలవని నెపమువేయుట యింతే

For English version press here

ఉపోద్ఘాతము

ఇది తాళ్లపాక పెదతిరుమలాచార్యుల కీర్తన—
లోతైన మాటలలో, మృదువైన వ్యంగ్యంలో
మాయల మనసును  అద్దంలో చూపుతుంది.
 
“దైవం కోసమే”
ఉపవాసలు, తపస్సులు, యాత్రలు, సన్యాసం…అని
చెప్పుకుంటాం గానీ—
దాంతో ఆయనకు ఏం లాభం?
ఆయన మహిమ
పెరగదు, తగ్గదు.
 
కవి అడుగుతారు—
ఉపవాసం ఆయనకు ఆనందం తెస్తుందా?
సన్యాసం ఆయనను మార్చుతుందా?
తీర్థస్నానం ఆయన శుభ్ర పరుస్తుందా?
అడవిలో కఠిన తపస్సు ఆయన మనస్సు మారుస్తుందా?
“ఆయనను కనుగొనడానికి” అనే అహంకారం—
ఇవన్ని మనుషుల ఏర్పాట్లు, అంచనాలు మాత్రమే,
లాభం వుంటే మనకే, ఆయనకు కాదు.
 
అయినప్పటికీ కూడా—
మనలను కాపాడేది
ఆయన కృపే!
 
ఈ కీర్తన​ కూడా
నకిలీ భక్తిని అద్దంలో చూపిస్తూ,
నిజమైన సమర్పణం ప్రదర్శనలకు అతీతం అని చెబుతుంది.

 

అధ్యాత్మ​​  కీర్తన

రేకు: 63-6 సంపుటము: 15-363

నీకే సెలవని నెపమువేయుట యింతే
కైకొని కాచే నీ వుపకారమే దక్కినది  ॥పల్లవి॥
 
వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా లుండేనంటే
అట్టె నీకు లాభము అం దేమున్నది
జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి నయ్యే నంటే
చుట్టుకొని నీకు గల్గే సుఖమం దేమున్నది ॥నీకే॥
 
కడు నీ పాదతీర్థపు గంగలో నానే నంటే
అడరిన తనివి నీ కందేమున్నది
అడవిలో ఘోరతప మంది నీకుఁ జేసే నంటే
అడియాలమైన ఫల మందు నీ కేమున్నది ॥నీకే॥
 
నిన్నుఁ గనుఁగొన్నదాఁకానే గడ్డము వెంచే నంటే
అన్నిటా నీకుఁ గూడేది అందేమున్నది
వున్నతి శ్రీవేంకటేశ వూరకే నీ వాఁడ నైతి
యెన్న నీకుఁ గాక యిఁక నం దేమున్నది ॥నీకే॥

 

Details and Explanations:

పల్లవి:

నీకే సెలవని నెపమువేయుట యింతే
కైకొని కాచే నీ వుపకారమే దక్కినది        ॥పల్లవి॥ 

పదబంధం

అర్థం

నీకే సెలవని

నీకోసమే ఇదంతాయని

నెపమువేయుట యింతే

అనే మిషయే కానీ

కైకొని కాచే నీ వుపకారమే దక్కినది

(దేవా)  నీయంతట నువ్వు చేసే ఉపకారమే మాకు నిలిచి వుండేది

 

 


 

ప్రత్యక్ష భావము:

ఇదంతా నీకోసమే” అని చెప్పుకునేది మేమే.
కానీ నిలిచి వుండేది మాత్రం
(దేవా)  నీవంతట నువ్వు చేసే ఉపకారమే.


వ్యాఖ్యానం:

దీన్ని మాగ్రిట్ గారి ద్రాక్ష పంట చేతికొచ్చే కాలం”
అనే ప్రతీకాత్మక చిత్రంతో అర్థం చేసుకుందాం.


 


ఒక గదిలో కిటికీ ఉంది.
గది అంతా గబ్బు చీకటిలో మగ్గుతోంది;
వెలుతురు మాత్రం ఆ కిటికీ ద్వారానే వస్తోంది.

కిటికీ ఆవల చూస్తే—
బౌలర్ టోపీలు పెట్టుకున్న,
ఒకేలా కనిపించే మనుషులు వరుసగా నిలబడి ఉన్నారు.
జాగ్రత్తగా గమనిస్తే,
కిటికీ దాటి కూడా వారు అలాగే పునరావృతమవుతూనే ఉంటారు.

 

వారు పంట చేతికొచ్చింది కదా,
ఇప్పుడు మా వేతనం ఇవ్వండి!”
అని అడుగుతున్న కూలీలలాగా కనిపిస్తారు.

