Thursday, 23 October 2025

T-275 ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము

 తాళ్లపాక అన్నమాచార్యులు

275 ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము 

For English version press here 

ఉపోద్ఘాతము 

ఈ కీర్తనలో అన్నమాచార్యులు ఒక నిత్యసత్యాన్ని ప్రకటిస్తున్నారు — ఈ జగత్తును నడిపించేది ఒక్క దైవతత్వమే. కానీ ఆ ఒక్కటిని తెలుసుకొనే బదులు, మనుషులు తమ హృదయాలలో తామే నిర్మించుకున్న రూపాలను పూజిస్తూ, ఊహనే సత్యంగా భావిస్తున్నారు. ఇలా ఈ భూమి విభిన్న విశ్వాసాలతో కలకలముల సంతగా మారింది — ప్రతీ వాణి తనకు దైవం తెలుసు అనుకుంటుంది. ప్రతీ వాదన ఈ శబ్దపు హోరును మరింత పెంచుతుంది. 

ఇది కేవలం ఒక కీర్తన కాదు —మనలో, మన చుట్టూ ఉన్న ఏకత్వాన్ని మేల్కొలిపే పిలుపు. బయటికి విభిన్నంగా కనిపించే ఈ ప్రపంచం, వాస్తవానికి ఆ అనాది దైవము యొక్క విస్తారమైన పరిమాణమే. 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 258-3 సంపుటము: 3-333
ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము
యెక్కువ నాతని నెరఁగవో మనసా     ॥పల్లవి॥
 
వొట్టిన జీవుల కొక బ్రహ్మ గలఁడు
పట్టిన విప్రులు బ్రహ్మలమందురు
నట్టనడుమవారే నవబ్రహ్మలు
జట్టిగ బ్రహ్మల సంతాయ జగము        ॥ఒక్కఁ॥
 
కైలాసంబునఁ గలఁ డొక రుద్రుఁడు
తాలిమి నేకాదశరుద్రులు మరి
కాలరుద్రుఁడును కడపట నదివో
చాలిన రుద్రుల సంతాయ జగము      ॥ఒక్కఁ॥
 
అవతారంబున నలరిన విష్ణువు
అవలవిష్ణుమయమనియెడి విష్ణువు
భువి శ్రీవేంకటమున నున్నాఁ డిదె
జవళి వరంబుల సంతాయ జగము     ॥ఒక్కఁ॥

Details and Explanations:

పల్లవి
ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము
యెక్కువ నాతని నెరఁగవో మనసా ॥పల్లవి॥ 
               Telugu Phrase
Meaning
ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము
There is but one who is God of this world
యెక్కువ నాతని నెరఁగవో మనసా
O mind, strive to know Him — that alone is enough.
 

 

సూటి భావము:

ఈ భూమికి ఒకడే దేవుడు. ఓ మనసా! ఆ ఒక్కడినే తెలుసుకో — అదే చాలు, అదే మోక్షానికి మార్గము.


గూఢార్థవివరణము: 

ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము” — అన్నమాచార్యుడు ఈ వాక్యంలో విశ్వసత్యాన్ని సూటిగా పలుకుతున్నారు. భగవంతుడు అనేక రూపాలలో కనబడతాడు; కాని సత్యమొకటే. భూమి మీద నానా మతములు, నానా పంథాలు, నానా రూపాలు ఉన్నా, ఆ సర్వరూపముల మూలం ఒకటే పరమతత్త్వము. 

మనుషులు “మా దేవుడే నిజం, మీది కాదు” అని వాదిస్తూ, పేర్లలో, రూపాలలో తలమునకలైపోతున్నారు. కాని జ్ఞాని ఈ వ్యత్యాసమును దాటుతాడు. అన్నమాచార్యుడు కూడా ఇక్కడ అదే ఆహ్వానం చేస్తున్నారు — “ఆ ఒక్కడే నిజమైన దైవము” అని. 