మనమూ అలాగే—
గుడి ముందర నిలబడి, పుణ్యానికి ప్రతిఫలం కోరుతాం.
జీవితమంతా లావాదేవీలకు అలవాటు పడి,
మోక్షాన్నికూడా అదే దృక్పథంలో కొలుస్తాం.


మాగ్రిట్‌ అధివాస్తవికత మనకు చెబుతుంది—
కిటికీ అనేది కేవలం బయటి ప్రపంచానికి ముడిపెట్టు స్మృతి, జ్ఞాపకం.
కానీ చైతన్యం మాత్రం గదినంతా కలుపుకుంటుంది—
వెలుతురున్న కిటికీని,
స్పృహ లేని చీకటి మూలలనూ.

కనబడుతున్నవి, కనబడనివి

మరియు చూస్తున్న వాడిని

అన్నీ కలిపి తానే యను బోధయే చైతన్యం.


పాక్షిక జ్ఞానం అజ్ఞానమే.
అజ్ఞానం నుంచి పుట్టిన చర్యలు
మరిన్ని అజ్ఞానానికే దారి తీస్తాయి.
అందుకే అవి ఫలితాలకే కట్టుబడి ఉంటాయి.
 

మన అరకొర ప్రయత్నాలు
మనల్ని మనమే తిరిగి ఎదుర్కోవడమే తప్ప,
ఎప్పటికీ సమగ్రము కావు.
అవి వృత్తాకార చలనాలు—
మోక్షానికి దారి చూపని అయోగ్య ప్రయత్నాలు.


పెదతిరుమలాచార్యులు చివరగా చెబుతున్నారు—
మనిషి చేతిలో ఏమీ లేదు;
దైవకృప కోసం వేచి ఉండడమే
మనకున్న ఏకైక అవకాశం.” 

ఈ లోకంలో జన్మించడమే
దుర్లభమైన భగవదనుగ్రహము;
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమనే
సందేశమే ఈ కీర్తన.


మొదటి చరణం: 

వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా లుండేనంటే
అట్టె నీకు లాభము అం దేమున్నది
జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి నయ్యే నంటే
చుట్టుకొని నీకు గల్గే సుఖమం దేమున్నది ॥నీకే॥ 

పదబంధం

అర్ధము

వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా లుండేనంటే

ఏమీ తినకుండా నీ కోసమే ఉపవాసాలుంటే

అట్టె నీకు లాభము అం దేమున్నది

అలా అయితే అందులో నేకు లాభమేమున్నది? (లేదు)

జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి నయ్యే నంటే

సమ్మతిగా నీ కోసము సన్యాసి నయ్యే నంటే

చుట్టుకొని నీకు గల్గే సుఖమం దేమున్నది

అది చుట్టుకోవడం వల్ల నీకు ఏమైన సుఖము కలుగుతుందా? (లేదు)


 

ప్రత్యక్ష భావము

ఏమీ తినకుండా నీ కోసమే ఉపవాసాలుంటే
అలా అయితే అందులో నేకు లాభమేమున్నది? (లేదు)
సమ్మతిగా నీ కోసము సన్యాసి నయ్యే నంటే
అది చుట్టుకోవడం వల్ల నీకు ఏమైన సుఖము కలుగుతుందా? (లేదు)

వ్యాఖ్యానం:

పెదతిరుమలాచార్యుల మనసు స్పష్టం—
దేవుని పేరుతో” అని చేసే పనులన్నీ
మన సంప్రదాయం, మన నమ్మకాలే.
 

ఆచారాన్ని తిట్టరు,
కానీ మృదువుగా మాత్రమే ప్రశ్నిస్తారు—
వీటితో దేవుడికి లాభమేంటి?”
 

అయినా నేటికీ
ఇవే ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి,
ఎదో పొందుతామని భక్తులు నమ్ముతూనే ఉన్నారు.


రెండవ​ చరణం:

కడు నీ పాదతీర్థపు గంగలో నానే నంటే
అడరిన తనివి నీ కందేమున్నది
అడవిలో ఘోరతప మంది నీకుఁ జేసే నంటే
అడియాలమైన ఫల మందు నీ కేమున్నది ॥నీకే॥
 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

కడు నీ పాదతీర్థపు గంగలో నానే నంటే

అదేపనిగా నీ పాదతీర్థపు గంగలో మునిగి వుంటానంటే

అడరిన తనివి నీ కందేమున్నది

అందులో నీకు తృప్తి కలిగించే దేమున్నది? (లేదు)

అడవిలో ఘోరతప మంది నీకుఁ జేసే నంటే

అడవిలో వెళ్ళి ఘోర తపము చేసేనంటే

అడియాలమైన ఫల మందు నీ కేమున్నది

గురుతుపట్టగల ఫలము అందులో నీ కేమున్నది (లేదు)


 

ప్రత్యక్ష భావము

ప్రభూ!
నీ పవిత్ర పాదతీర్థం కలిసిన గంగలో
నేను మునిగినా—
దాంతో నీకు ఏం తృప్తి కలుగుతుంది? (ఏమీ లేదు!)