యెక్కువ నాతని నెరఁగవో మనసా” — ఇక్కడ ఆయన దృష్టి అంతర్ముఖమవుతుంది. “ఓ మనసా! ఆ ఒక్కడిని తెలుసుకో.” కానీ ఆ తెలుసుకోవడం అనేది జ్ఞానపఠనం కాదు; అనుభవం. ఆయనను తెలుసుకోవడం అంటే ఆత్మస్వరూపాన్ని దర్శించడం. తర్కం, వాదం, ఆచారం — ఇవి మనల్ని ఆ దైవసత్యానికి దగ్గర చేయవు. నిశ్శబ్దములో, సద్భావములో, అనురక్తిలో మాత్రమే ఆయన స్ఫురిస్తాడు. అందుకే అన్నమాచార్యుడి పిలుపు బాహ్యమతపరమైనది కాదు; అంతర్ముఖమయినది. ఆయన చెబుతున్నది — దేవుడు ఒకడే అని వాదించకుము, ఆ ఒక్కడినే తెలుసుకో మనసా. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ఆవహించి ఉన్నాడు.


మొదటి చరణం:
వొట్టిన జీవుల కొక బ్రహ్మ గలఁడు
పట్టిన విప్రులు బ్రహ్మలమందురు
నట్టనడుమవారే నవబ్రహ్మలు
జట్టిగ బ్రహ్మల సంతాయ జగము ॥ఒక్కఁ॥ 
Telugu Phrase
Meaning
వొట్టిన జీవుల కొక బ్రహ్మ గలఁడు
జ్ఞానులకు ఒక సృష్టికర్త కలడు
పట్టిన విప్రులు బ్రహ్మలమందురు
అతనికి పుట్టిన వారూ (మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, అత్రి, భృగువు) తామూ  బ్రహ్మలమందురు
నట్టనడుమవారే నవబ్రహ్మలు
ఈ రకముగా నవబ్రహ్మలు అయ్యారు.
జట్టిగ బ్రహ్మల సంతాయ జగము
వారివారి సంతానములు, అలా అలా  ప్రపంచమంతా బ్రహ్మలతో నిండిపోయింది. ప్రతీవారు మేమే అసలు బ్రహ్మలమని చెప్పుకొనుటచేత​ ప్రపంచంలో తికమక హెచ్చయ్యింది

భావము: 

ఈ ప్రపంచమునకు ఒక సృష్టికర్త కలడు. కానీ అతనికి పుట్టిన వారూ తామూ  బ్రహ్మలమందురు.  ఈ రకముగా నవబ్రహ్మలు అయ్యారు. వారివారి సంతానములు, అలా అలా  ప్రపంచమంతా బ్రహ్మలతో నిండిపోయింది. ప్రతీవారు మేమే అసలు బ్రహ్మలమని చెప్పుకొనుటచేత​ ప్రపంచంలో తికమక హెచ్చయ్యింది


గూఢార్థవివరణము: 

ఇక్కడ అన్నమాచార్యులు అత్యంత సున్నితమైన తాత్త్విక విషయాన్ని స్పృశిస్తున్నారు. ఆయన ఎవరి విశ్వాసాన్నీ తిరస్కరించడం లేదు — కాని ఒక లోతైన సూచన చేస్తున్నారు: సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయన పుట్టించిన వారు కూడా తామే సృష్టికర్తలమని భావించి, ప్రపంచమంతా సృష్టికర్తలతో నిండిపోయినట్టయింది.” 

ఇది మానవ అహంభావానికి ఒక సున్నితమైన బింబం. దైవమునుండి పుట్టినవారు తామే దైవమని భావించే భ్రమలో పడిపోయారు. అన్నమాచార్యుడు చెప్పదలచుకున్నది — దైవాన్ని అనుసరించే ప్రయత్నంలో మనుషులు దైవస్థానాన్నే స్వీకరించడానికి ప్రయత్నిస్తారు; కానీ నిజమైన జ్ఞానము, ఒక్కటైన మూలసత్యాన్ని తెలుసుకోవడంలోనే ఉంది. 