 

అడవిలోకి వెళ్లి
ఏళ్ల తరబడి ఘోర తపస్సు చేసినా—
దాంతో నీకు ఏ ఉపయోగం వుంటుంది? (ఏమీ లేదు!)

వ్యాఖ్యానం:

తాళ్లపాక కవులు
అన్నమాచార్యులు, పెద తిరుమలాచార్యులు
ఇచ్చిపుచ్చుకొను లావాదేవీల వంటి
భక్తిని తీవ్రంగా విమర్శించారు.

బుద్ధుని జీవితం కూడా అదే సత్యం చెబుతుంది
ఆరు సంవత్సరాల కఠిన తపస్సు,
జీవం నిలబెట్టిన పిడికెడు బియ్యం,
అజ్ఞానాన్ని దహించాలనే కఠోర నిరాకరణలు…
అయినా "లోలోపల ఏమీ మారలేదు"
అన్న భావం పెల్లుబికింది.
 
అప్పుడే ఆయన 'అతి'ని వదిలాడు,
మధ్యమ మార్గం కనుగొన్నాడు,
ఎందుకంటే సత్యం వికసించేది
బలవంతంతో కాదు,
నిశ్శబ్ద సమతతో. 

మహాభారతంలో  శాంతి పర్వములో
ఒకసారి ధర్మరాజు
"ఏ తీర్థం, ఏ పవిత్ర నదిలో
స్నానము శ్రేష్ఠమై పుణ్యాన్ని" ఇస్తుందని
భీష్ముని అడిగాడు.
 
అప్పుడు భీష్ముడు సమాధానమిచ్చాడు—
తీర్థాలు, నదులు యాత్రలూ
మనసు పవిత్రతకంటే గొప్పవికావు.
లోభం, ద్వేషం, మోహం లేని
శుద్ధమైన మనసే నిజమైన పవిత్ర నది.
 
అందుకే అత్యున్నత తీర్థయాత్ర
బయటకాదు, లోలోపల జరిగేది—
తన స్వంత చైతన్యంలో
పవిత్ర జలస్నానం చేయడమే.

టావో తె చింగ్ – లావో జు
ప్రయత్నం ఆపితేనే మార్గం కనిపిస్తుంది.”
కఠిన తపస్సు కూడా
అహంకారానికి మరో రూపమే.
టావో (సత్యం) సహజంగానే ప్రవహిస్తుంది—
ప్రయత్నాలకు, లావాదేవీలకు అతీతంగా.


మూడవ​ ​ చరణం:

 

నిన్నుఁ గనుఁగొన్నదాఁకానే గడ్డము వెంచే నంటే
అన్నిటా నీకుఁ గూడేది అందేమున్నది
వున్నతి శ్రీవేంకటేశ వూరకే నీ వాఁడ నైతి
యెన్న నీకుఁ గాక యిఁక నం దేమున్నది ॥నీకే॥ 

Telugu Phrase

Meaning

నిన్నుఁ గనుఁగొన్నదాఁకానే గడ్డము వెంచే నంటే

నిన్ను కనుఁగొన్నదాకా నేను గడ్డము పెంచే నంటే

అన్నిటా నీకుఁ గూడేది అందేమున్నది

ఇలాంటి మా తీర్మానములతో నీకు ఒనగూడేదేమైనా వుందా? (లేదు)

వున్నతి శ్రీవేంకటేశ వూరకే నీ వాఁడ నైతి

ఎంతో ఎత్తున వెలసిన శ్రీవేంకటేశ, ఏ విధమైన కోరికలు లేకుండా నీ వాడనని అనుకున్నానో లేదో నీ వాడినైపోయాను

యెన్న నీకుఁ గాక యిఁక నం దేమున్నది

ఇలలో మనుషులకు ఎంచుకోవడనికి నీవు గాక మరేమున్నది

 

 ప్రత్యక్ష భావము:: 

దేవా!
నిన్ను కనుగొనేదాకా
గడ్డం పెంచుతానని భీష్మించుతాను.
ఇలాటి తీర్మానాలతో—
నీకేటి లాభం, ప్రభూ? (ఏమీ లేదు.)
 
అందనంత ఎత్తున వెలసిన వెంకటేశా!
ఏ కోరికలు కోరకుండానే
నీ వాడనని ఊరకే వుంటిని
నీ వాడనైపోయాను.
 
ఈ లోకంలో
మానవులు ఎంచుకునేందుకు
నీవు గాక మరేమున్నది?

వ్యాఖ్యానం:

పెద తిరుమలాచార్యుల దృష్టిలో,
“నిన్ను కనుగొనేదాకా గడ్డం పెంచుతా” అనే ప్రతిజ్ఞలు,
పెద్ద పెద్ద ప్రమాణాలు— ఇవన్నీ
మనసు నాటకరంగంలోని ముసుగులు మాత్రమే.
అవి ప్రభువు చేకొనడు.
 
అయితే భగవంతుని దగ్గర ఏది పనిచేస్తుంది?
నిష్కాపట్యం, నిర్మలమైన హృదయం, మూగ సమర్పణ.
ఇవి తప్ప ఇంకేమీ అవసరం లేదని
ఆచార్యులు సూటిగా చెబుతున్నారు.
 
చివరగా ‘ఎంపిక’ గురించి కూడా చెప్పారు—
ఎంపిక చేయునది నిశ్చయములేని మనసు.
అయితే సందిగ్ధం లేని చోట
విష్ణునికన్నా వేరే మార్గం, వేరే మాటలుంటాయా?

కీర్తన సారాంశం

ఉపవాసములు, యాత్రలు, సన్యాసము—
ఆయన పేరుతో చేస్తాము,
కానీ ఆయన మహిమ పెరగదు, తగ్గదు కూడా.
తీర్థస్నానమో, అడవిలో తపస్సో, కఠోర నియమమో—
ఇవన్నీ మన లోకపు వ్యవహారాలు, ఆయనకు అంటవు.
నిన్ను కనుగొనే వరకు…” అన్న ప్రతిజ్ఞలు వ్యర్థం;
ఏ కోరికలు కోరకుండానే ఆయనవాడినైపోవడమే సత్యం.

దైవకృప కోసం వేచి ఉండడమే మనకున్న ఏకైక శరణ్యం


X-X-The END-X-X


 


4 comments:

  1. జ్ఞానం సాధనలో రెండే దశలు...

    1. సంపూర్ణ అజ్ఞానము
    2. సంపూర్ణ జ్ఞానము
    పాక్షికజ్ఞానము అనేది ఏదీలేదు. అది అజ్ఞానమే...🙏

    ReplyDelete
  2. Well said. Even Ekadashi upavAsam is a practice of the ritualistic society and has no spiritual significance for those who believe He is both the means to reach Him and goal to be reached. The concept of nirhetuka kripa which is well presented in Annamaayyas' and his immediate suvcessors' poetry is well explained by you.

    ReplyDelete
  3. ఊరకే నీ వాడనైతి, ఎన్న నీకు గాక - నీకు తప్ప మరి ఎవరికి నన్ను ఎంచుకుని రక్షించే సామర్థ్యం ఉంది అని అర్థం తీసుకోవచ్చు. అప్పుడు, నా సుకృతం అంటూ ఏమీ లేకుండానే, ఊరకే నీ వాడిని అయ్యాను.

    ReplyDelete
  4. ఉపవాసములు, వ్రతములు, గంగాస్నానం, ముక్కు మూసికొని తపస్సు చేయటం, శిరోముండనము చేసికొని సన్యసించటం వలన ఫలితం లేదంటున్నారు పెద తిరుమలాచార్యుల వారు.నీ దర్శనమగునంత వరకు దీక్ష చేస్తానంటే ఒనగూడు ప్రయోజనమేమీ లేదని, వీటన్నిటి వలన పరమాత్మ సంతృప్తి చెందడని పెద తిరుమలాచార్యులంటున్నారు గహనమైన ఈ కీర్తనలో.

    తలలు బోడులైన తలపులు బోడులా అన్న వేమన గారి పద్యం గుర్తునకు వచ్చినది.

    మహాభారతంలోని శాంతిపర్వంలో ధర్మజుడిచ్చిన సందేశమునుటంకించి ఈ కీర్తనకు శ్రీనివాస్ గారు సులభగ్రాహ్యము చేసినారు.

    రినే మాగ్రిట్టి గారి చిత్రంలో అన్నట్లు అంతరంగమందున్న పరమాత్మను వదలి, ఫలాపేక్ష కోసం దేవుణ్ణి పూజించటం వంటిది. సందర్భోచితంగా నున్నది.

    ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణమోహన్

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...