అందుకే ఆయన పల్లవిలో హెచ్చరించారు:
ఓ మనసా! ఆ ఒక్కడినే తెలుసుకో.”
సృష్టి విభిన్న రూపాలలో విస్తరించినా,
దాని మూలం ఒకటే తత్త్వం.
దానిని విడిచి, రూపాలలో తలమునకలైతే,
మనకి మనము “బ్రహ్మల సంతానముగా” కనిపించి,
ఆ నిజమైన బ్రహ్మను మరచిపోతాము.

రెండవ​ చరణం:
కైలాసంబునఁ గలఁ డొక రుద్రుఁడు
తాలిమి నేకాదశరుద్రులు మరి
కాలరుద్రుఁడును కడపట నదివో
చాలిన రుద్రుల సంతాయ జగము ॥ఒక్కఁ॥ 
Telugu Phrase
Meaning
కైలాసంబునఁ గలఁ డొక రుద్రుఁడు
కైలాసమున కలడొక రుద్రుఁడు
తాలిమి నేకాదశరుద్రులు మరి
గమనించిన వారే ఏకాదశరుద్రులు (విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్నిరుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు) అయ్యారు.
కాలరుద్రుఁడును కడపట నదివో
కాలరుద్రుఁడును కడపట వున్నాడదిగో
చాలిన రుద్రుల సంతాయ జగము
లెక్కలేనంత మంది రుద్రులతో ఈ జగము నిండిపోయింది

టి భావము:

కైలాసమున కలడొక రుద్రుఁడు. గమనించిన వారే ఏకాదశరుద్రులు అయ్యారు. కాలరుద్రుఁడును కడపట వున్నాడదిగో. లెక్కలేనంత మంది రుద్రులతో ఈ జగము నిండిపోయింది.


గూఢార్థవివరణము: 

ఇక్కడ అన్నమాచార్యులు ఒక గాఢమైన అర్థభేదమును ఆవిష్కరించారు — భక్తి ఎలా విభజనకు లోనవుతుందో చూపించారు. మార్పు (లయ) స్వరూపుడైన ఆ ఒక్కడే రుద్రుడు, మనుషుల మనస్సుల్లో అనేక “రుద్రులుగా” విస్తరించాడు. భక్తి భేదముగా మారింది, ఆరాధన వాదముగా పరిణమించింది. 

అన్ని జీవులను ఏకం చేసే ఆ దైవతత్వమే భావాలూ, గుర్తింపులూ అనే అనేక దిక్కులలో విడిపోయింది. అసలు వీగిపోయింది. దైవాన్వేషణలో మనుషులు, తాము అన్వేషిస్తున్న ఆ ఒక్కడినే మరిచిపోయారు. 

(ఈ భావపరంపరను మరింతగా గ్రహించడానికి, మూడవ చరణంపై వివరణ చూడండి.)


మూడవ​ ​ చరణం:
అవతారంబున నలరిన విష్ణువు
అవలవిష్ణుమయమనియెడి విష్ణువు
భువి శ్రీవేంకటమున నున్నాఁ డిదె
జవళి వరంబుల సంతాయ జగము          ॥ఒక్కఁ॥ 
తెలుగు పదబంధం
భావము
అవతారంబున నలరిన విష్ణువు
విష్ణువు అనేక అవతారములలో విష్ణువు ఈ భూమిను అలరించాడు
అవలవిష్ణుమయమనియెడి విష్ణువు
ఆవల అనగా అపైనదంతా విష్ణుమయమని విష్ణుభక్తులంటారు
భువి శ్రీవేంకటమున నున్నాఁ డిదె
ఈ భువిపై శ్రీవేంకటమున వున్నాడా నిజమైన దైవము
జవళి వరంబుల సంతాయ జగము
(జవళి = రెండు/ద్వంద్వము - ఒకటి చైతన్యము ఇంకొకటి ప్రకృతి.)  చైతన్యము  ప్రకృతిల గందరగోళములో ఈ ప్రపంచము ఒక సంతగా (బజారులా) మారినది.

సూటి భావము:

అవ్యక్త మూర్తి అనేక అవతారములలో విష్ణువు రూపంలో ఈ భూమిను అలరించాడు. ఆవల అనగా అపైన, కనబడునదంతా విష్ణుమయమని విష్ణుభక్తులంటారు.  ఈ భువిపై శ్రీవేంకటమున వున్నాడా నిజమైన దైవము - అవ్యక్త మూర్తి. ద్వంద్వముల చిక్కులలో పడి,  చైతన్యము ప్రకృతిల మధ్య గందరగోళములో ఈ ప్రపంచము ఒక సంతగా (బజారులా) మారినది.

 


గూఢార్థవివరణము: 

అన్నమాచార్యులు ఇక్కడ బహుదేవతా భావమును ఖండించడం లేదు; మనిషి దృష్టిలోని గందరగోళాన్ని బహిర్గతం చేస్తున్నారు. 

ప్రపంచం “అనేక దేవుళ్లు” అంటుంది —ఒకే సత్యం — చైతన్యమును, ప్రకృతిని ద్వంద్వముగా చూసిన మన దృష్టి వల్ల అనేక రూపాలుగా ప్రతిబింబమవుతున్నది. 

అందుకే — “జవళి వరంబుల సంతాయ జగము” — ఈ లోకం వాస్తవమును మరచుటతో, దివ్యమైనదీ, భౌతికమైనదీ కలసిపోయిన మాయాబజారు హోరుగా మారిపోయింది. 

నిజమైన దైవము — ఆ గందరగోళం తాకనిచోట - నిలిచిన నిశ్చల కేంద్రబిందువు. ద్వంద్వాలన్నింటినీ అధిగమించిన చైతన్యము. రూపరహితము. 

అన్నమాచార్యుని దృష్టిలో “సంతాయ జగము” — మూడు స్థాయిల గందరగోళం
దశ
చరణం
మూలకారణం
ఫలితం
1
జట్టిగ బ్రహ్మల సంతాయ జగము
ఆలోచనల ద్వారా దేవుని తెలుసుకోవాలనే ప్రయత్నం
మేధోపరమైన సృష్టి. బ్రాహ్మణత్వము గొప్ప లాంటి — తర్కములో తికమక
2
చాలిన రుద్రుల సంతాయ జగము
భావోద్వేగాల ఆధారంగా దేవునిని ఆరాధించడం
భావపరమైన అహంకారం మా దేవుడు గొప్ప​ లాంటి — పిడివాదముల గడబిడ
3
జవళి వరంబుల సంతాయ జగము
చైతన్యము (దివ్యత్వం) మరియు ప్రకృతి (భౌతికం)ను విడిగా చూడడం
దృక్పథ విభేదం — వాస్తవానికీ రూపానికీ మధ్య గందరగోళం
 

సారాంశము:

అన్నమాచార్యుల “సంతాయ జగముఅనే మాట అనేక దేవతలతో నిండిన ప్రపంచమని కాదు — విభజిత మనస్సులతో నిండిన ప్రపంచం అని సూచిస్తుంది.

  • ఆలోచన విభజించబడినప్పుడు — తత్వశాస్త్రం పుడుతుంది.
  • భావం విభజించబడినప్పుడు — మతం పుడుతుంది.
  • దృష్టి విభజించబడినప్పుడు — అల్లోలకల్లోలము వంటి భౌతిక జగత్తు పుడుతుంది. 

ఈ మూడు కలిసినచోటే —సంతాయ జగము”, అంటే — ఒకే శాశ్వత సత్యంపై గందరగోళపు బజారు ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రపంచం మనకు అలా కనబడుతుంది. ద్వంద్వాలను దాటుకొని చూచు వారికి దివ్యత్వం  కనబడుతుంది.


ఈ కీర్తన ముఖ్య సందేశం

అన్నమాచార్యుల బోధనం అతి ప్రాయోగికమైనది —
విభజించబడినట్లు కనబడుతున్న ప్రపంచములో
విభజించబడని దానిని తెలియుము.


X-X-The END-X-X

No comments:

Post a Comment

275 okkaṃ̐ ḍevvaṃ̐ḍō vurviki daivamu (ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము )

    TALLAPAKA ANNAMACHARYULU 275 ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము (okka ṃ̐ ḍ evva ṃ̐ḍō vurviki daivamu)   తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్...